శత వసంతాల గురువు — శాశ్వత జ్ఞాన దీప్తి,
సప్తతి శిష్యుడు — సంస్కారాలకు సాక్షి…
ఆ పద్యం సాక్షాత్కారమై నిలిచిన క్షణం ఇది.
అదొక మారుమూల పల్లె గుమ్మడవెల్లిలో పుట్టి పెరిగిన ఉప్పునూతల మహేందర్ రెడ్డి, శ్రీరాంశెట్టి నరసింహారావు కాలగమనంలో కృషి, కట్టుదిట్టమైన ప్రణాళిక, నిబద్ధతతో ఎదుగుతూ, చివరికి ఒకరు పోలీస్ శాఖలో , మరొకరు విద్యాశాఖలో ఉన్నత అధికారులుగా వెలుగొందారు. సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించిన వారు గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ పొందినా, పదవులు మారినా, గురువు పట్ల వారి అంకితభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
ఒక రోజు సాధారణంగా మా మధ్య ప్రారంభమైన సంభాషణ, అనూహ్యంగా వారిని గత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది.
“మా గురువు రాజారామ్ శాస్త్రి గారు మాకు చదువు ఎంత బాగా చెప్పేవారో… అందుకే మేము ఈ స్థాయికి చేరుకున్నాం,” అని వారు గర్వంతో, కృతజ్ఞతతో చెప్పారు. ఆ మాటల్లో శిష్యుల హృదయంలో గురువుపై నాటుకుపోయిన గౌరవం, అపారమైన ప్రేమ ప్రతిబింబించింది.
ఆ మాట విన్న నేను వెంటనే స్పందించాను.
“సర్, రాజారామ్ శాస్త్రి గారు ఇప్పటికీ హైద్రాబాదులోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన వయసు 97 సంవత్సరాలు,” అన్నాను.
అది విన్న వెంటనే మహేందర్ రెడ్డి గారి కళ్లలో ఆశ్చర్యం మెరిపించింది.
“అవునా! అయితే తప్పకుండా కలవాలి. మనం ఒక రోజు వెళ్దాం,” అని ఆయన ఉత్సాహంగా అన్నారు.
రోజులు గడిచాయి. వారు ఎప్పటిలాగే బిజీగానే ఉన్నా, గురువును కలవాలనే కోరిక మాత్రం మరింత బలపడింది. చివరకు ఈ రోజు సమయం కేటాయించారు.నేను, మహేందర్ రెడ్డి గారు, శ్రీరాంశెట్టి నరసింహారావు గార్లతో కలిసి, ఆ జ్ఞాపకాల నడకలో మునిగిపోతూ, రాజారామ్ శాస్త్రి గారి ఇంటి ముందుకు చేరుకున్నాం. ఆ గుమ్మం ముందు నిలిచిన క్షణం… కాలమే ఒక్కసారి వెనక్కి తిరిగినట్లనిపించింది.
ఇంటి ముందర ప్రశాంతంగా కూర్చొని ఉన్న శతాధిక వయస్సు గల రాజారామ్ శాస్త్రి గారు… పురోహిత్యంలో అపార అనుభవం కలిగిన మహా పండితులు . “మనిషికి స్నానం కన్నా ధ్యానం మిన్న… ఆరోగ్యమే మహాభాగ్యం” అని విద్యార్థులకు పదే పదే బోధిస్తూ, వారిని సన్మార్గంలో నడిపించిన గురుమార్గదర్శి.
అటువంటి గురువుని చూసిన మహేందర్ రెడ్డి, నరసింహారావు గారు నిశ్శబ్దంగా ముందుకు నడిచారు. హృదయం నిండా గౌరవం, కళ్లలో ఆనందం. వారు వినయంగా నమస్కరించారు.
“గురువుగారూ… మేము మీ విద్యార్థులం,” అని పలకరించారు.
కొన్ని క్షణాలు గురువు గారు వారిని గమనించారు. తర్వాత చిరునవ్వుతో,
“నువ్వేనా… మహేందర్?” అని అడిగిన ఆ ఒక్క మాటతోనే కాలం కరిగిపోయింది.
ఆ క్షణం… కాలం దాటుకుని కలిసిన ఆ అనుబంధం.
జీవితాంతం నిలిచే మధుర స్మరణగా ఆ క్షణం నిలిచిపోయింది.
మహేందర్ రెడ్డి గారి కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి.
నర్సింహారావు గారికి గురువును చూసిన ఆనందం హృదయంలో విల్లువిరిసింది.
“మీరు మాకు అందించిన విద్యా, విలువలే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయి గురువుగారూ,” అని వారు వినయపూర్వకంగా అన్నారు.
ఒకరు ఉన్నత పోలీస్ అధికారిగా, మరొకరు మండల విద్యా అధికారిగా ఉద్యోగ విరమణ పొందిన వారు—
కానీ ఆ క్షణంలో వారు పదవులు కాదు…
గురువు ముందు నిలిచిన సాధారణ శిష్యులే.
గురువు ఉద్యోగ విరమణ పొందినవారే…
శిష్యులు కూడా ఉద్యోగ విరమణ పొందిన వారే…
ఈ యాదృచ్ఛికం కాదు—కాలమే రాసిన ఒక అద్భుతమైన అనుబంధ గాథ.
ఒకప్పుడు వారి ముందు నిలబడి అక్షరాలను నేర్పిన గురువు…
ఇప్పుడు కాలపు ప్రయాణంలో నెమ్మదిగా నడుస్తున్న వృద్ధుడిగా మారిపోయినా,
ఆయన చూపిన మార్గం మాత్రం శాశ్వతంగా వెలుగుతోంది.
ఆ గురువు చేతిలో అక్షరాభ్యాసం నేర్చుకున్న శిష్యులు…
జీవితంలో ఎన్నో శిఖరాలు అధిరోహించి,
సేవా మార్గంలో వెలుగులు నింపి, చివరికి తామూ విశ్రాంతి దశలోకి చేరుకున్నారు.
కానీ ఆ క్షణంలో కాలం గీసిన వయస్సు గీతలు, పదవుల ప్రతిష్ఠలు అన్నీ చెరిగిపోయాయి, మిగిలింది ఒక్కటే గురువు, శిష్యుల మధ్య ఉన్న బంధం.
✍️
కోట దామోదర్
మొబైల్ : 9391480475
