30, ఏప్రిల్ 2026, గురువారం

complete vs finish

 ఒక సాయంత్రం ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు భార్యకు ఒక్కసారిగా ఒక సందేహం వచ్చింది. భర్త దగ్గరకు వచ్చి అడిగింది.


“ఏవండీ … ఒక విషయం అడగాలా?”

భర్త నవ్వుతూ, “అడుగు, ఏమైంది?” అన్నాడు.

“Complete కి, Finish కి తేడా ఏముంది? రెండూ ఒకటే మీనింగ్ కదా!” అని అమాయకంగా అడిగింది.

భర్త కాసేపు ఆమె ముఖం చూసి నవ్వాడు.
“ఓసి పిచ్చిదానా! రెండూ ఒకటే కాదు. వేరువేరు సందర్భాల్లో వాడే పదాలు అవి,” అన్నాడు.

భార్య వెంటనే ఆసక్తిగా,
“అలానా! అయితే ఉదాహరణతో చెప్పు,” అంది.

భర్త మాత్రం తప్పించుకోవాలని చూసాడు.
“అయ్యో… ఇప్పుడెందుకు అవన్నీ? తరువాత చెప్తాను,” అన్నాడు.

కానీ భార్య పట్టువిడవలేదు.
“లేదు లేదు… ఇప్పుడే చెప్పాలి. ఉదాహరణతో చెప్పు,” అని పట్టుబట్టింది.

భర్త కొంచెం ఆలోచించి చిరునవ్వు నవ్వాడు.
“సరే విను,” అన్నాడు.

“Complete అంటే ఒక పని పూర్తవడం. ఉదాహరణకి… నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావ్ కదా! అది నీ జీవితంలో ఒక ఆపరేషన్ complete అయినట్టే.”

అది విని భార్య నవ్వింది.
“అయితే finish అంటే?” అని మళ్లీ అడిగింది.

భర్త వెంటనే నవ్వుతూ అన్నాడు—
“నేను నిన్ను పెళ్లి చేసుకున్న రోజు నుంచి… నా జీవితం finish అయిపోయింది!”

అంతే… ఆ మాట విన్న భార్య మొదట ఒక్కసారిగా షాక్ అయింది. తరువాత భర్తను చూసి కోపంగా నటించింది. కానీ కాసేపటికి ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు.

ఆ రోజు నుంచి ఆ ఇంట్లో complete మరియు finish అనే పదాలు వినిపించినప్పుడల్లా ఇద్దరికీ ఆ సరదా సంఘటన గుర్తొచ్చి నవ్వు ఆగేది కాదు.

✍️
కోట దామోదర్
మొబైల్ 9391480475

సంగీతం – మనసును తాకే శక్తి

 సంగీతం – మనసును తాకే శక్తి

ఒకరోజు సాయంత్రం. ఇంటి ముందున్న ఆరుబయట చల్లని గాలిలో తాతయ్య, మనవడు ఇద్దరు కూర్చుని సరదాగా ముచ్చటించుకుంటున్నారు. ఆకాశం నారింజ రంగులో మెరుస్తోంది. పక్షులు గూటికి తిరిగి వెళ్తున్నాయి. ఆ నిశ్శబ్దంలో మనవడికి ఒక్కసారిగా ఒక ప్రశ్న వచ్చింది.


“తాతయ్య… మీరు దేనిని ఎక్కువగా ఇష్టపడతారు?” అని అమాయకంగా అడిగాడు.

తాతయ్య చిరునవ్వు చిందిస్తూ,
“మనవడా… నాకు సంగీతం చాలా ఇష్టం” అని సమాధానం చెప్పాడు.

మనవడికి మాత్రం ఆ మాట పూర్తిగా అర్థం కాలేదు. కొద్దిసేపు ఆలోచించి మళ్లీ అడిగాడు.

“తాతయ్య… సంగీతాన్ని ఎందుకు అంతగా ఇష్టపడతారు? సంగీతం వింటే ఏమవుతుంది?”

తాతయ్య కొద్దిసేపు ఆకాశం వైపు చూసి మెల్లగా అన్నాడు:
“మనవడా… సంగీతానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అది మనిషిని భూమి నుండి స్వర్గానికి తీసుకెళ్లగలదు, స్వర్గం నుండి మళ్లీ భూమికి తీసుకురాగలదు.”

మనవడు ఆశ్చర్యపోయాడు.
“అది ఎలా తాతయ్య? భూమి నుండి స్వర్గానికి ఎలా తీసుకెళ్తుంది?” అని మళ్లీ ప్రశ్నించాడు.

తాతయ్య నవ్వుతూ చెప్పాడు:
“ఒరేయ్ మనవడా… సంగీతం వింటుంటే మనసు ఎంత ఉల్లాసంగా మారుతుందో గమనించావా? మంచి పాట వింటే మనం కూడా ఆ పాటలోని పాత్రలతో కలిసి జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. బాధతో కూడిన పాట వింటే మనకూ బాధ కలుగుతుంది. సంతోషకరమైన పాట వింటే మన హృదయం కూడా ఆనందంతో నిండిపోతుంది. అంటే సంగీతం మన భావాలను మార్చగలదు. అందుకే నేను అది స్వర్గానికి తీసుకెళ్తుందని చెప్పాను.”

మనవడు ఆసక్తిగా వింటూ తల ఊపాడు.
ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగాడు. తాతయ్య ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పాడు.

చివరికి మనవడు మరో ప్రశ్న వేసాడు.

“తాతయ్య… ఈ శక్తి సంగీతానికి మాత్రమే ఉందా? ఇంకేమైనా ఉందా?”

తాతయ్య కొద్దిసేపు ఆలోచించి నవ్వుతూ అన్నాడు:
“అవును మనవడా… ఇంకొకటి కూడా ఉంది.”

“ఏంటి తాతయ్య?” అని మనవడు ఆసక్తిగా అడిగాడు.

“అదే రా బాబు… బడి గంట!”

మనవడు ఆశ్చర్యపోయాడు.
“బడి గంటకా? దానికి ఏ శక్తి ఉంటుంది తాతయ్య?”

తాతయ్య నవ్వుతూ చెప్పాడు:
“నువ్వు పొద్దున్నే స్కూల్‌కి వెళ్లినప్పుడు బడి గంట మోగితే నీకు కొంచెం బాధగా అనిపిస్తుంది కదా? క్లాస్ మొదలవుతుందని. కానీ అదే గంట సాయంత్రం మోగితే ఎంత సంతోషంగా అనిపిస్తుంది! ఇంటికి వెళ్లొచ్చని.”

“అదే శబ్దం… కానీ మన భావాలు మాత్రం మారిపోతాయి. మన పరిస్థితి బట్టి మనసు స్పందిస్తుంది. సంగీతం కూడా అలాగే మన భావాలను తాకుతుంది.”

మనవడు కాసేపు ఆలోచించి చిరునవ్వుతో అన్నాడు:
“ఓహ్… అలానా తాతయ్య!”

తాతయ్య తల నిమిరి,
“అవును మనవడా… ఈ ప్రపంచంలో కొన్ని శబ్దాలు మనసును నడిపిస్తాయి. సంగీతం వాటిలో మొదటిది” అని ప్రేమగా చెప్పాడు.

ఆ సాయంత్రం గాలి మధ్య తాతయ్య చెప్పిన ఆ మాటలు మనవడి మనసులో మధురమైన సంగీతంలా మిగిలిపోయాయి.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

అవరోధాలపై విజయం: డాక్టర్ వి. ఎస్. ప్రియా జీవగాథ

 “అవరోధాలపై విజయం: డాక్టర్ వి. ఎస్. ప్రియా జీవగాథ” 

ట్రాన్స్‌జెండర్‌గా బ్రతకడం అంటే పోరాటమే కాదు, అసాధారణ విషయం అస్సలే కాదు. ప్రతి మనిషిలాగే వారు కూడా భావాలు, ఆశలు, కలలు కలిగిన సాధారణ మనుషులే. కానీ మన సమాజం వారిని మరో కోణంలో చూడడం వల్ల, వారి జీవితం సవాలక్ష సవాళ్లతో నిండిపోతుంది. వారిని అర్థం చేసుకోవడం కన్నా విమర్శించడం, అంగీకరించడం కన్నా దూరంగా ఉంచడం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దృక్పథం మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమస్య వారిలో లేదు, వారిని చూసే మన దృష్టిలో ఉంది.

 చిన్ననాటి నుంచే వారు ఎన్నో అవమానాలు, నిరాకరణలు ఎదుర్కొంటారు. కుటుంబం నుంచి ప్రారంభమయ్యే ఈ నిరాకరణ, బయట ప్రపంచంలో మరింత పెరుగుతుంది. సాధారణ వ్యక్తులకు అందినట్లుగా విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలు కూడా వారికి సులభంగా అందవు. అయినప్పటికీ, వారు తమ జీవితాన్ని గౌరవంగా, ధైర్యంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల జీవితం అనేది సాధారణంగా సవాళ్లతో నిండిన ప్రయాణం. కానీ ఆ సవాళ్లను ఎదుర్కొంటూ విజయం సాధించిన వ్యక్తులు సమాజానికి నిజమైన స్ఫూర్తి. అలాంటి వారిలో ఒకరు డాక్టర్. వి. ఎస్. ప్రియ.

డాక్టర్. వి. ఎస్. ప్రియ గారి జీవిత కథ ధైర్యం, ఆత్మవిశ్వాసం, మరియు పట్టుదల ఒక అద్భుత ఉదాహరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సమాజంలో ఎన్నో అవరోధాలు, అపోహలు, విమర్శలు ఎదురైనా, ఆమె తన లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది.

చిన్ననాటి నుంచే తన వ్యక్తిత్వాన్ని అంగీకరించుకోవడం ఎంత కష్టం అనేది ఆమె ప్రయాణం చెబుతుంది. కుటుంబం, సమాజం నుండి వచ్చిన ఒత్తిడులను తట్టుకుని, తన స్వప్నాన్ని సాధించాలనే పట్టుదలతో విద్యను కొనసాగించడం ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తుంది.

ఆమె కేవలం డాక్టర్‌గా ఎదగడం మాత్రమే కాదు, ట్రాన్స్‌జెండర్ సమాజానికి ఒక ఆశాకిరణంగా నిలిచారు. “దృఢ సంకల్పం" ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చు అనే సందేశాన్ని ఆమె జీవితం స్పష్టంగా చెబుతోంది.

సమాజంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై ఇంకా ఎన్నో అపోహలు ఉన్నాయి. చాలా మంది వారికి అవకాశాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తారు. కానీ డాక్టర్ ప్రియా గారు ఆ అవరోధాల అన్నిటినీ ఛేదించి, అవకాశాలుగా మలచుకొని, నేడు ఒక వైద్యురాలిగా సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆమె విజయం కేవలం ట్రాన్స్‌జెండర్ గా గెలుపు మాత్రమే కాదు, సమాజం మార్పు దిశగా తీసుకున్న ఒక పెద్ద అడుగు.

కేరళ రాష్ట్రంలో జన్మించిన డాక్టర్. వి. ఎస్. ప్రియ గారు చిన్ననాటి నుంచే తనను మహిళగా భావించేవారు. అయితే సమాజం, కుటుంబం, మరియు పరిసరాల ఒత్తిడి కారణంగా ఆ భావనను బయట పెట్టడం ఆమెకు చాలా కష్టంగా మారింది.

కాలక్రమేణా ఆమె తన నిజమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని, తనకు నచ్చిన దిశలో జీవించాలని ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రారంభంలో కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించకపోయినా, ఆమె పట్టుదల, ధైర్యం చూసి తర్వాత అంగీకరించారు.

ఆమె విద్యా ప్రయాణం సవాళ్లతో నిండినదే. లింగ గుర్తింపు కారణంగా పాఠశాల దశలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, వాటిని లెక్కచేయకుండా తన లక్ష్యంపై దృష్టి సారించారు. వైద్యరంగంపై ఆసక్తితో ఆమె ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసించారు.

ప్రస్తుతం ఆమె త్రిసూర్ ప్రాంతంలో ఆయుర్వేద వైద్యురాలిగా సేవలు అందిస్తూ, తన జీవితం ద్వారా అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఆమె జీవితం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది. మన స్వప్నాలు నిజం కావడానికి జెండర్‌తో ఎలాంటి సంబంధం లేదు. మనం ఎంత కష్టపడతామో, ఎంత పట్టుదలతో ముందుకు సాగుతామో అదే ముఖ్యం. లింగ భేదం, సామాజిక అడ్డంకులు ఇవన్నీ మన లక్ష్యాలను ఆపలేవు.

మనలో నమ్మకం ఉంటే, ఏదైనా సాధించగలం. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మనలోని అసలైన శక్తి బయటపడుతుంది. ప్రతి అడ్డంకి మనకు ఒక కొత్త పాఠం నేర్పుతుంది, ప్రతి కష్టం మనల్ని లక్ష్యానికి మరింత దగ్గర చేస్తుంది.

సమాజంలో ట్రాన్సజెండర్స్‌పై వివక్ష లేకుండా ఉండాలంటే మార్పు విద్యాసంస్థల నుంచే ప్రారంభం కావాలి. స్కూల్స్, కాలేజీల్లో వారిపై ఎలాంటి వివక్ష లేకుండా, సమానంగా చూడడం అత్యంత ముఖ్యం. చిన్న వయసులోనే విద్యార్థులకు సమానత్వం, గౌరవం అనే విలువలు నేర్పితే భవిష్యత్తులో మంచి సమాజం ఏర్పడుతుంది.

అదే విధంగా, ఉద్యోగాల్లో కూడా ట్రాన్సజెండర్స్‌కు సమాన అవకాశాలు కల్పించాలి. వారి ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తే, వారు కూడా సమాజంలో స్వాభిమానంతో నిలబడగలరు.

ఇందుకోసం పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు. చిన్న మార్పులే పెద్ద ఫలితాలు ఇస్తాయి. ఒక మంచి మాట, ఒక గౌరవం, ఒక అవకాశం. ఇవే వారి జీవితాన్ని మార్చగలవు.

మనం ఒక్కొక్కరం మారితేనే సమాజం మొత్తం మారుతుంది.

ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన సంకల్పం దృఢంగా ఉంటే విజయం మనదే అవుతుంది.

యువతకు డాక్టర్ ప్రియా గారి జీవితం ఒక గొప్ప ప్రేరణ. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిత్వాన్ని గౌరవించుకోవాలి, ఇతరులను కూడా అంగీకరించాలి. అప్పుడు మాత్రమే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది.


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్: 9391480475

వైకల్యాన్ని జయించిన విలువిద్య క్రీడాకారిణి

 వైకల్యాన్ని జయించిన విలువిద్య క్రీడాకారిణి 


ఆర్చరీ లేదా విలువిద్యలో రాణించాలంటే శారీరక సమతుల్యత, కచ్చితమైన ప్రణాళిక, సాధించాలనే పట్టుదల ఇవన్నీ తప్పనిసరి. ముఖ్యంగా చేతులు లేని వారు ఈ క్రీడలో రాణించడం అసాధ్యం అనిపించడం సహజం. కానీ అలాంటి అసాధ్యాన్ని సైతం సుసాధ్యంగా మార్చిన స్ఫూర్తిదాయకమైన యువ క్రీడాకారిణి జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శీతల్ దేవి.

రెండు చేతులు లేకపోయినా, మొక్కవోని పట్టుదలతో ఆమె తన కాళ్లతో, భుజాల సహాయంతో విల్లు ఎక్కించి బాణాలు సంధించడం నేర్చుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సంకల్పబలం ఎంత శక్తివంతమైనదో అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం శీతల్ దేవి జీవన గాధ.

వైకల్యం ఒక అవరోధం అయినప్పటికీ, ఆ అవరోధాన్నే ఆమె అవకాశంగా మార్చుకుంది. అదే అవరోధం ఆమెకు ప్రేరణగా మారింది. తన శారీరక పరిస్థితిని ఒక దుర్బలంగా  భావించకుండా, తన లక్ష్యాన్ని చేరుకునే ఉద్దేశంతో ఆమె దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. గతేడాది దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూలో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన శీతల్ దేవి “చేతులు లేని” ఏకైక మహిళా ఆర్చర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తన అద్భుత ప్రతిభతో అంతర్జాతీయ పారా క్రీడల్లో సత్తా చాటి, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

రెండు చేతులు లేకపోయినప్పటికీ, తన కాలి వేళ్లు మరియు భుజం సాయంతో విల్లును లక్ష్య బిందువుపై ఎక్కుపెట్టే ఆమె ప్రతిభను చూసి ప్రేక్షకులు తమ కనురెప్పలు వేయడం కూడా మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు. ఆమె క్రీడా నైపుణ్యం మరియు సంకల్పబలం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె ఆటను ప్రత్యక్షంగా చూడటానికి ప్రాంగణానికి తరలి వచ్చే అభిమానులు కోకొల్లలు. ఆమె వదిలే ప్రతి బాణం లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, ప్రేక్షకుల హృదయాలనూ తాకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ అద్భుత ప్రతిభతోనే అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధిస్తున్న శీతల్ దేవి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో వార్షిక అవార్డులలో ఆమెను “పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్” అవార్డుకు ఎంపిక చేస్తూ ప్రపంచ ఆర్చరీ సంస్థ గౌరవించింది.

ప్రపంచ క్రీడా రంగంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రేరణాత్మక వ్యక్తుల్లో ప్రముఖుడు 'మాట్ స్టట్జ్మాన్' ఒకరు. ఆయనను “Armless Archer” అని కూడా పిలుస్తుంటారు. చేతులు లేకపోయినా, తన కాళ్ల సహాయంతో విల్లు పట్టి బాణం సంధిస్తూ ప్రపంచస్థాయిలో అద్భుత ప్రతిభను ప్రదర్శించారు ఆయన. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించి, ప్రపంచం గర్వించదగిన విలుకాడిగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.

అలాగే మహిళా విభాగంలో శీతల్ దేవీ ఒక గర్వించదగిన క్రీడాకారిణిగా ఆవిర్భవించారు. ఆమె చిన్న వయసులోనే విలువిద్యలో చేరి, కఠిన సాధనతో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. ఆమె విజయాలు భారతదేశానికి గర్వకారణంగా నిలవడమే కాకుండా, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తన దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన గొప్ప విలువిద్యా క్రీడాకారిణిగా నిలిచింది.

'మాట్ స్టట్జ్మాన్' మరియు 'శీతల్ దేవీ' వంటి మహోన్నత క్రీడాకారుల జీవితాలు ప్రతి ఒక్కరికి గొప్ప స్ఫూర్తినిస్తాయి. వీరిద్దరూ శారీరక వైకల్యం ఉన్నప్పటికీ, దానిని ఒక ప్రతిబంధకంగా భావించకుండా ఒక సవాలుగా తీసుకుని తమ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పారు. వారి విజయాలు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. మనిషికి శారీరక పరిమితులు ఉన్నా, మనస్సుకు మాత్రం పరిమితులు ఉండకూడదు.

వారి జీవితాలను పరిశీలిస్తే, దృఢ సంకల్పం, కష్టపడే స్వభావం, పట్టుదల, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు ఎంత ముఖ్యమో తెలుస్తుంది. వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వెనుదిరగకుండా, నిరంతరం సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి విజయాన్ని సాధించాలంటే కష్టపడటం తప్పనిసరి అనే సూచననిస్తుంది.

అలాగే, సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం కూడా వీరి నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తమ వైకల్యాన్ని బలహీనతగా భావించకుండా, అదే తమ ప్రత్యేకతగా మార్చుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. విజయం ఒక్కరోజులో రాదు. నిరంతర సాధన, కృషి ఉంటేనే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు అనే అక్షర సత్యాన్ని వారి జీవితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

కాబట్టి ప్రతి విద్యార్థి వీరి జీవితాల నుండి స్ఫూర్తి పొందుతూ, ఏ పరిస్థితులైనా ఎదుర్కొని, తమ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి ఘన విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను.
 
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

నేత కార్మికుల పై ప్రభుత్వం ఎందుకు పగబట్టింది?

 నేత కార్మికుల పై ప్రభుత్వం ఎందుకు పగబట్టింది?


ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా మారి వారి జీవనాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రూ.105.54 కోట్ల ఆర్డర్‌ను రద్దు చేయడం చేనేత వర్గాల్లో తీవ్ర నిరాశను కలిగించింది. అంతేకాకుండా సంక్షేమ శాఖలు రూ.200 కోట్ల విలువైన దుస్తులు, దుప్పట్ల తయారీకి ఇప్పటివరకు ఆర్డర్లు ఇవ్వకపోవడం ఇటు టెస్కో, అటు చేనేత కార్మికులను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తోంది. ఒకవైపు నేతన్న అప్పులబాధతో సతమతమవుతుండగా, ఈ నిర్ణయాలు “పుండుమీద కారం చల్లినట్లు” వారి బాధను మరింతగా పెంచుతున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ నిర్ణయం వల్ల ఎన్నో చేనేత కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ‘కంచంలోని కూడును లాక్కున్నట్లుగా’ ఉంది. ఆర్డర్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించాల్సిన ప్రభుత్వమే చేతికందిన పనిని లాక్కుంటే చేనేత కార్మికుల పరిస్థితి ఏంటి?  

అయితే, ఇలాంటి సంక్షోభాలే చేనేత వర్గం సహనాన్ని, పోరాటస్ఫూర్తిని పరీక్షించే సందర్భాలు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, చేనేత కార్మికులు ఎప్పుడూ వెనుదిరగలేదు. ప్రభుత్వం గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్య్రం రాకముందు చేనేత రంగం దేశానికి వెన్నుముకగా పనిచేసిందన్న విషయాన్ని విస్మరించడం సమంజసం కాదు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం జరిగిన ఉద్యమంలో కూడా చేనేత వర్గం ఎనలేని సేవలు అందించింది. స్వరాష్ట్రం కోసం చేనేత కార్మికులు ప్రాణత్యాగాలు చేశారన్న విషయం ప్రభుత్వం మరిచిందేమో గానీ, ప్రజలు మాత్రం ఎప్పటికీ మరిచిపోలేరు.

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత కీలక పాత్ర పోషించింది. విదేశీ వస్త్రాల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పుడు, దేశవ్యాప్తంగా చేనేత ఉద్యమం ఉవ్వెత్తున ఒక జ్వాలలా వ్యాపించింది. మహత్మా గాంధీ ఇచ్చిన స్వదేశీ పిలుపుతో ప్రతి ఇంట్లో చరఖా తిరిగింది. ఖాదీ కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అని మహాత్మా గాంధీ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. చేనేత రంగం ద్వారా దేశం ఆర్థికంగా బలపడటమే కాకుండా, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన ప్రతిఘటనగా మారిందన్న విషయం ప్రభుత్వం విస్మరించింది.

ఏళ్లు గడిచినా మహాత్ముడి ఆకాంక్షలు నెరవేరకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. చేనేత కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పరిశీలిస్తే, కొత్త హామీలు గురించి పక్కన పెడితే, ఉన్నవే క్రమంగా కనుమరుగవుతున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

ఇచ్చిన హామీలను ఒకసారి గమనిస్తే—

1. స్కూల్ యూనిఫార్మ్స్, దుప్పట్లు, ఇతర ప్రభుత్వ అవసరాలకు చేనేత వస్త్రాల వినియోగం పెంచుతూ ప్రభుత్వ ఆర్డర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
2. “నేతన్నకు చేయూత” వంటి పథకాల ద్వారా నేరుగా నగదు సహాయం అందించి, కార్మికుల ఆదాయం పెంచుతామని చెప్పారు.
3. ముడి సరుకులైన నూలు, రంగులను తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇచ్చారు.
4. తక్కువ వడ్డీ రుణాలు, అప్పుల భారం తగ్గించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
5. చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ కల్పించి, ఆన్‌లైన్ అమ్మకాలకు సహాయం చేస్తామని ప్రకటించారు.

అయితే, ఈ హామీల్లో నిజంగా ఎన్ని అమలయ్యాయి అన్నది ప్రతి నేత కార్మికుడికి బాగా తెలుసు. హామీలు కాగితాలకే పరిమితం తప్ప అమలుకు నోచుకోకపోవడం చేనేత వర్గంలో నిరాశను మరింతగా పెంచింది.

ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు ప్రజల్లో ఆశలను రగిలిస్తాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత అవి అమలు కావు, ఆవిరి అయిపోతాయి. హామీల అమలు అనే అంశం నేటి రాజకీయాల్లో ఒక చేదు వాస్తవంగా మారింది. “చెప్పేది ఒకటి, చేసేది మరోటి” అన్న భావన ప్రజల్లో బలపడుతోంది.

ఈమధ్య కాలంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా పెద్ద పెద్ద హామీలు ఇస్తారు. కానీ అవి అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికలు చేపట్టకపోవడం ఫలితంగా హామీలు కాగితాలపైనే మిగిలిపోతాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు అనేక రంగాల్లో ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పి, ఇచ్చిన హామీల అమలును వాయిదా వేస్తున్నాయి. కానీ ఇదే సమయంలో ఇతర ప్రాధాన్యాలపై ఖర్చులు కొనసాగుతుండడం ప్రజల్లో సందేహాలు కలిగిస్తుంది. హామీల అమలుపై సరైన మానిటరింగ్ లేకపోవడం బాధ్యతా లోపం అని చెప్పక తప్పదు. ఎవరు బాధ్యత వహించాలన్న స్పష్టత లేకపోవడం వల్ల అవి క్రమంగా మరుగున పడుతున్నాయి. ఎన్నికల తర్వాత నాయకులపై ఉన్న ఒత్తిడి తగ్గిపోవడంతో, హామీల ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుంది.
హామీలు ఇవ్వడం సులభం, కానీ వాటిని అమలు చేయడం నిజమైన నాయకత్వం. నేటి రాజకీయాల్లో మాటలకు మించి కార్యాచరణకు ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉంది.

ఊకదంపుడు ఉపన్యాసాలతో నోటికొచ్చిన హామీలు ఇస్తూ, నేత కార్మికులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారనే భావన బలపడుతోంది. చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన కృషి కనిపించకపోవడం ఆవేదనకరమైన విషయం. "దయలేని అత్తకి దండం పెట్టినా తప్పే" అన్నట్లు  దయలేని ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా ఏమి లాభం, చేనేత కార్మికుడికి కన్నీరే తప్ప!  

ఇకనైనా నేత కార్మికుల కష్టాన్ని గుర్తించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వారికి సరైన న్యాయం అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

కరెంట్ కార్మికుల కష్టాలు తీరేదెన్నడు:

 కరెంట్ కార్మికుల కష్టాలు తీరేదెన్నడు:


"ఎగిరెగిరి దంచినోడికి అదే కూలి.. ఎగరకుండా దంచినోడికి అదే కూలి"  అన్నట్లు ఏసీ లో కూర్చునోళ్లకు అదే కూలి. ఎండనక వాననకా రాత్రనక పగలనక కరెంటు కోసం చెట్లు పుట్టలు ఎక్కెటోళ్లకు అదే కూలి కాదు అంతకన్నా తక్కువ కూలీ అదేంది అనుకుంటున్నారా ఇది నిజం.  కింద కూసోని పని చెప్పేటోళ్లకు పైసలెక్కువ అదే కరెంటు స్తంభాలెక్కి పనిచేసే కార్మికులకు తక్కువ జీతం, ఎక్కువ శ్రమ, గ్యారెంటీ లేని జీవితం ఎప్పుడు ఏమవుతుందో అర్ధంకాని పరిస్థితి ఇన్ని ఇబ్బందులను తట్టుకొని కూడా శ్రమిస్తున్నారంటే నిజానికి కరెంటు కార్మికులకు మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది.

ఒక పది నిమిషాలు కరెంటు పోతే మనం అల్లాడిపోతం, అంతేకాదు మనం 12 గంటలు డ్యూటీ చేస్తేనే అయోమయం అయిపోతాం మరి అలాంటిది కరెంటు కార్మికుల పరిస్థితి ఎప్పుడైనా చూశారా మీరు? మనం దేశంలో ఎక్కువ కష్టపడేది  ఎవరంటే మొదటగా సైనికులు, ఆతర్వాత పోలీసులు, కరెంటు కార్మికులు కూడా అత్యధికంగా శ్రమించేవారే ఇందులో ఎలాంటి సందేహం లేదు.   

ఎండైనా, వానైనా, రాత్రైనా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో విద్యుత్ స్తంభాలెక్కి పని చేయడం చిన్న విషయం కాదు. ఒక్క చిన్న తప్పిదం జరిగినా ప్రాణానికి ముప్పు. అయినా కూడా వాళ్లు పనిచేస్తూనే ఉంటారు, ఎందుకంటే సమాజం నడవడానికి వాళ్ళు చేయడం ఎంతో అవసరం లేదంటే అంత చీకటిమయం. మరి అంత శ్రమించేవారికి జీతం ఎందుకు తక్కువ అనుకుంటున్నారా అదే మరి సమస్య ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది. "ఒక గుడ్డివాడికి చూపు రాగానే మొట్టమొదట విసిరేసేది అప్పటివరకు సహాయపడిన చేతికర్రనే" అన్నట్లు ఓడిపోయినా నాయకులకు, గెలిచినా నాయకులకు కరెంటు కార్మికులు చేతికర్రలాంటోళ్ళు వాళ్ళకి పదవి రాగానే కరెంటు కార్మికులను కంటికి కనపడకుండా తిరుగుతారు. అప్పటిదాకా మేము ఉన్నాం మీకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నోళ్లే ఆఖరికి ఏమి చేయలేని పరిస్థితి . ఈ కార్మికుల కష్టాలు ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కాక కకావికలం అవుతున్నారు. కెసిఆర్ ప్రభుత్వం పేర్మినెంట్ చేస్తాం అనగానే కార్మికులకు ఇక మాకు మంచిరోజులు వచ్చినాయి అనుకుండ్రు తీరా చూస్తే మళ్ళి మొదటికి వచ్చింది.  మళ్ళా ఎలక్షన్స్ దాకా ఇదే నస ఇగ కరెంటు కార్మికుల జీవితాలు మరేందెన్నడు అనే ప్రశ్నకు జవాబు లేదు. 

"ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య" అన్నట్లు ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరి తలరాత మాత్రం మారడంలేదు. పోనీ డ్యూటీ అయినా తగ్గిస్తారేమో అనుకుంటే 24 గంటల డ్యూటీ. ఇటు డబ్బులేదు అటు సుఖం లేదు. ఇంకో గమ్మతైన విషయం ఏంటంటే కరెంటు పని చేస్తున్నాం అంటే పిల్లనే ఇస్తలేరంట ఎందుకంటే భద్రత లేని బతుకు కదా! అయ్యో కష్టాలు కన్నీళ్లు ఏరులై పారుతున్న కనికరించే నాయకుడు లేడు.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత హోదా కల్పించాడని ఏండ్లతరబడి మొత్తుకున్నా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఇగ చేస్తాం అగ చేస్తాం అని చెప్పుడే తప్ప చేసింది ఏమిలేదు. గత 18 ఏళ్లకు పైగా తెలంగాణ విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ కార్మికులుగా సేవలందిస్తున్నవారు అప్పటి తెలంగాణ ఉద్యమ సమయంలో, వీరి సేవలను క్రమబద్ధీకరిస్తామని అప్పటి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరకపోవడంతో, 2016లో విద్యుత్ కార్మిక సంఘాలతో కలిసి నిరసన తెలిపారు. నిరసన కారణంగా జూలై 28, 2017న పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్ 12(3) ప్రకారం ఒప్పందం కుదిరింది. జూలై 29, 2017న  సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతవరకు చూస్తే సమస్య పరిష్కారం దిశగా వెళ్లినట్టే కనిపించింది. అయితే, "మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు" కొందరు నిరుద్యోగ యువకులు దీనిని హైకోర్టులో సవాలు చేసి నీరుగార్చేలా చేశారు. సెప్టెంబర్ 18, 2018న హైకోర్టు కార్మికులకు అనుకూలంగా  తీర్పునిస్తూ, సెక్షన్ 12(3) ప్రకారం ఈ సమస్యలను పరిష్కరించుకునే అధికారం విద్యుత్ సంస్థలకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక సంఘలకు ఉందని స్పష్టం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మరియు గవర్నర్ ప్రసంగం ద్వారా 23,667 మంది కార్మికులను క్రమబద్ధీకరించినట్లు ప్రకటించారు.  కానీ కార్మికుల రెగ్యులరైజేషన్ అనే ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతూ కార్మికులకు పూర్తిస్థాయి క్రమబద్ధీకరణకు బదులుగా, పాత ఉత్తర్వులను రద్దు చేసి, ఫ్యాక్టరీల చట్టం 1946 స్టాండింగ్ ఆర్డర్స్ సర్వీస్ రూల్స్‌ను ప్రవేశపెట్టింది.  దీనివల్ల అధికారికంగా శాశ్వత హోదా లేకుండానే కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు. "చెప్పుకొని మురువు చూసుకొని ఏడువు"  అన్నట్లు వీరు సమాజం దృష్టిలో శాశ్వత ఉద్యోగులే కానీ, ప్రభుత్వ దృష్టిలో మాత్రం కాదు. చెప్పుకోవడానికి కరెంటు ఉద్యోగం కానీ వీరి జీవితం కన్నీళ్లు కష్టాలే.  జీతం పెంచుడు దేవుడెరుగు కానీ మా కష్టాలను చూసైనా కనికరించండయ్యా మహా ప్రభో అని వేడుకున్న వినే నాయకుడు లేడు.

ఇక పని విషయానికి వస్తే… ఎంత చెప్పుకున్నా వీరి కష్టాలు తక్కువగానే అనిపిస్తాయి. ఇతర ప్రభుత్వ ఆఫీసుల్లో ఒకరి పని నలుగురు చేస్తుంటే, కరెంట్ ఆఫీసుల్లో మాత్రం ఐదుగురు చేయాల్సిన పనిని ఇద్దరు ముగ్గురే మోస్తున్నారు.
సమాన అవకాశాలు లేకపోవడమే కాదు… గత రెండు సంవత్సరాలుగా రెగ్యులర్ అయిన వాళ్లకి, రెగ్యులర్ కాని వాళ్లకి 30% నుంచి 60% వరకు జీతాల్లో తేడా ఉంది. సాధారణంగా ఏడాదికి 300 షిఫ్టులు ఉండాలి… కానీ వీరు 450 షిఫ్టులు చేస్తున్నారు. వారానికి సెలవులు కూడా లేకుండా, నిరంతరం పని ఒత్తిడిలోనే బ్రతుకుతున్నారు. ఈ ఒత్తిడి ఎంతలా ఉందంటే… తమ కుటుంబ సభ్యుల చివరి చూపుకి కూడా వెళ్లలేని పరిస్థితి… అంత్యక్రియలకు హాజరు కాలేని బాధ… మాటల్లో చెప్పలేం. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే… ఆర్టిసన్ కార్మికులకి ఎలాంటి సర్వీస్ బెనిఫిట్స్ లేవు… గ్రాట్యుటీ అనే హక్కు కూడా లేదు. దాంతో రిటైర్ అయ్యాక కూడా బ్రతుకుదెరువు కోసం మళ్లీ వృద్ధాప్యంలో అడ్డా కూలీలాగా తిరగాల్సిన పరిస్థితి

నిబంధనల ప్రకారం గ్రేడ్ మార్చితే ప్రభుత్వానికి నెలకు 10 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్తున్నారు. కానీ మేమేమీ అదనంగా అడగడం లేదు సార్… ఇప్పుడు తీసుకుంటున్న జీతాలకే (కరెంట్ పే స్కేల్‌కి) మమ్మల్ని రెగ్యులర్ పోస్టుల్లోకి తీసుకోండి అనేదే మా విజ్ఞప్తి. ప్రభుత్వంపై భారం లేకుండా, మా బ్రతుకుల్ని గాడిలో పెట్టాలనే మా కోరిక మాత్రమే… అంతే అని అంతలా వేడుకున్నా కూడా ప్రభుత్వం కరుణించకపోవడం…
ఇది మాత్రం కరెంట్ కార్మికుల దౌర్భాగ్యమే అనాలి. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే… విధి నిర్వహణలోనే ఎంతో మంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు అంగవైకల్యం చెందుతున్నారు.

అటు కార్మికులకి ఎలాంటి సర్వీస్ బెనిఫిట్స్ లేవు… ఇటు బతుకుకు ఎలాంటి గ్యారెంటీ లేదు… ఇలా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో బ్రతుకుతున్నారు.

ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్నా… కనీస భరోసా కూడా లేకపోవడం నిజంగా బాధాకరం.

ఇన్ని కష్టాలు భరిస్తూ కూడా ప్రభుత్వాన్ని కారకులు కోరుకునేది ఏంటో తెలుసా!

మా ఆర్టిసన్ కార్మికుల్లో B.Tech, డిప్లొమా, PGలు చేసినవాళ్లు కూడా ఉన్నారు. అయినా సరే వారికి సరైన కేడర్ లేకుండా, గౌరవం లేకుండా పని చేస్తున్నారు.

వారిని కూడా గౌరవించి, సమాలోచన చేసి, తగిన చర్యలు తీసుకోవాలని, కనీసం మాకు ప్రభుత్వం పాత సర్వీస్ రూల్స్ అమలు చేసి, మా జీవితాల్లో వెలుగులు నింపండని ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి

 ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి


మనిషి జీవితంలో విజయాన్ని సాధించడానికి అత్యంత ముఖ్యమైనది సంకల్పం. సంకల్పం అంటే కేవలం కలలు కనడం కాదు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనసులో దృఢమైన లక్ష్యం పెట్టుకుని, దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయడం. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడమే నిజమైన సంకల్పం.

సంకల్పం ఉన్న వ్యక్తి తాను పయనించే మార్గంలో ఎదురయ్యే కష్టాలు, సమస్యలు చూసి భయపడడు. వాటిని ఓటమిగా భావించకుండా, అవి తనను మరింత బలంగా మార్చే అవకాశాలుగా భావిస్తాడు. అడ్డంకులను అవకాశాలుగా మలుచుకొని, ధైర్యంగా ముందుకు సాగుతూ చివరకు తన లక్ష్యాన్ని చేరుకుంటాడు.

ప్రపంచంలో ఎన్నో గొప్ప విజయాలు సంకల్పం వల్లే సాధ్యమయ్యాయి. దీనికి చక్కటి ఉదాహరణగా ఈశ్వరీ పాండే ను చెప్పవచ్చు. ఆమెకు కళ్ళు కనిపించకపోయినా (అంధురాలు), సముద్రంలో ఈదుతూ శ్రీలంక నుండి రామేశ్వరం వరకు ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది. సంకల్పం గట్టిగా ఉండాలే గానీ, అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయొచ్చు అని నిరూపించింది.

నాగపూర్‌కు చెందిన కమలేష్ మరియు అరుణ పాండే దంపతుల కుమార్తె ఈశ్వరీ పాండే. ఆమె పుట్టుకతోనే అంధురాలైనప్పటికీ, చిన్న వయసు నుంచే ఆమెలో ఉన్న పట్టుదల, ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఈతలో ప్రోత్సహించారు. 10 సంవత్సరాల వయస్సు నుండి కోచ్ సంజయ్ పురుషోత్తమన్ పడ్వే వద్ద ఆమెకు శిక్షణ ప్రారంభమైంది.

మొదట్లో ఈత నేర్చుకోవడం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మరింత సవాళ్లు ఎదురైనప్పటికీ, నేర్చుకోవాలనే దృఢ సంకల్పంతో ఆమె కఠినమైన శిక్షణను ధైర్యంగా ఎదుర్కొంది. క్రమంగా ఈతలో మెళుకువలు నేర్చుకుని అనేక పోటీలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించింది. కోచ్ మార్గదర్శకత్వం మరియు ప్రత్యేక శిక్షణ పద్ధతుల ద్వారా ఆమె ప్రతిభ రోజురోజుకు మెరుగుపడింది.

అంకితభావం, క్రమశిక్షణతో కూడిన సాధన వల్ల ఆమె అనేక విజయాలను సాధించింది. అయినప్పటికీ, ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించాలన్నదే ఆమె ప్రధాన లక్ష్యంగా మారింది. అందుకోసం ఆమె అంతర్జాతీయ స్థాయి పోటీలపై దృష్టి సారించి, తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంది.

దృష్టి లోపం ఉన్న ఈతగాళ్లకు ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిథ్యం వహించాలనే లక్ష్యంతో, ఆమె అత్యంత కఠినమైన సవాల్‌ను స్వీకరించింది. శ్రీలంకలోని తలైమన్నార్ నుండి భారతదేశంలోని ధనుష్కోడి వరకు సుమారు 25 కిలోమీటర్ల దూరాన్ని సముద్రంలో ఈత కొట్టింది. బలమైన గాలులు, భారీ అలలు, వర్షం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ, ఆమె తెల్లవారుఝామున 4 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రతి 30 నిమిషాలకు ఆమె వేగాన్ని కొనసాగించడానికి కఠినమైన పోషక నియమావళిని ఆమెకు కోచ్ అందిస్తూ విజయం సాధించే దిశగా ప్రోత్సహించారు. ఆమె దాదాపు 11 గంటల 15 నిమిషాల పాటు ఎలాంటి విరామం లేకుండా ఈత కొట్టి, మధ్యాహ్నానికి ధనుష్కోడి తీరాన్ని విజయవంతంగా చేరుకుంది. అయితే ఆమె అంధురాలు అయినందున విజయం సాదించామనే విషయం తన కోచ్ చెప్పేంతవరకు కూడా ఆమెకు తెలియదంటే ఆమెకు సాధించాలనే పట్టుదల ఎంతగా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.  

ఇది కేవలం ఒక సాధారణ విజయంగా మాత్రమే చూడకుండా ఆమె సంకల్పం, అచంచల ధైర్యం, మరియు కఠినమైన శిక్షణకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఇలాంటి సంక్లిష్టమైన  సవాల్‌ను పూర్తి చేసిన అంధ ఈతగాళ్లలో ఈశ్వరీ పాండే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
 
ఈశ్వరి సాధించిన ఈ ఘన విజయంతో ఆమె స్వస్థలం నాగపూర్ నగరం గర్వంతో స్పందించింది. భారీ ర్యాలీ, బాణాసంచా ప్రదర్శనల మధ్య ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఓపెన్ జీప్‌లో ప్రారంభమైన ఈశ్వరీ విక్టరీ పరేడ్‌లో భాగంగా, దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (IDCPe)కు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ స్క్వేర్ వద్ద డప్పులు మోగిస్తూ, రంగులు చల్లుతూ, బాణాసంచా పేలుస్తూ ఆమెను గుర్రంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ వేడుక అంతటా ఉత్సాహం, ఆనందం, గర్వభావం వెల్లివిరిసింది.

మొదట్లో ఈశ్వరి ఈత నేర్చుకునే సమయంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంది. అయినప్పటికీ నేర్చుకోవాలనే దృఢ సంకల్పంతో, ఓపికగా సాధన చేస్తూ ముందుకు సాగింది. ప్రపంచ విజేతగా గుర్తింపు పొందడానికి ఆమెకు దాదాపు 7 సంవత్సరాల సమయం పట్టింది.

నేటి యువత ఈశ్వరి పాండే జీవితాన్ని ప్రేరణగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టుదల లేకుండా వెంటనే ఫలితం రావాలని తొందరపడటం, ఫలితం రాకపోతే నిరాశ చెందటం, ఇవే యువతలో కుంగుబాటుకు ప్రధాన కారణాలు.

ఒక రైతు పంట పండించాలంటే నేలను దున్ని, విత్తనం వేసి, నారు పోసి, నీళ్లు పోసి, పురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంట పక్వానికి వచ్చేదాకా ఓపికగా ఎదురుచూడాలి. అప్పుడు మాత్రమే పంట చేతికి వస్తుంది.

అలాగే, జీవితంలో కూడా సరైన ప్రణాళిక, నిబద్ధతతో కూడిన ప్రయత్నం, క్రమశిక్షణగల జీవనశైలి మన విజయానికి దారి తీస్తాయి. ఎంత కష్టపడ్డా అనుకున్న ఫలితం రాకపోతే, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మళ్లీ ప్రయత్నించాలి. నిరాశకు తావివ్వకుండా ముందుకు సాగడమే నిజమైన విజయం.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

5, ఏప్రిల్ 2026, ఆదివారం

మూడో కన్ను" తెరిచినప్పుడు… కనిపించే సాహిత్య ప్రపంచం

 "*మూడో కన్ను" తెరిచినప్పుడు… కనిపించే సాహిత్య ప్రపంచం*!  


మూడో కన్ను తెరవగానే ప్రపంచం మొత్తం మన కళ్లముందే ప్రత్యేక్షమైనట్లు. మూసుకున్న కళ్లతో జీవితం చూడగలమని భావించడం ఒక అపోహ మాత్రమే. ఆ అపోహల పొరలు తొలగినప్పుడే నిజమైన ప్రపంచం మనకు కనిపిస్తుంది. చూడటానికి రెండు కళ్లే సరిపోవు; నిజాన్ని గ్రహించడానికి జ్ఞానం అనే మూడో కన్ను అవసరం.

అదే భావాన్ని గుర్తు చేసేలా ముక్కామల చక్రధర్ గారి “మూడో కన్ను” ఒక మేల్కొలుపు స్వరం. ఆయన విశ్లేషణలు మనం గమనించని అనేక విషయాలను ఒక్కసారిగా వెలుగులోకి తీసుకొస్తాయి. సాధారణంగా మన కళ్లకు కనిపించని కోణాలను ఆయన స్పష్టంగా చూపిస్తారు. ఇప్పటివరకు మనకు తెలియని నిజాలు నెమలి పురివిప్పి నాట్యం చేసినట్లు ఒక్కసారిగా మన కళ్లముందు విరబూస్తాయి. నెమలి నాట్యం చూసినప్పుడు మన కళ్లకు కలిగే ఆకర్షణ ఎంత మధురమో, “మూడో కన్ను” వ్యాసాలు చదివినప్పుడు మన ఆలోచనలకు కలిగే ఆకర్షణ కూడా అంతే గాఢంగా ఉంటుంది.

సమాజంలో దాగి ఉన్న వాస్తవాలు, కాలగర్భంలో కనుమరుగైపోయిన కవులు, మనం అలవాటుగా చూసి మర్చిపోయిన సాహిత్య సత్యాలు, ఇవన్నీ ఆయన మూడో కన్ను తెరిచిన క్షణంలోనే మన ముందుకు వస్తాయి. ఆలోచించని విషయాలను ఆలోచింపజేయడం, ప్రశ్నించని విషయాలను ప్రశ్నింపజేయడం, కనిపించని వాస్తవాలను స్పష్టంగా చూపించడం. ఇదే నిజమైన మూడో కన్ను పని.

అందుకే మూడో కన్ను అంటే కోపం కాదు, వినాశనం కాదు. అది అవగాహన. అది జ్ఞానం. అది మేల్కొలుపు. ఆ కన్ను (పుస్తకం) తెరిచినప్పుడే మనం చూస్తున్న ప్రపంచం వెనుక దాగి ఉన్న అసలు ప్రపంచం మనకు అర్థమవుతుంది. 

“ఆయన ‘యాది’ ఎట్లా మరుస్తాం..?” ఈ వ్యాసం చదివిన తర్వాత సామల సదాశివ గారిని మరవడం అసాధ్యమే అనిపిస్తుంది. ఈ వ్యాసంలో ప్రస్తావించిన ఎన్నో విషయాలు చాలా మందికి తెలియనివే అని చెప్పాలి. ఉదాహరణకు, ఉర్దూ గజల్స్‌ను మొదటిసారిగా తెలుగువారికి పరిచయం చేసింది సదాశివ గారేనని మనలో ఎంతమందికి తెలుసు? అంతేకాదు, తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులు బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేడియో బృందంలో సదాశివ గారు కూడా కీలకంగా ఉన్నారని తెలిసినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏంటో  అర్థమవుతుంది.

ఇలాంటి మరెన్నో అరుదైన విషయాలను విపులంగా అక్షరీకరించడం చక్రధర్ గారికే సాధ్యమనే భావన కలుగుతుంది. ముఖ్యంగా సదాశివ గారు మరియు విశ్వనాథ సత్యనారాయణ గారి మధ్య జరిగిన ఒక సందర్భాన్ని ఆయన ఎంతో చక్కగా , హృద్యంగా వివరించిన తీరు ఈ వ్యాసానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వ్యాసం చదివిన తరువాతే ఆ ఇద్దరు మహనీయుల మధ్య ఉన్న ఆత్మీయత, ఆలోచనా లోతు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 

“తెలంగాణ తామర పువ్వు దాశరధి” అనే వ్యాసం చదివినప్పుడు నాకు తెలియని ఎన్నో విషయాలు తెలిసి ఆశ్చర్యపోయిన సందర్భం. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అంటూ తెలంగాణ గర్వాన్ని గీతంగా పలికించిన దాశరథి కేవలం విప్లవ కవియే కాదు; భక్తి గీతాలను కూడా అంతే అలవోకగా రాయగల అరుదైన ప్రతిభ కలిగిన మహాకవి అని ఈ వ్యాసం స్పష్టంగా తెలియజేస్తుంది.

విప్లవ స్వరంతో సమాజాన్ని మేల్కొలిపిన కవి, భక్తి భావంతో హృదయాలను కదిలించిన కవి—ఈ రెండు పరస్పర విభిన్నమైన ధోరణులను సమానంగా మిళితం చేసి తెలంగాణ సాహిత్యంలో ఒక శక్తిగా ఎదిగిన దాశరథి వ్యక్తిత్వాన్ని చక్రధర్ గారు ఎంతో హృద్యంగా, విశ్లేషణాత్మకంగా వివరించారు.

ఆయన రచనలు దాశరథి కేవలం ఒక కవి కాదు; తెలంగాణ ఆత్మను పలికించిన స్వరం అనే భావన స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. 

 కవిత్వంలో ఒక ప్రత్యేక ప్రయోగం గా నిలిచిన "ముక్త పద గ్రస్తం" దాశరథి గారు పాట రూపంలో వినియోగించిన తీరు ఎంత అద్భుతమో ఈ వ్యాసం చదివినప్పుడు మరింత స్పష్టమవుతుంది. నిజానికి ముక్త పద గ్రస్తం అనే అలంకార శైలిపై ఈ కాలం వారికి అంతగా పరిచయం లేకపోయినా, దాశరథి కవిత్వంలో అది ఎలా ఒదిగిపోయిందో ఎంతో హృద్యంగా వివరించారు. అలాంటి అరుదైన సాహిత్యాంశాలను ఈ వ్యాసంలో పొందుపరచడమే కాకుండా, వాటిని సామాన్య పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అందించడం నిజంగా ప్రశంసనీయం.

చక్రధర్ గారు రచించిన “కూసుమంచి అగ్రహారం నుంచి మూడో కన్ను వరకు” వంటి రచనలు చదివినప్పుడల్లా ఆయన సాహిత్య దృష్టి ఎంత విశాలమో అనిపిస్తుంది. ఆయన రచనల పట్ల నాకు కూడా అపారమైన అభిమానం ఉందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు.

“పూల పాటల పండుగ బతుకమ్మ”
తెలంగాణ ఆత్మను పలికించే ఆడబిడ్డ ల ఆనందోత్సవం.
తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ ఆట పాటలు కేవలం పండుగ సంబరాలు మాత్రమే కాదు, ఉద్యమానికి ఊపిరి పోసిన శక్తి గా మారాయి. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి పాడిన పాటలు ఉద్యమానికి ధైర్యాన్ని, ఆశను నింపాయి. ఆ పూల మధ్య పుట్టిన గానమూ, ఆత్మగౌరవం కోసం ఎగిసిన నినాదం కలిసి తెలంగాణ ఆత్మను ప్రపంచానికి చాటి చెప్పాయి.

అందుకే ఉద్యమ సమయంలో బతుకమ్మ ఆటపాటలతో ఉద్యమానికి ఊపిరినందించిన ఆ క్షణాలు ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టంగా నిలిచాయంటారు రచయిత  ముక్కామల చక్రధర్ గారు .

“దిగంబర కవితో కొన్ని గంటలు” అనే వ్యాసం చదువుతుంటే అది కేవలం ఒక రచనగా కాకుండా, మనసులో నిద్రపోయిన జ్ఞాపకాలను మెల్లగా మేల్కొలిపే అనుభూతిగా అనిపిస్తుంది. ఒక మంచి వ్యాసం పాఠకుడిని తన జీవితంలోని చిన్న చిన్న సంఘటనల వద్దకు తీసుకెళ్తేనే అది సార్థకమవుతుంది. ఈ వ్యాసం కూడా అచ్చం అలాంటి అనుభూతిని కలిగిస్తుంది.

ఈ వ్యాసం చదువుతున్నప్పుడు నా చిన్నప్పటి జ్ఞాపకాలు కళ్లముందు తిరిగాయి. చిన్నప్పుడు మా ఇంటికి అమ్మమ్మ, తాత వచ్చేవారు. వాళ్లు వచ్చిన రోజుల్లో ఇంటి అంతా ఒక ప్రత్యేకమైన ఆనందంతో నిండిపోయేది. కానీ వారు మరుసటి రోజు వెళ్తారని తెలిసిన క్షణం మనసులో ఒక విచిత్రమైన బాధ కలిగేది. “ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండును” అనే ఆలోచన సహజంగానే మనసులో మెదిలేది.

అప్పుడు చిన్న పిల్లల అమాయకత్వంతో ఎన్నో చిన్న చిన్న ప్లాన్లు వేసేవాళ్లం. వాళ్లు వెళ్లే ముందు వారి బ్యాగ్ దాచిపెడితే, అది దొరకక ఇంకో రోజు అయినా ఉండిపోతారేమో అనే బాల్యపు ఊహలు మనసులో మెదిలేవి. ఆ చిన్న ప్రయత్నాల వెనుక దాగి ఉండేది ప్రేమ మాత్రమే.

అలాగే ఈ వ్యాసంలో కూడా దిగంబర కవి నగ్నముని తో గడిపిన ఆ కొన్ని గంటలు రచయితకు ఎంతో విలువైనవి గా అనిపిస్తాయి. నవ్వుతూ, మాట్లాడుకుంటూ గడిపిన ఆ క్షణాలు తక్కువ సమయం అయినప్పటికీ హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకాలుగా మారాయి. మనకు ఇష్టమైన వారితో గడిపిన సమయం ఎప్పుడూ చాలదనే భావన ఈ వ్యాసంలో స్పష్టంగా కనిపిస్తుంది.

అంతిమంగా ఈ వ్యాసం మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తుంది—
మన జీవితంలో గొప్ప జ్ఞాపకాలు పెద్ద సంఘటనల వల్ల కాకుండా, ఇలాంటి చిన్న చిన్న అనుభూతుల వల్ల ఏర్పడతాయి. అవి గడిచిపోయినా, మనసులో మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి.

“మూడో కన్ను”లోని అన్ని వ్యాసాలు అద్భుతమే. ప్రతి వ్యాసానికి తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైన అనుభూతి ఉంది. ఇక్కడ నేను కొన్ని వ్యాసాల గురించి మాత్రమే ప్రస్తావించాను. ఎందుకంటే ప్రతి వ్యాసం గురించి నేనే పూర్తిగా చెబితే, మీరు చదివే ఆసక్తి తగ్గిపోతుంది. ఈ రచనల అసలు రుచిని తెలుసుకోవాలంటే మీరు స్వయంగా చదవాలి. అందుకే మీరందరూ ‘మూడో కన్ను’ను తప్పక చదవాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యాసాల లోతు, భావం, అందం నిజంగా అనుభూతి అవుతుంది.”

ప్రతి వారం విశాలాంధ్రలో వెలువడే ఆయన కాలమ్ చదవని రోజు లేదనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కూచిమంచి అగ్రహారం నుంచి “మూడో కన్ను” వరకు ఆయన రాసిన వ్యాసాల్లో నేను చదవని దాదాపు ఒక్కటీ లేదు. ఆయన నుంచి ఎప్పుడు వాట్సాప్ సందేశం వస్తుందా అని ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ ఆ ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు అనుకోవచ్చు.

ముక్కామల గారి “మూడో కన్ను” నిజంగా అదిరిపోయింది. ఆలోచింపజేసే దృష్టి, ప్రత్యేకమైన శైలి, మనసును తాకే భావాలతో ప్రతి వ్యాసం నిలిచిపోతుంది. ఇక ఆయన “నాలుగో కన్ను” ఎప్పుడు తెరుస్తారో అని ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే.


వ్యాసకర్త 
కోట దామోదర్ 
మొబైల్: 9391480475

దేశ చరిత్రలో తొలి కారుణ్య మరణం:

 దేశ చరిత్రలో తొలి కారుణ్య మరణం:


జీవితం అనేది ఆశలతో నిండిన ప్రయాణం. ప్రతి తల్లి తండ్రి తన పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని కలలు కంటారు. కానీ కొన్నిసార్లు విధి మనుషుల మనసును పిండేసే పరిస్థితులను తీసుకొస్తుంది. అలాంటి హృదయ విదారక సంఘటనల్లో ఒకటి కారుణ్య మరణం.

తన కన్న బిడ్డ కోసం ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు… ఏకంగా పదమూడు సంవత్సరాలు ఆశతో ఎదురు చూసిన తల్లిదండ్రులు. తమ బిడ్డ ఎప్పుడో ఒక రోజు కోలుకుని మళ్లీ నవ్వుతాడనే నమ్మకంతో కాలాన్ని గడిపారు. కానీ కాలక్రమేణా వైద్యులు చెప్పిన నిజం వారి ఆశలను మెల్లగా చెదరగొట్టింది. ఇక ఆ బిడ్డ కోలుకునే అవకాశం లేదని.

ఆ సమయంలో తల్లిదండ్రుల మనసులో ఒకే ప్రశ్న మెదిలింది:
“మేము ఉన్నంతవరకు మా బిడ్డను చూసుకుంటాం… కానీ మేము లేని తర్వాత అతన్ని చూసుకునేది ఎవరు?”

జీవచ్ఛవంలా బతుకుతున్న హరీష్ రానా కు కారుణ్య మరణం అనుమతించాలని కన్న తల్లిదండ్రులే 2011లో Supreme Court of India ను ఆశ్రయించారు. ఈ కేసును వైద్య నిపుణుల బృందం సంవత్సరాల పాటు క్షుణ్ణంగా పరిశీలించింది. రోగి పరిస్థితి, వైద్య నివేదికలు, కుటుంబ సభ్యుల వాదనలు అన్నింటినీ విశ్లేషించిన తర్వాత కోర్టు తుది నిర్ణయం తీసుకుంది.

చివరకు 2026 మార్చి 16న కారుణ్య మరణానికి అనుమతి లభించింది. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి దేశవ్యాప్తంగా ప్రజలను కదిలించింది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పించేంత భావోద్వేగం ఉంది.

తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఇప్పటివరకు లైఫ్ సపోర్ట్ ద్వారా బతికిస్తున్న వైద్యులకే ఆ లైఫ్ సపోర్ట్‌ను తొలగించాలని ఆదేశించింది. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డకు చివరిసారిగా తుది వీడ్కోలు పలికారు.

ఆ సమయంలో ఆధ్యాత్మిక ధైర్యం ఇచ్చేందుకు Brahma Kumaris సంస్థకు చెందిన ఒక సోదరి,
“అందరినీ క్షమించు… ఇక వెళ్లాల్సిన సమయం వచ్చింది” అని చెప్పిన మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది.

భారతదేశంలో కారుణ్య మరణంపై చట్టపరమైన చర్చకు మార్గం చూపిన ప్రముఖ కేసు  అరుణ శాన్‌బాగ్ కేసు. ఈ కేసు ఆధారంగా 2011లో సుప్రీంకోర్టు పాసివ్ యూతనేషియాను కొన్ని కఠిన నిబంధనలతో అనుమతించింది. అంటే కోలుకునే అవకాశం లేని రోగికి కుటుంబ సభ్యులు, వైద్యులు, హాస్పిటల్ కమిటీ మరియు కోర్టు అనుమతితో మాత్రమే లైఫ్ సపోర్ట్ తొలగించవచ్చు.

తర్వాత 2018లో సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చి “లివింగ్ విల్” అనే విధానానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చింది. లివింగ్ విల్ అంటే ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యం తో స్పృహ కోల్పోయినప్పుడు లేదా కోలుకునే అవకాశం లేకపోయినప్పుడు, తనకు కృత్రిమంగా జీవితం పొడిగించే చికిత్సలు చేయకూడదని ముందుగానే రాసి పెట్టిన చట్టబద్ధ ప్రకటన.

ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, రోగి పట్ల కుటుంబ సభ్యులు బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా చేయడం, అలాగే రోగి స్వంత అభిప్రాయాన్ని గౌరవించడం. అదే సమయంలో అనవసరమైన బాధను తగ్గించడం కూడా.

ఇప్పటివరకు భారతదేశంలో కారుణ్య మరణం పూర్తిగా స్వేచ్ఛగా అనుమతించబడలేదు. కేవలం కఠిన నిబంధనల మధ్య పాసివ్ యూతనేషియా మాత్రమే అనుమతించబడుతోంది. అయినప్పటికీ, ఈ సంఘటన మానవత్వం, చట్టం, వైద్యం — ఈ మూడింటి మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని మనకు గుర్తు చేస్తుంది.

ఎవరు అరుణ శాన్‌బాగ్?

అరుణ శాన్‌బాగ్ భారతదేశంలో కారుణ్య మరణం (Euthanasia) గురించి చట్టపరమైన చర్చకు మార్గం చూపిన వ్యక్తి. ఆమె ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ (KEM Hospital)లో నర్స్‌గా పనిచేసేవారు.

1973లో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక వార్డ్ బాయ్ ఆమెపై క్రూరంగా దాడి చేయడం వల్ల ఆమె మెదడుకు తీవ్ర గాయం జరిగి కోమా లాంటి స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ ఘటన తర్వాత ఆమె పూర్తిగా కోలుకోకపోయినా, చాలా సంవత్సరాలు జీవచ్ఛవంలా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ జీవించారు.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 2011లో రచయిత్రి పింకీ విరాని, అరుణ శాన్‌బాగ్ తరఫున సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెకు కారుణ్య మరణం (Euthanasia) ఇవ్వాలని కోర్టును కోరారు.

అయితే సుప్రీంకోర్టు అరుణ శాన్‌బాగ్‌కు కారుణ్య మరణాన్ని అనుమతించలేదు. అయినప్పటికీ ఈ కేసు భారతదేశంలో ఒక కీలక మలుపు గా నిలిచింది. ఈ తీర్పు ద్వారా కోర్టు కొన్ని కఠిన నిబంధనలతో పాసివ్ యూతనేషియా (Passive Euthanasia) ను అనుమతించింది.

అరుణ శాన్‌బాగ్ దాదాపు 42 సంవత్సరాలు ఆసుపత్రిలోనే జీవించారు. చివరకు 2015లో ఆమె మరణించారు.

ఈ కేసు భారతదేశంలో కారుణ్య మరణంపై చట్టపరమైన మార్పులకు దారితీసిన ఒక చారిత్రక కేసు గా గుర్తింపు పొందింది.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

సంగీతం – మనసును తాకే శక్తి

 ఒకరోజు సాయంత్రం. ఇంటి ముందున్న ఆరుబయట చల్లని గాలిలో తాతయ్య, మనవడు ఇద్దరు కూర్చుని సరదాగా ముచ్చటించుకుంటున్నారు. ఆకాశం నారింజ రంగులో మెరుస్తోంది. పక్షులు గూటికి తిరిగి వెళ్తున్నాయి. ఆ నిశ్శబ్దంలో మనవడికి ఒక్కసారిగా ఒక ప్రశ్న వచ్చింది.


“తాతయ్య… మీరు దేనిని ఎక్కువగా ఇష్టపడతారు?” అని అమాయకంగా అడిగాడు.

తాతయ్య చిరునవ్వు చిందిస్తూ,
“మనవడా… నాకు సంగీతం చాలా ఇష్టం” అని సమాధానం చెప్పాడు.

మనవడికి మాత్రం ఆ మాట పూర్తిగా అర్థం కాలేదు. కొద్దిసేపు ఆలోచించి మళ్లీ అడిగాడు.

“తాతయ్య… సంగీతాన్ని ఎందుకు అంతగా ఇష్టపడతారు? సంగీతం వింటే ఏమవుతుంది?”

తాతయ్య కొద్దిసేపు ఆకాశం వైపు చూసి మెల్లగా అన్నాడు:
“మనవడా… సంగీతానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అది మనిషిని భూమి నుండి స్వర్గానికి తీసుకెళ్లగలదు, స్వర్గం నుండి మళ్లీ భూమికి తీసుకురాగలదు.”

మనవడు ఆశ్చర్యపోయాడు.
“అది ఎలా తాతయ్య? భూమి నుండి స్వర్గానికి ఎలా తీసుకెళ్తుంది?” అని మళ్లీ ప్రశ్నించాడు.

తాతయ్య నవ్వుతూ చెప్పాడు:
“ఒరేయ్ మనవడా… సంగీతం వింటుంటే మనసు ఎంత ఉల్లాసంగా మారుతుందో గమనించావా? మంచి పాట వింటే మనం కూడా ఆ పాటలోని పాత్రలతో కలిసి జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. బాధతో కూడిన పాట వింటే మనకూ బాధ కలుగుతుంది. సంతోషకరమైన పాట వింటే మన హృదయం కూడా ఆనందంతో నిండిపోతుంది. అంటే సంగీతం మన భావాలను మార్చగలదు. అందుకే నేను అది స్వర్గానికి తీసుకెళ్తుందని చెప్పాను.”

మనవడు ఆసక్తిగా వింటూ తల ఊపాడు.
ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగాడు. తాతయ్య ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పాడు.

చివరికి మనవడు మరో ప్రశ్న వేసాడు.

“తాతయ్య… ఈ శక్తి సంగీతానికి మాత్రమే ఉందా? ఇంకేమైనా ఉందా?”

తాతయ్య కొద్దిసేపు ఆలోచించి నవ్వుతూ అన్నాడు:
“అవును మనవడా… ఇంకొకటి కూడా ఉంది.”

“ఏంటి తాతయ్య?” అని మనవడు ఆసక్తిగా అడిగాడు.

“అదే రా బాబు… బడి గంట!”

మనవడు ఆశ్చర్యపోయాడు.
“బడి గంటకా? దానికి ఏ శక్తి ఉంటుంది తాతయ్య?”

తాతయ్య నవ్వుతూ చెప్పాడు:
“నువ్వు పొద్దున్నే స్కూల్‌కి వెళ్లినప్పుడు బడి గంట మోగితే నీకు కొంచెం బాధగా అనిపిస్తుంది కదా? క్లాస్ మొదలవుతుందని. కానీ అదే గంట సాయంత్రం మోగితే ఎంత సంతోషంగా అనిపిస్తుంది! ఇంటికి వెళ్లొచ్చని.”

“అదే శబ్దం… కానీ మన భావాలు మాత్రం మారిపోతాయి. మన పరిస్థితి బట్టి మనసు స్పందిస్తుంది. సంగీతం కూడా అలాగే మన భావాలను తాకుతుంది.”

మనవడు కాసేపు ఆలోచించి చిరునవ్వుతో అన్నాడు:
“ఓహ్… అలానా తాతయ్య”!

తాతయ్య తల నిమిరి,
“అవును మనవడా… ఈ ప్రపంచంలో కొన్ని శబ్దాలు మనసును నడిపిస్తాయి. సంగీతం వాటిలో మొదటిది” అని ప్రేమగా చెప్పాడు.

ఆ సాయంత్రం గాలి మధ్య తాతయ్య చెప్పిన ఆ మాటలు మనవడి మనసులో మధురమైన సంగీతంలా మిగిలిపోయాయి.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

complete vs finish

  ఒక సాయంత్రం ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు భార్యకు ఒక్కసారిగా ఒక సందేహం వచ్చింది. భర్త దగ్గరకు వచ్చి అడిగింది. “ఏవండీ … ఒక విషయం అడ...