9, మార్చి 2024, శనివారం

మత్తడి దునికిన కోపుల నీళ్లు

కష్టజీవి కన్నీటి చిరునామా.. "మత్తడి దునికిన కోపుల నీళ్లు" నవల.

సాహిత్య ప్రక్రియలలో కథలు, వ్యాసాలు మరియు నవలలకు ప్రత్యేక స్థానం ఉంది. వివరంగా చెప్పాలనుకున్న ప్రతి కూలంకషంగా నివేదన నవలల ద్వారానే సాధ్యమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

“పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం నీ తప్పు” అన్నఅబ్దుల్ కలాం మాట అక్షర సత్యం. సమస్యలను సాకుగా చూపుతూ విజయం సాధించలేకపోయామని వాపోయే చాలా మంది యువత మనకు నిజ జీవితంలో తారసపడుతుంటారు. మరి కొందరు మాత్రం తమ తల్లిదండ్రుల మాటలను ఆదర్శంగా తీసుకుని ఎన్ని ఆటంకాలు, అవమానాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. లక్ష్యం ముందు లక్ష సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నవారే లక్ష్యాన్ని సాధిస్తారనేది జగమెరిగిన సత్యం.

నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఎంతో మంది విద్యార్థులు తమకంటూ ఓ ఆశయం పెట్టుకుని సమాజంలో ఎదురైన అవమానాలను అవకాశాలుగా మలచుకొని ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. అయితే వారిలో కొందరు తమ లక్ష్యసాధనలో ఎదురైన ఆటుపోట్లను భావి తరాలకు లేదా ప్రస్తుత యువతకు ఎలాంటి సందేశాన్ని అందించలేకపోతున్నారు. కాగా మరి కొందరు తమ స్వీయానుభావాలను రచనలు, నవలల రూపంలో నేటి యువతకు స్ఫూర్తిగా అందిస్తున్నారు. రచయితలు ఇప్పటివరకు అనేక చిత్రాల నవలలు వెలువరించిన యువతను ఉత్తేజపరిచే అంశాలతో విడుదలైన నవలలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలోనే భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్) చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ "డాక్టర్ వెన్నం ఉపేందర్ (IPoS)" కలం నుండి జాలువారింది యువతకు స్ఫూర్తి దాయకమైన నవల "మత్తడి దునికిన కోపుల నీళ్లు".

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన వెన్నం ఉపేందర్ గారి స్వగ్రామం సూర్యాపేట జిల్లా, మద్దిరాల మండలం లోని మారుమూల పల్లె గుమ్మడవెల్లి. ఆయన జీవితంలో తినడానికి తిండి లేక పస్తులున్న సందర్భాలెన్నో. కాలే కడుపుకి కాసిన్ని నీళ్లు, సలిపించే గాయానికి కాసింత పశుమూత్ర పూత అన్నట్లుగా ఆయన ఆకలి ఆర్తనాదానికి కాసిన్ని నీళ్ళే ఊరట, పేదోడికి గాయాలైతే కన్నా పైసల కోసం తండ్లాడే నొప్పి ఎక్కువ. పైసలు లేక పశు మూత్రం తో గాయంపై రాసుకుని ఉపశమనం పొందిన జీవితం ఆయనది. అలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఆశయం కోసం ఆకలిని అదిమిపెట్టి, ఆశయమనే నిచ్చెన మెట్లు ఎక్కి తీరాలంటే అకుంఠిత దీక్షతో పుస్తకాల పురుగయిండు. పేద జీవితం గట్టెక్కాలంటే చదువే మార్గమని భావించాడు. ఉపేందర్ చూపు చదువుపైనా, ఆకలి అటకపైనా సాగిన ఆయన జీవన ప్రస్థానం ఇతివృత్తంగా అక్షరీకరించిన నవల ఈ "మత్తడి దునికిన కోపుల నీళ్లు".

సాధారణంగా కొన్ని నవలలో ఒక ప్రదర్శన రాస్తారు. కానీ వెన్నం ఉపేందర్ నవలలు భిన్నంగా ఉంటాయి. పాఠకులకు కృతజ్ఞతా భావాన్ని కలిగించేలా మరియు వారి హృదయాలను కదిలించేలా చాలా అంశాలు అద్భుతంగా వివరించబడ్డాయి. ఈ నవలలోని ఇతివృత్తాలు అక్షరీకరించబడిన జీవితం, అనాథల జీవనం - చితికిన పసితనం, హైస్కూల్ చదువులు - ఆమ్లపు చినుకుల స్పర్శలు, సినిమా చూడామా - అయ్యో శని మామ, మా ఊరు మా ఇల్లు - ఎప్పటికి ఒడవని ముచ్చట. తెగి అతికిన ఇంటర్-కంట అలుగు పోసిన కన్నీరు, కలలతో ములకాతు, రంగులు వెలిసిపోయిన ఓ తాత కల, కుండ పలిగిన కల, చెదిరిన పెళ్లి పల్లకి కల, చచ్చి మర్లబతికిన కల, మా నాయన ఖలినపడ్డ కల, తెలిగిపోతున్న తల్లివేళ్ల కల, మా జీవితాలే అప్పు పడ్డయి,    

ఆయన వెలువరించిన "అక్షరీకరించబడిన జీవితం" ఇతివృత్తం ద్వారా గ్రామీణ యువతకు అమూల్యమైన సందేశాన్ని అందించారు. గ్రామీణ యువత ఎదగాలంటే, ఒదిగి చదువుకోవాలని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువును నిర్లక్ష్యం చేయొద్దని, "నీ వల్ల గాదన్న నిచ్చెన మెట్లు ఎక్కి తీరాలి. ఆకలి భౌతికం - ఆవేదన మానసికం" అని ఈ నవలలోని నేపథ్యం పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంకా అమ్మతనంలో ఉన్న కమ్మతనాన్ని ఒక కవిగా వర్ణించిన తీరు అత్యద్భుతం. అమ్మతనం ఆగి పోవద్దు - భార్య అని మనం అనుకుంటాం కానీ. భార్య అమ్మ రూపంలో అమ్మే భార్య (స్వప్న) అని పాఠకుల హృదయాలను కదిలించారు. 

"హైస్కూల్ చదువులు - ఆమ్లపు చినుకుల స్పర్శలు" ఇతివృత్తాన్ని పరిశీలించినప్పుడు ఆయన స్వగ్రామంలో 8వ తరగతి లేకపోవడంతో చదువుకోసం కాలినడకన రోజుకు 16 సంవత్సరాల పాటు ప్రయాణిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువును కొనసాగించే తీరు పాఠకుల హృదయాలను ద్రవింపజేస్తుంది. ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంటూ పాఠకులకు తన బాల్య స్మృతులను పరిచయం చేస్తూ అక్షరీకరించారు. ఆయనది చెప్పులు కొనలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని దుస్థితి. ఆయన నడక ప్రయాణంలో కాలికి కసితీరా గుచ్చుకున్న తుమ్మ ముండ్లు , అపుడప్పుడు బాటకు అడ్డంగా ఎదురయ్యే తాసుపాములు, రోజుకోసారి వచ్చిపోయే ఎర్రబస్సులను చూస్తూ సాగిన హైస్కూల్ సదువు ఆమ్లపు చినుకుల సుఖాన్ని తెలియజేసినట్లు పేర్కొన్నారు. పూట గడవని పరిస్థితి వారిది. 8వ తరగతిలో చేరిన కొన్ని నెలలకే హాస్టల్ సీట్ వచ్చినప్పటికీ గొడ్ల కొట్టంతో కూడిన హాస్టల్ లో సాయంకాలమైతే పక్కనే పశువుల మంద, హాస్టల్ చుట్టూ దోమలు స్వైరవిహారం చేస్తుండేవి. ప్రతిరోజు పచ్చిపులుసు, వంకాయ, గోంగూర కూరలు. సుఖమెరగని హాస్టల్ జీవితం. హాస్టల్ లో పురుగులు పడిన అన్నం తిని నెలకోసారి జ్వరం. హాస్టల్ కి నాయన తెచ్చిన పుస్తకాన్ని అతిమధురమైన జ్ఞాపకంగా గుర్తించుకోవడం గొప్ప విషయం. ఒకరోజు వాళ్ళ నాన్న రెండు కోరికలు కోరిండు. ఒక్కటి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూపిస్తూ "నువ్వు ఇలాంటి గాలిమోటార్లల్ల తిరగాలి అది నా కల. రెండోది నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే చూడాలని ఉంది. నాయనంటే ఏడాదికోమారు వికసించే జ్ఞాపకం. .

ఈ ప్రపంచంలో అమ్మ కష్టం ముందు ఏది సరితూగదు అంటే తన అమ్మ పడిన కష్టాన్ని "కలలతో ములాకాతు" లో ఎంతో వివరంగా కనుగొన్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు అందరిలాగే తన అమ్మ కూడా గునుగు పూలు, బంతి పూలతో బతుకమ్మ పేర్చడం చూసేది కానీ చెరువు దగ్గరకు బతుకమ్మ ఆడేందుకు వెళ్లడం ఎప్పుడూ చూడలేదు. పేర్చిన బతుకమ్మ ఇంటి పక్కన వారికి ఎవరికో ఇచ్చేది ఒక రోజు అమ్మను అడిగాడు "అమ్మ నువ్వు ఎందుకు బతుకమ్మ పట్టుకొని చెరువు దగ్గరకు రావు అని అడగగా అడగగా ఓ రోజు అమ్మ చెప్పిన సమాధానం "బోసి మెడ, కాళ్లకు మెట్టెలు లేవు యెట్లా రాను కొడుకా" అది విన్న కొడుకు కళ్ళలో మత్తడి దూకిన కోపుల నీళ్లు లాగా కళ్లలో నీళ్లు దునికినై.లోకమంతా సదువు బందు చేసి, నాలుగు రూపాయలు వచ్చే పని చేయమన్నప్పుడు అమ్మ ఒక్కతే నువ్వు చదువుకోవాలి బిడ్డ, నువ్వు సదివి సదివి పెద్ద కొలువులు జెయ్యాలి నీ కష్టాలు నేను చూసుకుంటా బిడ్డ అని అమ్మ చెప్పిన మాటలను అక్షరీకరించి పాఠకులను ఉద్వేగానికి గురి చేశారు.

కష్టపడని తనముంటే కష్టాలను నిందించకు!

కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు!

ఈ సృష్టిలో ప్రతి మనిషికి ఆటంకాలు ఎదురవడం సహజమే కానీ, ఆశయం దిశగా అడుగులు వేస్తూ, అడ్డంకులను అవకాశాలుగా మార్చుకున్నప్పుడే విజయం మీ వద్ధకు చేరుతుందనేది అక్షర సత్యం. చదవాలనే కోరిక బలంగా ఉంది, చదవడానికి డబ్బు లేని నిరుపేద యువతకు ఈ "మత్తడి దునికిన కోపుల నీళ్లు" ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందడంలో ఎలాంటి సందేహం లేదు. 

వెన్నం ఉపేందర్ రచనలు కర్రు పుట్టింది, నారుమడి, నివేదనగా కవిత్వం, నెమలిక బరువు, ఎండమావి, కొన్ని వెలుగు నీడలు, మహాత్మాగాంధీ మంచి మాటలు ప్రతి రచనలో కూడా పాఠకుడిని ఆకర్షించే నవరసాలు చొప్పించడం వెన్నం ఉపేందర్ రచన నైపుణ్యానికి కలికితురాయిగా నిలుస్తుంది. వాస్తవిక ఘటనలను కథావస్తువుగా ఎంచుకుని తనలోని భావాలను కథలోని పాత్రల ద్వారా పాఠకుల గుండెల్లో గుచ్చుకునేలా చెప్పిన తీరును అభినందించడానికి మాటలు సరిపోవు అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. నేటి యువతకు ఉపయోగపడే మరిన్ని నవలలు వెన్నం ఉపేందర్ కలం నుండి జాలువారాలని ఒక పాఠకుడిగా నా ప్రగాఢ ఆకాంక్ష.

వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475









 


1, మార్చి 2024, శుక్రవారం

పరిచయం:

పరిచయం: 

నా పేరు కోట దామోదర్. నేను తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, మద్దిరాల మండలం, గుమ్మడవెల్లి గ్రామంలో పుట్టి పెరిగాను. మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో “ఎల్మోట్ ఆల్టర్నేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్” లో డిజైన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. ఒకటి నుండి పదవ తరగతి వరకు నా విద్యాభ్యాసం గ్రామీణ ప్రాంతంలో జరిగినందున, నేను ప్రకృతి సౌందర్యం మరియు గ్రామీణ నేపధ్యంలోని సంప్రదాయాలు మరియు నిబంధనలకు ఆకర్షితుడనయ్యాను. పల్లె వాతావరణంలో పెరిగిన నేను పల్లె జీవితం ఎలా భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మొదటగా “మా ఊరి జ్ఞాపకాలు” అనే వ్యాసం రాసాను. అలా నా వ్యాసరచనగ ప్రస్థానం “మా ఊరి జ్ఞాపకాలు” నుంచి మొదలైంది. వ్యాస రచనతో పాటు “కాలిగ్రఫీ ఆర్ట్” నా అభిరుచులు. గత నాలుగేళ్ల నుంచి వివిధ పత్రికల్లో విభిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాస్తున్నాను. చాలా వ్యాసాలు రాయాలనే కుతూహలం ప్రత్యక్ష సమయాభావం వలన ఇప్పటివరకు దాదాపు 70 వ్యాసాల వరకు రాసాను. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన నాకు సహజంగానే చేతి వృత్తులతో పాటు ఆయా శ్రామికుల కష్టాలు, కడగండ్లపై కూడా అవగాహన ఉండటంతో ఇతివృత్తంగా నేను రాసిన వ్యాసాలకు పాఠకుల నుండి మంచి స్పందన వచ్చింది. గతంలో చేతివృత్తులు సమాజానికి ఎలా ఉపయోగపడ్డాయి మరియు ఆధునీకరణ నేపథ్యంలోనేడు అవి ఎలా కనుమరుగవుతున్నాయి అనే అంశాలను నా వ్యాసాల్లో ప్రస్తావించాను. భుక్తి కోసం జీవనోపాధి తప్పని సరి అయినా నా మదిలోని భావాలను అక్షరీకరించి సమాజ హితం కోసం ఎంతో కొంత చేయాలన్నది నా తపన. ఆ తపనకు కార్యాచరణ నా రచనావ్యాసంగం. నా ఈ ప్రయత్నంలో ఎవరికి ఉపయోగపడినా నా కృషి ఫలించినట్లే.


కోట దామోదర్ 

మొబైల్: 9391480475 

ఈమెయిల్: kota.damodar @gmail.com 

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...