29, నవంబర్ 2024, శుక్రవారం

కరెంట్ కార్మికుల కన్నీటి గాథలు

కరెంట్ కార్మికుల కన్నీటి గాథలు:

విశాఖపట్నం రోడ్డు ప్రమాద ఘటన మరిచిపోకముందే మరో ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. గురువారం అంటే 21.11.24 సాయంత్రం వాట్సాప్ చూస్తుండగా ఓ మిత్రుడు పంపిన వీడియో చూసి ఓపెన్ చేశాను. అది ఒళ్లు గగుర్పొడిచే వీడియో. సబ్ స్టేషన్‌లో పనిచేస్తున్న విద్యుత్తు ఉద్యోగి ఒక్కసారిగా షాక్‌కు గురై శరీరం మొత్తం కాలిపోయినప్పటికీ  ధైర్యంతో ప్రాణాలతో బయటపడిన ఘటన అది. మరో విషయం చెప్పడం మరిచిపోయాను ఆ వీడియో లో ఉన్న వ్యక్తి మరెవరోకాదు నా స్నేహితుడే. శరీరం కాలిపోవడం వల్ల నా స్నేహితుడే అని తెలుసుకోవడానికి కూడా చాల సమయమే పట్టింది. తెలిసిన మరోక్షణమే మిత్రుడొకరు కాల్ చేసి తెలియజేసిన వార్త పని ఒత్తిడి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని. కరెంట్ పని అంటేనే ప్రాణాలతో చెలగాటం. అందులో ఉద్యోగి కి పని ఒత్తిడి అంటే మరణంతో కుస్తీ చేయాల్సిందే.

కరెంట్ కార్మికుల కన్నీటి గాధ. వెలుగులు అందించే అన్నలకు బతుకంతా బాధ. ప్రపంచానికి వెలుగునందిస్తారు కానీ వారి జీవితాలలో వెలుగులు నింపుకోలేని నిస్వార్ధ కార్మికులు "కరెంటు కార్మికులు".

ఒక్క క్షణం కరెంటు లేకపోతేనే అల్లాడిపోయే మనం. మన సుఖం కోసం కరెంటు కార్మికులు పడే కష్టం. ఎండనక వాననకా, పగలనక రాత్రనక ఎల్లవేళలా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమాజానికి వెలుగునందించడం కోసం కరెంటు ఉద్యోగుల కష్టాల గురుంచి ప్రతిఒక్కరు తెలుసుకోవడం తప్పని సరి.

అసలు 21వ తేదీన ఏం జరిగిందంటే. ప్రమాద బాధితుడి పేరు కృష్ణ. నర్సంపేట 132 కేవీ సబ్ స్టేషన్‌లో గ్రేడ్ 1 ఉద్యోగి. అంటే సబ్ స్టేషన్‌లో విద్యుత్ సంబంధిత పనులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ ఉన్నతాధికారుల పని ఒత్తిడి కారణంగా కృష్ణ ఆ రోజు పెయింటింగ్ పని చేశాడు. పెయింటింగ్‌ పని చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో అతని శరీరం (చర్మం) 70 శాతం కాలిపోయిందని వైద్యులు వెల్లడించారు. చేసేపని ఒకటైతే చేయించేపని మరొకటి అన్నట్లు ఆయన విద్యుత్ ఉద్యోగి అయితే అతనితో పెయింటింగ్ పని చేయించడమేంటి? పెయింటింగ్‌లో ప్రావీణ్యం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యుత్ కార్మికులు చెప్పడం నిజం కాదా? అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ప్రమాదానికి కారణం ఎవరు? బాధ్యులెవరు? అనే విషయం పైనే మనం మాట్లాడుకోవాలి.  అతనికి సంబంధంలేని పని చేయించడానికి కారణం ఏంటి? పెయింటింగ్ పని అతనికి సంబంధంలేనప్పుడు అతనిపై పై అధికారులు ఒత్తిడి చేయాల్సిన అవసరమేంటి?.

కరెంటు ఉద్యోగుల కష్టాలు:

వానాకాలం వచ్చిందంటే కరెంటు ఉద్యోగుల గుండెల్లో గుబులు, ఎందుకు అంటారా? అధికారులు ఎప్పుడు విధుల్లోకి పిలుస్తారో తెలియని పరిస్థితి. అయినా ఎలాంటి ఆటంకం లేకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. వర్షాకాలంలో 12 గంటలు, పదమూడు గంటలకు పైగా శ్రమించినా పనులు పూర్తి కానీ పరిస్థితులెన్నో విద్యుత్ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత కారణంగా ఏఈ, ఏడీలపై భారం పడటమేకాకుండా. సిబ్బంది కొరతతో ఉన్న ఉద్యోగులపై పెనుభారం పడుతోంది. ఇంకో విషయం ఏమిటంటే విద్యుత్ ఉద్యోగుల్లో రెండురకాల రూల్స్ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రూల్, ఆర్టిజెన్స్ ఉద్యోగులకు ఒక రూల్ (పర్మినెంట్ కానీ ఉద్యోగులు). పని విషయానికివస్తే అంత ఆర్టిజెన్స్ ఉద్యోగులపైనే భారం. పైనపటారం  లోన లొటారం అన్నట్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎక్కువ పని తక్కువ. అదే ఆర్టిజెన్స్ ఉద్యోగులకు జీతం తక్కువ పనిమాత్రం చాల ఎక్కువ. జీతంలోనే కాదండోయి, సెలవులలో కూడా రెండు రూల్స్ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు పెడితే జీతం కటింగ్ ఉండదు. అదే ఆర్టిజెన్స్ వారికీ మాత్రం జీతం కట్ చేస్తారు. ఇదేమి రూల్ అందరికి ఒకటే రూల్ ఉండాలి కదా అని సందేహం ప్రతిఒక్కరికి రావొచ్చు కానీ ఇదంతా ప్రభుత్వం చేయాల్సిన పని. అందరికి సమాన అవకాశాలు, అందరికి ఒకటే రూల్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ వేర్వేరు రూల్స్ వల్ల ఆర్టిజెన్స్ వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. తీవ్రంగా నష్టపోతున్న కార్మికుల గురుంచి పట్టించుకునే నాధుడు లేదు. ఒక్కో సబ్ స్టేషన్ లో నలుగురు ఆర్టిజెన్స్ ఉద్యోగులు విధులు నిర్వహించాల్సిఉన్నప్పటికీ ఇద్దరు ముగ్గురితో పని చేయించడంవల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురివుతున్నారు.  రూల్స్ విషయమే కాకుండా ఐదేండ్లు దాటినా పదేండ్లు దాటినా వారికీ ప్రమోషన్లు ఉండవనేది జగమెరిగిన సత్యం. విద్యుత్ కార్మికులకు పనిభారం పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరాకు ఎల్లవేళలా కృషి చేస్తున్నారు. రాత్రనక పగలనక ఎంతో కష్టం చేస్తున్నాగాని సరైన జీతం రాక కుటుంబాన్ని పోషించలేక సతమతపడుతున్నారు. అంతేకాదు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబం పరిస్థితి ఏంటి? కుటుంబానికి దిక్కు ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఒకవైపు ఉద్యోగం పర్మినెంట్ గాక మరోవైపు పని భారంతో తట్టుకోలేక కరెంటు కార్మికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..

ఒకేరకమైన పని చేసేవారికి రెండు రకాల సర్వీస్ రూల్స్ అవసరమా? అనే విషయం పట్ల ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమాజానికి సేవలందిస్తున్న ఆర్టిజెన్స్ కార్మికులను పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉంది.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475



 



కామెంట్‌లు లేవు:

హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్ "వరుణవి"

  హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్  "వరుణవి" ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేరు అనే మాట నిజమని చక్కగా సాక్ష్య...