13, సెప్టెంబర్ 2026, ఆదివారం

సంపద కన్నా… సంస్కారం గొప్పది.

 సంపద కన్నా… సంస్కారం గొప్పది.


మనిషి జీవితంలో కొన్ని వృత్తులు కేవలం జీవనోపాధి కోసం చేసేవి కావు. అవి ఇతరుల జీవితాలపై బాధ్యతను మోసేవి. అలాంటి అత్యంత బాధ్యతాయుతమైన వృత్తుల్లో డ్రైవర్ వృత్తి ఒకటి.

కోట్ల రూపాయలు వెచ్చించి విలాసవంతమైన కారును కొనుగోలు చేయవచ్చు. ఆ కారులో అత్యాధునిక సౌకర్యాలు, అత్యంత ఖరీదైన భద్రతా ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ ఆ స్టీరింగ్‌ను పట్టుకున్న వ్యక్తి ఒక్క క్షణం నిర్లక్ష్యం కారణంగా ప్రాణాపాయం సంభవిస్తే, ఆ కోట్ల విలువ చేసే కారు కంటే మనిషి ప్రాణమే గొప్పదని అర్థమవుతుంది. అందుకే ఒక విధంగా చెప్పాలంటే మన ప్రాణాలు దేవుడి చేతిలో ఉన్నాయో లేదో మనకు తెలియదు కానీ, ప్రయాణిస్తున్న ఆ క్షణాల్లో మాత్రం అవి డ్రైవర్ చేతుల్లో కచ్చితంగా ఉంటాయి.

అయినా సమాజంలో కొందరు డ్రైవర్‌ను కేవలం ‘ఉద్యోగి’గానే చూస్తారు. మరికొందరు వారి వృత్తిని చులకనగా భావిస్తారు. వారి చేతుల్లో తమ ప్రాణాలను పెట్టి ప్రయాణిస్తూ కూడా వారికి ఏ మాత్రం విలువ ఇవ్వరు. కానీ డ్రైవర్ అంటే కేవలం కారు నడిపే వ్యక్తి మాత్రమే కాదు. మనల్ని గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చే బాధ్యతను తన భుజాలపై మోసే మనిషి. మన కుటుంబ సభ్యులను, మన పిల్లలను, మన పెద్దలను తన బాధ్యతగా భావించి రోడ్డుపై అప్రమత్తంగా కాపాడే వ్యక్తి.

అందుకే ప్రతి డ్రైవర్‌ను గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి చేతిలో కేవలం స్టీరింగ్ ఉండదు… కొన్నిసార్లు ఒక కుటుంబం యొక్క ఆశలు, ఆనందం, భవిష్యత్తు, ప్రాణాలు కూడా ఉంటాయి.

అయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అలా ఆలోచించరు. కొందరు మాత్రం తమ వద్ద పనిచేసే వారిని డ్రైవర్ గా కాకుండా కుటుంబ సభ్యులుగా చూస్తారు. వారి శ్రమను గౌరవిస్తారు. కొన్నిసార్లు వారి కష్టాలను తీరుస్తారు. అలాంటి మనసున్న వ్యక్తుల కథలు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తాయి.

అలాంటి అరుదైన వ్యక్తిత్వానికి నిలువెత్తు ఉదాహరణే పూణే నగరంలోని ప్రఖ్యాత పారిశ్రామికవేత్త "జవేరి పూణావాలా" తన డ్రైవర్ పట్ల చూపించిన ఆప్యాయత, గౌరవం, మానవత్వంతో కూడిన ఈ కథ.

కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ద్వారా సుపరిచితుడైన అధర్ పూణావాలా సోదరుడు జవేరి పూణావాలా. సంపదకు, హోదాకు కొదవలేని కుటుంబంలో పుట్టిన ఆయనకు ఎందరో ఉద్యోగులు ఉండవచ్చు. కానీ వారిలో ఒకరితో ఆయనకు ఏర్పడిన అనుబంధం మాత్రం ఉద్యోగి–యజమాని సంబంధాన్ని మించింది.

జవేరి పూణావాలా వద్ద లిమోసిన్ డ్రైవర్‌గా గంగాదత్తా అనే వ్యక్తి ఏకంగా ముప్పై సంవత్సరాల పాటు సేవలందించారు. మూడు దశాబ్దాల పాటు ఒక కుటుంబంతో కలిసి ప్రయాణించడం అంటే కేవలం ఒక ఉద్యోగం చేయడం కాదు. ఆ కుటుంబంలోని ఎన్నో సంతోషాలను, బాధలను, విజయాలను, కష్టాలను దగ్గరుండి చూడడం. గంగాదత్తా కూడా జవేరి కుటుంబంలో ఒక ఆత్మీయుడిగా మారిపోయారు.

అయితే ఒకరోజు ఊహించని విషాదం చోటుచేసుకుంది. జవేరి పూణావాలా అత్యంత ముఖ్యమైన మీటింగ్ పనిమీద ముంబైలో ఉన్న సమయంలో గంగాదత్తా మరణించారనే వార్త ఆయనకు అందింది. ఆ వార్త విన్న వెంటనే జవేరి పూణావాలా తనకు ఉన్న సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. తనకు ఎంత ముఖ్యమైన పని ఉన్నప్పటికీ, మూడు దశాబ్దాలుగా తన కోసం పనిచేసిన మనిషి చివరి ప్రయాణానికి తాను హాజరు కావడం అంతకంటే ముఖ్యమని భావించారు. తాను పూణే చేరుకునే వరకు అంత్యక్రియలను నిర్వహించవద్దని గంగాదత్తా కుటుంబ సభ్యులను కోరారు. కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించడంతో ఆయన హుటాహుటిన హెలికాప్టర్‌లో పూణేకు బయలుదేరారు. పూణే చేరుకున్న అనంతరం ఆయన చేసిన పని అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.

ముప్పై సంవత్సరాల పాటు గంగాదత్తా నడిపిన అదే లిమోసిన్ కారును పూలతో అందంగా అలంకరించారు. అందులో గంగాదత్తా పార్థివ దేహాన్ని ఉంచారు. ఆ తర్వాత. ఆ ముప్పై సంవత్సరాల ప్రయాణానికి ఒక అపూర్వమైన ముగింపుగా, గంగాదత్తా చివరి ప్రయాణాన్ని అదే కారులో స్వయంగా గంగాదత్తా నివాసం నుంచి శ్మశానవాటిక వరకు జవేరి పూణావాలానే ఆ లిమోసిన్‌ను నడిపించారు.

ఈ ఘటన గురించి పలు మీడియావాళ్లు ఆయనను అడిగినప్పుడు, విషణ్ణ వదనంతో జవేరి పూణావాలా చెప్పిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి.

“గంగాదత్తా నాకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందించాడు. అందుకు ప్రతిగా నా కృతజ్ఞతను ఈ విధంగా వ్యక్తపరుచుకునే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.” అన్నారు.

ఒక డ్రైవర్‌ను కేవలం ‘ఉద్యోగి’గా చూడకుండా… అతని కష్టాన్ని, అతని త్యాగాన్ని, అతని కుటుంబం కోసం అతను చేసిన పోరాటాన్ని గుర్తించిన వ్యక్తి జవేరి పూణావాలా.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

అంబులెన్స్ దాదా "కరీముల్ హక్"

 అంబులెన్స్ దాదా "కరీముల్ హక్"


ప్రభుత్వ వైద్యరంగం, అంబులెన్స్ వ్యవస్థ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా “రాశిలో ఘనం.. వాసిలో నాసిరకం” అనే నిట్టూర్పులే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవైపు దేశంలో ప్రైవేట్ వైద్యరంగం ఆధునిక సాంకేతికత, అత్యాధునిక చికిత్సా విధానాలతో ముందుకు దూసుకుపోతుంటే. మరోవైపు ప్రభుత్వ వైద్యరంగం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా కనిపిస్తోంది.

సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇప్పటికీ ఆందోళన కలిగించే స్థాయిలోనే ఉంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సకాలంలో అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారుతోంది. అంబులెన్స్ వచ్చినా, రోగిని తీసుకెళ్లేందుకు సరైన వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడం మరో పెద్ద సమస్య. ముఖ్యంగా మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో రోగిని సమీపంలోని ఆసుపత్రికి తరలించడానికి గంటల సమయం పడుతోంది. ఒక్కోసారి ఆ ప్రయాణమే ప్రాణాంతకంగా మారుతోంది. సమయానికి వైద్యం అందితే బతికే అవకాశమున్న వ్యక్తి.. అంబులెన్స్ ఆలస్యం, రవాణా సౌకర్యాల కొరత, సమీపంలో సరైన ఆసుపత్రి లేకపోవడం వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లా పరిధిలోని ఓ తేయాకు తోటలో పనిచేస్తున్న కరీముల్ హక్ జీవితంలో జరిగిన ఓ విషాద ఘటన ఆయనను అంబులెన్స్ సేవల వైపు నడిపించింది. ఓ అర్ధరాత్రి ఆయన తల్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో అంబులెన్స్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో ఆమెను సకాలంలో ఆసుపత్రికి తరలించలేకపోయారు. చివరకు చికిత్స అందక ఆయన తల్లి ప్రాణాలు కోల్పోయారు.

తన కళ్లముందే జరిగిన ఈ విషాదం కరీముల్ హక్‌ను తీవ్రంగా కలచివేసింది. తాను ఎదుర్కొన్న నిస్సహాయత మరొక కుటుంబానికి ఎదురుకాకూడదనే సంకల్పం ఆయనలో బలపడింది. అంబులెన్స్ అందుబాటులో లేక ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆయన తన వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు.

1995లో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లికి గుండెపోటు వచ్చింది. అత్యవసర సమయంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆమెను సకాలంలో ఆసుపత్రికి తరలించలేకపోయారు. చివరకు తల్లి ప్రాణాలు కోల్పోయింది. తన కళ్లముందే జరిగిన ఈ విషాదం కరీముల్ హక్ మనసులో చెరగని ముద్ర వేసింది. అత్యవసర వైద్యం అందక మరెవరూ తన తల్లిలా ప్రాణాలు కోల్పోకూడదనే సంకల్పం అప్పుడే ఆయనలో మొదలైంది.

ఆ సంకల్పానికి 1998లో కార్యరూపం దాల్చే అవకాశం వచ్చింది. ఓ రోజు ఆయన సహోద్యోగి ఒకరు అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. అంబులెన్స్ కోసం ఎదురుచూసే పరిస్థితి లేదు. వెంటనే స్పందించిన కరీముల్ హక్. సహోద్యోగిని  తన వీపుకు కట్టుకుని, మోటార్‌సైకిల్‌పై సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ క్షణమే “మోటార్‌సైకిల్ అంబులెన్స్” అనే ఆలోచన ఆయనకు వచ్చింది.

ఆ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు తన సొంత మోటార్‌సైకిల్ కొనుగోలు చేయడానికి డబ్బు అప్పు తీసుకున్నారు. అప్పటి నుంచి మోటార్‌సైకిల్‌నే అంబులెన్స్‌గా మార్చుకుని మారుమూల ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ఆసుపత్రులకు తరలించడం ప్రారంభించారు. 1998 నుంచి ఇప్పటివరకు 20కి పైగా పరిసర ప్రాంతాల్లో ఆయన అందించిన ఈ సేవల ద్వారా 7,000 మందికి పైగా వైద్య సహాయం అవసరమైన వారికి అండగా నిలిచినట్లు పేర్కొనబడింది.

కరీముల్ హక్ సేవలు కేవలం రోగులను ఆసుపత్రులకు తరలించడంతోనే ఆగిపోలేదు. వైద్యుల సహకారంతో స్థానిక ప్రజలకు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో కూడా సూచనలు అందిస్తున్నారు.

తల్లి అంబులెన్స్ అందక ప్రాణాలు కోల్పోయింది. ఆ విషాదం కొడుకులో సంకల్పాన్ని రగిలించింది. ఆ సంకల్పం ఒక మోటార్‌సైకిల్‌ను అంబులెన్స్‌గా మార్చింది. ఆ అంబులెన్స్ ప్రయాణం వేలాది మందికి అత్యవసర సమయంలో ఆశాకిరణంగా నిలిచింది.

60 ఏళ్ల కరీముల్ హక్ తన తల్లిదండ్రులకు జన్మించిన ఆరుగురు సంతానంలో మూడవవాడు. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కరీముల్ హక్ మూడో తరగతి వరకే చదువుకోగలిగారు. అయితే పుస్తక పాఠాలు పెద్దగా నేర్చుకోకపోయినా. జీవితం మాత్రం మానవత్వం అనే గొప్ప పాఠాన్ని నేర్పింది. ఆ పాఠాన్నే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్న హక్.. నిస్సహాయులకు అండగా నిలుస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.

కరీముల్ హక్ చేసిన నిస్వార్థ సామాజిక సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అంబులెన్స్ అందక తన తల్లిని కోల్పోయిన ఓ సాధారణ వ్యక్తి.. అదే బాధ మరొకరికి రాకూడదనే సంకల్పంతో ప్రారంభించిన సేవ.. చివరకు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ వరకు తీసుకెళ్లింది. చదువు మూడో తరగతితో ఆగిపోయినా.. కరీముల్ హక్ మానవత్వం మాత్రం వేలాది జీవితాలను తాకేంతగా విస్తరించింది. తనకు ఎదురైన బాధను ఇతరులకు సేవగా మలిచిన ఆయన జీవితం.. సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తోంది: పరిస్థితులు మనిషిని ఆపలేవు.. సంకల్పం ఉంటే ఒక సాధారణ మోటార్‌సైకిల్ కూడా ఒక ప్రాణాన్ని కాపాడే అంబులెన్స్‌గా నిలిచింది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

9, ఆగస్టు 2026, ఆదివారం

ఆమె జడలో ఒదిగిన మల్లెలు

ఆమె జడలో ఒదిగిన మల్లెలు కురులకే అందం.. 
ఆ మల్లెలు సుగంధ పరిమళాలను వెదజల్లుతుంటే,
అందరి చూపులు ఆమెవైపే మళ్ళినా…
ఆ ఆకర్షణ మాత్రం ఆ మల్లెల మాధుర్యానికే.

ఆమె అందం కన్నులను ఆకర్షిస్తుందేమో గానీ,
మల్లెల పరిమళం మాత్రం మనసులను మైమరపిస్తుంది.
రూపం నయనానందకరంగా  రంజింపజేస్తుంది,
పరిమళం మదిలో మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది.

ఆమె అడుగుల సవ్వడి వినకముందే మల్లెల మాధుర్యమే ఆమె రాకను ప్రకటిస్తుంది.
ఆమె పలకరింపుకుముందే పూల పరిమళమే హృదయాన్ని హత్తుకుంటుంది.

అందుకే…
ఆమె జడలో విరిసిన ఆ మల్లెలు,
ఆమె సోయగానికి ప్రకృతి అందించిన సుగంధ పరిమళాలు.

కన్నులు రూపాన్ని వెతుకుతాయి…
హృదయం మాత్రం పరిమళాన్ని వెతుకుతుంది.
అందం కాలగర్భంలో కలిసిపోవచ్చు, కానీ పరిమళం మాత్రం
జ్ఞాపకాల గుండెల్లో నిత్యవసంతమై నిశ్శబ్దంగా వికసిస్తూనే ఉంటుంది.

✍️
కోట దామోదర్
మొబైల్ 9391480475

వీది అరుగులు

 ఆవేదన అలలై అంతరంగాన్ని అతలాకుతలం చేసినప్పుడల్లా,

అలసిన అడుగులకు ఆలంబనైనవి ఆ వీధి అరుగులే.

మాటల్లో చెప్పలేని మనోవేదనను,
మౌనంగా చెక్కిలి నుండి జారే కన్నీళ్లను, ఓర్పుతో ఆలకించే
శక్తి ఆ అరుగులకే సొంతం.

కన్నవారు కాదుపొమ్మంటే వారి కళ్లలో వెలుగు కరిగిన కథలు,
ఒంటరి గుండెల్లో  వేదన మిగిల్చిన జ్ఞాపకాలు, ఎన్నో నిరీక్షణల నిశ్శబ్ద నిట్టూర్పులు అన్నీ ఆ అరుగుల మీదే ఆశ్రయం పొందాయి.

బంధాలు దూరమై బాధలో ఉన్నప్పుడు ఆ బాధలు పంచుకునే ఆత్మీయ వేదికలు ఆ అరుగులే కదా!

నేడు బాధలు చెప్పుకునే వృద్ధులే లేరా అని ఆ అరుగులెందుకో చిన్నవోయినాయి..

✍️
కోట దామోదర్
మొబైల్ 9391480475

రాట్నం తిరగనంటుంది

 రాట్నం తిరగనంటుంది


మానవాళికి వస్త్రమై మర్యాదను అల్లిన చేతులవి…
మట్టి వాసనలో మమకారాన్ని నేసిన మనసులవి…
దేశమనే దేహానికి స్వదేశీ అనే శ్వాసను అందించిన చేనేత 
రాట్నమే నేడు…“తిరగనంటుంది…”

నేతలు రాట్నం తిప్పిన ప్రతిసారి
బానిస సంకెళ్లపై స్వేచ్ఛా శంఖం మోగేది.
ప్రతి నూలు పోగులో స్వరాజ్య స్వప్నం మొలకెత్తేది.
ప్రతి ఖాదీ వస్త్రంలో భారతమాత గుండె చప్పుడు వినిపించేది.

విదేశీ వస్త్రాలను వెలిగే మంటల్లో విసిరేసి,
స్వదేశీ దీపాన్ని వెలిగించిన విప్లవ జ్యోతి…
ఆ చేనేత రాట్నమే కదా!

నేతన్న చెమట చుక్కలు దేశభక్తి గీతాలయ్యాయి…
నూలు పోగులు జాతీయ పతాకపు రంగులయ్యాయి…
మగ్గం శబ్దమే స్వాతంత్ర్య రణభేరిగా మారింది.

కానీ నేడు…

దేశం కోసం తమ జీవితాలనే నూలుపోగులుగా అర్పించిన
ఆ చేనేత త్యాగాలను కాలమే మడతపెట్టేసిందని… 
అందుకే రాట్నం తిరగనంటుంది.

ఖాదీ వస్త్రాలు తొడిగే నేతన్నలపై నేతన్న 
కన్నీటి బరువు కనిపించడం లేదని… 
అందుకే రాట్నం తిరగనంటుంది.

జాతీయ పండుగల రోజు మాత్రమే ఖాదీని గౌరవించి,
మిగిలిన రోజుల్లో నేతన్నను మరచిపోయే నకిలీ దేశభక్తిని చూసి… 
అందుకే  రాట్నం తిరగనంటుంది.

✍️
కోట దామోదర్ 
మొబైల్ 9391480475

24, జులై 2026, శుక్రవారం

జీవితం ఆశ-నిరాశల సంగమం:

 జీవితం ఆశ-నిరాశల సంగమం:


ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం,
ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం.

కన్నీటి కెరటాలు కళ్లను కమ్ముకున్నా,
కాలమే కఠినంగా గుండెను చిదిమేసినా

చీకటి చాటున చితికిపోయిన కలలైనా,
చివరికి చిగురించే చినుకై మారుతుంది చిన్ని ఆశతో.

పడిపోవడం పరాజయం కాదు,
పట్టుదల విడిచిపెట్టడమే     ఆత్మహననం.
విరిగిన రెక్కలతోనైనా విహరించాలనే తపనే విజయం,
వేదనను వెలుగుగా మలచుకోవడమే జీవితం.

నిరాశ నిప్పుల మధ్య ఆశ అంకురిస్తుంది,
నిస్పృహ నిట్టూర్పుల వెనుక విజయం చిగురిస్తుంది.

జీవితం అంటే ఆశల అలలు, నిరాశల తుఫానులు,
అయినా ముందుకు నడిపించేది మనసులోని ధైర్యం.

ఆశ ఆరిపోని అఖండ దీపమైతే,
నిరాశ ఆ దీపానికి ఎదురయ్యే సుడిగాలి
పోరాడే ప్రతి ఉచ్ఛ్వాసనిశ్వాసే అంతిమ విజయ గీతిక,
అందుకే జీవితం… ఆశను ఆరాధించే, నిరాశను అధిగమించే పవిత్ర సంగమం.

✍️
కోట దామోదర్
మొబైల్ 9391480475

మంచు శిఖరాల మధ్య పుట్టిన సంకల్పం…

మంచు శిఖరాల మధ్య పుట్టిన సంకల్పం…

పర్వతాలంత అచంచలమైన ధైర్యం…

తన ప్రాణం కంటే ప్రజల భవిష్యత్తే గొప్పదని విశ్వసించిన పోరాటం…
మరణాన్ని సైతం చిరునవ్వుతో ఆహ్వానిస్తూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం తన శ్వాసనే ఉద్యమంగా మార్చుకున్న మహోన్నత పోరాట యోధుడు సోనమ్ వాంగ్చుక్.

నిజం కోసం నడిచిన అడుగులు ఎన్నడూ అలసిపోవు,
న్యాయం కోసం పలికిన స్వరాలు ఎన్నడూ మూగపోవు.
కాలం కత్తిలా కోసినా, కుట్రలు విషనాగులా కాటేసినా,
సత్యపు దీపం ఆరిపోదు… ధర్మపు దారి మారిపోదు.

అబద్ధాల మేఘాలు ఆకాశమంతా కమ్ముకున్నా,
అంతరంగంలో వెలిగే నిజం సూర్యుడై ఉదయిస్తుంది.
ప్రతిఘటనల ప్రవాహంలో ఎదురు ఈదగలిగినవాడే,
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే చరిత్రకారుడవుతాడు.

విద్య వెలుగు ఆరిపోకూడదని,
తన జీవితాన్నే దీపంలా దహించుకుంటూ వెలిగిస్తున్న త్యాగశీలి.
అణచివేత ఎదుట తలవంచని ఆత్మగౌరవం,
అన్యాయం ఎదుట వెనుకడుగు వేయని ధైర్యసాహసం.

గాయాలన్నీ గాథలై, కన్నీళ్లన్నీ కీర్తులై,
త్యాగాలన్నీ తరాలకు దిక్సూచులై మారేలా
దేశంలో మార్పు కోసం పోరాడుతున్న ఒకేఒక్కడు..

అతనే సోనమ్ వాంగ్చుక్…

✍️
కోట దామోదర్
మొబైల్ 9391480475

మనిషి కలలు అలల్లా ఎగసిపడతుంటాయి…

మనిషి కలలు అలల్లా ఎగసిపడతుంటాయి…

ఆశల ఆకాశాన్ని తాకాలని ఆరాటపడతుంటాయి…

కానీ…

అల ఎంత ఎగిసినా చివరికి ఒడ్డునే ఒదిగిపోతుంది,
కల ఎంత ఎత్తుకు ఎగిరినా చివరికి కాలగర్భంలోనే కలిసిపోతుంది.

కలలన్నీ కరిగిపోతాయి,
కాలపు కెరటాల్లో కొట్టుకుపోతాయి.
ఆశలన్నీ అలసిపోతాయి,
అనుభవాల ఒడ్డున ఒదిగిపోతాయి.

నిన్నటి కోరిక నేడు జ్ఞాపకమవుతుంది,
నేటి స్వప్నం రేపటి కథనమవుతుంది.
మనిషి పరిగెత్తిన దారులన్నీ
కాలం కాళ్లకింద మట్టిగా మారిపోతాయి.

అలకు ఒడ్డు శాశ్వతం కాదు,
కలకు గెలుపు శాశ్వతం కాదు.
జీవితం అనే సముద్రంలో
ప్రయాణమే నిజం, గమ్యం కాదు.

అందుకే…

కల నెరవేరినా వినయంగా ఉండు,
కల చెదిరినా ధైర్యంగా నిలబడు.
ఎందుకంటే కాలం ముందు
కిరీటమూ ఒక జ్ఞాపకమే,
కన్నీటిబొట్టూ ఒక జ్ఞాపకమే.

అల ఒడ్డున కలిసినట్లు,
కల కాలంలో కలిసినట్లు,
మనిషి జీవితం కూడా
చివరికి ఒక కథగా మిగిలిపోతుంది.

✍️
కోట దామోదర్
మొబైల్ 9391480475

21, జూన్ 2026, ఆదివారం

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది


మనిషి కలలు అలల్లా ఎగసిపడతుంటాయి…

ఆశల ఆకాశాన్ని తాకాలని ఆరాటపడతుంటాయి…


కానీ…


అల ఎంత ఉప్పొంగినా చివరికి ఒడ్డునే ఒదిగిపోతుంది,

కల ఎంత ఎత్తుకు ఎగిరినా చివరికి కాలగర్భంలోనే కలిసిపోతుంది.


కలలన్నీ కరిగిపోతాయి,

కాలపు కెరటాల్లో కొట్టుకుపోతాయి.

ఆశలన్నీ అలసిపోతాయి,

అనుభవాల ఒడ్డున ఆగిపోతాయి.


నిన్నటి కోరిక నేడు జ్ఞాపకమవుతుంది,

నేటి స్వప్నం రేపటి కథనమవుతుంది.

మనిషి పరిగెత్తిన దారులన్నీ

కాలం కాళ్లకింద మట్టిగా మారిపోతాయి.


అలకు ఒడ్డు శాశ్వతం కాదు,

కలకు గెలుపు శాశ్వతం కాదు.

జీవితం అనే సముద్రంలో

ప్రయాణమే నిజం, గమ్యం కాదు.


అందుకే…


కల నెరవేరినా వినయంగా ఉండు,

కల చెదిరినా ధైర్యంగా నిలువు.

ఎందుకంటే కాలం ముందు

కిరీటమూ ఒక జ్ఞాపకమే,

కన్నీటిబొట్టూ ఒక జ్ఞాపకమే.


అల ఒడ్డున కలిసినట్లు,

కల కాలంలో కలిసినట్లు,

మనిషి జీవితం కూడా

చివరికి ఒక కథగా మిగిలిపోతుంది.


✍️

కోట దామోదర్

నాన్నకు ప్రేమతో ❤️…

 నాన్నకు ప్రేమతో ❤️…


మనం కోరిన కోరికలన్నిటినీ దేవుడు తీరుస్తాడో లేదో తెలియదు,

కానీ మనం కోరుకున్న ప్రతి చిన్న కోరికను

కాదనకుండా నెరవేర్చే దేవుడు మాత్రం నాన్న.


మన సంతోషం కోసం తన బాధలను దాచే త్యాగం నాన్న,

మన భవిష్యత్తు కోసం తన భవిష్యత్తు ను త్యాగం చేసేది నాన్న.


మన అడుగులు తడబడితే కొండంత అండగా నిలిచేది నాన్న,

మన ఆశలు రెక్కలు తొడిగితే ఆకాశమై విరిసే గగనం నాన్న.


దేవుడిని ప్రార్థిస్తే వరం దొరకొచ్చు, దొరకకపోవచ్చు,

కానీ నాన్నను అడిగిన కోరిక మాత్రం

ఆయన గుండెపై భారమైనా, భుజాలపై బాధైనా తప్పక నెరవేరుతుంది.

కోరిక మనది… కష్టం నాన్నది,

విజయం మనది… త్యాగం నాన్నది.

ప్రేమకు నిర్వచనం అడిగితే “అమ్మ” అంటారు,

బాధ్యతకు ప్రతిరూపం అడిగితే “నాన్న” అంటారు.


✍️

కోట దామోదర్ 

మొబైల్ 9391480475

జీరోలతో చెప్పిన జీవిత పాఠం

అదొక పేరుగాంచిన పారిశ్రామిక సంస్థ. భారత నావికాదళానికి ప్రత్యక్షంగా సేవలందించే ఆ కంపెనీ, పరోక్షంగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. అక్కడ పనిచేసే ప్రతి ఉద్యోగి పని వెనుక దేశభక్తి దాగి ఉంటుంది.


ఒకరోజు ఉదయం ఆ సంస్థలోని ఒక విభాగం జనరల్ మేనేజర్‌కి పై అధికారుల నుండి అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. పాకిస్తాన్‌తో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా నావికాదళానికి అవసరమైన పరికరాల ఉత్పత్తిని మరింత వేగవంతం చేయాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఫోన్ పెట్టిన వెంటనే మేనేజర్ గారు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నారు. వెంటనే తన డిపార్ట్మెంట్ ఉద్యోగులందరినీ కాన్ఫరెన్స్ హాల్‌లోకి పిలిచారు.

“ఇకపై అందరూ సమయానికి రావాలి. అవసరమైతే అదనపు సమయం పనిచేసైనా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. ఇది కేవలం కంపెనీ పని కాదు… దేశ భద్రతకు సంబంధించిన బాధ్యత,” అని గంభీరంగా చెప్పారు.

కానీ అక్కడున్న ఉద్యోగుల ముఖాల్లో ఆశించిన ఉత్సాహం కనిపించలేదు. కొందరు నిర్లక్ష్యంగా కూర్చున్నారు. మరికొందరు ఆయన మాటలు విన్నట్టే లేరు.

అది గమనించిన మేనేజర్ గారికి ఒకరకమైన ఆందోళన మొదలైంది.
“ఇలాంటి పరిస్థితిలో వీళ్లలో బాధ్యతాభావం ఎలా పెంచాలి? ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా ఎలా పూర్తి చేయాలి?” అని ఆలోచించారు.

కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడి, కొద్దిసేపటి తర్వాత ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు.

“అందరూ ఒక పేపర్, పెన్ తీసుకోండి,” అన్నారు.

ఉద్యోగులందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ పేపర్లు తీసుకున్నారు.

“ఇప్పుడు మీ మనసులో… 20 సెకండ్లలో మీరు ఎన్ని సున్నాలు (0) రాయగలరో ఒక సంఖ్యను ఊహించుకుని ముందుగా పేపర్ మీద రాసుకోండి,” అన్నారు.

అందరూ తమకు తోచిన సంఖ్యను రాసుకున్నారు.

తర్వాత మేనేజర్ గారు స్టాప్‌వాచ్ ఆన్ చేసి,
“స్టార్ట్!” అన్నారు.

ఉద్యోగులందరూ వేగంగా సున్నాలు రాయడం మొదలుపెట్టారు.
20 సెకండ్లు పూర్తయ్యాక,
“స్టాప్!” అన్నారు.

“ఇప్పుడు మీరు నిజంగా ఎన్ని సున్నాలు రాశారో లెక్కించండి. తర్వాత మీరు ముందుగా అనుకున్న సంఖ్యతో పోల్చండి,” అన్నారు.

కొంతమంది తాము అనుకున్నదానికంటే ఎక్కువ రాశారు.
మరికొందరు తక్కువ రాశారు.

అప్పుడు మేనేజర్ గారు చిరునవ్వుతో మాట్లాడటం ప్రారంభించారు.

“చూశారా…?
మనలో చాలామంది ముందే ఒక పరిమితిని నిర్ణయించుకుంటారు. ‘నేను ఇంతవరకే చేయగలను’ అని అనుకుంటారు. కానీ ప్రయత్నం మొదలుపెట్టాక మన సామర్థ్యం మన ఊహకంటే ఎక్కువగా ఉంటుందని ఇప్పుడే మీరే నిరూపించారు.

దేశం కోసం పనిచేసే మనం, సాధారణ ఉద్యోగులు కాదు. మనం చేసే ప్రతి పని సరిహద్దుల్లో ఉన్న సైనికుడికి బలం అవుతుంది. మీరు కొంచెం ఎక్కువ సమయం పనిచేస్తే… అక్కడ ఒక నావికాదళ సైనికుడు మరింత భద్రంగా ఉంటాడు.

మన సామర్థ్యాన్ని మనమే తక్కువ అంచనా వేయొద్దు. అవసరం వచ్చినప్పుడు సాధారణ మనిషిలో కూడా అసాధారణ శక్తి బయటపడుతుంది,” అన్నారు.

ఆ మాటలు ఉద్యోగుల హృదయాలను తాకాయి.
అందరి కళ్లలో కొత్త ఉత్సాహం కనిపించింది.

ఆ రోజు నుండి ఆ డిపార్ట్మెంట్‌లో మార్పు మొదలైంది. ఉద్యోగులు సమయానికి రావడం మాత్రమే కాదు, అవసరమైతే అదనపు గంటలు పనిచేసి ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

ఆ రోజు మేనేజర్ గారు ఉద్యోగులకు కేవలం పని గురించి మాత్రమే కాదు…
మనిషి తనను తాను నమ్ముకుంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని నేర్పించారు.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

20, జూన్ 2026, శనివారం

ఒక్క నిర్ణయం.. వందలాది రైతు కుటుంబాల్లో ఆశాకిరణం

 ఒక్క నిర్ణయం.. వందలాది రైతు కుటుంబాల్లో ఆశాకిరణం


ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, ఆధునిక విద్య ప్రభావంతో యువత ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లోనే భవిష్యత్తును చూసిన యువత, నేడు మెరుగైన విద్యా, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలు, విదేశాల వైపు అడుగులు వేస్తున్నారు. చదువు పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థానం, విదేశీ విద్య లేదా విదేశీ ఉద్యోగం సాధించడమే చాలా మంది యువత లక్ష్యంగా మారింది. ఈ ఆలోచనా ధోరణితో వారు గ్రామీణ జీవితం, వ్యవసాయం కంటే నగర జీవనం, ప్రపంచ స్థాయి అవకాశాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా వ్యవసాయం, గ్రామీణ జీవితం పట్ల ఆసక్తి తగ్గిపోతోంది. ఒకప్పుడు పొలాల్లో పనిచేసిన యువకులు నేడు కంప్యూటర్ల ముందు పనిచేస్తున్నారు. వ్యవసాయాన్ని కొనసాగించే వారసులు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ మార్పు వల్ల గ్రామాల రూపురేఖలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు యువత సందడితో కళకళలాడిన పల్లెలు నేడు వృద్ధులతోనే కనిపిస్తున్నాయి. అనేక ఇళ్లకు తాళాలు వేళ్ళాడుతుండగా, వీధుల్లో యువత సందడి తగ్గిపోయింది. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక బంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి.

మరోవైపు వ్యవసాయ రంగం కూడా కార్మికుల కొరత, వారసుల లేమి, సాగుభూముల తగ్గుదల వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. రైతు కుటుంబాల యువత వ్యవసాయాన్ని వదిలి ఇతర రంగాల వైపు వెళ్లడంతో భవిష్యత్తులో ఆహార భద్రతపైనా ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే స్వీయాభివృద్ధి పట్ల యువత ఆలోచనా ధోరణిని తప్పుబట్టలేం. మెరుగైన జీవన ప్రమాణాలు, ఆర్థిక భద్రత కోసం వారు కొత్త అవకాశాలను వెతుకుతున్నారు. కానీ అదే సమయంలో గ్రామాల అభివృద్ధి, వ్యవసాయ ఆధునీకరణ, గ్రామీణ ఉపాధి అవకాశాల పెంపును ఇటు యువత అటు ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి.  యువత గ్రామాల్లోనే ఉండి అభివృద్ధి సాధించే పరిస్థితులు కల్పించగలిగితేనే పల్లెలు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయనే ఆలోచన చేస్తే వ్యవసాయరంగానికి తిరుగుండదనేది ముమ్మాటికీ నిజం.

కొంతమంది యువత మాత్రం లక్షల్లో జీతాలు, విదేశీ అవకాశాలను సైతం వదులుకొని స్వంత ఊరిలోనే ఉపాధి అవకాశాలు సృష్టించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ కోవకు చెందినదే నిజామాబాద్ జిల్లా చింతలూరు గ్రామానికి చెందిన సంజనా రెడ్డి అనే యువతి. 

ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సంజనా రెడ్డికి ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఎంతో మంది యువత కలగా భావించే ఆ అవకాశాన్ని ఆమె సులభంగానే అందుకుంది. అయినప్పటికీ, ఆ ఉద్యోగంలో చేరలేదు. మరింత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే లక్ష్యంతో IELTS, GRE పరీక్షలు రాసి అద్భుతమైన స్కోర్లు సాధించింది. ఆమె ప్రతిభ ఆధారంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో అడ్మిషన్ కూడా లభించింది. అయితే అదే సమయంలో సంజనా మనసులో ఒక ప్రశ్న మెదిలింది.

"ఉన్నత చదువుల కోసం నా సొంత ఊరిని, నా దేశాన్ని వదిలి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న విదేశానికి ఎందుకు వెళ్లాలి? నేను నేర్చుకున్న విజ్ఞానాన్ని, టెక్నాలజీని నా కళ్ల ముందే కనిపిస్తున్న సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు ఉపయోగించకూడదు? నా గ్రామానికి, నా ప్రజలకు నేను ఏమి చేయగలను?" అని తనను తాను ప్రశ్నించుకుంది.

ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న క్రమంలో ఆమె మనసు తిరిగి తన మూలాల వైపు మళ్లింది. చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు, పొలాల్లో చెమటోడ్చే రైతుల కష్టాలు, చదువుకుని అవకాశాల కోసం ఊరిని విడిచి వెళ్తున్న యువత, కుటుంబ భారం మోస్తూనే ఉపాధి కోసం ఎదురుచూస్తున్న మహిళల జీవితాలు ఆమె కళ్లముందు కదిలాయి.

అమెరికా వెళ్లడం ఆమె భవిష్యత్తును మార్చవచ్చు. కానీ తన గ్రామంలో ఉండి ఏదైనా కొత్తది చేయగలిగితే తన భవిష్యత్తుతో పాటు ఎన్నో కుటుంబాల భవిష్యత్తును మార్చవచ్చని ఆమెకు స్ఫురించింది. ఎంతోమంది కలలుగనే విదేశీ విద్య అవకాశాన్ని సైతం ఆమె స్వచ్ఛందంగా వదులుకుంది. గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన సంజనకు రైతుల జీవితం కొత్త కాదు. చిన్నప్పటి నుంచి పొలాల్లో కష్టపడే రైతులను, పంట పండించిన తర్వాత కూడా సరైన ధర కోసం ఆందోళన చెందే కుటుంబాలను ఆమె దగ్గరగా చూసింది. వర్షాలు పడకపోతే ఒక బాధ, పంట బాగా పండినా గిట్టుబాటు ధర రాకపోతే మరో బాధ. రైతు ఎంత కష్టపడినా మధ్యలో దళారులే ఎక్కువ లాభపడుతున్నారనే వాస్తవం ఆమెను కలచివేసింది.

"రైతు పండించాలి... దళారి సంపాదించాలి" అనే పరిస్థితిని మార్చాలని ఆమె సంకల్పించింది. తన చదువు, సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆలోచనలను రైతుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలోనే ఆమె నగరాల్లో ఉండే ప్రజలకు వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రతిరోజూ పొలంలో రైతులు చేసే పనులు, వ్యవసాయ జీవన విధానం, రైతుల కష్టాలు, పంటల సాగుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించింది.

అలా ఆమె పోస్ట్ చేసిన పసుపు సాగుకు సంబంధించిన ఒక వీడియో అనూహ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షలాది మంది ఆ వీడియోను వీక్షించారు. ఆ వీడియో చూసిన వినియోగదారులు మార్కెట్‌లో దొరికే ఉత్పత్తుల కంటే నేరుగా రైతుల పొలం నుంచి వచ్చే స్వచ్ఛమైన పసుపును కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించారు.

చాలామంది వైరల్ అవుతున్న వీడియోను ఆనందంగా చూసినప్పటికీ ఆ తరువాత మరిచిపోతారు. కానీ సంజనా అందులో కూడా ఒక అవకాశాన్ని చూసింది. రైతుల కష్టానికి సరైన విలువ తీసుకురావడానికి ఇదే సరైన సమయమని భావించింది. ఆ ఆలోచనే 'ఇందూరు ఫార్మ్స్' అనే ఈ-కామర్స్ స్టార్టప్‌కు పునాది వేసింది.

ఇందూరు ఫార్మ్స్ ద్వారా రైతుల నుంచి పంటలను నేరుగా కొనుగోలు చేసి, ఎటువంటి దళారుల ప్రమేయం లేకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వినియోగదారులకు చేరవేయడం ప్రారంభించింది. దీంతో రైతులకు మెరుగైన ధర లభించగా, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి.

ఒక చిన్న గ్రామంలో మొదలైన ఈ ప్రయాణం నేడు తెలంగాణ సరిహద్దులను దాటి ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన మెట్రో నగరాలకు విస్తరించింది. ఒకప్పుడు అమెరికాకు వెళ్లాలని సిద్ధమైన యువతి. నేడు తన గ్రామం నుంచే వందలాది మంది రైతుల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరవేస్తోంది. ఆమె కథ ఒక యువతి విజయగాథ మాత్రమే కాదు. ఉపాధి కోసం గ్రామాలను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని, గ్రామాల్లోనే అవకాశాలను సృష్టించి విజయాన్ని సాధించవచ్చనే ధైర్యాన్ని సంజనా రెడ్డి యువతలో నింపింది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

31, మే 2026, ఆదివారం

ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి

 ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి


మనిషి జీవితంలో విజయాన్ని సాధించడానికి అత్యంత ముఖ్యమైనది సంకల్పం. సంకల్పం అంటే కేవలం కలలు కనడం కాదు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనసులో దృఢమైన లక్ష్యం పెట్టుకుని, దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయడం. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడమే నిజమైన సంకల్పం.

సంకల్పం ఉన్న వ్యక్తి తాను పయనించే మార్గంలో ఎదురయ్యే కష్టాలు, సమస్యలు చూసి భయపడడు. వాటిని ఓటమిగా భావించకుండా, అవి తనను మరింత బలంగా మార్చే అవకాశాలుగా భావిస్తాడు. అడ్డంకులను అవకాశాలుగా మలుచుకొని, ధైర్యంగా ముందుకు సాగుతూ చివరకు తన లక్ష్యాన్ని చేరుకుంటాడు.

ప్రపంచంలో ఎన్నో గొప్ప విజయాలు సంకల్పం వల్లే సాధ్యమయ్యాయి. దీనికి చక్కటి ఉదాహరణగా ఈశ్వరీ పాండే ను చెప్పవచ్చు. ఆమెకు కళ్ళు కనిపించకపోయినా (అంధురాలు), సముద్రంలో ఈదుతూ శ్రీలంక నుండి రామేశ్వరం వరకు ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది. సంకల్పం గట్టిగా ఉండాలే గానీ, అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయొచ్చు అని నిరూపించింది.

నాగపూర్‌కు చెందిన కమలేష్ మరియు అరుణ పాండే దంపతుల కుమార్తె ఈశ్వరీ పాండే. ఆమె పుట్టుకతోనే అంధురాలైనప్పటికీ, చిన్న వయసు నుంచే ఆమెలో ఉన్న పట్టుదల, ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఈతలో ప్రోత్సహించారు. 10 సంవత్సరాల వయస్సు నుండి కోచ్ సంజయ్ పురుషోత్తమన్ పడ్వే వద్ద ఆమెకు శిక్షణ ప్రారంభమైంది.

మొదట్లో ఈత నేర్చుకోవడం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మరింత సవాళ్లు ఎదురైనప్పటికీ, నేర్చుకోవాలనే దృఢ సంకల్పంతో ఆమె కఠినమైన శిక్షణను ధైర్యంగా ఎదుర్కొంది. క్రమంగా ఈతలో మెళుకువలు నేర్చుకుని అనేక పోటీలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించింది. కోచ్ మార్గదర్శకత్వం మరియు ప్రత్యేక శిక్షణ పద్ధతుల ద్వారా ఆమె ప్రతిభ రోజురోజుకు మెరుగుపడింది.

అంకితభావం, క్రమశిక్షణతో కూడిన సాధన వల్ల ఆమె అనేక విజయాలను సాధించింది. అయినప్పటికీ, ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించాలన్నదే ఆమె ప్రధాన లక్ష్యంగా మారింది. అందుకోసం ఆమె అంతర్జాతీయ స్థాయి పోటీలపై దృష్టి సారించి, తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంది.

దృష్టి లోపం ఉన్న ఈతగాళ్లకు ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిథ్యం వహించాలనే లక్ష్యంతో, ఆమె అత్యంత కఠినమైన సవాల్‌ను స్వీకరించింది. శ్రీలంకలోని తలైమన్నార్ నుండి భారతదేశంలోని ధనుష్కోడి వరకు సుమారు 25 కిలోమీటర్ల దూరాన్ని సముద్రంలో ఈత కొట్టింది. బలమైన గాలులు, భారీ అలలు, వర్షం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ, ఆమె తెల్లవారుఝామున 4 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రతి 30 నిమిషాలకు ఆమె వేగాన్ని కొనసాగించడానికి కఠినమైన పోషక నియమావళిని ఆమెకు కోచ్ అందిస్తూ విజయం సాధించే దిశగా ప్రోత్సహించారు. ఆమె దాదాపు 11 గంటల 15 నిమిషాల పాటు ఎలాంటి విరామం లేకుండా ఈత కొట్టి, మధ్యాహ్నానికి ధనుష్కోడి తీరాన్ని విజయవంతంగా చేరుకుంది. అయితే ఆమె అంధురాలు అయినందున విజయం సాదించామనే విషయం తన కోచ్ చెప్పేంతవరకు కూడా ఆమెకు తెలియదంటే ఆమెకు సాధించాలనే పట్టుదల ఎంతగా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.  

ఇది కేవలం ఒక సాధారణ విజయంగా మాత్రమే చూడకుండా ఆమె సంకల్పం, అచంచల ధైర్యం, మరియు కఠినమైన శిక్షణకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఇలాంటి సంక్లిష్టమైన  సవాల్‌ను పూర్తి చేసిన అంధ ఈతగాళ్లలో ఈశ్వరీ పాండే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
 
ఈశ్వరి సాధించిన ఈ ఘన విజయంతో ఆమె స్వస్థలం నాగపూర్ నగరం గర్వంతో స్పందించింది. భారీ ర్యాలీ, బాణాసంచా ప్రదర్శనల మధ్య ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఓపెన్ జీప్‌లో ప్రారంభమైన ఈశ్వరీ విక్టరీ పరేడ్‌లో భాగంగా, దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (IDCPe)కు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ స్క్వేర్ వద్ద డప్పులు మోగిస్తూ, రంగులు చల్లుతూ, బాణాసంచా పేలుస్తూ ఆమెను గుర్రంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ వేడుక అంతటా ఉత్సాహం, ఆనందం, గర్వభావం వెల్లివిరిసింది.

మొదట్లో ఈశ్వరి ఈత నేర్చుకునే సమయంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంది. అయినప్పటికీ నేర్చుకోవాలనే దృఢ సంకల్పంతో, ఓపికగా సాధన చేస్తూ ముందుకు సాగింది. ప్రపంచ విజేతగా గుర్తింపు పొందడానికి ఆమెకు దాదాపు 7 సంవత్సరాల సమయం పట్టింది.

నేటి యువత ఈశ్వరి పాండే జీవితాన్ని ప్రేరణగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టుదల లేకుండా వెంటనే ఫలితం రావాలని తొందరపడటం, ఫలితం రాకపోతే నిరాశ చెందటం, ఇవే యువతలో కుంగుబాటుకు ప్రధాన కారణాలు.

ఒక రైతు పంట పండించాలంటే నేలను దున్ని, విత్తనం వేసి, నారు పోసి, నీళ్లు పోసి, పురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంట పక్వానికి వచ్చేదాకా ఓపికగా ఎదురుచూడాలి. అప్పుడు మాత్రమే పంట చేతికి వస్తుంది.

అలాగే, జీవితంలో కూడా సరైన ప్రణాళిక, నిబద్ధతతో కూడిన ప్రయత్నం, క్రమశిక్షణగల జీవనశైలి మన విజయానికి దారి తీస్తాయి. ఎంత కష్టపడ్డా అనుకున్న ఫలితం రాకపోతే, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మళ్లీ ప్రయత్నించాలి. నిరాశకు తావివ్వకుండా ముందుకు సాగడమే నిజమైన విజయం.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

చేతిరాతలో చెరిగిపోని జ్ఞాపకాలు

 చేతిరాతలో చెరిగిపోని జ్ఞాపకాలు


ఈమధ్య కాలంలో చేతిరాత రాసేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుందనడానికి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, మొబైల్‌ఫోన్లు కోకొల్లలుగా పెరగడమే ప్రధాన కారణం. ఇవన్నీ కలిసి మనిషిని చేతిరాతకు క్రమంగా దూరం చేస్తున్నాయి. ఒకప్పుడు ఆలోచనలకు ఆత్మగా నిలిచిన చేతిరాత, ఇప్పుడు కీబోర్డ్‌ కఠోర ధ్వనుల మధ్య కనుమరుగైపోతోంది. సాంకేతికత మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ, కాగితంపై అక్షరాలను ఆవిష్కరించే అలవాటు మాత్రం మసకబారుతోంది. చేతిరాతలో కనిపించే భావోద్వేగం, వ్యక్తిత్వం డిజిటల్‌ అక్షరాల్లో కనిపించడం లేదనే భావన చాలామందిలో వ్యక్తమవుతోంది.

ఒకప్పుడు అమ్మ తన కొడుకుకి రాసిన ఉత్తరాలు. తండ్రి తన కూతురి మార్కుల మెమోపై పెట్టిన సంతకాలు. ప్రేమికుల మధ్య రాయబారిగా మారిన  ప్రేమలేఖలు. ఇవన్నీ కేవలం అక్షరాల సమాహారం మాత్రమే కాదు, మనుషుల భావోద్వేగాలకు ప్రతిబింబాలుగా నిలిచిన సజీవ జ్ఞాపకాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం పూర్తిగా మారిందనడంలో అతిశయోక్తిలేదు. చేతిలో పెన్ను కనిపించాల్సిన చోట మొబైల్ కనిపిస్తోంది. కాగితం మీద అక్షరాలు రాయాల్సిన చోట, స్క్రీన్‌లపై టైపింగ్ శబ్దాలు వినిపిస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు మన జీవితాల్లో వేగాన్ని పెంచాయి కానీ, చేతిరాత అనే కళను మెల్లగా అంతరించిపోయే దిశగా నెట్టేస్తున్నాయి. ప్రతి అక్షరంలో ఉండే భావోద్వేగం ఇవన్నీ క్రమంగా జ్ఞాపకాల పుటల్లోకి జారిపోతున్నాయి.

ఒకప్పుడు పోస్ట్ మాన్ కోసం ఎదురు చూసే రోజులుండేవి. ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాన్ని పదే పదే చదివి, ప్రతి అక్షరంలో ఆప్యాయతను వెతుక్కుంటూ కన్నీళ్లు పెట్టుకునే భావోద్వేగ క్షణాలు ఉండేవి. కానీ ఇప్పుడు వాట్సాప్‌ ఎమోజీలతోనే భావాలను వ్యక్తపరిచే స్థితికి మనం చేరుకున్నాం.

అక్షరాల్లో ఉండే ఆత్మీయతను, చేతిరాతలో దాగి ఉండే ప్రేమను టచ్‌స్క్రీన్‌లు పూర్తిగా భర్తీ చేయలేకపోతున్నాయనేదే నా బాధ. ఒకప్పుడు అక్షరాలతో ఆడుకున్న బాల్యం, ఇప్పుడు కంప్యూటర్లతో కుస్తీ పడుతుంది. పెన్ను పట్టి అక్షరాలు రాయాల్సిన చిట్టి చేతులు, మొబైల్‌ స్క్రీన్‌లపై వేళ్లు నాట్యం చేస్తున్నాయి. సాంకేతికత సౌకర్యాలను పెంచినా, మనసులను తాకే చేతిరాత మాధుర్యాన్ని మాత్రం క్రమంగా మన జీవితం నుంచి దూరం చేస్తుంది.

ఒకప్పుడు చేతిరాతలో వచ్చిన ఉత్తరాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా, మనుషుల భావోద్వేగాలను మోసుకొచ్చేవి. అప్పట్లో మరణవార్త , దూర ప్రాంతాల్లో ఉన్న తమవారికి ఆ విషాద వార్తను ఉత్తరాల ద్వారానే తెలియజేసేవారు. ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు, అక్షరాల్లో ఉన్న బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని అక్షరాలు మనసును ఓదార్చేవి, మరికొన్ని అక్షరాలు గుండెను బరువెక్కించేవి. అంటే చేతిరాతకు మనిషి హృదయాన్ని కదిలించే అపారమైన భావోద్వేగ శక్తి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాగే ఒకప్పుడు విదేశాల్లో లేదా దూర పట్టణాల్లో చదువుకునే పిల్లలకు తల్లిదండ్రులు రాసిన ఉత్తరాలు ఇంటి ప్రేమను గుర్తు చేసేవి. “బాగా చదువు బిడ్డా… ఆరోగ్యం జాగ్రత్త” అని అమ్మ రాసిన ఒక్క వాక్యం చాలు, ఎంత దూరంలో ఉన్నా ఇంటి ఆప్యాయతను దగ్గర చేసేది. ప్రేమలేఖల్లో ప్రతి అక్షరం ఒక అనుభూతిలా ఉండేది. కొందరు ఆ ఉత్తరాలను సంవత్సరాల పాటు దాచుకుని, జీవితాంతం జ్ఞాపకాలుగా చూసుకునేవారు.

పండుగల సందర్భాల్లో బంధువులకు శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన ఉత్తరాలు కుటుంబ బంధాలను మరింత బలపరచేవి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పుడు గురువులు చేతిరాతలో రాసిన అభినందనలు విద్యార్థులకు జీవితాంతం ప్రేరణగా నిలిచేవి. చేతిరాతలో మనిషి స్వభావం, ఆలోచన, ఆప్యాయత కనిపించేవి. అందుకే పాత ఉత్తరాలను చదివితే, ఆ మనుషులు మన ముందే నిలబడి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది.

కానీ నేడు టెక్నాలజీ వేగంలో ఆ భావోద్వేగ జ్ఞాపకాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. క్షణాల్లో మెసేజ్‌లు చేరుతున్నా, చేతిరాతలో ఉండే హృదయస్పర్శ మాత్రం కనిపించడం లేదు. అందుకే చేతిరాత జ్ఞాపకాలు ఎప్పటికీ మన జీవితాల్లో చెరగని భావోద్వేగ ముద్రలుగానే మిగిలిపోతాయి.

ఇప్పటి పిల్లల్లో చాలామందికి తెలుగు అక్షరాలు సరిగా రాయడం కూడా కష్టమైపోతోంది. పరీక్షలు తప్పితే పెన్ను పట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. డిజిటల్ యుగం మనిషిని తెలివిగా మార్చిందేమో గానీ, అక్షరాల పట్ల ప్రేమను మాత్రం తగ్గించింది.

ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి అతని మాటలు, ప్రవర్తన, ఆలోచనలు మాత్రమే కాదు, అతని చేతిరాత కూడా అంచనా వేయడానికి పనిచేస్తుందని చాలామంది నమ్ముతారు. ఒకప్పుడు ఉత్తరాలు, డైరీలు, నోట్స్ ద్వారా మనుషుల భావోద్వేగాలు బయటపడేవి. ఎవరి చేతిరాత చూసినా వారి మనస్తత్వం గురించి కొంత అంచనా వేసే ప్రయత్నం చేసేవారు. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చిన అధ్యయన విధానమే “గ్రాఫాలజీ”.

అరచేతి గీతల ఆధారంగా ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు చెప్పేదాన్ని “హస్తసాముద్రికం” లేదా  “జాతకం” అంటారు. కానీ చేతిరాత ఆధారంగా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించే విధానాన్ని “గ్రాఫాలజీ” అంటారు. “గ్రాఫాలజీ” ఒక వ్యక్తి యొక్క ఆలోచనా తీరు, భావోద్వేగ స్థితి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఒత్తిడి వంటి అంశాలను అంచనా వేయడానికి ఉపయోగించే శాస్త్రం.

అయితే కొంతమంది మేధావుల చేతిరాత మాత్రం ఎంతో అందంగా, క్రమబద్ధంగా ఉండేది.

చేతిరాత అంతరించిపోవడం అంటే కేవలం ఒక అలవాటు పోవడం కాదు…
మన సంస్కృతిలోని ఓ భావోద్వేగ అధ్యాయం మాయమవడం.
రేపటి తరాలు “ఉత్తరం” అంటే ఏమిటో, “చేతిరాతలో ప్రేమ” అంటే ఏమిటో పుస్తకాలలో మాత్రమే చదివే పరిస్థితి రావొచ్చు.

అందుకే ఇంకా ఆలస్యం కాకముందే పిల్లలకు చేతిరాత విలువను నేర్పాలి.
రోజుకు కొన్ని అక్షరాలైన స్వయంగా రాసే అలవాటు పెంచాలి.

పైన కనిపిస్తున్న ఈ చిత్రం నిజంగా ఒక విచిత్రమే… కానీ ఆ విచిత్రంలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. ఆయనొక పోలీస్ అధికారి. పేరు శ్రీహరి. కానీ ఆయనను కేవలం పోలీస్ అని చెప్పడం సరిపోదు… ఆయన అక్షరాలను ఆరాధించే అక్షర పిపాసి.

ఆయన ఎక్కడికి వెళ్లినా చేతిలో ఒక డైరీ, ఒక పెన్ తప్పనిసరిగా కనిపిస్తాయి. పోలీస్ అధికారిగా గన్ లేకపోయినా పని సాగుతుందేమో గానీ, పెన్ మాత్రం ఆయన చేతిలో ఉండాల్సిందే. అందుకే ఆయనను “అక్షర ప్రేమికుడు” అని పిలవడం అతిశయోక్తి కాదు.

ఒకప్పుడు పెద్దలు ఒక సామెత చెప్పేవారు “అక్షరాన్ని నమ్ముకున్నోడు చరిత్రలో ఎప్పుడూ చెడిపోలేదు” అని. ఈ చిత్రాన్ని చూసిన తరువాత ఆ సామెత అక్షర సత్యంలా అనిపిస్తుంది.

ఆయన ఏ కార్యక్రమానికి వెళ్లినా, ఒక కఠినమైన పోలీస్ అధికారిలా కాకుండా, కాలేజీకి ఉత్సాహంగా వెళ్లే విద్యార్థిలా కనిపించడం ఆయనలోని ప్రత్యేక ఆకర్షణ. సమావేశాల్లో ఎవరైనా మాట్లాడితే, వారి మాటలను ఎంతో శ్రద్ధగా వింటారు. కానీ శ్రీహరి వినడానికే పరిమితం కారు. ప్రతి మంచి ఆలోచనను, ప్రేరణనిచ్చే మాటను తన డైరీలో నోట్ చేసుకుంటారు. అదే ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనం  నేర్చుకోవాలనే తపన ఎప్పుడూ తగ్గకుండా ఉండటం.

ఈరోజుల్లో చేతిరాత రాయడం చాలామందికి బద్దకంగా మారిపోయింది. మొబైల్‌లో టైప్ చేయడం అలవాటైపోయిన ఈ డిజిటల్ కాలంలో, ఇంకా పెన్నుతో అక్షరాలను ప్రేమగా కాపాడుకుంటూ రాయడం నిజంగా గొప్ప సంస్కారం. ఎందుకంటే చేతిరాత అనేది కేవలం అక్షరాల సమాహారం కాదు… అది మనిషి ఆలోచనలకు ప్రతిబింబం, మనసులోని భావాలకు అద్దం, జ్ఞాపకాలకు శాశ్వత నిల్వ, వ్యక్తిత్వానికి ఓ ప్రత్యేక గుర్తు.

శ్రీహరి లాంటి వారు సమాజానికి ఒక మౌన సందేశం ఇస్తున్నారు —
“టెక్నాలజీ ఎంత ఎదిగినా, అక్షరాల ఆత్మను మాత్రం కోల్పోవద్దు” అని.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

సంపద కన్నా… సంస్కారం గొప్పది.

  సంపద కన్నా… సంస్కారం గొప్పది. మనిషి జీవితంలో కొన్ని వృత్తులు కేవలం జీవనోపాధి కోసం చేసేవి కావు. అవి ఇతరుల జీవితాలపై బాధ్యతను మోసేవి. అలాంటి...