31, మే 2026, ఆదివారం

ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి

 ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి


మనిషి జీవితంలో విజయాన్ని సాధించడానికి అత్యంత ముఖ్యమైనది సంకల్పం. సంకల్పం అంటే కేవలం కలలు కనడం కాదు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనసులో దృఢమైన లక్ష్యం పెట్టుకుని, దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయడం. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడమే నిజమైన సంకల్పం.

సంకల్పం ఉన్న వ్యక్తి తాను పయనించే మార్గంలో ఎదురయ్యే కష్టాలు, సమస్యలు చూసి భయపడడు. వాటిని ఓటమిగా భావించకుండా, అవి తనను మరింత బలంగా మార్చే అవకాశాలుగా భావిస్తాడు. అడ్డంకులను అవకాశాలుగా మలుచుకొని, ధైర్యంగా ముందుకు సాగుతూ చివరకు తన లక్ష్యాన్ని చేరుకుంటాడు.

ప్రపంచంలో ఎన్నో గొప్ప విజయాలు సంకల్పం వల్లే సాధ్యమయ్యాయి. దీనికి చక్కటి ఉదాహరణగా ఈశ్వరీ పాండే ను చెప్పవచ్చు. ఆమెకు కళ్ళు కనిపించకపోయినా (అంధురాలు), సముద్రంలో ఈదుతూ శ్రీలంక నుండి రామేశ్వరం వరకు ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది. సంకల్పం గట్టిగా ఉండాలే గానీ, అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయొచ్చు అని నిరూపించింది.

నాగపూర్‌కు చెందిన కమలేష్ మరియు అరుణ పాండే దంపతుల కుమార్తె ఈశ్వరీ పాండే. ఆమె పుట్టుకతోనే అంధురాలైనప్పటికీ, చిన్న వయసు నుంచే ఆమెలో ఉన్న పట్టుదల, ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఈతలో ప్రోత్సహించారు. 10 సంవత్సరాల వయస్సు నుండి కోచ్ సంజయ్ పురుషోత్తమన్ పడ్వే వద్ద ఆమెకు శిక్షణ ప్రారంభమైంది.

మొదట్లో ఈత నేర్చుకోవడం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మరింత సవాళ్లు ఎదురైనప్పటికీ, నేర్చుకోవాలనే దృఢ సంకల్పంతో ఆమె కఠినమైన శిక్షణను ధైర్యంగా ఎదుర్కొంది. క్రమంగా ఈతలో మెళుకువలు నేర్చుకుని అనేక పోటీలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించింది. కోచ్ మార్గదర్శకత్వం మరియు ప్రత్యేక శిక్షణ పద్ధతుల ద్వారా ఆమె ప్రతిభ రోజురోజుకు మెరుగుపడింది.

అంకితభావం, క్రమశిక్షణతో కూడిన సాధన వల్ల ఆమె అనేక విజయాలను సాధించింది. అయినప్పటికీ, ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించాలన్నదే ఆమె ప్రధాన లక్ష్యంగా మారింది. అందుకోసం ఆమె అంతర్జాతీయ స్థాయి పోటీలపై దృష్టి సారించి, తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంది.

దృష్టి లోపం ఉన్న ఈతగాళ్లకు ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిథ్యం వహించాలనే లక్ష్యంతో, ఆమె అత్యంత కఠినమైన సవాల్‌ను స్వీకరించింది. శ్రీలంకలోని తలైమన్నార్ నుండి భారతదేశంలోని ధనుష్కోడి వరకు సుమారు 25 కిలోమీటర్ల దూరాన్ని సముద్రంలో ఈత కొట్టింది. బలమైన గాలులు, భారీ అలలు, వర్షం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ, ఆమె తెల్లవారుఝామున 4 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రతి 30 నిమిషాలకు ఆమె వేగాన్ని కొనసాగించడానికి కఠినమైన పోషక నియమావళిని ఆమెకు కోచ్ అందిస్తూ విజయం సాధించే దిశగా ప్రోత్సహించారు. ఆమె దాదాపు 11 గంటల 15 నిమిషాల పాటు ఎలాంటి విరామం లేకుండా ఈత కొట్టి, మధ్యాహ్నానికి ధనుష్కోడి తీరాన్ని విజయవంతంగా చేరుకుంది. అయితే ఆమె అంధురాలు అయినందున విజయం సాదించామనే విషయం తన కోచ్ చెప్పేంతవరకు కూడా ఆమెకు తెలియదంటే ఆమెకు సాధించాలనే పట్టుదల ఎంతగా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.  

ఇది కేవలం ఒక సాధారణ విజయంగా మాత్రమే చూడకుండా ఆమె సంకల్పం, అచంచల ధైర్యం, మరియు కఠినమైన శిక్షణకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఇలాంటి సంక్లిష్టమైన  సవాల్‌ను పూర్తి చేసిన అంధ ఈతగాళ్లలో ఈశ్వరీ పాండే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
 
ఈశ్వరి సాధించిన ఈ ఘన విజయంతో ఆమె స్వస్థలం నాగపూర్ నగరం గర్వంతో స్పందించింది. భారీ ర్యాలీ, బాణాసంచా ప్రదర్శనల మధ్య ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఓపెన్ జీప్‌లో ప్రారంభమైన ఈశ్వరీ విక్టరీ పరేడ్‌లో భాగంగా, దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (IDCPe)కు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ స్క్వేర్ వద్ద డప్పులు మోగిస్తూ, రంగులు చల్లుతూ, బాణాసంచా పేలుస్తూ ఆమెను గుర్రంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ వేడుక అంతటా ఉత్సాహం, ఆనందం, గర్వభావం వెల్లివిరిసింది.

మొదట్లో ఈశ్వరి ఈత నేర్చుకునే సమయంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంది. అయినప్పటికీ నేర్చుకోవాలనే దృఢ సంకల్పంతో, ఓపికగా సాధన చేస్తూ ముందుకు సాగింది. ప్రపంచ విజేతగా గుర్తింపు పొందడానికి ఆమెకు దాదాపు 7 సంవత్సరాల సమయం పట్టింది.

నేటి యువత ఈశ్వరి పాండే జీవితాన్ని ప్రేరణగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టుదల లేకుండా వెంటనే ఫలితం రావాలని తొందరపడటం, ఫలితం రాకపోతే నిరాశ చెందటం, ఇవే యువతలో కుంగుబాటుకు ప్రధాన కారణాలు.

ఒక రైతు పంట పండించాలంటే నేలను దున్ని, విత్తనం వేసి, నారు పోసి, నీళ్లు పోసి, పురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంట పక్వానికి వచ్చేదాకా ఓపికగా ఎదురుచూడాలి. అప్పుడు మాత్రమే పంట చేతికి వస్తుంది.

అలాగే, జీవితంలో కూడా సరైన ప్రణాళిక, నిబద్ధతతో కూడిన ప్రయత్నం, క్రమశిక్షణగల జీవనశైలి మన విజయానికి దారి తీస్తాయి. ఎంత కష్టపడ్డా అనుకున్న ఫలితం రాకపోతే, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మళ్లీ ప్రయత్నించాలి. నిరాశకు తావివ్వకుండా ముందుకు సాగడమే నిజమైన విజయం.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

చేతిరాతలో చెరిగిపోని జ్ఞాపకాలు

 చేతిరాతలో చెరిగిపోని జ్ఞాపకాలు


ఈమధ్య కాలంలో చేతిరాత రాసేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుందనడానికి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, మొబైల్‌ఫోన్లు కోకొల్లలుగా పెరగడమే ప్రధాన కారణం. ఇవన్నీ కలిసి మనిషిని చేతిరాతకు క్రమంగా దూరం చేస్తున్నాయి. ఒకప్పుడు ఆలోచనలకు ఆత్మగా నిలిచిన చేతిరాత, ఇప్పుడు కీబోర్డ్‌ కఠోర ధ్వనుల మధ్య కనుమరుగైపోతోంది. సాంకేతికత మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ, కాగితంపై అక్షరాలను ఆవిష్కరించే అలవాటు మాత్రం మసకబారుతోంది. చేతిరాతలో కనిపించే భావోద్వేగం, వ్యక్తిత్వం డిజిటల్‌ అక్షరాల్లో కనిపించడం లేదనే భావన చాలామందిలో వ్యక్తమవుతోంది.

ఒకప్పుడు అమ్మ తన కొడుకుకి రాసిన ఉత్తరాలు. తండ్రి తన కూతురి మార్కుల మెమోపై పెట్టిన సంతకాలు. ప్రేమికుల మధ్య రాయబారిగా మారిన  ప్రేమలేఖలు. ఇవన్నీ కేవలం అక్షరాల సమాహారం మాత్రమే కాదు, మనుషుల భావోద్వేగాలకు ప్రతిబింబాలుగా నిలిచిన సజీవ జ్ఞాపకాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం పూర్తిగా మారిందనడంలో అతిశయోక్తిలేదు. చేతిలో పెన్ను కనిపించాల్సిన చోట మొబైల్ కనిపిస్తోంది. కాగితం మీద అక్షరాలు రాయాల్సిన చోట, స్క్రీన్‌లపై టైపింగ్ శబ్దాలు వినిపిస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు మన జీవితాల్లో వేగాన్ని పెంచాయి కానీ, చేతిరాత అనే కళను మెల్లగా అంతరించిపోయే దిశగా నెట్టేస్తున్నాయి. ప్రతి అక్షరంలో ఉండే భావోద్వేగం ఇవన్నీ క్రమంగా జ్ఞాపకాల పుటల్లోకి జారిపోతున్నాయి.

ఒకప్పుడు పోస్ట్ మాన్ కోసం ఎదురు చూసే రోజులుండేవి. ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాన్ని పదే పదే చదివి, ప్రతి అక్షరంలో ఆప్యాయతను వెతుక్కుంటూ కన్నీళ్లు పెట్టుకునే భావోద్వేగ క్షణాలు ఉండేవి. కానీ ఇప్పుడు వాట్సాప్‌ ఎమోజీలతోనే భావాలను వ్యక్తపరిచే స్థితికి మనం చేరుకున్నాం.

అక్షరాల్లో ఉండే ఆత్మీయతను, చేతిరాతలో దాగి ఉండే ప్రేమను టచ్‌స్క్రీన్‌లు పూర్తిగా భర్తీ చేయలేకపోతున్నాయనేదే నా బాధ. ఒకప్పుడు అక్షరాలతో ఆడుకున్న బాల్యం, ఇప్పుడు కంప్యూటర్లతో కుస్తీ పడుతుంది. పెన్ను పట్టి అక్షరాలు రాయాల్సిన చిట్టి చేతులు, మొబైల్‌ స్క్రీన్‌లపై వేళ్లు నాట్యం చేస్తున్నాయి. సాంకేతికత సౌకర్యాలను పెంచినా, మనసులను తాకే చేతిరాత మాధుర్యాన్ని మాత్రం క్రమంగా మన జీవితం నుంచి దూరం చేస్తుంది.

ఒకప్పుడు చేతిరాతలో వచ్చిన ఉత్తరాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా, మనుషుల భావోద్వేగాలను మోసుకొచ్చేవి. అప్పట్లో మరణవార్త , దూర ప్రాంతాల్లో ఉన్న తమవారికి ఆ విషాద వార్తను ఉత్తరాల ద్వారానే తెలియజేసేవారు. ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు, అక్షరాల్లో ఉన్న బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని అక్షరాలు మనసును ఓదార్చేవి, మరికొన్ని అక్షరాలు గుండెను బరువెక్కించేవి. అంటే చేతిరాతకు మనిషి హృదయాన్ని కదిలించే అపారమైన భావోద్వేగ శక్తి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాగే ఒకప్పుడు విదేశాల్లో లేదా దూర పట్టణాల్లో చదువుకునే పిల్లలకు తల్లిదండ్రులు రాసిన ఉత్తరాలు ఇంటి ప్రేమను గుర్తు చేసేవి. “బాగా చదువు బిడ్డా… ఆరోగ్యం జాగ్రత్త” అని అమ్మ రాసిన ఒక్క వాక్యం చాలు, ఎంత దూరంలో ఉన్నా ఇంటి ఆప్యాయతను దగ్గర చేసేది. ప్రేమలేఖల్లో ప్రతి అక్షరం ఒక అనుభూతిలా ఉండేది. కొందరు ఆ ఉత్తరాలను సంవత్సరాల పాటు దాచుకుని, జీవితాంతం జ్ఞాపకాలుగా చూసుకునేవారు.

పండుగల సందర్భాల్లో బంధువులకు శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన ఉత్తరాలు కుటుంబ బంధాలను మరింత బలపరచేవి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పుడు గురువులు చేతిరాతలో రాసిన అభినందనలు విద్యార్థులకు జీవితాంతం ప్రేరణగా నిలిచేవి. చేతిరాతలో మనిషి స్వభావం, ఆలోచన, ఆప్యాయత కనిపించేవి. అందుకే పాత ఉత్తరాలను చదివితే, ఆ మనుషులు మన ముందే నిలబడి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది.

కానీ నేడు టెక్నాలజీ వేగంలో ఆ భావోద్వేగ జ్ఞాపకాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. క్షణాల్లో మెసేజ్‌లు చేరుతున్నా, చేతిరాతలో ఉండే హృదయస్పర్శ మాత్రం కనిపించడం లేదు. అందుకే చేతిరాత జ్ఞాపకాలు ఎప్పటికీ మన జీవితాల్లో చెరగని భావోద్వేగ ముద్రలుగానే మిగిలిపోతాయి.

ఇప్పటి పిల్లల్లో చాలామందికి తెలుగు అక్షరాలు సరిగా రాయడం కూడా కష్టమైపోతోంది. పరీక్షలు తప్పితే పెన్ను పట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. డిజిటల్ యుగం మనిషిని తెలివిగా మార్చిందేమో గానీ, అక్షరాల పట్ల ప్రేమను మాత్రం తగ్గించింది.

ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి అతని మాటలు, ప్రవర్తన, ఆలోచనలు మాత్రమే కాదు, అతని చేతిరాత కూడా అంచనా వేయడానికి పనిచేస్తుందని చాలామంది నమ్ముతారు. ఒకప్పుడు ఉత్తరాలు, డైరీలు, నోట్స్ ద్వారా మనుషుల భావోద్వేగాలు బయటపడేవి. ఎవరి చేతిరాత చూసినా వారి మనస్తత్వం గురించి కొంత అంచనా వేసే ప్రయత్నం చేసేవారు. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చిన అధ్యయన విధానమే “గ్రాఫాలజీ”.

అరచేతి గీతల ఆధారంగా ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు చెప్పేదాన్ని “హస్తసాముద్రికం” లేదా  “జాతకం” అంటారు. కానీ చేతిరాత ఆధారంగా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించే విధానాన్ని “గ్రాఫాలజీ” అంటారు. “గ్రాఫాలజీ” ఒక వ్యక్తి యొక్క ఆలోచనా తీరు, భావోద్వేగ స్థితి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఒత్తిడి వంటి అంశాలను అంచనా వేయడానికి ఉపయోగించే శాస్త్రం.

అయితే కొంతమంది మేధావుల చేతిరాత మాత్రం ఎంతో అందంగా, క్రమబద్ధంగా ఉండేది.

చేతిరాత అంతరించిపోవడం అంటే కేవలం ఒక అలవాటు పోవడం కాదు…
మన సంస్కృతిలోని ఓ భావోద్వేగ అధ్యాయం మాయమవడం.
రేపటి తరాలు “ఉత్తరం” అంటే ఏమిటో, “చేతిరాతలో ప్రేమ” అంటే ఏమిటో పుస్తకాలలో మాత్రమే చదివే పరిస్థితి రావొచ్చు.

అందుకే ఇంకా ఆలస్యం కాకముందే పిల్లలకు చేతిరాత విలువను నేర్పాలి.
రోజుకు కొన్ని అక్షరాలైన స్వయంగా రాసే అలవాటు పెంచాలి.

పైన కనిపిస్తున్న ఈ చిత్రం నిజంగా ఒక విచిత్రమే… కానీ ఆ విచిత్రంలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. ఆయనొక పోలీస్ అధికారి. పేరు శ్రీహరి. కానీ ఆయనను కేవలం పోలీస్ అని చెప్పడం సరిపోదు… ఆయన అక్షరాలను ఆరాధించే అక్షర పిపాసి.

ఆయన ఎక్కడికి వెళ్లినా చేతిలో ఒక డైరీ, ఒక పెన్ తప్పనిసరిగా కనిపిస్తాయి. పోలీస్ అధికారిగా గన్ లేకపోయినా పని సాగుతుందేమో గానీ, పెన్ మాత్రం ఆయన చేతిలో ఉండాల్సిందే. అందుకే ఆయనను “అక్షర ప్రేమికుడు” అని పిలవడం అతిశయోక్తి కాదు.

ఒకప్పుడు పెద్దలు ఒక సామెత చెప్పేవారు “అక్షరాన్ని నమ్ముకున్నోడు చరిత్రలో ఎప్పుడూ చెడిపోలేదు” అని. ఈ చిత్రాన్ని చూసిన తరువాత ఆ సామెత అక్షర సత్యంలా అనిపిస్తుంది.

ఆయన ఏ కార్యక్రమానికి వెళ్లినా, ఒక కఠినమైన పోలీస్ అధికారిలా కాకుండా, కాలేజీకి ఉత్సాహంగా వెళ్లే విద్యార్థిలా కనిపించడం ఆయనలోని ప్రత్యేక ఆకర్షణ. సమావేశాల్లో ఎవరైనా మాట్లాడితే, వారి మాటలను ఎంతో శ్రద్ధగా వింటారు. కానీ శ్రీహరి వినడానికే పరిమితం కారు. ప్రతి మంచి ఆలోచనను, ప్రేరణనిచ్చే మాటను తన డైరీలో నోట్ చేసుకుంటారు. అదే ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనం  నేర్చుకోవాలనే తపన ఎప్పుడూ తగ్గకుండా ఉండటం.

ఈరోజుల్లో చేతిరాత రాయడం చాలామందికి బద్దకంగా మారిపోయింది. మొబైల్‌లో టైప్ చేయడం అలవాటైపోయిన ఈ డిజిటల్ కాలంలో, ఇంకా పెన్నుతో అక్షరాలను ప్రేమగా కాపాడుకుంటూ రాయడం నిజంగా గొప్ప సంస్కారం. ఎందుకంటే చేతిరాత అనేది కేవలం అక్షరాల సమాహారం కాదు… అది మనిషి ఆలోచనలకు ప్రతిబింబం, మనసులోని భావాలకు అద్దం, జ్ఞాపకాలకు శాశ్వత నిల్వ, వ్యక్తిత్వానికి ఓ ప్రత్యేక గుర్తు.

శ్రీహరి లాంటి వారు సమాజానికి ఒక మౌన సందేశం ఇస్తున్నారు —
“టెక్నాలజీ ఎంత ఎదిగినా, అక్షరాల ఆత్మను మాత్రం కోల్పోవద్దు” అని.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

బుల్లెట్ల మధ్య గర్జించిన మహిళా ధైర్యం – లీ ఆన్ హెస్టర్

బుల్లెట్ల మధ్య గర్జించిన మహిళా ధైర్యం – లీ ఆన్ హెస్టర్


బయట ఏ చిన్న గొడవ జరిగినా… “మనకెందుకులే” అని పక్కకు తప్పుకోవడం సాధారణ మనుషుల మనస్తత్వం.
రోడ్డు మీద ఏ  కాస్త హడావిడి కనిపించినా… గుండెల్లో భయం పుట్టి, అడుగులు వెనక్కి పడతాయి. అది మన సహజ స్వభావం.
మనకు కావాల్సింది మన బ్రతుకులు … మన రక్షణ … అంతే.... లోకం ఏమైపోయినా ఫరవా లేదు ...

కానీ ఒక క్షణం ఆలోచించండి!

ఆకాశం చిల్లులు పడే బాంబుల మోతలు, గాలిని చీల్చుకుంటూ వచ్చే బుల్లెట్లు,
మరణం కళ్ల ముందే నర్తించే భీకర యుద్ధభూమి. అలాంటి రణరంగంలో మనం ఉంటే? మన ఒక్క అడుగైనా ముందుకు పడుతుందా? లేదా భయంతో కాలికి బుద్ధిచెప్పి వెనక్కి పారిపోతామా? మనమైతే ఖచ్చితంగా వెనక్కే పారిపోతాం... అది మాత్రం నిజం. అత్యంత విలువైన మన ప్రాణం ముందు ఎంత యుద్దమైన చిన్నదే అనిపిస్తుంది.

“బతికుంటే బలుసాకు తినొచ్చు” అనే సామెత లాగా  … మన లాంటి సగటు జీవులకు నాకెందుకు ఈ యుద్ధం?” అని మనసు బ్రతకాలని కేకలు వేస్తుంది. కానీ… అదే ఆలోచన ఒక సైనికుడి మదిలో మెదిలితే...?
ఒక్క క్షణం అయినా, “నాకెందుకు ఈ యుద్ధం?” అని అతను వెనక్కి తగ్గితే?

మన పరిస్థితి ఏంటి? మన దేశ పౌరుల పరిస్థితి ఏంటి?

మన ఇళ్లలో ఉన్న నిశ్శబ్దం, మన పిల్లల నవ్వులు, మనం ముందు తరాలకోసం సంపాదించిన సంపాదన, ఇవన్నీ ఒక్క క్షణంలో కూలిపోవా?

మన భయం మనల్ని కాపాడుతుందేమో, కానీ వారి ధైర్యమే రక్షణ కవచంలా నిలిచి దేశాన్ని కాపాడుతుంది.

అదే మరి సామాన్య ప్రజలకు మరియు దేశాన్ని కనురెప్పలార్పకుండా రేయింబవళ్ళు కాపు కాసే సైనికులకు తేడా ... మనమేమో మన ప్రాణాల కోసం వెనక్కి తగ్గితే, వాళ్లు మన ప్రాణాలను రక్షించడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కదనరంగంలో దూసుకెళ్తారు.

దేశ పౌరుల ప్రాణాలను కాపాడేందుకు కేవలం 19 ఏళ్ల ఒ యువతి చేసిన 25 నిమిషాల భీకర పోరులో 27 మంది తీవ్రవాదులు మట్టి కరిచారు.
ఆ యుద్ధంలో తీవ్రవాదులు  మాత్రమే మరణించారు తప్ప ఆమె బృందంలోని ఒక్క సైనికుడూ ప్రాణాలు కోల్పోకపోవడం అత్యంత ఆశ్చర్యకర విషయం. అదే ఆమె నాయకత్వ పటిమకు, ధైర్యానికి నిదర్శనం. మరణం కళ్లముందు నాట్యం చేస్తుంటే ఏమాత్రం వెరవక ధైర్యంగా ముందుకు లంఘించిన ఆ యువతి ఎవరో తెలుసుకోవాలనిపిస్తుందా? ఆమె పేరు — లి ఆన్ హెస్టర్. యుద్ధభూమిలో ఆమె ప్రదర్శించిన అసాధారణ శౌర్యపరాక్రమాలకు సిల్వర్ స్టార్ అందుకున్న U.S. Army తొలి మహిళా సైనికురాలిగా ఆమె చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.

లీ ఆన్ హెస్టర్ జనవరి 1982లో అమెరికా కెంటకీలోని బౌలింగ్ గ్రీన్ లో జన్మించింది. నవ యౌవనంలో ఉత్సాహం ఉరకలేస్తుంటే, జీవితంలో ఎన్నో కలలు కంటూ, ఆశల సౌధాలు  నిర్మించుకునే వయసులో,  2001 ఏప్రిల్ 3న, కేవలం 19 సంవత్సరాల వయస్సులో ఇతర యువతీ యువకులు తమ భవిష్యత్తు కోసం కళాశాలలు, ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్న సమయంలో హెస్టర్ మాత్రం దేశ సేవ కోసం కఠినమైన మార్గాన్ని ఎంచుకుంది. ఆమె "కెంటకీ ఆర్మీ నేషనల్ గార్డ్" లో చేరింది. అందులో ఆమె ఎంచుకున్నది సాధారణ ఉద్యోగం కాదు. దేశాన్ని కాపాడే బృహత్తర బాధ్యత. 617th మిలిటరీ పోలీస్ విభాగంలో చేరిన హెస్టర్, దేశానికి తన వంతు సేవ చేయాలనే అచంచల సంకల్పంతో ఈ మార్గాన్ని ఎంచుకుంది. ఆమె సైన్యంలో చేరే సమయానికే ప్రపంచం ఉగ్రదాడుల భయానక నీడలోకి అడుగుపెడుతోంది.
ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట రక్తపాతం, భయం, అనిశ్చితి వార్తలుగా వినిపిస్తున్న కాలం అది. అయినా హెస్టర్ వెనక్కి తగ్గలేదు. “దేశం కోసం నిలబడాలి… అవసరం వస్తే ప్రాణం అర్పించాలి” అనే నిశ్శబ్ద ప్రతిజ్ఞతో ఆమె యూనిఫాం ధరించింది. చాలామంది యువత తమ భవిష్యత్తు, ఉద్యోగాలు, కలల గురించి మాత్రమే ఆలోచించే వయస్సులో హెస్టర్ మాత్రం దేశ భద్రతను తన భుజాలపై మోసేందుకు ముందుకు వచ్చింది.

చిన్ననాటి నుంచే ఆమె తండ్రి నేర్పిన తుపాకీ వినియోగం ఆమెకు కేవలం ఆయుధాన్ని ఉపయోగించడం మాత్రమే కాకుండా భయాన్ని ఎదుర్కోవడం, ప్రమాదం ముందు నిలబడడం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా నేర్పింది. అందుకే చిన్న వయస్సులోనే ఆమెలో సాధారణ యువతిలో కనిపించని ధైర్యం, క్రమశిక్షణ, బాధ్యత అనే లక్షణాలు బలంగా పెరిగాయి.
ఒక అబ్బాయిలాగా ధైర్యంగా, చురుకుగా పెరిగిన ఆమెకు క్రమశిక్షణ, సాహసం, బాధ్యత అనే విలువలు ఎంతో దగ్గరయ్యాయి. అంతేకాకుండా యూనిఫాంలో ఉన్న వారిని చూసినప్పుడల్లా ఆమెకు గౌరవభావం కలిగేది. ముఖ్యంగా యూనిఫాంలో ఉన్న మహిళలను చూస్తే తాను కూడా అలా దేశానికి సేవ చేయాలనుకునేది. ఆమె ఎంచుకున్న 617th మిలిటరీ లోని పోలీస్ పాత్ర కూడా ఆమె ఆలోచనకు ఎంతో దగ్గరగా అనిపించాయి. శిక్షణ పూర్తయ్యాక ఆమె "ఫోర్ట్ లియోనార్డ్ వుడ్" లోని యు.ఎస్. ఆర్మీ మిలిటరీ పోలీస్ స్కూల్ లో శిక్షణ తీసుకుంది. అక్కడ ఆమె కేవలం ఆయుధాలు ఉపయోగించడం మాత్రమే కాకుండా, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం, సహచరులను రక్షించడం, భయాన్ని జయించడం కూడా నేర్చుకుంది. ఆతర్వాత కొంతకాలం గ్రాడ్యుయేషన్ అనంతరం ఆమె తిరిగి 617th మిలిటరీ లో చేరింది.
ఆమె క్రమశిక్షణ, బాధ్యత, నాయకత్వ లక్షణాలు చాలా త్వరగా అందరి దృష్టిని ఆకర్షించాయి. అదే ఆమెను సార్జెంట్ హోదా వరకు తీసుకెళ్లింది. ఇక్కడ కాన్వాయ్ ఎస్కార్ట్ శిక్షణలు, ఖైదీల నిర్వహణ, అత్యవసర వ్యూహాత్మక స్పందనలు ఇవన్నీ ఆమెను మానసికంగా, శారీరకంగా మరింత దృఢంగా తీర్చిదిద్దాయి. ఆతర్వాత జూలై 2004 లో, హెస్టర్ ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్ కు మద్దతుగా మోహరింపు కోసం సమీకరణ ఉత్తర్వులను మిలిటరీ సంస్థ జారీచేసింది.

నవంబర్ 2004 హెస్టర్ జీవితంలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది.
617th మిలిటరీ పోలీస్ బృందంతో కలిసి ఆమె ఇరాక్ నేలపై అడుగుపెట్టింది.
అది ప్రతి క్షణం ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న యుద్ధభూమి. ఆపరేషన్ సమయంలో ఇరాక్ లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. బాగ్దాద్ చుట్టుపక్కల సరఫరా మార్గాలు తిరుగుబాటుదారుల ప్రధాన లక్ష్యాలయ్యాయి. మరణదేవత అనునిత్యం నర్తించే అలాంటి పరిస్థితుల్లోనే హెస్టర్ తన విధులను నిర్వర్తించాల్సి వచ్చింది.

హెస్టర్ సార్జెంట్‌గా, వాహన కమాండర్‌గా బృందాన్ని ముందుండి నడిపించింది.
ఆమె డ్యూటీ ఏమిటంటే ఆహారం, మందులు, ఆయుధాలు తీసుకెళ్తున్న కాన్వాయ్ లను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం. కానీ సల్మాన్ పాక్ వంటి ప్రాంతాలు అత్యంత భయంకరమైనవి. ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని భయానక వాతావరణంతో కూడిన భీకర యుద్ధభూమి అది. రోడ్డు పక్కన దాచిన బాంబులు, అకస్మాత్తుగా ప్రారంభమయ్యే కాల్పులు, చెట్ల మధ్య దాగిన తీవ్రవాదులతో ప్రతి క్షణం సైనికులను భయాందోళనలకు గురిచేసేది. ఆ ప్రాంతంలో ప్రయాణించడం అంటే మరణపు నీడలో అడుగులు వేయడమే. అలాంటి పరిస్థితుల్లో వారి ప్రాణాలను రక్షించడం హెస్టర్ బృందం భుజాలపై ఉన్న బాధ్యత. పగలు మండే ఎడారి వేడి, రాత్రిళ్లు భయంతో నిండిన ప్రయాణాలు. బతికి తిరిగి వస్తామో లేదో తెలియని అనిశ్చితి. అయినా హెస్టర్ వెనక్కి తగ్గలేదు. 2005 మార్చి 20 ఇరాక్ నేలపై యువ సైనికురాలి ధైర్యాన్ని చరిత్ర శాశ్వతంగా గుర్తుంచుకున్న రోజు. సుమారు 30 పౌర ట్రాక్టర్-ట్రైలర్ల కాన్వాయ్ కు 617th మిలిటరీ పోలీస్ బృందం భద్రత కల్పిస్తోంది. ఆ కాన్వాయ్‌లో ఉన్నవి  సైనికులకు అవసరమైన సరఫరాలు. హెస్టర్ తన “రావెన్-42” స్క్వాడ్ కు నాయకత్వం వహిస్తూ కాన్వాయ్ మధ్యలో హమ్వీలో ప్రయాణిస్తోంది. రోడ్డు పక్కన ఉన్న తోటల మధ్య దాగిన స్థావరాలు, సమీప నిర్మాణాల వెనుక పొంచి ఉన్న తీవ్రవాదులు ఒక్కసారిగా  ఆయుధాలతో కాల్పులు ప్రారంభించారు. ఆ సమయంలో 50 మందికిపైగా తిరుగుబాటుదారులు కాన్వాయ్‌ను పూర్తిగా చుట్టుముట్టారు. తుపాకీ గుళ్ల శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ప్రతి క్షణం మరణం దగ్గరపడుతున్నట్టే అనిపిస్తోంది.

ఆ క్షణంలో ప్రతి మనిషికి భయం సహజం, వెనక్కి తగ్గడమూ సహజమే కానీ హెస్టర్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. తన భయాన్ని పక్కనపెట్టి, తన వెనుక ఉన్న ప్రతి ప్రాణాన్ని కాపాడాలనే సంకల్పంతో ముందుకు అడుగు వేసింది. ఆమె వెంటనే తన వాహనాన్ని ఆపి, స్క్వాడ్ లీడర్ టిమొతీ నేయిన్‌తో సమన్వయం చేసింది. చేతిలోని M4 కార్బైన్, M203 గ్రెనేడ్ లాంచర్‌తో శత్రువుల కందకాలపై ఎదురుదాడి ప్రారంభించింది. గ్రెనేడ్ రౌండ్లు శత్రువుల మధ్య పేలిపోతుండగా, హెస్టర్ ముందుకు కదులుతూ నిరంతరం కాల్పులు జరిపింది. ఆ భీకర పోరాటంలో ఆమె కనీసం నలుగురు తీవ్రవాదులను స్వయంగా నిర్వీర్యం చేసింది. కానీ హెస్టర్ బృందం ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. ఈ కీలక సమయంలో హెస్టర్ తన వద్ద ఉన్న గ్రెనేడ్‌ను సహచర సైనికుడు టిమొతీ నేయిన్‌కు అందించింది. ఆ చిన్న నిర్ణయమే యుద్ధ దిశను పూర్తిగా మార్చేసింది. కానీ హెస్టర్ బృందానికి అచంచల ధైర్యం “ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు” అనే ఉక్కు సంకల్పం. అందుకే వారు మరణాన్నే ఎదుర్కొంటూ నిరంతర కాల్పులతో తిరుగుబాటుదారుల స్థావరాలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ ముందుకు సాగారు. చివరికి శత్రువుల ప్రతిఘటన పూర్తిగా చిద్రమైంది. ప్రతిఘటనను పూర్తిగా ఛేదించారు. మరణం అంచుల దాకా వెళ్లిన ఆ కాన్వాయ్ చివరికి సురక్షితంగా బయటపడింది.

ఆమె చూపించిన అచంచల ధైర్యం, మరణాన్ని ఎదుర్కొంటూ సహచర సైనికుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన అసాధారణ సాహసం. యుద్ధభూమిలో చూపించిన అపూర్వ నాయకత్వానికి అమెరికా ప్రభుత్వం అత్యున్నత సైనిక గౌరవాల్లో ఒకటైన సిల్వర్ స్టార్ అవార్డుతో ఆమెను సత్కరించింది. యు.ఎస్. ఆర్మీ లో సిల్వర్ స్టార్ అందుకున్న తొలి మహిళా గా "లీ ఆన్ హెస్టర్" చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.

మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి…
ఎవరో ఒకరు తమ నిద్రను, తమ భయాన్ని, కొన్నిసార్లు తమ ప్రాణాన్నే త్యాగం చేస్తుంటారు.

లీ ఆన్ హెస్టర్ అలాంటి అరుదైన యోధురాలు.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

6, మే 2026, బుధవారం

శత వసంతాల గురువు

 శత వసంతాల గురువు — శాశ్వత జ్ఞాన దీప్తి,

సప్తతి శిష్యుడు — సంస్కారాలకు సాక్షి…

ఆ పద్యం సాక్షాత్కారమై నిలిచిన క్షణం ఇది.


అదొక మారుమూల పల్లె గుమ్మడవెల్లిలో పుట్టి పెరిగిన ఉప్పునూతల మహేందర్ రెడ్డి, శ్రీరాంశెట్టి నరసింహారావు కాలగమనంలో కృషి, కట్టుదిట్టమైన ప్రణాళిక, నిబద్ధతతో ఎదుగుతూ, చివరికి ఒకరు పోలీస్ శాఖలో , మరొకరు విద్యాశాఖలో ఉన్నత అధికారులుగా వెలుగొందారు. సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించిన వారు గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ పొందినా, పదవులు మారినా, గురువు పట్ల వారి అంకితభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.


ఒక రోజు సాధారణంగా మా మధ్య ప్రారంభమైన సంభాషణ, అనూహ్యంగా వారిని గత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది.

“మా గురువు రాజారామ్ శాస్త్రి గారు మాకు చదువు ఎంత బాగా చెప్పేవారో… అందుకే మేము ఈ స్థాయికి చేరుకున్నాం,” అని వారు గర్వంతో, కృతజ్ఞతతో చెప్పారు. ఆ మాటల్లో శిష్యుల హృదయంలో గురువుపై నాటుకుపోయిన గౌరవం, అపారమైన ప్రేమ ప్రతిబింబించింది.


ఆ మాట విన్న నేను వెంటనే స్పందించాను.

“సర్, రాజారామ్ శాస్త్రి గారు ఇప్పటికీ హైద్రాబాదులోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన వయసు 97 సంవత్సరాలు,” అన్నాను.

అది విన్న వెంటనే మహేందర్ రెడ్డి గారి కళ్లలో ఆశ్చర్యం మెరిపించింది.

“అవునా! అయితే తప్పకుండా కలవాలి. మనం ఒక రోజు వెళ్దాం,” అని ఆయన ఉత్సాహంగా అన్నారు.


రోజులు గడిచాయి. వారు ఎప్పటిలాగే బిజీగానే ఉన్నా, గురువును కలవాలనే కోరిక మాత్రం మరింత బలపడింది. చివరకు ఈ రోజు సమయం కేటాయించారు.నేను, మహేందర్ రెడ్డి గారు, శ్రీరాంశెట్టి నరసింహారావు గార్లతో కలిసి, ఆ జ్ఞాపకాల నడకలో మునిగిపోతూ, రాజారామ్ శాస్త్రి గారి ఇంటి ముందుకు చేరుకున్నాం. ఆ గుమ్మం ముందు నిలిచిన క్షణం… కాలమే ఒక్కసారి వెనక్కి తిరిగినట్లనిపించింది.


ఇంటి ముందర ప్రశాంతంగా కూర్చొని ఉన్న శతాధిక వయస్సు గల రాజారామ్ శాస్త్రి గారు… పురోహిత్యంలో అపార అనుభవం కలిగిన మహా పండితులు . “మనిషికి స్నానం కన్నా ధ్యానం మిన్న… ఆరోగ్యమే మహాభాగ్యం” అని విద్యార్థులకు పదే పదే బోధిస్తూ, వారిని సన్మార్గంలో నడిపించిన గురుమార్గదర్శి.


అటువంటి గురువుని చూసిన మహేందర్ రెడ్డి, నరసింహారావు గారు నిశ్శబ్దంగా ముందుకు నడిచారు. హృదయం నిండా గౌరవం, కళ్లలో ఆనందం. వారు వినయంగా నమస్కరించారు.

“గురువుగారూ… మేము మీ విద్యార్థులం,” అని పలకరించారు.


కొన్ని క్షణాలు గురువు గారు వారిని గమనించారు. తర్వాత చిరునవ్వుతో,

“నువ్వేనా… మహేందర్?” అని అడిగిన ఆ ఒక్క మాటతోనే కాలం కరిగిపోయింది.

ఆ క్షణం… కాలం దాటుకుని కలిసిన ఆ అనుబంధం.

జీవితాంతం నిలిచే మధుర స్మరణగా ఆ క్షణం నిలిచిపోయింది.


మహేందర్ రెడ్డి గారి కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి.

నర్సింహారావు గారికి గురువును చూసిన ఆనందం హృదయంలో విల్లువిరిసింది.


“మీరు మాకు అందించిన విద్యా, విలువలే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయి గురువుగారూ,” అని వారు వినయపూర్వకంగా అన్నారు.


ఒకరు ఉన్నత పోలీస్ అధికారిగా, మరొకరు మండల విద్యా అధికారిగా ఉద్యోగ విరమణ పొందిన వారు—

కానీ ఆ క్షణంలో వారు పదవులు కాదు…

గురువు ముందు నిలిచిన సాధారణ శిష్యులే.


గురువు ఉద్యోగ విరమణ పొందినవారే…

శిష్యులు కూడా ఉద్యోగ విరమణ పొందిన వారే…

ఈ యాదృచ్ఛికం కాదు—కాలమే రాసిన ఒక అద్భుతమైన అనుబంధ గాథ.


ఒకప్పుడు వారి ముందు నిలబడి అక్షరాలను నేర్పిన గురువు…

ఇప్పుడు కాలపు ప్రయాణంలో నెమ్మదిగా నడుస్తున్న వృద్ధుడిగా మారిపోయినా,

ఆయన చూపిన మార్గం మాత్రం శాశ్వతంగా వెలుగుతోంది.


ఆ గురువు చేతిలో అక్షరాభ్యాసం నేర్చుకున్న శిష్యులు…

జీవితంలో ఎన్నో శిఖరాలు అధిరోహించి,

సేవా మార్గంలో వెలుగులు నింపి, చివరికి తామూ విశ్రాంతి దశలోకి చేరుకున్నారు.


కానీ ఆ క్షణంలో కాలం గీసిన వయస్సు గీతలు, పదవుల ప్రతిష్ఠలు అన్నీ చెరిగిపోయాయి, మిగిలింది ఒక్కటే గురువు, శిష్యుల మధ్య ఉన్న బంధం.


✍️

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475

మిస్సైల్ ఉమెన్: సంకల్పం నుంచి శిఖరాగ్రం వరకు

 మిస్సైల్ ఉమెన్: సంకల్పం నుంచి శిఖరాగ్రం వరకు


ప్రతి రోజు సాయంత్రం, ఇంటి ముందున్న ఆరుబయట కూర్చుని, ఆకాశాన్ని చూస్తూ తారలతో, మేఘాలతో మమేకమైపోయేది ఆరవ తరగతి చదువుతున్న ఒక చిన్నారి.


ఒక రోజు సాయంత్రం ఆమె రోజులాగే కూర్చుని ఆకాశాన్ని ఆస్వాదిస్తోంది. ఆకాశం నీలిరంగులో మెరిసిపోతూ, గాలి మెల్లగా వీస్తూ చుట్టూ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇంతలో అకస్మాత్తుగా, వారి ఇంటి దగ్గరలో ఉన్న ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ వైపు నుంచి ఒక్కసారిగా గర్జన వినిపించింది. ఆశ్చర్యభరిత దృష్టితో ఆమె ఆకాశం వైపు చూసిన క్షణాల్లోనే, అగ్నిగోళంలా మెరుస్తూ ఒక రాకెట్, నింగిలోకి దూసుకుపోతోంది. మహా గర్జనతో అద్భుతంగా జ్వలిస్తూ గగనాన్ని చీల్చుకుంటూ, దూసుకెళ్తున్న ఆ దృశ్యం ఆమె కళ్లను అమితంగా ఆకర్షించింది. 

“వావ్ ఇది ఎంత అద్భుతంగా ఉంది” అని ఆమె మనసులో అనుకుంది. ఆ క్షణమే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ గగనగామి ఆకాశంలోకి దూసుకుపోతున్న ఆ రాకెట్‌ను తిలకిస్తూ, “నేనూ ఏదోఒక రోజు ఇలాంటి రాకెట్లను సృష్టించే శాస్త్రవేత్తగా ఎదగాలి,” అని అంతరంగంలో ఏర్పడిన అచంచల సంకల్పాన్ని ప్రతిజ్ఞగా మలుచుకుంది.


ఆ రోజు నుంచే, శాస్త్రవేత్తగా ఎదగాలంటే అనుసరించవలసిన మార్గమేమిటి అనే మనోమథనంతో ఆమె మునిగిపోయింది. తన ఆశయ సిద్ధికి విద్య ఒక్కటే ఏకైక మార్గమని ఆమె స్పష్టంగా గ్రహించింది. అందుకు  విజ్ఞానశాస్త్రం, గణితశాస్త్రాల పట్ల విశేష ఆసక్తిని ఏర్పరచుకుంది.


గగనతలాన్ని తిలకించే ప్రతి సందర్భంలోనూ, తన కలల కిరణం మళ్లీ మళ్లీ మనసులో మెరవగా, “ఇంకా కృషి చేయాలి, ఇంకా కఠోరంగా శ్రమించాలి” అనే దృఢనిశ్చయం ఆమె అంతరంగంలో అగ్నిజ్వాలలా రగిలేది.


కలలు కనడం సహజం కానీ, వాటిని సాకారం చేసే కృషే మహత్తరమని గ్రహించిన టెస్సి ఆలోచనను ఆచరణగా, ఆశయాన్ని సాధనగా మలచుకునే దిశగా ధైర్యంగా ముందడుగు వేసింది.


రాకెట్ల పట్ల ఉన్న ఆ అభిరుచి ఆమెను కళాశాలలో ఇంజనీరింగ్ అభ్యసించేందుకు ప్రేరేపించింది. కాలక్రమేణా, తన కృషి మరియు పట్టుదలతో ముందుకు సాగుతూ, ఎదురైన ప్రతి అవరోధాన్ని ఒక అవకాశంగా మలచుకుంది.


కేరళలోని ఒక చిన్న పట్టణం నుంచీ భారతదేశ క్షిపణి సాంకేతిక రంగంలో కీర్తిశిఖరాలను అధిరోహించడం వరకు ఆమె సాధించినది అసాధారణ యాత్ర. సంకల్పాన్ని సాకారంగా, శ్రమను శిఖరంగా మలుచుకున్న ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.. చివరికి, ఆమె భారతదేశంలో “మిస్సైల్ ఉమెన్”గా ప్రసిద్ధి చెందిన గొప్ప శాస్త్రవేత్త టెస్సి థామస్ గా నిలిచింది.


ఆమె జీవనగాథ కలలు కనేవారికి దిశానిర్దేశక దీప్తిలా వెలుగొందుతుంది. ఆ కలలను సాకారం చేసుకునే సాధనలో ఆమె ప్రదర్శించిన ధైర్యం, దృఢసంకల్పం, కఠోర కృషి, తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి  ప్రేరణగా నిలుస్తుంది. 


బాల్యదశ నుంచే ఆమె జీవనయాత్ర సవాళ్లతో నిండిపోయింది. పదమూడేళ్ల వయస్సులోనే తండ్రికి స్ట్రోక్ రావడంతో కుటుంబ పరిస్థితులు ఒక్కసారిగా కుదేలయ్యాయి. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి ఆరోగ్య పరిస్థితి కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా కుంగదీసింది. ఇంతవరకు ఇంటి బయట పనిచేయని  తల్లి, కుటుంబాన్ని నిలబెట్టేందుకు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించింది. ఆ సంక్షోభ సమయంలో తల్లి ప్రదర్శించిన ధైర్యం, దృఢసంకల్పం, నిరంతర శ్రమ టెస్సీ మనసులో చెరగని ముద్ర వేసాయి. ఆ విపత్కర సమయంలో కనిపించిన ఆ తల్లి త్యాగం, పట్టుదల ఆమె భవిష్యత్తుకు ప్రేరణాగా మారి విజయ మార్గంలో నడిపించే శక్తిగా నిలిచాయి.


టెస్సి థామస్ తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ సమీపంలో పెరిగిన కారణంగా, అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరే రాకెట్లను చూసి ఆమెకు విజ్ఞానం, అంతరిక్షం పట్ల ఆసక్తి పెరిగింది. ఆ చిన్ననాటి అనుభవాలే ఆమె భవిష్యత్తుకు బలమైన పునాది అయ్యాయి.


కష్టాలను ఎదుర్కొంటూనే టెస్సీ తన చదువులో ప్రతిభ కనబరిచింది. త్రిస్సూర్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో B.Tech పూర్తి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో నిరుత్సాహపడకుండా, తన చదువుకు నిధులు సమకూర్చుకోవడానికి ఆమె విద్యా రుణం తీసుకుంది. తదుపరి, ఆమె పూణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీ (ప్రస్తుతం డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ) నుండి గైడెడ్ మిస్సైల్స్‌లో M.Tech పూర్తి చేసింది. అలాగే, హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుండి మిస్సైల్ గైడెన్స్‌లో పీహెచ్.డి పొందింది.


1988లో ఆమె డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో శాస్త్రవేత్తగా చేరి, జడత్వ నావిగేషన్ (Inertial Navigation) విభాగంలో తన పరిశోధనా ప్రయాణాన్ని ప్రారంభించింది. తన ప్రారంభ దశలోనే ఆమె ఏ. పి. జె. అబ్దుల్ కలాం మార్గదర్శకత్వంలో అగ్ని క్షిపణి కార్యక్రమంపై పనిచేశారు. తరువాత ఆమె అగ్ని-IV ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, 2011లో జరిగిన పరీక్షను విజయవంతంగా నడిపించారు. అంతేకాకుండా, ఆమె అగ్ని-V ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అగ్ని-V భారతదేశం యొక్క మొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM), ఇది 5000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని చేరగలదు. 2012 మరియు 2018లో జరిగిన అగ్ని-V పరీక్షలు భారత రక్షణ రంగంలో ముఖ్యమైన మైలురాళ్లుగా నిలిచాయి. ఈ క్షిపణి సుమారు 3000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే రీ ఎంట్రీ ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అనేక అద్భుత ప్రయోగాలను విజయవంతంగా నిర్వహిస్తూ, పురుషాధిక్యంతో నిండిన శాస్త్ర రంగంలో ఆమె తన ప్రతిభా పటిమతో పటిష్ఠ స్థానాన్ని సంపాదించింది. అడ్డంకులను అధిగమిస్తూ, అపనిందలను పంటి బిగువున భరిస్తూ, అవరోధాలను అవకాశాలుగా మలుచుకుంటూ ఆమె ఆత్మవిశ్వాసాన్ని అజేయ ఆయుధంగా మార్చుకుంది.


పురుషుల ప్రాభవం ప్రబలంగా ఉన్న వాతావరణంలోనూ, తన సంకల్పశక్తి, సమర్థత, నిరంతర సాధనతో ఆమె స్త్రీశక్తి సత్తాను సుస్పష్టంగా తన మహత్తర కృషి ద్వారా చాటిచెప్పింది. సాధారణ స్త్రీగా కాదు స్ఫూర్తి స్వరూపిణిగా, సమర్థతకు సమీకరణంగా, విజయానికి ప్రతీకగా ఆమె ఎదిగింది.


ఈ అవార్డులు టెస్సి థామస్ గారి కృషి, ప్రతిభ, పట్టుదలకు ప్రతీకలుగా నిలుస్తాయి.


రక్షణ పరిశోధన రంగంలో ఆమె చేసిన విశేష సేవలకు అనేక పురస్కారాలు లభించాయి. 2001లో DRDO అగ్ని అవార్డును అందుకున్నారు. 2008లో DRDO “సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్” అవార్డును గెలుచుకున్నారు. అగ్ని-IV మరియు అగ్ని-V క్షిపణి ప్రాజెక్టుల్లో ఆమె చేసిన కృషికి గాను 2011 మరియు 2012లో పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్నారు. 2012లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యుత్తమ ప్రతిభకు గాను ప్రతిష్ఠాత్మకమైన లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డును పొందారు. అదేవిధంగా, 2009లో సుమన్ శర్మ అవార్డు, 2012లో మేడమ్ మేరీ క్యూరీ మహిళా విజ్ఞాన పురస్కారం వంటి గౌరవాలు ఆమెకు దక్కాయి. 2018లో డాక్టర్ థామస్ కాంగన్ లీడర్‌షిప్ అవార్డును అందుకుని తన ప్రతిభను మరింత ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టుకున్నారు.


భారతదేశంలో క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన తొలి మహిళగా టెస్సీ థామస్ చరిత్ర సృష్టించారు. ఆమె నాయకత్వం భారత రక్షణ వ్యూహాన్ని మరింత బలోపేతం చేసింది. ముఖ్యంగా అగ్ని క్షిపణి ప్రాజెక్టులో ఆమె పోషించిన పాత్ర దేశానికి గర్వకారణంగా నిలిచింది.


ఆమె కథ సాధారణ విజయగాథ కాదు, సాహసానికి సంకేతం, సాధనకు సాక్ష్యం, స్త్రీశక్తికి శిఖరాగ్ర ప్రతీక. యువతకు, ముఖ్యంగా ప్రతి యువతికి, ఆమె జీవితం నిరుత్సాహాన్ని నశింపజేసే నూతన నిశ్చయానికి నాంది. 


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475

30, ఏప్రిల్ 2026, గురువారం

complete vs finish

 ఒక సాయంత్రం ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు భార్యకు ఒక్కసారిగా ఒక సందేహం వచ్చింది. భర్త దగ్గరకు వచ్చి అడిగింది.


“ఏవండీ … ఒక విషయం అడగాలా?”

భర్త నవ్వుతూ, “అడుగు, ఏమైంది?” అన్నాడు.

“Complete కి, Finish కి తేడా ఏముంది? రెండూ ఒకటే మీనింగ్ కదా!” అని అమాయకంగా అడిగింది.

భర్త కాసేపు ఆమె ముఖం చూసి నవ్వాడు.
“ఓసి పిచ్చిదానా! రెండూ ఒకటే కాదు. వేరువేరు సందర్భాల్లో వాడే పదాలు అవి,” అన్నాడు.

భార్య వెంటనే ఆసక్తిగా,
“అలానా! అయితే ఉదాహరణతో చెప్పు,” అంది.

భర్త మాత్రం తప్పించుకోవాలని చూసాడు.
“అయ్యో… ఇప్పుడెందుకు అవన్నీ? తరువాత చెప్తాను,” అన్నాడు.

కానీ భార్య పట్టువిడవలేదు.
“లేదు లేదు… ఇప్పుడే చెప్పాలి. ఉదాహరణతో చెప్పు,” అని పట్టుబట్టింది.

భర్త కొంచెం ఆలోచించి చిరునవ్వు నవ్వాడు.
“సరే విను,” అన్నాడు.

“Complete అంటే ఒక పని పూర్తవడం. ఉదాహరణకి… నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావ్ కదా! అది నీ జీవితంలో ఒక ఆపరేషన్ complete అయినట్టే.”

అది విని భార్య నవ్వింది.
“అయితే finish అంటే?” అని మళ్లీ అడిగింది.

భర్త వెంటనే నవ్వుతూ అన్నాడు—
“నేను నిన్ను పెళ్లి చేసుకున్న రోజు నుంచి… నా జీవితం finish అయిపోయింది!”

అంతే… ఆ మాట విన్న భార్య మొదట ఒక్కసారిగా షాక్ అయింది. తరువాత భర్తను చూసి కోపంగా నటించింది. కానీ కాసేపటికి ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు.

ఆ రోజు నుంచి ఆ ఇంట్లో complete మరియు finish అనే పదాలు వినిపించినప్పుడల్లా ఇద్దరికీ ఆ సరదా సంఘటన గుర్తొచ్చి నవ్వు ఆగేది కాదు.

✍️
కోట దామోదర్
మొబైల్ 9391480475

సంగీతం – మనసును తాకే శక్తి

 సంగీతం – మనసును తాకే శక్తి

ఒకరోజు సాయంత్రం. ఇంటి ముందున్న ఆరుబయట చల్లని గాలిలో తాతయ్య, మనవడు ఇద్దరు కూర్చుని సరదాగా ముచ్చటించుకుంటున్నారు. ఆకాశం నారింజ రంగులో మెరుస్తోంది. పక్షులు గూటికి తిరిగి వెళ్తున్నాయి. ఆ నిశ్శబ్దంలో మనవడికి ఒక్కసారిగా ఒక ప్రశ్న వచ్చింది.


“తాతయ్య… మీరు దేనిని ఎక్కువగా ఇష్టపడతారు?” అని అమాయకంగా అడిగాడు.

తాతయ్య చిరునవ్వు చిందిస్తూ,
“మనవడా… నాకు సంగీతం చాలా ఇష్టం” అని సమాధానం చెప్పాడు.

మనవడికి మాత్రం ఆ మాట పూర్తిగా అర్థం కాలేదు. కొద్దిసేపు ఆలోచించి మళ్లీ అడిగాడు.

“తాతయ్య… సంగీతాన్ని ఎందుకు అంతగా ఇష్టపడతారు? సంగీతం వింటే ఏమవుతుంది?”

తాతయ్య కొద్దిసేపు ఆకాశం వైపు చూసి మెల్లగా అన్నాడు:
“మనవడా… సంగీతానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అది మనిషిని భూమి నుండి స్వర్గానికి తీసుకెళ్లగలదు, స్వర్గం నుండి మళ్లీ భూమికి తీసుకురాగలదు.”

మనవడు ఆశ్చర్యపోయాడు.
“అది ఎలా తాతయ్య? భూమి నుండి స్వర్గానికి ఎలా తీసుకెళ్తుంది?” అని మళ్లీ ప్రశ్నించాడు.

తాతయ్య నవ్వుతూ చెప్పాడు:
“ఒరేయ్ మనవడా… సంగీతం వింటుంటే మనసు ఎంత ఉల్లాసంగా మారుతుందో గమనించావా? మంచి పాట వింటే మనం కూడా ఆ పాటలోని పాత్రలతో కలిసి జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. బాధతో కూడిన పాట వింటే మనకూ బాధ కలుగుతుంది. సంతోషకరమైన పాట వింటే మన హృదయం కూడా ఆనందంతో నిండిపోతుంది. అంటే సంగీతం మన భావాలను మార్చగలదు. అందుకే నేను అది స్వర్గానికి తీసుకెళ్తుందని చెప్పాను.”

మనవడు ఆసక్తిగా వింటూ తల ఊపాడు.
ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగాడు. తాతయ్య ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పాడు.

చివరికి మనవడు మరో ప్రశ్న వేసాడు.

“తాతయ్య… ఈ శక్తి సంగీతానికి మాత్రమే ఉందా? ఇంకేమైనా ఉందా?”

తాతయ్య కొద్దిసేపు ఆలోచించి నవ్వుతూ అన్నాడు:
“అవును మనవడా… ఇంకొకటి కూడా ఉంది.”

“ఏంటి తాతయ్య?” అని మనవడు ఆసక్తిగా అడిగాడు.

“అదే రా బాబు… బడి గంట!”

మనవడు ఆశ్చర్యపోయాడు.
“బడి గంటకా? దానికి ఏ శక్తి ఉంటుంది తాతయ్య?”

తాతయ్య నవ్వుతూ చెప్పాడు:
“నువ్వు పొద్దున్నే స్కూల్‌కి వెళ్లినప్పుడు బడి గంట మోగితే నీకు కొంచెం బాధగా అనిపిస్తుంది కదా? క్లాస్ మొదలవుతుందని. కానీ అదే గంట సాయంత్రం మోగితే ఎంత సంతోషంగా అనిపిస్తుంది! ఇంటికి వెళ్లొచ్చని.”

“అదే శబ్దం… కానీ మన భావాలు మాత్రం మారిపోతాయి. మన పరిస్థితి బట్టి మనసు స్పందిస్తుంది. సంగీతం కూడా అలాగే మన భావాలను తాకుతుంది.”

మనవడు కాసేపు ఆలోచించి చిరునవ్వుతో అన్నాడు:
“ఓహ్… అలానా తాతయ్య!”

తాతయ్య తల నిమిరి,
“అవును మనవడా… ఈ ప్రపంచంలో కొన్ని శబ్దాలు మనసును నడిపిస్తాయి. సంగీతం వాటిలో మొదటిది” అని ప్రేమగా చెప్పాడు.

ఆ సాయంత్రం గాలి మధ్య తాతయ్య చెప్పిన ఆ మాటలు మనవడి మనసులో మధురమైన సంగీతంలా మిగిలిపోయాయి.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

అవరోధాలపై విజయం: డాక్టర్ వి. ఎస్. ప్రియా జీవగాథ

 “అవరోధాలపై విజయం: డాక్టర్ వి. ఎస్. ప్రియా జీవగాథ” 

ట్రాన్స్‌జెండర్‌గా బ్రతకడం అంటే పోరాటమే కాదు, అసాధారణ విషయం అస్సలే కాదు. ప్రతి మనిషిలాగే వారు కూడా భావాలు, ఆశలు, కలలు కలిగిన సాధారణ మనుషులే. కానీ మన సమాజం వారిని మరో కోణంలో చూడడం వల్ల, వారి జీవితం సవాలక్ష సవాళ్లతో నిండిపోతుంది. వారిని అర్థం చేసుకోవడం కన్నా విమర్శించడం, అంగీకరించడం కన్నా దూరంగా ఉంచడం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దృక్పథం మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమస్య వారిలో లేదు, వారిని చూసే మన దృష్టిలో ఉంది.

 చిన్ననాటి నుంచే వారు ఎన్నో అవమానాలు, నిరాకరణలు ఎదుర్కొంటారు. కుటుంబం నుంచి ప్రారంభమయ్యే ఈ నిరాకరణ, బయట ప్రపంచంలో మరింత పెరుగుతుంది. సాధారణ వ్యక్తులకు అందినట్లుగా విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలు కూడా వారికి సులభంగా అందవు. అయినప్పటికీ, వారు తమ జీవితాన్ని గౌరవంగా, ధైర్యంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల జీవితం అనేది సాధారణంగా సవాళ్లతో నిండిన ప్రయాణం. కానీ ఆ సవాళ్లను ఎదుర్కొంటూ విజయం సాధించిన వ్యక్తులు సమాజానికి నిజమైన స్ఫూర్తి. అలాంటి వారిలో ఒకరు డాక్టర్. వి. ఎస్. ప్రియ.

డాక్టర్. వి. ఎస్. ప్రియ గారి జీవిత కథ ధైర్యం, ఆత్మవిశ్వాసం, మరియు పట్టుదల ఒక అద్భుత ఉదాహరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సమాజంలో ఎన్నో అవరోధాలు, అపోహలు, విమర్శలు ఎదురైనా, ఆమె తన లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది.

చిన్ననాటి నుంచే తన వ్యక్తిత్వాన్ని అంగీకరించుకోవడం ఎంత కష్టం అనేది ఆమె ప్రయాణం చెబుతుంది. కుటుంబం, సమాజం నుండి వచ్చిన ఒత్తిడులను తట్టుకుని, తన స్వప్నాన్ని సాధించాలనే పట్టుదలతో విద్యను కొనసాగించడం ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తుంది.

ఆమె కేవలం డాక్టర్‌గా ఎదగడం మాత్రమే కాదు, ట్రాన్స్‌జెండర్ సమాజానికి ఒక ఆశాకిరణంగా నిలిచారు. “దృఢ సంకల్పం" ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చు అనే సందేశాన్ని ఆమె జీవితం స్పష్టంగా చెబుతోంది.

సమాజంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై ఇంకా ఎన్నో అపోహలు ఉన్నాయి. చాలా మంది వారికి అవకాశాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తారు. కానీ డాక్టర్ ప్రియా గారు ఆ అవరోధాల అన్నిటినీ ఛేదించి, అవకాశాలుగా మలచుకొని, నేడు ఒక వైద్యురాలిగా సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆమె విజయం కేవలం ట్రాన్స్‌జెండర్ గా గెలుపు మాత్రమే కాదు, సమాజం మార్పు దిశగా తీసుకున్న ఒక పెద్ద అడుగు.

కేరళ రాష్ట్రంలో జన్మించిన డాక్టర్. వి. ఎస్. ప్రియ గారు చిన్ననాటి నుంచే తనను మహిళగా భావించేవారు. అయితే సమాజం, కుటుంబం, మరియు పరిసరాల ఒత్తిడి కారణంగా ఆ భావనను బయట పెట్టడం ఆమెకు చాలా కష్టంగా మారింది.

కాలక్రమేణా ఆమె తన నిజమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని, తనకు నచ్చిన దిశలో జీవించాలని ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రారంభంలో కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించకపోయినా, ఆమె పట్టుదల, ధైర్యం చూసి తర్వాత అంగీకరించారు.

ఆమె విద్యా ప్రయాణం సవాళ్లతో నిండినదే. లింగ గుర్తింపు కారణంగా పాఠశాల దశలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, వాటిని లెక్కచేయకుండా తన లక్ష్యంపై దృష్టి సారించారు. వైద్యరంగంపై ఆసక్తితో ఆమె ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసించారు.

ప్రస్తుతం ఆమె త్రిసూర్ ప్రాంతంలో ఆయుర్వేద వైద్యురాలిగా సేవలు అందిస్తూ, తన జీవితం ద్వారా అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఆమె జీవితం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది. మన స్వప్నాలు నిజం కావడానికి జెండర్‌తో ఎలాంటి సంబంధం లేదు. మనం ఎంత కష్టపడతామో, ఎంత పట్టుదలతో ముందుకు సాగుతామో అదే ముఖ్యం. లింగ భేదం, సామాజిక అడ్డంకులు ఇవన్నీ మన లక్ష్యాలను ఆపలేవు.

మనలో నమ్మకం ఉంటే, ఏదైనా సాధించగలం. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మనలోని అసలైన శక్తి బయటపడుతుంది. ప్రతి అడ్డంకి మనకు ఒక కొత్త పాఠం నేర్పుతుంది, ప్రతి కష్టం మనల్ని లక్ష్యానికి మరింత దగ్గర చేస్తుంది.

సమాజంలో ట్రాన్సజెండర్స్‌పై వివక్ష లేకుండా ఉండాలంటే మార్పు విద్యాసంస్థల నుంచే ప్రారంభం కావాలి. స్కూల్స్, కాలేజీల్లో వారిపై ఎలాంటి వివక్ష లేకుండా, సమానంగా చూడడం అత్యంత ముఖ్యం. చిన్న వయసులోనే విద్యార్థులకు సమానత్వం, గౌరవం అనే విలువలు నేర్పితే భవిష్యత్తులో మంచి సమాజం ఏర్పడుతుంది.

అదే విధంగా, ఉద్యోగాల్లో కూడా ట్రాన్సజెండర్స్‌కు సమాన అవకాశాలు కల్పించాలి. వారి ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తే, వారు కూడా సమాజంలో స్వాభిమానంతో నిలబడగలరు.

ఇందుకోసం పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు. చిన్న మార్పులే పెద్ద ఫలితాలు ఇస్తాయి. ఒక మంచి మాట, ఒక గౌరవం, ఒక అవకాశం. ఇవే వారి జీవితాన్ని మార్చగలవు.

మనం ఒక్కొక్కరం మారితేనే సమాజం మొత్తం మారుతుంది.

ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన సంకల్పం దృఢంగా ఉంటే విజయం మనదే అవుతుంది.

యువతకు డాక్టర్ ప్రియా గారి జీవితం ఒక గొప్ప ప్రేరణ. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిత్వాన్ని గౌరవించుకోవాలి, ఇతరులను కూడా అంగీకరించాలి. అప్పుడు మాత్రమే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది.


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్: 9391480475

వైకల్యాన్ని జయించిన విలువిద్య క్రీడాకారిణి

 వైకల్యాన్ని జయించిన విలువిద్య క్రీడాకారిణి 


ఆర్చరీ లేదా విలువిద్యలో రాణించాలంటే శారీరక సమతుల్యత, కచ్చితమైన ప్రణాళిక, సాధించాలనే పట్టుదల ఇవన్నీ తప్పనిసరి. ముఖ్యంగా చేతులు లేని వారు ఈ క్రీడలో రాణించడం అసాధ్యం అనిపించడం సహజం. కానీ అలాంటి అసాధ్యాన్ని సైతం సుసాధ్యంగా మార్చిన స్ఫూర్తిదాయకమైన యువ క్రీడాకారిణి జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శీతల్ దేవి.

రెండు చేతులు లేకపోయినా, మొక్కవోని పట్టుదలతో ఆమె తన కాళ్లతో, భుజాల సహాయంతో విల్లు ఎక్కించి బాణాలు సంధించడం నేర్చుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సంకల్పబలం ఎంత శక్తివంతమైనదో అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం శీతల్ దేవి జీవన గాధ.

వైకల్యం ఒక అవరోధం అయినప్పటికీ, ఆ అవరోధాన్నే ఆమె అవకాశంగా మార్చుకుంది. అదే అవరోధం ఆమెకు ప్రేరణగా మారింది. తన శారీరక పరిస్థితిని ఒక దుర్బలంగా  భావించకుండా, తన లక్ష్యాన్ని చేరుకునే ఉద్దేశంతో ఆమె దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. గతేడాది దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూలో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన శీతల్ దేవి “చేతులు లేని” ఏకైక మహిళా ఆర్చర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తన అద్భుత ప్రతిభతో అంతర్జాతీయ పారా క్రీడల్లో సత్తా చాటి, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

రెండు చేతులు లేకపోయినప్పటికీ, తన కాలి వేళ్లు మరియు భుజం సాయంతో విల్లును లక్ష్య బిందువుపై ఎక్కుపెట్టే ఆమె ప్రతిభను చూసి ప్రేక్షకులు తమ కనురెప్పలు వేయడం కూడా మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు. ఆమె క్రీడా నైపుణ్యం మరియు సంకల్పబలం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె ఆటను ప్రత్యక్షంగా చూడటానికి ప్రాంగణానికి తరలి వచ్చే అభిమానులు కోకొల్లలు. ఆమె వదిలే ప్రతి బాణం లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, ప్రేక్షకుల హృదయాలనూ తాకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ అద్భుత ప్రతిభతోనే అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధిస్తున్న శీతల్ దేవి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో వార్షిక అవార్డులలో ఆమెను “పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్” అవార్డుకు ఎంపిక చేస్తూ ప్రపంచ ఆర్చరీ సంస్థ గౌరవించింది.

ప్రపంచ క్రీడా రంగంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రేరణాత్మక వ్యక్తుల్లో ప్రముఖుడు 'మాట్ స్టట్జ్మాన్' ఒకరు. ఆయనను “Armless Archer” అని కూడా పిలుస్తుంటారు. చేతులు లేకపోయినా, తన కాళ్ల సహాయంతో విల్లు పట్టి బాణం సంధిస్తూ ప్రపంచస్థాయిలో అద్భుత ప్రతిభను ప్రదర్శించారు ఆయన. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించి, ప్రపంచం గర్వించదగిన విలుకాడిగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.

అలాగే మహిళా విభాగంలో శీతల్ దేవీ ఒక గర్వించదగిన క్రీడాకారిణిగా ఆవిర్భవించారు. ఆమె చిన్న వయసులోనే విలువిద్యలో చేరి, కఠిన సాధనతో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. ఆమె విజయాలు భారతదేశానికి గర్వకారణంగా నిలవడమే కాకుండా, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తన దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన గొప్ప విలువిద్యా క్రీడాకారిణిగా నిలిచింది.

'మాట్ స్టట్జ్మాన్' మరియు 'శీతల్ దేవీ' వంటి మహోన్నత క్రీడాకారుల జీవితాలు ప్రతి ఒక్కరికి గొప్ప స్ఫూర్తినిస్తాయి. వీరిద్దరూ శారీరక వైకల్యం ఉన్నప్పటికీ, దానిని ఒక ప్రతిబంధకంగా భావించకుండా ఒక సవాలుగా తీసుకుని తమ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పారు. వారి విజయాలు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. మనిషికి శారీరక పరిమితులు ఉన్నా, మనస్సుకు మాత్రం పరిమితులు ఉండకూడదు.

వారి జీవితాలను పరిశీలిస్తే, దృఢ సంకల్పం, కష్టపడే స్వభావం, పట్టుదల, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు ఎంత ముఖ్యమో తెలుస్తుంది. వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వెనుదిరగకుండా, నిరంతరం సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి విజయాన్ని సాధించాలంటే కష్టపడటం తప్పనిసరి అనే సూచననిస్తుంది.

అలాగే, సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం కూడా వీరి నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తమ వైకల్యాన్ని బలహీనతగా భావించకుండా, అదే తమ ప్రత్యేకతగా మార్చుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. విజయం ఒక్కరోజులో రాదు. నిరంతర సాధన, కృషి ఉంటేనే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు అనే అక్షర సత్యాన్ని వారి జీవితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

కాబట్టి ప్రతి విద్యార్థి వీరి జీవితాల నుండి స్ఫూర్తి పొందుతూ, ఏ పరిస్థితులైనా ఎదుర్కొని, తమ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి ఘన విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను.
 
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

నేత కార్మికుల పై ప్రభుత్వం ఎందుకు పగబట్టింది?

 నేత కార్మికుల పై ప్రభుత్వం ఎందుకు పగబట్టింది?


ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా మారి వారి జీవనాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రూ.105.54 కోట్ల ఆర్డర్‌ను రద్దు చేయడం చేనేత వర్గాల్లో తీవ్ర నిరాశను కలిగించింది. అంతేకాకుండా సంక్షేమ శాఖలు రూ.200 కోట్ల విలువైన దుస్తులు, దుప్పట్ల తయారీకి ఇప్పటివరకు ఆర్డర్లు ఇవ్వకపోవడం ఇటు టెస్కో, అటు చేనేత కార్మికులను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తోంది. ఒకవైపు నేతన్న అప్పులబాధతో సతమతమవుతుండగా, ఈ నిర్ణయాలు “పుండుమీద కారం చల్లినట్లు” వారి బాధను మరింతగా పెంచుతున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ నిర్ణయం వల్ల ఎన్నో చేనేత కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ‘కంచంలోని కూడును లాక్కున్నట్లుగా’ ఉంది. ఆర్డర్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించాల్సిన ప్రభుత్వమే చేతికందిన పనిని లాక్కుంటే చేనేత కార్మికుల పరిస్థితి ఏంటి?  

అయితే, ఇలాంటి సంక్షోభాలే చేనేత వర్గం సహనాన్ని, పోరాటస్ఫూర్తిని పరీక్షించే సందర్భాలు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, చేనేత కార్మికులు ఎప్పుడూ వెనుదిరగలేదు. ప్రభుత్వం గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్య్రం రాకముందు చేనేత రంగం దేశానికి వెన్నుముకగా పనిచేసిందన్న విషయాన్ని విస్మరించడం సమంజసం కాదు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం జరిగిన ఉద్యమంలో కూడా చేనేత వర్గం ఎనలేని సేవలు అందించింది. స్వరాష్ట్రం కోసం చేనేత కార్మికులు ప్రాణత్యాగాలు చేశారన్న విషయం ప్రభుత్వం మరిచిందేమో గానీ, ప్రజలు మాత్రం ఎప్పటికీ మరిచిపోలేరు.

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత కీలక పాత్ర పోషించింది. విదేశీ వస్త్రాల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పుడు, దేశవ్యాప్తంగా చేనేత ఉద్యమం ఉవ్వెత్తున ఒక జ్వాలలా వ్యాపించింది. మహత్మా గాంధీ ఇచ్చిన స్వదేశీ పిలుపుతో ప్రతి ఇంట్లో చరఖా తిరిగింది. ఖాదీ కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అని మహాత్మా గాంధీ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. చేనేత రంగం ద్వారా దేశం ఆర్థికంగా బలపడటమే కాకుండా, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన ప్రతిఘటనగా మారిందన్న విషయం ప్రభుత్వం విస్మరించింది.

ఏళ్లు గడిచినా మహాత్ముడి ఆకాంక్షలు నెరవేరకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. చేనేత కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పరిశీలిస్తే, కొత్త హామీలు గురించి పక్కన పెడితే, ఉన్నవే క్రమంగా కనుమరుగవుతున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

ఇచ్చిన హామీలను ఒకసారి గమనిస్తే—

1. స్కూల్ యూనిఫార్మ్స్, దుప్పట్లు, ఇతర ప్రభుత్వ అవసరాలకు చేనేత వస్త్రాల వినియోగం పెంచుతూ ప్రభుత్వ ఆర్డర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
2. “నేతన్నకు చేయూత” వంటి పథకాల ద్వారా నేరుగా నగదు సహాయం అందించి, కార్మికుల ఆదాయం పెంచుతామని చెప్పారు.
3. ముడి సరుకులైన నూలు, రంగులను తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇచ్చారు.
4. తక్కువ వడ్డీ రుణాలు, అప్పుల భారం తగ్గించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
5. చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ కల్పించి, ఆన్‌లైన్ అమ్మకాలకు సహాయం చేస్తామని ప్రకటించారు.

అయితే, ఈ హామీల్లో నిజంగా ఎన్ని అమలయ్యాయి అన్నది ప్రతి నేత కార్మికుడికి బాగా తెలుసు. హామీలు కాగితాలకే పరిమితం తప్ప అమలుకు నోచుకోకపోవడం చేనేత వర్గంలో నిరాశను మరింతగా పెంచింది.

ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు ప్రజల్లో ఆశలను రగిలిస్తాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత అవి అమలు కావు, ఆవిరి అయిపోతాయి. హామీల అమలు అనే అంశం నేటి రాజకీయాల్లో ఒక చేదు వాస్తవంగా మారింది. “చెప్పేది ఒకటి, చేసేది మరోటి” అన్న భావన ప్రజల్లో బలపడుతోంది.

ఈమధ్య కాలంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా పెద్ద పెద్ద హామీలు ఇస్తారు. కానీ అవి అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికలు చేపట్టకపోవడం ఫలితంగా హామీలు కాగితాలపైనే మిగిలిపోతాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు అనేక రంగాల్లో ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పి, ఇచ్చిన హామీల అమలును వాయిదా వేస్తున్నాయి. కానీ ఇదే సమయంలో ఇతర ప్రాధాన్యాలపై ఖర్చులు కొనసాగుతుండడం ప్రజల్లో సందేహాలు కలిగిస్తుంది. హామీల అమలుపై సరైన మానిటరింగ్ లేకపోవడం బాధ్యతా లోపం అని చెప్పక తప్పదు. ఎవరు బాధ్యత వహించాలన్న స్పష్టత లేకపోవడం వల్ల అవి క్రమంగా మరుగున పడుతున్నాయి. ఎన్నికల తర్వాత నాయకులపై ఉన్న ఒత్తిడి తగ్గిపోవడంతో, హామీల ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుంది.
హామీలు ఇవ్వడం సులభం, కానీ వాటిని అమలు చేయడం నిజమైన నాయకత్వం. నేటి రాజకీయాల్లో మాటలకు మించి కార్యాచరణకు ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉంది.

ఊకదంపుడు ఉపన్యాసాలతో నోటికొచ్చిన హామీలు ఇస్తూ, నేత కార్మికులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారనే భావన బలపడుతోంది. చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన కృషి కనిపించకపోవడం ఆవేదనకరమైన విషయం. "దయలేని అత్తకి దండం పెట్టినా తప్పే" అన్నట్లు  దయలేని ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా ఏమి లాభం, చేనేత కార్మికుడికి కన్నీరే తప్ప!  

ఇకనైనా నేత కార్మికుల కష్టాన్ని గుర్తించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వారికి సరైన న్యాయం అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి

  ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి మనిషి జీవితంలో విజయాన్ని సాధించడానికి అత్యంత ముఖ్యమైనది సంకల్పం. ...