19, సెప్టెంబర్ 2022, సోమవారం

సమానత్వం కోసం పోరాటం





ఇది నా దేశం, ఇది నా జన్మభూమి, ఈ దేశం నాది అని గర్వంగా చెప్పుకునే ఈ దేశ పౌరిడిని నేను. ఈ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించటానికి అర్హత కలిగినవాడిని. ఈ దేశ పౌరిడినైనా నాకు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి తిరస్కరిస్తారా ? ఎందుకు ప్రవేశం లేదు? కారణం నా వర్ణమా? అయితే విద్యనభ్యసించటానికి వర్ణం కారణమా? అయితే నేను న్యాయస్థానంలో తేల్చుకుంటా అని శపథం పట్టి వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అలుపెరగని ఉద్యమ వీరుడు. నడవరా ముందుకని నడిపించిన నల్ల వీరుడు. 

ఓక్లహామా యూనివర్సిటీలో నల్లజాతీయులకు సమానత్వ విద్యకోసం తిరగబడ్డ అక్షర యోధుడు  ప్రొఫెసర్ 'జార్జ్ డబ్ల్యూ మెక్‌లౌరిన్ ". 

ఓక్లహామా యూనివర్సిటీలో మొట్ట మొదటి నల్లజాతి విద్యార్థిగా చరిత్రలో నిలిచారు. 

వివక్ష చూపించినా:

కాన్సాస్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పొందిన తరువాత ఆయన లాంగ్‌స్టన్ విశ్వవిద్యాలయం లో అత్యధిక కాలం ప్రొఫెసరుగా పనిచేసి జనవరి 28, 1948న రిటైర్మెంట్ తీసుకున్నారు. మొదటినుండి చదువు పట్ల ఎక్కువ ఆసక్తి ఉండటంవల్ల అయన ఉద్యోగ విరమణ తరువాత 61 సంవత్సరాల వయసులో కూడా మరొక డిగ్రీ కోసం ఓక్లహోమ యూనివర్సిటీ లో ప్రవేశం కొరకు సెప్టెంబర్ లో దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబరు 20, 1948 న ఆయన ధరఖాస్తుని నిరాకరించింది ఓక్లహోమ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. ఈ దేశ పౌరిడినైనా నాకు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి నిరాకరిస్తారా? ఎందుకు ప్రవేశం లేదు? నేను ఈ దేశ పౌరిడిని కాదా? అనేది తెలుసుకునే ప్రయత్నం చేయగా తాను నల్లజాతీయుడనే కారణంతో దరఖాస్తుని నిరాకరించినట్లు యూనివర్సిటీ వారు తెలిపారు. విద్యనభ్యసించటానికి వర్ణం కారణమా? తెల్లజాతీయులే చదవాలి గాని నల్లజాతీయులు చదువకూడదా? అయితే ఈ విషయాన్నీ  నేను న్యాయస్థానంలో తేల్చుకుంటా అని శపథం పట్టి వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి మెక్‌లౌరిన్ ఫెడరల్ కోర్టుకి వెళ్లారు. అక్టోబర్ 14, 1948న తరగతులు ప్రారంభం కానున్నాయి. తక్కువ సమయం ఉండటంవల్ల తన ప్రవేశానికి అనుమతి దొరుకుతుందా అన్న సందేహంతో సతమతపడుతున్న సందర్భంలో ఫెడరల్ కోర్టు వారు సెప్టెంబరు 29, 1948, తీర్పులో అతనికి ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇవ్వడంతో అతను విజయం సాధించాడు. అతనికి కోర్టు తీర్పు అనుకూలంగా ఉండటంతో ఓక్లహోమ స్టేట్ రీజెంట్‌లు అక్టోబరు 11, 1948న అతనిని అడ్మిషన్‌కు ఆదేశించక తప్పలేదుఅక్టోబర్ 14, 1948న మెక్‌లౌరిన్ తరగతులకు హాజరైనారు.

అసమానత విద్యకు గురైనారు:

అడ్మిషన్‌కు ఆదేశించినప్పటికీ జార్జ్ మెక్‌లౌరిన్ తరగతి గదిలో అకృత్య రూపాన్ని చూశారు. అతను చదువుతున్న తరగతి గదిలో తెల్లజాతీయుల విద్యార్థులకు దూరంగా వేరు డెస్క్ మరియు చైర్ తో తరగతి గది వెలుపల తలుపు ప్రక్కన కూర్చొని పాఠాలు వినేలా ఏర్పాటుచేశారు. అలా తరగతులన్నింటికీ హాజరవుతూనే తెల్లజాతి విద్యార్థులకు దూరంగా ఉంటూ తన అసమానమైన విద్యాబ్యాసాన్ని కొనసాగించారు. అంతేకాకుండా విద్యార్థులు తినే సమయంలో కాకుండా వేర్వేరు సమయాల్లో ప్రత్యేక టేబుల్స్ వద్ద భోజనం చేసే విధంగా ఏర్పాటు చేసేవారు; అతను చదువుకోవడానికి కూడ లైబ్రరీలో వేరే టేబుల్‌ని ఉపయోగించాలని మరియు క్రీడా కార్యక్రమాలలో ప్రత్యేక సీటింగ్ ప్రాంతాలు మరియు ప్రత్యేక విశ్రాంతి గది అలా అసమానత విద్యకు గురైనారు. అలా జరిగినప్పటికీ శ్వేతజాతీయులకంటే కూడా చదువులో ముందుడేవాడు. ఆయన ఎన్నో ఇబ్బందులకు గురైనప్పటికి దృఢమైన సంకల్పంతో తన విద్యను కొనసాగించారు. ఒకవైపు విద్యను కొనసాగిస్తూనే వర్ణ వివక్షత పోరాటానికి పదునుపెట్టగలిగారు. ఆయన ఎన్నో నల్లజాతీయుల విద్యార్థుల సంఘలని కూడగట్టి వర్ణ వివక్షత నిర్ములన కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.  

జీవితంలో మరిచిపోలేని రోజు:

అసమానత విద్య షరతులు వల్ల తాను సమానత్వాన్ని కోల్పోయానని పేర్కొంటూ దావా వేశారు. అయితే ఈసారిమాత్రం డిస్ట్రిక్ట్ కోర్ట్ అతని వాదనతో ఏకీభవించలేదు మరియు జాతి విభజన అనేది "ఓక్లహోమ రాష్ట్రం యొక్క సామాజిక విధానం" అనే కారణంతో అతను వేసిన దావాను తిరస్కరించింది. అయినప్పటికీ జార్జ్ మెక్‌లౌరిన్ తన పోరాటాన్ని కొనసాగించటానికి తన కేసును ఏకంగా U.S. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశాడు.సుప్రీం కోర్టు రాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిని అతని జాతి ఆధారంగా ఇతర విద్యార్థుల నుండి భిన్నంగా చూడగలరా అనే ప్రశ్నపై దృష్టి సారించింది.జూన్ 5, 1950 న తన కేసును విచారించి ప్రధాన న్యాయమూర్తి ఫ్రెడ్ విన్సన్, న్యాయస్థానం కోసం వ్రాస్తూ, మెక్‌లౌరిన్‌కు అందించబడిన భేదాత్మకమైన చికిత్స పద్నాల్గవ సవరణ యొక్క సమాన రక్షణ నిబంధన ప్రకారం, రాష్ట్ర అధికారులు ఇతర జాతుల విద్యార్థుల మాదిరిగానే వాదిని పరిగణించాల్సిన చట్టపరమైన బాధ్యతను కలిగి ఉంటారని సుప్రీం కోర్టు వాదించింది.ఇలాంటి పరిమితులు అతని విద్యాబ్యాసం  మరియు చర్చలలో పాల్గొనటం ఇతర అబిప్రాయాలు మార్చుకునే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయని మరియు నిరోధిస్తాయని. విద్యార్థులు, మరియు, సాధారణంగా, తన వృత్తిని నేర్చుకోవడానికి ఇలాంటి పరిమితులు అనుకూలించవని సూచించారు. ఇకపై న్యాయస్థానం ఇలాంటి పరిమితులను సహించదని ఓక్లహోమా స్టేట్ రీజెంట్స్ ని సుప్రీం కోర్టు హెచ్చరించింది. సుప్రీం కోర్టు తీర్పుతో మెక్‌లౌరిన్ ఆశ నెరవేరినట్లైంది. అక్టోబర్ 14 తనకి సంతోషకరమైన రోజు అని ఆయన డైరీ లో రాసుకున్నారు. నిజంగా నల్లజాతియులకు అక్టోబర్ 14 సంతోషకరమైన రోజు అనే చెప్పొచ్చు.  నల్లజాతి విద్యార్థులకు నడవరా ముందుకని దారిచూపిన మార్గదర్శి మెక్‌లౌరిన్. 

నల్లజాతీయుల కోసమే అయన పోరాటం:

దేశంలో మైనారిటీలైన శ్వేతజాతి ప్రభుత్వం నల్లజాతీయుల పట్ల వివక్ష పాటిస్తూ, వారిని సామాజికంగా అన్ని రంగాల్లోనూ వేరు చేస్తూ అధికారికంగా విధానాలను అమలుచేసింది. ఆ వర్ణ వివక్షా విధానాలను, వారి విద్యపట్ల వివక్షతను అంతం చేయటానికి ఎంతగానో పోరాడిన వీరుడు. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి మనుసులో చిరకాల ముద్రవేసుకున్నారు. అమెరికావంటి అగ్రదేశాలల్లో నల్లజాతీయులు స్వేచ్ఛగా విద్యను కొనసాగిస్తున్నారంటే దానికి కారణం జార్జ్ మెక్‌లౌరిన్ చేసిన పోరాటమే.

కుటుంబ నేపథ్యం:

జార్జ్ డబ్ల్యూ మెక్‌లౌరిన్ 16 సెప్టెంబర్ 1894 న మిస్సిస్సిప్పి, USA లో జన్మించాడు. అతని భార్య పెనినా మెక్‌లౌరిన్, వాన్ కెనడా లో జన్మించింది. పెనినా మెక్‌లౌరిన్ ఉపాధ్యాయ వృత్తిలో 33 సం, విద్యనందించింది. ఆమె 1954లో ఓక్లహోమ యూనివర్సిటీలో హోమ్ ఎకనామిక్స్ లో మూడు డిగ్రీలు, లాంగ్ స్టన్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ మరియు బి.ఎస్ పట్ట పొందారు. అతని కుటుంబం 1910లో ఓక్లహోమాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.  మెక్‌లౌరిన్ కి ఇద్దరు కుమారులు, డన్బార్ ఎస్. మెక్ లారిన్, న్యూయార్క్ లో లాయర్, జోఫ్రే సి. మెక్ లారిన్, లాస్ ఏంజిల్స్ టీచర్, ఆయనకు ఒక కుమార్తె కార్డెజా మెక్ లారిన్ లాస్ ఏంజిల్స్ ఉంటుంది. మెక్‌లౌరిన్ అనారోగ్య కారణంగా సెప్టెంబర్ 4, 1968న 74 ఏళ్ళ వయసులో మరణించారు. ఆయన మరణం నల్లజాతీయులు తీరని లోటు.


మీ 

కోట దామోదర్

Mobile: 9391480475


 .         

అంగవైకల్యం ఆశయసాధనకు అవరోధం కాదు


అంగవైకల్యం ఆశయ సాధనకు అవరోధం కాదు:

అవయవాలు అన్నీ సరిగా ఉన్నా చదువుల పట్ల మక్కువ చూపని ఎంతో మంది విద్యార్థులకు ఆయనొక ఆదర్శం. అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప. అది మనిషిలో ఉన్న ప్రతిభకు కాదు అన్న నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం "వరిపెల్లి యాకయ్య సార్". అయన సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది.
 
జననం, విద్యాబ్యాసం:

సూర్యాపేట జిల్లాలోని మారుమూల గ్రామమైన గుమ్మడవెల్లిలో నిరుపేద కుటుంబంలో వీర సోమయ్య, బుచ్చమ్మ దంపతులకు 1-3-1944న జన్మించారు. ఆ దంపతులకు మొదటి సంతానమైన కుమారుడిని చూస్తూ ఎంతో సంతోషించేవారు. ఎంతో అల్లారుముద్దుగ సాగుతున్న వారి జీవితంలో అనుకోకుండా అయన 4 వ ఏటా పోలియో కారణంగా అంగవైకల్యానికి (నడవలేని పరిస్థితి) గురియైనారు. వారి తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ, ప్రాపంచిక జ్ఞానంతో కుమారుడిని (యాకయ్య సార్) చదివించాలన్న తపనతో వారి స్వగ్రామమైన గుమ్మడవెల్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. 
 
1949 కాలంలో (యాకయ్య సార్ చదివే రోజుల్లో) గుమ్మడవెల్లి గ్రామంలో కరెంటు మరియు రవాణా సౌకర్యం  వంటి సదుపాయాలేనప్పటికీ అయన చదువు పట్ల ఉన్న సంకల్పం, కృషి, నిర్దిష్ట ప్రణాళికతో నాల్గొవ తరగతి పూర్తి చేశారు. గుమ్మడవెళ్లిలో నాలుగో తరగతి వరకే  సదుపాయం ఉన్నందున అయన గుమ్మడవెల్లి నుండి 8 కిలోమీటర్ల దూరప్రాంతమైన తుంగతుర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదు, ఆరో తరగతులు పూర్తి చేశారు.    

ఆతరువాత పై చదువులు చదవటానికి సూర్యాపేటలోని మల్టీ పర్పస్ స్కూల్ లో చేరి 7 వ తరగతి నుండి  12 వ తరగతి వరకు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు, ఆ రోజుల్లో 12వ తరగతి చదవడం గొప్ప విషయం. అయితే చదువుకోవాలనే తపన అతనిలో ఇంకా ప్రబలంగా ఉండడంతో పై చదువులకోసం ప్రయత్నిచడం కొనసాగించారు. మనుసుంటే మార్గాలెన్నో అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి యాకయ్య సార్, అనుకున్న ఆశయం కోసం అహర్నిశలు కష్టపడి ఆసాద్యన్ని సుసాధ్యం చేయగలిగే వారు. చదువు పట్ల అతని ఏకాగ్రతను గమనించిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఉద్యోగానికి ఉపాధ్యాయ శిక్షణా కోర్సు చేయాలని సూచించారు. పట్టుదలతో ప్రయత్నిచి ఇల్లందులోని టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసి 10 - ఆగస్టు - 1970లో ప్రభుత్వ టీచర్ గా నియమితులైనారు. అయన జీవితంలో ఆశయం కోసం  ఎన్నో సాధనాలు , శోధనలు , పరిశోధనలు ఎన్నో పట్టుసడలని ప్రయత్నాలు చేసి అనుకున్నది సాధించిన ఘనుడు యాకయ్య సర్. 

క్యాన్సర్ తో పోరాడిన ధైర్యవంతుడు:

అంగవైకల్యాన్ని జయించిన యాకయ్య సార్. టీబీ వ్యాధి ఆయన్ని చాలా కాలం పాటు బాధించింది. అయినా టీబీ వ్యాధి కూడా ఆయన్ని వెంటాడి వెనుతిరిగింది. 
అంతేగాక టీబీ వ్యాధి తర్వాత భయంకరమైన క్యాన్సర్ మహమ్మారి కూడా అతనికి పరీక్ష పెట్టింది. 

దైర్యం క్యాన్సర్ ఉన్నోడినికూడా బతికిస్తుంది..
భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది..  అన్నట్లుగా యాకయ్య సార్ ధైర్యంతో భయంకరమైన క్యాన్సర్ ని కూడా జయించారు. క్యాన్సర్ ని జయించటం అంటే మృత్యువుతో పోరాటమే.. యాకయ్య సార్ అన్నింటిని జయించిన ధైర్యశాలి..    

గురువుగారి జ్ఞాపకాలు :
  
అయన స్వగ్రామమైన గుమ్మడవెళ్లిలోనే ఉపాధ్యాయుడిగా పనిచేయటం మా అందరి అదృష్టంగా భావిస్తు, అయన నా గురువుగా చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను. ఇంకా సంతోషకరమైన విషయమేమిటంటే ఆయన తనయుడు అంజయ్య సార్ కూడా నాకు గురువు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.
యాకయ్య సార్ లో ఉన్న గొప్ప ప్రత్యేకతయేంటంటే అయన చిరునవ్వు. ఆ చిరునవ్వెప్పుడు అయన ముఖారవిందాన్ని అలంకరిస్తూనే ఉంటుంది.  కొన్నిసందర్భాలలో సార్ ఎక్కడైనా బయట కనిపిస్తే "నమస్తే సార్ అంటే " సార్ దానికి బదులుగా గాలం విసిరినట్లు చిరునవ్వు విసురుతారు. చిరునవ్వు సార్ కి గొప్ప ఆస్తి, మరియు ఆయుధం కూడా ఆ ఆయుధానికి అందరం ఆకర్షితులమే..
సార్ పిల్లలందరిని తన కుటుంభ సభ్యులుగా భావించి, వారి భవిష్యత్తుని దృష్టిలోపెట్టుకుని విద్యార్థుల యొక్క విద్యానైపుణ్యాన్ని, వారియొక్క సామర్ధ్యాన్ని, చురుకుదనాన్ని గ్రహించటంలో యాకయ్య సార్ కి వెన్నతోపెట్టిన విద్య. 
ఆయన దగ్గర శిష్యరికం పొందిన వారిలో చాలా మంది విద్యావేత్తలు, ప్రముఖులు, నాయకులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే యాకయ్య సార్ బహుముఖప్రజ్ఞాశాలి. అయన చదువు చెప్పేవిధానంలో ఎంత ప్రత్యేకత ఉందొ, బ్లాక్ బోర్డుమీద చక్కటి బొమ్మలు గీయటంలో కూడా అంత ప్రావీణ్యత ఉంది. అంతేకాకుండా అయన స్వరం, ఆయనకి దేవుడిచ్చిన గొప్ప వరం, మంచి మంచి పాటలు పాడేవారు,  ఒక వృత్తాకారం సర్కిల్ గీస్తే అది ఎంత గుండ్రంగా వస్తుందంటే అది చూస్తే గానీ మాటలతో వర్ణించలేనిది. అంత అందమైన బొమ్మలు గీయటంలో సార్ దిట్ట. 
పాఠంచెప్పిన మరుసటి రోజు ఆ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు, ఎంతవరకు పాఠం అర్ధంచేసుకున్నారు అనే పరీక్షా పర్యవేక్షణ అన్ని మాకు తెలియకుండానే. నొప్పిలేకుండా సూదివేయటం అనే సూత్రం సార్ ది. అది మా భవిష్యత్తుకి పునాది రాయి. 
పాఠం చెప్పేటైంలో పిల్లలతో గరుకుగా ఉండేవారు, పాఠం అయిపోయినాక చురుకుగా, చిలిపిగా నవ్వుతు మాతో గడిపేవారు, చురుకుగా, గరుకుగా కాలానికనుగుణంగా ఒదిగిపోయే వ్యక్తిత్వం యాకయ్య సార్ ది.  అది అందరికి అసాధ్యం అనే చెప్పాలి.
నేను 5 వ తరగతి చదివేటపుడు మాకు సామాన్య శాస్త్రం చెప్పేవారు సార్, అందులో ఒక అబ్యాసం ఆరోగ్యం గురుంచి ఉండేది. ఆ అబ్యాసం యాకయ్య సార్ చెప్పిన విధానం ఒక అద్భుతం అంత బాగా చెప్పినారు. అందులో ఆరోగ్యమే మహా భాగ్యం అనేదాని గురించి ఎంతబాగా వర్ణించారంటే అది వర్ణణనాతీతం. ఆరోగ్యమే మహా భాగ్యం అని చదవటం చాలా సులభమే కానీ దాన్ని ఆచరించటం, దాన్ని ఆచరణలో పెట్టటం మన జీవితకాలం సరిపోదు, అది అర్ధం కాదు మనకి. అది అర్ధం చేసుకునేలోపే ఆకాశంలో మబ్బులు మాయమైపోయినట్లు, భూమిమీద మన ప్రాణం మాయమైపోతుంది అది అంతుచిక్కని రహస్యం. స్కూల్లో టీచర్స్ కొరత ఉన్నపుడు యాకయ్య సార్ దశావతారాలలో ప్రత్యక్షమైయేవారు విద్యార్థులకు వేరే సబ్జక్ట్స్ చెప్పటానికి. ఆయనొక దశావతారమూర్తి. 
ఏందేందు వెతికిన అందందు కలదు, ఇందులేదని అందులేదని సందేహం లేదనే పదానికి నిర్వచనం.  అయన అన్ని సబ్జక్ట్స్ లో ప్రావీణ్యత కలవారే.  పొద్దునే పేపర్ చదివే అలవాటుంది. ఆ అలవాటుని మాకూడా అంటించాలనే ముఖ్యఉద్దేశంతో ప్రేయర్ సమయంలో మాతో పేపర్ చదివించే కార్యక్రమం మొదలెట్టారు. యాకయ్య సార్ దయవల్ల మాకు పేపర్ పరిజ్ఞానం పెరిగింది. జనవరి 26 ,  ఆగస్టు 15 ల కార్యక్రమాలకు విద్యార్థులందరికీ     ఆటలపోటీలు నిర్వహించేవారు. అందులో యాకయ్య సార్ పాత్ర ఎక్కువగా ఉండేది. పిల్లలు ఆటలాడే సమయంలో ఉత్తేజపరిచేందుకు, ఉత్సాహపరిచేందుకు వారి ప్రయత్నం అపురూపమైనది. యాకయ్య సార్ వారి శిష్యుల మనసులో విశిష్ట ముద్రవేసుకున్నారు.

జీవితంలో ప్రతి విద్యార్థి తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి లక్ష అవరోధాలు ఎదురైనా ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి చేయాలి, కానీ విజయం మనదే. అడ్డంకుల వద్ద ఆగిపోవడం లక్ష్యాన్ని చేరుకోలేమనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.


మీ శిష్యుడు 

కోట దామోదర్ 
మొబైల్ : 9391480475

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...