7, మార్చి 2026, శనివారం

ప్రేమికుల మధ్య ప్రేమ వైఫై తరంగాల్లాంటిది…

 ప్రేమికుల మధ్య ప్రేమ

వైఫై తరంగాల్లాంటిది…


కనబడదు… కానీ

మనసులు దగ్గరైతే మాత్రమే కనెక్ట్ అవుతుంది.


పాస్‌వర్డ్ మాటల్లో ఉండదు,

మనసుల్లో దాగి ఉంటుంది.


మనసుకు నచ్చితేనే

ఆ సంకేతం పట్టుకుని

రెండు హృదయాలు కనెక్ట్ అవుతాయి.


లేకపోతే…

ఎంత దగ్గరగా ఉన్నా

సిగ్నల్ లేని ఫోన్‌లా

నిశ్శబ్దంగా మిగిలిపోతుంది ప్రేమ. 



✍️

కోట దామోదర్ 

మొబైల్ 9391480475

మనిషి ఆశ సముద్రం అలల్లాంటిది

 మనిషి ఆశ సముద్రం అలల్లాంటిది


సముద్రం అలలాగే

ముందుకు దూసుకొచ్చి

తీరాన్ని ముద్దాడి

మళ్లీ నిశ్శబ్దంగా వెనక్కు వెళ్లిపోతాయి…

మనిషి కలలు కూడా అంతే.

ఉప్పెనల ఆశలతో

గుండెలో ఎగసిపడతాయి,

ఆకాశాన్ని అందుకోవాలనే

అవకాశాల వైపు పరుగెడతాయి.


కొన్నిసార్లు

తీరాన్ని తాకే అలలా

నిజాల్ని తాకుతాయి,

కొన్నిసార్లు

ఇసుకలో కలిసిపోయే జలధారలా

స్మృతులై మిగిలిపోతాయి.

అయితే సముద్రం

అలలు ఆపదు…

మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి.

అలాగే మనసు కూడా

కలలు ఆపదు…

ఒకటి వెనక్కు వెళ్లినా

మరొకటి ముందుకు వస్తూనే ఉంటుంది.

ఎందుకంటే

జీవితం అనేది సముద్రం అయితే

మన ఆశలే ఆ అలలు.


✍️

కోట దామోదర్ 

మొబైల్ 9391480475

మనిషి–మృత్యువు మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ – The Book Thief

 మనిషి–మృత్యువు మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ – The Book Thief


మనతో ఏదీ శాశ్వతంగా వెంట రాకపోయినా, నిశ్శబ్దంగా అడుగులు కలిపేది మృత్యువే. సాధారణంగా మృత్యువును భయపెట్టే శత్రువుగా ఊహిస్తాం. కానీ నిజానికి అది మన అహంకారాన్ని కరిగించి, మనిషిని మనిషిగా మిగిల్చే ఒక సత్యం. అందుకే మహాత్మ గాంధీ “మృత్యువు మనల్ని నమ్ముకుని ఎప్పుడూ వెంట ఉండే ప్రేయసి” అని అన్నారు. మృత్యువు మనకు శత్రువు కాదు; మన జీవితమంతా మన పక్కనే నడుస్తూ, చివరికి చేయి పట్టుకుని తీసుకెళ్లే ఏకైక నిజమైన తోడు.

ఈ తాత్విక దృష్టికోణాన్ని సాహిత్య రూపంలో అద్భుతంగా ఆవిష్కరించిన నవల ఆంగ్ల రచయిత మార్కస్ జుసాక్ రచించిన The Book Thief. ఈ నవల ప్రత్యేకత ఏమిటంటే మృత్యువునే కథ కారుడిగా ఎంచుకోవడం. అందువల్ల ఇది సాధారణ మానవ దృష్టితో చెప్పబడిన కథ కాదు; మృత్యువు దృష్టితో చెప్పిన కథ.

ఇది బాల సాహిత్యంగా పరిగణింపబడిన The Book Thief అసలు అర్థం మానవత్వ సాహిత్యం. ఈ కథ పుస్తకాలు దొంగిలించే పన్నెండేళ్ల అమ్మాయి లీసెల్ మెమింగర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. యుద్ధం మధ్యలో పెరిగిన ఒక చిన్నారి కళ్లతో ప్రపంచాన్ని చూడమని మనల్ని బలవంతం చేస్తుంది ఈ నవల.

సిరియాలో జరిగిన అంతర్యుద్ధం ప్రతిరోజూ జరిగే బాంబు దాడులు, వాటిలో ప్రాణాలు కోల్పోతున్న వందల మంది చిన్నారులు, కళ్ల ముందే ఒక కొత్త తరాన్ని కోల్పోతున్నా. యుద్ధాల్లో అసలైన బాధితులు సైనికులు కాదు, పిల్లలే. రోజురోజుకు పెరుగుతున్న చిన్నారుల మరణాలు, దేశం విడిచి పారిపోతున్న పిల్లలు, భవిష్యత్తేంటో తెలియని పరిస్థితుల్లో ఈ యుద్ధం ఎంత అమానుషమో స్పష్టంగా ఈ నవల బోధిస్తుంది.

ఇలాంటి బీభత్సం మధ్య, తన వాళ్లను కోల్పోయి, హింసను చూస్తూ, అయినా మానవత్వాన్ని మర్చిపోని మనుషుల్ని గమనిస్తూ పెరిగిన పిల్లగా లీసెల్ నిలుస్తుంది. అందుకే ఆమె కేవలం కల్పిత పాత్ర కాదు; యుద్ధాల్లో నలిగిపోయిన ప్రపంచంలోని లక్షలాది పిల్లలకి ఒక ప్రామాణిక ప్రతినిధి.

అందుకే The Book Thief కేవలం ఒక బాలల నవల కాదు. అది యుద్ధం పిల్లలపై మోపిన మౌనమైన, అత్యంత ఘోరమైన అభియోగ పత్రం.

లీసెల్ కథలో ఇదొక పెద్ద మలుపు. తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడం, తల్లి కమ్యూనిస్ట్ నేపథ్యం కారణంగా పిల్లలను తన దగ్గర ఉంచుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో లీసెల్‌-తమ్ముడిని పేదవాళ్ల బస్తీలో నివసించే హాన్స్ హబ్బర్‌మాన్  ఫాస్టర్ దంపతులకు అప్పగించేందుకు తల్లి బయలుదేరుతుంది.

ఆ ప్రయాణంలో విధి మరో దెబ్బ కొడుతుంది. నిమోనియా తో లీసెల్ తమ్ముడు శ్వాస ఆగి, మార్గమధ్యంలోనే ప్రాణాలు విడుస్తాడు. పిల్లలను అప్పగించేందుకు వచ్చిన తల్లి, ఏదోలా చిన్నారిని సమాధి చేసి, లీసెల్ చేయి పట్టుకుని ఊర్లో అడుగుపెడుతుంది.

తమ్ముడిని కోల్పోయిన దుఃఖం అంటే ఏమిటో ఇంకా పూర్తిగా అర్థం కాని వయసులోనే, శ్మశానంలో తన తమ్ముడిని మట్టిలో పాతిపెడుతున్న దృశ్యాన్ని కళ్లప్పగించి చూస్తుంది లీసెల్. అదే సమయంలో, తడి మట్టిలో పడివున్న ఒక పుస్తకం ఆమె కంటపడుతుంది. ఏ ఆలోచన లేకుండా, చటుక్కున దాన్ని తన స్కర్టులో దాచేసుకుంటుంది.
బహుశా… తమ్ముడి జ్ఞాపకంగా.

అదే లీసెల్ చేసిన మొదటి దొంగతనం.
అదీ మృత్యువును చూసిన తొలి దొంగతనం.
అందుకే మృత్యువు ఆమెను “పుస్తకాల దొంగ”గా పిలుస్తూ ఉంటుంది.

ఆ పుస్తకం పేరు “A Grave Diggers’ Handbook.”

కొడుకును కోల్పోయిన అగాధమైన దుఃఖం, కూతురిని వేరే ఇంట్లో వదిలి వెళ్లాల్సిన బాధ ఇవన్నీ గుండెల్లో దాచుకుని, ముఖం మీద ధైర్యం ధరించి కర్తవ్య బాట పట్టిన ఆ తల్లిని చూసి మృత్యువు కూడా క్షణం ఆగిపోతుంది.

కథ చివర్లో, మృత్యువూ - లీసెల్ మళ్లీ కలుస్తారు. ఈ సంగతులన్నింటినీ నెమరువేసుకున్నారు.
అది ఒక మైమరపించే, తాత్వికమైన క్షణం.

అప్పుడు లీసెల్ మృత్యువును అడుగుతుంది 
“అందరూ మృత్యుముఖంలో నిలిచినప్పుడు, జీవితం మొత్తం ఒకే క్షణంలో స్పష్టంగా కనిపిస్తుందంటారు… నీకవన్నీ గుర్తున్నాయా?”

ఇది చదివితే The Book Thief కేవలం కథ కాదు,
మనిషి–మృత్యువు మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ అనిపిస్తుంది.


వ్యాసకర్త 
కోట దామోదర్ 
మొబైల్: 9391480475

నేతన్నల బతుకుకు నష్టం – టెండర్ విధానం కష్టం

 “నేతన్నల బతుకుకు నష్టం – టెండర్ విధానం కష్టం”  

మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే పుట్టాయి. కానీ ఆ వస్త్రాల వెనుక దాగి ఉన్న వారి జీవిత కథ మాత్రం కష్టాల, కన్నీళ్ల కథగానే మిగిలిపోయింది. ప్రముఖ సినీ గేయ రచయిత నేతన్నల దుస్థితిని గుర్తుచేస్తూ చెప్పిన మాటలు నేటికీ సజీవంగా వినిపిస్తున్నాయి: “జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా – చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్లే నేసినారు.” ఈ ఒక్క వాక్యమే చేనేత కార్మికుల జీవన వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది.

తెలంగాణలో చేనేత పరిశ్రమ అనేది వేలాది కుటుంబాలకు జీవనాధారం. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ వృత్తి తరతరాలుగా కొనసాగుతోంది. తివాచీలు, బెడ్ షీట్లు, బెడ్డింగ్ మెటీరియల్స్ వంటి వస్త్రాలను తయారు చేసి ప్రభుత్వ అవసరాలకు సరఫరా చేస్తూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ వ్యవస్థలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) కీలక పాత్ర పోషిస్తూ చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పిస్తోంది.

వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో దాదాపు 10 వేల చేనేత కుటుంబాలు నేరుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీటికి అనుబంధంగా మరో 15 వేల కార్మిక కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. ఈ ప్రాంతాల్లో 60కి పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలు35కి పైగా మ్యాక్స్ సంఘాలు పనిచేస్తూ టెస్కోకు అవసరమైన కార్పెట్లు, బెడ్ షీట్లు, లివరీ వస్త్రాలను తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఆప్కో ద్వారా, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టెస్కో ద్వారా ప్రభుత్వ సంక్షేమ శాఖలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంజీపీటీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు మరియు ఇతర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు అవసరమైన వస్త్రాలను సరఫరా చేస్తూ ఈ వ్యవస్థ కొనసాగుతోంది.

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సంబంధిత శాఖలు తమ అవసరాలను టెస్కోకు తెలియజేస్తాయి. అనంతరం టెస్కో ఆర్డర్లను చేనేత సహకార సంఘాలకు కేటాయిస్తుంది. ఆ సంఘాలు తమ సభ్యులతో కలిసి వస్త్రాలను తయారు చేసి టెస్కోకు అందజేస్తాయి. ఈ విధానం ద్వారా వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు (GI) హక్కు పొందిన వరంగల్ చేనేత ఉత్పత్తులు నాణ్యతకు ప్రతీకగా నిలిచాయి.

ఇలాంటి పరిస్థితుల్లో టెస్కో సరఫరా వ్యవస్థలో టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం చేనేత కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ విధానం అమలులోకి వస్తే ప్రైవేట్ సంస్థలు రంగప్రవేశం చేసి వేలాది చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీయనున్నాయి. తరతరాలుగా నూలుపోగులు అల్లుతూ జీవిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా చేనేత రంగం తీవ్రంగా దెబ్బతింది. మార్కెట్లు మూతపడ్డాయి, ఆర్డర్లు తగ్గాయి, ఉపాధి దాదాపు నిలిచిపోయింది. ఫలితంగా అనేక నేతన్నల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. మువ్వన్నెల జెండాను నేసిన చేతులు ఇవే. అగ్గిపెట్టెలో ఇమిడే ఆరడుగుల చీరను అద్భుతమైన నైపుణ్యంతో నేసిన కళాకారులు వీరే. అలాంటి కళాకారుల జీవితాలు నేడు కన్నీళ్ల కలబోతగా మారడం సమాజానికి బాధాకరం.

తెలంగాణ ప్రభుత్వం కూడా చేనేత పరిశ్రమను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో 11-03-2024న ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ (టెక్స్టైల్) శాఖ ద్వారా జారీ చేసిన జి.ఓ. ఎం.ఎస్. నెం.1 ద్వారా చేనేత రంగానికి రక్షణ కల్పించింది. ప్రభుత్వ శాఖలకు అవసరమైన బెడ్ షీట్లు, కార్పెట్లు టెస్కో ద్వారా ఇండెంట్ ఇచ్చి సహకార సంఘాల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఈ నిర్ణయాన్ని పక్కనపెట్టి టెండర్ విధానాన్ని అమలు చేయాలనే ప్రయత్నాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం ప్రవేశపెట్టిన ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్‌లోని 22 రకాల వస్తువుల కేంద్రీకృత టెండర్ల విధానం నుంచి వరంగల్ కార్పెట్లు, బెడ్ షీట్లను తొలగించి, పాత పద్ధతి ప్రకారం టెస్కో ద్వారా ఆర్డర్లు ఇవ్వాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది అమల్లోకి వస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి కొనసాగుతుంది. చేనేత పరిశ్రమ కూడా పరిరక్షింపబడుతుంది.

చేనేత అనేది వృత్తి మాత్రమే కాదు - ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కళ. 

చేనేత పరిశ్రమను కాపాడి వేలాది నేతన్నల కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి టెండర్ విధానాన్ని పునఃసమీక్షించి రద్దు చేయాలని యావత్ తెలంగాణ చేనేత కళాకారుల తరఫున సవినయంగా ప్రార్థిస్తున్నాము. 

మువ్వన్నెల జెండాను నేసిన ఆ చేతులు నేడు ఉపాధి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. ఆ చేతులు మగ్గం మీద మళ్లీ ఆశల నూలుపోగులు అల్లాలంటే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి చేనేత రంగాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది.  


వ్యాసకర్త
కోట దామోదర్ నేత
మొబైల్ 9391480475


టెండర్ విధానంతో నేతన్నల బతుకుకు క(న)ష్టం.. - Chenetamitra

ప్రేమికుల మధ్య ప్రేమ వైఫై తరంగాల్లాంటిది…

 ప్రేమికుల మధ్య ప్రేమ వైఫై తరంగాల్లాంటిది… కనబడదు… కానీ మనసులు దగ్గరైతే మాత్రమే కనెక్ట్ అవుతుంది. పాస్‌వర్డ్ మాటల్లో ఉండదు, మనసుల్లో దాగి ఉం...