7, మార్చి 2026, శనివారం

ప్రేమికుల మధ్య ప్రేమ వైఫై తరంగాల్లాంటిది…

 ప్రేమికుల మధ్య ప్రేమ

వైఫై తరంగాల్లాంటిది…


కనబడదు… కానీ

మనసులు దగ్గరైతే మాత్రమే కనెక్ట్ అవుతుంది.


పాస్‌వర్డ్ మాటల్లో ఉండదు,

మనసుల్లో దాగి ఉంటుంది.


మనసుకు నచ్చితేనే

ఆ సంకేతం పట్టుకుని

రెండు హృదయాలు కనెక్ట్ అవుతాయి.


లేకపోతే…

ఎంత దగ్గరగా ఉన్నా

సిగ్నల్ లేని ఫోన్‌లా

నిశ్శబ్దంగా మిగిలిపోతుంది ప్రేమ. 



✍️

కోట దామోదర్ 

మొబైల్ 9391480475

మనిషి ఆశ సముద్రం అలల్లాంటిది

 మనిషి ఆశ సముద్రం అలల్లాంటిది


సముద్రం అలలాగే

ముందుకు దూసుకొచ్చి

తీరాన్ని ముద్దాడి

మళ్లీ నిశ్శబ్దంగా వెనక్కు వెళ్లిపోతాయి…

మనిషి కలలు కూడా అంతే.

ఉప్పెనల ఆశలతో

గుండెలో ఎగసిపడతాయి,

ఆకాశాన్ని అందుకోవాలనే

అవకాశాల వైపు పరుగెడతాయి.


కొన్నిసార్లు

తీరాన్ని తాకే అలలా

నిజాల్ని తాకుతాయి,

కొన్నిసార్లు

ఇసుకలో కలిసిపోయే జలధారలా

స్మృతులై మిగిలిపోతాయి.

అయితే సముద్రం

అలలు ఆపదు…

మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి.

అలాగే మనసు కూడా

కలలు ఆపదు…

ఒకటి వెనక్కు వెళ్లినా

మరొకటి ముందుకు వస్తూనే ఉంటుంది.

ఎందుకంటే

జీవితం అనేది సముద్రం అయితే

మన ఆశలే ఆ అలలు.


✍️

కోట దామోదర్ 

మొబైల్ 9391480475

మనిషి–మృత్యువు మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ – The Book Thief

 మనిషి–మృత్యువు మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ – The Book Thief


మనతో ఏదీ శాశ్వతంగా వెంట రాకపోయినా, నిశ్శబ్దంగా అడుగులు కలిపేది మృత్యువే. సాధారణంగా మృత్యువును భయపెట్టే శత్రువుగా ఊహిస్తాం. కానీ నిజానికి అది మన అహంకారాన్ని కరిగించి, మనిషిని మనిషిగా మిగిల్చే ఒక సత్యం. అందుకే మహాత్మ గాంధీ “మృత్యువు మనల్ని నమ్ముకుని ఎప్పుడూ వెంట ఉండే ప్రేయసి” అని అన్నారు. మృత్యువు మనకు శత్రువు కాదు; మన జీవితమంతా మన పక్కనే నడుస్తూ, చివరికి చేయి పట్టుకుని తీసుకెళ్లే ఏకైక నిజమైన తోడు.

ఈ తాత్విక దృష్టికోణాన్ని సాహిత్య రూపంలో అద్భుతంగా ఆవిష్కరించిన నవల ఆంగ్ల రచయిత మార్కస్ జుసాక్ రచించిన The Book Thief. ఈ నవల ప్రత్యేకత ఏమిటంటే మృత్యువునే కథ కారుడిగా ఎంచుకోవడం. అందువల్ల ఇది సాధారణ మానవ దృష్టితో చెప్పబడిన కథ కాదు; మృత్యువు దృష్టితో చెప్పిన కథ.

ఇది బాల సాహిత్యంగా పరిగణింపబడిన The Book Thief అసలు అర్థం మానవత్వ సాహిత్యం. ఈ కథ పుస్తకాలు దొంగిలించే పన్నెండేళ్ల అమ్మాయి లీసెల్ మెమింగర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. యుద్ధం మధ్యలో పెరిగిన ఒక చిన్నారి కళ్లతో ప్రపంచాన్ని చూడమని మనల్ని బలవంతం చేస్తుంది ఈ నవల.

సిరియాలో జరిగిన అంతర్యుద్ధం ప్రతిరోజూ జరిగే బాంబు దాడులు, వాటిలో ప్రాణాలు కోల్పోతున్న వందల మంది చిన్నారులు, కళ్ల ముందే ఒక కొత్త తరాన్ని కోల్పోతున్నా. యుద్ధాల్లో అసలైన బాధితులు సైనికులు కాదు, పిల్లలే. రోజురోజుకు పెరుగుతున్న చిన్నారుల మరణాలు, దేశం విడిచి పారిపోతున్న పిల్లలు, భవిష్యత్తేంటో తెలియని పరిస్థితుల్లో ఈ యుద్ధం ఎంత అమానుషమో స్పష్టంగా ఈ నవల బోధిస్తుంది.

ఇలాంటి బీభత్సం మధ్య, తన వాళ్లను కోల్పోయి, హింసను చూస్తూ, అయినా మానవత్వాన్ని మర్చిపోని మనుషుల్ని గమనిస్తూ పెరిగిన పిల్లగా లీసెల్ నిలుస్తుంది. అందుకే ఆమె కేవలం కల్పిత పాత్ర కాదు; యుద్ధాల్లో నలిగిపోయిన ప్రపంచంలోని లక్షలాది పిల్లలకి ఒక ప్రామాణిక ప్రతినిధి.

అందుకే The Book Thief కేవలం ఒక బాలల నవల కాదు. అది యుద్ధం పిల్లలపై మోపిన మౌనమైన, అత్యంత ఘోరమైన అభియోగ పత్రం.

లీసెల్ కథలో ఇదొక పెద్ద మలుపు. తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడం, తల్లి కమ్యూనిస్ట్ నేపథ్యం కారణంగా పిల్లలను తన దగ్గర ఉంచుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో లీసెల్‌-తమ్ముడిని పేదవాళ్ల బస్తీలో నివసించే హాన్స్ హబ్బర్‌మాన్  ఫాస్టర్ దంపతులకు అప్పగించేందుకు తల్లి బయలుదేరుతుంది.

ఆ ప్రయాణంలో విధి మరో దెబ్బ కొడుతుంది. నిమోనియా తో లీసెల్ తమ్ముడు శ్వాస ఆగి, మార్గమధ్యంలోనే ప్రాణాలు విడుస్తాడు. పిల్లలను అప్పగించేందుకు వచ్చిన తల్లి, ఏదోలా చిన్నారిని సమాధి చేసి, లీసెల్ చేయి పట్టుకుని ఊర్లో అడుగుపెడుతుంది.

తమ్ముడిని కోల్పోయిన దుఃఖం అంటే ఏమిటో ఇంకా పూర్తిగా అర్థం కాని వయసులోనే, శ్మశానంలో తన తమ్ముడిని మట్టిలో పాతిపెడుతున్న దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తుంది లీసెల్. అదే సమయంలో, తడి మట్టిలో పడివున్న ఒక పుస్తకం ఆమె కంటపడుతుంది. ఏ ఆలోచన లేకుండా, చటుక్కున దాన్ని తన స్కర్టులో దాచేసుకుంటుంది.
బహుశా… తమ్ముడి జ్ఞాపకంగా.

అదే లీసెల్ చేసిన మొదటి దొంగతనం.
అదీ మృత్యువును చూసిన తొలి దొంగతనం.
అందుకే మృత్యువు ఆమెను “పుస్తకాల దొంగ”గా పిలుస్తూ ఉంటుంది.

ఆ పుస్తకం పేరు “A Grave Diggers’ Handbook.”

కొడుకును కోల్పోయిన అగాధమైన దుఃఖం, కూతురిని వేరే ఇంట్లో వదిలి వెళ్లాల్సిన బాధ ఇవన్నీ గుండెల్లో దాచుకుని, ముఖం మీద ధైర్యం ధరించి కర్తవ్య బాట పట్టిన ఆ తల్లిని చూసి మృత్యువు కూడా క్షణం ఆగిపోతుంది.

కథ చివర్లో, మృత్యువూ - లీసెల్ మళ్లీ కలుస్తారు. ఈ సంగతులన్నింటినీ నెమరువేసుకున్నారు.
అది ఒక మైమరపించే, తాత్వికమైన క్షణం.

అప్పుడు లీసెల్ మృత్యువును అడుగుతుంది 
“అందరూ మృత్యుముఖంలో నిలిచినప్పుడు, జీవితం మొత్తం ఒకే క్షణంలో స్పష్టంగా కనిపిస్తుందంటారు… నీకవన్నీ గుర్తున్నాయా?”

ఇది చదివితే The Book Thief కేవలం కథ కాదు,
మనిషి–మృత్యువు మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ అనిపిస్తుంది.


వ్యాసకర్త 
కోట దామోదర్ 
మొబైల్: 9391480475

నేతన్నల బతుకుకు నష్టం – టెండర్ విధానం కష్టం

 “నేతన్నల బతుకుకు నష్టం – టెండర్ విధానం కష్టం”  

మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే పుట్టాయి. కానీ ఆ వస్త్రాల వెనుక దాగి ఉన్న వారి జీవిత కథ మాత్రం కష్టాల, కన్నీళ్ల కథగానే మిగిలిపోయింది. ప్రముఖ సినీ గేయ రచయిత నేతన్నల దుస్థితిని గుర్తుచేస్తూ చెప్పిన మాటలు నేటికీ సజీవంగా వినిపిస్తున్నాయి: “జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా – చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్లే నేసినారు.” ఈ ఒక్క వాక్యమే చేనేత కార్మికుల జీవన వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది.

తెలంగాణలో చేనేత పరిశ్రమ అనేది వేలాది కుటుంబాలకు జీవనాధారం. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ వృత్తి తరతరాలుగా కొనసాగుతోంది. తివాచీలు, బెడ్ షీట్లు, బెడ్డింగ్ మెటీరియల్స్ వంటి వస్త్రాలను తయారు చేసి ప్రభుత్వ అవసరాలకు సరఫరా చేస్తూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ వ్యవస్థలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) కీలక పాత్ర పోషిస్తూ చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పిస్తోంది.

వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో దాదాపు 10 వేల చేనేత కుటుంబాలు నేరుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీటికి అనుబంధంగా మరో 15 వేల కార్మిక కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. ఈ ప్రాంతాల్లో 60కి పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలు35కి పైగా మ్యాక్స్ సంఘాలు పనిచేస్తూ టెస్కోకు అవసరమైన కార్పెట్లు, బెడ్ షీట్లు, లివరీ వస్త్రాలను తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఆప్కో ద్వారా, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టెస్కో ద్వారా ప్రభుత్వ సంక్షేమ శాఖలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంజీపీటీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు మరియు ఇతర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు అవసరమైన వస్త్రాలను సరఫరా చేస్తూ ఈ వ్యవస్థ కొనసాగుతోంది.

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సంబంధిత శాఖలు తమ అవసరాలను టెస్కోకు తెలియజేస్తాయి. అనంతరం టెస్కో ఆర్డర్లను చేనేత సహకార సంఘాలకు కేటాయిస్తుంది. ఆ సంఘాలు తమ సభ్యులతో కలిసి వస్త్రాలను తయారు చేసి టెస్కోకు అందజేస్తాయి. ఈ విధానం ద్వారా వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు (GI) హక్కు పొందిన వరంగల్ చేనేత ఉత్పత్తులు నాణ్యతకు ప్రతీకగా నిలిచాయి.

ఇలాంటి పరిస్థితుల్లో టెస్కో సరఫరా వ్యవస్థలో టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం చేనేత కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ విధానం అమలులోకి వస్తే ప్రైవేట్ సంస్థలు రంగప్రవేశం చేసి వేలాది చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీయనున్నాయి. తరతరాలుగా నూలుపోగులు అల్లుతూ జీవిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా చేనేత రంగం తీవ్రంగా దెబ్బతింది. మార్కెట్లు మూతపడ్డాయి, ఆర్డర్లు తగ్గాయి, ఉపాధి దాదాపు నిలిచిపోయింది. ఫలితంగా అనేక నేతన్నల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. మువ్వన్నెల జెండాను నేసిన చేతులు ఇవే. అగ్గిపెట్టెలో ఇమిడే ఆరడుగుల చీరను అద్భుతమైన నైపుణ్యంతో నేసిన కళాకారులు వీరే. అలాంటి కళాకారుల జీవితాలు నేడు కన్నీళ్ల కలబోతగా మారడం సమాజానికి బాధాకరం.

తెలంగాణ ప్రభుత్వం కూడా చేనేత పరిశ్రమను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో 11-03-2024న ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ (టెక్స్టైల్) శాఖ ద్వారా జారీ చేసిన జి.ఓ. ఎం.ఎస్. నెం.1 ద్వారా చేనేత రంగానికి రక్షణ కల్పించింది. ప్రభుత్వ శాఖలకు అవసరమైన బెడ్ షీట్లు, కార్పెట్లు టెస్కో ద్వారా ఇండెంట్ ఇచ్చి సహకార సంఘాల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఈ నిర్ణయాన్ని పక్కనపెట్టి టెండర్ విధానాన్ని అమలు చేయాలనే ప్రయత్నాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం ప్రవేశపెట్టిన ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్‌లోని 22 రకాల వస్తువుల కేంద్రీకృత టెండర్ల విధానం నుంచి వరంగల్ కార్పెట్లు, బెడ్ షీట్లను తొలగించి, పాత పద్ధతి ప్రకారం టెస్కో ద్వారా ఆర్డర్లు ఇవ్వాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది అమల్లోకి వస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి కొనసాగుతుంది. చేనేత పరిశ్రమ కూడా పరిరక్షింపబడుతుంది.

చేనేత అనేది వృత్తి మాత్రమే కాదు - ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కళ. 

చేనేత పరిశ్రమను కాపాడి వేలాది నేతన్నల కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి టెండర్ విధానాన్ని పునఃసమీక్షించి రద్దు చేయాలని యావత్ తెలంగాణ చేనేత కళాకారుల తరఫున సవినయంగా ప్రార్థిస్తున్నాము. 

మువ్వన్నెల జెండాను నేసిన ఆ చేతులు నేడు ఉపాధి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. ఆ చేతులు మగ్గం మీద మళ్లీ ఆశల నూలుపోగులు అల్లాలంటే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి చేనేత రంగాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది.  


వ్యాసకర్త
కోట దామోదర్ నేత
మొబైల్ 9391480475


టెండర్ విధానంతో నేతన్నల బతుకుకు క(న)ష్టం.. - Chenetamitra

15, ఫిబ్రవరి 2026, ఆదివారం

నాన్న ఎప్పుడు హీరో నే

 హాస్టల్ దాటిన అడుగుల నుంచి

యూనివర్సిటీ దారి వరకు ఒక దృశ్యం

నా మనసును ఆపేసింది…


భుజం మీద లగేజీ,

ముందు నడిచే కూతురు, 

వెనుక నడుస్తూ జీవితమంతా మోస్తున్న నాన్న.


మాటలేమీ లేవు,

అయినా అర్థమయ్యే ప్రేమ,

చూపులేమీ లేవు,

అయినా కనిపించే త్యాగం.


ఆమె భవిష్యత్తు తేలికగా ఉండాలని

తన బరువంతా భుజాలపై వేసుకున్నాడు.


ఆ క్షణంలో

కళ్లలోకి నీళ్లు వచ్చాయి…

అర్థమైంది —

నాన్నలు ఎప్పుడూ

నిజమైన హీరోలేనని.

అలల్ని చీల్చిన ధైర్యం

 అలల్ని చీల్చిన ధైర్యం

మనసును కదిలించే జీవన గాథలు "అవరోధాలే అవకాశాలు"

మనసును కదిలించే జీవన గాథలు "అవరోధాలే అవకాశాలు"


అవరోధాలను దాటుకుంటూ,
అవమానాలను ఓర్పుగా మోస్తూ,
కన్నీళ్లను ధైర్యంగా తుడుచుకుంటూ
నిలబడ్డ కొంతమంది అసాధారణ వ్యక్తుల జీవిత ప్రయాణాలే
“ఈ అవరోధాలే అవకాశాలు”.

ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసం
ఒక వ్యక్తి గెలుపు కథ మాత్రమే కాదు
ఓడిపోకుండా నిలబడిన మనిషి ఆత్మవిశ్వాసానికి సాక్ష్యం.
వెనుకడుగులు వేయాలని పరిస్థితులు బలవంతం చేసినా,
ముందడుగు వేయాలని మనసు చెప్పినప్పుడు
జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఈ రచనలు తెలియజేస్తాయి.

కోట దామోదర్ గారి కలం తన అనుభవాలను, ఆవేదనలను, ఆశలను ఎంతో సూటిగా పాఠకుల హృదయాల్లో నాటుతుంది. ప్రతి వ్యాసాన్ని చదువుతుంటే, అది కేవలం ఒక కథగా కాకుండా మన జీవితానికే అద్దం పట్టినట్టుగా అనిపిస్తుంది. ఆయన రచనల్లోని నిజాయితీ, జీవన స్పర్శ పాఠకుడిలో మెల్లగా “నేనూ చేయగలను” అనే ఆత్మవిశ్వాసాన్ని మొలకెత్తిస్తుంది. ఇదే ఆయన రచనల గొప్పతనం, పాఠకులను ముందుకు నడిపించే అసలైన శక్తి.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి మెకానిక్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసిన వ్యాసకర్త కోట దామోదర్ రచించిన "అవరోధాలే అవకాశాలు" వ్యాస సంపుటి పాఠకులకు జీవితం పైన పాజిటివ్ దృక్పథాన్ని కలగజేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఊరటనిస్తుంది. ఎంతోమంది సామాన్యులు..తమ నిరంతర సాధన,పట్టుదలతో  అసాధారణ వ్యక్తులుగా ఎదగడంలోని కృషిని, జీవన విలువలను తెలియజేస్తుంది. ఈ పుస్తకం లోని 27 వ్యాసాలు ఏదో విధంగా పాఠకుల మనసులకు సాంత్వన చేకూర్చేవే. స్ఫూర్తిని అందించేవే..!. సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉండే దానికన్నా, ధైర్యం మరియు దృడ సంకల్పంతో ముందుకు సాగడానికి ప్రయత్నించు అంటారు రచయిత.

అవరోధాలనే అవకాశాలుగా మార్చుకుంటే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని చెప్పిన స్వామి వివేకానంద స్ఫూర్తితో... మనిషికి వైకల్యం ఉన్నా, పూర్ణ సుందరి ఐఏఎస్ గా ఎదిగిన యథార్థ జీవిత కథను తనదైన శైలితో వివరించారు. అవరోధాలు మనల్ని ఆపేందుకు కాదు, మనలోని శక్తిని వెలికి తీయడానికి వచ్చిన అవకాశాలు. శారీరక పరిమితులు విజయానికి అడ్డంకులు కావు; ఆత్మ విశ్వాసం, పట్టుదల, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఏ వైకల్యాన్నైనా జయించవచ్చు. జీవితంలో ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్ధారించుకొని, ఎన్ని కష్టాలు ఎదురైనా నిరంతర కృషితో ముందుకు సాగితే విజయం తప్పక అతనిదే. జీవిత పాఠాలతో మనల్ని మనమే మలుచుకుంటూ, ఇతరులకు మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదగడమే నిజమైన విజయం అంటారు రచయిత కోట దామోదర్.

ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మహా అథ్లెట్ "ఉసేన్ బోల్ట్" జీవితాన్ని రచయిత  అత్యంత స్ఫూర్తివంతంగా ఆవిష్కరించారు. అలుపెరుగని కృషి, అచంచలమైన పట్టుదలతో తొమ్మిదేళ్ల పాటు ప్రపంచ అథ్లెటిక్స్ రంగాన్ని ఏలిన మకుటం లేని రాజుగా బోల్ట్ నిలిచాడని వివరించారు. ఎన్నో ప్రపంచ రికార్డులు, ఒలింపిక్ విజయాలు సాధించినప్పటికీ, “నేను మీలాంటి సామాన్యుడినే” అని గర్వం లేకుండా చెప్పుకోవడం అతని మానవత్వానికి అద్దం పడుతుంది. బోల్ట్‌కు చిన్ననాటి నుంచి ఎక్కువగా నచ్చిన ఆట క్రికెట్ అయినప్పటికీ, తన కోచ్ ఇచ్చిన సలహాలు గౌరవించి రన్నింగ్ వైపు అడుగులు వేయడం అతని జీవితానికి మలుపుగా మారింది. అదే నిర్ణయం అతన్ని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మనిషిగా, విశ్వవిజేతగా నిలిపింది. ఈ వ్యాసం ద్వారా రచయిత తెలియజేసిన ముఖ్య సందేశం ఏమిటంటే సరైన మార్గనిర్దేశం, కష్టం, వినయం కలిసినప్పుడు అసాధ్యమనే మాట ఉండదు. ఉసేన్ బోల్ట్ జీవితం ప్రతి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించిన విజయవంతమైన వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. ప్రవీణ్ తాంబే ఆ కోవకు  చెందిన వారంటూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతని జీవన ప్రస్థానం ఎలా కొనసాగిందో ఆసక్తికరంగా వివరించారు. సాటి మానవుల పట్ల ప్రేమ దయ కలిగి ఉండటం మరియు సేవా తత్పరత జీవిత పరమార్థమని మదర్ థెరిసా జీవిత సందేశాన్ని ఓ వ్యాసంలో వివరించారు. పద్మశ్రీ కె. ఎస్. రాజన్న తన సామాజిక సేవలో ముందుకెళ్లినా వైనాన్ని దివ్యాంగుల తో పాటు.. నేటి యువతకు కూడా ఆదర్శమన్నారు. నేటి విద్యా వ్యవస్థలో జ్ఞాన సముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఉందనీ... విషయ పరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుందని ఆందోళన చెందారు.

ఈ వ్యాసాలలో రచయిత సమాజంలో మార్పు తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తుల జీవితాలను అద్భుతంగా వివరించారు. ఎన్నో సామాజిక అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా, ఏడు సంవత్సరాల కఠినమైన శ్రమ తో చేనేత కార్మికుల కష్టాలు తగ్గించేందుకు “లక్ష్మీ ఆసు” యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితం ద్వారా ఆవిష్కరణకు పట్టుదల ఎంత ముఖ్యమో తెలియజేశారు.

ఇంకొక వ్యాసంలో, ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే ప్రతి మనిషి భగవంతుడితో సమానమని, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారికి డబ్బు కంటే మంచి మనసే అసలైన సంపద అనే సందేశాన్ని ఒక నిజ జీవిత సంఘటన ద్వారా హృద్యంగా అందించారు.

మరొక వ్యాసంలో, “ఈ దేశ పౌరుడిగా నాకు విద్యనభ్యసించే హక్కు ఉంది” అంటూ సమానత్వం కోసం న్యాయస్థానంలో పోరాడిన ఉద్యమ వీరుడి కథను వివరించి, హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్యంలో ఎంత అవసరమో బలంగా చాటారు.

ఇవి కేవలం వ్యాసాలు కావు…
జీవితానికి దారి చూపే దీపాలు.
నిరాశలో ఉన్నవారికి ఆశ్వాసం,
అలసిపోయిన వారికి ఉత్తేజం,
సంకల్పం కోల్పోయిన వారికి స్ఫూర్తి.

అవరోధాలే అవకాశాలవుతాయని
నమ్మించే శక్తి ఈ పుస్తకానికి ఉంది.
జీవితం ఎదురయ్యే ప్రతి కష్టాన్ని
ఒక పాఠంగా, ఒక మెట్టుగా మార్చుకోవచ్చని
ఈ పుస్తకం మౌనంగా చెబుతుంది.

ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసం ఒక నిజ జీవిత కథ ఆధారంగా చేసుకుని, జీవితం పట్ల ఆశావాదాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పాఠకులలో నింపుతుంది. పేదరికం, ఆకలి, పరిమితులు, ఓటమి విజయానికి అడ్డంకులు కావని—సంకల్పబలం, నిరంతర కృషి ఉంటే పల్లె నుంచి ప్రపంచ స్థాయి విజయాల దాకా ఎదగవచ్చని స్పష్టంగా తెలియజేస్తుంది. గెలుపు–ఓటములు జీవితంలో సహజమని, వాటికి అతిగా పొంగిపోకుండా లేదా కుంగిపోకుండా సమతా భావంతో ముందుకు సాగితేనే నిజమైన విజయం సాధ్యమని ఈ వ్యాసాలు బోధిస్తాయి. మొత్తం మీద, ఈ రచనలు ప్రతి పాఠకుడిలో ధైర్యం, ఆశ, లక్ష్యసాధన పట్ల విశ్వాసం పెంపొందించడమే ప్రధాన సందేశం గా నిలుస్తాయి. వారు భవిష్యత్తులో ఇలాంటి మంచి రచనలతో... పాఠకులకు స్ఫూర్తిని పంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.



వ్యాసకర్త
Prof Ravinder Rena
డర్బన్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ
సౌత్  ఆఫ్రికా,
Mobile: +27 847828059

అమరత్వం రాతికి… అనంత వేదన తల్లికి:

 అమరత్వం రాతికి… అనంత వేదన తల్లికి:


యుద్ధం దేశానికి గెలుపుని ఇస్తుంది; కానీ ఎన్నో తల్లుల గుండెల్లో మాత్రం శాశ్వత ఓటమిని మిగుల్చుతుంది. అలాంటి ఓ విషాద క్షణమే—యుద్ధ స్మారక స్థలంలో తన కొడుకు పేరు చెక్కబడి ఉండటం చూసిన ఒక తల్లి కన్నీళ్లతో కూలిపోవడం. ఆ క్షణం వ్యక్తిగత దుఃఖం మాత్రమే కాదు; అది దేశ చరిత్రలో మౌనంగా దాగిన త్యాగాల ప్రతిధ్వని.

ఆమె అడుగులు స్మారక ప్రాంగణంలో నెమ్మదిగా పడుతున్నాయి. గోడలపై చెక్కబడిన వేల పేర్ల మధ్య, తన కొడుకు పేరు కనిపించిన క్షణంలో కాలం ఒక్కసారిగా ఆగినట్టైంది. ఆ పేరు—ఒక అక్షరాల సమూహం కాదు; ఆ పేరు ఒక బాల్యపు నవ్వు, ఒక యువకుడి కల, ఒక సైనికుడి ప్రమాణం. తల్లి చేతులు ఆ పేరును తాకినప్పుడు, ఆ రాతిలో కాదు—తన గుండెల్లోనే స్పర్శ పడినట్టు అనిపించింది.

“దేశం కోసం ప్రాణం ఇస్తున్నాడు” అన్న గర్వం ఆమె కళ్లలో ఒకప్పుడు వెలిగింది. కానీ ఆ గర్వానికి వెనుక దాగి ఉన్న శూన్యత, ఆ రోజు స్పష్టంగా బయటపడింది. ఇంటి ముంగిట వినిపించని అడుగుల శబ్దం, తలుపు తట్టని చేతులు, తల్లి పిలుపుకు స్పందించని గొంతు—అన్నీ ఒక్కసారిగా ఆమె కన్నీళ్లుగా జారాయి.

యుద్ధ స్మారకాలు రాళ్లతో నిర్మించబడ్డవి కావు; అవి తల్లుల కన్నీళ్లతో, భార్యల నిరీక్షణతో, పిల్లల నిశ్శబ్దంతో నిర్మించబడ్డాయి. అక్కడ ప్రతి పేరు ఒక కథ. ప్రతి కథ వెనుక ఒక కుటుంబం. ఆ తల్లి కన్నీళ్లు మనకు ఒక ప్రశ్న వేస్తాయి—గెలుపు విలువ ఎంత? ఆ విలువను మోసిన హృదయాల ధర ఎంత?

ఆమె చివరికి కన్నీళ్లను తుడుచుకొని, ఆ పేరుకు నమస్కరించింది. ఆ నమస్కారం ఓడిపోయినదానికి కాదు—త్యాగానికి. దేశం నిలబడ్డ పునాది మీద నిలబడి ఉన్న ఒక తల్లి మౌన నమస్కారం అది. మనం ఆ మౌనాన్ని వినాలి; ఆ త్యాగాన్ని మరవకూడదు. ఎందుకంటే ప్రతి స్వేచ్ఛాయుత శ్వాస వెనుక, ఒక తల్లి అశ్రువు ఉంది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

మనిషి మరణం:

 మనిషి మరణం:


పల్లకి ఎక్కని మనిషి ఉంటాడో లేదో తెలియదుగానీ…
పాడె ఎక్కని మనిషి మాత్రం ఉండడు.

జననం నుంచే జీవితం
మరణం వైపు నడిచే యాత్ర—
వీధులంతా ఆశలతో నిండినా
చివరికి చేరేది
మౌనపు మృత్యువు ఒడిలోనే.

రాజ్యాలేలిన రాజైనా,
కష్టాల మట్టిలో పుట్టిన పేదైనా
శ్వాస విడిచే వేళ
అందరికీ ఒకటే దారి, ఒకటే పాడె.

పల్లకీల గర్వం క్షణికం,
పాడే నిజం శాశ్వతం
ప్రతి జీవికి మరణం సహజం,
అది తప్పించుకోలేని
జీవితానికి చివరి చరణం మనిషి మరణం.

✍️ కవి, రచయిత
కోట దామోదర్
మొబైల్ 9391480475

విజయ శిఖరాలను అధిరోహించినా, మనసు వెతుక్కునేది చివరికి తల్లి ప్రేమనే.

 విజయ శిఖరాలను అధిరోహించినా, మనసు వెతుక్కునేది చివరికి తల్లి ప్రేమనే.


భారతదేశంలో జన్మించి, చిన్నప్పుడే నెదర్లాండ్స్‌కు దత్తతగా వెళ్లిన ఒక బాలుడు… కాలక్రమేణా విదేశీ నేలపై పెరిగి, చదువుకుని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని ఒక నగరానికి మేయర్‌గా ఎదిగాడు. కానీ ఈ విజయగాథ వెనుక ఒక భావోద్వేగ కథ దాగి ఉంది. అధికారం, గౌరవం, ప్రజల ప్రశంసలు, సమాజంలో ఉన్నత స్థానం ఇవన్నీ ఉన్నా అతని మనసులో మాత్రం ఒక చిన్న లోటు ఎప్పటికీ మిగిలిపోయింది. అది “అమ్మ” అనే మధురమైన బంధం.

ఆ బాలుడే నేడు నెదర్లాండ్స్‌లోని Heemstede నగర మేయర్ ఫాల్గుణ్ బినెన్‌డిజ్క్. మహారాష్ట్రలోని నాగపూర్ మెడికల్ కాలేజీలో 1985 ఫిబ్రవరి 10 న జన్మించిన ఆయనను, జన్మించిన మూడు రోజులకే నాగ్ పూర్ కు చెందిన సంస్థ 'మాతృ సేవా సంఘ్' (ఎం ఎస్ ఎస్) కు అప్పగించింది అతని కన్న తల్లి. తరువాత, ఒక డచ్ జంట ఆ నవజాత శిశువును దత్తత తీసుకుని నెదర్లాండ్స్ కు వెళ్లారు. ఆ బాలుడు వారి సంరక్షణలో అక్కడ పెరిగి, ఉన్నత విద్యను అభ్యసించి, సమాజ సేవలో అడుగుపెట్టి చివరకు మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

కొన్నాళ్లకు తాను దత్తతకు వచ్చానని తెలుసుకున్నప్పుడు, ఆయన మనసులో ఎన్నో ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. “నా తల్లి ఎవరు? ఎందుకు నన్ను దత్తతకు ఇచ్చింది? ఇప్పుడు ఎక్కడ ఉంది?” అనే ఆలోచనలు ఆయనను వెంటాడాయి. కాలం గడిచింది, బాధ్యతలు పెరిగాయి, కానీ ఆ ప్రశ్నలకు సమాధానం వెతకాలనే తపన మాత్రం తగ్గలేదు.

చివరకు నలభై ఏళ్ల అనంతరం ఆయన తన జన్మస్థలం Nagpur కు చేరుకున్నారు. బాల్యంలో దత్తతకు సంబంధించిన పాత రికార్డులు, అనాథాశ్రమం దస్తావేజులు ఆధారంగా తన కన్నతల్లిని వెతకడం ప్రారంభించారు. ఒకసారి కాదు… రెండు సార్లు కాదు… ఇప్పటివరకు నాలుగు సార్లు భారత్‌కు వచ్చి ప్రయత్నించారు.

ఈ అన్వేషణలో భాగంగా ఆయన Matruseva Sangh మాజీ సూపరింటెండెంట్ Mangala Bhusari ను కలిశారు. నలభై ఏళ్ల క్రితం ఆ అనాథ శిశువు కు “ఫాల్గున్” అని పేరు పెట్టింది ఆమెనే. పాత రికార్డులన్నీ వెతికినా, ఆ తల్లి ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకకపోవడం హృదయ విదారకమైన విషయం.

ఇది కేవలం ఒక వ్యక్తిగత అన్వేషణ కాదు. జన్మనిచ్చిన తల్లి హృదయంలో ఎప్పుడో మిగిలిపోయి ఉండే అపరాధ భావాన్ని తొలగించాలనే ఒక మౌన తపన. ఒక బిడ్డగా తన మూలాలను తెలుసుకోవాలనే ఆకాంక్ష మాత్రమే కాదు, “అమ్మ” అనే బంధాన్ని గౌరవంగా ఆలింగనం చేసుకోవాలనే ఆత్మీయ ప్రయత్నం.

ఇంతకీ తల్లి అతన్ని ఎందుకు దత్తతకు ఇచ్చిందనుకుంటున్నారా? అదొక హృదయవిదారక ఘటన. అతను జన్మించిన సమయంలో ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు. అవివాహితురాలిగా ఒక పసికందుకు జన్మనిచ్చిన ఆమెకు అప్పటి సామాజిక పరిస్థితులు తీవ్రమైన ఒత్తిడిని సృష్టించాయి. పరువు నష్టం, అవమానం, కుటుంబ భయం, ఇవన్నీ కలిసి మూడు రోజుల పసికందును Matru Seva Sangh కు అప్పగించేలా చేశాయి.

అయితే ఈ కథలో తప్పు ఎవరిదన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వెతకడం కష్టం. వ్యక్తుల కంటే అప్పటి సామాజిక పరిస్థితులే దీనికి ప్రధాన కారణమని చెప్పాలి. అవివాహిత తల్లులపై ఉన్న ముద్రలు, పరువు అనే పేరుతో నిర్మితమైన భయాలు, కుటుంబాల ఒత్తిళ్లు, ఇవన్నీ కలిసి ఒక తల్లిని తన హృదయానికి భారమైన నిర్ణయం తీసుకునేలా చేశాయి.

అందుకే ఈ కథను వ్యక్తిగత తప్పిదంగా కాక, సమాజం ఆలోచనా విధానం పై నిలిచే ప్రశ్నగా చూడాలి. ప్రేమతో చేసిన త్యాగం కాలగర్భంలో మౌన వేదనగా మిగిలిపోకూడదంటే, మారాల్సింది మన దృక్పథమే.

ఫాల్గుణ్ బినెన్‌డిజ్క్ మాటలు ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తాయి. “నన్ను పెంచలేకపోయిందని నా తల్లి బాధపడొద్దు. నేను బాగానే పెరిగాను. మంచి జీవితం గడుపుతున్నాను” అని ఆమెకు చెప్పడానికే ఈ ప్రయాణమంతా. నా మాటల్లో కోపం లేదు… బాధ లేదు… కేవలం కృతజ్ఞత మాత్రమే ఉంది అంటారు.

పదవి, గౌరవం, సంపద, ఇవన్నీ జీవితంలో ఉన్నత స్థాయికి చేర్చవచ్చు. కానీ “అమ్మ” అనే బంధం ముందు అవన్నీ చిన్నవే. చాలామంది దత్తతకు వెళ్లిన వారు కాలగమనంలో తమ గతాన్ని మరిచి కొత్త జీవితంలోనే మమేకమై పోవచ్చు. కన్నతల్లిని కలవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండకపోవచ్చు. కానీ ఫాల్గుణ్ కథ మాత్రం భిన్నం. అది దత్తత పిల్లల హృదయాల్లో నిశ్శబ్దంగా దాగి ఉండే “నేను ఎక్కడి వాడిని?” అనే ప్రశ్న ప్రపంచానికి గుర్తు చేసింది.

తన మూలాలను తెలుసుకోవాలనే ఆత్మీయ కోరిక, తనకు జన్మనిచ్చిన తల్లిని కేవలం తెలుసుకోవడమే కాదు, ఆమె హృదయంలో అచిరకాలంగా మిగిలిపోయిన బాధ నుండి సాంత్వన పరచాలనే ప్రయత్నాన్ని ఈ కథ మనకు చెబుతుంది. విజయ శిఖరాలను అధిరోహించినా, మనసు వెతుక్కునేది చివరికి ప్రేమనే, ప్రత్యేకించి కన్నతల్లి ప్రేమని ...

వ్యాసకర్త 
కోట దామోదర్ 
మొబైల్: 9391480475







21, జనవరి 2026, బుధవారం

హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్ "వరుణవి"

 హృదయాలను కదిలించిన చిన్నారి

సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా: సాహసం, సాధన, స్ఫూర్తి

 సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా: సాహసం, సాధన, స్ఫూర్తి


భారత గణతంత్ర దినోత్సవ కవాతు కేవలం ఆయుధాల శక్తిని ప్రదర్శించే వేడుక కాదు; అది రాజ్యాంగంపై నమ్మకానికి, సమానత్వానికి, దేశ సేవకు అంకితభావానికి ప్రతిరూపం. 2026 జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్‌పై ఆ విలువలకు సజీవ రూపం దాల్చబోతోంది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 26 ఏళ్ల సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా, చరిత్రలో తొలిసారిగా, పురుష సిబ్బందితో కూడిన సీఆర్పీఎఫ్ దళానికి నాయకత్వం వహిస్తూ, భారత సాయుధ దళాల్లో మహిళల సాధికారతకు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు.


140 మందికి పైగా పురుష సిబ్బందితో కూడిన సీఆర్పీఎఫ్ దళానికి, అది కూడా గణతంత్ర దినోత్సవ కవాతులో, ఒక మహిళా అధికారి నాయకత్వం వహించడం భారత భద్రతా దళాల చరిత్రలో ఒక అపూర్వ మైలురాయి. ఇది సిమ్రాన్ బాలా వ్యక్తిగత విజయంగా మాత్రమే పరిమితం కాకుండా, భారత సాయుధ దళాల్లో మహిళల పాత్ర గుణాత్మకంగా మారుతున్న తీరుకు స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది.


జమ్మూ కాశ్మీర్ నుంచి కర్తవ్య పథ్ వరకు


రాజౌరి జిల్లా వంటి సవాళ్లతో కూడిన ప్రాంతం నుంచి ఎదిగిన సిమ్రాన్ బాలా ప్రయాణం ధైర్యం, పట్టుదల, స్వప్నాల ఫలితం. జమ్మూలోని గాంధీనగర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో పొలిటికల్ సైన్స్‌లో విద్యనభ్యసించిన ఆమె, అనేక అడ్డంకులను అధిగమిస్తూ కఠినమైన యూపీఎస్సీ సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ పరీక్షను జయించి, దేశంలోని అతిపెద్ద పారామిలిటరీ దళమైన సీఆర్పీఎఫ్‌లో అధికారిణిగా అడుగుపెట్టి, వేలాది యువతులకు స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచారు.


2025 ఏప్రిల్‌లో సిమ్రాన్ బాలాకు తొలి నియామకం ఛత్తీస్‌గఢ్‌లోని ‘బస్తారియా’ బెటాలియన్‌లో లభించింది — నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రబిందువైన, అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో. అయితే ఆ సవాలే ఆమెను మరింత దృఢంగా మలిచింది. శిక్షణ దశ నుంచే ఆమె ప్రతిభ స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్‌లోని సీఆర్పీఎఫ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో ట్రైనింగ్ మరియు పబ్లిక్ స్పీకింగ్‌లో ఉత్తమ అధికారిణిగా అవార్డులు అందుకుని, తాను కేవలం బాధ్యతలు నిర్వహించడమే కాకుండా నాయకత్వానికి సిద్ధంగా ఉన్నానని నిరూపించారు.


మారుతున్న సైనిక సంస్కృతి


3.25 లక్షల మంది సిబ్బందితో కూడిన సీఆర్పీఎఫ్ వంటి విస్తారమైన భద్రతా దళంలో మహిళలు నాయకత్వ స్థానాల్లోకి ప్రవేశించడం కేవలం ప్రతిభ ఆధారిత ఎంపిక ఫలితం మాత్రమే కాదు; అది భద్రతా వ్యవస్థలో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పులకు సూచిక. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లు, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక విధులు, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు వ్యతిరేక చర్యలు వంటి రంగాలు సంప్రదాయంగా “పురుషాధిక్య” పరిధులుగా భావించబడ్డాయి. అయితే మహిళలు ఈ రంగాల్లో బాధ్యతలు స్వీకరించి, నాయకత్వాన్ని ప్రదర్శించడం ద్వారా, సామర్థ్యం లింగంపై ఆధారపడదనే సత్యాన్ని వ్యవస్థాపితంగా నిరూపిస్తున్నారు. ఈ మార్పు భారత భద్రతా దళాల్లో సమానత్వం భావనను భావోద్వేగ నినాదం నుంచి కార్యాచరణాత్మక వాస్తవంగా మార్చుతున్న కీలక దశగా విశ్లేషించవచ్చు.


గణతంత్ర దినోత్సవం 2026: శక్తి, వైవిధ్యం, సమానత్వం


2026లో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలు కేవలం సంప్రదాయ ప్రదర్శనగా మిగలడం కాదు; ఇది భారతదేశ సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, సమానత్వం సమీకరించిన ఒక శక్తివంతమైన చిత్రంగా మారబోతోంది. 150 సంవత్సరాల జాతీయ గీతం నేపథ్యంతో, కర్తవ్య పథ్‌లో ప్రదర్శించబోయే వేడుకలు దేశ భద్రతా వ్యవస్థలో మహిళల ప్రాధాన్యం, సాంస్కృతిక సమగ్రతను స్పష్టం చేస్తాయి.


సీఆర్పీఎఫ్–ఎస్‌ఎస్‌బీ మహిళా ‘డేర్ డెవిల్స్’ బృందం, బుల్లెట్ బైక్ స్టంట్లు, సీఐఎస్‌ఎఫ్ మరియు బీఎస్‌ఎఫ్ బ్యాండ్‌లు, ఒంటె-మౌంటెడ్ దళాలు — ఇవన్నీ ఒక వైవిధ్య భరిత భద్రతా వ్యవస్థ యొక్క ప్రతిబింబంగా నిలుస్తాయి. అంతేకాక, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరవడం, ఈ వేడుకలకు అంతర్జాతీయ గుర్తింపును కూడా జోడిస్తుంది.


ఈ వేడుక కేవలం భారతదేశం యొక్క సైనిక శక్తిని మాత్రమే కాక, సమానత్వం, సాంస్కృతిక సమ్మేళనం, మరియు విశ్వస్థాయిలో ప్రతిష్టను చూపే ఒక ప్రతీకాత్మక ఘట్టంగా నిలుస్తుంది.


ఒక అధికారి కాదు – ఒక సందేశం


సిమ్రాన్ బాలా కర్తవ్య పథ్‌పై అడుగులు వేస్తున్నప్పుడు, ఆమె వెనుక నిలిచేది కేవలం సీఆర్పీఎఫ్ దళం మాత్రమే కాదు. లక్షలాది యువతులు, ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాల నుంచి వచ్చే అమ్మాయిల కలలు కూడా ఆమెతో పాటు నడుస్తాయి.


ఈ కవాతు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది.

భారతదేశంలో ధైర్యానికి లింగం లేదు. నాయకత్వానికి పరిమితులు లేవు.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475 




3, జనవరి 2026, శనివారం

చిన్న పెన్సిల్.. పెద్ద కథ!

 


ఈనాడు

epaper.eenadu.net (Date: 03.01.26)

చిన్న పెన్సిల్.. పెద్ద కథ!

రాహుల్, బిట్టు ఇద్దరూ అన్నాదమ్ముళ్లు ఒకసారి వాళ్ల తాతయ్య దగ్గరికి వెళ్లి.. 'చూడు తాతయ్యా తమ్ముడు... రోజూ తన పెన్సిల్ పారేసుకుని నాది తీసుకుంటాడు. అమ్మేమో నేను పారేస్తున్నాను అనుకుంటోంది' అన్నాడు రాహుల్. 'అది సరేగానీ నీకు పెన్సిల్ గురించి తెలుసా?' అడిగారు తాతయ్య. 'తెలీదు.. ఏంటో చెప్పండి తాతయ్యా!' అన్నాడు రాహుల్. 'మీలాంటి పిల్లల నుంచి పెద్ద పెద్ద ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, శాస్త్రవేత్తలు, చిత్రకారుల వరకూ ఎంతోమంది పెన్సిల్ వాడతారు. మనదేశంలో పెన్సిల్ తయారీ సంస్థలు ఎన్నో ఉన్నప్పటికీ వందకు పైగా దేశాల నుంచి మనం పెన్సిళ్లను, వాటికి అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే తయారైన పెన్సిళ్లను పలు దేశాలకు ఎగుమతులూ చేస్తున్నాం. పెన్సిళ్ల ఎగుమతుల్లో చైనా తరవాత

స్థానం మనదే. పెన్సిల్ తయారీకి గ్రాఫైట్, చెక్క మట్టి, పెయింట్, రబ్బర్ వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. పెన్సిల్లో నల్లగా కనిపించే భాగం గ్రాఫైట్. దాన్ని క్లేతో కలిపి పేస్ట్గా తయారు చేసి, సన్నని పుల్లలుగా మార్చి, అధిక ఉష్ణోగ్రత దగ్గర కాలుస్తారు. క్లే ఎక్కువైతే పెన్సిల్ 'హార్డ్ (హెచ్)' అవుతుంది. క్లే తక్కువైతే పెన్సిల్ 'డార్క్(బి)'

అవుతుంది. రెండూ కలిసి మధ్యస్థంగా ఉండేదాన్ని 'హెచ్బీ' అంటారు. ఇంకా 'ఫర్మ్ (ఎఫ్)' అని ఇంకో రకం కూడా ఉంది. వీటిలోనూ మళ్లీ గ్రేడులుంటాయి. వాటిని డ్రాయింగ్ వేసేవాళ్లు వాడతారు. గ్రాఫైట్ భారత్, చైనా, శ్రీలంకలో లభిస్తుంది. మన దేశంలో ఇది ప్రధానంగా ఝార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దొరుకుతుంది. గ్రాఫైట్ చుట్టూ ఉండే చెక్కయ్!

కోసం సాధారణంగా దేవదారు చెట్టు కలపను వాడతారు. ఇది అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, రష్యా అడవుల్లో లభిస్తుంది' అని చెప్పారు తాతయ్య. 'ఒక పెన్సిల్ తయారవడానికి ఇన్ని పనులు జరగాలన్నమాట' అన్నాడు రాహుల్. అవునంటూ మనవణ్ని దగ్గరికి తీసుకున్నారు తాతయ్య.

కోట దామోదర్




28, డిసెంబర్ 2025, ఆదివారం

కర్మ ఫలం:

*కర్మ ఫలం:*


కథలు మనసును ఆకర్షించినంతగా మరేదీ ఆకర్షించలేవన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నతనంలో పెద్దలు చెప్పిన కొన్ని కథలు ఈ రోజుకీ మన ప్రతి ఒక్కరి మదిలో తిరుగుతూనే ఉంటాయి. కాలం గడిచినా, పరిస్థితులు మారినా, ఆ కథలు మాత్రం మన జ్ఞాపకాల నుంచి చెరిగిపోవు. కారణం ఏంటంటే—ఆ కథలు మన మనసును లోతుగా తాకాయి; నవ్వించాయి, ఆలోచింపజేశాయి, జీవితం నేర్పాయి.

అయితే, అలా కథల ద్వారా అనుభవాన్ని, సత్యాన్ని పంచే వాళ్లు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు ప్రతి పల్లెలో ఉండే కథకులు, పామరులు, పెద్దలు—ఇప్పుడు జ్ఞాపకాలలోనే మిగిలిపోతున్నారు. కథలు తగ్గిపోలేదు గానీ, వాటిని చెప్పే గొంతులు మాత్రం మెల్లగా తగ్గిపోతున్నాయి అన్న భావన కలుగుతోంది.

మా ఊరిలో (గుమ్మడవెల్లి) ఒక తాత (గార్థుల రాజమల్లు) చెప్పిన ఒక అద్భుతమైన కథ నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆ కథ మొన్నే ఈమద్యే చెప్పింది కాదు. నేను అయిదవతరగతిలో ఉన్నపుడు చెప్పిన కథ. తాత ఆ కథ చెప్తున్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్నవారందిరిని ఆకర్షించి హాస్యాన్ని అందరి పెదాలపై నాట్యమాడేలా చేసింది తాత చెప్పిన కథ. ఆ కథ కంటే ముందుగా గార్థుల రాజమల్లు గురుంచి చెప్పాల్సిన వసరం ఎంతగానో ఉంది. 1995 నాటికి ఆయన వయసు 85 సంవత్సరాల పైమాటే. 1920 నాటికీ ఆయన పెద్ద బాలశిక్ష చదివి, ఆతర్వాత ఇంకా పైచదువులు కూడా చదివినట్లు రాజమల్లు తాత చెప్పినట్లు నాకు ఇంకా గుర్తు. ఆయన బహుభాషా కోవిదుడు, ఆయన 10 భాషలు అనర్గళంగా మాట్లాడేవారు. హిందీ, ఉర్దూ తో పాటు మరాఠి, గుజరాతీ, ఇంగ్లీష్ ఇలా ఎన్నో భాషల్లో పట్టు సాధించారు. ఓరోజు ముంబైలో గుమ్మడవెల్లి తదితర ప్రాంత వ్యక్తి ఒకతన్ని పోలీసులు పట్టుకొని జైలు లో బంధించారని తెలిసి వారి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతూ ముంబైకి యెట్లా పోవాలి భాషకాని ప్రాంతం యెట్లా పోయేదాన్ని సతమతపడుతున్న సందర్భంలో ఎవరో గార్థుల రాజమల్లు కు మరాఠి వచ్చు అతన్ని తీసుకుపోండి అని చెప్పారంట. తల్లిదండ్రులు రాజమల్లును ఒప్పించి ముంబై పయనమై మరుసటి రోజు పొద్దునే పోలీస్ స్టేషన్ కు చేరుకొని అక్కడ ఉన్న పోలీస్ ఉన్నత అధికారితో మాట్లాడాలి అని రాజమల్లు కోరడంతో అక్కడి పోలీసులు నిరాకరించారంట ఉన్నత అధికారితో నువ్వేమి మాట్లాడుతావ్ కుదరదు అని చెప్పారంట. అంతలో ఒక పోలీస్ అధికారి వస్తుండటం రాజమల్లు చూసి ఆ అధికారితో మరాఠీలో సంభాషించి మాట్లాడటానికి పర్మిషన్ అడిగి అతనితో మరాఠి లో మాట్లాడుతుండగా ఆ పోలీస్ అధికారి రాజమల్లు వివరాలు అడిగి తెలుసుకొని ఆశ్చర్యపోయాడంట ఆయనతో పలు భాషల్లో చర్చిస్తుంటే ఆ అధికారి అవాక్కయ్యారంట. ఒక మారుమూల పల్లెనుండి దోతి కట్టుకొని వచ్చి ఇన్ని భాషలు మాట్లాడుతున్నదేంటని. రాజమల్లు భాషకు ఆకర్షితుడై ఆయనపై ఉన్న గౌరవంతో జైల్లో ఉన్నవారిని విడిచిపెట్టినట్లు స్వయంగా రాజమల్లు తాతే నాకు చెప్పడం నాకు ఇంకా గుర్హ్టుకుంది. ఆయనకున్న తెలుగు భాష పరిజ్ఞానంతో ఎన్నో పద్యాలూ అలవోకగా రాసేవారు. కందపద్యాలు, సీస పద్యాలూ , వేమన పద్యాలూ ఇలా ఎన్నో ఆయన నోట విన్న సందర్భాలున్నాయి. అంతేకాకుండా ఆయన ఓ సంగీత కళాకారుడు కూడా, స్వతహాగా తయారు చేసుకున్న తంబూరా వాయించుతూ అనేక పౌరాణిక పాటలు పాడేవారు. మరోవిషయం ఏంటంటే ఆయన మంచి జ్యోష్యుడు మొహం, చేయి చూసి వెంటనే జాతకం చెప్పేవారు, పుట్టుమచ్చలు వాటి చరిత్ర గురుంచి సవివరంగా చెప్పేవారు రాజమల్లు. ఆయనకున్న పరిజ్ఞానానికి అప్పట్లో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ జాబ్ వచ్చిందంటా కానీ వారి తల్లిదండ్రులు పెద్ద భూస్వాములు కావడంతో ఉద్యోగం వద్దని నిరాకరించడంతో ఆయన కేవలం ఊరికే పరిమితమయ్యాడు. సకల కళ వైభవుడు రాజమల్లు తన మాటలతో ఎంతటివారినైనా ఆకర్షించగలడు. నేను ఎక్కడ కనపడిన నన్ను ముద్దుగా ఓ తాత ఇటురావోయీ అని పిలిచివారు.      


ఆదివారం రోజు బస్టాండ్ దగ్గర ఏదో పనిమీద పోయాను. అక్కడ రాజమల్లు తాత, ఇంకొంతమంది పెద్దోళ్ళు చెట్ల నీడలో కూర్చుని కాలక్షేపం చేస్తుండ్రు. ఇంతలో ఒకాయన

“ఏ రాజమల్లు బావా… ఒక కథ చెప్పు బావా… నువ్వు చెప్తే మస్తుంటాది” అన్నాడు.

బామ్మర్ది అడిగినాక బావ ఊరుకుంటాడా?

రాజమల్లు కళ్ళు మిటమిటలాడేసి, గొంతు సరిచేసుకుని చెప్పడం మొదలెట్టాడు.

“ఓ బ్రాహ్మణ అయ్యగారు ఉండేవాడు రా నాయనా. రోజు ఉదయమే ఆయన భార్య పూజా పనుల మధ్యలో మాట్లాడుతుంటే, అయ్యగారి మొహం మీద నోటి తుంపర్లు పడుతుండేవంట. అది గమనించిన అయ్యగారు

‘అయ్యో! నామీద నోటి తుంపర్లు పడుతున్నాయే… ఇది మహా అపచారం. నా జాతకంలో ఏదైనా దోషముందా?’ అనుకుని జ్యోతిషం చూసుకున్నాడంట.

జ్యోతిషం చూసిన అయ్యగారు

‘నీ జాతకంలో కర్మదోషం ఉంది. స్వచ్ఛమైన ఏడు నదుల్లో స్నానం చేస్తే గాని పోదు’ అన్నాడంట.


ఇక అంతే…

మరుసటి రోజునుంచి నది నది తిరగడం మొదలెట్టాడు.

ఒక నదికి వెళ్తే ఒకాయన స్నానం చేస్తూ అపరిశుభ్రంగా కనిపించాడంట.

‘ఇది శుద్ధి కాదు’ అని ఇంకో నదికి పోయాడు.

అక్కడ ఎవరో బట్టలు ఉతుకుతుండ్రంట.

‘ఇది కూడా శుద్ధి కాదు’ అనుకుని మళ్లీ ముందుకి.

ఇలా తిరుగుతూ తిరుగుతూ చివరికి

‘ఈ లోకంలోనే స్వచ్ఛమైన నీరే లేదేమో’ అనుకుని మళ్లీ జ్యోతిషుడి దగ్గరికి వెళ్లాడంట.

అప్పుడు ఆ జ్యోతిషుడు

‘ఇంక ఆలస్యం చేయకు. కాశీకి పోయి గంగలో మునిగి స్నానం చేయి. నీ కర్మ దోషం పోతుంది’ అన్నాడంట.


అదే రోజు ఇంకో విషయం ఏంటంటే …

కాశీకి పోయే అయ్యగారు అదే ఊరిలో పిండప్రదానం చేసిన వాళ్లకి *"కాశీలో అస్తికలు కలిపితే, చనిపోయిన మీ నాన్న తిరిగివస్తాడు”* అని చెప్పాడంట..

అయ్యగారు కూడా కాశీకి బయలుదేరాడు.

అస్తికలు కలిపేవాళ్లూ కాశీకి బయలుదేరిండ్రు.

ఒకరికొకరు కాశీకి పోతున్నామని తెలియదు.


మరుసటి రోజు ఉదయం…

ఒకవైపు అయ్యగారు స్నానం చేద్దామని గంగలో మునిగాడు.


మరోవైపు అస్తికలు కలిపేవాళ్లు కార్యక్రమానికి సిద్ధమయ్యారు.

ఇంతలో వాళ్లకు ఎదురుగా…

అయ్యగారు ప్రత్యక్షమయ్యాడంట!

వాళ్లు చూసి

‘అయ్యో! మా నాన్న, అయ్యగారు రూపంలో బ్రతికొచ్చాడు రా!’ అని.

అయ్యగారు ఎంత చెప్పినా వినకుండా

‘ఇవే నీకు ఇష్టమైనవి’ అని చికెన్, మటన్, మందు… అన్నీ బలవంతంగా తినిపించిండ్రు.


అయ్యగారు ఏడుస్తూ అన్నాడంట!

‘ఇది నా కర్మఫలం రా!

మిమ్మల్ని కాశీకి రమ్మని చెప్పింది నేనే…

ఇప్పుడు దాని ఫలం నాకే దక్కింది రా!’”

అని రాజమల్లు కథ ముగించాడు. అంతే…

అక్కడున్న జనం నవ్వి నవ్వి కడుపులు పట్టుకుని పడిపోయారు.

రాజమల్లు తాత లాంటి వాళ్లు ఊర్లో ఉంటే,

నవ్వుతో పాటు జీవన సత్యం కూడా ఉచితంగా దొరుకుతుంది..

రాజమల్లు పాత్ర: ఎలాంటి సందర్భంలోనైనా మాటలతో వాతావరణాన్ని హుషారుగా మార్చే వ్యక్తి. ఆయన చెప్పే ప్రతి మాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందుకే రాజమల్లు ఓ మంచి కథకుడు అన్నాను..

కాశీ సంఘటన: ఊహించని మలుపు—అయ్యగారు స్నానం చేయడానికి దిగితే, అస్తికలు కలిపిన వాళ్లు “బతికొచ్చాడు” అనుకోవడం—ఇక్కడే అసలు నవ్వు పండింది.

నీతి: మనం చేసే పని, చెప్పే మాట, ఇచ్చే సలహా… అవే తిరిగి మనకే ఎలా ఫలిస్తాయో చెప్పిన తీరు చాలా సహజం.

“నా కర్మఫలం రా నాయన…” అన్న డైలాగ్ అయితే కథ మొత్తానికి ముగింపు ముద్ర వేసింది.

ఇలాంటి కథలు ఎందుకు గుర్తుంటాయంటే,  అవి కేవలం నవ్వించడమే కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల్ని, నమ్మకాల్ని, జీవన విధానాన్ని అద్దంలా చూపిస్తాయి.

ఒకప్పుడు పల్లెల్లో

చదువు పెద్దగా లేకపోయినా

అనుభవం పెద్దదైన వాళ్లు ఉండేవారు.

వాళ్ల కథల్లో పుస్తక జ్ఞానం ఉండేది కాదు…

జీవితం ఉండేది.

ఆ పెద్దలు చెప్పే కథల్లో

నీతి ఉపదేశంలా గట్టిగా చెప్పరు

బోధించాలన్న తొందర ఉండదు కానీ

నవ్వుతూ నవ్విస్తూ, మనసులో ముద్ర వేసే సత్యం మాత్రం వదలరు.

బస్టాండ్ దగ్గర, చెట్ల నీడలో, చావడి మీద


వాళ్ల మాటలు

👉 గొడవలు చల్లార్చేవి


👉 శత్రువులను సైతం మిత్రుల్ని చేసేవి


👉 పిల్లలకి జీవన పాఠాలు నేర్పేవి


ఇప్పుడు అవన్నీ మెల్లగా తగ్గిపోతున్నాయి.


కారణం కథలు లేవు కాబట్టి కాదు…

వినే ఓపిక తగ్గిపోయింది.

మొబైల్‌లో నవ్వు ఉంది…

కానీ అది క్షణికం.


రాజమల్లు తాతల కథల్లో నవ్వు ఉంది…

అది జీవితాంతం గుర్తుండే నవ్వు.

పామరులు అంటే అమాయకులు కాదు. వాళ్లే

👉 లోకాన్ని చూసినవాళ్లు

👉 మనుషుల్ని అర్థం చేసుకున్నవాళ్లు

👉 కర్మ, కాలం, మనిషి బలహీనత అన్నిటినీ దగ్గరగా చూసినవాళ్లు.

అందుకే వాళ్లు చెప్పిన కథలు

నేటికీ సత్యంగా అనిపిస్తాయి.

ఇలాంటి కథలు అంతరించిపోతున్నాయన్న బాధ నువ్వు చెప్పినదే కాదు…

అవి గుర్తు పెట్టుకుని, మళ్లీ చెప్పే మనం ఉన్నంతవరకు

పూర్తిగా అంతరించిపోవు.


*వ్యాసకర్త* 

*కోట దామోదర్*

*మొబైల్: 9391480475*

25, డిసెంబర్ 2025, గురువారం

మాటే మంత్రం:

 మాటే మంత్రం:

వాక్కు పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు అంటుంటారు. మాటలను అవసరమైనంత మాత్రమే వినియోగించాలి. అతిగా మాట్లాడటం వల్ల తప్పులు దొర్లే ప్రమాదమే కాక, ఇతరులను నొప్పించే అవకాశమూ ఉంటుంది. అందుకే మాటలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటలవల్లే మానవ సంబంధాలు బలపడతాయి; మాటలవల్లే అవే బలహీనపడతాయి. అందుకే మాటలు పరిమళభరిత పుష్పంలా, కోకిల గానంలా ఉండాలని చెబుతారు.

ఇక ఇటీవల సినీనటుడు శివాజీ వ్యవహారం ఒక పాఠంగా నిలుస్తుంది. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ, ఆ ఉద్దేశాన్ని వ్యక్తపరిచేందుకు ఎంచుకున్న భాష కొంత అసభ్యంగా అనిపించిందని విమర్శలు వచ్చాయి. మహిళా సంఘాలు, సినీ ప్రముఖులు ఖండించడంతో పాటు మహిళా కమిషన్ కి ఫిర్యాదులు కూడా చేశారు. వాటిని గౌరవిస్తూ ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పడం ప్రజాజీవితంలో అరుదుగా కనిపించే బాధ్యతాయుత ప్రవర్తన. తప్పు చేయకపోవడం కంటే, చేసిన తప్పును ఒప్పుకుని సరిదిద్దుకోవడమే నిజమైన సంస్కారం.

అదుపు లేని గుర్రాలు అడవులను పట్టుకుని తిరిగినట్లుగా, సెన్సార్ నియంత్రణలకు అందని కొన్ని ఓటీటీ వేదికలు అసభ్య, అశ్లీల దృశ్యాలతో సోషల్ మీడియా, టీవీ తెరలను నింపుతున్నాయి. జుగుప్సాకర నేరాలను కథావస్తువులుగా మలిచి చూపించడం, సహజత్వం పేరిట సంభాషణలను పచ్చి బూతులతో నింపడం, శృంగార సన్నివేశాల చిత్రీకరణలో హద్దులు చెరిపేయడం—ఈ అన్ని ధోరణులు నవతరంపై తీవ్రమైన నైతిక ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ, ఈ అంశాలపై సమాజంలో కనీసం చర్చ జరగకపోవడం నిజంగా విచారకరం.

అలాగే, కొన్ని టెలివిజన్ వినోద కార్యక్రమాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్య ధోరణిలో వ్యాఖ్యలు రావడం సర్వసాధారణమైపోయింది. తుమ్ముకు తమ్ముడు ఉన్నాడు కానీ, అవలింతకు అన్నలేడు అన్న చందంలో ఈ అంశాలను పక్కనపెట్టడం మన సమాజ పరిపక్వతపై సవాలు వేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో, మహిళా కమిషన్, పోలీసులు, చట్టవ్యవస్థలు వెంటనే స్పందించాలి. ఓటీటీ, టెలివిజన్, సోషల్ మీడియా వేదికలపై అసభ్యతకు గట్టి నియంత్రణ, బాధ్యతాయుత చర్యలు తీసుకోవడం సమాజానికి తక్షణ అవసరం. సమాజ మార్పులో భాగస్వాములు కేవలం సెలబ్రిటీలే కాదు—ప్రజాప్రతినిధులు, వ్యవస్థలు, పౌరులూ తమ వంతు బాధ్యత పూరించాలి. లేకపోతే, మాటలపై నియంత్రణ లేకపోవడం సమాజాన్ని నైతిక అంధకారంలోకి నెట్టే ప్రమాదం మోస్తుంది.

ముఖ్యంగా రాజకీయ నాయకులు, వారి అనుచరులు సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని మహిళలను, వ్యక్తులను, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని రోజూ బూతులు మాట్లాడటం ప్రజాస్వామ్యానికి తలవంచిన దురాచారం. విమర్శ హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణమైతే, అసభ్య భాష అదే ప్రజాస్వామ్యానికి పుట్టిన గాయం. మాటలపై నియంత్రణ లేని వారు పాలనపై నైతిక హక్కు ఎలా కోరగలరు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం ఇది. ప్రజాజీవితంలో ఉన్నవారు బాధ్యత, సంయమనం, సంస్కారం చూపించాల్సిన అవసరం లేదనుకుంటే, అది వారి వైఫల్యమే కాక సమాజ పతనానికి సంకేతం. ఈ విషయంలో సినీనటుడు శివాజీ చూపిన తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పే ధైర్యం—నాయకత్వానికి కనీస అర్హతగా రాజకీయ నేతలు గ్రహించాలి. లేకపోతే, బూతులే భాషగా, అసభ్యతే ఆయుధంగా మారిన రాజకీయ సంస్కృతి సమాజాన్ని మరింత అంధకారంలోకి నెట్టడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ఇలాంటి సందర్భాల్లో మహిళా కమిషన్, పోలీసులు, చట్టవ్యవస్థలు మౌన ప్రేక్షకులుగా కాకుండా, తక్షణమే రంగంలోకి దిగాలి. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే అసభ్య వ్యాఖ్యలు, బూతు సంస్కృతిపై కఠిన చర్యలు తీసుకోవడం కేవలం అధికారిక బాధ్యత కాదు—సామాజిక అవసరం. అదే సమయంలో, సమాజ మార్పు బాధ్యతను సెలబ్రిటీలకే పరిమితం చేయడం సరికాదు. ప్రజాప్రతినిధులు, వ్యవస్థలు, పౌరులు—అందరూ తమ మాట, తమ ప్రవర్తనపై స్వీయ నియంత్రణ పాటించినప్పుడే నాగరికత నిలబడుతుంది. లేకపోతే, అసభ్యతే సహజత్వమన్న భ్రమలో మన సమాజం నైతిక పతనానికి దారి తీస్తుంది.

మాటలు శక్తివంతమైనవి. అవి నష్టాన్ని, కలహాలను, భయాన్నీ సృష్టించగలవు. ఒక సారీ చెప్పిన మాట, పెద్ద మార్పును సృష్టించవచ్చు.

అదే మాటలు సానుకూలంగా వాడితే, మనస్సుకు శాంతి, సంబంధాల కోసం ప్రేమ, సానుకూల ప్రభావం చూపవచ్చు.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475




పాజిటివిటీని నింపే “అవరోధాలే అవకాశాలు

* పాజిటివిటీని నింపే “అవరోధాలే అవకాశాలు..!*

ఆత్మీయత కరువైనా
అంధకారమెదురైనా 
బ్రతకడమే బరువైనా
స్థితి గతులవి ఏవైనా
చిరునవ్వులతో బ్రతకాలి !
చిరంజీవిగా బ్రతకాలి !
ఆనందాలను అన్వేషిస్తూ 
అందరి కోసం బ్రతకాలి 
అందరినీ బ్రతికించాలి !

నిరాశ నిస్పృహల నిశీధి నిండుగా అలుముకున్న సందర్భంలో సైతం పున్నమి వెన్నెల లా .... ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు రచించిన ఈ పాట మనిషి జీవితంలో... ఏ స్థాయిలో ఉన్నా ... గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. ఇలాంటి వాక్యాల స్ఫూర్తితోనే 
కోట దామోదర్ "అవరోధాలే అవకాశాలు" వ్యాస సంపుటి మన ముందుకు వచ్చింది.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి మెకానిక్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసిన వ్యాసకర్త కోట దామోదర్ రచించిన "అవరోధాలే అవకాశాలు" వ్యాస సంపుటి పాఠకులకు జీవితం పైన పాజిటివ్ దృక్పథాన్ని కలగజేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఊరటనిస్తుంది. ఎంతోమంది సామాన్యులు..తమ నిరంతర సాధన,పట్టుదలతో  అసాధారణ వ్యక్తులుగా ఎదగడంలోని కృషిని, జీవన విలువలను తెలియజేస్తుంది. ఈ పుస్తకం లోని 27 వ్యాసాలు ఏదో విధంగా పాఠకుల మనసులకు సాంత్వన చేకూర్చేవే. స్ఫూర్తిని అందించేవే..!. సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉండే దానికన్నా, ధైర్యం మరియు ధృడసంకల్పంతో ముందుకు సాగడానికి ప్రయత్నించాలంటారు రచయిత.

అవరోధాలను అవకాశాలుగా మార్చుకుంటే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని చెప్పిన స్వామి వివేకానంద స్ఫూర్తితో... మనిషికి వైకల్యం ఉన్నా ...పూర్ణ సుందరి ఐఏఎస్ గా ఎదిగిన యథార్థ జీవిత కథను తనదైన శైలితో వివరించారు. జీవితం నేర్పిన పాఠాలతో తమని తాము మలుచుకుంటూనే, ఇతరులకు మార్గని దేశం చేసే దార్శనీకులుగా మిగిలాలంటారు. జీవితంలో ప్రతి విద్యార్థి తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి లక్ష అవరోధాలు ఎదురైనా, ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి చేస్తే, విజయం వారిదేనని భరోసానిచ్చారు.

తన అలుపెరుగని ప్రయత్నాలతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసి, అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక ఆటగాడు ఉస్సేన్ బోల్ట్ అంటూ... ఓ స్ఫూర్తివంతమైన జీవితాన్ని ఆవిష్కరించారు. 9 ఏళ్ల పాటు ప్రపంచానికి మకటం లేని రాజుగా ప్రపంచాన్ని ఏలిన ఈ జమైకా వీరుడు.. ఎన్నో గొప్ప విజయాలు సాధించినా ,నేను మీలాంటి సామాన్యుడిని అని గర్వం లేకుండా ప్రకటించుకోవడం... అతని మూర్తీభవించిన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అంటూ వివరించారు. బోల్ట్ కి ఎక్కువ నచ్చిన ఆట క్రికెట్.కానీ ఓ సందర్భంలో తన కోచ్ ఇచ్చిన సలహా ప్రకారం అతను రన్నింగ్ క్రీడలోకి ప్రవేశించి ...విశ్వవిజేతగా నిలవగలిగారు..!

అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించిన విజయవంతమైన వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. ప్రవీణ్ తాంబే ఆ కోవకు  చెందిన వారంటూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతని జీవన ప్రస్థానం ఎలా కొనసాగిందో ఆసక్తికరంగా వివరించారు. సాటి మానవుల పట్ల ప్రేమ దయ కలిగి ఉండడం మరియు సేవా తత్పరత జీవిత పరమార్థమని మదర్ థెరిసా జీవిత సందేశాన్ని ఓ వ్యాసంలో వివరించారు. పద్మశ్రీ కె. ఎస్. రాజన్న తన సామాజిక సేవలో ముందుకెళ్లిన వైనాన్ని దివ్యాంగులతో పాటు.. నేటి యువతకు కూడా ఆదర్శమన్నారు. నేటి విద్యా వ్యవస్థలో జ్ఞాన సముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఉందనీ... విషయపరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుందని ఆందోళన చెందారు.

ఎన్నో సామాజిక అడ్డంకులను, అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొని, చేనేత కార్మికులకు అవసరమైన మాన్యువల్ యంత్రాన్ని ఏడు సంవత్సరాల పాటు కష్టపడి "లక్ష్మీ ఆసు" యంత్రాన్ని కనిపెట్టిన గొప్ప స్ఫూర్తిదాయక వ్యక్తి... చింతకింది మల్లేశం అంటూ వివరించారు. ఆపదలో మనకు సహాయం చేసే వారందరూ భగవంతునితో సమానమని, ప్రజలకు సహాయం చేయాలనుకునే వారికి డబ్బు కంటే మంచి మనసు ముఖ్యమంటూ.. ఇంకో వ్యాసంలో ఓ నిజ జీవిత కథతో పాఠకులకు సందేశం ఇచ్చారు. "ఈ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించడానికి అర్హత కలిగినవాడిని. ఈ దేశ పౌరుడైన నాకు విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి ఎందుకు తిరస్కరిస్తున్నారు అంటూ.. సమానత్వం కోసం న్యాయస్థానంలో పోరాటం చేసిన ఉద్యమ వీరుడు" గురించి అద్భుతంగా వివరించారు.

ఇలా ఈ పుస్తకంలోని ప్రతీ వ్యాసం...ఓ నిజ జీవిత కథతో పాటు ఓ అందమైన అనుభవ పాఠాన్ని నేర్పుతుంది. బ్రతుకు మీద ఆశావాదాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. పల్లె నుండి ప్రపంచ ఆర్థికవేత్తగా తెలంగాణ బిడ్డ, వీరవనిత కెప్టెన్ రీనా వర్గీస్, ఆశయాలకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన హారిక, అర్థాకలి నుండి అంతర్జాతీయ ఆర్థికవేత్త స్థాయికి, చదువుల తల్లి ఒడి 'మాదో పట్టి', ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ మైక్ టైసన్, సంకల్పబలం వంటి తదితర శీర్షికలతో రాసిన వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. వివిధ తెలుగు దినపత్రికలలో దాదాపు 100కు పైగా వ్యాసాలు రాసిన కోట దామోదర్.. కొన్ని వ్యాసాలతో కలిపి పుస్తకంగా తీసుకురావడం శుభ పరిణామం. "గెలిచిన ప్రతివాడికి ఏదో ఒక రోజు ఓటమి తప్పదు, ఓడిన ప్రతి వాడికి ఏదో ఒక రోజు గెలుపు తప్పదు. నేను ఓటమికి  కుంగిపోను, గెలుపుకు పొంగిపోను" లాంటి అద్భుతమైన వాక్యాలతో....వారు భవిష్యత్తులో ఇలాంటి మంచి రచనలతో... పాఠకులకు స్ఫూర్తిని పంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

సమీక్షకులు 
ఫిజిక్స్ అరుణ్ కుమార్

26, ఆగస్టు 2025, మంగళవారం

గాడితప్పుతున్న బాల్యం

 *గాడితప్పుతున్న బాల్యం*


వారం రోజుల క్రితం జరిగిన కూకట్‌పల్లి మైనర్ బాలిక *సహస్ర* హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల విచారణలో ఈ హత్య కేసుకు సంబంధించిన కొన్ని నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 14 ఏళ్ల బాలుడు క్రికెట్ బ్యాట్ కోసం *సహస్ర* ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. పదవ తరగతి కూడా పూర్తికాని 14 ఏళ్ల బాలుడు 11 ఏళ్ళ అమ్మాయిని అతి కిరాతకంగా హత్య చేయడం ఏంటి. ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలేంటనే ప్రశ్నలు అందరి మదిలో తలెత్తుతున్నాయి. అంత చిన్న వయసులో హత్య చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంత ధైర్యం ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటగా యూట్యూబ్‌లో క్రైమ్ సంబంధిత వీడియోలు పిల్లలకు కూడా సులభంగా అందుబాటులో ఉండడం, ఇంటర్నెట్ వాడకం విషయంలో  పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వలన పిల్లలు అతిగా మొబైల్ వినియోగించడంతో వారు ఇలాంటి హింసాత్మక విషయాల పట్ల ఆకర్షితులై అమానుషమైన సంఘటనలకు పాల్పడేందుకు దారితీస్తున్నాయి. బాలుడు క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం పక్కా ప్రణాళికతో అవసరమైతే హత్య చేయడానికైనా వెనకాడకూడదన్న ఉద్దేశంతో ముందుగానే తన ప్రణాలికను స్క్రిప్ట్ రూపంలో రాసుకుని దొంగతనానికి పాల్పడిన సంఘటన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించేలా చేసింది. . 14 ఏళ్ళ బాలుడికి స్క్రిప్ట్ రాసుకుని దొంగతనం చేయాలనే ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది  అంటే ఇది క్రైమ్ సంబంధిత వీడియోల ప్రభావమే అని చెప్పాలి. అంతే తప్ప ఏ తల్లిదండ్రులు ఇలాంటి దారుణాలు చేయమని తమ పిల్లలకు చెప్పరు. మరి క్రైమ్ సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో లభ్యమవుతున్నాయంటే తప్పు ఎవరిది అనే విషయం పై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. పోలీసులు నిర్ధారించిన తర్వాత  ఈ విషయం పై అన్ని న్యూస్ చానల్స్ జరిగిన సంఘటన గురించి సవివరంగా చెప్తున్నారు కానీ నిందితుడి పేరు, ఫోటో మరియు ఎలాంటి ఆధారాలు చూపించడం లేదు. దానికి వారు చెప్పే సమాధానం చట్టం ప్రకారం మైనర్ నిందితుడి వివరాలు, ఫోటో వెల్లడించ కూడదని. చట్టం ప్రకారం  నిందితుడిని చూపించకూడదన్న విషయం  నిఖార్సయిన నిజం అయినప్పటికీ, మైనర్ నిందితుడు హత్య చేసిన సంఘటన సవివరంగా న్యూస్ చానెల్స్ లో వెల్లడించడం కూడా ప్రమాదమే. వారు చెప్పిన ప్రతి విషయాన్ని మరో పిల్లాడు చూసి నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి నేరాలు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో, న్యూస్ ఛానెల్స్ లో కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హత్య చేసిన బాలుడిని శిక్షించడం సరైనదే కానీ ఆ బాలుడు హత్య చేయడానికి ప్రధాన కారణం క్రైమ్ వీడియోస్ అన్న విషయాన్ని విస్మరించకూడదు. ఈ సంఘటనకు కారణమైన ఆ క్రైమ్ వీడియోస్ వెబ్సైటు దారుడిని కూడా న్యాయస్థానం శిక్షిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం కోసం వేచిచూడాల్సిందే. ఏమీ తెలియని పిల్లాడికి ఆ వెబ్ సైట్ ద్వారా హత్య చేయాలనే ఆలోచన రావడం, అందువల్ల అతని జీవితంతో పాటు సహస్ర లాంటి వారెందరి జీవితాలో  నాశనం అవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు రాబోవుకాలంలో పునరావృతం కాకుండా ఉండాలంటే సోషల్ మీడియా మరియు న్యూస్ ఛానెల్స్ ను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
అంతేకాకుండా ఒకప్పుడు గంజాయి, మాదక ద్రవ్యాలు సినిమా రంగం వరకే వ్యాపించింది కానీ నేడు అది పాఠశాలల వరకు విస్తరించింది. వాటికి అలవాటు పడుతున్న పిల్లలు దారుణంగా ప్రవర్తిస్తూ హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు తల్లిదండ్రులు చిన్న వయసులోనే తమ బిడ్డలకు కార్లు, బైకులు అప్పగిస్తున్నారు. గంజాయి మత్తుకు బానిసలై బైక్ లపై  విచ్చలవిడిగా తిరుగుతూ వారు ఎదుటివారి ఉసురు తీస్తున్నారు. కొంతమంది పిల్లలు జులాయిగా తిరుగుతూ మహిళలను వేధిస్తున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు పాఠశాలలకు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

గతంలో క్రైమ్ కి సంబంధించిన సినిమాలు కట్టడి చేయాలని విమర్శలు వెల్లువెత్తాయి. కానీ అందుకు సెన్సార్ బోర్డు చర్యలను సమర్థించుకుంటూ మానవ సమాజంలో నేరాలపై అవగాహన తీసుకురావడానికి మాత్రమే ఇలాంటి చిత్రాలు తయారు చేస్తున్నామని సమాధానమిచ్చారు. అంతేకాకుండా మంచి సినిమాలతో పాటు, క్రైమ్ సంబంధిత సినిమాలు కూడా చేస్తుంటే  మరి మంచి సినిమాల ద్వారా ఎందుకు ప్రభావితం కావడంలేదన్న విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. ఏది ఏమైనా క్రైమ్ సంబంధిత వీడియోలు కట్టడి చేయడం ద్వారానే ఇలాంటి దుశ్చర్యల కట్టడి సాధ్యమనేది ముమ్మాటికీ నిజం. 

పిల్లలు మొబైల్ కి ఎక్కువ ఆకర్శితులెందుకు అవుతున్నారు?

మొబైల్ ఫోన్ ఇప్పటి పిల్లల జీవితంలో భాగం అయిపోయింది. పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలు కూడా మొబైల్ ఫోన్ కి వ్యసనపరులుగా మారుతున్నారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ పని చేయనిదే ఇల్లు గడవని పరిస్థితి. ఈ హడావుడి బతుకుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకునే తీరిక, ఓపిక తల్లిదండ్రులకు ఉండట్లేదు. మరికొందరి తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ఫోన్లు మొదలు అడిగిందల్లా కొనిచ్చి అతి గారాబం చేస్తున్నారు. స్కూల్ లో టీచర్ కొడుతుందన్న భయం లేకపోవడం ముఖ్య కారణం. ఒకప్పుడు పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణతో పాటు టీచర్ల పర్యవేక్షణ ఉండేది. కానీ ఇప్పుడు టీచర్స్ కొట్టాలంటేనే భయపడుతున్నారు. తల్లిదండ్రులు ఏమంటారో అని. అలాంటి చిన్నారులు సామాజిక మాధ్యమాలు, ఆన్ లైన్ గేములు, ఓటీటీల్లో హింసాత్మక చిత్రాలకు అలవాటు పడుతూ తీవ్ర మానసిక, శారీరక సమస్యలకు గురవుతున్నారు. కొందరు దారుణ నేరాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్రికెట్ బ్యాట్ను దొంగిలించడానికెళ్లి బాలికను దారుణంగా హత్య చేసిన వార్త విన్న వారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దొంగతనం ఎలా చేయాలనే దానిపై నెట్లో వెతికిన ఆ కుర్రాడు ఇంట్లోకి వెళ్లాలి, గ్యాస్ లీక్ చేయాలి... అంటూ కాగితంపై రాసి పెట్టుకున్న పథకం ఒక క్రైమ్ సినిమా ను తలపిస్తోంది.

గత సంవత్సరం నంద్యాల జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు అబ్బాయిలు అత్యాచారం చేసి, ఆపై ఆమెను హత్య చేశారు. ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూసే ఉత్సాహంలో తాము ఈ నేరానికి పాల్పడ్డామని వారు చెప్పారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లల్లో దుష్ట ప్రవృత్తి ప్రబలంగా ఉందనేది అక్షర సత్యం, కానీ ఆ పాపం ఎవరిది తల్లిదండ్రులదే కదా? పిల్లలపై పర్యవేక్షణ లేకపోవడమే కదా దీనికంతటికి కారణం. రేపటి పౌరులుగా ఎదగాల్సిన పిల్లల జీవితాలు ఎందుకు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి? దేశం సరైన మార్గంలో నడవాలంటే, అది చదువుకున్న పిల్లలతోనే సాధ్యమవుతుంది. మరి పిల్లలే తప్పుడు మార్గంలో నడుస్తుంటే దేశ భవిష్యత్తు ఏం కావాలి?.

బాల నేరస్తుల సంఖ్య పెరుగుతుంది.

ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 2016 లో దేశవ్యాప్తంగా ఆయా నేరాల్లో పట్టుబడిన మైనర్లు   32.5శాతం మంది ఉండగా 2022 నాటికి పట్టుబడిన మైనర్ల సంఖ్య దాదాపు యాభై శాతానికి పెరిగింది. ఒక్క ఢిల్లీలోనే హత్యలతో ప్రమేయమున్న మైనర్ల సంఖ్య 2014-24 మధ్య 8. 7 శాతం నుంచి 26. 78 శాతానికి పెరిగిందంటే రాబోవు రోజుల్లో దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందాల్సిన పరిస్థితి.

 పైన చెప్పబడిన అంశాలపై విస్తృత చర్చ జరిగితేనే మార్పు కొంతమేరకు సాధ్యం అనే విషయాన్ని పాలకులు, తల్లిదండ్రులు మరియు సభ్య సమాజం గమనించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఉపక్రమించాలి.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

10, ఆగస్టు 2025, ఆదివారం

అవరోధాలను అధిగమించి విద్యాకుసుమంగా ఎదిగిన “డాక్టర్. బండ సరోజన"

 *అవరోధాలను అధిగమించి విద్యాకుసుమంగా ఎదిగిన “డాక్టర్. బండ సరోజన"*

అవకాశమొస్తే అబలలు సబలలుగా మారి అన్నింటా పురుషులతో సమానమేనని సవాలు విసరడమే కాకుండా వారు అడుగిడని రంగమే లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ మాటకొస్తే అతివలు తమ మేధస్సు, శక్తిసామర్ధ్యాలతో అద్భుతంగా రాణించిన దృష్టాంతాలు చరిత్రలోనే కాక వర్తమానంలో కూడా మనకు గోచరమవుతాయి. రాణి రుద్రమదేవి, సుమిత్ర దేవి,  సరోజినీ నాయుడు, ఆరుట్ల కమల దేవి, మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ లాంటి వారే కాక వర్తమానంలో తెలంగాణ గడ్డ మీద పుట్టి పట్టుదలతో తనను తాను “చదువుల తల్లి”గా మార్చుకున్న *"డాక్టర్ బండ సరోజన"* లాంటి ఆ కోవకు చెందిన వారెందరో ఉన్నారు.

నిజాం పాలనలో అణచివేతలు, దురాచారాలకు గురైన వారిలో ప్రధాన బాధితులు మహిళలు అని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఆనాటి సమాజంలో మహిళలపై అడుగడుగునా ఆంక్షలు విధించి వారిని ఇంటికే పరిమితం చేసి ‘అబల’గా చిత్రీకరించింది. ఆ రోజుల్లో అంతగా చదువుకు నోచుకోని అత్యధిక శాతం తెలంగాణ మహిళలు పల్లెల్లో పశువుల కాపర్లుగా, వ్యవసాయ కూలీలుగా పనులు చేసుకుంటూ రజాకార్ల దాష్టికాలతో అనుక్షణం భయం గుప్పిట్లో బతికారు. రజాకార్ల అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరులో అనేక మంది వీర మరణం పొందిన విషయం మనందరికీ తెలిసిందే. రజాకార్ల పోరాటం తరువాత కూడా తెలంగాణలో మహిళలకు విద్యనభ్యసించడానికీ పూర్తిగా స్వేచ్ఛ దొరకకపోవడం శోచనీయం. తెలంగాణ పల్లెల్లో దొరల బిడ్డలు, ధనికులు, ఉన్నత వర్గాల్లోని మహిళలు మాత్రమే కొద్దిపాటి స్వేచ్ఛను అనుభవించినప్పటికీ, చదువుకున్న మహిళల శాతం అతి తక్కువ అనే చెప్పాలి. నిరంకుశ నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాలను కళ్లారా చూసిన మహిళలు కొంతమంది ఎలాగైనా రజాకార్లను తరిమికొట్టాలనే సంకల్పంతో పురుషులతో సమానంగా తుపాకులు చేతబట్టి పోరుబాట పట్టారు. అలాంటి పరిస్థితుల నుండి విముక్తి కోసం ఎన్నో అసమానతలు, శ్రమదోపిడి కష్టాలను ఎదుర్కొని క్రమంగా విద్యా వ్యాప్తి చెందడం వల్ల మహిళల్లో చైతన్యం రావడం జరిగింది. రజాకార్ల పోరాటం తర్వాత మహిళలలో విద్యనభ్యసించాలనే కోరిక బలంగా కలిగింది. కానీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు “ఆడపిల్లకు చదువెందుకు” అనే అభిప్రాయంతో స్వీయ నిబంధనలు ఏర్పరచుకోగా, మరి కొన్ని గ్రామాల్లో సరైన స్కూల్ లేక మహిళలు ఇంటి నాలుగు గోడలకే పరిమితమై అవకాశాల కోసం పరితపించారు. ఆ తర్వాత పలువురు సంఘసంస్కర్తలు, విద్యావంతులు, అభ్యుదయవాదుల కృషితో స్త్రీ విద్య, అభివృద్ధికి మద్దతు లభించింది. “కత్తికన్నా కలం గొప్పది.. గన్ను కన్నా పెన్ను గొప్పది” అన్న మాటలను నిజం చేసేందుకు మహిళల్లో చైతన్యం నింపేందుకు పెద్ద ఎత్తున మహిళా సాధికారత కోసం ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాత అతికొద్ది మంది మహిళలు విద్యనభ్యసించి మహిళాభ్యున్నతికి స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి స్ఫూర్తివంతమైన మహిళలో  రిటైర్డ్ ప్రొఫెసర్, తెలుగు పాఠ్య పుస్తక రూపకర్త *"డాక్టర్ బండ సరోజన"* ఒకరు.

బండ సరోజన సిద్ధిపేట జిల్లాలోని (ఒకప్పుడు వరంగల్ జిల్లా) మారుమూల గ్రామమైన లద్నూర్ లో మల్లయ్య, అంబమ్మ దంపతులకు ఏప్రిల్ 3, 1941న జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటికి ఆమె వయసు కేవలం 7 సంవత్సరాలు. ఒకవైపు నిరంకుశ పాలన మరోవైపు రజాకార్ల హింసాయుత చర్యలతో ఊరి జనం అల్లాడిపోయారు. ఆమె తన పసి ప్రాయంలోనే అలాంటి కొన్ని సంఘటనలను స్వయంగా చూసి ఆందోళన చెందిన సందర్భాలున్నాయి. ఆడపిల్ల అడుగు బయట పెడితే ఏమి జరుగుతుందోనన్న భయంతో తల్లిదండ్రులెవరూ అమ్మాయిలను బయటకు కాదు కదా కనీసం పాఠశాలకు కూడా పంపేవారు కాదు. అయితే చదువు పట్ల కొంత అవగాహన ఉన్న ఆమె తండ్రి తన కూతుర్ని చదివించాలనే ఆలోచనతో అదే గ్రామం లద్నూర్ పాఠశాలకు పంపించేవారు. ఓ రోజు రజాకార్లు దాడి చేసి భారీ విధ్వంసం సృష్టించినప్పుడు, ఆ దాడిలో ఆమె చదువుతున్న పాఠశాల పూర్తిగా ధ్వంసం అయింది. అప్పటికి ఆమె మూడో తరగతి చదువుతున్నారు. పాఠశాల పూర్తిగా కాలిపోవడం వల్ల భయంతో ఎవరు కూడా పాఠశాలకు వెళ్లలేకపోయారు. కొన్ని నెలల తరువాత గ్రామ పెద్దల సహాయంతో పాఠశాలకు మరమ్మత్తు చేసి పునః ప్రారంభించడంతో ఆమె మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. ఏడవ తరగతి తరువాత, ఉన్నత చదువుల కోసం విద్యా సౌకర్యాలు లేని కారణంగా, ఆమె ఒక సంవత్సరం పాటు తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయ పడుతూ చదువు మరిచిపోకుండా ఉండడానికి పొలం గట్ల మీద అక్షరాలు రాస్తూ ఉండేవారు. ఓ రోజు ఆమె తండ్రి తన కూతురికి చదువు మీద ఉన్న ఆసక్తిని గమనించి రోజూ సాయంకాలం సమయంలో ఆమెకు మహనీయుల చరిత్ర, తెలుగు పద్యాలు, తెలుగు జాతీయాలు నేర్పించేవారు. ఇలా, తండ్రి ఆమెలో విద్య పట్ల మరింత ఆసక్తిని పెంచారు. ఆమె ఐదు సంవత్సరాల పాటు తండ్రితో వ్యవసాయం మరియు పశువులు కాయడం లాంటి పనులు చేసింది. ఆ రోజుల్లోని సౌకర్యాల లేమి, విద్య పట్ల తల్లి వ్యతిరేకతలను పట్టించుకోకుండా, చదవాలనే ఏకైక లక్ష్యంతో ఆమె తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. 1962లో, ఆమె సిద్ధిపేటలో ఎలిమెంటరీ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత 1963లో, ఆమె సికింద్రాబాద్‌లోని బోయిగూడా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా ఉద్యోగం పొందింది. వచ్చిన ఉద్యోగంతో సరిపెట్టుకోకుండా, ఇంకా పై చదువులు చదవాలనే ఆసక్తితో, ఉద్యోగం చేస్తూనే A.N. రావు గారి మార్గదర్శకత్వంలో ఏ శిక్షణ లేకుండా 10వ తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత  PUC (Pre-University Course), BA, B.Ed., 1974లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి MA పట్టా పొందినప్పటికీ ఆమెలో చదువుపై తృష్ణ ఏమాత్రం తగ్గలేదు. ఇదే ఆమెను 1976లో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీ (Master of Education Degree) పూర్తి చేసేలా  పురికొల్పింది. చివరకు పిహెచ్‌డీ (PhD) చేయాలన్న దృఢ సంకల్పంతో, పట్టువదలకుండా 1992లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్‌డీ పట్టా పొందారు. సరోజన విద్యకు అండగా నిలిచినా వ్యక్తి బొడ్డు దామోదర్ ఆమె ఉన్నత విద్య అభివృద్ధికి తోడ్పడ్డాడు. విద్యావంతురాలైన ఆమె రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (State Council of Educational Research and Training) లో 45 పాఠ్య పుస్తకాల రూపకల్పన చేసి విద్యా రంగానికి శ్లాఘనీయమైన సేవలందించారు. నియత, అనియత గిరిజన నవోదయ సిబిఎస్సి ఢిల్లీ వారికి పాఠ్య పుస్తక రూప కల్పనలో ప్రశంసనీయమైన సేవలందించారు. తెలుగు బోధనా పద్ధతులు - తెలుగు అకాడమీ వారికి బోధించడంలో తనదైన ముద్ర వేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య బాపు రమణల ఆధ్వర్యంలో వీడియో పాఠాలు నిర్వహించి విద్యారంగానికి ఎనలేని కృషి చేశారు. అంతేకాకుండా 10 వ తరగతి ఉపవాచకం విశ్వమాత థెరిస్సా పాఠ్యపుస్తక రూపకర్త గా ప్రముఖులచే ప్రశంశలు అందుకున్నారు.  విద్యను అందించడమే కాకుండా సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడంలో కూడా ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాకుండా, ఆంధ్ర ప్రదేశ్ ప్రాథమిక విద్య పథకం (APPEP) లో ప్రాజెక్ట్ మూల్యాంకనం యొక్క డిజైన్ మరియు విశ్లేషణలో ఎదురైన కొన్ని కీలక సమస్యలను ఆమె తన నైపుణ్యంతో పరిష్కరించారు. సరోజన విద్యార్థులకు కేవలం జ్ఞానాన్ని అందించడం వరకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజాన్ని నైతికంగా పరిపుష్టం చేసేందుకు విశేష కృషి చేశారు. 45 పాఠ్యపుస్తకాలే కాకుండా మరో 12 పుస్తకాలూ స్వతహాగా రచించి మొత్తం 57 పుస్తకాలతో ఆమె  సుదీర్ఘ ప్రయాణంలో తరువాత, 1999లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ప్రభుత్వ అనుమతితో కొన్ని సంవత్సరాల పాటు చౌటుప్పల్ లోని అలిమినేటి మాధవ రెడ్డి మెమోరియల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేశారు.


*అవార్డులు*:

తెలంగాణ ప్రభుత్వం విశిష్ట మహిళా పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రతిభ పురస్కారం అందుకున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అమెరికాలో కూడా అనేక పురస్కారాలు అందుకున్నారు.


జీవితపు తొలినాళ్ళలో సరైన విద్యా సౌకర్యాలు లేకపోయినప్పటికీ, చదువు పట్ల అనురక్తితో, ఆమె ప్రతి అడ్డంకిని అవకాశంగా మలచుకున్నారు. ఒక ప్రయత్నం లేదా మరొక ప్రయత్నంలో నా లక్ష్యాన్ని నిర్ధారితంగా చేరుకుంటానన్న ఆత్మవిశ్వాసంతో, 7వ తరగతి నుండి పీహెచ్‌డీ వరకు ఏ విధమైన ప్రామాణిక శిక్షణ లేకుండా చదవడం ఆమె సాధించిన గొప్ప విజయం. నేటి విద్యార్థులు బండ సరోజన లాంటి వ్యక్తుల జీవితాలను ప్రేరణగా తీసుకుని, తమ లక్ష్యాలను నిర్దేశించుకుని సాధన దిశగా కృషి చేయాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఏవో కొన్ని అడ్డంకులను మరియు సవాళ్లను ఎదుర్కోవడం సహజమే కానీ వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగిన వారు మాత్రమే వారి లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475

27, జులై 2025, ఆదివారం

చదువులతల్లి ఒడి "మాదోపట్టి".

 చదువులతల్లి ఒడి "మాదోపట్టి".

ప్రేమికుల మధ్య ప్రేమ వైఫై తరంగాల్లాంటిది…

 ప్రేమికుల మధ్య ప్రేమ వైఫై తరంగాల్లాంటిది… కనబడదు… కానీ మనసులు దగ్గరైతే మాత్రమే కనెక్ట్ అవుతుంది. పాస్‌వర్డ్ మాటల్లో ఉండదు, మనసుల్లో దాగి ఉం...