9, ఏప్రిల్ 2024, మంగళవారం

చరిత్ర సృష్టించిన మలయాళ చిత్రం “ ఎన్ను నింటే మొయిదీన్ ”.

చరిత్ర సృష్టించిన మలయాళ చిత్రం ఎన్ను నింటే మొయిదీన్ ”. 

ప్రేమించే హృదయానికి ధనిక , పేద అనే తేడా ఉండవు .. నిజమైన ప్రేమికులకు కుల , మత బేధాలు ఉండవు .. ప్రపంచంలో డబ్బు మించిన శక్తివంతమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే . కుల మత బేధాలను ఎదురించే శక్తి ప్రేమకు మాత్రమే ఉందనడంలో అతిశయోక్తి లేదు . అంతేకాదు తల్లిదండ్రులను సైతం మరిపించగల శక్తి ప్రేమకు కలదు . ప్రాణ స్నేహితుల మధ్య కూడా చిచ్చురగగలిగే శక్తి . ప్రాణాలు తీసే శక్తి కలదు ప్రేమకు . ప్రేమ ఒక మధురమైన అనుభూతి , అనిర్వచనీయమైన భావన .  

ఎన్నో ఏళ్లుగా తమ ప్రియురాలు కోసం ఎదురు చూసి చివరికి ప్రేమ విఫలమైన ప్రేమికులను మన నిజ జీవితంలో చూస్తుంటాం . కానీ బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తే గర్ల్ ఫ్రెండ్ లను చాలా తక్కువ మందిని చూస్తుంటాం . ప్రేమిస్తానంటూ నమ్మించి మోసం చేసి చాటేసిన బాయ్ ఫ్రెండ్స్ మరియు ఎంతోకాలంగా ప్రేమించినట్లు నటిస్తూ చివరకు వేరే వారిని పెళ్లి చేసుకున్న గర్ల్ ఫ్రెండ్స్ మన దైనందిన జీవితంలో తారసపడటం సహజమే కానీ కొందరు యువతీ యువకులు మాత్రం ప్రేమ కోసం పెద్దలను ఎదిరించడానికి కుల , మత కట్టుబాట్లను అధిగమించడానికి కూడా వెనుదిరగని విశ్వాసంతో పెళ్లితో ఒక్కటవుతుండటం విశేషం .ఇలాంటి సంఘటనలు మనం నిత్య జీవితంలో కంటే సినిమాల్లోనే ఎక్కువగా చూస్తున్నాను . అంతేకాదు నిత్య జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను చిత్రీకరించడంలో మన దేశ సినీ పరిశ్రమలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు .​ 

తెలుగు , తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో ప్రేమ సినిమాలు వచ్చినా . వాటిలో కొన్ని మాత్రమే ప్రేమికుల హృదయాలను కదిలించాయి . ఎస్ శంకర్ నిర్మించిన తమిళ చిత్రం " కాదల్ " అటువంటి చిత్రమే . ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది . ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకున్నారని ప్రియుడిని చిత్రహింసలు పెట్టి అమ్మాయికి తల్లిదండ్రులు వేరే పెళ్లి చేయడం వల్ల ప్రియుడు పిచ్చివాడు కావడం , కొన్ని సంవత్సరాల తరువాత తన ప్రియుడిని పిచ్చివాడు గా గుర్తించి ప్రియురాలు అతని దయనీయ పరిస్థితి కి తానే కారణమని బాధపడిన ప్రేమికుల హృదయాన్ని ద్రవింపజేస్తుంది .అప్పట్లో సినిమా సంచలనం సృష్టించింది

ప్రియురాలి కోసం ప్రియుడు ప్రాణత్యాగం చేయడం ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూశాం . అయితే ప్రియుడిని పెళ్లి చేసుకున్న 22 ఏళ్లుగా ఎదురుచూస్తే ప్రేయసి బహుశా సినిమాలో చూసుండకపోవచ్చు . 1960 మరియు 70 దశకంలో కేరళలోని ముక్కమ్‌లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా RS విమల్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం " ఎన్ను నింటె మొయిదీన్ " .

కేరళలోని ముస్లిం కుటుంబానికి చెందిన మొయిదీన్ మరియు హిందూ కుటుంబానికి చెందిన కాంచనమాల మధ్య వాస్తవంగా సంభవించిన విషాదకరమైన ప్రేమకథ ఇది . చిత్రం 1960 లో ఇరువంజిప్పుజ నది మరియు ముక్కం గ్రామం నిర్మాణం జరిగిన మొయిదీన్ మరియు కాంచనమాల నిజ జీవిత ప్రేమ కథ ఆధారంగా రూపొందించబడింది . సినిమాలో సన్నివేశాలన్నీ ప్రేమికులకు ఉత్కంఠభరితంగా ఉండి వారిని భావోద్వేగాలకు గురిచేస్తాయి . ముస్లిం కుటుంబానికి చెందిన మొయిదీన్ , హిందూ కుటుంబానికి చెందిన భూస్వామి కుమార్తె అయిన కాంచనమాల ఇరువురు ప్రేమలో పడిన సమయంలో మతాంతర వివాహాలు నిషిద్ధంగా పరిగణించబడుతున్నందున , వారి ప్రేమ వివాహానికి ఇద్దరి కుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో విడిపోవాల్సి వచ్చింది .మరో పెళ్లి కావాలని కాంచనమాల తండ్రి కట్టుదిట్టమైన ఆంక్షలతో చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు . పెళ్లి చేసుకుంటే మొయిదీన్ ను పెళ్లి చేసుకుంటానని , లేదంటే అవివాహితగా ఉండిపోతానని కాంచనమాల తన తండ్రికి చెప్పిన సంఘటన అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు . వీరిద్దరూ తమ ప్రేమ గురించిన లేఖల ద్వారా వ్యక్తం చేసుకునే క్రమం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది .రోజు ఆమెను సంప్రదాయవాద బంధువులు పట్టుకుని నిర్దాక్షిణ్యంగా కొట్టిన సందర్భం ద్వారా ప్రేక్షకుల గుండెలు బరువెక్కేలా సన్నివేశాన్ని చిత్రీకరించడం అభినందనీయం . కాంచనమాలతో విడిపోవడానికి మొయిదీన్ అంగీకరించారు ,

మొయిదీన్ తండ్రి బాల్యంబ్ర పొట్టాట్టు ఉన్న మొయిదీన్ సాహిబ్ కొడుకుని ఇంట్లోనుండి వెళ్ళగొట్టాడు . తర్వాత మొయిదీన్ సామాజిక - రాజకీయ కార్యకర్తగా మారారు . రోజు మొయిదీన్ తండ్రి దగ్గరి సంబంధీకుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మొయిదీన్ ని అడగగా అందుకు మొయిదీన్ నిరాకరించడంతో , అతని తండ్రి ఓరోజు మొయిదీన్ ని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు .అదృష్టవశాత్తు మొయిదీన్ బతికి బయటపడ్డారు . కన్న కొడుకుని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నం చేశాడని తెలిసి భర్తకు దూరంగా ఉంటూ కొడుకు బాగోగులు చూస్తుంది అతని తల్లి . అనంతరం మొయిదీన్ తండ్రి పై బహిరంగంగా హత్యాప్రయత్నం చేసినందుకు కేసు నమోదు చేశారు . అనంతరం కోర్టులో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు మొయిదీన్ చెప్పిన సమాధానం అందరినీ ఆలోచింపజేసింది . అంతేకాదు కేసుతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని , అనుకోని కారణాల వల్లే ఇలా జరిగిందని చెప్పారు . తండ్రి కేసు నుంచి విముక్తి పొందేందుకు కొడుకు గొప్ప మనసున్న వ్యక్తిత్వాన్ని కనబరిచాడు . కొడుకు సమాధానంతో మొయిదీన్ సాహెబ్ తన కుమారుడి పట్ల తన వైఖరిని మార్చుకున్నాడు . ఒక రోజు మొయిదీన్ సాహెబ్ తన భార్య మరియు కొడుకు వద్దకు స్వయంగా వెళ్లి ఇంటికి వెళ్లి ఉండమని చెప్పాడు మరియు రాత్రి మొయిదీన్ సాహిబ్ గుండెపోటుతో వెంటనే మరణించాడు .కాంచనమాల ఇంట్లో ఒప్పుకో ప్రత్యక్ష మొయిదీన్ మరియు కాంచన పారిపోవాలని నిర్ణయించుకున్నారు , అయితే మొయిదీన్ వారి పాస్ పోర్ట్ లను సేకరించి తిరిగి వస్తున్నప్పుడు , తను ప్రయాణిస్తున్న పడవ సుడిగుండంలో చిక్కుకుంది . అతను తనతో పడవలో ఉన్న సహచరులను రక్షించగలిగాడు , అతను సుడిగుండంలో చిక్కుకుని మరణిస్తాడు . అతని మరణం గురించి విన్న కాంచన ఆత్మహత్య చేసుకునే సమయంలో మొయిదీన్ తల్లి ఆమెను వారిస్తుంది . చివరికి , కాంచన మొయిదీన్ అవివాహితులుగా మొయిదీన్ ఇంట్లో నివసించడానికి ఇంటిని విడిచిపెట్టింది . ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసే సినిమా . అటువంటి స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత సంఘటనను చిత్రీకరించినందుకు మలయాళ చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు . ఇలాంటి చిత్రాలు చరిత్ర సృష్టిస్తాయి . 19 సెప్టెంబర్ 2015 విడుదలైన చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹50 కోట్లు వసూలు చేసింది , ఇది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది . “ కత్తిరున్ను పాటకు సంగీత దర్శకుడు ఎం . జయచంద్రన్ జాతీయ అవార్డును గెలుచుకోవడం గర్వించదగ్గ విషయం . ఇంకా , ఇది ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ , 5 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ , ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ , కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ నుండి అనేక అగ్ర అవార్డులను అందుకుంది

కులమతాల బండిఖానాలో బలైపోతున్న ప్రేమికులు ఎందరో

ప్రేమ అనేది కులం , మతం రంగుల కే పరిమితం కాదని , దేశాలు , ఖండాల వారీగా కూడా ప్రేమగలదని నిరూపించే యదార్థ సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం .పెద్దలను ఒప్పించి కుటుంబ సభ్యులందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న వారు కొందరైతే . కులం , మతం , పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే వారు మరికొందరు . కొంతమంది ప్రేమికులకు కులం , మతం , ధనిక , పేద తేడాలు సృష్టించి చివరకు ప్రేమికులు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి . ప్రేమకు కులం మతం పేద ధనిక అనే అంతరాలు సృష్టించడం అత్యంత బాధాకరం , అత్యంత ప్రమాదకరం కూడా . రెండు హృదయాలను కలిపేదే ప్రేమ . రెండు హృదయాలు కలిసి జీవించడానికి కులం మతం ఏమి అడ్డు కాదనేది అక్షర సత్యం . నేటి యువత ప్రేమకు ఇంచినంత ప్రాధాన్యత చదువుకు ఇవ్వడంలేదనేది జగమెరిగిన సత్యం . అందుకు కారణం ప్రేమకు యువతను ఆకర్షించే శక్తి ఎక్కువ ,   అత్యంత ప్రభావం వీరిపైనే ఉంటుందనడంలో సందేహమే లేదు . నిజమైన ప్రేమ లక్ష్యాలను సాధించడానికి నిస్వార్థంగా ముందుకు సాగుతుంది మరియు ఆత్మహత్యకు దారితీయదు . అవగాహన లేమితో ప్రేమికులు ఆవేశానికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడం విచారకరం

వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475       



 








7, ఏప్రిల్ 2024, ఆదివారం

ఈశాన్య రాష్ట్రంలో ఉద్భవించిన గొప్ప శాస్త్రవేత్త "సోనమ్ వాంగ్ చుక్".


సకల చరాచర జగత్తులో సమస్త ప్రాణికోటికి జీవనాధారం 'నీరు'. నీరు లేనిదే జీవరాశి మనుగడ లేదనడంలో అతిశయోక్తి లేదు. ప్రాణమున్న ప్రతి జీవికి గాలి తర్వాత అత్యవసరమైన ప్రకృతి వనరు నీరు. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య నీరు. వాతావరణంలో అనేక మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల, కాలుష్యం, భూగర్భ జలాల మితిమీరిన వాడకం మరియు వర్షపు నీరు తిరిగి భూమిలోకి ఇంకక పోవడం వల్ల నీరుకొరత ఏర్పడుతుంది. ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి సురక్షితమైన మంచినీరు అందుబాటులో లేదు, దాదాపు సగం మందికి తగిన నీటి పరిశుభ్రత సేవలు లేవని ఐక్యరాజ్యసమితి నివేదించింది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు నీటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని కొందరికి మాత్రమే తెలుసు.
లడఖ్ భారతదేశంలోనే అత్యంత అందమైన ప్రదేశం. అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు మరియు ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. హిమాలయాలకు పశ్చిమాన చివరలో ఉన్న లడఖ్ నాలుగు ప్రధాన పర్వత శ్రేణులను కలిగి ఉంది. హిమాలయ, జన్స్కార్, లడఖ్ మరియు కారకోరం అన్నీ దాని గుండా వెళుతుంటాయి. ఇది సముద్ర మట్టానికి 3,000 మరియు 8,000 అడుగుల మధ్య ఉంటుంది. ఇది సింధు నదీ పరీవాహక ప్రాంతంలో ఉంది. చాలా ఎత్తైన ప్రదేశం కారణంగా లడఖ వాతావరణం చాలా పొడిగా మరియు చల్లగా ఉంటుంది. లడఖ్లో రాత్రి ఉష్ణోగ్రతలు -30°C తగ్గుతాయి. ఎడారి ప్రాంతం కావడం వల్ల ఇక్కడ వృక్షసంపద చాలా తక్కువగా ఉండటంతో పాటు చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. తాగు మరియు వ్యవసాయానికి ప్రధాన నీటి వనరు హిమ నదీ కరిగే నీరు. ఈ ప్రాంతం అధిక ఎత్తులో ఉన్నందున, వాతావరణ మార్పుల కారణంగా హిమ నదీ కరిగే నీరు దిగువన ప్రవహిస్తుంది మరియు అందువల్ల లడఖ్ ప్రాంతంలో ఏప్రిల్-మే నెలలో తీవ్రమైన నీటి సంక్షోభం ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం లేకపోయింది. నీటి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో అక్కడి ప్రజలు వలస బాట పట్టారు.
సోనమ్ వాంగ్ చుక్ అనే మెకానికల్ ఇంజనీర్ ఒకరోజు వంతెన కింద నడుచుకుంటూ వెళ్తుండగా, వంతెన కింద భాగం మంచుతో కప్పబడి ఉండటాన్ని గమనించాడు. వాతావరణం కారణంగా చుట్టుపక్కల మంచు కరిగిపోయినా కింది వంతెన భాగం కరగలేదు. బ్రిడ్జి క్రింది భాగాన మంచు ఎందుకు కరగడం లేదో అనేక ప్రయోగాలు చేసిన తర్వాత సూర్యకాంతి లేనందున మంచు కరగలేదు అని తెలుసుకున్నారు. లడఖ్లో మంచును సూర్యుడి నుండి నీడగా ఉంచగలిగితే మంచు ఎక్కువ కాలం ఉంటుందని వాంగ్ చుక్ గ్రహించాడు. నీటి సమస్యను ఎదుర్కోవడానికి సోనమ్ వాంగ్ చుక్ కి వచ్చిన సరికొత్త ఆలోచన "మంచు స్తూపం. గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి ఒక పొడవైన పైపును ఆధారంగా చేసుకొని పైనుండి వాటర్ ని స్ప్రింక్లర్ సిస్టమ్ ద్వారా పంపబడుతుంది. ఫిబ్రవరి 2014లో దాదాపు 30 నుంచి 50 మీటర్ల ఎత్తులో భారీ స్థాయిలో మంచు స్థూపం ఏర్పడుతుంది. చేసిన ప్రతి మంచు స్థూపం నుండి రోజుకు 5000 లీటర్ల నీటిని విడుదల చేయడం సోనమ్ వాంగ్ చుక్ ప్రతిభకు నిదర్శనం.
బాల్యమంతా అవమానాలే:
పుట్టిన ఊరిలో స్కూల్ లేకపోవడంతో 9 ఏళ్ల వరకు తల్లి దగ్గర చదివాడు.తర్వాత తండ్రి రాజకీయ ప్రభావంతో మంచి స్కూల్లో అడ్మిషన్ పొందారు. స్కూల్లో టీచర్లు చెప్పే ఇంగ్లీషు పాఠాలు అర్థం కాక చాలా ఇబ్బంది పడేవారు. 9 ఏళ్ల వరకు అమ్మ నేర్పిన స్థానిక భాష మాత్రమే తెలిసిన అతడికి స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాలు వింతగా అనిపించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండేవాడు. అందుకే స్కూల్లో అందరూ అతన్ని చదువురాని మొద్దు అని పిలిచేవారు. తోటి విద్యార్థుల అవమానము భరించలేక ఒంటరిగా ఢిల్లీకి పారిపోయాడు. చదువుపై ఆసక్తితో ఢిల్లీలోని విశేష కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ ని కలిసి తన పరిస్థితిని వివరించాడు, తాను రాజకీయ నాయకుడి కుమారుడిని, చదువు పూర్తయ్యే వరకు తన ఆచూకీ తల్లిదండ్రులకు మరియు ఎవరికీ చెప్పకూడదని కోరాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, వాంగ్ చుక్ తన చదువులో చురుకైన విద్యార్థి పేరు పొందాడు. అనంతరం ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు నిజం చెప్పి వారి వద్దకు పంపించేందుకు ప్రయత్నించారు. తల్లిదండ్రుల వద్దకు చేరిన తర్వాత చదువు ఆగకుండా కొనసాగుతుంది. వాంగ్ చుక్ ఆర్థిక నిపుణుడిగా ఎదగాలని అతని తండ్రికి బలమైన కోరిక ఉండేది. శ్రీనగర్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్ని అనుకోని కారణాల వల్ల మళ్లీ తల్లిదండ్రుల నుంచి విడిపోయారు. తన తండ్రి కోరిక తీర్చనందుకు తండ్రి వాంగ్ చుక్ ను అసహ్యించుకున్నారు. సోనమ్ వాంగ్ చుక్ బాల్యం కష్టాలు మరియు కన్నీళ్లతో సాగింది. లడఖ్ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన (SECMOL) విద్యాసంస్థలు స్థాపించారు.
వాంగ్ చుక్ విద్యా విధానం విప్లవాత్మకమైనది. అతను 1988లో స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చర్ మూవ్మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL)ని స్థాపించాడు. ఈ సంస్థ ఆచరణాత్మక, పర్యావరణ అనుకూల విద్యపై దృష్టి సారించింది. విద్యావ్యవస్థలో గొప్ప మార్పు అవసరమని భావించి విద్యార్థుల బృందంచే స్థాపించబడింది. 10వ తరగతి పరీక్షల్లో విఫలమైన 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి వారి విద్య అంతరాన్ని అనుభవించిన లడఖ యువతకు ప్రవేశ అవకాశాలను అందించడంలో ఈ ప్రత్యేకత ఉంది. ఇది ఎక్కువగా వారి మాతృభాష లడఖీలో బోధించబడుతుంది. విద్యావేత్త "వాంగ్‌చుక్" ప్రతి విద్యార్థికి మాతృబాష తప్పనిసరని లడఖీ భాషలో పెంపొందించారు. అలాగే వికలాంగ అభ్యర్థులు, అనాథలు మరియు తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడుతుంది. పాఠశాలలో పేద విద్యార్థులకు స్పాన్సర్షిప్ మద్దతును కూడా అందిస్తుంది. SECMOL సాంప్రదాయేతర పాఠశాలగా నిలుస్తుంది. సాంప్రదాయ సంస్థ వలె కాకుండా, ఇది ప్రామాణిక పాఠ్యాంశాలకు కట్టుబడి ఉండదు. బదులుగా, విద్యార్థులకు ప్రాక్టికల్ సైన్స్ మరియు సామాజిక సమస్యల నుండి పబ్లిక్ స్పీకింగ్, గార్డెనింగ్, జంతువులు మరియు చెట్ల సంరక్షణ, లడఖీ పాటలు, నృత్యం మరియు సాంస్కృతిక విద్య వంటి విభిన్న అంశాలలో శిక్షణ ఇస్తారు. SECMOL లో, ప్రాథమిక దృష్టి విద్యావిషయక పరిజ్ఞానంపై కాదు, విద్యార్థులలో ఆచరణాత్మక మరియు సామాజిక లక్షణాలు మరియు నైపుణ్యాలను అందిస్తుంది.
SECMOL సోలార్ హీటెడ్, ఎకో-ఫ్రెండ్లీ భవనాలను డిజైన్ చేయడం, నిర్మించడంలో యువతకు 2 సంవత్సరాల కోర్సు నిర్వహించారు. SECMOL పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది.
ఒకప్పుడు లడఖ్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 5 శాతం మాత్రమే. ఈ కారణంగా విద్యాసంస్థలకు బీజం ఏర్పడింది. లడఖ్ ప్రాంతంలో విద్యార్థుల తల్లిదండ్రులకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పిల్లలకు అర్థమయ్యే రీతిలో తల్లిదండ్రులు పాఠాలు బోధించారు. దీనితో విద్యార్థుల నైపుణ్యం బయటకు రావడమే కాకుండా తక్కువ సమయంలో 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. లడఖ్ ప్రాంతంలో విద్యార్థులకు విద్యను అందించడంలో ఆయన గొప్పగా కృషి చేశారు.
“మంచు స్థూపం” కొండ ప్రాంతాలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించడంలో మరో మార్గదర్శక ఆవిష్కరణ. 2021లో, అతను లడఖ్ ప్రాంతంలోని సియాచిన్ మరియు గాల్వాన్ లోయ వంటి అత్యంత శీతల ప్రదేశాలలో ఆర్మీ సిబ్బంది ఉపయోగించగల పర్యావరణ అనుకూలమైన సోలార్ హీటెడ్ టెంట్ కూడా నిర్మించారు. లడఖ్లోని భీకరమైన శీతాకాలాలను ఎదుర్కొనేందుకు మట్టితో తయారు చేసిన తక్కువ ధర సౌర-వేదికతో కూడిన భవనాలను రూపొందించడంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు.
వాంగ్ చుక్ వ్యక్తిత్వం 2009 చిత్రం '3 ఇడియట్స్‌లో అమీర్ ఖాన్ యొక్క కాల్పనిక పాత్ర ఫున్సుఖ్ వాంగ్డుకు స్ఫూర్తినిచ్చింది.
ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం పోరాటం:
లడఖ్ రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలో ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని తదితర డిమాండ్లతో మార్చి 6 నుంచి అత్యంత కఠినమైన వాతావరణంలో కొనసాగిన ఆయన దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడం, గిరిజన తెగలను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా స్థానిక స్వపరిపాలన కల్పించడం, స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేయడం వారి డిమాండ్లలో ప్రధానాంశాలు. పర్యావరణం కోసం ధిక్కార స్వరాన్ని వినిపించారు. లెక్క‌లేనన్ని ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడు సోన‌మ్ వాంగ్ చుక్.
2018లో రామన్ మెగాసెసే అవార్డు పొందారు. ఐసీఏ పురస్కారం, సోషల్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ , రోలెక్స్ అవార్డ్, ఇంట‌ర్నేష‌న‌ల్ టెర్రా అవార్డుతో పాటు ప‌లు జాతీయ, అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు ల‌భించాయి.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

9, మార్చి 2024, శనివారం

మత్తడి దునికిన కోపుల నీళ్లు

కష్టజీవి కన్నీటి చిరునామా.. "మత్తడి దునికిన కోపుల నీళ్లు" నవల.

సాహిత్య ప్రక్రియలలో కథలు, వ్యాసాలు మరియు నవలలకు ప్రత్యేక స్థానం ఉంది. వివరంగా చెప్పాలనుకున్న ప్రతి కూలంకషంగా నివేదన నవలల ద్వారానే సాధ్యమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

“పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం నీ తప్పు” అన్నఅబ్దుల్ కలాం మాట అక్షర సత్యం. సమస్యలను సాకుగా చూపుతూ విజయం సాధించలేకపోయామని వాపోయే చాలా మంది యువత మనకు నిజ జీవితంలో తారసపడుతుంటారు. మరి కొందరు మాత్రం తమ తల్లిదండ్రుల మాటలను ఆదర్శంగా తీసుకుని ఎన్ని ఆటంకాలు, అవమానాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. లక్ష్యం ముందు లక్ష సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నవారే లక్ష్యాన్ని సాధిస్తారనేది జగమెరిగిన సత్యం.

నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఎంతో మంది విద్యార్థులు తమకంటూ ఓ ఆశయం పెట్టుకుని సమాజంలో ఎదురైన అవమానాలను అవకాశాలుగా మలచుకొని ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. అయితే వారిలో కొందరు తమ లక్ష్యసాధనలో ఎదురైన ఆటుపోట్లను భావి తరాలకు లేదా ప్రస్తుత యువతకు ఎలాంటి సందేశాన్ని అందించలేకపోతున్నారు. కాగా మరి కొందరు తమ స్వీయానుభావాలను రచనలు, నవలల రూపంలో నేటి యువతకు స్ఫూర్తిగా అందిస్తున్నారు. రచయితలు ఇప్పటివరకు అనేక చిత్రాల నవలలు వెలువరించిన యువతను ఉత్తేజపరిచే అంశాలతో విడుదలైన నవలలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలోనే భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్) చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ "డాక్టర్ వెన్నం ఉపేందర్ (IPoS)" కలం నుండి జాలువారింది యువతకు స్ఫూర్తి దాయకమైన నవల "మత్తడి దునికిన కోపుల నీళ్లు".

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన వెన్నం ఉపేందర్ గారి స్వగ్రామం సూర్యాపేట జిల్లా, మద్దిరాల మండలం లోని మారుమూల పల్లె గుమ్మడవెల్లి. ఆయన జీవితంలో తినడానికి తిండి లేక పస్తులున్న సందర్భాలెన్నో. కాలే కడుపుకి కాసిన్ని నీళ్లు, సలిపించే గాయానికి కాసింత పశుమూత్ర పూత అన్నట్లుగా ఆయన ఆకలి ఆర్తనాదానికి కాసిన్ని నీళ్ళే ఊరట, పేదోడికి గాయాలైతే కన్నా పైసల కోసం తండ్లాడే నొప్పి ఎక్కువ. పైసలు లేక పశు మూత్రం తో గాయంపై రాసుకుని ఉపశమనం పొందిన జీవితం ఆయనది. అలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఆశయం కోసం ఆకలిని అదిమిపెట్టి, ఆశయమనే నిచ్చెన మెట్లు ఎక్కి తీరాలంటే అకుంఠిత దీక్షతో పుస్తకాల పురుగయిండు. పేద జీవితం గట్టెక్కాలంటే చదువే మార్గమని భావించాడు. ఉపేందర్ చూపు చదువుపైనా, ఆకలి అటకపైనా సాగిన ఆయన జీవన ప్రస్థానం ఇతివృత్తంగా అక్షరీకరించిన నవల ఈ "మత్తడి దునికిన కోపుల నీళ్లు".

సాధారణంగా కొన్ని నవలలో ఒక ప్రదర్శన రాస్తారు. కానీ వెన్నం ఉపేందర్ నవలలు భిన్నంగా ఉంటాయి. పాఠకులకు కృతజ్ఞతా భావాన్ని కలిగించేలా మరియు వారి హృదయాలను కదిలించేలా చాలా అంశాలు అద్భుతంగా వివరించబడ్డాయి. ఈ నవలలోని ఇతివృత్తాలు అక్షరీకరించబడిన జీవితం, అనాథల జీవనం - చితికిన పసితనం, హైస్కూల్ చదువులు - ఆమ్లపు చినుకుల స్పర్శలు, సినిమా చూడామా - అయ్యో శని మామ, మా ఊరు మా ఇల్లు - ఎప్పటికి ఒడవని ముచ్చట. తెగి అతికిన ఇంటర్-కంట అలుగు పోసిన కన్నీరు, కలలతో ములకాతు, రంగులు వెలిసిపోయిన ఓ తాత కల, కుండ పలిగిన కల, చెదిరిన పెళ్లి పల్లకి కల, చచ్చి మర్లబతికిన కల, మా నాయన ఖలినపడ్డ కల, తెలిగిపోతున్న తల్లివేళ్ల కల, మా జీవితాలే అప్పు పడ్డయి,    

ఆయన వెలువరించిన "అక్షరీకరించబడిన జీవితం" ఇతివృత్తం ద్వారా గ్రామీణ యువతకు అమూల్యమైన సందేశాన్ని అందించారు. గ్రామీణ యువత ఎదగాలంటే, ఒదిగి చదువుకోవాలని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువును నిర్లక్ష్యం చేయొద్దని, "నీ వల్ల గాదన్న నిచ్చెన మెట్లు ఎక్కి తీరాలి. ఆకలి భౌతికం - ఆవేదన మానసికం" అని ఈ నవలలోని నేపథ్యం పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంకా అమ్మతనంలో ఉన్న కమ్మతనాన్ని ఒక కవిగా వర్ణించిన తీరు అత్యద్భుతం. అమ్మతనం ఆగి పోవద్దు - భార్య అని మనం అనుకుంటాం కానీ. భార్య అమ్మ రూపంలో అమ్మే భార్య (స్వప్న) అని పాఠకుల హృదయాలను కదిలించారు. 

"హైస్కూల్ చదువులు - ఆమ్లపు చినుకుల స్పర్శలు" ఇతివృత్తాన్ని పరిశీలించినప్పుడు ఆయన స్వగ్రామంలో 8వ తరగతి లేకపోవడంతో చదువుకోసం కాలినడకన రోజుకు 16 సంవత్సరాల పాటు ప్రయాణిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువును కొనసాగించే తీరు పాఠకుల హృదయాలను ద్రవింపజేస్తుంది. ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంటూ పాఠకులకు తన బాల్య స్మృతులను పరిచయం చేస్తూ అక్షరీకరించారు. ఆయనది చెప్పులు కొనలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని దుస్థితి. ఆయన నడక ప్రయాణంలో కాలికి కసితీరా గుచ్చుకున్న తుమ్మ ముండ్లు , అపుడప్పుడు బాటకు అడ్డంగా ఎదురయ్యే తాసుపాములు, రోజుకోసారి వచ్చిపోయే ఎర్రబస్సులను చూస్తూ సాగిన హైస్కూల్ సదువు ఆమ్లపు చినుకుల సుఖాన్ని తెలియజేసినట్లు పేర్కొన్నారు. పూట గడవని పరిస్థితి వారిది. 8వ తరగతిలో చేరిన కొన్ని నెలలకే హాస్టల్ సీట్ వచ్చినప్పటికీ గొడ్ల కొట్టంతో కూడిన హాస్టల్ లో సాయంకాలమైతే పక్కనే పశువుల మంద, హాస్టల్ చుట్టూ దోమలు స్వైరవిహారం చేస్తుండేవి. ప్రతిరోజు పచ్చిపులుసు, వంకాయ, గోంగూర కూరలు. సుఖమెరగని హాస్టల్ జీవితం. హాస్టల్ లో పురుగులు పడిన అన్నం తిని నెలకోసారి జ్వరం. హాస్టల్ కి నాయన తెచ్చిన పుస్తకాన్ని అతిమధురమైన జ్ఞాపకంగా గుర్తించుకోవడం గొప్ప విషయం. ఒకరోజు వాళ్ళ నాన్న రెండు కోరికలు కోరిండు. ఒక్కటి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూపిస్తూ "నువ్వు ఇలాంటి గాలిమోటార్లల్ల తిరగాలి అది నా కల. రెండోది నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే చూడాలని ఉంది. నాయనంటే ఏడాదికోమారు వికసించే జ్ఞాపకం. .

ఈ ప్రపంచంలో అమ్మ కష్టం ముందు ఏది సరితూగదు అంటే తన అమ్మ పడిన కష్టాన్ని "కలలతో ములాకాతు" లో ఎంతో వివరంగా కనుగొన్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు అందరిలాగే తన అమ్మ కూడా గునుగు పూలు, బంతి పూలతో బతుకమ్మ పేర్చడం చూసేది కానీ చెరువు దగ్గరకు బతుకమ్మ ఆడేందుకు వెళ్లడం ఎప్పుడూ చూడలేదు. పేర్చిన బతుకమ్మ ఇంటి పక్కన వారికి ఎవరికో ఇచ్చేది ఒక రోజు అమ్మను అడిగాడు "అమ్మ నువ్వు ఎందుకు బతుకమ్మ పట్టుకొని చెరువు దగ్గరకు రావు అని అడగగా అడగగా ఓ రోజు అమ్మ చెప్పిన సమాధానం "బోసి మెడ, కాళ్లకు మెట్టెలు లేవు యెట్లా రాను కొడుకా" అది విన్న కొడుకు కళ్ళలో మత్తడి దూకిన కోపుల నీళ్లు లాగా కళ్లలో నీళ్లు దునికినై.లోకమంతా సదువు బందు చేసి, నాలుగు రూపాయలు వచ్చే పని చేయమన్నప్పుడు అమ్మ ఒక్కతే నువ్వు చదువుకోవాలి బిడ్డ, నువ్వు సదివి సదివి పెద్ద కొలువులు జెయ్యాలి నీ కష్టాలు నేను చూసుకుంటా బిడ్డ అని అమ్మ చెప్పిన మాటలను అక్షరీకరించి పాఠకులను ఉద్వేగానికి గురి చేశారు.

కష్టపడని తనముంటే కష్టాలను నిందించకు!

కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు!

ఈ సృష్టిలో ప్రతి మనిషికి ఆటంకాలు ఎదురవడం సహజమే కానీ, ఆశయం దిశగా అడుగులు వేస్తూ, అడ్డంకులను అవకాశాలుగా మార్చుకున్నప్పుడే విజయం మీ వద్ధకు చేరుతుందనేది అక్షర సత్యం. చదవాలనే కోరిక బలంగా ఉంది, చదవడానికి డబ్బు లేని నిరుపేద యువతకు ఈ "మత్తడి దునికిన కోపుల నీళ్లు" ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందడంలో ఎలాంటి సందేహం లేదు. 

వెన్నం ఉపేందర్ రచనలు కర్రు పుట్టింది, నారుమడి, నివేదనగా కవిత్వం, నెమలిక బరువు, ఎండమావి, కొన్ని వెలుగు నీడలు, మహాత్మాగాంధీ మంచి మాటలు ప్రతి రచనలో కూడా పాఠకుడిని ఆకర్షించే నవరసాలు చొప్పించడం వెన్నం ఉపేందర్ రచన నైపుణ్యానికి కలికితురాయిగా నిలుస్తుంది. వాస్తవిక ఘటనలను కథావస్తువుగా ఎంచుకుని తనలోని భావాలను కథలోని పాత్రల ద్వారా పాఠకుల గుండెల్లో గుచ్చుకునేలా చెప్పిన తీరును అభినందించడానికి మాటలు సరిపోవు అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. నేటి యువతకు ఉపయోగపడే మరిన్ని నవలలు వెన్నం ఉపేందర్ కలం నుండి జాలువారాలని ఒక పాఠకుడిగా నా ప్రగాఢ ఆకాంక్ష.

వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475









 


1, మార్చి 2024, శుక్రవారం

పరిచయం:

పరిచయం: 

నా పేరు కోట దామోదర్. నేను తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, మద్దిరాల మండలం, గుమ్మడవెల్లి గ్రామంలో పుట్టి పెరిగాను. మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో “ఎల్మోట్ ఆల్టర్నేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్” లో డిజైన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. ఒకటి నుండి పదవ తరగతి వరకు నా విద్యాభ్యాసం గ్రామీణ ప్రాంతంలో జరిగినందున, నేను ప్రకృతి సౌందర్యం మరియు గ్రామీణ నేపధ్యంలోని సంప్రదాయాలు మరియు నిబంధనలకు ఆకర్షితుడనయ్యాను. పల్లె వాతావరణంలో పెరిగిన నేను పల్లె జీవితం ఎలా భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మొదటగా “మా ఊరి జ్ఞాపకాలు” అనే వ్యాసం రాసాను. అలా నా వ్యాసరచనగ ప్రస్థానం “మా ఊరి జ్ఞాపకాలు” నుంచి మొదలైంది. వ్యాస రచనతో పాటు “కాలిగ్రఫీ ఆర్ట్” నా అభిరుచులు. గత నాలుగేళ్ల నుంచి వివిధ పత్రికల్లో విభిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాస్తున్నాను. చాలా వ్యాసాలు రాయాలనే కుతూహలం ప్రత్యక్ష సమయాభావం వలన ఇప్పటివరకు దాదాపు 70 వ్యాసాల వరకు రాసాను. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన నాకు సహజంగానే చేతి వృత్తులతో పాటు ఆయా శ్రామికుల కష్టాలు, కడగండ్లపై కూడా అవగాహన ఉండటంతో ఇతివృత్తంగా నేను రాసిన వ్యాసాలకు పాఠకుల నుండి మంచి స్పందన వచ్చింది. గతంలో చేతివృత్తులు సమాజానికి ఎలా ఉపయోగపడ్డాయి మరియు ఆధునీకరణ నేపథ్యంలోనేడు అవి ఎలా కనుమరుగవుతున్నాయి అనే అంశాలను నా వ్యాసాల్లో ప్రస్తావించాను. భుక్తి కోసం జీవనోపాధి తప్పని సరి అయినా నా మదిలోని భావాలను అక్షరీకరించి సమాజ హితం కోసం ఎంతో కొంత చేయాలన్నది నా తపన. ఆ తపనకు కార్యాచరణ నా రచనావ్యాసంగం. నా ఈ ప్రయత్నంలో ఎవరికి ఉపయోగపడినా నా కృషి ఫలించినట్లే.


కోట దామోదర్ 

మొబైల్: 9391480475 

ఈమెయిల్: kota.damodar @gmail.com 

7, ఫిబ్రవరి 2024, బుధవారం

తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన "లొట్టపీసు పూలు".

తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన "లొట్టపీసు పూలు".

తెలంగాణ నేలలోని ప్రతి అణువణువులోనూ ఓ స్ఫూర్తి, పోరాట పటిమ, మేధస్సు మిళితమై అసంఖ్యాక శక్తి యుక్తులు దాగి ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు అయితే సాహిత్యానిది ఒక ప్రత్యేక స్థానం. నేటి సాహిత్య ప్రపంచంలో ఎందరో కవులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కథలు చదువుతున్నప్పుడు పాఠకుడు తనకు తెలియకుండానే కథలోని పాత్రలో లీనమై గొప్ప అనుభూతిని పొందుతాడు. కొన్ని కథలు చదువుతున్నపుడు రచయిత మన పక్కనే కూర్చుని కథ చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. పాఠకులకు చదవాలని అనురక్తి కలిగించే కథలు ఉత్తమమైనవి. అలాంటి ఆసక్తికరమైన కథల్లో "శీలం భద్రయ్య"  రాసిన "లొట్టపీసు పూలు" ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గది.

ఆయన వెలువరించిన కథ కథను పరిశీలించగా అందులో ఒక్కో కథను నడిపించిన తీరు వర్ణనాతీతం అనిపిస్తుంది. ఒక్కో కథ చదువుతున్నప్పుడు శీలం భద్రయ్య స్వయంగా కథ చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. పాఠకులను మంత్రముగ్దులను చేసే ఛలోక్తులు కథలలో రాయడమంటే అది శీలం భద్రయ్యకే సాధ్యం అనే భావం ఏర్పడుతుంది.

ఈ కథల్లో తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను పాఠకుల హృదయాలను హత్తుకునే విధంగా వివరించారు. అట్టడుగు వర్గాలు, సామాన్యుల భాషను, కథా వస్తువులుగా ఎంచుకుని తెలంగాణ భాష ఖ్యాతిని విస్తృతం చేసే కృషి చేసారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలు, ప్రజల తిరుగుబాట్లు ఈ కథల్లో స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, సహజత్వాన్ని ఈ కథల్లో చిత్రించిన తీరు అభినందనీయం. కొన్ని కథలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తాయి. ఆనాటి ప్రజల జీవన స్థితిగతులను రచయిత హృద్యంగా వివరించారు. 

ఈ పుస్తకంలోని పదిహేను కథలు అచ్చమైన తెలంగాణ భాష మాండలికంలో సామాన్య పాఠకులకు కథలపై ఆసక్తి కలిగించే విధంగా వ్రాయబడ్డాయి.

"ఇసపురుగు" కథను పరిశీలిస్తే ఆనాటి అణగారిన వర్గాల జీవన విధానాన్ని విశ్లేషిస్తూ, దొంగతనం నేరం మీద జైలు కి వెళ్లిన భర్తను విడిపించడానికి అప్పు కొరకు నారాయణ పటేల్ దొర దగ్గరికి వెళ్తే దొర అనే అహంకారంతో నిమ్నజాతి మహిళపై అకృత్యానికి పాల్పడిన సందర్భంలో నర్సమ్మ పెద్దయ్య చెప్పిన సలహాను పాటించి చాకచక్యంగా తప్పించుకున్న తీరును అద్భుతంగా విశ్లేషించిన తీరును గమనించవచ్చు. ఎందరో ఆడబిడ్డలను బలిమి చేసి, వాళ్ళ చావుకి కారణమైన దొర మరణంతో గ్రామ ప్రజలు సంతోషించిన తీరు పాఠకులకు కథల పట్ల ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తుంది.

"కేంపు చెరువు" కథను పరిశీలిస్తే తెలంగాణ పల్లెల్లో పంట చేతికొచ్చిన తరువాత కోతపెట్టుకొవడమనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయంగా విశ్లేషిస్తూ, ఆడవాళ్ళు వడ్లు దంచే సమయంలో పాడుకునే పాట ఇప్పటి తరం వారికి తెలియజేయడం మరియు ఆ పాటను కథ రూపంలోకి తీసుకు రావడం శీలం భద్రయ్య పడిన తపన చెప్పకనే చెబుతుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే.. రజాకార్ల కాలం నాటి భయంకర సంఘటనలు కళ్లముందు చూసినట్టుగా కథను రాయడం,అంతేకాకుండా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల భూములు జలాశయం (రిజర్వాయర్) నిర్మాణానికి తక్కువకు విక్రయించేందుకు గ్రామ ప్రజల నుంచి సంతకాలు తీసుకుని ఊరు వదిలి వెళ్లాలని దొర హుకుం జారీ చేయడం, ఆ తర్వాత ఊరి జనం చేసేదేమీలేక ఊరు విడిచి వెళ్తున్న విషయం తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై ఊరి జనానికి అసలు విషయం చెప్పి ఆయుధాలతో దొర పై యుద్దానికి తెరలేపి దొర గడి పై దండయాత్ర చేసి దొరనే ఊరినుండి వెళ్లగొట్టిన తీరును ఎంతో ఓర్పుతో కథకు జీవం పోశారు శీలం భద్రయ్య. మూసీనది చరిత్రను ఈతరం వారికి తెలియజేసే క్రమంలో తన కథలను ప్రత్యేకమైన శైలితో, చమత్కారమైన సూక్తులతో కొత్త రూపును ఇచ్చారు రచయిత.

"బంచెర్రాయి" కథలో రజాకార్లు కాసోళ్లగూడెం సమీపాన బంచెర్రాయి దగ్గర ఎలాంటి అకృత్యాలకు, దారుణాలకు పాల్పడ్డారో విపులంగా వివరించారు. రాజారెడ్డి బిడ్డ పెళ్లి సంబరాలలో రజాకార్లు గ్రామం మీద దాడి చేసి ఉద్యమకారులను, వారి కుటుంబ సభ్యులను, బంచెర్రాయి దగ్గర కొత్తగా పెళ్ళైన రాజారెడ్డి బిడ్డ లచ్చువమ్మను రాజిరెడ్డి కళ్ళ ఎదుటే రజాకారులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీసి బంచెర్రాయి వల్లకాడుగా మార్చిన తీరును పాఠకుల హృదయాలు కలుక్కుమనేలా శీలం భద్రయ్య ఎంతో చక్కగా రాశారు. అర్ధరాత్రి కాసోళ్లగూడెంపై రజాకార్లు దాడి చేస్తున్నారని రాజిరెడ్డికి సమాచారం అందించడంతో రాజిరెడ్డి కండ్లు నిప్పులు కక్కినై. దుఃఖం కట్టలు తెంచుకుని ఊరి ప్రజలకు ధైర్యంతో పాటు కాక పుట్టించి జనం తిరుగుబాటుతో రాజిరెడ్డి కన్న బిడ్డను చంపిన చోటే రజాకార్లను చంపి పాతిపెట్టిన ఘటనను అద్భుతంగా వివరించారు. రజాకార్లపై పోరాటం చేసి, వారిని తరిమికొట్టిన కాసోళ్లగూడెం పేరుని పాఠకులకు గుర్తుండేలా చేశారు. బంచెర్రాయి కథలో భద్రయ్య రాసిన కొన్ని చమత్కారమైన మాటలు ఈ కథకు కొత్త రూపాన్నిచ్చాయి. “పావురంగా  సాదుకున్న బిడ్డ లచ్చువమ్మ అసువులు బాసినై. రాజిరెడ్డి నవ్వులూ బాసినై” అని రాశారు. పాఠకుడు ఈ కథ చదువుతున్నంత సేపు ఆ సంఘటన తమ కళ్లముందు జరుగుతున్నట్లు భావించేలా రాయడం రచయిత పరిణతికి అద్దం పడుతుంది. 

"కర్తవ్యం" కథలో, అప్పటి రోజుల్లో ఆదివారం రోజు పిల్లలు ఆటలాడుకునే తీరుని వివరిస్తూ, రాముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి ఎంకమ్మ ఎక్కెక్కి ఏడుస్తూ ఎట్లైనా తల్లిదండ్రులు లేని  పిల్లగాడిని బతికించుకోవాలని నాయనమ్మ పడ్డ కష్టాన్ని పొందుపరిచిన విధం పాఠకుల గుండెలు బరువేక్కించక మానదు. అంతేకాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్ ఖర్చులకు రాఘవయ్య సార్ చేసిన సహాయం తో బతికి, పై చదువులు చదివి, పెద్ద ఆఫీసర్ అవ్వడం, ఆ తరువాత రాముడు రాఘవయ్య సార్ ను కలవడానికి వచ్చినప్పుడు ఆ రోజే సార్ చనిపోవడం సార్ చేసిన త్యాగాలను తలుచుకుంటూ, సార్ రాసిన డైరీ తిరగేస్తుంటే రాముడికి ఆయన నడిచిన త్యాగపు గుర్తుల అడుగుజాడలు గోచరమవుతాయి. రాఘవయ్య కర్తవ్యాన్ని రాముడే కాదు మనమందరం సెల్యూట్ చేయాల్సిందే అనే విధంగా ఈ కథలో గురుశిష్యుల అనుబందాన్ని చాలా బాగా విశ్లేషించారు.  

"లొట్టపీసు పూలు" కథలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే “బతుకమ్మ పండుగ” ను తెలంగాణ ఆడపడుచులు పల్లెలలో సంబరంగా జరుపుకునే విధానాన్ని, వారి బంధాలు, అనుబంధాలను ప్రతిబింబించేలా చాలా బాగా విశ్లేషించారు. ఈ కథలో ఊరి పెద్దమనిషి ఎల్లయ్య పంతులు తడుకలు అల్లే శివుడు భార్య అడివమ్మ ఇద్దరిమధ్య పంచాయితిని పరిష్కరించి పండుగ పూట ఊరి చెరువులో శవమై తేలిండు. ఎల్లయ్య పంతులిని శివుడు చంపాడని ఊరి ప్రజలు ఎలా అనుమానించారో శీలం భద్రయ్య చాలా చమత్కారంగా వ్రాసారు "నరంలేని నాలుక ఎటైనా మల్తది" అని ఆసక్తికరమైన చమత్కారాలు ఉన్నాయి. బతుకమ్మ పేర్చడానికి పనికి రాని లొట్టపీసు పూలు ఎల్లయ్య పంతుల్ని ఎవ్వరు చంపినారో పట్టించాయి. అన్యం పుణ్యం ఎరుగని శివుడిని కాపాడినాయి. బతుకుదెరువు కోసం లొట్టపీసు చెట్లతో తడికలు అల్లుకునే శివుడు లొట్టపీసు చెట్లే గండం నుంచి గట్టెక్కిచ్చాయని దండంపెట్టుకుండు. 

"వేగుచుక్క" కథలో తండ్రి దేశభక్తిని చూసి కొడుకు సైనికుడు అవ్వడం. మేజర్ కిరణ్ చేసిన సాహసాలను వివరిస్తూ శత్రువులను ఓడించిన తీరుని ఎంతో విపులంగా వివరించారు. తెలంగాణ బిడ్డ తెగువ తెలివి ముందు శత్రువులు నిలవలేకపోయారని ఈ కథలో మేజర్ కిరణ్ ధీరత్వం మరియు కిరణ్ తండ్రి వెంకట్రామిరెడ్డి పటేల్ చేసిన సేవలను అక్షర బద్దం చేయగలిగారు. 

ఒక కథ పాఠకుడిని మెప్పించాలంటే రచయిత ఎంచుకున్న వస్తువు, ఆ కథ ఎత్తుగడ, రచన శైలి, అసాధారణమైన ముగింపు, చమత్కారమైన పద విన్యాసం ఉంటేనే పాఠకుడు ఆ కథను చివరిదాకా చదివి ఆనందించడంతో పాటు మధురానుభూతి చెందుతాడు.

శీలం భద్రయ్య రాసిన 15 కథలలో ప్రతి కథా దేనికది ప్రత్యేకమే. ప్రతి కథలో కూడా పాఠకుడిని ఆకర్షించే నవరసాలు చొప్పించడం శీలం భద్రయ్య రచనా నైపుణ్యానికి కలికితు రాయిగా నిలుస్తాయి. ఈ అద్భుతమైన కథలను చదివిన తరువాత పాఠకుడు సైతం కలం చేతబట్టి తన హృదయంతరాలాల్లో గూడుకట్టుకున్న భావాలకు జీవం పోయాలనే ప్రేరణ కలిగించేలా సాగింది శీలం భద్రయ్య “లొట్టపీసు పూలు”. వాస్తవిక ఘటనలను కథా వస్తువుగా ఎంచుకుని తన లోని భావాలను కథ లోని పాత్రల ద్వారా పాఠకుల గుండెల్లో గుచ్చుకునేలా చెప్పించిన తీరును అభినందించడానికి మాటలు సరిపోవు అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. సమాజాభివృద్ధికి ఉపయోగపడే మరిన్ని కథలు శీలం భద్రయ్య కలం నుండి జాలువారాలని ఒక పాఠకుడిగా నా ప్రగాఢ  ఆకాంక్ష.


వ్యాసకర్త 
కోట దామోదర్ 
మొబైల్: 9391480475 




 

జీవితం ఆశ-నిరాశల సంగమం:

  జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...