సంపద కన్నా… సంస్కారం గొప్పది.
మనిషి జీవితంలో కొన్ని వృత్తులు కేవలం జీవనోపాధి కోసం చేసేవి కావు. అవి ఇతరుల జీవితాలపై బాధ్యతను మోసేవి. అలాంటి అత్యంత బాధ్యతాయుతమైన వృత్తుల్లో డ్రైవర్ వృత్తి ఒకటి.
కోట్ల రూపాయలు వెచ్చించి విలాసవంతమైన కారును కొనుగోలు చేయవచ్చు. ఆ కారులో అత్యాధునిక సౌకర్యాలు, అత్యంత ఖరీదైన భద్రతా ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ ఆ స్టీరింగ్ను పట్టుకున్న వ్యక్తి ఒక్క క్షణం నిర్లక్ష్యం కారణంగా ప్రాణాపాయం సంభవిస్తే, ఆ కోట్ల విలువ చేసే కారు కంటే మనిషి ప్రాణమే గొప్పదని అర్థమవుతుంది. అందుకే ఒక విధంగా చెప్పాలంటే మన ప్రాణాలు దేవుడి చేతిలో ఉన్నాయో లేదో మనకు తెలియదు కానీ, ప్రయాణిస్తున్న ఆ క్షణాల్లో మాత్రం అవి డ్రైవర్ చేతుల్లో కచ్చితంగా ఉంటాయి.
అయినా సమాజంలో కొందరు డ్రైవర్ను కేవలం ‘ఉద్యోగి’గానే చూస్తారు. మరికొందరు వారి వృత్తిని చులకనగా భావిస్తారు. వారి చేతుల్లో తమ ప్రాణాలను పెట్టి ప్రయాణిస్తూ కూడా వారికి ఏ మాత్రం విలువ ఇవ్వరు. కానీ డ్రైవర్ అంటే కేవలం కారు నడిపే వ్యక్తి మాత్రమే కాదు. మనల్ని గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చే బాధ్యతను తన భుజాలపై మోసే మనిషి. మన కుటుంబ సభ్యులను, మన పిల్లలను, మన పెద్దలను తన బాధ్యతగా భావించి రోడ్డుపై అప్రమత్తంగా కాపాడే వ్యక్తి.
అందుకే ప్రతి డ్రైవర్ను గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి చేతిలో కేవలం స్టీరింగ్ ఉండదు… కొన్నిసార్లు ఒక కుటుంబం యొక్క ఆశలు, ఆనందం, భవిష్యత్తు, ప్రాణాలు కూడా ఉంటాయి.
అయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అలా ఆలోచించరు. కొందరు మాత్రం తమ వద్ద పనిచేసే వారిని డ్రైవర్ గా కాకుండా కుటుంబ సభ్యులుగా చూస్తారు. వారి శ్రమను గౌరవిస్తారు. కొన్నిసార్లు వారి కష్టాలను తీరుస్తారు. అలాంటి మనసున్న వ్యక్తుల కథలు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తాయి.
అలాంటి అరుదైన వ్యక్తిత్వానికి నిలువెత్తు ఉదాహరణే పూణే నగరంలోని ప్రఖ్యాత పారిశ్రామికవేత్త "జవేరి పూణావాలా" తన డ్రైవర్ పట్ల చూపించిన ఆప్యాయత, గౌరవం, మానవత్వంతో కూడిన ఈ కథ.
కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ద్వారా సుపరిచితుడైన అధర్ పూణావాలా సోదరుడు జవేరి పూణావాలా. సంపదకు, హోదాకు కొదవలేని కుటుంబంలో పుట్టిన ఆయనకు ఎందరో ఉద్యోగులు ఉండవచ్చు. కానీ వారిలో ఒకరితో ఆయనకు ఏర్పడిన అనుబంధం మాత్రం ఉద్యోగి–యజమాని సంబంధాన్ని మించింది.
జవేరి పూణావాలా వద్ద లిమోసిన్ డ్రైవర్గా గంగాదత్తా అనే వ్యక్తి ఏకంగా ముప్పై సంవత్సరాల పాటు సేవలందించారు. మూడు దశాబ్దాల పాటు ఒక కుటుంబంతో కలిసి ప్రయాణించడం అంటే కేవలం ఒక ఉద్యోగం చేయడం కాదు. ఆ కుటుంబంలోని ఎన్నో సంతోషాలను, బాధలను, విజయాలను, కష్టాలను దగ్గరుండి చూడడం. గంగాదత్తా కూడా జవేరి కుటుంబంలో ఒక ఆత్మీయుడిగా మారిపోయారు.
అయితే ఒకరోజు ఊహించని విషాదం చోటుచేసుకుంది. జవేరి పూణావాలా అత్యంత ముఖ్యమైన మీటింగ్ పనిమీద ముంబైలో ఉన్న సమయంలో గంగాదత్తా మరణించారనే వార్త ఆయనకు అందింది. ఆ వార్త విన్న వెంటనే జవేరి పూణావాలా తనకు ఉన్న సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. తనకు ఎంత ముఖ్యమైన పని ఉన్నప్పటికీ, మూడు దశాబ్దాలుగా తన కోసం పనిచేసిన మనిషి చివరి ప్రయాణానికి తాను హాజరు కావడం అంతకంటే ముఖ్యమని భావించారు. తాను పూణే చేరుకునే వరకు అంత్యక్రియలను నిర్వహించవద్దని గంగాదత్తా కుటుంబ సభ్యులను కోరారు. కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించడంతో ఆయన హుటాహుటిన హెలికాప్టర్లో పూణేకు బయలుదేరారు. పూణే చేరుకున్న అనంతరం ఆయన చేసిన పని అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.
ముప్పై సంవత్సరాల పాటు గంగాదత్తా నడిపిన అదే లిమోసిన్ కారును పూలతో అందంగా అలంకరించారు. అందులో గంగాదత్తా పార్థివ దేహాన్ని ఉంచారు. ఆ తర్వాత. ఆ ముప్పై సంవత్సరాల ప్రయాణానికి ఒక అపూర్వమైన ముగింపుగా, గంగాదత్తా చివరి ప్రయాణాన్ని అదే కారులో స్వయంగా గంగాదత్తా నివాసం నుంచి శ్మశానవాటిక వరకు జవేరి పూణావాలానే ఆ లిమోసిన్ను నడిపించారు.
ఈ ఘటన గురించి పలు మీడియావాళ్లు ఆయనను అడిగినప్పుడు, విషణ్ణ వదనంతో జవేరి పూణావాలా చెప్పిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి.
“గంగాదత్తా నాకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందించాడు. అందుకు ప్రతిగా నా కృతజ్ఞతను ఈ విధంగా వ్యక్తపరుచుకునే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.” అన్నారు.
ఒక డ్రైవర్ను కేవలం ‘ఉద్యోగి’గా చూడకుండా… అతని కష్టాన్ని, అతని త్యాగాన్ని, అతని కుటుంబం కోసం అతను చేసిన పోరాటాన్ని గుర్తించిన వ్యక్తి జవేరి పూణావాలా.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475