31, డిసెంబర్ 2024, మంగళవారం

వాహ్ ఉస్తాద్… జాకీర్ హుసేన్ :

వాహ్ ఉస్తాద్… జాకీర్ హుసేన్ :

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) మరణవార్త ప్రపంచ సంగీత ప్రియులందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. భారతీయ శాస్త్రీయ సంగీత వాయిద్యాలలో అత్యంత ప్రజాదరణ పొందిన తబలా పై కమనీయ ధ్వనులు పలికించి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన గొప్ప కళాకారుడు.

తబలా పై తన మధురమైన ధ్వనులు శ్రోతల మదిని మృదు మధుర రాగాలతో మురిపిస్తాయి.
తబలా పై అతని చేతి మునివేళ్ళు అలల్లా ఓలలాడుతూ మధుర మృదంగాలై మోగుతుంటాయి.

అతని మనం ఎలా మర్చిపోగలం:

తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి జాకీర్ హుస్సేన్ పేరు చెప్పగానే తబలా విద్వాంసుడు గుర్తుకు రాకపోవచ్చు కానీ తాజ్ మహల్ టీ యాడ్ లో తబలా వాయించిన వ్యక్తి అంటే అందరికీ తెలుసు. నిన్న ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మరణ వార్త సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో, అతను ఎవరా అని చాలా మంది సందేహించారు. కాసేపటి తర్వాత జాకీర్ హుస్సేన్ మరణాన్ని తెలియజేస్తూ తాజ్ మహల్ టీ యాడ్ చూపించింది అప్పటివరకు ఆయన పేరు  చాలా మందికి తెలియదు. చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు తన పేరుతో అందరికి పరిచయమవుతుంటారు. కానీ కొంతమంది మాత్రం తన పేరుతో కాకుండా తన ప్రతిభతో  పరిచయమయ్యేవారు అతి కొద్దిమంది ఉంటారు అందులో జాకీర్ హుస్సేన్ ఒకరు. మొదటగా మన దేశంలో బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీని 1966లో కోల్‌కతాలో నటీనటులు జీనత్ అమన్ మరియు మాళవిక తివారీ తాజ్ మహల్ టీ యాడ్ తో ప్రారంభించారు కానీ తయారీదారులు ఆశించినంత ప్రజాధారణ పొందలేకపోయిందని గమనించారు. ఆతర్వాత హిందుస్థాన్ థాంప్సన్ అసోసియేట్స్ (HTA) ఒక కొత్త బ్రాండ్ ఇమేజ్‌ని రూపొందించడానికి భారతీయతను పాశ్చాత్య ఎక్స్‌పోజర్‌తో సమతుల్యం చేసే బ్రాండ్ అంబాసిడర్ అవసరం వచ్చింది. తబలా అభిమాని అయినా (HTA) కాపీ రైటర్ KS చక్రవర్తి జాకీర్ హుస్సేన్ పేరు ఎంపిక చేశారు. ఎంపిక సమయానికి హుస్సేన్ శాన్ ఫ్రాన్సిస్కో లో ఉండటంతో KS చక్రవర్తి అతన్ని సంప్రదించి తాజ్ మహల్ టీ యాడ్ మీరే చేయాలనీ పట్టుపట్టడంతో అందుకు హుస్సేన్ విముఖత చూపలేక సరే అని తాజ్ మహల్ టీ దేశ నలుమూలల వ్యాప్తిచెందాలనే సంకల్పంతో యాడ్ కొరకు తన సొంత ఖర్చుతో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీ కి వచ్చారు. ప్రకటన యొక్క స్క్రిప్ట్  కొరకు గంటల తరబడి సాధన అనంతరం విజయవంతంగా పూర్తి చేశారు. దీన్నిబట్టి దేశంపై జాకిర్ హుసేన్ ప్రేమ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ వాణిజ్య ప్రకటన తర్వాత తాజ్ మహల్ టీ బ్రాండ్ హుస్సేన్ ఇంటి పేరుగా మారింది. అయితే ఈ ప్రకటనలో హుస్సేన్ కప్పు టీ తాగుతూ కనిపిస్తున్న దృశ్యాన్ని మరియు తబలా నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ప్రసిద్ధ స్వరకర్త హరీష్ “వాహ్ ఉస్తాద్, వాహ్!” చెబుతుండటం దానికి బదులుగా పెర్కషన్ వాద్యకారుడు, "అర్రే హుజూర్, వాహ్ తాజ్ బోలియే"  ప్రకటన బాగా ప్రాచుర్యం పొందింది. తాజ్ మహల్ టీ దేశవ్యాప్తంగా వ్యాపించింది. అంతేకాకుండా "వాహ్ తాజ్" అనే పదం చాలా సందర్భాలలో తరచుగా ఉపయోగించే బజ్‌వర్డ్‌గా మారింది. ప్రతి రోజు ఉదయాన్నే తాజ్ మహల్ టీ తాగే ప్రేమికులు మాత్రం ఆయనను ఎలా మరిచిపోగలరు. సంగీత ప్రియుడైన నేను తన మధురమైన ధ్వనులను ఎలా మరిచిపోగలను చెప్పండి. ఆయన ప్రతిభకు ఎవరైనా “వాహ్ ఉస్తాద్, వాహ్ అనాల్సిందే.

నాలుగు గ్రామీ అవార్డు లతో పాటు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డు, USA నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ మరియు ఫ్రాన్స్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్‌లో అధికారితో సహా లెక్కలేనన్ని అవార్డులు మరియు గౌరవాలు అందుకున్నారు.
2024 లో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి మూడు ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా జాకీర్‌ చరిత్ర సృష్టించారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో, మన దేశంతోపాటు ఎంతోమంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేసిన అనుభవం ఆయనది.

ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే తత్వం:

మన నిత్యజీవితంలో ఒక చిన్న అవార్డు వస్తే ఉప్పొంగి పోయే వాళ్ళని చూస్తుంటాము. కానీ కొంతమంది ఎన్ని అవార్డులు సంపాదించినా నేనే గొప్ప అనే భావన ప్రస్తావించరు అలాంటి వారిలో జాకిర్ హుస్సేన్ ఒకరు. "ఎన్ని అవార్డులు వచ్చినా, ఎప్పుడూ నేర్చుకోగలగడం ఎంతో ముఖ్యం అని చెపుతుంటారు. చిన్నప్పుడు తండ్రి చెప్పిన ఒకేఒక మాట "మనల్ని మనం బెస్ట్‌ అని అనుకోకూడదని" తండ్రి చెప్పిన మాటే ఇప్పటివరకు  ఈస్థాయిని చేర్చగలిగిందని పలు ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పారు.

అసలు సిసలు హిందుస్తానీ రాగాల ఉస్తాద్ హుస్సేన్ ఇక లేడన్న విషయం సంగీత ప్రియులందరికీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ తన మధురమైన ధ్వనులు శ్రోతల మదిని మృదు మధుర రాగాలతో మురిపిస్తూనే ఉంటాయి.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

అర్థాకలి నుండి అంతర్జాతీయ ఆర్థికవేత్త స్థాయికి ...

అర్థాకలి నుండి అంతర్జాతీయ ఆర్థికవేత్త స్థాయికి ...


ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా ఒక నాయకుడిగా ఎదగాలంటే అసాధారణమైన విషయం, ఎటువంటి ప్రయత్నం చేయకుండానే తన ప్రతిభా పాటవాలతో అత్యున్నత పదవులు అధిష్టించి అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసుకున్న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) మరణ వార్త యావత్ దేశాన్ని  దిగ్భ్రాంతికి గురి చేసింది. గొప్ప  ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించినప్పటికీ, తన విజయాన్ని తన ఘనతగా చెప్పుకోకుండా, పేరు ప్రతిష్టలకు పాకులాడకుండా, అప్పగించిన పనిని నిబద్దతతో చేసి సాదాసీదా జీవితాన్ని గడిపిన నాయకులలో మన్మోహన్ సింగ్ ఒకరు. చేసినవి చెప్పుకోలేదు. హంగు ఆర్భాటాలకు పోలేదు. అవమానాలు, అడ్డంకులు అన్నీ సమానంగా స్వీకరించగలిగిన  గొప్ప వ్యక్తిత్వం ఆయనది.

నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం:

ఆయన దేశ ఆర్థిక మంత్రి పదవిలో ఉండగా, ఒక సారి ఆయన భార్య, గురుశరణ్ కౌర్ చపాతీ పిండి తీసుకురమ్మని  సింగ్ వ్యక్తిగత సిబ్బందిని పురమాయించడంతో ఆ విషయం తెలుసుకున్న మన్మోహన్ సింగ్ వెంటనే తన భార్యను పిలిచి సిబ్బంది ఉన్నది ఇంటి అవసరాల కోసం కాదని, కేవలం ప్రభుత్వ విధులు నిర్వర్తించడానికి మాత్రమే అని  చెప్పారట. ఇలాంటి నాయకులు మన దేశంలో ఎంతమంది ఉన్నారు? అలంటి వారిని మనం చేతి వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. ఈ రోజుల్లో మండల మరియు జిల్లా స్థాయి నాయకులు ప్రభుత్వ సిబ్బందిని తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తుంటే, కేంద్ర ఆర్థిక మంత్రి అయినప్పటికీ వ్యక్తిగత అవసరాలకు వారిని వినియోగించుకోకపోవడం ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటివి విషయాలు ఎక్కడా బహిర్గతం కాకపోవడం ఆయన నిరాడంబర జీవితానికి నిదర్శనం. చాలా మందికి తెలియని మరో విషయం ఏమిటంటే ఆయన కూతురు కాలేజీకి వెళ్ళడానికి ప్రభుత్వ బస్సు లోనే వెళ్ళేదన్న విషయం. ఈ రోజుల్లో చిన్న స్థాయి నాయకుడైన తమ పిల్లలకు మంచి ఖరీదైన కార్లు కొనేస్తున్నారు అంతేకాకుండా వారికి ప్రత్యేక సెక్యూరిటీ ని కూడా నియమిస్తున్నారు. కానీ మన్మోహన్ సింగ్ గారు మాత్రం తన పిల్లలను క్రమశిక్షణ తో పాటు నిజాయితీగా జీవించమని సూచనలు ఇచ్చే గొప్ప మానవతావాది.

మన్మోహన్ సింగ్ ఎక్కువ కాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1999లో దక్షిణ ఢిల్లీ నుండి లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయారు, ఆతర్వాత అతను ట్యాక్సీలు అద్దెకు తీసుకున్నందుకు రచయిత కుష్వంత్ సింగ్ నుంచి తీసుకున్న రూ.2 లక్షలు తాను ఉపయోగించలేదని చెప్పి వెంటనే తిరిగి ఇచ్చాడట. మన్మోహన్ సింగ్ దగ్గర 2 లక్షల రూపాయలు లేకపోవడమేంటని ఆశ్చర్యపోయిన ఖుష్వంత్ సింగ్, ఇదే విషయాన్నీ తాను రాసిన "Absolute Khushwant: The Low-Down on Life, Death and Most Things in-Between" అనే పుస్తకంలో డా. మన్మోహన్ సింగ్ చిత్తశుద్ధి ని ప్రస్తావిస్తూ ఇప్పటివరకు ఉన్న ప్రధానులలో మన్మోహన్ సింగ్ గొప్ప ప్రధాని, ఎలాంటి మచ్చలేని నాయకుడు అని ప్రత్యేకంగా రాశారు.

నిబద్ధత కలిగిన నాయకుడు:

ఇప్పటి వరకు ఏ దేశ ప్రధాని కూడా ఇంటి నుంచి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం మనం కనీ, వినీ ఉండకపోవచ్చు. కానీ మన్మోహన్ సింగ్ మాత్రం తన లంచ్ బాక్స్ ఇంటి నుండి తెచ్చుకొని తినేవారట. ఈ విషయాన్నీ అప్పటి లోక్ దళిత్ ఫోరమ్ సెక్రటరీ ఆర్ రవికుమార్ ప్రత్యేకంగా చూశానని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా తాను తీసుకున్న నిర్ణయాలు ఆయన నిబద్ధతకు నిదర్శనం. మనను ఆశ్చర్యానికి గురిచేసే మరో విషయమేమిటంటే, మన్మోహన్ సింగ్ లండన్ లో చదువుకునే రోజుల్లో తన తండ్రి సర్దుబాటు కాక సమయానికి డబ్బులు పంపించని సందర్భాలలో ఆయన తన వద్ద ఉన్న మొత్తం డబ్బులతో ఫేజు చెల్లించి కేవలం  మంచినీళ్ళు తాగేవారని ఆయన కూతురు తెలిపింది.

దారి చూపిన దార్శనికుడు:

దేశం ఆర్థిక సంక్షేమంతో కొట్టుమిట్టాడుతున్న వేళ, అత్యంత సాహసోపేతంగా విప్లవాత్మకంగా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి, జవసత్వాలుడిగిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన దార్శనికుడు మన్మోహన్ సింగ్. భారత్‌తో అమెరికా అణు ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య కొన్ని అడ్డంకులు వచ్చినా మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వం దృష్ట్యా అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌తో డాక్టర్ మన్మోహన్ సింగ్ చర్చల అనంతరం పౌర అణు ఒప్పందంలో సహకరిస్తామని ప్రకటించారు. అణు ఒప్పందం ప్రకటన తర్వాత మన్మోహన్ సింగ్ యొక్క ప్రధాన మంత్రిత్వానికి కీర్తి కిరీటం గా నిలిచింది. రెండు దేశాల మధ్య ఒప్పందం అణు వర్ణవివక్ష అంతం చేయడమే కాకుండా అనుకూలమైన భౌగోళిక రాజకీయ ఆకృతీకరణ సృష్టించింది. విదేశీ వ్యవహారాల్లో, ముఖ్యంగా అమెరికా తో సంబంధాలు మెరుగుపరచడంలో మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రధానికి అమెరికాలో గౌరవం లభించింది:
బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్‌ను అధికారిక పర్యటనకు ఆహ్వానించారు. తనను ఆహ్వానించినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు చెప్పబోతుంటే, "మీరు నాకు గురువులాంటి వారు మీలాంటి వారిని కలవడం నా అదృష్టం" అని వినమ్రంగా చెప్పారు ఒబామా. 
అంతేకాదు అణు ఒప్పందం కుదుర్చుకున్న రెండేళ్ల తర్వాత కెనడాలోని టొరంటోలో జరిగిన జీ20 కార్యక్రమంలో ఒబామా మాట్లాడుతూ. మన్మోహన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని చెబితే ప్రజలు తప్పకుండా వింటారనే మాటను మీరు నిజం చేసారని కొనియాడుతూ, ఆయన రాసిన ‘ఎ ప్రామిస్ ల్యాండ్’ పుస్తకంలో మన్మోహన్ గురించి ప్రస్తావిస్తూ, భారత ప్రజల సంక్షేమం కోసం ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి పనిచేశారని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ తన సంస్కరణలతో అనేక మందిని పేదరికం నుంచి బయట పడేసిన గొప్ప వ్యక్తి, ఆలోచనాపరుడు మరియు నిజాయితీపరుడు అని కొనియాడారు.

సుదీర్ఘ రాజకీయ జీవితంలో అత్యున్నత విలువలు పాటిస్తూ వ్యక్తిగత దూషణలకు ఆమడ దూరంలో ఉన్న అతి కొద్ది మంది ప్రముఖులలో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు సద్గతి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ అంజలి ఘటిద్దాం.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్ "వరుణవి"

  హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్  "వరుణవి" ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేరు అనే మాట నిజమని చక్కగా సాక్ష్య...