24, సెప్టెంబర్ 2023, ఆదివారం

మనిషికి మరణం కానీ, పాటకు మరణం లేదు..



 మనిషికి మరణం కానీ, పాటకు మరణం లేదు..


గాంధర్వ లోకాలనుండి భూలోకానికి దిగి వచ్చిన పాటల పూదోట. ఆ తోటలో విరబూసిన పసిడి పంట ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు. ఆయన గొంతు విప్పితే అమ్మ జోల పాడినట్లుగా పసిపాప కూడా హాయిగా నిద్రలోకి జారుకోవాల్సిందే అంత అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులకు పసందైన వీణుల విందునందించారు. ఆయన స్వరం అద్భుతం, ప్రభంజనం అనన్య సామాన్యం. ఆయన పాట వింటే గాయపడిన హృదయాలు సైతం ప్రశాంతంగా తన్మయత్వంలో మునిగిపోవాల్సిందనడంలో అతిశయోక్తి లేదు.  విభిన్న స్వరాలతో పాటలు పాడుతూ తన గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. బాలు గారి గొంతులో పలుకని తెలుగు పదం లేదు. పాడనీ రాగం లేదు. సంగీత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన ఘనుడు గానగంధర్వుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం.

బాలు గారి పాట తరగని మాధుర్యం. ఆహ్లాదకరమైన శ్రావ్యత మరియు ఆ స్వరంలో స్పష్టత నిజానికి బాలు గారి స్వరం దేవుడు ఇచ్చిన గొప్ప వరం. సన్నివేశానికి అనుగుణంగా ఎమోషనల్ గా, సహజంగా పాటకు ప్రాణం పోయడంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మించిన వారు లేరనే చెప్పాలి. దైవభక్తి, దేశభక్తి గేయాలు, బృందగీతాలు, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ, జానపద గీతాలు, అనేకము సందార్భాను సారముగా రాగయుక్తముగా భావ యుతముగా వైవిధ్యభరితమైన వేల పాటలు పాడి తెలుగు వారి మదిలో శాశ్వత స్థానాన్ని పొందిన అమరగాయకుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు.


ఐదు దశాబ్దాల పాటు సాగిన ప్రస్థానంలో తెలుగు పాటలే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తిరుగులేని గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, 16 భాషల్లో 50,000కు పైగా అత్యధిక సంఖ్యలో గీతాలను ఆలపించిన గాయకుడుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.
ఆయన ఆలపించిన గీతాలు మరియు ఆయన చేసిన కృషికి ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు  మరియు 25 తెలుగు సినిమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులు మరియు కర్ణాటక మరియు తమిళనాడు ప్రభుత్వం నుండి అనేక ఇతర రాష్ట్ర అవార్డులు అంతేకాకుండా  ఆరు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు ఎఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకోవడం గొప్ప విషయం. తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వించదగిన విషయం. 8 ఫిబ్రవరి 1981 న కన్నడలో 24 గంటల సమయంలో ఎలాంటి విరామం తీసుకోకుండా ఏకంగా 27 పాటలు ఆలపించి సరికొత్త రికార్డు సృష్టించారు. కన్నడంలో కాకుండా తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు రికార్డు చేసి రికార్డు సృష్టించారు.

కుటుంబ నేపథ్యం:

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హరికథా కళాకారుడు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు 4 జూన్ 1946 నాడు జన్మించారు.
ఆయన తండ్రి హరికథా కళాకారుడు అవడంవల్ల బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీతంపై ఆసక్తి కలిగింది. తన తండ్రికి కూడా సంగీత కళాకారుడు కావాలనే కోరిక బలంగా ఉండేది. బాలసుబ్రహ్మణ్యం చిన్నతనంలోనే సంగీత సంజ్ఞామానాలను అభ్యసించి, తన స్వయంకృషితో సంగీతం నేర్చుకున్నారు. చిన్నతనం నుండే పాటల పోటీలో పాల్గొని ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.  ఇంజనీర్ కావాలనే ఉద్దేశ్యంతో అనంతపురం జెఎన్‌టియు ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. బాలు గారికి మొదటగా సంగీత కళాకారుడిగా కాకుండా తన తండ్రి ఆశయం మేరకు ఇంజనీరింగ్ చదివి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది కానీ ఇంజనీరింగ్ చదివే సమయంలో అనారోగ్య కారణంగా మధ్యలోనే చదువు మానేశాడు. ఆ తర్వాత గాయకుడిగా రాణించడానికి నిర్విరామ కృషి చేశారు.

సినీరంగ ప్రవేశం:

ఎస్పీ కోదండపాణి స్వరపరిచిన తెలుగు సినిమా శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న లోని 'ఏమియే వింత మోహం' పాటతో ప్లేబ్యాక్ సింగర్‌గా 1966 డిసెంబర్ 15న అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1968 లో కోదండపాణి స్వరపరిచిన సుఖదుఃఖాలు చిత్రంలో "మేడంటే మేడ కాదు" పాట తెలుగు చిత్రసీమలో ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది.  
తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతున్న శంకరాభరణం 1980 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం బాలసుబ్రహ్మణ్యం గారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతేకాకుండా ఆయన కృషికి ఉత్తమ నేపధ్య గాయకుడిగా జాతీయ అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత సంవత్సరం 1981 లో  "ఏక్ దుయుజే కే లియే" హిందీ చిత్రానికి మరో జాతీయ అవార్డు లభించింది.  ఆయన గాత్రం అందించిన ఉత్తమ చిత్రాలు స్వాతిముత్యం, సాగర సంగమం, రుద్రవీణ, మాతృదేవోభవ, కే విశ్వనాధ్ గారు నిర్మించిన చిత్రాలన్నీ కూడా  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినవే, అగ్ర హీరోల సినిమాలకు ఎక్కువ బాలు గారు పాడినవే.

1989లో సల్మాన్ ఖాన్‌ నటించిన హిందీ చిత్రం "మైనే ప్యార్ కియా" లో దిల్ దీవానా పాట కు  బాలు గారు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌ నటించిన చాల చిత్రాలలో ప్లేబాక్ సింగర్ పనిచేసారు. బాలు గారు మరియు లతా మంగేష్కర్‌ కలిసి పాడిన హిందీ చిత్రం "ఆప్కే హై కౌన్" లోని "దీదీ తేరా దేవర్ దీవానా " పాట అత్యంత ప్రజాధారణ పొందడమే కాక హిందీ చలన చిత్రంలో తనకంటూ మంచి గుర్తింపు లభించింది.

బాలు గారు కమల్ హాసన్, రజనీకాంత్ , విష్ణువర్ధన్ , సల్మాన్ ఖాన్ , కె. భాగ్యరాజ్ , మోహన్ , అనిల్ కపూర్ , గిరీష్ కర్నాడ్ , జెమినీ గణేశన్ , అర్జున్ సర్జా , నగేష్ , కార్తీక్ మరియు సహా పలు కళాకారులకు వాయిస్ ఓవర్ కూడా అందించారు.

సాధించిన అవార్డులు:

2001లో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
2012లో బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు.
2015లో, అతను కేరళ ప్రభుత్వం నుండి హరివరాసనం అవార్డును అందుకున్నారు.
2016 లో 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు తో సత్కరించబడ్డాడు.
అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే 25 సెప్టెంబర్ 2020 న అందుకోవాల్సిన పద్మ విభూషణ్ అవార్డు కోవిడ్-19 కారణంగా ఆలస్యమవడం మరియు కోవిడ్-19 కారణంగా ఆయన 25 సెప్టెంబర్ 2020 న మరణించడం బాధాకరం ఆయన మరణానంతరం 2021 పద్మ విభూషణ్ అవార్డు ప్రదానం చేశారు.

ఎందరో నటీనటులకు వారి హావభావాలకు, అభినయ రీతులకు అనుగుణంగా పాటలకు  ప్రాణం పోశారు. అందుకే అమర గాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినిమా పాటకు అసలైన వారసుడు అయ్యాడు. పదాల సరళిని జాగ్రత్తగా గమనిస్తూ అతని విరామ చిహ్నాలు అతని పాటను పండితులకు దగ్గర చేశాయి  శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి.

మనిషికి మరణం కానీ, పాటకు మరణం లేదనడంలో అతిశయోక్తి లేదు. భౌతికంగా మాత్రమే లేరు. ఆయన రాసిన , పాడిన పాటల్లో సజీవంగా నిలిచాయి. చరిత్రలో నిలిచిపోయారు. బాలు గారి పాట చిరస్మరణీయం.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...