29, అక్టోబర్ 2023, ఆదివారం

ఎన్ని"కలలు"

 ఎన్ని"కలలు":


తరాలు మారినా పేదోడి తలరాత మారడం లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభుత్వం వైఫల్యమా లేదా ప్రజల వైఫల్యమనేది అతికొద్ది మందికి తెలిసిన విషయం.
నీతి, నిజాయితీ, న్యాయం పట్ల నిబద్ధత ఉన్న వారిని ఎన్నుకోకుండా, డబ్బులు ఇచ్చినవారినే ఎన్నుకోవడమే దీనంతటికి కారణం. దీన్నిబట్టి మనం గమనించవలసిన విషయమేమిటంటే ప్రజలు అభివృద్ధి కోరుతున్నారా! అవినీతి కోరుతున్నారనేది అర్ధం కానీ ప్రశ్నగా మారింది. ప్రజలు  అభివృద్ధి కోరుకున్నట్లైతే అభివృద్ధి చేసే నాయకున్ని ఎన్నుకోవాలి, అవినీతి కోరుకున్నట్లైతే అవినీతిపరుడైన నాయకున్ని ఎన్నుకోవాలి. ఈ రోజుల్లో అన్ని పార్టీలు డబ్బులు పంచడం మామూలే. అయితే ప్రజలు ఎవరికి ఓటు వేయాలి అనేది ఆలోచించవలసిన ప్రశ్న. డబ్బులు ఎక్కువ ఇచ్చేవాడిక లేదా డబ్బులు తక్కువ ఇచ్చేవాడిక లేదా అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్న నాయకుడికి వేయాలనేది ప్రజల నిర్ణయం. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు అన్నట్లుగా ఓటు వేసే సమయంలోనే సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నాయకున్ని ఎన్నుకోవాలంటే ప్రజల్లో ఓటు హక్కు ప్రాధాన్యత అవగాహన తప్పనిసరి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎన్ని"కలలు":

ఒకప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటే ప్రజలు సంతోషంగా ఓటు వినియోగించడానికి ముందడుగు వేసేవారు. ఇచ్చిన హామీలు నెరవేరుతాయని నిరుపేదలకు చేయూత అందుతుందని, ఎన్నికల సమయంలోనే పేద ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనే కలలు కంటారు. అప్పట్లో నాయకులు ఇచ్చే హామీలు నమ్మదగినవిగా ఉండేవి. అందులో కొంతైనా హామీలు నెరవేరేవి. కానీ నేడు నాయకులిచ్చే హామీలు అమలు అవుతాయనేది పైనున్న దేవుడికే తెలియాలి హామీలిచ్చిన నాయకుడికి తెలియాలి. అంత నమ్మశక్యంగా ఉంటాయనేది ప్రతి ఓటరుకు తెలిసిందే. ఒకాయన ఈసారి మేము గెలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు తక్కువే ఇస్తామని, మరొకాయన మేము గెలిస్తే అంతకంటే తక్కువకు ఇస్తామని హామీలిస్తున్నారు. అది సాధ్యమయ్యే పనేనా  అనేది ఓటరు ఆలోచన చేయాల్సిన అవసరముంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో జనాలు అయోమయం అవడమే తప్ప అవసరానికి ఒక పథకం కూడా పేదోడికి అందదు. నిత్యావసర వస్తువుల ధరలు మండుతూనే ఉంటాయి. ధరలు పెరగడానికి కారణాలు వెతుకుతూ ప్రజలను మభ్య పెట్టడం తప్ప ప్రయోజనం ఉండదు. అది నాయకుల కనికట్టు మంత్రం. ఊక దంపుడు ఉపన్యాసాలు తప్ప ఉపయోగపడే ఉపన్యాసం ఒకటి ఉండదు. ఇది జగమెరిగిన సత్యం. ఓట్లు దగ్గరపడ్డాక జనాలలో వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం నిత్య అవసర వస్తువుల ధరలు తగ్గించి ఓట్లు అయినాక అంతకంత పెంచడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాకుండా ఓట్లకు ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది. తాగనివాడికి కూడా తాగడం నేర్పుతారు ఫ్రీ గానే వస్తుంది కదా అలా మద్యానికి అలవాటు చేసి ఓట్లయినాక మద్యం రేట్లు పెంచుతారు తాగుడుకు బానిసైన వారు అప్పుచేసి అయినా తాగుతారు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తారు ఇది నాయకులకు తెలుసు మందు ఫ్రీగా పోస్తే మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి డబ్బులు వస్తాయని. ఓట్లేసే జనాలు ఎర్రిపప్పలు అనుకుంటారేమోగాని జనాలు తిరగబడితే అదోలా ఉంటుందన్న సంగతి నాయకులు ఎరుగరు. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచిత రేషన్ లాంటి పథకాలు ప్రజలకు అవసరం అంతేగాని పెన్షన్ పథకాలు పెట్టి సోమరిపోతులను చేస్తున్నారు. ఏ పని చేయక అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండగా  నాయకుల నటన అత్యంత అద్భుతంగా ఉంటాయి. నిజ జీవితంలో సినిమా నటుడు కూడా నటించనిది నాయకులు నటించి నటనలో జీవిస్తారు. ప్రజలు అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటే నిరుపేదలకు న్యాయం జరుగుతుందనేది ముమ్మాటికీ నిజం.
నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవడం ఎలా అనేది ప్రజలకు పెద్ద సవాలే.. నిజాయితీ నాయకుడిని గుర్తించడం ఎలా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఓటరు మదిలో...

ప్రజాధనాన్ని వృధా చేయకుండా చర్యలు తీసుకోవాలి:

ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ప్రజా ధనం వృధా చేయడం వల్ల రానున్న రోజుల్లో పేదలు తినడానికి తిండి లేని పరిస్థితి చూడాల్సి వస్తోంది. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉండాలి. సోషల్ మీడియా ప్రచారాలు కూడా చాలా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఓటర్లు తమ ఓటు ను సక్రమంగా వినియోగించుకునేలా ఎన్నికల సమయానికి రెండు నెలల ముందు మద్యాన్ని నిషేధించాలి. మనీలాండరింగ్‌ను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాలి.

చట్టాలు మారాలి:

ప్రజా ప్రతినిధుల నేరచరిత్ర ఎన్నికల సంఘం పరిధిలోకి చేర్చడమే కాకుండా, ఓటర్లు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉండేలా ఎన్నికల సంఘం వెబ్‌సైట్లలో అన్ని అంశాలను పొందుపరచాలి. అప్పుడే ఓటరు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశముంది. అంతేకాకుండా అభ్యర్థి గెలిచిన తర్వాత అవినీతికి పాల్పడినట్లైతే ఆ సమయంలో ఓటర్లు రీకాల్ చేసుకొని మరొకరిని ఎన్నుకునే వెసులుబాటు కల్పించాలి. దీనివల్ల అవినీతిని అరికట్టే అవకాశముంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో రీకాల్ సిస్టమ్ అమలులో ఉంది. ఇలాంటి దేశాలలో మాత్రమే సుపరిపాలన పరుగులు పెడుతుంది. ఇలాంటి చట్టాల కోసం యువత కృషి చేయాలి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి.     
నిజాయితీ గల నాయకులు ఉన్నారా?

90 శాతం మంది నాయకులు అవినీతిపరులు అయితే 10 శాతం మంది నిజాయితీ గల నాయకులు అని చెప్పవచ్చు. ఉదాహరణకు గుమ్మడి నర్సయ్య  5 సార్లు ఎమ్మెల్యేగా చేసినా ఇప్పటికి సాధారణ జీవితం కొనసాగించడం గొప్ప విషయం. సమాజానికి గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తులు అవసరం. ఈరోజుల్లో ఒకసారి ఎమ్మెల్యే అయితేనే తరాలకు సరిపడా సంపాదన వెనకేసుకుంటున్నారు. గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు సంపాదన కోసం కాకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నాయకుడు. ఇలాంటి వారిని ప్రజలు ఎందుకు ఎన్నుకోరు? ప్రజలే మోసపోతున్నారు కానీ నాయకులు మోసం చేయడం లేరన్న విషయం గమనించాలి.
గుమ్మడి నర్సయ్య తో పాటు జయ ప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారిని ప్రజలు గుర్తించకపోవడం విచారకరం. సమాజంలో మార్పు రావాలంటే సమస్యలపై పోరాడే నాయకుడు కావాలి. అప్పుడే పేదలకు సరైన సంక్షేమ పథకాలు అందుతాయి.

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి సరైన నాయకుడిని సరైన సమయంలో ఎన్నుకోవాలి..
పేదోడి కల నెరవేరాలంటే. ఓటు ఆయుధం గా ఉపయోగించిన నాడే సాధ్యపడుతుంది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475        





కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...