30, జూన్ 2023, శుక్రవారం

ambulance

కోట్ల రూపాయల ఆస్తులున్న ఆయుష్షును పెంచుకోలేమనేది జగమెరిగిన సత్యం. అందుకే మన పూర్వికులు ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యంలేదనడంలో అతిశయోక్తిలేదు.

"వైద్యో నారాయణో హరి" వైద్యుడు దేవుడితో సమానమని మనందరికీ తెలుసు. ప్రాణాపాయంలో ఉన్న వారిని రక్షించే వారు కూడా దేవుడితో సమానం అనడంలో సందేహం లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వెంటనే సరైన వైద్యం అందిస్తే బతికే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు మన దేశంలో తొలిసారిగా 1984లో అత్యవసర వైద్య సేవలు (అంబులెన్స్ సేవలు) ప్రారంభించారు.



25, జూన్ 2023, ఆదివారం

రాజారామ్ శాస్త్రి:

వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు

వృద్ధాప్యం మానవ జీవితంలోని దశలలో ఒకటి. ఈ వృద్ధాప్య దశలో మానవ శరీరం అనేక శారీరక మరియు మానసిక మార్పులకు లోనవుతుంది మరియు గత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. వృద్ధాప్యం అనేది అపారమైన అనుభవాలతో నిండిన జీవితం. వారు చెప్పే ప్రతి మాట నిజమని పెద్దలు అనుభవపూర్వకంగా చెబుతారు. అందుకే "పెద్దల మాట చద్దన్నం మూట" అనే నానుడి పుట్టింది.


మన దైనందిన జీవితంలో చాలామంది 60 యేండ్లు నిండకముందే అనేక వ్యాధులతో పోరాడుతూ వారి శరీరం ఏ పని చేయడానికి కూడా సహకరించలేనటువంటి పరిస్థితులను చూస్తూనే ఉంటాము. మానసిక స్థైర్యం మానసిక సమతుల్యత ను దెబ్బతీసి శారీరక, మానసిక సమస్యల తీవ్రతను పెంచడమే దీనికి కారణం. అంతేకాకుండా మానసిక స్థైర్యం ఉన్నవారు వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పని చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నవారు తారసపడుతుంటారు. బహుశా అలాంటి వారిని చూసే " వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు" అనే నానుడి పుట్టుకొచ్చిందనిపిస్తుంది. అలాంటి స్ఫూర్తిదాయకమైన 91 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు, వేద పండితులు రాజారామ్ శాస్త్రి యదార్ధ జీవిత కథ. 

జననం, విద్యాభ్యాసం:

సూర్యాపేట జిల్లాలోని మిర్యాల అనే మారుమూల గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో సుబ్బయ్య శాస్త్రి, లక్ష్మి భాగ్యమ్మ దంపతులకు 06-10-1932  న జన్మించారు.. అయన తండ్రి సుబ్బయ్య గారు ప్రముఖ వేదపండితులు. చుట్టుపక్కల గ్రామాలలో జరిగే శుభ కార్యాలన్నీ ఆయనే జరిపేవారు. రాజారామ్ శాస్త్రి గారు చదువుకునే రోజుల్లో పదవయేట అయన తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి తాను కూడా పురోహితం నేర్చుకొని తండ్రికి సహాయం అందించాలనే ఆలోచన కలిగింది. మొదటగా తన తండ్రి దగ్గర గాయత్రి మంత్ర శ్లోకాలతో ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే అన్ని కార్యాలను నిర్వహించే విధంగా వేద మంత్రాలు నేర్చుకోగలిగారు. గ్రామంలోని చిన్న చిన్న కార్యాలను నిర్వహిస్తూనే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. తీవ్రమైన ఏకాగ్రత, అంకితభావంతో చదువు ప్రారంభించి మంచి విద్యా ప్రతిభ ఉన్న విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు.

ఉద్యోగ ప్రస్థానం:

చదువుతోపాటు, పురోహితం లో మంచి నైపుణ్యం సంపాదించడమే గాక అయన 27 .04 .1954 న ప్రభుత్వ టీచర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొంతకాలం సూర్యాపేట మారుమూల గ్రామాలలో ఉద్యోగం చేసి బదిలీ అయిన తర్వాత గుమ్మడవెల్లి గ్రామానికి ప్రైమరీ స్కూల్ టీచర్ గా నియమితులైనారు. అప్పుడే గుమ్మడవెల్లి లో పాఠశాల ప్రారంభమైంది. అతి తక్కువ విద్యార్థులతో సాగుతున్న పాఠశాలకు రాజారాం సార్ రాకతో విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉపాధ్యాయులుగా విద్యార్థులకు పాఠాలే కాకుండా క్లాసురూం లో నవ్వులు పువ్వులు పూయించేవారు. ఆయన నోట పాఠాలే కాకుండా అప్పుడప్పుడు పాటలందుకునే  పాటల పూదోట రాజారామ్ శాస్త్రి. కచ్చితమైన సమయాన్ని పాటిస్తూ, మంత్రముగ్ధులను చేసే ఆయన బోధనకు ఆకర్షితులైన విద్యార్థులు ఆయన చెప్పే పాఠాలకు గైర్హాజర్ కారంటే అతిశయోక్తి కాదు. ఆయన బోధన తీరు ఓ అద్భుతం పాఠానికి తగ్గట్టుగా ఉదాహారణలతో బోధించేవారు. తన సబ్జెక్ట్ తెలుగు అయినప్పటికీ ఉపాధ్యాయుల కొరత కారణంగా ఇతర సబ్జెక్టులను కూడా బోధించేవారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజారామ్ శాస్త్రి గారు అందించిన శ్లాఘనీయమైన సేవలు గుమ్మడవెల్లి విద్యార్థులు ఎప్పటికి మరిచిపోలేనివి, మరుపురానివి. ఆయన వద్ద శిష్యరికం చేసిన విద్యార్థులంతా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. రాజారామ్ శాస్త్రి గారు 1990 సంవత్సరంలో గుమ్మడవెల్లి లో పదవి విరమణ పొందారు.

పురోహితం లో 80 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం: 

పదేళ్ల వయసులో తండ్రి వద్ద నేర్చుకున్న పురోహితం ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత కూడా జీవన ఉపాధి కోసం కొనసాగుతుండటం గొప్ప విషయం. అంతేకాదు 91 ఏళ్ల వయసులో 80 ఏళ్ల అర్చక అనుభవం కలిగి ఉండటం మరో గొప్ప విషయం. చుట్టుపక్కల గ్రామాల్లో పూజారులు లేకపోవడంతో ఆ గ్రామాల్లో జరిగే కార్యములన్నిటిని కూడా శాస్త్రి గారు నిర్వహిస్తారు. ఆయన చేతుల మీదుగా ఇప్పటి వరకు కొన్ని లక్షలకు పైగా వివాహాలు జరిగిపోయాయంటే అతిశయోక్తి కాదు.  గుమ్మడవెల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి పెళ్లి ఆయన చేతుల మీదుగా జరిగినవే. అంతేకాకుండా గుమ్మడవెల్లి లో ఉన్న ప్రతి కుటుంబంలో 1960 నాటి నుంచి ఇప్పటివరకు అన్ని కార్యాలు రాజారామ్ శాస్త్రి గారు నిర్వహిస్తుండటం ఒక సరికొత్త రికార్డు సృష్టించాడు. 91 ఏళ్ల వయసులో ఉన్న శాస్త్రి గారు ఇప్పటికీ స్వయంగా వంట, ఇంటి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు అన్నట్లుగా ఆయన ఇప్పటికి పూజలు నిర్వహించే కార్యక్రమాలలో వేద మంత్రాలు 2 గంటలకు పైగా ఆపకుండా చదివే శక్తి ఆయనకు ఉంది. జన్మనామం ప్రకారం భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయడంలో రాజారామ్ శాస్త్రి గారి తరువాతే ఎవరైనా కాబట్టి వాస్తు శాస్త్రం,జ్యోతిష్యం, ఆలస్య  వివాహాలు మరియు అనేక ఇతర సమస్యల పరిష్కారం కోసం పలు జిల్లాల నుంచి ప్రజలు అతనిని సంప్రదిస్తారు, ఇది అతని పనికి నిదర్శనం. ఆయన నిరుపేదల పట్ల దయ, కరుణ, ప్రేమ చూపే వ్యక్తి. అందుకే శాస్త్రి గారు పేదల కార్యక్రమాలకు వారి స్థాయికి తగ్గట్టుగా డబ్బులు తీసుకొని, కట్టలేని వారి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. పేదల పట్ల మానవత్వం చూపే గొప్ప మనసున్న వ్యక్తి. గుమ్మడవెల్లి గ్రామంలో జరిగే ప్రతి పండుగలో ప్రజలను మంత్రముగ్ధులను చేసే వేద మంత్రాలను పఠిస్తూ భక్తులకు వేద మంత్రాల అర్థాన్ని విపులంగా వివరిస్తారు. 

వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు:

వయసు శరీరానికే కానీ మనసుకు కాదు అని చెప్పే వాళ్ళని మనం చూశాం కానీ, వయసు శరీరానికి దూరం అన్నట్లుగా రాజారాం శాస్త్రి దినచర్య అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వృద్ధాప్యాన్ని జీవితంలో అత్యంత నీచమైన దశగా భావించి అసలు వాస్తవాన్ని గుర్తించలేని వారికి శాస్త్రి జీవితం ఆదర్శప్రాయం. ప్రతి మనిషికి సమస్యలు రావడం సహజమే అనడంలో సందేహం లేదు. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ఆలోచనే ఉత్తమమైన మార్గమని కొద్ది మందికి తెలుసు. మనం నిత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలపై అనవసర ఆలోచనల వల్ల అనారోగ్యానికి గురి కావడం చూస్తూనే ఉన్నాం. ఒక సందర్భంలో శాస్త్రి గారిని తన ఆరోగ్య రహస్యం గురించి అడిగినప్పుడు, అతను ఇలా సమాధానమిచ్చాడు. ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొనే దైర్యం మనలో ఉంటె ఏ శక్తి ఆపలేదు. ధైర్యంతో ముందడుగు వేసినపుడే నువ్వు ప్రపంచాన్ని జయించి గలుగుతావు అని అన్నారు ఆయన. ఉద్యోగం రాక ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఆయన మనోధైర్యాన్ని అందిస్తారు. 91 సంవత్సరాల శాస్త్రి గారు ఇప్పటికి పాఠ్య పుస్తకం లోని అంశాల గురించి చాలా చక్కగా వివరించడం గొప్ప విషయం. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఆయన అందించిన శ్లాఘనీయమైన వైద్యసేవలు మరువలేనివి. జీవితంలో ఏదైనా సాధించాలంటే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన మార్గంలో ముందుకు సాగాలని, లక్ష్య సాధనకు ఎలాంటి అడ్డంకులు ఉండవనేది ముమ్మాటికీ నిజం. రాజారామ్ శాస్త్రి గారి నిజ జీవితం ఎందరికో ఆదర్శం.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475



      

11, జూన్ 2023, ఆదివారం

అవరోధాలే అవకాశాలు

 అవరోధాలే అవకాశాలు


"అవరోధాలను అవకాశాలుగా మార్చుకుంటే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు" స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఎప్పటికీ నిజమే.

మనిషికి వైకల్యం వున్నా మనసుకు మాత్రం వైకల్యం ఉండకూడదు అంటారు. మానసిక దృఢత్వం ఉన్నవారు శారీరక వైకల్యాలను అధిగమించడమే గాక ఉన్నత ఉద్యోగాలు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన అంధురాలు పూర్ణ సుందరి ఐ ఏ ఎస్ యదార్థ జీవిత కథ తెలుసుకుందాం.


తమిళనాడు రాష్ట్రం, మదురై జిల్లా, మణినగరం ప్రాంతానికి చెందిన పూర్ణ సుందరి. ఆమె తండ్రి ఓ సాధారణ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగి, తల్లి హోమ్ మేకర్, పూర్ణ సుందరి పుట్టుకతోనే అంధురాలిగా జన్మించలేదు. ఆమె 5 సంవత్సరాల వరకు సాధారణ పిల్లల్లాగే చదువుకుంది, కానీ ఆ తర్వాత అనూహ్య కారణాల వల్ల ఆమె కంటి చూపు క్షీణించడం ప్రారంభించింది. పూర్ణ సుందరి  తల్లిదండ్రులు ఆమె చూపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేక ఆమె 5 సంవత్సరాల వయసులోనే చూపును కోల్పోయింది . కూతురు చూపు కోల్పోవడం పట్ల ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

అంధకారం అలుముకున్న తమ కూతురి జీవితాన్ని చూసి తల్లిదండ్రులు రోదించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయినా తల్లిదండ్రులు మనోస్థైర్యం తో బిడ్డను ధైర్యంగా ప్రోత్సహించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. అంధత్వం తన కూతురి చదువుకు ఆటంకం కలగకూడదని కన్నతల్లే స్వయంగా పుస్తకాలు చదివి వినిపిస్తుండగా విషయాలను ఆకళింపు చేసుకునేది. ఆమె తల్లి ఆలోచనకు అభినందనీయం. పూర్ణ సుందరి స్కూల్ నుండి కాలేజీ వరకు ఎన్నో అవరోధాలను ఎదుర్కొంది. అవరోధాలే అవకాశాలుగా మార్చుకొని చదువులో ఫస్ట్ ర్యాంకులు సాదించింది. సగాయం IAS అధికారి మరియు మాజీ ఐ ఏ ఎస్ ఉదయ చంద్రన్ ప్రేరణ పొందిన ఆమె ఇంటర్మీడియట్ లో ఉండగానే ఐ ఏ ఎస్ కావాలనే ఆలోచనకు బీజం పడింది. తమ కూతురు సామర్థ్యాన్ని నమ్మి తల్లిదండ్రులు ఆమెను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించారు. అంతేకాకుండా తోటి స్నేహితులు కూడా చదువుల్లో ఆమెకు అర్థం కాని పాఠాలను ఆడియో ద్వారా అందజేసేవారు. తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయుల సహకారంతో డిగ్రీ పూర్తి చేయగలిగింది. అయినప్పటికీ ఆమెకు ఐ ఏ ఎస్ కావాలనే కోరిక ప్రబలంగా ఉండేది. తన కలలను సహకారం చేసుకునేందుకు ఆమె మొదటి ప్రయత్నం చేసి UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయినా కూడా కలత చెందకుండా పూర్ణ సుందరి కఠినమైన ప్రయత్నంతో రెండోసారి కూడా విజయం సాధించలేకపోయింది. అయినా ఆమె పట్టుదలతో తన ఆకాంక్షను నెరవేర్చేందుకు మూడోసారి కూడా ప్రయత్నించి ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అంతటితో తన ప్రయత్నం ఆపకుండా తాను ప్రిపేర్ అయ్యే విధానంలో లోపాలు గమనించి లోతుపాతులు తెలుసుకొని తనకు తెలియని అంశాలను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటూ,అంతేకాక కంప్యూటర్ నుండి చదవడానికి ఆమె అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ (JAWS) సాఫ్ట్ వెర్ ఉపయోగించేది. కూతురిపై ఉన్న నమ్మకంతో ఎన్ని ప్రయాసలనైనా ఎదుర్కొని ఆమె కోరుకున్న పుస్తకాలను తండ్రి అందజేసేవారు. బ్రెయిలీ లిపి లో లేని పుస్తకాలను ఆమె తల్లి మరియు స్నేహితులు గంటల తరబడి వివిధ పుస్తకాలు చదివి వినిపించేవారు. యూట్యూబ్ లో లభించే ఆడియో పాఠాల సహాయంతో కఠోర దీక్షతో, నిరంతర కృషితో నాలుగోసారి ఉత్తీర్ణత సాధించగలిగింది. ఈ మహోత్కృష్ట యజ్ఞంలో ఆమెకు వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రుల కృషి అత్యంత శ్లాఘనీయం.  
   
అంధత్వంతో బాధపడుతున్నా చదువుకునేందుకు ఆటంకం కాదని అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుంటున్నారు. నేటి యువతకు సౌకర్యాలు ఉన్నా అందుబాటులో లేని వనరుల గురించి ఆలోచిస్తూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దైనందిన జీవితంలో సమస్యలు అందరికీ సాధారణమే అయినా వాటిని ఎదుర్కొనే శక్తి ఉన్నవారికే విజయం వరిస్తుందనడంలో అతిశయోక్తిలేదు.

అంధత్వం కారణంగా చాలా మంది ప్రతిభావంతులైన ఔత్సాహికులకు సివిల్ సర్వీసెస్‌లో చేరే అవకాశం లేకపోవడంతో గతంలో వారి కలలు సాకారం చేసుకునేందుకు అవకాశం లేదు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక చొరవ చూపి వంద శాతం అంధత్వం గలవారికి సివిల్ సర్వీసులో చేరే అవకాశాన్ని కల్పించడం కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో అంధుల కలలు సాకారమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

ఎన్నో అవరోధాలను అధిగమించి అంకుఠిత దీక్షతో విజయాన్ని సాధించిన పూర్ణ సుందరి ఐ ఏ ఎస్ నేటి అంగవికలురు యువతకు అద్భుత సందేశాన్ని అందించారు. అసాధ్యాలను సుసాధ్యం చేయాలంటే అంగవికలురు స్వీయం సానుభూతిని పక్కన పెట్టి అడ్డంకులను  అధిగమించాలి తప్ప అడ్డంకులు వచ్చాయని ఆగిపోయే ప్రయత్నం చేయకూడని, అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆశయ సాధనకు ప్రణాళిక రూపొందించుకోవాలి.

సామాన్య విద్యార్థులతో సమానంగా అంధులకు మెరుగైన విద్యనందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. అంతేకాకుండా, వారి విద్యకు తగిన బ్రెయిలీ పుస్తకాలు మరియు ఆడియో పాఠాలు అందుబాటులో ఉంచాలి. అంధుల విద్య బలోపేతానికి ప్రత్యేక బడ్జెట్ ని ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంధుల విద్య కోసం ప్రతి రాష్ట్రంలోనూ, జిల్లాలో ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి.

జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అవరోధాలుగా భావిస్తూ...

కొందరు ఉన్న చోటే ఉంటారు, అంటే ముందుకు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకుంటారు.

మరియు కొందరు వాటిని నివారించడానికి ప్రయత్నిస్తున్నారు.

కొంతమంది ఆ అడ్డంకిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు.

అధిగమించేవారు అవకాశాలను ఎదుర్కొంటారు, వారు అనుభవ సామర్థ్యాలతో నిండి ఉంటారు, ఈ ప్రక్రియలో వారు అనేక విలువలను అలవరచుకుంటారు, నైపుణ్యాలను నేర్చుకుంటారు, జీవిత విలువను తెలుసుకుంటారు మరియు ఇతరులకు మార్గనిర్దేశం చేసే దాతృత్వాన్ని పొందుతారు.


వ్యాసకర్త / జె సి ఐ వి సంఘం ప్రధాన కార్యదర్శి
కోట దామోదర్
మొబైల్ : 9391480475


7, జూన్ 2023, బుధవారం

గౌరవనీయులైన జౌళి శాఖ మంత్రి కే టి ఆర్ గారికి,

జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం - తెలంగాణ 


గౌరవనీయులైన జౌళి శాఖ మంత్రి కే టి ఆర్ గారికి, 

జౌళి శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా.


విషయం: ఇతర వృత్తి పని వారితో పాటు చేనేత పని వారికి కూడా లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయగలరని విజ్ఞప్తి.

తెలంగాణలో వివిధ కుల వృత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న వృత్తి పనివారి జీవన ప్రమాణాల పెంపు కోసం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రేవు గారి ఆలోచన మేరకు అల్పాదాయ వర్గాలకు చెందిన వృత్తి పని వారికి పూర్తి సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం అభినందనీయం. 

మన దేశంలో వ్యవసాయరంగం తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగం. ఎన్నో  వ్యయప్రయాసలకోర్చి లాభసాటి కాకపోయినప్పటికీ, తరతరాలుగా మగ్గాలనే నమ్ముకుని తమ కుల వృత్తిని ఎంతో  నిబద్ధతతో నిర్వహిస్తున్న చేనేత కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రాకపోవడం శోచనీయం. చేనేత కళాకారులు అత్యధికంగా ఉండే సిరిసిల్ల నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మీకు వారి వెతల గురించి వివరించడమంటే “మేనమామ కు అమ్మమ్మ గురించి చెప్పడం” లాంటిదే. 

మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని అందించిన నేతన్నల పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ ప్రముఖ సినీ గేయ రచయిత “జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా - చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు” అని వాపోయారు. దురదృష్టవశాత్తూ నేతన్నల పరిస్థితి నేటికీ ఏమాత్రం భిన్నంగా లేదన్న విషయం మీకు తెలియంది కాదు.    మానవాళికి వస్త్రాన్ని అందించిన రెక్కాడితే కానీ డొక్కాడని నేతన్నల బతుకు కరోనా మహమ్మారి కారణంగా పూర్తిగా ఛిద్రమైంది. మువ్వన్నెల జెండా నేసిన చేనేత జీవితం, అగ్గిపెట్టెలో ఇమిడే ఆరడుగుల చీరను ఎంతో నైపుణ్యంతో నేసిన చేనేత కళాకారుల జీవితాలు కన్నీళ్ల కలబోత అయ్యింది. ఈ రంగంలో కాలానుగుణంగా యాంత్రీకరణతో పాటు పెను  మార్పులు వస్తున్నా చేనేత కార్మికుల ఆకలి తీరడం లేదు. భారత దేశంలోనే అత్యధిక ఓటర్లుగా ఉన్న పద్మశాలీలకు  ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం అందని ద్రాక్షగా మిగలడం బాధాకరమైన విషయం. 

సహృదయులు మరియు మానవతకు మారు పేరైన మీరు ఆకలితో అలమటిస్తున్న చేనేతల కుటుంబాలకు సానుభూతితో ఇతర కుల వృత్తి పని వారితో సమానంగా గుర్తించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల ఆర్ధిక సహాయం వర్తింపచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రతి చేనేత కుటుంబాన్ని ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి అండగా ఉండి వారికి చేతినిండా పని, కడుపు నిండా తిండి, వంటి నిండా బట్ట కల్పించాలని యావత్ తెలంగాణ చేనేత కళాకారుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తున్నాము. 

భవదీయ, 

ప్రధాన కార్యదర్శి 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475




మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...