21, జనవరి 2026, బుధవారం

హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్ "వరుణవి"

 హృదయాలను కదిలించిన చిన్నారి

సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా: సాహసం, సాధన, స్ఫూర్తి

 సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా: సాహసం, సాధన, స్ఫూర్తి


భారత గణతంత్ర దినోత్సవ కవాతు కేవలం ఆయుధాల శక్తిని ప్రదర్శించే వేడుక కాదు; అది రాజ్యాంగంపై నమ్మకానికి, సమానత్వానికి, దేశ సేవకు అంకితభావానికి ప్రతిరూపం. 2026 జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్‌పై ఆ విలువలకు సజీవ రూపం దాల్చబోతోంది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 26 ఏళ్ల సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా, చరిత్రలో తొలిసారిగా, పురుష సిబ్బందితో కూడిన సీఆర్పీఎఫ్ దళానికి నాయకత్వం వహిస్తూ, భారత సాయుధ దళాల్లో మహిళల సాధికారతకు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు.


140 మందికి పైగా పురుష సిబ్బందితో కూడిన సీఆర్పీఎఫ్ దళానికి, అది కూడా గణతంత్ర దినోత్సవ కవాతులో, ఒక మహిళా అధికారి నాయకత్వం వహించడం భారత భద్రతా దళాల చరిత్రలో ఒక అపూర్వ మైలురాయి. ఇది సిమ్రాన్ బాలా వ్యక్తిగత విజయంగా మాత్రమే పరిమితం కాకుండా, భారత సాయుధ దళాల్లో మహిళల పాత్ర గుణాత్మకంగా మారుతున్న తీరుకు స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది.


జమ్మూ కాశ్మీర్ నుంచి కర్తవ్య పథ్ వరకు


రాజౌరి జిల్లా వంటి సవాళ్లతో కూడిన ప్రాంతం నుంచి ఎదిగిన సిమ్రాన్ బాలా ప్రయాణం ధైర్యం, పట్టుదల, స్వప్నాల ఫలితం. జమ్మూలోని గాంధీనగర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో పొలిటికల్ సైన్స్‌లో విద్యనభ్యసించిన ఆమె, అనేక అడ్డంకులను అధిగమిస్తూ కఠినమైన యూపీఎస్సీ సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ పరీక్షను జయించి, దేశంలోని అతిపెద్ద పారామిలిటరీ దళమైన సీఆర్పీఎఫ్‌లో అధికారిణిగా అడుగుపెట్టి, వేలాది యువతులకు స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచారు.


2025 ఏప్రిల్‌లో సిమ్రాన్ బాలాకు తొలి నియామకం ఛత్తీస్‌గఢ్‌లోని ‘బస్తారియా’ బెటాలియన్‌లో లభించింది — నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రబిందువైన, అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో. అయితే ఆ సవాలే ఆమెను మరింత దృఢంగా మలిచింది. శిక్షణ దశ నుంచే ఆమె ప్రతిభ స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్‌లోని సీఆర్పీఎఫ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో ట్రైనింగ్ మరియు పబ్లిక్ స్పీకింగ్‌లో ఉత్తమ అధికారిణిగా అవార్డులు అందుకుని, తాను కేవలం బాధ్యతలు నిర్వహించడమే కాకుండా నాయకత్వానికి సిద్ధంగా ఉన్నానని నిరూపించారు.


మారుతున్న సైనిక సంస్కృతి


3.25 లక్షల మంది సిబ్బందితో కూడిన సీఆర్పీఎఫ్ వంటి విస్తారమైన భద్రతా దళంలో మహిళలు నాయకత్వ స్థానాల్లోకి ప్రవేశించడం కేవలం ప్రతిభ ఆధారిత ఎంపిక ఫలితం మాత్రమే కాదు; అది భద్రతా వ్యవస్థలో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పులకు సూచిక. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లు, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక విధులు, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు వ్యతిరేక చర్యలు వంటి రంగాలు సంప్రదాయంగా “పురుషాధిక్య” పరిధులుగా భావించబడ్డాయి. అయితే మహిళలు ఈ రంగాల్లో బాధ్యతలు స్వీకరించి, నాయకత్వాన్ని ప్రదర్శించడం ద్వారా, సామర్థ్యం లింగంపై ఆధారపడదనే సత్యాన్ని వ్యవస్థాపితంగా నిరూపిస్తున్నారు. ఈ మార్పు భారత భద్రతా దళాల్లో సమానత్వం భావనను భావోద్వేగ నినాదం నుంచి కార్యాచరణాత్మక వాస్తవంగా మార్చుతున్న కీలక దశగా విశ్లేషించవచ్చు.


గణతంత్ర దినోత్సవం 2026: శక్తి, వైవిధ్యం, సమానత్వం


2026లో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలు కేవలం సంప్రదాయ ప్రదర్శనగా మిగలడం కాదు; ఇది భారతదేశ సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, సమానత్వం సమీకరించిన ఒక శక్తివంతమైన చిత్రంగా మారబోతోంది. 150 సంవత్సరాల జాతీయ గీతం నేపథ్యంతో, కర్తవ్య పథ్‌లో ప్రదర్శించబోయే వేడుకలు దేశ భద్రతా వ్యవస్థలో మహిళల ప్రాధాన్యం, సాంస్కృతిక సమగ్రతను స్పష్టం చేస్తాయి.


సీఆర్పీఎఫ్–ఎస్‌ఎస్‌బీ మహిళా ‘డేర్ డెవిల్స్’ బృందం, బుల్లెట్ బైక్ స్టంట్లు, సీఐఎస్‌ఎఫ్ మరియు బీఎస్‌ఎఫ్ బ్యాండ్‌లు, ఒంటె-మౌంటెడ్ దళాలు — ఇవన్నీ ఒక వైవిధ్య భరిత భద్రతా వ్యవస్థ యొక్క ప్రతిబింబంగా నిలుస్తాయి. అంతేకాక, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరవడం, ఈ వేడుకలకు అంతర్జాతీయ గుర్తింపును కూడా జోడిస్తుంది.


ఈ వేడుక కేవలం భారతదేశం యొక్క సైనిక శక్తిని మాత్రమే కాక, సమానత్వం, సాంస్కృతిక సమ్మేళనం, మరియు విశ్వస్థాయిలో ప్రతిష్టను చూపే ఒక ప్రతీకాత్మక ఘట్టంగా నిలుస్తుంది.


ఒక అధికారి కాదు – ఒక సందేశం


సిమ్రాన్ బాలా కర్తవ్య పథ్‌పై అడుగులు వేస్తున్నప్పుడు, ఆమె వెనుక నిలిచేది కేవలం సీఆర్పీఎఫ్ దళం మాత్రమే కాదు. లక్షలాది యువతులు, ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాల నుంచి వచ్చే అమ్మాయిల కలలు కూడా ఆమెతో పాటు నడుస్తాయి.


ఈ కవాతు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది.

భారతదేశంలో ధైర్యానికి లింగం లేదు. నాయకత్వానికి పరిమితులు లేవు.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475 




3, జనవరి 2026, శనివారం

చిన్న పెన్సిల్.. పెద్ద కథ!

 


ఈనాడు

epaper.eenadu.net (Date: 03.01.26)

చిన్న పెన్సిల్.. పెద్ద కథ!

రాహుల్, బిట్టు ఇద్దరూ అన్నాదమ్ముళ్లు ఒకసారి వాళ్ల తాతయ్య దగ్గరికి వెళ్లి.. 'చూడు తాతయ్యా తమ్ముడు... రోజూ తన పెన్సిల్ పారేసుకుని నాది తీసుకుంటాడు. అమ్మేమో నేను పారేస్తున్నాను అనుకుంటోంది' అన్నాడు రాహుల్. 'అది సరేగానీ నీకు పెన్సిల్ గురించి తెలుసా?' అడిగారు తాతయ్య. 'తెలీదు.. ఏంటో చెప్పండి తాతయ్యా!' అన్నాడు రాహుల్. 'మీలాంటి పిల్లల నుంచి పెద్ద పెద్ద ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, శాస్త్రవేత్తలు, చిత్రకారుల వరకూ ఎంతోమంది పెన్సిల్ వాడతారు. మనదేశంలో పెన్సిల్ తయారీ సంస్థలు ఎన్నో ఉన్నప్పటికీ వందకు పైగా దేశాల నుంచి మనం పెన్సిళ్లను, వాటికి అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే తయారైన పెన్సిళ్లను పలు దేశాలకు ఎగుమతులూ చేస్తున్నాం. పెన్సిళ్ల ఎగుమతుల్లో చైనా తరవాత

స్థానం మనదే. పెన్సిల్ తయారీకి గ్రాఫైట్, చెక్క మట్టి, పెయింట్, రబ్బర్ వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. పెన్సిల్లో నల్లగా కనిపించే భాగం గ్రాఫైట్. దాన్ని క్లేతో కలిపి పేస్ట్గా తయారు చేసి, సన్నని పుల్లలుగా మార్చి, అధిక ఉష్ణోగ్రత దగ్గర కాలుస్తారు. క్లే ఎక్కువైతే పెన్సిల్ 'హార్డ్ (హెచ్)' అవుతుంది. క్లే తక్కువైతే పెన్సిల్ 'డార్క్(బి)'

అవుతుంది. రెండూ కలిసి మధ్యస్థంగా ఉండేదాన్ని 'హెచ్బీ' అంటారు. ఇంకా 'ఫర్మ్ (ఎఫ్)' అని ఇంకో రకం కూడా ఉంది. వీటిలోనూ మళ్లీ గ్రేడులుంటాయి. వాటిని డ్రాయింగ్ వేసేవాళ్లు వాడతారు. గ్రాఫైట్ భారత్, చైనా, శ్రీలంకలో లభిస్తుంది. మన దేశంలో ఇది ప్రధానంగా ఝార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దొరుకుతుంది. గ్రాఫైట్ చుట్టూ ఉండే చెక్కయ్!

కోసం సాధారణంగా దేవదారు చెట్టు కలపను వాడతారు. ఇది అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, రష్యా అడవుల్లో లభిస్తుంది' అని చెప్పారు తాతయ్య. 'ఒక పెన్సిల్ తయారవడానికి ఇన్ని పనులు జరగాలన్నమాట' అన్నాడు రాహుల్. అవునంటూ మనవణ్ని దగ్గరికి తీసుకున్నారు తాతయ్య.

కోట దామోదర్




28, డిసెంబర్ 2025, ఆదివారం

కర్మ ఫలం:

*కర్మ ఫలం:*


కథలు మనసును ఆకర్షించినంతగా మరేదీ ఆకర్షించలేవన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నతనంలో పెద్దలు చెప్పిన కొన్ని కథలు ఈ రోజుకీ మన ప్రతి ఒక్కరి మదిలో తిరుగుతూనే ఉంటాయి. కాలం గడిచినా, పరిస్థితులు మారినా, ఆ కథలు మాత్రం మన జ్ఞాపకాల నుంచి చెరిగిపోవు. కారణం ఏంటంటే—ఆ కథలు మన మనసును లోతుగా తాకాయి; నవ్వించాయి, ఆలోచింపజేశాయి, జీవితం నేర్పాయి.

అయితే, అలా కథల ద్వారా అనుభవాన్ని, సత్యాన్ని పంచే వాళ్లు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు ప్రతి పల్లెలో ఉండే కథకులు, పామరులు, పెద్దలు—ఇప్పుడు జ్ఞాపకాలలోనే మిగిలిపోతున్నారు. కథలు తగ్గిపోలేదు గానీ, వాటిని చెప్పే గొంతులు మాత్రం మెల్లగా తగ్గిపోతున్నాయి అన్న భావన కలుగుతోంది.

మా ఊరిలో (గుమ్మడవెల్లి) ఒక తాత (గార్థుల రాజమల్లు) చెప్పిన ఒక అద్భుతమైన కథ నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆ కథ మొన్నే ఈమద్యే చెప్పింది కాదు. నేను అయిదవతరగతిలో ఉన్నపుడు చెప్పిన కథ. తాత ఆ కథ చెప్తున్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్నవారందిరిని ఆకర్షించి హాస్యాన్ని అందరి పెదాలపై నాట్యమాడేలా చేసింది తాత చెప్పిన కథ. ఆ కథ కంటే ముందుగా గార్థుల రాజమల్లు గురుంచి చెప్పాల్సిన వసరం ఎంతగానో ఉంది. 1995 నాటికి ఆయన వయసు 85 సంవత్సరాల పైమాటే. 1920 నాటికీ ఆయన పెద్ద బాలశిక్ష చదివి, ఆతర్వాత ఇంకా పైచదువులు కూడా చదివినట్లు రాజమల్లు తాత చెప్పినట్లు నాకు ఇంకా గుర్తు. ఆయన బహుభాషా కోవిదుడు, ఆయన 10 భాషలు అనర్గళంగా మాట్లాడేవారు. హిందీ, ఉర్దూ తో పాటు మరాఠి, గుజరాతీ, ఇంగ్లీష్ ఇలా ఎన్నో భాషల్లో పట్టు సాధించారు. ఓరోజు ముంబైలో గుమ్మడవెల్లి తదితర ప్రాంత వ్యక్తి ఒకతన్ని పోలీసులు పట్టుకొని జైలు లో బంధించారని తెలిసి వారి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతూ ముంబైకి యెట్లా పోవాలి భాషకాని ప్రాంతం యెట్లా పోయేదాన్ని సతమతపడుతున్న సందర్భంలో ఎవరో గార్థుల రాజమల్లు కు మరాఠి వచ్చు అతన్ని తీసుకుపోండి అని చెప్పారంట. తల్లిదండ్రులు రాజమల్లును ఒప్పించి ముంబై పయనమై మరుసటి రోజు పొద్దునే పోలీస్ స్టేషన్ కు చేరుకొని అక్కడ ఉన్న పోలీస్ ఉన్నత అధికారితో మాట్లాడాలి అని రాజమల్లు కోరడంతో అక్కడి పోలీసులు నిరాకరించారంట ఉన్నత అధికారితో నువ్వేమి మాట్లాడుతావ్ కుదరదు అని చెప్పారంట. అంతలో ఒక పోలీస్ అధికారి వస్తుండటం రాజమల్లు చూసి ఆ అధికారితో మరాఠీలో సంభాషించి మాట్లాడటానికి పర్మిషన్ అడిగి అతనితో మరాఠి లో మాట్లాడుతుండగా ఆ పోలీస్ అధికారి రాజమల్లు వివరాలు అడిగి తెలుసుకొని ఆశ్చర్యపోయాడంట ఆయనతో పలు భాషల్లో చర్చిస్తుంటే ఆ అధికారి అవాక్కయ్యారంట. ఒక మారుమూల పల్లెనుండి దోతి కట్టుకొని వచ్చి ఇన్ని భాషలు మాట్లాడుతున్నదేంటని. రాజమల్లు భాషకు ఆకర్షితుడై ఆయనపై ఉన్న గౌరవంతో జైల్లో ఉన్నవారిని విడిచిపెట్టినట్లు స్వయంగా రాజమల్లు తాతే నాకు చెప్పడం నాకు ఇంకా గుర్హ్టుకుంది. ఆయనకున్న తెలుగు భాష పరిజ్ఞానంతో ఎన్నో పద్యాలూ అలవోకగా రాసేవారు. కందపద్యాలు, సీస పద్యాలూ , వేమన పద్యాలూ ఇలా ఎన్నో ఆయన నోట విన్న సందర్భాలున్నాయి. అంతేకాకుండా ఆయన ఓ సంగీత కళాకారుడు కూడా, స్వతహాగా తయారు చేసుకున్న తంబూరా వాయించుతూ అనేక పౌరాణిక పాటలు పాడేవారు. మరోవిషయం ఏంటంటే ఆయన మంచి జ్యోష్యుడు మొహం, చేయి చూసి వెంటనే జాతకం చెప్పేవారు, పుట్టుమచ్చలు వాటి చరిత్ర గురుంచి సవివరంగా చెప్పేవారు రాజమల్లు. ఆయనకున్న పరిజ్ఞానానికి అప్పట్లో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ జాబ్ వచ్చిందంటా కానీ వారి తల్లిదండ్రులు పెద్ద భూస్వాములు కావడంతో ఉద్యోగం వద్దని నిరాకరించడంతో ఆయన కేవలం ఊరికే పరిమితమయ్యాడు. సకల కళ వైభవుడు రాజమల్లు తన మాటలతో ఎంతటివారినైనా ఆకర్షించగలడు. నేను ఎక్కడ కనపడిన నన్ను ముద్దుగా ఓ తాత ఇటురావోయీ అని పిలిచివారు.      


ఆదివారం రోజు బస్టాండ్ దగ్గర ఏదో పనిమీద పోయాను. అక్కడ రాజమల్లు తాత, ఇంకొంతమంది పెద్దోళ్ళు చెట్ల నీడలో కూర్చుని కాలక్షేపం చేస్తుండ్రు. ఇంతలో ఒకాయన

“ఏ రాజమల్లు బావా… ఒక కథ చెప్పు బావా… నువ్వు చెప్తే మస్తుంటాది” అన్నాడు.

బామ్మర్ది అడిగినాక బావ ఊరుకుంటాడా?

రాజమల్లు కళ్ళు మిటమిటలాడేసి, గొంతు సరిచేసుకుని చెప్పడం మొదలెట్టాడు.

“ఓ బ్రాహ్మణ అయ్యగారు ఉండేవాడు రా నాయనా. రోజు ఉదయమే ఆయన భార్య పూజా పనుల మధ్యలో మాట్లాడుతుంటే, అయ్యగారి మొహం మీద నోటి తుంపర్లు పడుతుండేవంట. అది గమనించిన అయ్యగారు

‘అయ్యో! నామీద నోటి తుంపర్లు పడుతున్నాయే… ఇది మహా అపచారం. నా జాతకంలో ఏదైనా దోషముందా?’ అనుకుని జ్యోతిషం చూసుకున్నాడంట.

జ్యోతిషం చూసిన అయ్యగారు

‘నీ జాతకంలో కర్మదోషం ఉంది. స్వచ్ఛమైన ఏడు నదుల్లో స్నానం చేస్తే గాని పోదు’ అన్నాడంట.


ఇక అంతే…

మరుసటి రోజునుంచి నది నది తిరగడం మొదలెట్టాడు.

ఒక నదికి వెళ్తే ఒకాయన స్నానం చేస్తూ అపరిశుభ్రంగా కనిపించాడంట.

‘ఇది శుద్ధి కాదు’ అని ఇంకో నదికి పోయాడు.

అక్కడ ఎవరో బట్టలు ఉతుకుతుండ్రంట.

‘ఇది కూడా శుద్ధి కాదు’ అనుకుని మళ్లీ ముందుకి.

ఇలా తిరుగుతూ తిరుగుతూ చివరికి

‘ఈ లోకంలోనే స్వచ్ఛమైన నీరే లేదేమో’ అనుకుని మళ్లీ జ్యోతిషుడి దగ్గరికి వెళ్లాడంట.

అప్పుడు ఆ జ్యోతిషుడు

‘ఇంక ఆలస్యం చేయకు. కాశీకి పోయి గంగలో మునిగి స్నానం చేయి. నీ కర్మ దోషం పోతుంది’ అన్నాడంట.


అదే రోజు ఇంకో విషయం ఏంటంటే …

కాశీకి పోయే అయ్యగారు అదే ఊరిలో పిండప్రదానం చేసిన వాళ్లకి *"కాశీలో అస్తికలు కలిపితే, చనిపోయిన మీ నాన్న తిరిగివస్తాడు”* అని చెప్పాడంట..

అయ్యగారు కూడా కాశీకి బయలుదేరాడు.

అస్తికలు కలిపేవాళ్లూ కాశీకి బయలుదేరిండ్రు.

ఒకరికొకరు కాశీకి పోతున్నామని తెలియదు.


మరుసటి రోజు ఉదయం…

ఒకవైపు అయ్యగారు స్నానం చేద్దామని గంగలో మునిగాడు.


మరోవైపు అస్తికలు కలిపేవాళ్లు కార్యక్రమానికి సిద్ధమయ్యారు.

ఇంతలో వాళ్లకు ఎదురుగా…

అయ్యగారు ప్రత్యక్షమయ్యాడంట!

వాళ్లు చూసి

‘అయ్యో! మా నాన్న, అయ్యగారు రూపంలో బ్రతికొచ్చాడు రా!’ అని.

అయ్యగారు ఎంత చెప్పినా వినకుండా

‘ఇవే నీకు ఇష్టమైనవి’ అని చికెన్, మటన్, మందు… అన్నీ బలవంతంగా తినిపించిండ్రు.


అయ్యగారు ఏడుస్తూ అన్నాడంట!

‘ఇది నా కర్మఫలం రా!

మిమ్మల్ని కాశీకి రమ్మని చెప్పింది నేనే…

ఇప్పుడు దాని ఫలం నాకే దక్కింది రా!’”

అని రాజమల్లు కథ ముగించాడు. అంతే…

అక్కడున్న జనం నవ్వి నవ్వి కడుపులు పట్టుకుని పడిపోయారు.

రాజమల్లు తాత లాంటి వాళ్లు ఊర్లో ఉంటే,

నవ్వుతో పాటు జీవన సత్యం కూడా ఉచితంగా దొరుకుతుంది..

రాజమల్లు పాత్ర: ఎలాంటి సందర్భంలోనైనా మాటలతో వాతావరణాన్ని హుషారుగా మార్చే వ్యక్తి. ఆయన చెప్పే ప్రతి మాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందుకే రాజమల్లు ఓ మంచి కథకుడు అన్నాను..

కాశీ సంఘటన: ఊహించని మలుపు—అయ్యగారు స్నానం చేయడానికి దిగితే, అస్తికలు కలిపిన వాళ్లు “బతికొచ్చాడు” అనుకోవడం—ఇక్కడే అసలు నవ్వు పండింది.

నీతి: మనం చేసే పని, చెప్పే మాట, ఇచ్చే సలహా… అవే తిరిగి మనకే ఎలా ఫలిస్తాయో చెప్పిన తీరు చాలా సహజం.

“నా కర్మఫలం రా నాయన…” అన్న డైలాగ్ అయితే కథ మొత్తానికి ముగింపు ముద్ర వేసింది.

ఇలాంటి కథలు ఎందుకు గుర్తుంటాయంటే,  అవి కేవలం నవ్వించడమే కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల్ని, నమ్మకాల్ని, జీవన విధానాన్ని అద్దంలా చూపిస్తాయి.

ఒకప్పుడు పల్లెల్లో

చదువు పెద్దగా లేకపోయినా

అనుభవం పెద్దదైన వాళ్లు ఉండేవారు.

వాళ్ల కథల్లో పుస్తక జ్ఞానం ఉండేది కాదు…

జీవితం ఉండేది.

ఆ పెద్దలు చెప్పే కథల్లో

నీతి ఉపదేశంలా గట్టిగా చెప్పరు

బోధించాలన్న తొందర ఉండదు కానీ

నవ్వుతూ నవ్విస్తూ, మనసులో ముద్ర వేసే సత్యం మాత్రం వదలరు.

బస్టాండ్ దగ్గర, చెట్ల నీడలో, చావడి మీద


వాళ్ల మాటలు

👉 గొడవలు చల్లార్చేవి


👉 శత్రువులను సైతం మిత్రుల్ని చేసేవి


👉 పిల్లలకి జీవన పాఠాలు నేర్పేవి


ఇప్పుడు అవన్నీ మెల్లగా తగ్గిపోతున్నాయి.


కారణం కథలు లేవు కాబట్టి కాదు…

వినే ఓపిక తగ్గిపోయింది.

మొబైల్‌లో నవ్వు ఉంది…

కానీ అది క్షణికం.


రాజమల్లు తాతల కథల్లో నవ్వు ఉంది…

అది జీవితాంతం గుర్తుండే నవ్వు.

పామరులు అంటే అమాయకులు కాదు. వాళ్లే

👉 లోకాన్ని చూసినవాళ్లు

👉 మనుషుల్ని అర్థం చేసుకున్నవాళ్లు

👉 కర్మ, కాలం, మనిషి బలహీనత అన్నిటినీ దగ్గరగా చూసినవాళ్లు.

అందుకే వాళ్లు చెప్పిన కథలు

నేటికీ సత్యంగా అనిపిస్తాయి.

ఇలాంటి కథలు అంతరించిపోతున్నాయన్న బాధ నువ్వు చెప్పినదే కాదు…

అవి గుర్తు పెట్టుకుని, మళ్లీ చెప్పే మనం ఉన్నంతవరకు

పూర్తిగా అంతరించిపోవు.


*వ్యాసకర్త* 

*కోట దామోదర్*

*మొబైల్: 9391480475*

25, డిసెంబర్ 2025, గురువారం

మాటే మంత్రం:

 మాటే మంత్రం:

వాక్కు పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు అంటుంటారు. మాటలను అవసరమైనంత మాత్రమే వినియోగించాలి. అతిగా మాట్లాడటం వల్ల తప్పులు దొర్లే ప్రమాదమే కాక, ఇతరులను నొప్పించే అవకాశమూ ఉంటుంది. అందుకే మాటలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటలవల్లే మానవ సంబంధాలు బలపడతాయి; మాటలవల్లే అవే బలహీనపడతాయి. అందుకే మాటలు పరిమళభరిత పుష్పంలా, కోకిల గానంలా ఉండాలని చెబుతారు.

ఇక ఇటీవల సినీనటుడు శివాజీ వ్యవహారం ఒక పాఠంగా నిలుస్తుంది. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ, ఆ ఉద్దేశాన్ని వ్యక్తపరిచేందుకు ఎంచుకున్న భాష కొంత అసభ్యంగా అనిపించిందని విమర్శలు వచ్చాయి. మహిళా సంఘాలు, సినీ ప్రముఖులు ఖండించడంతో పాటు మహిళా కమిషన్ కి ఫిర్యాదులు కూడా చేశారు. వాటిని గౌరవిస్తూ ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పడం ప్రజాజీవితంలో అరుదుగా కనిపించే బాధ్యతాయుత ప్రవర్తన. తప్పు చేయకపోవడం కంటే, చేసిన తప్పును ఒప్పుకుని సరిదిద్దుకోవడమే నిజమైన సంస్కారం.

అదుపు లేని గుర్రాలు అడవులను పట్టుకుని తిరిగినట్లుగా, సెన్సార్ నియంత్రణలకు అందని కొన్ని ఓటీటీ వేదికలు అసభ్య, అశ్లీల దృశ్యాలతో సోషల్ మీడియా, టీవీ తెరలను నింపుతున్నాయి. జుగుప్సాకర నేరాలను కథావస్తువులుగా మలిచి చూపించడం, సహజత్వం పేరిట సంభాషణలను పచ్చి బూతులతో నింపడం, శృంగార సన్నివేశాల చిత్రీకరణలో హద్దులు చెరిపేయడం—ఈ అన్ని ధోరణులు నవతరంపై తీవ్రమైన నైతిక ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ, ఈ అంశాలపై సమాజంలో కనీసం చర్చ జరగకపోవడం నిజంగా విచారకరం.

అలాగే, కొన్ని టెలివిజన్ వినోద కార్యక్రమాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్య ధోరణిలో వ్యాఖ్యలు రావడం సర్వసాధారణమైపోయింది. తుమ్ముకు తమ్ముడు ఉన్నాడు కానీ, అవలింతకు అన్నలేడు అన్న చందంలో ఈ అంశాలను పక్కనపెట్టడం మన సమాజ పరిపక్వతపై సవాలు వేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో, మహిళా కమిషన్, పోలీసులు, చట్టవ్యవస్థలు వెంటనే స్పందించాలి. ఓటీటీ, టెలివిజన్, సోషల్ మీడియా వేదికలపై అసభ్యతకు గట్టి నియంత్రణ, బాధ్యతాయుత చర్యలు తీసుకోవడం సమాజానికి తక్షణ అవసరం. సమాజ మార్పులో భాగస్వాములు కేవలం సెలబ్రిటీలే కాదు—ప్రజాప్రతినిధులు, వ్యవస్థలు, పౌరులూ తమ వంతు బాధ్యత పూరించాలి. లేకపోతే, మాటలపై నియంత్రణ లేకపోవడం సమాజాన్ని నైతిక అంధకారంలోకి నెట్టే ప్రమాదం మోస్తుంది.

ముఖ్యంగా రాజకీయ నాయకులు, వారి అనుచరులు సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని మహిళలను, వ్యక్తులను, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని రోజూ బూతులు మాట్లాడటం ప్రజాస్వామ్యానికి తలవంచిన దురాచారం. విమర్శ హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణమైతే, అసభ్య భాష అదే ప్రజాస్వామ్యానికి పుట్టిన గాయం. మాటలపై నియంత్రణ లేని వారు పాలనపై నైతిక హక్కు ఎలా కోరగలరు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం ఇది. ప్రజాజీవితంలో ఉన్నవారు బాధ్యత, సంయమనం, సంస్కారం చూపించాల్సిన అవసరం లేదనుకుంటే, అది వారి వైఫల్యమే కాక సమాజ పతనానికి సంకేతం. ఈ విషయంలో సినీనటుడు శివాజీ చూపిన తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పే ధైర్యం—నాయకత్వానికి కనీస అర్హతగా రాజకీయ నేతలు గ్రహించాలి. లేకపోతే, బూతులే భాషగా, అసభ్యతే ఆయుధంగా మారిన రాజకీయ సంస్కృతి సమాజాన్ని మరింత అంధకారంలోకి నెట్టడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ఇలాంటి సందర్భాల్లో మహిళా కమిషన్, పోలీసులు, చట్టవ్యవస్థలు మౌన ప్రేక్షకులుగా కాకుండా, తక్షణమే రంగంలోకి దిగాలి. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే అసభ్య వ్యాఖ్యలు, బూతు సంస్కృతిపై కఠిన చర్యలు తీసుకోవడం కేవలం అధికారిక బాధ్యత కాదు—సామాజిక అవసరం. అదే సమయంలో, సమాజ మార్పు బాధ్యతను సెలబ్రిటీలకే పరిమితం చేయడం సరికాదు. ప్రజాప్రతినిధులు, వ్యవస్థలు, పౌరులు—అందరూ తమ మాట, తమ ప్రవర్తనపై స్వీయ నియంత్రణ పాటించినప్పుడే నాగరికత నిలబడుతుంది. లేకపోతే, అసభ్యతే సహజత్వమన్న భ్రమలో మన సమాజం నైతిక పతనానికి దారి తీస్తుంది.

మాటలు శక్తివంతమైనవి. అవి నష్టాన్ని, కలహాలను, భయాన్నీ సృష్టించగలవు. ఒక సారీ చెప్పిన మాట, పెద్ద మార్పును సృష్టించవచ్చు.

అదే మాటలు సానుకూలంగా వాడితే, మనస్సుకు శాంతి, సంబంధాల కోసం ప్రేమ, సానుకూల ప్రభావం చూపవచ్చు.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475




పాజిటివిటీని నింపే “అవరోధాలే అవకాశాలు

* పాజిటివిటీని నింపే “అవరోధాలే అవకాశాలు..!*

ఆత్మీయత కరువైనా
అంధకారమెదురైనా 
బ్రతకడమే బరువైనా
స్థితి గతులవి ఏవైనా
చిరునవ్వులతో బ్రతకాలి !
చిరంజీవిగా బ్రతకాలి !
ఆనందాలను అన్వేషిస్తూ 
అందరి కోసం బ్రతకాలి 
అందరినీ బ్రతికించాలి !

నిరాశ నిస్పృహల నిశీధి నిండుగా అలుముకున్న సందర్భంలో సైతం పున్నమి వెన్నెల లా .... ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు రచించిన ఈ పాట మనిషి జీవితంలో... ఏ స్థాయిలో ఉన్నా ... గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. ఇలాంటి వాక్యాల స్ఫూర్తితోనే 
కోట దామోదర్ "అవరోధాలే అవకాశాలు" వ్యాస సంపుటి మన ముందుకు వచ్చింది.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి మెకానిక్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసిన వ్యాసకర్త కోట దామోదర్ రచించిన "అవరోధాలే అవకాశాలు" వ్యాస సంపుటి పాఠకులకు జీవితం పైన పాజిటివ్ దృక్పథాన్ని కలగజేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఊరటనిస్తుంది. ఎంతోమంది సామాన్యులు..తమ నిరంతర సాధన,పట్టుదలతో  అసాధారణ వ్యక్తులుగా ఎదగడంలోని కృషిని, జీవన విలువలను తెలియజేస్తుంది. ఈ పుస్తకం లోని 27 వ్యాసాలు ఏదో విధంగా పాఠకుల మనసులకు సాంత్వన చేకూర్చేవే. స్ఫూర్తిని అందించేవే..!. సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉండే దానికన్నా, ధైర్యం మరియు ధృడసంకల్పంతో ముందుకు సాగడానికి ప్రయత్నించాలంటారు రచయిత.

అవరోధాలను అవకాశాలుగా మార్చుకుంటే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని చెప్పిన స్వామి వివేకానంద స్ఫూర్తితో... మనిషికి వైకల్యం ఉన్నా ...పూర్ణ సుందరి ఐఏఎస్ గా ఎదిగిన యథార్థ జీవిత కథను తనదైన శైలితో వివరించారు. జీవితం నేర్పిన పాఠాలతో తమని తాము మలుచుకుంటూనే, ఇతరులకు మార్గని దేశం చేసే దార్శనీకులుగా మిగిలాలంటారు. జీవితంలో ప్రతి విద్యార్థి తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి లక్ష అవరోధాలు ఎదురైనా, ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి చేస్తే, విజయం వారిదేనని భరోసానిచ్చారు.

తన అలుపెరుగని ప్రయత్నాలతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసి, అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక ఆటగాడు ఉస్సేన్ బోల్ట్ అంటూ... ఓ స్ఫూర్తివంతమైన జీవితాన్ని ఆవిష్కరించారు. 9 ఏళ్ల పాటు ప్రపంచానికి మకటం లేని రాజుగా ప్రపంచాన్ని ఏలిన ఈ జమైకా వీరుడు.. ఎన్నో గొప్ప విజయాలు సాధించినా ,నేను మీలాంటి సామాన్యుడిని అని గర్వం లేకుండా ప్రకటించుకోవడం... అతని మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అంటూ వివరించారు. బోల్ట్ కి ఎక్కువ నచ్చిన ఆట క్రికెట్.కానీ ఓ సందర్భంలో తన కోచ్ ఇచ్చిన సలహా ప్రకారం అతను రన్నింగ్ క్రీడలోకి ప్రవేశించి ...విశ్వవిజేతగా నిలవగలిగారు..!

అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించిన విజయవంతమైన వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. ప్రవీణ్ తాంబే ఆ కోవకు  చెందిన వారంటూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతని జీవన ప్రస్థానం ఎలా కొనసాగిందో ఆసక్తికరంగా వివరించారు. సాటి మానవుల పట్ల ప్రేమ దయ కలిగి ఉండడం మరియు సేవా తత్పరత జీవిత పరమార్థమని మదర్ థెరిసా జీవిత సందేశాన్ని ఓ వ్యాసంలో వివరించారు. పద్మశ్రీ కె. ఎస్. రాజన్న తన సామాజిక సేవలో ముందుకెళ్లిన వైనాన్ని దివ్యాంగులతో పాటు.. నేటి యువతకు కూడా ఆదర్శమన్నారు. నేటి విద్యా వ్యవస్థలో జ్ఞాన సముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఉందనీ... విషయపరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుందని ఆందోళన చెందారు.

ఎన్నో సామాజిక అడ్డంకులను, అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొని, చేనేత కార్మికులకు అవసరమైన మాన్యువల్ యంత్రాన్ని ఏడు సంవత్సరాల పాటు కష్టపడి "లక్ష్మీ ఆసు" యంత్రాన్ని కనిపెట్టిన గొప్ప స్ఫూర్తిదాయక వ్యక్తి... చింతకింది మల్లేశం అంటూ వివరించారు. ఆపదలో మనకు సహాయం చేసే వారందరూ భగవంతునితో సమానమని, ప్రజలకు సహాయం చేయాలనుకునే వారికి డబ్బు కంటే మంచి మనసు ముఖ్యమంటూ.. ఇంకో వ్యాసంలో ఓ నిజ జీవిత కథతో పాఠకులకు సందేశం ఇచ్చారు. "ఈ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించడానికి అర్హత కలిగినవాడిని. ఈ దేశ పౌరుడైన నాకు విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి ఎందుకు తిరస్కరిస్తున్నారు అంటూ.. సమానత్వం కోసం న్యాయస్థానంలో పోరాటం చేసిన ఉద్యమ వీరుడు" గురించి అద్భుతంగా వివరించారు.

ఇలా ఈ పుస్తకంలోని ప్రతీ వ్యాసం...ఓ నిజ జీవిత కథతో పాటు ఓ అందమైన అనుభవ పాఠాన్ని నేర్పుతుంది. బ్రతుకు మీద ఆశావాదాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. పల్లె నుండి ప్రపంచ ఆర్థికవేత్తగా తెలంగాణ బిడ్డ, వీరవనిత కెప్టెన్ రీనా వర్గీస్, ఆశయాలకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన హారిక, అర్థాకలి నుండి అంతర్జాతీయ ఆర్థికవేత్త స్థాయికి, చదువుల తల్లి ఒడి 'మాదో పట్టి', ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ మైక్ టైసన్, సంకల్పబలం వంటి తదితర శీర్షికలతో రాసిన వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. వివిధ తెలుగు దినపత్రికలలో దాదాపు 100కు పైగా వ్యాసాలు రాసిన కోట దామోదర్.. కొన్ని వ్యాసాలతో కలిపి పుస్తకంగా తీసుకురావడం శుభ పరిణామం. "గెలిచిన ప్రతివాడికి ఏదో ఒక రోజు ఓటమి తప్పదు, ఓడిన ప్రతి వాడికి ఏదో ఒక రోజు గెలుపు తప్పదు. నేను ఓటమికి  కుంగిపోను, గెలుపుకు పొంగిపోను" లాంటి అద్భుతమైన వాక్యాలతో....వారు భవిష్యత్తులో ఇలాంటి మంచి రచనలతో... పాఠకులకు స్ఫూర్తిని పంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

సమీక్షకులు 
ఫిజిక్స్ అరుణ్ కుమార్

26, ఆగస్టు 2025, మంగళవారం

గాడితప్పుతున్న బాల్యం

 *గాడితప్పుతున్న బాల్యం*


వారం రోజుల క్రితం జరిగిన కూకట్‌పల్లి మైనర్ బాలిక *సహస్ర* హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల విచారణలో ఈ హత్య కేసుకు సంబంధించిన కొన్ని నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 14 ఏళ్ల బాలుడు క్రికెట్ బ్యాట్ కోసం *సహస్ర* ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. పదవ తరగతి కూడా పూర్తికాని 14 ఏళ్ల బాలుడు 11 ఏళ్ళ అమ్మాయిని అతి కిరాతకంగా హత్య చేయడం ఏంటి. ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలేంటనే ప్రశ్నలు అందరి మదిలో తలెత్తుతున్నాయి. అంత చిన్న వయసులో హత్య చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంత ధైర్యం ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటగా యూట్యూబ్‌లో క్రైమ్ సంబంధిత వీడియోలు పిల్లలకు కూడా సులభంగా అందుబాటులో ఉండడం, ఇంటర్నెట్ వాడకం విషయంలో  పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వలన పిల్లలు అతిగా మొబైల్ వినియోగించడంతో వారు ఇలాంటి హింసాత్మక విషయాల పట్ల ఆకర్షితులై అమానుషమైన సంఘటనలకు పాల్పడేందుకు దారితీస్తున్నాయి. బాలుడు క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం పక్కా ప్రణాళికతో అవసరమైతే హత్య చేయడానికైనా వెనకాడకూడదన్న ఉద్దేశంతో ముందుగానే తన ప్రణాలికను స్క్రిప్ట్ రూపంలో రాసుకుని దొంగతనానికి పాల్పడిన సంఘటన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించేలా చేసింది. . 14 ఏళ్ళ బాలుడికి స్క్రిప్ట్ రాసుకుని దొంగతనం చేయాలనే ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది  అంటే ఇది క్రైమ్ సంబంధిత వీడియోల ప్రభావమే అని చెప్పాలి. అంతే తప్ప ఏ తల్లిదండ్రులు ఇలాంటి దారుణాలు చేయమని తమ పిల్లలకు చెప్పరు. మరి క్రైమ్ సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో లభ్యమవుతున్నాయంటే తప్పు ఎవరిది అనే విషయం పై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. పోలీసులు నిర్ధారించిన తర్వాత  ఈ విషయం పై అన్ని న్యూస్ చానల్స్ జరిగిన సంఘటన గురించి సవివరంగా చెప్తున్నారు కానీ నిందితుడి పేరు, ఫోటో మరియు ఎలాంటి ఆధారాలు చూపించడం లేదు. దానికి వారు చెప్పే సమాధానం చట్టం ప్రకారం మైనర్ నిందితుడి వివరాలు, ఫోటో వెల్లడించ కూడదని. చట్టం ప్రకారం  నిందితుడిని చూపించకూడదన్న విషయం  నిఖార్సయిన నిజం అయినప్పటికీ, మైనర్ నిందితుడు హత్య చేసిన సంఘటన సవివరంగా న్యూస్ చానెల్స్ లో వెల్లడించడం కూడా ప్రమాదమే. వారు చెప్పిన ప్రతి విషయాన్ని మరో పిల్లాడు చూసి నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి నేరాలు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో, న్యూస్ ఛానెల్స్ లో కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హత్య చేసిన బాలుడిని శిక్షించడం సరైనదే కానీ ఆ బాలుడు హత్య చేయడానికి ప్రధాన కారణం క్రైమ్ వీడియోస్ అన్న విషయాన్ని విస్మరించకూడదు. ఈ సంఘటనకు కారణమైన ఆ క్రైమ్ వీడియోస్ వెబ్సైటు దారుడిని కూడా న్యాయస్థానం శిక్షిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం కోసం వేచిచూడాల్సిందే. ఏమీ తెలియని పిల్లాడికి ఆ వెబ్ సైట్ ద్వారా హత్య చేయాలనే ఆలోచన రావడం, అందువల్ల అతని జీవితంతో పాటు సహస్ర లాంటి వారెందరి జీవితాలో  నాశనం అవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు రాబోవుకాలంలో పునరావృతం కాకుండా ఉండాలంటే సోషల్ మీడియా మరియు న్యూస్ ఛానెల్స్ ను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
అంతేకాకుండా ఒకప్పుడు గంజాయి, మాదక ద్రవ్యాలు సినిమా రంగం వరకే వ్యాపించింది కానీ నేడు అది పాఠశాలల వరకు విస్తరించింది. వాటికి అలవాటు పడుతున్న పిల్లలు దారుణంగా ప్రవర్తిస్తూ హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు తల్లిదండ్రులు చిన్న వయసులోనే తమ బిడ్డలకు కార్లు, బైకులు అప్పగిస్తున్నారు. గంజాయి మత్తుకు బానిసలై బైక్ లపై  విచ్చలవిడిగా తిరుగుతూ వారు ఎదుటివారి ఉసురు తీస్తున్నారు. కొంతమంది పిల్లలు జులాయిగా తిరుగుతూ మహిళలను వేధిస్తున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు పాఠశాలలకు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

గతంలో క్రైమ్ కి సంబంధించిన సినిమాలు కట్టడి చేయాలని విమర్శలు వెల్లువెత్తాయి. కానీ అందుకు సెన్సార్ బోర్డు చర్యలను సమర్థించుకుంటూ మానవ సమాజంలో నేరాలపై అవగాహన తీసుకురావడానికి మాత్రమే ఇలాంటి చిత్రాలు తయారు చేస్తున్నామని సమాధానమిచ్చారు. అంతేకాకుండా మంచి సినిమాలతో పాటు, క్రైమ్ సంబంధిత సినిమాలు కూడా చేస్తుంటే  మరి మంచి సినిమాల ద్వారా ఎందుకు ప్రభావితం కావడంలేదన్న విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. ఏది ఏమైనా క్రైమ్ సంబంధిత వీడియోలు కట్టడి చేయడం ద్వారానే ఇలాంటి దుశ్చర్యల కట్టడి సాధ్యమనేది ముమ్మాటికీ నిజం. 

పిల్లలు మొబైల్ కి ఎక్కువ ఆకర్శితులెందుకు అవుతున్నారు?

మొబైల్ ఫోన్ ఇప్పటి పిల్లల జీవితంలో భాగం అయిపోయింది. పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలు కూడా మొబైల్ ఫోన్ కి వ్యసనపరులుగా మారుతున్నారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ పని చేయనిదే ఇల్లు గడవని పరిస్థితి. ఈ హడావుడి బతుకుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకునే తీరిక, ఓపిక తల్లిదండ్రులకు ఉండట్లేదు. మరికొందరి తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ఫోన్లు మొదలు అడిగిందల్లా కొనిచ్చి అతి గారాబం చేస్తున్నారు. స్కూల్ లో టీచర్ కొడుతుందన్న భయం లేకపోవడం ముఖ్య కారణం. ఒకప్పుడు పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణతో పాటు టీచర్ల పర్యవేక్షణ ఉండేది. కానీ ఇప్పుడు టీచర్స్ కొట్టాలంటేనే భయపడుతున్నారు. తల్లిదండ్రులు ఏమంటారో అని. అలాంటి చిన్నారులు సామాజిక మాధ్యమాలు, ఆన్ లైన్ గేములు, ఓటీటీల్లో హింసాత్మక చిత్రాలకు అలవాటు పడుతూ తీవ్ర మానసిక, శారీరక సమస్యలకు గురవుతున్నారు. కొందరు దారుణ నేరాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్రికెట్ బ్యాట్ను దొంగిలించడానికెళ్లి బాలికను దారుణంగా హత్య చేసిన వార్త విన్న వారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దొంగతనం ఎలా చేయాలనే దానిపై నెట్లో వెతికిన ఆ కుర్రాడు ఇంట్లోకి వెళ్లాలి, గ్యాస్ లీక్ చేయాలి... అంటూ కాగితంపై రాసి పెట్టుకున్న పథకం ఒక క్రైమ్ సినిమా ను తలపిస్తోంది.

గత సంవత్సరం నంద్యాల జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు అబ్బాయిలు అత్యాచారం చేసి, ఆపై ఆమెను హత్య చేశారు. ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూసే ఉత్సాహంలో తాము ఈ నేరానికి పాల్పడ్డామని వారు చెప్పారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లల్లో దుష్ట ప్రవృత్తి ప్రబలంగా ఉందనేది అక్షర సత్యం, కానీ ఆ పాపం ఎవరిది తల్లిదండ్రులదే కదా? పిల్లలపై పర్యవేక్షణ లేకపోవడమే కదా దీనికంతటికి కారణం. రేపటి పౌరులుగా ఎదగాల్సిన పిల్లల జీవితాలు ఎందుకు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి? దేశం సరైన మార్గంలో నడవాలంటే, అది చదువుకున్న పిల్లలతోనే సాధ్యమవుతుంది. మరి పిల్లలే తప్పుడు మార్గంలో నడుస్తుంటే దేశ భవిష్యత్తు ఏం కావాలి?.

బాల నేరస్తుల సంఖ్య పెరుగుతుంది.

ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 2016 లో దేశవ్యాప్తంగా ఆయా నేరాల్లో పట్టుబడిన మైనర్లు   32.5శాతం మంది ఉండగా 2022 నాటికి పట్టుబడిన మైనర్ల సంఖ్య దాదాపు యాభై శాతానికి పెరిగింది. ఒక్క ఢిల్లీలోనే హత్యలతో ప్రమేయమున్న మైనర్ల సంఖ్య 2014-24 మధ్య 8. 7 శాతం నుంచి 26. 78 శాతానికి పెరిగిందంటే రాబోవు రోజుల్లో దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందాల్సిన పరిస్థితి.

 పైన చెప్పబడిన అంశాలపై విస్తృత చర్చ జరిగితేనే మార్పు కొంతమేరకు సాధ్యం అనే విషయాన్ని పాలకులు, తల్లిదండ్రులు మరియు సభ్య సమాజం గమనించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఉపక్రమించాలి.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

10, ఆగస్టు 2025, ఆదివారం

అవరోధాలను అధిగమించి విద్యాకుసుమంగా ఎదిగిన “డాక్టర్. బండ సరోజన"

 *అవరోధాలను అధిగమించి విద్యాకుసుమంగా ఎదిగిన “డాక్టర్. బండ సరోజన"*

అవకాశమొస్తే అబలలు సబలలుగా మారి అన్నింటా పురుషులతో సమానమేనని సవాలు విసరడమే కాకుండా వారు అడుగిడని రంగమే లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ మాటకొస్తే అతివలు తమ మేధస్సు, శక్తిసామర్ధ్యాలతో అద్భుతంగా రాణించిన దృష్టాంతాలు చరిత్రలోనే కాక వర్తమానంలో కూడా మనకు గోచరమవుతాయి. రాణి రుద్రమదేవి, సుమిత్ర దేవి,  సరోజినీ నాయుడు, ఆరుట్ల కమల దేవి, మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ లాంటి వారే కాక వర్తమానంలో తెలంగాణ గడ్డ మీద పుట్టి పట్టుదలతో తనను తాను “చదువుల తల్లి”గా మార్చుకున్న *"డాక్టర్ బండ సరోజన"* లాంటి ఆ కోవకు చెందిన వారెందరో ఉన్నారు.

నిజాం పాలనలో అణచివేతలు, దురాచారాలకు గురైన వారిలో ప్రధాన బాధితులు మహిళలు అని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఆనాటి సమాజంలో మహిళలపై అడుగడుగునా ఆంక్షలు విధించి వారిని ఇంటికే పరిమితం చేసి ‘అబల’గా చిత్రీకరించింది. ఆ రోజుల్లో అంతగా చదువుకు నోచుకోని అత్యధిక శాతం తెలంగాణ మహిళలు పల్లెల్లో పశువుల కాపర్లుగా, వ్యవసాయ కూలీలుగా పనులు చేసుకుంటూ రజాకార్ల దాష్టికాలతో అనుక్షణం భయం గుప్పిట్లో బతికారు. రజాకార్ల అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరులో అనేక మంది వీర మరణం పొందిన విషయం మనందరికీ తెలిసిందే. రజాకార్ల పోరాటం తరువాత కూడా తెలంగాణలో మహిళలకు విద్యనభ్యసించడానికీ పూర్తిగా స్వేచ్ఛ దొరకకపోవడం శోచనీయం. తెలంగాణ పల్లెల్లో దొరల బిడ్డలు, ధనికులు, ఉన్నత వర్గాల్లోని మహిళలు మాత్రమే కొద్దిపాటి స్వేచ్ఛను అనుభవించినప్పటికీ, చదువుకున్న మహిళల శాతం అతి తక్కువ అనే చెప్పాలి. నిరంకుశ నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాలను కళ్లారా చూసిన మహిళలు కొంతమంది ఎలాగైనా రజాకార్లను తరిమికొట్టాలనే సంకల్పంతో పురుషులతో సమానంగా తుపాకులు చేతబట్టి పోరుబాట పట్టారు. అలాంటి పరిస్థితుల నుండి విముక్తి కోసం ఎన్నో అసమానతలు, శ్రమదోపిడి కష్టాలను ఎదుర్కొని క్రమంగా విద్యా వ్యాప్తి చెందడం వల్ల మహిళల్లో చైతన్యం రావడం జరిగింది. రజాకార్ల పోరాటం తర్వాత మహిళలలో విద్యనభ్యసించాలనే కోరిక బలంగా కలిగింది. కానీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు “ఆడపిల్లకు చదువెందుకు” అనే అభిప్రాయంతో స్వీయ నిబంధనలు ఏర్పరచుకోగా, మరి కొన్ని గ్రామాల్లో సరైన స్కూల్ లేక మహిళలు ఇంటి నాలుగు గోడలకే పరిమితమై అవకాశాల కోసం పరితపించారు. ఆ తర్వాత పలువురు సంఘసంస్కర్తలు, విద్యావంతులు, అభ్యుదయవాదుల కృషితో స్త్రీ విద్య, అభివృద్ధికి మద్దతు లభించింది. “కత్తికన్నా కలం గొప్పది.. గన్ను కన్నా పెన్ను గొప్పది” అన్న మాటలను నిజం చేసేందుకు మహిళల్లో చైతన్యం నింపేందుకు పెద్ద ఎత్తున మహిళా సాధికారత కోసం ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాత అతికొద్ది మంది మహిళలు విద్యనభ్యసించి మహిళాభ్యున్నతికి స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి స్ఫూర్తివంతమైన మహిళలో  రిటైర్డ్ ప్రొఫెసర్, తెలుగు పాఠ్య పుస్తక రూపకర్త *"డాక్టర్ బండ సరోజన"* ఒకరు.

బండ సరోజన సిద్ధిపేట జిల్లాలోని (ఒకప్పుడు వరంగల్ జిల్లా) మారుమూల గ్రామమైన లద్నూర్ లో మల్లయ్య, అంబమ్మ దంపతులకు ఏప్రిల్ 3, 1941న జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటికి ఆమె వయసు కేవలం 7 సంవత్సరాలు. ఒకవైపు నిరంకుశ పాలన మరోవైపు రజాకార్ల హింసాయుత చర్యలతో ఊరి జనం అల్లాడిపోయారు. ఆమె తన పసి ప్రాయంలోనే అలాంటి కొన్ని సంఘటనలను స్వయంగా చూసి ఆందోళన చెందిన సందర్భాలున్నాయి. ఆడపిల్ల అడుగు బయట పెడితే ఏమి జరుగుతుందోనన్న భయంతో తల్లిదండ్రులెవరూ అమ్మాయిలను బయటకు కాదు కదా కనీసం పాఠశాలకు కూడా పంపేవారు కాదు. అయితే చదువు పట్ల కొంత అవగాహన ఉన్న ఆమె తండ్రి తన కూతుర్ని చదివించాలనే ఆలోచనతో అదే గ్రామం లద్నూర్ పాఠశాలకు పంపించేవారు. ఓ రోజు రజాకార్లు దాడి చేసి భారీ విధ్వంసం సృష్టించినప్పుడు, ఆ దాడిలో ఆమె చదువుతున్న పాఠశాల పూర్తిగా ధ్వంసం అయింది. అప్పటికి ఆమె మూడో తరగతి చదువుతున్నారు. పాఠశాల పూర్తిగా కాలిపోవడం వల్ల భయంతో ఎవరు కూడా పాఠశాలకు వెళ్లలేకపోయారు. కొన్ని నెలల తరువాత గ్రామ పెద్దల సహాయంతో పాఠశాలకు మరమ్మత్తు చేసి పునః ప్రారంభించడంతో ఆమె మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. ఏడవ తరగతి తరువాత, ఉన్నత చదువుల కోసం విద్యా సౌకర్యాలు లేని కారణంగా, ఆమె ఒక సంవత్సరం పాటు తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయ పడుతూ చదువు మరిచిపోకుండా ఉండడానికి పొలం గట్ల మీద అక్షరాలు రాస్తూ ఉండేవారు. ఓ రోజు ఆమె తండ్రి తన కూతురికి చదువు మీద ఉన్న ఆసక్తిని గమనించి రోజూ సాయంకాలం సమయంలో ఆమెకు మహనీయుల చరిత్ర, తెలుగు పద్యాలు, తెలుగు జాతీయాలు నేర్పించేవారు. ఇలా, తండ్రి ఆమెలో విద్య పట్ల మరింత ఆసక్తిని పెంచారు. ఆమె ఐదు సంవత్సరాల పాటు తండ్రితో వ్యవసాయం మరియు పశువులు కాయడం లాంటి పనులు చేసింది. ఆ రోజుల్లోని సౌకర్యాల లేమి, విద్య పట్ల తల్లి వ్యతిరేకతలను పట్టించుకోకుండా, చదవాలనే ఏకైక లక్ష్యంతో ఆమె తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. 1962లో, ఆమె సిద్ధిపేటలో ఎలిమెంటరీ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత 1963లో, ఆమె సికింద్రాబాద్‌లోని బోయిగూడా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా ఉద్యోగం పొందింది. వచ్చిన ఉద్యోగంతో సరిపెట్టుకోకుండా, ఇంకా పై చదువులు చదవాలనే ఆసక్తితో, ఉద్యోగం చేస్తూనే A.N. రావు గారి మార్గదర్శకత్వంలో ఏ శిక్షణ లేకుండా 10వ తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత  PUC (Pre-University Course), BA, B.Ed., 1974లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి MA పట్టా పొందినప్పటికీ ఆమెలో చదువుపై తృష్ణ ఏమాత్రం తగ్గలేదు. ఇదే ఆమెను 1976లో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీ (Master of Education Degree) పూర్తి చేసేలా  పురికొల్పింది. చివరకు పిహెచ్‌డీ (PhD) చేయాలన్న దృఢ సంకల్పంతో, పట్టువదలకుండా 1992లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్‌డీ పట్టా పొందారు. సరోజన విద్యకు అండగా నిలిచినా వ్యక్తి బొడ్డు దామోదర్ ఆమె ఉన్నత విద్య అభివృద్ధికి తోడ్పడ్డాడు. విద్యావంతురాలైన ఆమె రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (State Council of Educational Research and Training) లో 45 పాఠ్య పుస్తకాల రూపకల్పన చేసి విద్యా రంగానికి శ్లాఘనీయమైన సేవలందించారు. నియత, అనియత గిరిజన నవోదయ సిబిఎస్సి ఢిల్లీ వారికి పాఠ్య పుస్తక రూప కల్పనలో ప్రశంసనీయమైన సేవలందించారు. తెలుగు బోధనా పద్ధతులు - తెలుగు అకాడమీ వారికి బోధించడంలో తనదైన ముద్ర వేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య బాపు రమణల ఆధ్వర్యంలో వీడియో పాఠాలు నిర్వహించి విద్యారంగానికి ఎనలేని కృషి చేశారు. అంతేకాకుండా 10 వ తరగతి ఉపవాచకం విశ్వమాత థెరిస్సా పాఠ్యపుస్తక రూపకర్త గా ప్రముఖులచే ప్రశంశలు అందుకున్నారు.  విద్యను అందించడమే కాకుండా సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడంలో కూడా ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాకుండా, ఆంధ్ర ప్రదేశ్ ప్రాథమిక విద్య పథకం (APPEP) లో ప్రాజెక్ట్ మూల్యాంకనం యొక్క డిజైన్ మరియు విశ్లేషణలో ఎదురైన కొన్ని కీలక సమస్యలను ఆమె తన నైపుణ్యంతో పరిష్కరించారు. సరోజన విద్యార్థులకు కేవలం జ్ఞానాన్ని అందించడం వరకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజాన్ని నైతికంగా పరిపుష్టం చేసేందుకు విశేష కృషి చేశారు. 45 పాఠ్యపుస్తకాలే కాకుండా మరో 12 పుస్తకాలూ స్వతహాగా రచించి మొత్తం 57 పుస్తకాలతో ఆమె  సుదీర్ఘ ప్రయాణంలో తరువాత, 1999లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ప్రభుత్వ అనుమతితో కొన్ని సంవత్సరాల పాటు చౌటుప్పల్ లోని అలిమినేటి మాధవ రెడ్డి మెమోరియల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేశారు.


*అవార్డులు*:

తెలంగాణ ప్రభుత్వం విశిష్ట మహిళా పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రతిభ పురస్కారం అందుకున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అమెరికాలో కూడా అనేక పురస్కారాలు అందుకున్నారు.


జీవితపు తొలినాళ్ళలో సరైన విద్యా సౌకర్యాలు లేకపోయినప్పటికీ, చదువు పట్ల అనురక్తితో, ఆమె ప్రతి అడ్డంకిని అవకాశంగా మలచుకున్నారు. ఒక ప్రయత్నం లేదా మరొక ప్రయత్నంలో నా లక్ష్యాన్ని నిర్ధారితంగా చేరుకుంటానన్న ఆత్మవిశ్వాసంతో, 7వ తరగతి నుండి పీహెచ్‌డీ వరకు ఏ విధమైన ప్రామాణిక శిక్షణ లేకుండా చదవడం ఆమె సాధించిన గొప్ప విజయం. నేటి విద్యార్థులు బండ సరోజన లాంటి వ్యక్తుల జీవితాలను ప్రేరణగా తీసుకుని, తమ లక్ష్యాలను నిర్దేశించుకుని సాధన దిశగా కృషి చేయాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఏవో కొన్ని అడ్డంకులను మరియు సవాళ్లను ఎదుర్కోవడం సహజమే కానీ వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగిన వారు మాత్రమే వారి లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475

27, జులై 2025, ఆదివారం

చదువులతల్లి ఒడి "మాదోపట్టి".

 చదువులతల్లి ఒడి "మాదోపట్టి".

26, జులై 2025, శనివారం

సంకల్ప బలం

సంకల్ప బలం:

ఒక్కప్పుడు నా దగ్గర చదువుకోవడానికి డబ్బులు ఉండుంటే కలెక్టర్ అయ్యేవాడిని లేదా మంచి ఉద్యోగం చేసేవాడిని. పేదరికం, ఆటంకాల వల్లే ఉన్నత ఉద్యోగాలు సాదించలేకపోయాను అంటూ చాలామంది అంటుంటారు. కానీ నిజానికి వారికి లేనివి అవేవీ కావు, ఒక్క దృఢ సంకల్పం మాత్రమే. దృఢ సంకల్పం లేనప్పుడు ఏదైనా సాధించడం అసాధ్యమే. పట్టుదలతో ప్రయత్నం చేయలేనప్పుడు పరిస్థితులను నిందించడం సరికాదు. అందుకే సినారె గారు రాసిన కవిత్వం  గుర్తుకొస్తుంటుంది "చేతగానితనముంటే జాతకాన్ని నిందించకు.. కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు" అని. అవును నిజమే కదా! చదవచేతగానప్పుడు పేదరికాన్ని, డబ్బును నిందించడం ఎందుకు? సంకల్పబలం లేనివాడు సమస్యలంటూ నిందించడం ఎందుకు? లక్ష్యం మీద స్పష్టత, ప్రయత్నంలో అకుంఠిత దీక్ష ఉంటే విజయం కచ్చితంగా మనదే అవుతుంది. అందుకు తాజా తార్కాణం ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపాలకృష్ణ రోణంకి, ఐఏఎస్  విజయగాథ. 

గోపాలకృష్ణ రోణంకి చదివింది ఎక్కడో పట్టణంలోనో లేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోనో కాదు. ఆయన చదివింది ఆంద్రప్రదేశ్ లోని పలాస మండలం పరసంబ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలుగు మీడియం చదువు. అతని తల్లిదండ్రులు నిరుపేదలు, వారు వ్యవసాయం, కూలి పనులకెళ్లి జీవనం కొనసాగిస్తారు. అతన్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించే స్థోమత లేనందున అతను ఎలాగోలా ప్రభుత్వ పాఠశాలలో చదివి  పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. విజయనగరంలోని ఎంఆర్ కళాశాలలో ఫార్మసీ చదివి గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా దూబచర్లలో రెండేళ్ల ఉపాధ్యాయ శిక్షణ కోర్సు చేసి 2006లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్ గా పనిచేస్తూనే   విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బీఎస్సీ (ఎంపీసీ) పూర్తి చేశారు. ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజుల్లోనే ఐఏఎస్ కావాలన్నది ఆయన కల. ఆ కల నెరవేరడం కోసం ఆయన ఎన్నో సంవత్సరాలు కఠోరదీక్ష చేశారు. కల నెరవేరడం కోసం ప్రతి రోజు 8 గంటలకుపైగా ఎంతో దీక్షతో  చదివి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష మొదటగా ప్రయత్నించి విఫలమయ్యాడు అయినా సరే లక్ష్యం చేరేదాకా ప్రయత్నం ఆపకూడదనే సంకల్పంతో అవరోధాలు, ఆటంకాలను లెక్క చేయకుండా రెండోసారి కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా సరే నిరాశ చెందకుండా లోపం ఎక్కడ ఉందొ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మరోవైపు పరీక్షకు సిద్ధమయ్యేవాడు. అలా మూడో ప్రయత్నం కూడా విఫలమయ్యాడు. అయినప్పటికీ నాలుగో ప్రయత్నంలో విజయం సాధిస్తాననే  నమ్మకంతో నాలుగోసారి ప్రయత్నించి విజయం సాధించాడు. చాలామంది ఒకటి లేదా రెండు ప్రయత్నాలతో ఇక నావల్లకాదని ప్రయత్నించడం మానుకుంటారు. కానీ ఎవరైతే దృఢ సంకల్పముతో పోరాడుతారో వారికి కచ్చితంగా విజయం వరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సంకల్పంతో సాధించిన విజయం అతన్నే కాదు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే అతను అందరిలా కాకుండా సివిల్స్ (మెయిన్స్)లో తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా ఎంచుకొని ఆయన యూపీఎస్సీ పరీక్షను తెలుగు భాషలో రాశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, ఇది వంద శాతం నిజం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే తెలుగులో పర్సనాలిటీ టెస్ట్ రాసేందుకు యూపీఎస్సీ అనుమతించడం. 2016లో ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా మూడవ ర్యాంక్ సాధించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. తన గ్రామంలో కనీసం కరెంటు మరియు బస్సు సౌకర్యం లేకున్నా పట్టుదలతో చదివి అత్యంత కఠినమైన పరీక్షల్లో మంచి ర్యాంక్ సంపాదించడమనేది చాలా గొప్ప విషయం. ఏదైనా విజయం సాధించాలంటే ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొంటే గానీ సాధ్యపడదు. “డబ్బులు ఎవరికీ  ఊరికే రావు” అన్నట్లు మరి విజయం ఊరికేవస్తుందా, కష్టపడితేనే కదా! గోపాలకృష్ణ కూడా కష్టపడకుండా విజయం సాధించలేదు. అతను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఆయన తల్లిదండ్రులు చిన్నవయసులోనే దళిత కులాంతర వివాహానికి పాల్పడిన కారణంగా 25 సంవత్సరాల పాటు సామాజిక బహిష్కరణకు గురయ్యారు. దీంతో వారి జీవితాల్లో ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.

ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ అందరూ అది సాధించలేరు. ఎందుకంటే విజయం అనేది ఎవరికీ ఊరికే రాదు కృషి పట్టుదల ఉంటేనే అది సాధ్యం అవుతుంది. కానీ కొంత మంది ఏ విధమైన ప్రయత్నం చేయకుండానే గెలుపు కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన చేస్తారు కానీ ఆచరణలో పెట్టరు. అలాంటివారు ఎప్పుటికీ విజయం సాధించలేరు. గోపాల కృష్ణ లా లక్ష్యం పెట్టుకోవాలి మరియు ఆ లక్ష్యం కోసం నిరంతరం కష్టపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. 


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475 




13, జులై 2025, ఆదివారం

తెలుగు నట దిగ్గజం : కోట శ్రీనివాసరావు

 తెలుగు నట దిగ్గజం : కోట శ్రీనివాసరావు

12, జులై 2025, శనివారం

నిబంధనలు సామాన్యులకేనా?...

 నిబంధనలు సామాన్యులకేనా?...


ప్రభుత్వాలు ప్రవేశపెట్టే నిబంధనలు సామాన్యులకు, పేదలకేగాని ధనికులకు, పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు వర్తించవనేది జగమెరిగిన సత్యం.
రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు వారు అన్నింటికీ అతీతులు. అందుకు తాజా తార్కాణం ఈ ఫొటోలో కనిపిస్తున్న ట్రాఫిక్ పోలీస్ అధికారి. 04 .06 .20025 ఉదయం హైదరాబాద్ లోని బోడుప్పల్ నుండి మాణిక్ చంద్ రోడ్ మార్గంలో వెళ్తున్న సందర్భంలో కనిపించిన దృశ్యం. హెల్మెంట్ లేకపోతే లేదేమో మరిచిపోయాడేమో అనుకోవచ్చు కానీ ఉన్న హెల్మెంట్ ఉండి ఉన్న హెల్మెంట్ ని బండికి తగిలించి నన్ను ఎవడు ఏమి చేస్తాడు అన్న చందంగా మరియు ఒక ట్రాఫిక్ పోలీస్ అయి ఉండి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాడంటే ప్రతి ఒక్క సామాన్యుడు ప్రశ్నించదగిన విషయం. ఒక సామాన్యుడు హెల్మెంట్ లేకుండా రోడ్ మీద వెళ్తే పట్టుకొని బలవంతంగా బండి తాళాలు లాక్కొని ఫైన్ వేసి ఇబ్బందులకు గురిచేస్తున్న సందర్భాలు కోకొల్లలు అంతేకాదు మరికొందరైతే 50 - 100 రూపాయలకు ఆశపడి డబ్బులు తీసుకొని వదిలేసే అధికారులు కొంతమంది. సామాన్యుడు ఫైన్ కట్టనిపరిస్థితిలో బండి లాక్కొని నానా ఇబ్బందులకు గురిచేస్తారు తప్ప వదిలేసే పరిస్థితి చాల తక్కువ. అదే రాజకీయ నాయకులు పోలీస్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించినా అడిగే నాథుడు ఉండడు ఎందుకంటే సామాన్య ప్రజలకు భయమని కాదు సామాన్యుడిలో ఉండే సంస్కారం.  అంతేకాదు పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టినా ఊరుకుంటారు. కాని సామాన్యుడు కరెంటు బిల్లు సకాలంలో కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారు. బడా వ్యాపారులకు రాయితీలు ఇస్తారు. సామాన్యులపై పన్నుల భారం మోపుతారు. కాని సామాన్యులు చిన్న నిబంధన ఉల్లంఘించినా నానా రచ్చ చేస్తారు. మన దేశంలో పెద్దలు ఏం చేసినా చెల్లుతుంది. వారు పెట్టుకున్న నిబంధనలు వారే పాటించరు. వారు చేసే చట్టాలు సామాన్యులు అనుసరించడానికి తప్ప వారికి వర్తించవు.

పోలీస్ అధికారి బండి నడపడం తప్పు కాదుకానీ ఆయన హెల్మెంట్ పెట్టకపోవడమే తప్పు. మనం సామాన్యులమైన తప్పును తప్పే అని తీరాల్సిందే. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రోడ్ల మీద పోయే ప్రతిఒక్కరు తమ రక్షణకొరకు హెల్మెంట్ పెడుతున్నారో లేదో తెలియదు గాని మీ నిబంధనలు తూచాతప్పకుండా పాటించాలనే నిబద్దతతో హెల్మెంట్ వాడుతున్నారు కాబట్టి పోలీస్ అధికారులు కూడా నిబద్దతతో హెల్మెంట్ వాడాలనేది ఒక సామాన్యుడిగా నా ప్రశ్న..

✍️ Columnist
కోట దామోదర్
మొబైల్ 9391480475

మరపురాని యోధులు

మరపురాని యోధులు

2008లో ముంబైలో జరిగిన 26/11మారణహోమం భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఉగ్రవాద మచ్చగా మిగిలిపోయింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో  174 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డ విషయం దేశ ప్రజలెన్నటికీ మర్చిపోలేరు. భారత భద్రతా బలగాలు 60 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి 10 మంది ఉగ్రవాదులలో 9మందిని మట్టుబెట్టి ఒక్క అజ్మల్ కసబ్‌ను మాత్రమే ప్రాణాలతో పట్టుకున్న విషయం, ఆ ఉగ్రవాదిపై ఏప్రిల్ 20, 2009న ప్రారంభమైన విచారణ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నవంబర్ 21, 2012న ఉరి తీసిన విషయం అందరికి గుర్తుంది. కానీ సుప్రీంకోర్టు విచారణలో నిర్భయంగా వాంగ్మూలం ఇచ్చి కసబ్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రత్యక్ష సాక్షిగా నిరుపమాన ధైర్యం ప్రదర్శించిన అతి పిన్న వయస్కురాలైన దేవికా రోటావన్ విషయం మాత్రం చాలామందికి తెలియదు. మరొక్క మాటలో చెప్పాలంటే గుర్తుకులేదు. దాడి జరిగిన సమయంలో దేవికా రోటావన్ వయసు కేవలం 9 ఏళ్ళు మాత్రమే. దుర్ఘటన సందర్భంలో అక్కడ చాలామంది ఉన్నప్పటికీ అందులో ఏ ఒక్కరూ సాక్ష్యం చెప్పడానికి సాహసం చేయకపోవడం విచారకరమైన విషయం. దేశభక్తి మూర్తీభవించిన  ఒక 9 ఏళ్ళ అమ్మాయి ఉగ్రవాదికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం ఏంటి అనే సందేహం ప్రతిఒక్కరికి కలుగుతుంది. కనీసం అంతటి తెగువకు సాహసించిన ఆ అమ్మాయి  పేరు మనలో ఎంత మందికి గుర్తుంది? “అన్నీ గుర్తుపెట్టుకుంటాం కానీ అసలోడిని మాత్రం మర్చిపోతాం” అనే సామెత లాగా ప్రస్తుత సమాజం తీరు ఉంది. ప్రతి సంవత్సరం నవంబర్ 26న “26/11 నెవర్ అగైన్” అని కొవ్వొత్తుల ప్రదర్శనలు, సంతాప సభలు నిర్వహిస్తుంటాం కానీ ప్రాణాలతో పట్టుబడ్డ ఏకైక ఉగ్రవాదికి ఉరిశిక్ష పడేందుకు ప్రాణాలకు తెగించి వాంగ్మూలం ఇచ్చిన ప్రత్యక్ష సాక్షి దేవికా రోటావన్ ను మాత్రం అందరం మర్చిపోయాం.

కళ్ళముందు నేరం జరిగినా చూసీచూడనట్లు పట్టించుకోకుండా పోయేవారు కొందరైతే, అనవసరమైన విషయాల్లో తలదూర్చితే ప్రాణాలకే ముప్పని భావించేవారు మరికొందరు ఉంటారు. సాక్ష్యం చెప్పడం అంటే చావుకు ఎదురుపోయినట్లే అనే ఉద్దేశంతో అక్కడ జరిగిన సంఘటనను చూసినప్పటికీ చూడలేదని చెప్పి తప్పించుకుంటారు. కొన్ని సంఘటనల్లో సాక్ష్యులను హతమార్చిన సందర్భాలు కూడా ఉండడమే ఇందుకు కారణం. ఏదైనా నేరం జరిగినప్పుడు, సరైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే కదా నేరం రుజువై నేరస్థుడికి సరైన శిక్ష పడేది. మరి సాక్షాలే లేనప్పుడు కోర్టు నేరస్థులను  శిక్షించేది ఎలా? నేరాలు జరుగకుండా ఆపేది ఎలా? ఇలాంటి సంఘటనలలో నేరస్థులను శిక్షించడం న్యాయస్థానాలకు ఇబ్బందికరంగా మారుతుంది. చిన్న చిన్న నేరాలకు సైతం సాక్ష్యాలు చెప్పడానికి ప్రజలు వెనకాడుతున్న సమయంలో దేశంలోనే అతిపెద్ద ఉగ్రదాడి ఘటనలో 9 ఏళ్ళ అమ్మాయి ప్రత్యక్ష సాక్షిగా ముందుకు రావడం యావత్ దేశం గర్వించదగిన విషయమే కదా! ఇది ముమ్మాటికీ గర్వించదగిన విషయమే. అంతేకాదు దేవికను అభినందించాల్సిన విషయం కూడా. ఇంతటి సాహసానికి ఒడికట్టిన  దేవికా రోటావన్ ఎవరనేది తెలుసుకోవాలంటే ఈ వ్యాసం పూర్తిగా చదవాల్సిందే.

భారత చరిత్రలోనే అత్యంత భయానక ఉగ్రవాద చర్యల్లో ఒకటైన 26/11 ముంబై దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటికి తొమ్మిదేళ్ల వయసు గల  దేవికా రోటావన్ కు ఆ ఘటనా సమయంలో కుడి కాలిపై బుల్లెట్ గాయం కాగా కాల్పులు జరిపిన కసబ్‌ను స్వయంగా  చూసింది. 65 రోజులు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడిన దేవికాను ఆ తర్వాత ప్రభుత్వం కోర్టులో సాక్షిగా ప్రవేశ పెట్టింది. దేశం కోసం, దేశ రక్షణ కోసం ఆమె ఏ మాత్రం వెనకడుగు వేయకుండా నిర్భయంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకువచ్చింది. ఆమె సాక్ష్యం చెప్పకుండా ఉండటానికి ఉగ్రవాదుల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. అంతేకాదు ఆమె బంధువులు కూడా ఉగ్రవాదులవల్ల తమకు ప్రాణహాని కలుగుతుందేమోనని భావించి వారికి దూరంగా ఉన్నారు. దీనికి తోడు, పాఠశాలలో దేవికాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దీని వల్ల ఇతర విద్యార్థులకు ప్రాణ హాని జరిగే అవకాశం ఉందని పాఠశాల యాజమాన్యం ఆమెను పాఠశాల నుండి బహిష్కరించారు. దేవిక ఉగ్రవాదుల లక్శ్యంగా ఉన్నందున అద్దె ఇంటివారు కూడా వెళ్లగొట్టే పరిస్థితి ఏర్పడింది. అయినా సరే దేవిక మాత్రం దేశం పట్ల తనకు  ఉన్న ప్రేమను చాటుకునేందుకు ఇసుమంతైనా భయపడలేదు. కోర్టు విచారణలో సాక్ష్యం చెప్పడమే కాకుండా కసబ్ ను గుర్తించి, ఆరోజు దాడిలో అతనే తనపై కాల్పులు జరిపాడని సాక్ష్యం చెప్పడంతో, కోర్టు మే 2010లో, కసబ్ కు మరణశిక్ష విధించి, నవంబర్ 21, 2012న ఉరి తీసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికీ దేవిక అనేక అవరోధాలను, అవమానాలను ఎదుర్కొంటోంది. ఉండటానికి సరైన ఇల్లు లేక, అద్దెకు దొరక్క ఎన్నో సార్లు ప్రభుత్వానికి తన బాధను మొరపెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. సాక్ష్యం చెప్పే సమయంలో ఎందరో నాయకులు అనేక హామీలు ఇచ్చినప్పటికీ అవి ఏవీ నెరవేరలేదు. ఆమె కూడా మనలో చాలా మంది లాగా ‘నాకెందుకులే’ అనుకుని ఉండి ఉంటే కసబ్ కి ఉరి శిక్ష పడేది కాదేమో! తన మరియు తన కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశం కోసం ఆమె చేపట్టిన సాహసోపేతమైన చర్యను గుర్తించుకోకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.

కసబ్ ను పట్టుకున్న సబ్ ఇన్స్పెక్టర్ గుర్తున్నాడా?
దేవికా రోటావన్ పేరుతో పాటు కసబ్ ను పట్టుకునేందుకు కేవలం చేతిలో లాఠీతో కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న కసబ్ సహా మరో ఉగ్రవాదిపై విరుచుకుపడి కసబ్ సజీవంగా పట్టుబడడంలో కీలకంగా వ్యవహరించిన  సబ్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓంబ్లే పేరు దేశ పౌరులు మరిచిపోయారు. తుకారాం ఒంబ్లే 26/11 ముంబై దాడుల సమయంలో చూపిన అసాధారణ ధైర్యసాహసాలు లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడటమే కాకుండా, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు అమూల్యమైన విజయాన్ని సాధించాడు. ఆయన అసమాన ధైర్యసాహసాలు దేశం కోసం త్యాగానికి ప్రతీకగా నిలిచాయి. పోలీసు శాఖలో చేరడానికి ముందు, ఓంబ్లే 16 సంవత్సరాలకు పైగా భారత సైన్యంలో పనిచేశారు. ఇది తన కర్తవ్య భావాన్ని మరియు దేశం పట్ల ప్రేమను పెంచింది. ఆర్మీ నుంచి రిటైరైన తర్వాత ఆయన అలుపెరగని సేవాభావంతో ముంబై పోలీస్ శాఖలో చేరారు. ముంబై దాడుల తర్వాత స్కోడా కారును హైజాక్ చేసి సీఎస్టీ వద్ద విధ్వంసం సృష్టించి పారిపోతున్న ఇద్దరు ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తుకారాం ఓంబ్లే అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరుపుతున్నప్పటికీ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ఓంబ్లే లాఠీ (లాఠీ) తప్ప మరేమీ లేకుండా కసబ్ వద్ద ఉన్న ఏకే-47 బారెల్ ను పట్టుకుని మరింత కాల్పులు జరపకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇంతటి దైర్యవంతుడిని కూడా మనం మరిచిపోవడం ఇంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఉండదేమో!

"పోరాడితే పోయేదేమి లేదు. బానిస సంకెళ్ళు తప్ప..." అని శ్రీశ్రీ అన్నట్లు కళ్ళఎదుట జరిగిన సంఘటనకు మనం సాక్ష్యం చెప్పలేకపోతున్నామంటే నిజానికి మనం బానిస సంకెళ్ళు వేసుకున్నట్లే.. మన దేశంలో ఎంతోమంది దేశం కోసం పోరాడుతున్న యోధులు ఉన్నారు కానీ వారిని గుర్తించుకోకపోవడమే మనం చేసే పెద్ద తప్పు.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ :9391480475

రేవంత్ రెడ్డి మానవీయ కోణం

రేవంత్ రెడ్డి మానవీయ కోణం:

తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేస్తున్న వారి జీతాల్లో పది శాతం తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించిన విషయం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. దేశంలో వృద్ధుల సంరక్షణ, సంక్షేమ పరిస్థితుల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మనాన్నలు పిల్లలతో పేగు బంధాన్ని పెనవేసుకుంటుంటే వారు పెద్దయ్యాక కని పెంచిన వారిని కాదు పొమ్మంటున్నారు. మరికొందరైతే ఆస్తుల కోసం అమ్మానాన్నలను క్రూరంగా కడతేర్చిన కసాయి కొడుకులు ఉన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ వారిని రోడ్డున పడేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఒకరు ఖర్చులు భరించలేక ఒకరు సేవ చేయలేక దూరం పెడితే, మరొకరు పొట్టకోసం ఊరు దాటుతూ వదిలేస్తున్నారు, కొందరు కోడలు అత్తమామల్ని చూడకపోవడం కారణాలవల్ల కొడుకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది సంపన్న కుటుంబానికి చెందిన వృద్ధులు తమ ఆస్తినంతా పిల్లలకు ఇచ్చేశామని కానీ తమను వారు చూసుకోవడం లేదని వృద్ధాశ్రమాలకు  కాసులు విదిల్చి చేతులు కడిగేసుకుంటున్నారని బాధపడుతూ ఫిర్యాదులు చేయడం లేదా, రోడ్డున పడి తమ గోడు వెళ్లబోసుకోవడం లాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై సీఎం రేవంత్ ఓ ప్రత్యేకమైన ఆలోచన చేసి తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేసే ఉద్యోగుల జీతాల్లో పది శాతం వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే ఆలోచన అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు

పట్టణీకరణ ఆధునీకరణ ల సౌక్యాలతో తగ్గుతున్న మానవత్వం విలువల ఫలితమే ఇది.

ఒక తల్లికి అయిదుగురు కొడుకులు ఉంటే అందరిని ఒకే విధంగా పెంచుతుంది. కానీ ఆ అయిదుగురు కొడుకులు ఒక్క తల్లిని పెంచాలంటే ఎంత ఈసడించుకుంటారో ప్రపంచానికి అర్ధం కానీ వింత. కోట్ల రూపాయల ఆస్తులున్న కన్న కొడుకు కడుపునిండా అన్నం పెడతారన్న నమ్మకం లేదు. పెళ్ళైన కొన్నాళ్లకే ఆస్తులు తమ పేరున రాసుకొని తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేస్తున్నారు. అంతేకాదు వారు అసువులుబాస్తే కడ చూపు చూడని కఠినాత్ములు ఎందరో. అనాధల ఖాతాలో అంత్యక్రియలు జరుగుతున్న దౌర్భాగ్యం ఎందరిదో. ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ చాలా మంది తల్లిదండ్రులను పోషించడం భారంగా చూస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉండాలని చాలా కాలంగా అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇటీవల తల్లిదండ్రులను కుమారుడు వృద్ధాశ్రమంలో చేర్పించడంతో వారు ఆవేదనకు గురై వృద్ధాశ్రమంలో  భార్య, భర్త ఆత్మహత్య చేసుకున్న ఈ సంఘటన అధికారుల సామాజిక స్పృహను తట్టి లేపింది. తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేసే ఉద్యోగుల జీతాల్లో పది శాతం వారి ఖాతాల్లో జమ చేసేలా చూస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని అంచనా వేస్తున్నారు. ముమ్మాటికీ రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిందే. మంచి ఆలోచనకు మనమందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.

జీతంలో పది శాతం తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే అంశంపై పలు సందేహాలు:

ఉద్యోగికి ఎక్కువ జీతం ఉంటే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు గాని, తక్కువ జీతం ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వారు కుటుంబ పోషణ, పిల్లల చదువుల కొరకు చాలా ఇబ్బందులు పడుతుంటారు మరి వారికి ఇది ఒక పెద్ద సమస్య అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతటివారైనా తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ఆర్ధికంగా లేనప్పుడు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపలేకపోవచ్చు. మరి తక్కువ జీతం ఉన్నవారు ఈ అంశాన్ని సమర్థిస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే. అంతేకాదు అస్సలు కొడుకులు లేని వారి పరిస్థితి ఏంటి? వారి బాగోగులు ఎవరు చూడాలి? వారికి ప్రభుత్వం ఏదైనా పథకాలు అమలు చేస్తుందా? ఇదే కాకుండా కూతురు మాత్రమే ఉంటే వారి తల్లిదండ్రులను ఎవరు చూడాలి? అల్లుడు చూడకపోతే అల్లుడు జీతం నుండి పది శాతం కట్ చేస్తారా? ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొడుకులు ఉన్న తల్లిదండ్రులకు ఈ వార్త కొంత ఊరట కలిగిస్తుందేమో కానీ మిగిలిన వారి పరిస్థితి కూడా ఆలోచన చేయాల్సి ఉంది. కొడుకులు బిడ్డలు లేనివారికి ఇంట్లో ఇద్దరికీ పింఛన్ ఇస్తే వారికి కొంత ఊరట కలుగుతుందని కొంతమంది భావిస్తున్నారు. తల్లిదండ్రులను చూసుకోవాలనే  నైతిక భాద్యత ఉండాలి అంతేతప్ప ఈ చట్టాలవల్ల సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ముమ్మాటికీ  ఉండదు. ఈ అంశం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమేనా అందరికి వర్తిస్తుందా అనేది చాలామందికి సందేహం ఎందుకంటే అస్సాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అస్సాం ఎంప్లాయీస్ ప్రాణ్ యాక్ట్, చట్టం 43 ప్రవేశపెట్టింది.

అస్సాం ఎంప్లాయీస్ ప్రాణ్ యాక్ట్:

ప్రభుత్వం కన్నవారిని నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో కోత విధించడానికి , తగ్గించిన సొమ్మును తల్లిదండ్రుల ఖాతాలో వేయడానికి అనుమతి ఇస్తూ 2017 లో ప్రత్యేక బిల్లును తీసుకు వచ్చింది. ఈ బిల్లు ఆమోదించడం పై పలు విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తుందనడంలో చాలామంది అభ్యంతరం తెలియజేశారు. తల్లిదండ్రులను పట్టించుకోని మిగిలిన వారిని ఎలా కట్టడి చేస్తారని ప్రశ్నించారు. అయినా సరే అస్సాం ప్రభుత్వం బిల్లు కొనసాగిస్తుంది. అంతేకాదు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తరహా చర్యలను 2021లోనే చేపట్టింది.

ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు వర్తించకపోవడం, వృద్ధులకు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛన్ కూడా రాని ఈ పరిస్థితులలో తగిన చట్టం దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సముచితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు కొడుకులు ఉండి  అనాధలుగా మిగులుతున్న వారికి కూడా ఈ చట్టం వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనచేయాల్సిన అవసరం ఉంది.


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్ 9391480475

15, జూన్ 2025, ఆదివారం

శూన్యం

3, మే 2025, శనివారం

కవన చంద్రికలు – సమీక్ష

కవన చంద్రికలు

స్వర్గాన్ని దివి నుండి భువికి చేర్చే శక్తి సంగీతానికి ఉందని నానుడి. ఆంగ్ల రచయిత  "ఎమిల్ లుడ్విగ్" చెప్పినట్లుగా భూలోక వాసులను స్వర్గానికి ఎగరేసుకుపోయే శక్తి సంగీతానికి ఉందన్న నిజం సంగీత ప్రియులకు మాత్రమే తెలుస్తుంది.  *సంగీతమే కాదు కవిత్వం* కూడా ఆ కోవకు చెందినదనే విషయం కవితాప్రియులకు మాత్రమే తెలుస్తుంది. అన్ని కవిత్వాలకు ఆ శక్తి ఉంటుందో లేదో తెలియదు గానీ పాఠకుల హృదయాలను దోచుకునే కవిత్వాలకు అలాంటి శక్తి ఖచ్చితంగా ఉంటుంది. భావాత్మక కవిత్వం చదువుతున్నప్పుడు పాఠకుడు తనకు తెలియకుండానే అందులో లీనమై అలౌకికానందాన్ని, తాదాత్మ్యాన్ని పొందుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే దీన్నే ‘రసానందం’ అంటారు. సంగీతానికే కాదు భూలోక పాఠకులను స్వర్గంలొ విహరింపజేసేశక్తి కవిత్వానికి కూడా ఉందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

 కవిత్వం (కవిత) చదివితే పాఠకుని మనస్సులో అంతవరకూ అలుముకున్న అస్పష్టత చెరిగిపోయేలా ఉండాలి. అలాంటి కవిత్వం పురుడు పోసుకొని మహోజ్వలంగా విరబూసేందుకు కవి మనుసులో క్షీరసాగరమధనం జరిగినట్లుగా భావమథనం జరిగితేగానీ ఆ కవిత్వం పాఠకులను నూరు శాతం మెప్పించి తీరుతుంది. శ్రీశ్రీ గారు చెప్పినట్లు కవితా వస్తువు ఏదైనా, అమ్మజోల పాట పాడితే చంటిపాప నిద్రలోకి జారుకున్నట్లుగా పాఠకుడు కవిత్వాన్ని తనివితీరా ఆస్వాదించేలా కవి ప్రతిభాశైలి ఉండాలి. అలాంటి కవిత్వం రాసేవారు ఈమధ్యకాలంలో చాల అరుదుగా ఉంటున్నారు. ప్రతి సంవత్సరం వేలకొద్దీ కవితా సంపుటులు వెలువడుతున్నా వాటిలో కొన్ని మాత్రమే పాఠకులను ఆకట్టుకుంటున్నాయి. కవిత్వం పట్ల పాఠకుడికి రసజ్ఞత కలగాలంటే, కవి సందర్భానుసారంగా కథావస్తువును  కళ్లకు కట్టే విధంగా , మనసును రంజింపజేసే విధంగా కవిత్వీకరించాలి. అప్పుడే కవి పాఠకుల హృదయాంతరాలాల్లోకి చేరుకోగలడు. ఇటీవల “మహతీ  సాహితీ కవిసంగమం”, కరీంనగరం వారి “ధనుర్మాస కవితోత్సవం 2024-25” సందర్భంగా వైవిధ్య వ్యాస రచయిత యేచన్ చంద్ర శేఖర్ మస్తిష్కం నుండి పురుడుపోసుకున్న "కవన చంద్రికలు" ఆ కోవకు చెందినవే. కమ్మనైన అమ్మపాట ఎంత మధురమో "కవన చంద్రికలు"లో  రచయిత "యేచెన్ చంద్రశేఖర్" రాసిన  అమ్మ కవిత్వం కూడా అంతే మధురంగా అనిపిస్తుంది. చంటిపిల్లలు అన్నం తినేందుకు మారాం చేస్తే “చందమామ రావే, జాబిల్లి రావే” అంటూ అమ్మ చందమామను చూపించగానే కడుపు నిండా భోజనం చేసినట్లు, చందమామ పాటవలె మృదుమధురంగా అమ్మ కవితకు అక్షరరూపం కల్పించారు చంద్ర శేఖర్.  ఈ పుస్తకంలో “జీవన సౌరభాలు”  మరియు “స్వాతంత్ర్య సమరయోధులు” అని రెండు భాగాలున్నాయి.

“జీవన సౌరభాలు” లోని "సకల సౌభాగ్యాల పరమావధి కన్నతల్లి" అన్న కవితలో "అడగకుండా బిడ్డ ఆకలిని తెలుసుకునేది తల్లి.. బిడ్డ ఆకలి తీర్చడానికి పస్తులుండేది తల్లి" అని, ప్రపంచంలో అడగకుండానే బిడ్డ ఆకలిని గుర్తించే ఏకైక వ్యక్తి కన్నతల్లి మాత్రమే అనే అక్షర సత్యాన్ని అందమైన పదాల పొందికతో పాఠకుడికి పసందైన విందును అందించారు. ఈ కవిత చదివిన ప్రతి పాఠకుడి మదిలో కన్నతల్లిపై మమకారం ఉప్పొంగేలా, తల్లిప్రేమను వివరించిన తీరు వర్ణనాతీతం అనిపిస్తుంది. మరో కవితలో "జీవం పోసేది అమ్మ అయితే.. జీవితం ఇచ్చేది నాన్న", "జీవితపు నాణేనికి అమ్మ బొమ్మ అయితే.. బొరుసు నాన్న" అని కడదాకా తనకోసం, తన సుఖసంతోషాలకోసం ఏనాడూ ఆలోచించక జీవితమంతా కన్నబిడ్డలకోసం పరితపించే ‘నాన్న’ గురుంచి ఎంతో అద్భుతంగా చెప్పారు. కవన చంద్రికలు లోని ఒక్కో కవిత చదువుతున్నప్పుడు పాఠకుడు తాను కూడా కవిత్వం రాయాలన్న ఉద్విగ్నతకు లోనవుతాడు. పాఠకులను మంత్రముగ్దులను చేసే ప్రాసతో కవిత్వం రాయడమంటే అది యేచెన్ చంద్రశేఖర్ గారికే సాధ్యం అనే భావన ఏర్పడుతుంది. ఈ పుస్తకంలోని 49 కవితలు సరళమైన తెలుగు భాషలో సామాన్య పాఠకులకు సైతం కవిత్వంపై అనురక్తి  కలిగించే విధంగా ఉన్నాయి.

"సుఖం మరిగిన మనిషి" కవితను గమనిస్తే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ‘ఆధునికత’ పేరుతో మనిషి సుఖాలకు అలవాటుపడుతూ యాంత్రికంగా మారుతున్న విషయాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు. మనిషి సుఖాలకు అలవాటుపడి, శారీరక శ్రమ లేక రోగాల పాలవుతున్నాడు. సమాజంలో మార్పు రావాలి. కానీ, ఆ మార్పు వలన మనిషికి ప్రయోజనం కలగాలి తప్ప పరాభవం, పతనం కాకూడదన్న విషయాన్నీ కవిత రూపంలో చెప్పడమనేది చాల గొప్ప విషయం. "కాయకష్టం మరిచాడు మనిషి.. సోమరిగా మారిపోయాడు మనిషి" అని అయన వాపోవడం ముమ్మాటికీ వాస్తవమే కదా! ఒకానొకప్పుడు మనిషి మూడుపూటల అన్నంకోసం కష్టపడి పనిచేసేవాడు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.  ఉచితాలకు అలవాటుపడి కష్టాన్ని మరిచిన మాట వాస్తవమే. సుఖం మరిగిన మనిషి గురుంచి ఎన్నో విషయాలను  ఈ కవితలో ప్రస్తావించారు.

"ఛిద్రమవుతున్న బతుకు చిత్రం" కవితలో , ‘కరోనా’ నేపథ్యంలో బడుగుల బతుకు కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తూ రచయిత ఇలా అన్నారు ...

"ఛిద్రమవుతున్నాయి బడుగుల బతుకులు..
మానలేదింకా కరోనా రేపిన గాయాలు"
"అంతలోనే విరుచుకుపడ్డ ధరల శరాఘాతాలు.. ఆకాశాన్నంటే ధరలతో తప్పట్లేదు వెతలు"

కరోనా ప్రభావంతో సామాన్యుడు చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తోంటే, ఆకాశాన్నంటే నిత్యావసర వస్తువుల ధరలు పెను భారాన్ని మోపుతున్నాయని, అరకొర సంపాదనతో జీవితాలు కుదేలవుతున్నాయని అయినా బడుగు జీవులు సంసారసాగరమీదడానికి భగీరథప్రయత్నాలు చేస్తున్నారని ఈ కవిత ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు.

"స్నేహం" ఈ కవితలో "అవసరానికి ఆదుకునే ఆపన్న హస్తమే స్నేహం.. చెమర్చిన కన్నులలో చెదిరిపోని జ్ఞాపకమే స్నేహం" అంటూ, ఈ సృష్టిలో స్నేహానికి మించిన గొప్ప వరం మరొకటి లేదంటాడు రచయిత. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి మనిషికి కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. అందుకే మంచి స్నేహితున్ని మించిన ఆస్తి లేదంటారు. మన జీవితంలో లక్షలు, కోట్ల సంపదకన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహం దొరకడం గొప్ప వరం. స్నేహానికి ఎల్లలు, కులం, మతాలుండవు.  “స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా” అనే అక్షర సత్యాన్ని స్పష్టంగా వివరించారు.

రెండవ భాగం “స్వాతంత్ర్య సమరయోధులు”లో 37 కవితలు చరిత్రలో అట్టడుగు పుటలలో శిధిలావస్థలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల గురుంచి రాశారు. వారిలో చాలా మంది గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. చరిత్ర మరిచిన అలాంటి మహనీయుల గాధలను భవిష్యత్‌ తరాలు స్ఫూర్తిగా తీసుకునేలా, ఆ యోధుల త్యాగాలను విశ్లేషిస్తూ క్లుప్తంగా వివరించారు.

"కవన చంద్రికలు" లోని ప్రతి కవిత దేనికది ప్రత్యేకమే. ప్రతి కవిత కూడా పాఠకుడిని భావుకతకు గురిచేసేలా రాయడం  ఆయన రచనాశైలికి కలికితురాయిగా నిలుస్తాయి. చదివిన ప్రతి పాఠకుడు, కలం చేతబట్టి తన హృదయంతరాలాల్లో గూడుకట్టుకున్న భావాలకు జీవం పోయాలనే ప్రేరణ కలిగించేలా సాగింది యేచెన్ చంద్రశేఖర్ “కవన చంద్రికలు”. సమాజాభివృద్ధికి ఉపయోగపడే మరిన్ని కవితలు యేచెన్ చంద్ర శేఖర్ గారి కలం నుండి జాలువారాలని ఒక పాఠకుడిగా నా ప్రగాఢ  ఆకాంక్ష.

“కవన చంద్రికలు” ప్రతుల కోసం రచయితను నేరుగా మొబైల్ నెంబర్ +91 8885050822 కు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా లేదా chandrashekar.achen@gmail.com కు ఈమెయిల్ పంపడం ద్వారా సంప్రదించవచ్చు. 

వ్యాస రచయిత
కోట దామోదర్
మొబైల్: 9391480475



హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్ "వరుణవి"

  హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్  "వరుణవి" ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేరు అనే మాట నిజమని చక్కగా సాక్ష్య...