తెలుగు నట దిగ్గజం : కోట శ్రీనివాసరావు
ప్రముఖ నటుడు, మాజీ ఎమ్మెల్యే, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణ వార్త యావత్ సినీ ప్రేక్షకులందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకులను అలరించిన కోట శ్రీనివాసరావు గారికి అభిమానులు కోకొల్లలు. కోట అంటేనే హాస్యం, విలనిజం. హాస్యం ఆయన చిరునామా, విలనిజం ఆయన నైజం, నటనలో హాస్యాన్ని పండించడంలో ఆయనది ప్రత్యేక శైలి, కడుపుబ్బా నవ్వించడంలో. క్రూరత్వమైన పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టించడంలో కోట తరువాతే ఎవరైనా. ఏ పాత్ర చేసినా తన నటనా పటిమతో రక్తి కట్టించే నటుడు ఒక్కమాటలో చెప్పాలంటే ఓ లెజెండ్. ఆయన నటించిన కొన్ని విలక్షణమైన పాత్రలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన నటనలో జీవించి అందరిని నవ్వించాడు, ఆయన ఏ వేషం వేసినా ఆ పాత్రకు తగ్గట్టుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సహచర నటుల్లో కూడా ఆయనకు అభిమానుల ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు కోటన్నా నటనకు కోట్లమంది అభిమానులున్నారని. ఆయన నటించిన చిత్రాలలో విలన్గా, కమెడియన్గా, ఓ మధ్య తరగతి ఫాదర్గా ఆయన యాక్టింగ్, డైలాగ్స్ విలనిజానికే వన్నె తెచ్చింది. 'తంబీ, వారీ' అని ఆయన తెరపై పిలిచే పిలుపు. ప్రేక్షకులకు వినసొంపు. నైజాం యాస అయినా ఆయన డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. కొంతమంది అప్రయత్నంగానే ఆయన డైలాగ్స్ చెప్పగలరు. 750 కి పైగా సినిమాల్లో ఆయన చేసిన రోల్స్ కొన్ని డైలాగ్స్ ఎప్పటికి ప్రత్యేకమే. ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు అనేదానికన్నా అందరి గుండెల్లో "కోట" కట్టుకున్నాడు అనడం కరెక్ట్. మొదట్లో హాస్యానికి సంబంధించిన పాత్రలు చేసిన తర్వాత అనుకోకుండా 'గణేష్' సినిమాలో విలన్ పాత్ర రావడం ఆ తర్వాత ఆయనలో ఉన్న అసలు సిసలైన విలనిజం టాలెంట్ బయటపడింది. విలన్ పాత్రలంటే ఎలా ఉండాలో చేసి నిరూపించారు. ఆ సినిమా లోని డైలాగ్ ఇది "నాకైతే చార్మినారున్నంత హిస్టరున్నది". అవును నిజానికి ఆయనకు హిస్టరీ బాగానే ఉంది. ఆయన నటనకు ఫిదా కానిది ఎవరు? ఒకప్పుడు హీరోల కంటే ఎక్కువ అభిమానులు కోట గారికి ఉండేదంటే ఇది నమ్మలేని నిజం కూడా. సాధారణంగా ఒక హీరో డైలాగ్ చెప్తే ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం సహజమే కానీ ఒక విలన్ డైలాగ్ చెప్తే ప్రేక్షకులు చప్పట్లు కొట్టడమనేది తెలుగు సినీ పరిశ్రమలో కోట శ్రీనివాసరావు గారికి మాత్రమే సాధ్యమైంది. అంతేకాదు అదే సినిమాలో ఒక రాజకీయ నాయకుడి డైలాగ్ చెప్పి "నేను యాభై కోట్ల కుంభకోణం చేసిన... కాదంటలే! మరి నాకైతే చార్మినార్కున్నంత హిస్టరున్నది'. అని తన విలక్షణమైన నటనతో అందరినీ మెప్పించిన ఘనుడు కోట.
ప్రతిఘటన సినిమాలో "యాదగిరి" పాత్రతో ఆయన మంచి నటుడిగా గుర్తింపు రావడమే కాకుండా ఆయనకు నంది అవార్డును ఇప్పించింది. ఆ తర్వాత సినిమా 'ఆహానా పెళ్లంట' నుండి ఊహించని 'కామెడీ' అనే కోణాన్ని పరిచయం చేసి సామాన్య నటుడి నుండి అసామాన్య నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రతి పాత్రలో ఆయన నటన ఓ అద్భుతం. ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రల్లోనే మెప్పించిన ఆయన. మధ్యమధ్యలో కామెడీ మిక్స్ చేసిన విలనిజంతోనే అలరించి ప్రేక్షకులను మెప్పించాడు. కొన్ని పాత్రలకైతే కోట తప్ప మరెవరూ చేయలేరనే భావన కలిగేదంట అప్పటి దర్శకులకు.
అంతెందుకు 'మనీ' సినిమాలో కామెడీ లాంటి పాత్రల్లోనైతే కోటను తప్ప మరొకరిని ఊహించుకోవడం కూడా కొంచెం కష్టమే. 'భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు... భర్తగ మారకు బ్యాచిలరు' అనే సాంగ్లో కోట నటన వర్ణించలేనిది ఆ పాట ముమ్మాటికీ ఆయన తప్ప ఎవరూ చేయలేరు.
ఆయన తర్వాత వచ్చిన కొంతమంది నటులు ప్రకాష్ రాజ్ జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు సాధించారు కానీ కోట గారు మాత్రం సాధించలేక పోయాడు. అంతకుమించిన వర్సటైల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న నటుడు కోట శ్రీనివాసరావు గారికి జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు దక్కకపోవడం బాధాకరమైన విషయం. ఎక్కడో బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ నాటకాలాడి. ఆ నాటకాల ప్రస్థానం నుండి సినిమాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా నటుడిగా ఎన్నో ఎత్తులకు ఎదిగి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయంగానూ తన ప్రస్థానం కొనసాగించి. గణేష్ సినిమాలో "నేను బతకాలి తమ్మి బతకాలి" అన్న డైలాగ్ తో ఫేమస్ అయి. చివరికిదిగో ఇలా తన జీవితానికి టాటా చెప్పి వెళ్లిపోయారు కోట.
ఆయన తన నట జీవితంలో అన్ని పాత్రలు పోషించి ఎవరికీ సాధ్యపడని రికార్డులు సాధించారు. కానీ తన కొడుకు అర్థాంతర మరణంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారు.
సినిమా ప్రేక్షకులను నవ్వించిన నటులు జీవితంలో నవ్వుతు జీవించలేరనేది నమ్మశక్యం కాని నిజం. ఏది ఏమైనా కోట మృతి టాలీవుడ్ కి తీరని లోటు. కోట శ్రీనివాసరావు లాంటి వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించడానికి ఆయన మరోమారు నటకోటావతారం ఎత్తాల్సిందే.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి