5, ఏప్రిల్ 2026, ఆదివారం

*మూడో కన్ను" తెరిచినప్పుడు… కనిపించే సాహిత్య ప్రపంచం*

 "*మూడో కన్ను" తెరిచినప్పుడు… కనిపించే సాహిత్య ప్రపంచం*!  


మూడో కన్ను తెరవగానే ప్రపంచం మొత్తం మన కళ్లముందే ప్రత్యేక్షమైనట్లు. మూసుకున్న కళ్లతో జీవితం చూడగలమని భావించడం ఒక అపోహ మాత్రమే. ఆ అపోహల పొరలు తొలగినప్పుడే నిజమైన ప్రపంచం మనకు కనిపిస్తుంది. చూడటానికి రెండు కళ్లే సరిపోవు; నిజాన్ని గ్రహించడానికి జ్ఞానం అనే మూడో కన్ను అవసరం.

అదే భావాన్ని గుర్తు చేసేలా ముక్కామల చక్రధర్ గారి “మూడో కన్ను” ఒక మేల్కొలుపు స్వరం. ఆయన విశ్లేషణలు మనం గమనించని అనేక విషయాలను ఒక్కసారిగా వెలుగులోకి తీసుకొస్తాయి. సాధారణంగా మన కళ్లకు కనిపించని కోణాలను ఆయన స్పష్టంగా చూపిస్తారు. ఇప్పటివరకు మనకు తెలియని నిజాలు నెమలి పురివిప్పి నాట్యం చేసినట్లు ఒక్కసారిగా మన కళ్లముందు విరబూస్తాయి. నెమలి నాట్యం చూసినప్పుడు మన కళ్లకు కలిగే ఆకర్షణ ఎంత మధురమో, “మూడో కన్ను” వ్యాసాలు చదివినప్పుడు మన ఆలోచనలకు కలిగే ఆకర్షణ కూడా అంతే గాఢంగా ఉంటుంది.

సమాజంలో దాగి ఉన్న వాస్తవాలు, కాలగర్భంలో కనుమరుగైపోయిన కవులు, మనం అలవాటుగా చూసి మర్చిపోయిన సాహిత్య సత్యాలు, ఇవన్నీ ఆయన మూడో కన్ను తెరిచిన క్షణంలోనే మన ముందుకు వస్తాయి. ఆలోచించని విషయాలను ఆలోచింపజేయడం, ప్రశ్నించని విషయాలను ప్రశ్నింపజేయడం, కనిపించని వాస్తవాలను స్పష్టంగా చూపించడం. ఇదే నిజమైన మూడో కన్ను పని.

అందుకే మూడో కన్ను అంటే కోపం కాదు, వినాశనం కాదు. అది అవగాహన. అది జ్ఞానం. అది మేల్కొలుపు. ఆ కన్ను (పుస్తకం) తెరిచినప్పుడే మనం చూస్తున్న ప్రపంచం వెనుక దాగి ఉన్న అసలు ప్రపంచం మనకు అర్థమవుతుంది. 

“ఆయన ‘యాది’ ఎట్లా మరుస్తాం..?” ఈ వ్యాసం చదివిన తర్వాత సామల సదాశివ గారిని మరవడం అసాధ్యమే అనిపిస్తుంది. ఈ వ్యాసంలో ప్రస్తావించిన ఎన్నో విషయాలు చాలా మందికి తెలియనివే అని చెప్పాలి. ఉదాహరణకు, ఉర్దూ గజల్స్‌ను మొదటిసారిగా తెలుగువారికి పరిచయం చేసింది సదాశివ గారేనని మనలో ఎంతమందికి తెలుసు? అంతేకాదు, తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులు బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేడియో బృందంలో సదాశివ గారు కూడా కీలకంగా ఉన్నారని తెలిసినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏంటో  అర్థమవుతుంది.

ఇలాంటి మరెన్నో అరుదైన విషయాలను విపులంగా అక్షరీకరించడం చక్రధర్ గారికే సాధ్యమనే భావన కలుగుతుంది. ముఖ్యంగా సదాశివ గారు మరియు విశ్వనాథ సత్యనారాయణ గారి మధ్య జరిగిన ఒక సందర్భాన్ని ఆయన ఎంతో చక్కగా , హృద్యంగా వివరించిన తీరు ఈ వ్యాసానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వ్యాసం చదివిన తరువాతే ఆ ఇద్దరు మహనీయుల మధ్య ఉన్న ఆత్మీయత, ఆలోచనా లోతు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 

“తెలంగాణ తామర పువ్వు దాశరధి” అనే వ్యాసం చదివినప్పుడు నాకు తెలియని ఎన్నో విషయాలు తెలిసి ఆశ్చర్యపోయిన సందర్భం. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అంటూ తెలంగాణ గర్వాన్ని గీతంగా పలికించిన దాశరథి కేవలం విప్లవ కవియే కాదు; భక్తి గీతాలను కూడా అంతే అలవోకగా రాయగల అరుదైన ప్రతిభ కలిగిన మహాకవి అని ఈ వ్యాసం స్పష్టంగా తెలియజేస్తుంది.

విప్లవ స్వరంతో సమాజాన్ని మేల్కొలిపిన కవి, భక్తి భావంతో హృదయాలను కదిలించిన కవి—ఈ రెండు పరస్పర విభిన్నమైన ధోరణులను సమానంగా మిళితం చేసి తెలంగాణ సాహిత్యంలో ఒక శక్తిగా ఎదిగిన దాశరథి వ్యక్తిత్వాన్ని చక్రధర్ గారు ఎంతో హృద్యంగా, విశ్లేషణాత్మకంగా వివరించారు.

ఆయన రచనలు దాశరథి కేవలం ఒక కవి కాదు; తెలంగాణ ఆత్మను పలికించిన స్వరం అనే భావన స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. 

 కవిత్వంలో ఒక ప్రత్యేక ప్రయోగం గా నిలిచిన "ముక్త పద గ్రస్తం" దాశరథి గారు పాట రూపంలో వినియోగించిన తీరు ఎంత అద్భుతమో ఈ వ్యాసం చదివినప్పుడు మరింత స్పష్టమవుతుంది. నిజానికి ముక్త పద గ్రస్తం అనే అలంకార శైలిపై ఈ కాలం వారికి అంతగా పరిచయం లేకపోయినా, దాశరథి కవిత్వంలో అది ఎలా ఒదిగిపోయిందో ఎంతో హృద్యంగా వివరించారు. అలాంటి అరుదైన సాహిత్యాంశాలను ఈ వ్యాసంలో పొందుపరచడమే కాకుండా, వాటిని సామాన్య పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అందించడం నిజంగా ప్రశంసనీయం.

చక్రధర్ గారు రచించిన “కూసుమంచి అగ్రహారం నుంచి మూడో కన్ను వరకు” వంటి రచనలు చదివినప్పుడల్లా ఆయన సాహిత్య దృష్టి ఎంత విశాలమో అనిపిస్తుంది. ఆయన రచనల పట్ల నాకు కూడా అపారమైన అభిమానం ఉందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు.

“పూల పాటల పండుగ బతుకమ్మ”
తెలంగాణ ఆత్మను పలికించే ఆడబిడ్డ ల ఆనందోత్సవం.
తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ ఆట పాటలు కేవలం పండుగ సంబరాలు మాత్రమే కాదు, ఉద్యమానికి ఊపిరి పోసిన శక్తి గా మారాయి. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి పాడిన పాటలు ఉద్యమానికి ధైర్యాన్ని, ఆశను నింపాయి. ఆ పూల మధ్య పుట్టిన గానమూ, ఆత్మగౌరవం కోసం ఎగిసిన నినాదం కలిసి తెలంగాణ ఆత్మను ప్రపంచానికి చాటి చెప్పాయి.

అందుకే ఉద్యమ సమయంలో బతుకమ్మ ఆటపాటలతో ఉద్యమానికి ఊపిరినందించిన ఆ క్షణాలు ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టంగా నిలిచాయంటారు రచయిత  ముక్కామల చక్రధర్ గారు .

“దిగంబర కవితో కొన్ని గంటలు” అనే వ్యాసం చదువుతుంటే అది కేవలం ఒక రచనగా కాకుండా, మనసులో నిద్రపోయిన జ్ఞాపకాలను మెల్లగా మేల్కొలిపే అనుభూతిగా అనిపిస్తుంది. ఒక మంచి వ్యాసం పాఠకుడిని తన జీవితంలోని చిన్న చిన్న సంఘటనల వద్దకు తీసుకెళ్తేనే అది సార్థకమవుతుంది. ఈ వ్యాసం కూడా అచ్చం అలాంటి అనుభూతిని కలిగిస్తుంది.

ఈ వ్యాసం చదువుతున్నప్పుడు నా చిన్నప్పటి జ్ఞాపకాలు కళ్లముందు తిరిగాయి. చిన్నప్పుడు మా ఇంటికి అమ్మమ్మ, తాత వచ్చేవారు. వాళ్లు వచ్చిన రోజుల్లో ఇంటి అంతా ఒక ప్రత్యేకమైన ఆనందంతో నిండిపోయేది. కానీ వారు మరుసటి రోజు వెళ్తారని తెలిసిన క్షణం మనసులో ఒక విచిత్రమైన బాధ కలిగేది. “ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండును” అనే ఆలోచన సహజంగానే మనసులో మెదిలేది.

అప్పుడు చిన్న పిల్లల అమాయకత్వంతో ఎన్నో చిన్న చిన్న ప్లాన్లు వేసేవాళ్లం. వాళ్లు వెళ్లే ముందు వారి బ్యాగ్ దాచిపెడితే, అది దొరకక ఇంకో రోజు అయినా ఉండిపోతారేమో అనే బాల్యపు ఊహలు మనసులో మెదిలేవి. ఆ చిన్న ప్రయత్నాల వెనుక దాగి ఉండేది ప్రేమ మాత్రమే.

అలాగే ఈ వ్యాసంలో కూడా దిగంబర కవి నగ్నముని తో గడిపిన ఆ కొన్ని గంటలు రచయితకు ఎంతో విలువైనవి గా అనిపిస్తాయి. నవ్వుతూ, మాట్లాడుకుంటూ గడిపిన ఆ క్షణాలు తక్కువ సమయం అయినప్పటికీ హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకాలుగా మారాయి. మనకు ఇష్టమైన వారితో గడిపిన సమయం ఎప్పుడూ చాలదనే భావన ఈ వ్యాసంలో స్పష్టంగా కనిపిస్తుంది.

అంతిమంగా ఈ వ్యాసం మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తుంది—
మన జీవితంలో గొప్ప జ్ఞాపకాలు పెద్ద సంఘటనల వల్ల కాకుండా, ఇలాంటి చిన్న చిన్న అనుభూతుల వల్ల ఏర్పడతాయి. అవి గడిచిపోయినా, మనసులో మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి.

“మూడో కన్ను”లోని అన్ని వ్యాసాలు అద్భుతమే. ప్రతి వ్యాసానికి తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైన అనుభూతి ఉంది. ఇక్కడ నేను కొన్ని వ్యాసాల గురించి మాత్రమే ప్రస్తావించాను. ఎందుకంటే ప్రతి వ్యాసం గురించి నేనే పూర్తిగా చెబితే, మీరు చదివే ఆసక్తి తగ్గిపోతుంది. ఈ రచనల అసలు రుచిని తెలుసుకోవాలంటే మీరు స్వయంగా చదవాలి. అందుకే మీరందరూ ‘మూడో కన్ను’ను తప్పక చదవాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యాసాల లోతు, భావం, అందం నిజంగా అనుభూతి అవుతుంది.”

ప్రతి వారం విశాలాంధ్రలో వెలువడే ఆయన కాలమ్ చదవని రోజు లేదనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కూచిమంచి అగ్రహారం నుంచి “మూడో కన్ను” వరకు ఆయన రాసిన వ్యాసాల్లో నేను చదవని దాదాపు ఒక్కటీ లేదు. ఆయన నుంచి ఎప్పుడు వాట్సాప్ సందేశం వస్తుందా అని ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ ఆ ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు అనుకోవచ్చు.

ముక్కామల గారి “మూడో కన్ను” నిజంగా అదిరిపోయింది. ఆలోచింపజేసే దృష్టి, ప్రత్యేకమైన శైలి, మనసును తాకే భావాలతో ప్రతి వ్యాసం నిలిచిపోతుంది. ఇక ఆయన “నాలుగో కన్ను” ఎప్పుడు తెరుస్తారో అని ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే.


వ్యాసకర్త 
కోట దామోదర్ 
మొబైల్: 9391480475

దేశ చరిత్రలో తొలి కారుణ్య మరణం:

 దేశ చరిత్రలో తొలి కారుణ్య మరణం:


జీవితం అనేది ఆశలతో నిండిన ప్రయాణం. ప్రతి తల్లి తండ్రి తన పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని కలలు కంటారు. కానీ కొన్నిసార్లు విధి మనుషుల మనసును పిండేసే పరిస్థితులను తీసుకొస్తుంది. అలాంటి హృదయ విదారక సంఘటనల్లో ఒకటి కారుణ్య మరణం.

తన కన్న బిడ్డ కోసం ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు… ఏకంగా పదమూడు సంవత్సరాలు ఆశతో ఎదురు చూసిన తల్లిదండ్రులు. తమ బిడ్డ ఎప్పుడో ఒక రోజు కోలుకుని మళ్లీ నవ్వుతాడనే నమ్మకంతో కాలాన్ని గడిపారు. కానీ కాలక్రమేణా వైద్యులు చెప్పిన నిజం వారి ఆశలను మెల్లగా చెదరగొట్టింది. ఇక ఆ బిడ్డ కోలుకునే అవకాశం లేదని.

ఆ సమయంలో తల్లిదండ్రుల మనసులో ఒకే ప్రశ్న మెదిలింది:
“మేము ఉన్నంతవరకు మా బిడ్డను చూసుకుంటాం… కానీ మేము లేని తర్వాత అతన్ని చూసుకునేది ఎవరు?”

జీవచ్ఛవంలా బతుకుతున్న హరీష్ రానా కు కారుణ్య మరణం అనుమతించాలని కన్న తల్లిదండ్రులే 2011లో Supreme Court of India ను ఆశ్రయించారు. ఈ కేసును వైద్య నిపుణుల బృందం సంవత్సరాల పాటు క్షుణ్ణంగా పరిశీలించింది. రోగి పరిస్థితి, వైద్య నివేదికలు, కుటుంబ సభ్యుల వాదనలు అన్నింటినీ విశ్లేషించిన తర్వాత కోర్టు తుది నిర్ణయం తీసుకుంది.

చివరకు 2026 మార్చి 16న కారుణ్య మరణానికి అనుమతి లభించింది. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి దేశవ్యాప్తంగా ప్రజలను కదిలించింది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పించేంత భావోద్వేగం ఉంది.

తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఇప్పటివరకు లైఫ్ సపోర్ట్ ద్వారా బతికిస్తున్న వైద్యులకే ఆ లైఫ్ సపోర్ట్‌ను తొలగించాలని ఆదేశించింది. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డకు చివరిసారిగా తుది వీడ్కోలు పలికారు.

ఆ సమయంలో ఆధ్యాత్మిక ధైర్యం ఇచ్చేందుకు Brahma Kumaris సంస్థకు చెందిన ఒక సోదరి,
“అందరినీ క్షమించు… ఇక వెళ్లాల్సిన సమయం వచ్చింది” అని చెప్పిన మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది.

భారతదేశంలో కారుణ్య మరణంపై చట్టపరమైన చర్చకు మార్గం చూపిన ప్రముఖ కేసు  అరుణ శాన్‌బాగ్ కేసు. ఈ కేసు ఆధారంగా 2011లో సుప్రీంకోర్టు పాసివ్ యూతనేషియాను కొన్ని కఠిన నిబంధనలతో అనుమతించింది. అంటే కోలుకునే అవకాశం లేని రోగికి కుటుంబ సభ్యులు, వైద్యులు, హాస్పిటల్ కమిటీ మరియు కోర్టు అనుమతితో మాత్రమే లైఫ్ సపోర్ట్ తొలగించవచ్చు.

తర్వాత 2018లో సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చి “లివింగ్ విల్” అనే విధానానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చింది. లివింగ్ విల్ అంటే ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యం తో స్పృహ కోల్పోయినప్పుడు లేదా కోలుకునే అవకాశం లేకపోయినప్పుడు, తనకు కృత్రిమంగా జీవితం పొడిగించే చికిత్సలు చేయకూడదని ముందుగానే రాసి పెట్టిన చట్టబద్ధ ప్రకటన.

ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, రోగి పట్ల కుటుంబ సభ్యులు బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా చేయడం, అలాగే రోగి స్వంత అభిప్రాయాన్ని గౌరవించడం. అదే సమయంలో అనవసరమైన బాధను తగ్గించడం కూడా.

ఇప్పటివరకు భారతదేశంలో కారుణ్య మరణం పూర్తిగా స్వేచ్ఛగా అనుమతించబడలేదు. కేవలం కఠిన నిబంధనల మధ్య పాసివ్ యూతనేషియా మాత్రమే అనుమతించబడుతోంది. అయినప్పటికీ, ఈ సంఘటన మానవత్వం, చట్టం, వైద్యం — ఈ మూడింటి మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని మనకు గుర్తు చేస్తుంది.

ఎవరు అరుణ శాన్‌బాగ్?

అరుణ శాన్‌బాగ్ భారతదేశంలో కారుణ్య మరణం (Euthanasia) గురించి చట్టపరమైన చర్చకు మార్గం చూపిన వ్యక్తి. ఆమె ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ (KEM Hospital)లో నర్స్‌గా పనిచేసేవారు.

1973లో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక వార్డ్ బాయ్ ఆమెపై క్రూరంగా దాడి చేయడం వల్ల ఆమె మెదడుకు తీవ్ర గాయం జరిగి కోమా లాంటి స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ ఘటన తర్వాత ఆమె పూర్తిగా కోలుకోకపోయినా, చాలా సంవత్సరాలు జీవచ్ఛవంలా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ జీవించారు.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 2011లో రచయిత్రి పింకీ విరాని, అరుణ శాన్‌బాగ్ తరఫున సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెకు కారుణ్య మరణం (Euthanasia) ఇవ్వాలని కోర్టును కోరారు.

అయితే సుప్రీంకోర్టు అరుణ శాన్‌బాగ్‌కు కారుణ్య మరణాన్ని అనుమతించలేదు. అయినప్పటికీ ఈ కేసు భారతదేశంలో ఒక కీలక మలుపు గా నిలిచింది. ఈ తీర్పు ద్వారా కోర్టు కొన్ని కఠిన నిబంధనలతో పాసివ్ యూతనేషియా (Passive Euthanasia) ను అనుమతించింది.

అరుణ శాన్‌బాగ్ దాదాపు 42 సంవత్సరాలు ఆసుపత్రిలోనే జీవించారు. చివరకు 2015లో ఆమె మరణించారు.

ఈ కేసు భారతదేశంలో కారుణ్య మరణంపై చట్టపరమైన మార్పులకు దారితీసిన ఒక చారిత్రక కేసు గా గుర్తింపు పొందింది.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

సంగీతం – మనసును తాకే శక్తి

 ఒకరోజు సాయంత్రం. ఇంటి ముందున్న ఆరుబయట చల్లని గాలిలో తాతయ్య, మనవడు ఇద్దరు కూర్చుని సరదాగా ముచ్చటించుకుంటున్నారు. ఆకాశం నారింజ రంగులో మెరుస్తోంది. పక్షులు గూటికి తిరిగి వెళ్తున్నాయి. ఆ నిశ్శబ్దంలో మనవడికి ఒక్కసారిగా ఒక ప్రశ్న వచ్చింది.


“తాతయ్య… మీరు దేనిని ఎక్కువగా ఇష్టపడతారు?” అని అమాయకంగా అడిగాడు.

తాతయ్య చిరునవ్వు చిందిస్తూ,
“మనవడా… నాకు సంగీతం చాలా ఇష్టం” అని సమాధానం చెప్పాడు.

మనవడికి మాత్రం ఆ మాట పూర్తిగా అర్థం కాలేదు. కొద్దిసేపు ఆలోచించి మళ్లీ అడిగాడు.

“తాతయ్య… సంగీతాన్ని ఎందుకు అంతగా ఇష్టపడతారు? సంగీతం వింటే ఏమవుతుంది?”

తాతయ్య కొద్దిసేపు ఆకాశం వైపు చూసి మెల్లగా అన్నాడు:
“మనవడా… సంగీతానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అది మనిషిని భూమి నుండి స్వర్గానికి తీసుకెళ్లగలదు, స్వర్గం నుండి మళ్లీ భూమికి తీసుకురాగలదు.”

మనవడు ఆశ్చర్యపోయాడు.
“అది ఎలా తాతయ్య? భూమి నుండి స్వర్గానికి ఎలా తీసుకెళ్తుంది?” అని మళ్లీ ప్రశ్నించాడు.

తాతయ్య నవ్వుతూ చెప్పాడు:
“ఒరేయ్ మనవడా… సంగీతం వింటుంటే మనసు ఎంత ఉల్లాసంగా మారుతుందో గమనించావా? మంచి పాట వింటే మనం కూడా ఆ పాటలోని పాత్రలతో కలిసి జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. బాధతో కూడిన పాట వింటే మనకూ బాధ కలుగుతుంది. సంతోషకరమైన పాట వింటే మన హృదయం కూడా ఆనందంతో నిండిపోతుంది. అంటే సంగీతం మన భావాలను మార్చగలదు. అందుకే నేను అది స్వర్గానికి తీసుకెళ్తుందని చెప్పాను.”

మనవడు ఆసక్తిగా వింటూ తల ఊపాడు.
ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగాడు. తాతయ్య ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పాడు.

చివరికి మనవడు మరో ప్రశ్న వేసాడు.

“తాతయ్య… ఈ శక్తి సంగీతానికి మాత్రమే ఉందా? ఇంకేమైనా ఉందా?”

తాతయ్య కొద్దిసేపు ఆలోచించి నవ్వుతూ అన్నాడు:
“అవును మనవడా… ఇంకొకటి కూడా ఉంది.”

“ఏంటి తాతయ్య?” అని మనవడు ఆసక్తిగా అడిగాడు.

“అదే రా బాబు… బడి గంట!”

మనవడు ఆశ్చర్యపోయాడు.
“బడి గంటకా? దానికి ఏ శక్తి ఉంటుంది తాతయ్య?”

తాతయ్య నవ్వుతూ చెప్పాడు:
“నువ్వు పొద్దున్నే స్కూల్‌కి వెళ్లినప్పుడు బడి గంట మోగితే నీకు కొంచెం బాధగా అనిపిస్తుంది కదా? క్లాస్ మొదలవుతుందని. కానీ అదే గంట సాయంత్రం మోగితే ఎంత సంతోషంగా అనిపిస్తుంది! ఇంటికి వెళ్లొచ్చని.”

“అదే శబ్దం… కానీ మన భావాలు మాత్రం మారిపోతాయి. మన పరిస్థితి బట్టి మనసు స్పందిస్తుంది. సంగీతం కూడా అలాగే మన భావాలను తాకుతుంది.”

మనవడు కాసేపు ఆలోచించి చిరునవ్వుతో అన్నాడు:
“ఓహ్… అలానా తాతయ్య”!

తాతయ్య తల నిమిరి,
“అవును మనవడా… ఈ ప్రపంచంలో కొన్ని శబ్దాలు మనసును నడిపిస్తాయి. సంగీతం వాటిలో మొదటిది” అని ప్రేమగా చెప్పాడు.

ఆ సాయంత్రం గాలి మధ్య తాతయ్య చెప్పిన ఆ మాటలు మనవడి మనసులో మధురమైన సంగీతంలా మిగిలిపోయాయి.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

విశ్రాంతి వయస్సులో విజ్ఞాన యాత్ర:

 విశ్రాంతి వయస్సులో విజ్ఞాన యాత్ర: 


చాలా మంది అమ్మమ్మలు, నాన్నమ్మలకు చదువు లేకపోయినా, వారి హృదయం మాత్రం జ్ఞానం తో నిండి ఉంటుంది. చిన్ననాటి రోజుల్లో చదువుకోకపోయినా బాధను వారు జీవితాంతం మోస్తూనే ఉంటారు. ఆ బాధే వారికి చదువు విలువను బాగా అర్థం చేసుకునేలా చేస్తుంది.

సాయంత్రం పిల్లలు చుట్టూ చేరగానే, అమ్మమ్మ వారిని దగ్గరకు తీసుకుని ప్రేమగా తల నిమురుతుంది. తన కష్టాల కథను మృదువుగా చెప్పి, చివరగా “నాన్నా, నేను చదువుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాను. మీరు మాత్రం బాగా చదువుకోండి” అని హృదయపూర్వకంగా చెబుతుంది. ఆ మాటల్లో పుస్తకాల జ్ఞానం లేకపోయినా, అనుభవాల జ్ఞానం  ఉంటుంది. చదువు లేకపోయినా, వారి మాటలే పిల్లలకు జీవిత పాఠాలుగా మారుతాయి.

తమకు దక్కని చదువు పిల్లలకు అయినా అందించాలనుకునే వారి ఆశయం ఎంతో గొప్పది. అలాంటి అమ్మమ్మలకు చదువుకునేందుకు ఒక పాఠశాల ఉంటే, వారు అక్షరాలు నేర్చుకొని తమ పేరును తామే రాయగలిగితే ఎంత ఆనందపడతారు! చదవడం రాయడం నేర్చుకోవడం వారికి కొత్త ఆశ, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

అలాంటి అమ్మమ్మల కోసం ఒక పాఠశాల ఉంటే ఎంత బాగుండేదో అనిపించక మానదు. నిజానికి, అలాంటి ఒక ప్రత్యేక పాఠశాల మహారాష్ట్రలోని థానే జిల్లాలో, ముర్బాద్ పరిధిలోని ఫంగానే గ్రామంలో ఉంది. అది ఆజిబైచి శాల అని పిలవబడుతుంది. కానీ ఈ పాఠశాల గురించి అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.

ముందుగా మనం ఆజిబైచి అంటే ఏమిటో తెలుసుకుందాం.
ఆజీబాయి అంటే మరాఠీలో "అమ్మమ్మ" అని అర్థం.
“చి” అంటే మరాఠీ భాషలో "సంబంధించింది" అని అర్థం.
అందువలన, ఆజిబైచి శాల అంటే అమ్మమ్మల పాఠశాల అని అర్థం.

2016 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయుడు యోగేంద్ర బంగార్ గారి కృషితో అమ్మమ్మల పాఠశాల ప్రారంభించబడింది. ‘యోగేంద్ర బంగార్ గారికి ఈ పాఠశాల ప్రారంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది?’ అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో కలగడం సహజమే. ఈ పాఠశాల ప్రారంభం 2016 లో కొంత వినూత్నంగా, ఆసక్తికరంగా జరిగింది.

ఒకరోజు వారి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గాథను గానం చేశారు. పాటలోని వీరగాథను అవ్వలు ఆసక్తిగా విన్నా, చదువు లేని కారణంగా ఆ కథ యొక్క లోతు వారికి పూర్తిగా అర్థం కాలేదు. కార్యక్రమం ముగిసిన తర్వాత అవ్వలు గ్రామ ఉపాధ్యాయుడైన యోగేంద్ర బంగార్ గారి వద్దకు వెళ్లి, ‘మేం కూడా చదువుకుని ఉంటే ఈ కథను ఎంత బాగా ఆస్వాదించేవాళ్లమో’ అంటూ తమ జీవితంలో మిగిలిపోయిన బాధను ఆయనతో పంచుకున్నారు.

వారి మాటలు యోగేంద్ర బంగార్ గారి మనసును గాఢంగా కదిలించాయి. ఈ సంఘటనతో ‘వారికీ ఒక పాఠశాల ఉంటే ఎంత బాగుంటుంది’ అనే ఆలోచన ఆయనలో పుట్టింది. స్కూల్ ఏర్పాటు ద్వారా అవ్వలు ఒంటరితనం, అవగాహన లోపం నుండి బయటకు రావచ్చు అని ఆయన భావించి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు, 2016 మార్చి 8న అమ్మమ్మల పాఠశాలను ప్రారంభించారు.

పెద్దవాళ్లు నిత్యం ఇంటి పనులతో బిజీగా ఉంటారు కదా మరి పాఠశాలకు వెళ్లి చదువుకునేంత టైం ఎక్కడ ఉంటుందని అనుకుంటున్నారా? వారి పనులన్నీ అయ్యాక మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్కూల్ కు వెళ్లి చదువుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆ సమయం పెద్దవాళ్లు ఇంటి పనులన్నీ ముగించి విశ్రాంతి తీసుకునే సమయం. ఆ సమయాన్ని వారు చదువు నేర్చుకోవడానికి ఉపయోగించడం నిజంగా అభినందించదగిన విషయం. ఈ పాఠశాలలో వారు మరాఠీ అక్షరమాల, తమ పేర్లు రాయడం, తేలికైన లెక్కలు, చదువు మాత్రమే కాకుండా ఆర్ట్స్, క్రాఫ్ట్స్ లను కూడా నేర్చుకుంటారు. అదేవిధంగా, పెద్దవాళ్లకు ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలు కూడా ఈ పాఠశాలలో నేర్పుతారు. ఈ పాఠశాలలో చేరాలంటే వయస్సుతో సంబంధం లేదు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా రావొచ్చు.

ప్రతి ఊరిలో వృద్ధాశ్రమాల బదులు ఇలాంటి స్కూల్స్ ఏర్పాటు చేస్తే వృద్ధులకు ఒంటరితనం నుండి ఉపశమనం పొందడమే కాకుండా విద్యావంతులవడం వలన వారికి సమాజం పట్ల, ఆరోగ్యం పట్ల మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా వారికి మొబైల్ వాడకం, ఇంటర్నెట్ వాడకం వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం లభించడం వల్ల ఒంటరితనం నుంచి పూర్తిగా సేద తీరుతారు. “ఆజిబైచి శాల” పాఠశాల వృద్ధ మహిళలకు విద్యా అవకాశాలు అందించడం ద్వారా, వారి జీవితాలలో స్ఫూర్తిని నింపి సంతృప్తిని కలిగిస్తోంది. ఇది సమాజంలో సమానత్వం, మహిళా సాధికారతకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే ప్రతి గ్రామంలో వృద్ధాశ్రమాల బదులు వృద్ధుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ప్రతి ఊరూ పూనుకుని ఇలాంటి స్కూల్ ఏర్పాటు చేస్తే నిరక్షరాస్యత సమస్య సమసి పోవడం మాత్రమే కాదు వృద్ధుల మనోవికాసంతో పాటు వారికి కొత్త జవసత్వాలను ఇచ్చి వారిలో ఉదాసీనత పోగొడుతుంది అంటాడు స్కూల్ వ్యవస్థాపకుడు యోగేంద్ర బంగార్.  


వ్యాసకర్త 
కోట దామోదర్ 
మొబైల్ : 9391480475

అవరోధాలపై విజయం: డాక్టర్ వి. ఎస్. ప్రియా జీవగాథ

 అవరోధాలపై విజయం: డాక్టర్ వి. ఎస్. ప్రియా జీవగాథ” 

ట్రాన్స్‌జెండర్‌గా బ్రతకడం అంటే పోరాటమే కాదు, అసాధారణ విషయం అస్సలే కాదు. ప్రతి మనిషిలాగే వారు కూడా భావాలు, ఆశలు, కలలు కలిగిన సాధారణ మనుషులే. కానీ మన సమాజం వారిని మరో కోణంలో చూడడం వల్ల, వారి జీవితం సవాలక్ష సవాళ్లతో నిండిపోతుంది. వారిని అర్థం చేసుకోవడం కన్నా విమర్శించడం, అంగీకరించడం కన్నా దూరంగా ఉంచడం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దృక్పథం మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమస్య వారిలో లేదు, వారిని చూసే మన దృష్టిలో ఉంది.

 చిన్ననాటి నుంచే వారు ఎన్నో అవమానాలు, నిరాకరణలు ఎదుర్కొంటారు. కుటుంబం నుంచి ప్రారంభమయ్యే ఈ నిరాకరణ, బయట ప్రపంచంలో మరింత పెరుగుతుంది. సాధారణ వ్యక్తులకు అందినట్లుగా విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలు కూడా వారికి సులభంగా అందవు. అయినప్పటికీ, వారు తమ జీవితాన్ని గౌరవంగా, ధైర్యంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల జీవితం అనేది సాధారణంగా సవాళ్లతో నిండిన ప్రయాణం. కానీ ఆ సవాళ్లను ఎదుర్కొంటూ విజయం సాధించిన వ్యక్తులు సమాజానికి నిజమైన స్ఫూర్తి. అలాంటి వారిలో ఒకరు డాక్టర్. వి. ఎస్. ప్రియ.

డాక్టర్. వి. ఎస్. ప్రియ గారి జీవిత కథ ధైర్యం, ఆత్మవిశ్వాసం, మరియు పట్టుదల ఒక అద్భుత ఉదాహరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సమాజంలో ఎన్నో అవరోధాలు, అపోహలు, విమర్శలు ఎదురైనా, ఆమె తన లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది.

చిన్ననాటి నుంచే తన వ్యక్తిత్వాన్ని అంగీకరించుకోవడం ఎంత కష్టం అనేది ఆమె ప్రయాణం చెబుతుంది. కుటుంబం, సమాజం నుండి వచ్చిన ఒత్తిడులను తట్టుకుని, తన స్వప్నాన్ని సాధించాలనే పట్టుదలతో విద్యను కొనసాగించడం ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తుంది.

ఆమె కేవలం డాక్టర్‌గా ఎదగడం మాత్రమే కాదు, ట్రాన్స్‌జెండర్ సమాజానికి ఒక ఆశాకిరణంగా నిలిచారు. “దృఢ సంకల్పం" ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చు అనే సందేశాన్ని ఆమె జీవితం స్పష్టంగా చెబుతోంది.

సమాజంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై ఇంకా ఎన్నో అపోహలు ఉన్నాయి. చాలా మంది వారికి అవకాశాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తారు. కానీ డాక్టర్ ప్రియా గారు ఆ అవరోధాల అన్నిటినీ ఛేదించి, అవకాశాలుగా మలచుకొని, నేడు ఒక వైద్యురాలిగా సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆమె విజయం కేవలం ట్రాన్స్‌జెండర్ గా గెలుపు మాత్రమే కాదు, సమాజం మార్పు దిశగా తీసుకున్న ఒక పెద్ద అడుగు.

కేరళ రాష్ట్రంలో జన్మించిన డాక్టర్. వి. ఎస్. ప్రియ గారు చిన్ననాటి నుంచే తనను మహిళగా భావించేవారు. అయితే సమాజం, కుటుంబం, మరియు పరిసరాల ఒత్తిడి కారణంగా ఆ భావనను బయట పెట్టడం ఆమెకు చాలా కష్టంగా మారింది.

కాలక్రమేణా ఆమె తన నిజమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని, తనకు నచ్చిన దిశలో జీవించాలని ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రారంభంలో కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించకపోయినా, ఆమె పట్టుదల, ధైర్యం చూసి తర్వాత అంగీకరించారు.

ఆమె విద్యా ప్రయాణం సవాళ్లతో నిండినదే. లింగ గుర్తింపు కారణంగా పాఠశాల దశలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, వాటిని లెక్కచేయకుండా తన లక్ష్యంపై దృష్టి సారించారు. వైద్యరంగంపై ఆసక్తితో ఆమె ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసించారు.

ప్రస్తుతం ఆమె త్రిసూర్ ప్రాంతంలో ఆయుర్వేద వైద్యురాలిగా సేవలు అందిస్తూ, తన జీవితం ద్వారా అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఆమె జీవితం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది. మన స్వప్నాలు నిజం కావడానికి జెండర్‌తో ఎలాంటి సంబంధం లేదు. మనం ఎంత కష్టపడతామో, ఎంత పట్టుదలతో ముందుకు సాగుతామో అదే ముఖ్యం. లింగ భేదం, సామాజిక అడ్డంకులు ఇవన్నీ మన లక్ష్యాలను ఆపలేవు.

మనలో నమ్మకం ఉంటే, ఏదైనా సాధించగలం. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మనలోని అసలైన శక్తి బయటపడుతుంది. ప్రతి అడ్డంకి మనకు ఒక కొత్త పాఠం నేర్పుతుంది, ప్రతి కష్టం మనల్ని లక్ష్యానికి మరింత దగ్గర చేస్తుంది.

సమాజంలో ట్రాన్సజెండర్స్‌పై వివక్ష లేకుండా ఉండాలంటే మార్పు విద్యాసంస్థల నుంచే ప్రారంభం కావాలి. స్కూల్స్, కాలేజీల్లో వారిపై ఎలాంటి వివక్ష లేకుండా, సమానంగా చూడడం అత్యంత ముఖ్యం. చిన్న వయసులోనే విద్యార్థులకు సమానత్వం, గౌరవం అనే విలువలు నేర్పితే భవిష్యత్తులో మంచి సమాజం ఏర్పడుతుంది.

అదే విధంగా, ఉద్యోగాల్లో కూడా ట్రాన్సజెండర్స్‌కు సమాన అవకాశాలు కల్పించాలి. వారి ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తే, వారు కూడా సమాజంలో స్వాభిమానంతో నిలబడగలరు.

ఇందుకోసం పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు. చిన్న మార్పులే పెద్ద ఫలితాలు ఇస్తాయి. ఒక మంచి మాట, ఒక గౌరవం, ఒక అవకాశం. ఇవే వారి జీవితాన్ని మార్చగలవు.

మనం ఒక్కొక్కరం మారితేనే సమాజం మొత్తం మారుతుంది.

ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన సంకల్పం దృఢంగా ఉంటే విజయం మనదే అవుతుంది.

యువతకు డాక్టర్ ప్రియా గారి జీవితం ఒక గొప్ప ప్రేరణ. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిత్వాన్ని గౌరవించుకోవాలి, ఇతరులను కూడా అంగీకరించాలి. అప్పుడు మాత్రమే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది.


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్: 9391480475

వైకల్యాన్ని జయించిన విలువిద్య క్రీడాకారిణి

 వైకల్యాన్ని జయించిన విలువిద్య క్రీడాకారిణి 


ఆర్చరీ లేదా విలువిద్యలో రాణించాలంటే శారీరక సమతుల్యత, కచ్చితమైన ప్రణాళిక, సాధించాలనే పట్టుదల ఇవన్నీ తప్పనిసరి. ముఖ్యంగా చేతులు లేని వారు ఈ క్రీడలో రాణించడం అసాధ్యం అనిపించడం సహజం. కానీ అలాంటి అసాధ్యాన్ని సైతం సుసాధ్యంగా మార్చిన స్ఫూర్తిదాయకమైన యువ క్రీడాకారిణి జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శీతల్ దేవి.

రెండు చేతులు లేకపోయినా, మొక్కవోని పట్టుదలతో ఆమె తన కాళ్లతో, భుజాల సహాయంతో విల్లు ఎక్కించి బాణాలు సంధించడం నేర్చుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సంకల్పబలం ఎంత శక్తివంతమైనదో అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం శీతల్ దేవి జీవన గాధ.

వైకల్యం ఒక అవరోధం అయినప్పటికీ, ఆ అవరోధాన్నే ఆమె అవకాశంగా మార్చుకుంది. అదే అవరోధం ఆమెకు ప్రేరణగా మారింది. తన శారీరక పరిస్థితిని ఒక దుర్బలంగా  భావించకుండా, తన లక్ష్యాన్ని చేరుకునే ఉద్దేశంతో ఆమె దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. గతేడాది దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూలో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన శీతల్ దేవి “చేతులు లేని” ఏకైక మహిళా ఆర్చర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తన అద్భుత ప్రతిభతో అంతర్జాతీయ పారా క్రీడల్లో సత్తా చాటి, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

రెండు చేతులు లేకపోయినప్పటికీ, తన కాలి వేళ్లు మరియు భుజం సాయంతో విల్లును లక్ష్య బిందువుపై ఎక్కుపెట్టే ఆమె ప్రతిభను చూసి ప్రేక్షకులు తమ కనురెప్పలు వేయడం కూడా మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు. ఆమె క్రీడా నైపుణ్యం మరియు సంకల్పబలం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె ఆటను ప్రత్యక్షంగా చూడటానికి ప్రాంగణానికి తరలి వచ్చే అభిమానులు కోకొల్లలు. ఆమె వదిలే ప్రతి బాణం లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, ప్రేక్షకుల హృదయాలనూ తాకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ అద్భుత ప్రతిభతోనే అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధిస్తున్న శీతల్ దేవి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో వార్షిక అవార్డులలో ఆమెను “పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్” అవార్డుకు ఎంపిక చేస్తూ ప్రపంచ ఆర్చరీ సంస్థ గౌరవించింది.

ప్రపంచ క్రీడా రంగంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రేరణాత్మక వ్యక్తుల్లో ప్రముఖుడు 'మాట్ స్టట్జ్మాన్' ఒకరు. ఆయనను “Armless Archer” అని కూడా పిలుస్తుంటారు. చేతులు లేకపోయినా, తన కాళ్ల సహాయంతో విల్లు పట్టి బాణం సంధిస్తూ ప్రపంచస్థాయిలో అద్భుత ప్రతిభను ప్రదర్శించారు ఆయన. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించి, ప్రపంచం గర్వించదగిన విలుకాడిగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.

అలాగే మహిళా విభాగంలో శీతల్ దేవీ ఒక గర్వించదగిన క్రీడాకారిణిగా ఆవిర్భవించారు. ఆమె చిన్న వయసులోనే విలువిద్యలో చేరి, కఠిన సాధనతో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. ఆమె విజయాలు భారతదేశానికి గర్వకారణంగా నిలవడమే కాకుండా, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తన దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన గొప్ప విలువిద్యా క్రీడాకారిణిగా నిలిచింది.

'మాట్ స్టట్జ్మాన్' మరియు 'శీతల్ దేవీ' వంటి మహోన్నత క్రీడాకారుల జీవితాలు ప్రతి ఒక్కరికి గొప్ప స్ఫూర్తినిస్తాయి. వీరిద్దరూ శారీరక వైకల్యం ఉన్నప్పటికీ, దానిని ఒక ప్రతిబంధకంగా భావించకుండా ఒక సవాలుగా తీసుకుని తమ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పారు. వారి విజయాలు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. మనిషికి శారీరక పరిమితులు ఉన్నా, మనస్సుకు మాత్రం పరిమితులు ఉండకూడదు.

వారి జీవితాలను పరిశీలిస్తే, దృఢ సంకల్పం, కష్టపడే స్వభావం, పట్టుదల, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు ఎంత ముఖ్యమో తెలుస్తుంది. వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వెనుదిరగకుండా, నిరంతరం సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి విజయాన్ని సాధించాలంటే కష్టపడటం తప్పనిసరి అనే సూచననిస్తుంది.

అలాగే, సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం కూడా వీరి నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తమ వైకల్యాన్ని బలహీనతగా భావించకుండా, అదే తమ ప్రత్యేకతగా మార్చుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. విజయం ఒక్కరోజులో రాదు. నిరంతర సాధన, కృషి ఉంటేనే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు అనే అక్షర సత్యాన్ని వారి జీవితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

కాబట్టి ప్రతి విద్యార్థి వీరి జీవితాల నుండి స్ఫూర్తి పొందుతూ, ఏ పరిస్థితులైనా ఎదుర్కొని, తమ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి ఘన విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను.
 
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

నేతన్నలపై ప్రభుత్వం ఎందుకు పగబట్టింది?

 నేతన్నలపై ప్రభుత్వం ఎందుకు పగబట్టింది?


ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా మారి వారి జీవనాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రూ.105.54 కోట్ల ఆర్డర్‌ను రద్దు చేయడం చేనేత వర్గాల్లో తీవ్ర నిరాశను కలిగించింది. అంతేకాకుండా సంక్షేమ శాఖలు రూ.200 కోట్ల విలువైన దుస్తులు, దుప్పట్ల తయారీకి ఇప్పటివరకు ఆర్డర్లు ఇవ్వకపోవడం ఇటు టెస్కో, అటు చేనేత కార్మికులను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తోంది. ఒకవైపు నేతన్న అప్పులబాధతో సతమతమవుతుండగా, ఈ నిర్ణయాలు “పుండుమీద కారం చల్లినట్లు” వారి బాధను మరింతగా పెంచుతున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ నిర్ణయం వల్ల ఎన్నో చేనేత కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ‘కంచంలోని కూడును లాక్కున్నట్లుగా’ ఉంది. ఆర్డర్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించాల్సిన ప్రభుత్వమే చేతికందిన పనిని లాక్కుంటే చేనేత కార్మికుల పరిస్థితి ఏంటి?  

అయితే, ఇలాంటి సంక్షోభాలే చేనేత వర్గం సహనాన్ని, పోరాటస్ఫూర్తిని పరీక్షించే సందర్భాలు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, చేనేత కార్మికులు ఎప్పుడూ వెనుదిరగలేదు. ప్రభుత్వం గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్య్రం రాకముందు చేనేత రంగం దేశానికి వెన్నుముకగా పనిచేసిందన్న విషయాన్ని విస్మరించడం సమంజసం కాదు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం జరిగిన ఉద్యమంలో కూడా చేనేత వర్గం ఎనలేని సేవలు అందించింది. స్వరాష్ట్రం కోసం చేనేత కార్మికులు ప్రాణత్యాగాలు చేశారన్న విషయం ప్రభుత్వం మరిచిందేమో గానీ, ప్రజలు మాత్రం ఎప్పటికీ మరిచిపోలేరు.

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత కీలక పాత్ర పోషించింది. విదేశీ వస్త్రాల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పుడు, దేశవ్యాప్తంగా చేనేత ఉద్యమం ఉవ్వెత్తున ఒక జ్వాలలా వ్యాపించింది. మహత్మా గాంధీ ఇచ్చిన స్వదేశీ పిలుపుతో ప్రతి ఇంట్లో చరఖా తిరిగింది. ఖాదీ కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అని మహాత్మా గాంధీ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. చేనేత రంగం ద్వారా దేశం ఆర్థికంగా బలపడటమే కాకుండా, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన ప్రతిఘటనగా మారిందన్న విషయం ప్రభుత్వం విస్మరించింది.

ఏళ్లు గడిచినా మహాత్ముడి ఆకాంక్షలు నెరవేరకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. చేనేత కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పరిశీలిస్తే, కొత్త హామీలు గురించి పక్కన పెడితే, ఉన్నవే క్రమంగా కనుమరుగవుతున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

ఇచ్చిన హామీలను ఒకసారి గమనిస్తే—

1. స్కూల్ యూనిఫార్మ్స్, దుప్పట్లు, ఇతర ప్రభుత్వ అవసరాలకు చేనేత వస్త్రాల వినియోగం పెంచుతూ ప్రభుత్వ ఆర్డర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
2. “నేతన్నకు చేయూత” వంటి పథకాల ద్వారా నేరుగా నగదు సహాయం అందించి, కార్మికుల ఆదాయం పెంచుతామని చెప్పారు.
3. ముడి సరుకులైన నూలు, రంగులను తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇచ్చారు.
4. తక్కువ వడ్డీ రుణాలు, అప్పుల భారం తగ్గించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
5. చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ కల్పించి, ఆన్‌లైన్ అమ్మకాలకు సహాయం చేస్తామని ప్రకటించారు.

అయితే, ఈ హామీల్లో నిజంగా ఎన్ని అమలయ్యాయి అన్నది ప్రతి నేత కార్మికుడికి బాగా తెలుసు. హామీలు కాగితాలకే పరిమితం తప్ప అమలుకు నోచుకోకపోవడం చేనేత వర్గంలో నిరాశను మరింతగా పెంచింది.

ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు ప్రజల్లో ఆశలను రగిలిస్తాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత అవి అమలు కావు, ఆవిరి అయిపోతాయి. హామీల అమలు అనే అంశం నేటి రాజకీయాల్లో ఒక చేదు వాస్తవంగా మారింది. “చెప్పేది ఒకటి, చేసేది మరోటి” అన్న భావన ప్రజల్లో బలపడుతోంది.

ఈమధ్య కాలంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా పెద్ద పెద్ద హామీలు ఇస్తారు. కానీ అవి అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికలు చేపట్టకపోవడం ఫలితంగా హామీలు కాగితాలపైనే మిగిలిపోతాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు అనేక రంగాల్లో ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పి, ఇచ్చిన హామీల అమలును వాయిదా వేస్తున్నాయి. కానీ ఇదే సమయంలో ఇతర ప్రాధాన్యాలపై ఖర్చులు కొనసాగుతుండడం ప్రజల్లో సందేహాలు కలిగిస్తుంది. హామీల అమలుపై సరైన మానిటరింగ్ లేకపోవడం బాధ్యతా లోపం అని చెప్పక తప్పదు. ఎవరు బాధ్యత వహించాలన్న స్పష్టత లేకపోవడం వల్ల అవి క్రమంగా మరుగున పడుతున్నాయి. ఎన్నికల తర్వాత నాయకులపై ఉన్న ఒత్తిడి తగ్గిపోవడంతో, హామీల ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుంది.
హామీలు ఇవ్వడం సులభం, కానీ వాటిని అమలు చేయడం నిజమైన నాయకత్వం. నేటి రాజకీయాల్లో మాటలకు మించి కార్యాచరణకు ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉంది.

ఊకదంపుడు ఉపన్యాసాలతో నోటికొచ్చిన హామీలు ఇస్తూ, నేత కార్మికులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారనే భావన బలపడుతోంది. చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన కృషి కనిపించకపోవడం ఆవేదనకరమైన విషయం. "దయలేని అత్తకి దండం పెట్టినా తప్పే" అన్నట్లు  దయలేని ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా ఏమి లాభం, చేనేత కార్మికుడికి కన్నీరే తప్ప!  

ఇకనైనా నేత కార్మికుల కష్టాన్ని గుర్తించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వారికి సరైన న్యాయం అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

7, మార్చి 2026, శనివారం

ప్రేమికుల మధ్య ప్రేమ వైఫై తరంగాల్లాంటిది…

 ప్రేమికుల మధ్య ప్రేమ

వైఫై తరంగాల్లాంటిది…


కనబడదు… కానీ

మనసులు దగ్గరైతే మాత్రమే కనెక్ట్ అవుతుంది.


పాస్‌వర్డ్ మాటల్లో ఉండదు,

మనసుల్లో దాగి ఉంటుంది.


మనసుకు నచ్చితేనే

ఆ సంకేతం పట్టుకుని

రెండు హృదయాలు కనెక్ట్ అవుతాయి.


లేకపోతే…

ఎంత దగ్గరగా ఉన్నా

సిగ్నల్ లేని ఫోన్‌లా

నిశ్శబ్దంగా మిగిలిపోతుంది ప్రేమ. 



✍️

కోట దామోదర్ 

మొబైల్ 9391480475

మనిషి ఆశ సముద్రం అలల్లాంటిది

 మనిషి ఆశ సముద్రం అలల్లాంటిది


సముద్రం అలలాగే

ముందుకు దూసుకొచ్చి

తీరాన్ని ముద్దాడి

మళ్లీ నిశ్శబ్దంగా వెనక్కు వెళ్లిపోతాయి…

మనిషి కలలు కూడా అంతే.

ఉప్పెనల ఆశలతో

గుండెలో ఎగసిపడతాయి,

ఆకాశాన్ని అందుకోవాలనే

అవకాశాల వైపు పరుగెడతాయి.


కొన్నిసార్లు

తీరాన్ని తాకే అలలా

నిజాల్ని తాకుతాయి,

కొన్నిసార్లు

ఇసుకలో కలిసిపోయే జలధారలా

స్మృతులై మిగిలిపోతాయి.

అయితే సముద్రం

అలలు ఆపదు…

మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి.

అలాగే మనసు కూడా

కలలు ఆపదు…

ఒకటి వెనక్కు వెళ్లినా

మరొకటి ముందుకు వస్తూనే ఉంటుంది.

ఎందుకంటే

జీవితం అనేది సముద్రం అయితే

మన ఆశలే ఆ అలలు.


✍️

కోట దామోదర్ 

మొబైల్ 9391480475

మనిషి–మృత్యువు మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ – The Book Thief

 మనిషి–మృత్యువు మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ – The Book Thief


మనతో ఏదీ శాశ్వతంగా వెంట రాకపోయినా, నిశ్శబ్దంగా అడుగులు కలిపేది మృత్యువే. సాధారణంగా మృత్యువును భయపెట్టే శత్రువుగా ఊహిస్తాం. కానీ నిజానికి అది మన అహంకారాన్ని కరిగించి, మనిషిని మనిషిగా మిగిల్చే ఒక సత్యం. అందుకే మహాత్మ గాంధీ “మృత్యువు మనల్ని నమ్ముకుని ఎప్పుడూ వెంట ఉండే ప్రేయసి” అని అన్నారు. మృత్యువు మనకు శత్రువు కాదు; మన జీవితమంతా మన పక్కనే నడుస్తూ, చివరికి చేయి పట్టుకుని తీసుకెళ్లే ఏకైక నిజమైన తోడు.

ఈ తాత్విక దృష్టికోణాన్ని సాహిత్య రూపంలో అద్భుతంగా ఆవిష్కరించిన నవల ఆంగ్ల రచయిత మార్కస్ జుసాక్ రచించిన The Book Thief. ఈ నవల ప్రత్యేకత ఏమిటంటే మృత్యువునే కథ కారుడిగా ఎంచుకోవడం. అందువల్ల ఇది సాధారణ మానవ దృష్టితో చెప్పబడిన కథ కాదు; మృత్యువు దృష్టితో చెప్పిన కథ.

ఇది బాల సాహిత్యంగా పరిగణింపబడిన The Book Thief అసలు అర్థం మానవత్వ సాహిత్యం. ఈ కథ పుస్తకాలు దొంగిలించే పన్నెండేళ్ల అమ్మాయి లీసెల్ మెమింగర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. యుద్ధం మధ్యలో పెరిగిన ఒక చిన్నారి కళ్లతో ప్రపంచాన్ని చూడమని మనల్ని బలవంతం చేస్తుంది ఈ నవల.

సిరియాలో జరిగిన అంతర్యుద్ధం ప్రతిరోజూ జరిగే బాంబు దాడులు, వాటిలో ప్రాణాలు కోల్పోతున్న వందల మంది చిన్నారులు, కళ్ల ముందే ఒక కొత్త తరాన్ని కోల్పోతున్నా. యుద్ధాల్లో అసలైన బాధితులు సైనికులు కాదు, పిల్లలే. రోజురోజుకు పెరుగుతున్న చిన్నారుల మరణాలు, దేశం విడిచి పారిపోతున్న పిల్లలు, భవిష్యత్తేంటో తెలియని పరిస్థితుల్లో ఈ యుద్ధం ఎంత అమానుషమో స్పష్టంగా ఈ నవల బోధిస్తుంది.

ఇలాంటి బీభత్సం మధ్య, తన వాళ్లను కోల్పోయి, హింసను చూస్తూ, అయినా మానవత్వాన్ని మర్చిపోని మనుషుల్ని గమనిస్తూ పెరిగిన పిల్లగా లీసెల్ నిలుస్తుంది. అందుకే ఆమె కేవలం కల్పిత పాత్ర కాదు; యుద్ధాల్లో నలిగిపోయిన ప్రపంచంలోని లక్షలాది పిల్లలకి ఒక ప్రామాణిక ప్రతినిధి.

అందుకే The Book Thief కేవలం ఒక బాలల నవల కాదు. అది యుద్ధం పిల్లలపై మోపిన మౌనమైన, అత్యంత ఘోరమైన అభియోగ పత్రం.

లీసెల్ కథలో ఇదొక పెద్ద మలుపు. తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడం, తల్లి కమ్యూనిస్ట్ నేపథ్యం కారణంగా పిల్లలను తన దగ్గర ఉంచుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో లీసెల్‌-తమ్ముడిని పేదవాళ్ల బస్తీలో నివసించే హాన్స్ హబ్బర్‌మాన్  ఫాస్టర్ దంపతులకు అప్పగించేందుకు తల్లి బయలుదేరుతుంది.

ఆ ప్రయాణంలో విధి మరో దెబ్బ కొడుతుంది. నిమోనియా తో లీసెల్ తమ్ముడు శ్వాస ఆగి, మార్గమధ్యంలోనే ప్రాణాలు విడుస్తాడు. పిల్లలను అప్పగించేందుకు వచ్చిన తల్లి, ఏదోలా చిన్నారిని సమాధి చేసి, లీసెల్ చేయి పట్టుకుని ఊర్లో అడుగుపెడుతుంది.

తమ్ముడిని కోల్పోయిన దుఃఖం అంటే ఏమిటో ఇంకా పూర్తిగా అర్థం కాని వయసులోనే, శ్మశానంలో తన తమ్ముడిని మట్టిలో పాతిపెడుతున్న దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తుంది లీసెల్. అదే సమయంలో, తడి మట్టిలో పడివున్న ఒక పుస్తకం ఆమె కంటపడుతుంది. ఏ ఆలోచన లేకుండా, చటుక్కున దాన్ని తన స్కర్టులో దాచేసుకుంటుంది.
బహుశా… తమ్ముడి జ్ఞాపకంగా.

అదే లీసెల్ చేసిన మొదటి దొంగతనం.
అదీ మృత్యువును చూసిన తొలి దొంగతనం.
అందుకే మృత్యువు ఆమెను “పుస్తకాల దొంగ”గా పిలుస్తూ ఉంటుంది.

ఆ పుస్తకం పేరు “A Grave Diggers’ Handbook.”

కొడుకును కోల్పోయిన అగాధమైన దుఃఖం, కూతురిని వేరే ఇంట్లో వదిలి వెళ్లాల్సిన బాధ ఇవన్నీ గుండెల్లో దాచుకుని, ముఖం మీద ధైర్యం ధరించి కర్తవ్య బాట పట్టిన ఆ తల్లిని చూసి మృత్యువు కూడా క్షణం ఆగిపోతుంది.

కథ చివర్లో, మృత్యువూ - లీసెల్ మళ్లీ కలుస్తారు. ఈ సంగతులన్నింటినీ నెమరువేసుకున్నారు.
అది ఒక మైమరపించే, తాత్వికమైన క్షణం.

అప్పుడు లీసెల్ మృత్యువును అడుగుతుంది 
“అందరూ మృత్యుముఖంలో నిలిచినప్పుడు, జీవితం మొత్తం ఒకే క్షణంలో స్పష్టంగా కనిపిస్తుందంటారు… నీకవన్నీ గుర్తున్నాయా?”

ఇది చదివితే The Book Thief కేవలం కథ కాదు,
మనిషి–మృత్యువు మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ అనిపిస్తుంది.


వ్యాసకర్త 
కోట దామోదర్ 
మొబైల్: 9391480475

నేతన్నల బతుకుకు నష్టం – టెండర్ విధానం కష్టం

 “నేతన్నల బతుకుకు నష్టం – టెండర్ విధానం కష్టం”  

మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే పుట్టాయి. కానీ ఆ వస్త్రాల వెనుక దాగి ఉన్న వారి జీవిత కథ మాత్రం కష్టాల, కన్నీళ్ల కథగానే మిగిలిపోయింది. ప్రముఖ సినీ గేయ రచయిత నేతన్నల దుస్థితిని గుర్తుచేస్తూ చెప్పిన మాటలు నేటికీ సజీవంగా వినిపిస్తున్నాయి: “జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా – చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్లే నేసినారు.” ఈ ఒక్క వాక్యమే చేనేత కార్మికుల జీవన వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది.

తెలంగాణలో చేనేత పరిశ్రమ అనేది వేలాది కుటుంబాలకు జీవనాధారం. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ వృత్తి తరతరాలుగా కొనసాగుతోంది. తివాచీలు, బెడ్ షీట్లు, బెడ్డింగ్ మెటీరియల్స్ వంటి వస్త్రాలను తయారు చేసి ప్రభుత్వ అవసరాలకు సరఫరా చేస్తూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ వ్యవస్థలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) కీలక పాత్ర పోషిస్తూ చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పిస్తోంది.

వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో దాదాపు 10 వేల చేనేత కుటుంబాలు నేరుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీటికి అనుబంధంగా మరో 15 వేల కార్మిక కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. ఈ ప్రాంతాల్లో 60కి పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలు35కి పైగా మ్యాక్స్ సంఘాలు పనిచేస్తూ టెస్కోకు అవసరమైన కార్పెట్లు, బెడ్ షీట్లు, లివరీ వస్త్రాలను తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఆప్కో ద్వారా, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టెస్కో ద్వారా ప్రభుత్వ సంక్షేమ శాఖలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంజీపీటీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు మరియు ఇతర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు అవసరమైన వస్త్రాలను సరఫరా చేస్తూ ఈ వ్యవస్థ కొనసాగుతోంది.

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సంబంధిత శాఖలు తమ అవసరాలను టెస్కోకు తెలియజేస్తాయి. అనంతరం టెస్కో ఆర్డర్లను చేనేత సహకార సంఘాలకు కేటాయిస్తుంది. ఆ సంఘాలు తమ సభ్యులతో కలిసి వస్త్రాలను తయారు చేసి టెస్కోకు అందజేస్తాయి. ఈ విధానం ద్వారా వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు (GI) హక్కు పొందిన వరంగల్ చేనేత ఉత్పత్తులు నాణ్యతకు ప్రతీకగా నిలిచాయి.

ఇలాంటి పరిస్థితుల్లో టెస్కో సరఫరా వ్యవస్థలో టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం చేనేత కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ విధానం అమలులోకి వస్తే ప్రైవేట్ సంస్థలు రంగప్రవేశం చేసి వేలాది చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీయనున్నాయి. తరతరాలుగా నూలుపోగులు అల్లుతూ జీవిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా చేనేత రంగం తీవ్రంగా దెబ్బతింది. మార్కెట్లు మూతపడ్డాయి, ఆర్డర్లు తగ్గాయి, ఉపాధి దాదాపు నిలిచిపోయింది. ఫలితంగా అనేక నేతన్నల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. మువ్వన్నెల జెండాను నేసిన చేతులు ఇవే. అగ్గిపెట్టెలో ఇమిడే ఆరడుగుల చీరను అద్భుతమైన నైపుణ్యంతో నేసిన కళాకారులు వీరే. అలాంటి కళాకారుల జీవితాలు నేడు కన్నీళ్ల కలబోతగా మారడం సమాజానికి బాధాకరం.

తెలంగాణ ప్రభుత్వం కూడా చేనేత పరిశ్రమను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో 11-03-2024న ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ (టెక్స్టైల్) శాఖ ద్వారా జారీ చేసిన జి.ఓ. ఎం.ఎస్. నెం.1 ద్వారా చేనేత రంగానికి రక్షణ కల్పించింది. ప్రభుత్వ శాఖలకు అవసరమైన బెడ్ షీట్లు, కార్పెట్లు టెస్కో ద్వారా ఇండెంట్ ఇచ్చి సహకార సంఘాల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఈ నిర్ణయాన్ని పక్కనపెట్టి టెండర్ విధానాన్ని అమలు చేయాలనే ప్రయత్నాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం ప్రవేశపెట్టిన ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్‌లోని 22 రకాల వస్తువుల కేంద్రీకృత టెండర్ల విధానం నుంచి వరంగల్ కార్పెట్లు, బెడ్ షీట్లను తొలగించి, పాత పద్ధతి ప్రకారం టెస్కో ద్వారా ఆర్డర్లు ఇవ్వాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది అమల్లోకి వస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి కొనసాగుతుంది. చేనేత పరిశ్రమ కూడా పరిరక్షింపబడుతుంది.

చేనేత అనేది వృత్తి మాత్రమే కాదు - ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కళ. 

చేనేత పరిశ్రమను కాపాడి వేలాది నేతన్నల కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి టెండర్ విధానాన్ని పునఃసమీక్షించి రద్దు చేయాలని యావత్ తెలంగాణ చేనేత కళాకారుల తరఫున సవినయంగా ప్రార్థిస్తున్నాము. 

మువ్వన్నెల జెండాను నేసిన ఆ చేతులు నేడు ఉపాధి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. ఆ చేతులు మగ్గం మీద మళ్లీ ఆశల నూలుపోగులు అల్లాలంటే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి చేనేత రంగాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది.  


వ్యాసకర్త
కోట దామోదర్ నేత
మొబైల్ 9391480475


టెండర్ విధానంతో నేతన్నల బతుకుకు క(న)ష్టం.. - Chenetamitra

15, ఫిబ్రవరి 2026, ఆదివారం

నాన్న ఎప్పుడు హీరో నే

 హాస్టల్ దాటిన అడుగుల నుంచి

యూనివర్సిటీ దారి వరకు ఒక దృశ్యం

నా మనసును ఆపేసింది…


భుజం మీద లగేజీ,

ముందు నడిచే కూతురు, 

వెనుక నడుస్తూ జీవితమంతా మోస్తున్న నాన్న.


మాటలేమీ లేవు,

అయినా అర్థమయ్యే ప్రేమ,

చూపులేమీ లేవు,

అయినా కనిపించే త్యాగం.


ఆమె భవిష్యత్తు తేలికగా ఉండాలని

తన బరువంతా భుజాలపై వేసుకున్నాడు.


ఆ క్షణంలో

కళ్లలోకి నీళ్లు వచ్చాయి…

అర్థమైంది —

నాన్నలు ఎప్పుడూ

నిజమైన హీరోలేనని.

అలల్ని చీల్చిన ధైర్యం

 అలల్ని చీల్చిన ధైర్యం

మనసును కదిలించే జీవన గాథలు "అవరోధాలే అవకాశాలు"

మనసును కదిలించే జీవన గాథలు "అవరోధాలే అవకాశాలు"


అవరోధాలను దాటుకుంటూ,
అవమానాలను ఓర్పుగా మోస్తూ,
కన్నీళ్లను ధైర్యంగా తుడుచుకుంటూ
నిలబడ్డ కొంతమంది అసాధారణ వ్యక్తుల జీవిత ప్రయాణాలే
“ఈ అవరోధాలే అవకాశాలు”.

ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసం
ఒక వ్యక్తి గెలుపు కథ మాత్రమే కాదు
ఓడిపోకుండా నిలబడిన మనిషి ఆత్మవిశ్వాసానికి సాక్ష్యం.
వెనుకడుగులు వేయాలని పరిస్థితులు బలవంతం చేసినా,
ముందడుగు వేయాలని మనసు చెప్పినప్పుడు
జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఈ రచనలు తెలియజేస్తాయి.

కోట దామోదర్ గారి కలం తన అనుభవాలను, ఆవేదనలను, ఆశలను ఎంతో సూటిగా పాఠకుల హృదయాల్లో నాటుతుంది. ప్రతి వ్యాసాన్ని చదువుతుంటే, అది కేవలం ఒక కథగా కాకుండా మన జీవితానికే అద్దం పట్టినట్టుగా అనిపిస్తుంది. ఆయన రచనల్లోని నిజాయితీ, జీవన స్పర్శ పాఠకుడిలో మెల్లగా “నేనూ చేయగలను” అనే ఆత్మవిశ్వాసాన్ని మొలకెత్తిస్తుంది. ఇదే ఆయన రచనల గొప్పతనం, పాఠకులను ముందుకు నడిపించే అసలైన శక్తి.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి మెకానిక్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసిన వ్యాసకర్త కోట దామోదర్ రచించిన "అవరోధాలే అవకాశాలు" వ్యాస సంపుటి పాఠకులకు జీవితం పైన పాజిటివ్ దృక్పథాన్ని కలగజేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఊరటనిస్తుంది. ఎంతోమంది సామాన్యులు..తమ నిరంతర సాధన,పట్టుదలతో  అసాధారణ వ్యక్తులుగా ఎదగడంలోని కృషిని, జీవన విలువలను తెలియజేస్తుంది. ఈ పుస్తకం లోని 27 వ్యాసాలు ఏదో విధంగా పాఠకుల మనసులకు సాంత్వన చేకూర్చేవే. స్ఫూర్తిని అందించేవే..!. సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉండే దానికన్నా, ధైర్యం మరియు దృడ సంకల్పంతో ముందుకు సాగడానికి ప్రయత్నించు అంటారు రచయిత.

అవరోధాలనే అవకాశాలుగా మార్చుకుంటే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని చెప్పిన స్వామి వివేకానంద స్ఫూర్తితో... మనిషికి వైకల్యం ఉన్నా, పూర్ణ సుందరి ఐఏఎస్ గా ఎదిగిన యథార్థ జీవిత కథను తనదైన శైలితో వివరించారు. అవరోధాలు మనల్ని ఆపేందుకు కాదు, మనలోని శక్తిని వెలికి తీయడానికి వచ్చిన అవకాశాలు. శారీరక పరిమితులు విజయానికి అడ్డంకులు కావు; ఆత్మ విశ్వాసం, పట్టుదల, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఏ వైకల్యాన్నైనా జయించవచ్చు. జీవితంలో ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్ధారించుకొని, ఎన్ని కష్టాలు ఎదురైనా నిరంతర కృషితో ముందుకు సాగితే విజయం తప్పక అతనిదే. జీవిత పాఠాలతో మనల్ని మనమే మలుచుకుంటూ, ఇతరులకు మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదగడమే నిజమైన విజయం అంటారు రచయిత కోట దామోదర్.

ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మహా అథ్లెట్ "ఉసేన్ బోల్ట్" జీవితాన్ని రచయిత  అత్యంత స్ఫూర్తివంతంగా ఆవిష్కరించారు. అలుపెరుగని కృషి, అచంచలమైన పట్టుదలతో తొమ్మిదేళ్ల పాటు ప్రపంచ అథ్లెటిక్స్ రంగాన్ని ఏలిన మకుటం లేని రాజుగా బోల్ట్ నిలిచాడని వివరించారు. ఎన్నో ప్రపంచ రికార్డులు, ఒలింపిక్ విజయాలు సాధించినప్పటికీ, “నేను మీలాంటి సామాన్యుడినే” అని గర్వం లేకుండా చెప్పుకోవడం అతని మానవత్వానికి అద్దం పడుతుంది. బోల్ట్‌కు చిన్ననాటి నుంచి ఎక్కువగా నచ్చిన ఆట క్రికెట్ అయినప్పటికీ, తన కోచ్ ఇచ్చిన సలహాలు గౌరవించి రన్నింగ్ వైపు అడుగులు వేయడం అతని జీవితానికి మలుపుగా మారింది. అదే నిర్ణయం అతన్ని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మనిషిగా, విశ్వవిజేతగా నిలిపింది. ఈ వ్యాసం ద్వారా రచయిత తెలియజేసిన ముఖ్య సందేశం ఏమిటంటే సరైన మార్గనిర్దేశం, కష్టం, వినయం కలిసినప్పుడు అసాధ్యమనే మాట ఉండదు. ఉసేన్ బోల్ట్ జీవితం ప్రతి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించిన విజయవంతమైన వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. ప్రవీణ్ తాంబే ఆ కోవకు  చెందిన వారంటూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతని జీవన ప్రస్థానం ఎలా కొనసాగిందో ఆసక్తికరంగా వివరించారు. సాటి మానవుల పట్ల ప్రేమ దయ కలిగి ఉండటం మరియు సేవా తత్పరత జీవిత పరమార్థమని మదర్ థెరిసా జీవిత సందేశాన్ని ఓ వ్యాసంలో వివరించారు. పద్మశ్రీ కె. ఎస్. రాజన్న తన సామాజిక సేవలో ముందుకెళ్లినా వైనాన్ని దివ్యాంగుల తో పాటు.. నేటి యువతకు కూడా ఆదర్శమన్నారు. నేటి విద్యా వ్యవస్థలో జ్ఞాన సముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఉందనీ... విషయ పరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుందని ఆందోళన చెందారు.

ఈ వ్యాసాలలో రచయిత సమాజంలో మార్పు తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తుల జీవితాలను అద్భుతంగా వివరించారు. ఎన్నో సామాజిక అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా, ఏడు సంవత్సరాల కఠినమైన శ్రమ తో చేనేత కార్మికుల కష్టాలు తగ్గించేందుకు “లక్ష్మీ ఆసు” యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితం ద్వారా ఆవిష్కరణకు పట్టుదల ఎంత ముఖ్యమో తెలియజేశారు.

ఇంకొక వ్యాసంలో, ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే ప్రతి మనిషి భగవంతుడితో సమానమని, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారికి డబ్బు కంటే మంచి మనసే అసలైన సంపద అనే సందేశాన్ని ఒక నిజ జీవిత సంఘటన ద్వారా హృద్యంగా అందించారు.

మరొక వ్యాసంలో, “ఈ దేశ పౌరుడిగా నాకు విద్యనభ్యసించే హక్కు ఉంది” అంటూ సమానత్వం కోసం న్యాయస్థానంలో పోరాడిన ఉద్యమ వీరుడి కథను వివరించి, హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్యంలో ఎంత అవసరమో బలంగా చాటారు.

ఇవి కేవలం వ్యాసాలు కావు…
జీవితానికి దారి చూపే దీపాలు.
నిరాశలో ఉన్నవారికి ఆశ్వాసం,
అలసిపోయిన వారికి ఉత్తేజం,
సంకల్పం కోల్పోయిన వారికి స్ఫూర్తి.

అవరోధాలే అవకాశాలవుతాయని
నమ్మించే శక్తి ఈ పుస్తకానికి ఉంది.
జీవితం ఎదురయ్యే ప్రతి కష్టాన్ని
ఒక పాఠంగా, ఒక మెట్టుగా మార్చుకోవచ్చని
ఈ పుస్తకం మౌనంగా చెబుతుంది.

ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసం ఒక నిజ జీవిత కథ ఆధారంగా చేసుకుని, జీవితం పట్ల ఆశావాదాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పాఠకులలో నింపుతుంది. పేదరికం, ఆకలి, పరిమితులు, ఓటమి విజయానికి అడ్డంకులు కావని—సంకల్పబలం, నిరంతర కృషి ఉంటే పల్లె నుంచి ప్రపంచ స్థాయి విజయాల దాకా ఎదగవచ్చని స్పష్టంగా తెలియజేస్తుంది. గెలుపు–ఓటములు జీవితంలో సహజమని, వాటికి అతిగా పొంగిపోకుండా లేదా కుంగిపోకుండా సమతా భావంతో ముందుకు సాగితేనే నిజమైన విజయం సాధ్యమని ఈ వ్యాసాలు బోధిస్తాయి. మొత్తం మీద, ఈ రచనలు ప్రతి పాఠకుడిలో ధైర్యం, ఆశ, లక్ష్యసాధన పట్ల విశ్వాసం పెంపొందించడమే ప్రధాన సందేశం గా నిలుస్తాయి. వారు భవిష్యత్తులో ఇలాంటి మంచి రచనలతో... పాఠకులకు స్ఫూర్తిని పంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.



వ్యాసకర్త
Prof Ravinder Rena
డర్బన్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ
సౌత్  ఆఫ్రికా,
Mobile: +27 847828059

*మూడో కన్ను" తెరిచినప్పుడు… కనిపించే సాహిత్య ప్రపంచం*

  "*మూడో కన్ను" తెరిచినప్పుడు… కనిపించే సాహిత్య ప్రపంచం*!   మూడో కన్ను తెరవగానే ప్రపంచం మొత్తం మన కళ్లముందే ప్రత్యేక్షమైనట్లు. మూస...