27, జులై 2025, ఆదివారం

చదువులతల్లి ఒడి "మాదోపట్టి".

 చదువులతల్లి ఒడి "మాదోపట్టి".

26, జులై 2025, శనివారం

సంకల్ప బలం

సంకల్ప బలం:

ఒక్కప్పుడు నా దగ్గర చదువుకోవడానికి డబ్బులు ఉండుంటే కలెక్టర్ అయ్యేవాడిని లేదా మంచి ఉద్యోగం చేసేవాడిని. పేదరికం, ఆటంకాల వల్లే ఉన్నత ఉద్యోగాలు సాదించలేకపోయాను అంటూ చాలామంది అంటుంటారు. కానీ నిజానికి వారికి లేనివి అవేవీ కావు, ఒక్క దృఢ సంకల్పం మాత్రమే. దృఢ సంకల్పం లేనప్పుడు ఏదైనా సాధించడం అసాధ్యమే. పట్టుదలతో ప్రయత్నం చేయలేనప్పుడు పరిస్థితులను నిందించడం సరికాదు. అందుకే సినారె గారు రాసిన కవిత్వం  గుర్తుకొస్తుంటుంది "చేతగానితనముంటే జాతకాన్ని నిందించకు.. కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు" అని. అవును నిజమే కదా! చదవచేతగానప్పుడు పేదరికాన్ని, డబ్బును నిందించడం ఎందుకు? సంకల్పబలం లేనివాడు సమస్యలంటూ నిందించడం ఎందుకు? లక్ష్యం మీద స్పష్టత, ప్రయత్నంలో అకుంఠిత దీక్ష ఉంటే విజయం కచ్చితంగా మనదే అవుతుంది. అందుకు తాజా తార్కాణం ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపాలకృష్ణ రోణంకి, ఐఏఎస్  విజయగాథ. 

గోపాలకృష్ణ రోణంకి చదివింది ఎక్కడో పట్టణంలోనో లేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోనో కాదు. ఆయన చదివింది ఆంద్రప్రదేశ్ లోని పలాస మండలం పరసంబ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలుగు మీడియం చదువు. అతని తల్లిదండ్రులు నిరుపేదలు, వారు వ్యవసాయం, కూలి పనులకెళ్లి జీవనం కొనసాగిస్తారు. అతన్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించే స్థోమత లేనందున అతను ఎలాగోలా ప్రభుత్వ పాఠశాలలో చదివి  పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. విజయనగరంలోని ఎంఆర్ కళాశాలలో ఫార్మసీ చదివి గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా దూబచర్లలో రెండేళ్ల ఉపాధ్యాయ శిక్షణ కోర్సు చేసి 2006లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్ గా పనిచేస్తూనే   విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బీఎస్సీ (ఎంపీసీ) పూర్తి చేశారు. ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజుల్లోనే ఐఏఎస్ కావాలన్నది ఆయన కల. ఆ కల నెరవేరడం కోసం ఆయన ఎన్నో సంవత్సరాలు కఠోరదీక్ష చేశారు. కల నెరవేరడం కోసం ప్రతి రోజు 8 గంటలకుపైగా ఎంతో దీక్షతో  చదివి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష మొదటగా ప్రయత్నించి విఫలమయ్యాడు అయినా సరే లక్ష్యం చేరేదాకా ప్రయత్నం ఆపకూడదనే సంకల్పంతో అవరోధాలు, ఆటంకాలను లెక్క చేయకుండా రెండోసారి కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా సరే నిరాశ చెందకుండా లోపం ఎక్కడ ఉందొ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మరోవైపు పరీక్షకు సిద్ధమయ్యేవాడు. అలా మూడో ప్రయత్నం కూడా విఫలమయ్యాడు. అయినప్పటికీ నాలుగో ప్రయత్నంలో విజయం సాధిస్తాననే  నమ్మకంతో నాలుగోసారి ప్రయత్నించి విజయం సాధించాడు. చాలామంది ఒకటి లేదా రెండు ప్రయత్నాలతో ఇక నావల్లకాదని ప్రయత్నించడం మానుకుంటారు. కానీ ఎవరైతే దృఢ సంకల్పముతో పోరాడుతారో వారికి కచ్చితంగా విజయం వరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సంకల్పంతో సాధించిన విజయం అతన్నే కాదు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే అతను అందరిలా కాకుండా సివిల్స్ (మెయిన్స్)లో తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా ఎంచుకొని ఆయన యూపీఎస్సీ పరీక్షను తెలుగు భాషలో రాశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, ఇది వంద శాతం నిజం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే తెలుగులో పర్సనాలిటీ టెస్ట్ రాసేందుకు యూపీఎస్సీ అనుమతించడం. 2016లో ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా మూడవ ర్యాంక్ సాధించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. తన గ్రామంలో కనీసం కరెంటు మరియు బస్సు సౌకర్యం లేకున్నా పట్టుదలతో చదివి అత్యంత కఠినమైన పరీక్షల్లో మంచి ర్యాంక్ సంపాదించడమనేది చాలా గొప్ప విషయం. ఏదైనా విజయం సాధించాలంటే ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొంటే గానీ సాధ్యపడదు. “డబ్బులు ఎవరికీ  ఊరికే రావు” అన్నట్లు మరి విజయం ఊరికేవస్తుందా, కష్టపడితేనే కదా! గోపాలకృష్ణ కూడా కష్టపడకుండా విజయం సాధించలేదు. అతను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఆయన తల్లిదండ్రులు చిన్నవయసులోనే దళిత కులాంతర వివాహానికి పాల్పడిన కారణంగా 25 సంవత్సరాల పాటు సామాజిక బహిష్కరణకు గురయ్యారు. దీంతో వారి జీవితాల్లో ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.

ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ అందరూ అది సాధించలేరు. ఎందుకంటే విజయం అనేది ఎవరికీ ఊరికే రాదు కృషి పట్టుదల ఉంటేనే అది సాధ్యం అవుతుంది. కానీ కొంత మంది ఏ విధమైన ప్రయత్నం చేయకుండానే గెలుపు కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన చేస్తారు కానీ ఆచరణలో పెట్టరు. అలాంటివారు ఎప్పుటికీ విజయం సాధించలేరు. గోపాల కృష్ణ లా లక్ష్యం పెట్టుకోవాలి మరియు ఆ లక్ష్యం కోసం నిరంతరం కష్టపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. 


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475 




13, జులై 2025, ఆదివారం

తెలుగు నట దిగ్గజం : కోట శ్రీనివాసరావు

 తెలుగు నట దిగ్గజం : కోట శ్రీనివాసరావు

12, జులై 2025, శనివారం

నిబంధనలు సామాన్యులకేనా?...

 నిబంధనలు సామాన్యులకేనా?...


ప్రభుత్వాలు ప్రవేశపెట్టే నిబంధనలు సామాన్యులకు, పేదలకేగాని ధనికులకు, పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు వర్తించవనేది జగమెరిగిన సత్యం.
రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు వారు అన్నింటికీ అతీతులు. అందుకు తాజా తార్కాణం ఈ ఫొటోలో కనిపిస్తున్న ట్రాఫిక్ పోలీస్ అధికారి. 04 .06 .20025 ఉదయం హైదరాబాద్ లోని బోడుప్పల్ నుండి మాణిక్ చంద్ రోడ్ మార్గంలో వెళ్తున్న సందర్భంలో కనిపించిన దృశ్యం. హెల్మెంట్ లేకపోతే లేదేమో మరిచిపోయాడేమో అనుకోవచ్చు కానీ ఉన్న హెల్మెంట్ ఉండి ఉన్న హెల్మెంట్ ని బండికి తగిలించి నన్ను ఎవడు ఏమి చేస్తాడు అన్న చందంగా మరియు ఒక ట్రాఫిక్ పోలీస్ అయి ఉండి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాడంటే ప్రతి ఒక్క సామాన్యుడు ప్రశ్నించదగిన విషయం. ఒక సామాన్యుడు హెల్మెంట్ లేకుండా రోడ్ మీద వెళ్తే పట్టుకొని బలవంతంగా బండి తాళాలు లాక్కొని ఫైన్ వేసి ఇబ్బందులకు గురిచేస్తున్న సందర్భాలు కోకొల్లలు అంతేకాదు మరికొందరైతే 50 - 100 రూపాయలకు ఆశపడి డబ్బులు తీసుకొని వదిలేసే అధికారులు కొంతమంది. సామాన్యుడు ఫైన్ కట్టనిపరిస్థితిలో బండి లాక్కొని నానా ఇబ్బందులకు గురిచేస్తారు తప్ప వదిలేసే పరిస్థితి చాల తక్కువ. అదే రాజకీయ నాయకులు పోలీస్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించినా అడిగే నాథుడు ఉండడు ఎందుకంటే సామాన్య ప్రజలకు భయమని కాదు సామాన్యుడిలో ఉండే సంస్కారం.  అంతేకాదు పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టినా ఊరుకుంటారు. కాని సామాన్యుడు కరెంటు బిల్లు సకాలంలో కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారు. బడా వ్యాపారులకు రాయితీలు ఇస్తారు. సామాన్యులపై పన్నుల భారం మోపుతారు. కాని సామాన్యులు చిన్న నిబంధన ఉల్లంఘించినా నానా రచ్చ చేస్తారు. మన దేశంలో పెద్దలు ఏం చేసినా చెల్లుతుంది. వారు పెట్టుకున్న నిబంధనలు వారే పాటించరు. వారు చేసే చట్టాలు సామాన్యులు అనుసరించడానికి తప్ప వారికి వర్తించవు.

పోలీస్ అధికారి బండి నడపడం తప్పు కాదుకానీ ఆయన హెల్మెంట్ పెట్టకపోవడమే తప్పు. మనం సామాన్యులమైన తప్పును తప్పే అని తీరాల్సిందే. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రోడ్ల మీద పోయే ప్రతిఒక్కరు తమ రక్షణకొరకు హెల్మెంట్ పెడుతున్నారో లేదో తెలియదు గాని మీ నిబంధనలు తూచాతప్పకుండా పాటించాలనే నిబద్దతతో హెల్మెంట్ వాడుతున్నారు కాబట్టి పోలీస్ అధికారులు కూడా నిబద్దతతో హెల్మెంట్ వాడాలనేది ఒక సామాన్యుడిగా నా ప్రశ్న..

✍️ Columnist
కోట దామోదర్
మొబైల్ 9391480475

మరపురాని యోధులు

మరపురాని యోధులు

2008లో ముంబైలో జరిగిన 26/11మారణహోమం భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఉగ్రవాద మచ్చగా మిగిలిపోయింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో  174 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డ విషయం దేశ ప్రజలెన్నటికీ మర్చిపోలేరు. భారత భద్రతా బలగాలు 60 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి 10 మంది ఉగ్రవాదులలో 9మందిని మట్టుబెట్టి ఒక్క అజ్మల్ కసబ్‌ను మాత్రమే ప్రాణాలతో పట్టుకున్న విషయం, ఆ ఉగ్రవాదిపై ఏప్రిల్ 20, 2009న ప్రారంభమైన విచారణ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నవంబర్ 21, 2012న ఉరి తీసిన విషయం అందరికి గుర్తుంది. కానీ సుప్రీంకోర్టు విచారణలో నిర్భయంగా వాంగ్మూలం ఇచ్చి కసబ్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రత్యక్ష సాక్షిగా నిరుపమాన ధైర్యం ప్రదర్శించిన అతి పిన్న వయస్కురాలైన దేవికా రోటావన్ విషయం మాత్రం చాలామందికి తెలియదు. మరొక్క మాటలో చెప్పాలంటే గుర్తుకులేదు. దాడి జరిగిన సమయంలో దేవికా రోటావన్ వయసు కేవలం 9 ఏళ్ళు మాత్రమే. దుర్ఘటన సందర్భంలో అక్కడ చాలామంది ఉన్నప్పటికీ అందులో ఏ ఒక్కరూ సాక్ష్యం చెప్పడానికి సాహసం చేయకపోవడం విచారకరమైన విషయం. దేశభక్తి మూర్తీభవించిన  ఒక 9 ఏళ్ళ అమ్మాయి ఉగ్రవాదికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం ఏంటి అనే సందేహం ప్రతిఒక్కరికి కలుగుతుంది. కనీసం అంతటి తెగువకు సాహసించిన ఆ అమ్మాయి  పేరు మనలో ఎంత మందికి గుర్తుంది? “అన్నీ గుర్తుపెట్టుకుంటాం కానీ అసలోడిని మాత్రం మర్చిపోతాం” అనే సామెత లాగా ప్రస్తుత సమాజం తీరు ఉంది. ప్రతి సంవత్సరం నవంబర్ 26న “26/11 నెవర్ అగైన్” అని కొవ్వొత్తుల ప్రదర్శనలు, సంతాప సభలు నిర్వహిస్తుంటాం కానీ ప్రాణాలతో పట్టుబడ్డ ఏకైక ఉగ్రవాదికి ఉరిశిక్ష పడేందుకు ప్రాణాలకు తెగించి వాంగ్మూలం ఇచ్చిన ప్రత్యక్ష సాక్షి దేవికా రోటావన్ ను మాత్రం అందరం మర్చిపోయాం.

కళ్ళముందు నేరం జరిగినా చూసీచూడనట్లు పట్టించుకోకుండా పోయేవారు కొందరైతే, అనవసరమైన విషయాల్లో తలదూర్చితే ప్రాణాలకే ముప్పని భావించేవారు మరికొందరు ఉంటారు. సాక్ష్యం చెప్పడం అంటే చావుకు ఎదురుపోయినట్లే అనే ఉద్దేశంతో అక్కడ జరిగిన సంఘటనను చూసినప్పటికీ చూడలేదని చెప్పి తప్పించుకుంటారు. కొన్ని సంఘటనల్లో సాక్ష్యులను హతమార్చిన సందర్భాలు కూడా ఉండడమే ఇందుకు కారణం. ఏదైనా నేరం జరిగినప్పుడు, సరైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే కదా నేరం రుజువై నేరస్థుడికి సరైన శిక్ష పడేది. మరి సాక్షాలే లేనప్పుడు కోర్టు నేరస్థులను  శిక్షించేది ఎలా? నేరాలు జరుగకుండా ఆపేది ఎలా? ఇలాంటి సంఘటనలలో నేరస్థులను శిక్షించడం న్యాయస్థానాలకు ఇబ్బందికరంగా మారుతుంది. చిన్న చిన్న నేరాలకు సైతం సాక్ష్యాలు చెప్పడానికి ప్రజలు వెనకాడుతున్న సమయంలో దేశంలోనే అతిపెద్ద ఉగ్రదాడి ఘటనలో 9 ఏళ్ళ అమ్మాయి ప్రత్యక్ష సాక్షిగా ముందుకు రావడం యావత్ దేశం గర్వించదగిన విషయమే కదా! ఇది ముమ్మాటికీ గర్వించదగిన విషయమే. అంతేకాదు దేవికను అభినందించాల్సిన విషయం కూడా. ఇంతటి సాహసానికి ఒడికట్టిన  దేవికా రోటావన్ ఎవరనేది తెలుసుకోవాలంటే ఈ వ్యాసం పూర్తిగా చదవాల్సిందే.

భారత చరిత్రలోనే అత్యంత భయానక ఉగ్రవాద చర్యల్లో ఒకటైన 26/11 ముంబై దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటికి తొమ్మిదేళ్ల వయసు గల  దేవికా రోటావన్ కు ఆ ఘటనా సమయంలో కుడి కాలిపై బుల్లెట్ గాయం కాగా కాల్పులు జరిపిన కసబ్‌ను స్వయంగా  చూసింది. 65 రోజులు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడిన దేవికాను ఆ తర్వాత ప్రభుత్వం కోర్టులో సాక్షిగా ప్రవేశ పెట్టింది. దేశం కోసం, దేశ రక్షణ కోసం ఆమె ఏ మాత్రం వెనకడుగు వేయకుండా నిర్భయంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకువచ్చింది. ఆమె సాక్ష్యం చెప్పకుండా ఉండటానికి ఉగ్రవాదుల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. అంతేకాదు ఆమె బంధువులు కూడా ఉగ్రవాదులవల్ల తమకు ప్రాణహాని కలుగుతుందేమోనని భావించి వారికి దూరంగా ఉన్నారు. దీనికి తోడు, పాఠశాలలో దేవికాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దీని వల్ల ఇతర విద్యార్థులకు ప్రాణ హాని జరిగే అవకాశం ఉందని పాఠశాల యాజమాన్యం ఆమెను పాఠశాల నుండి బహిష్కరించారు. దేవిక ఉగ్రవాదుల లక్శ్యంగా ఉన్నందున అద్దె ఇంటివారు కూడా వెళ్లగొట్టే పరిస్థితి ఏర్పడింది. అయినా సరే దేవిక మాత్రం దేశం పట్ల తనకు  ఉన్న ప్రేమను చాటుకునేందుకు ఇసుమంతైనా భయపడలేదు. కోర్టు విచారణలో సాక్ష్యం చెప్పడమే కాకుండా కసబ్ ను గుర్తించి, ఆరోజు దాడిలో అతనే తనపై కాల్పులు జరిపాడని సాక్ష్యం చెప్పడంతో, కోర్టు మే 2010లో, కసబ్ కు మరణశిక్ష విధించి, నవంబర్ 21, 2012న ఉరి తీసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికీ దేవిక అనేక అవరోధాలను, అవమానాలను ఎదుర్కొంటోంది. ఉండటానికి సరైన ఇల్లు లేక, అద్దెకు దొరక్క ఎన్నో సార్లు ప్రభుత్వానికి తన బాధను మొరపెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. సాక్ష్యం చెప్పే సమయంలో ఎందరో నాయకులు అనేక హామీలు ఇచ్చినప్పటికీ అవి ఏవీ నెరవేరలేదు. ఆమె కూడా మనలో చాలా మంది లాగా ‘నాకెందుకులే’ అనుకుని ఉండి ఉంటే కసబ్ కి ఉరి శిక్ష పడేది కాదేమో! తన మరియు తన కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశం కోసం ఆమె చేపట్టిన సాహసోపేతమైన చర్యను గుర్తించుకోకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.

కసబ్ ను పట్టుకున్న సబ్ ఇన్స్పెక్టర్ గుర్తున్నాడా?
దేవికా రోటావన్ పేరుతో పాటు కసబ్ ను పట్టుకునేందుకు కేవలం చేతిలో లాఠీతో కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న కసబ్ సహా మరో ఉగ్రవాదిపై విరుచుకుపడి కసబ్ సజీవంగా పట్టుబడడంలో కీలకంగా వ్యవహరించిన  సబ్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓంబ్లే పేరు దేశ పౌరులు మరిచిపోయారు. తుకారాం ఒంబ్లే 26/11 ముంబై దాడుల సమయంలో చూపిన అసాధారణ ధైర్యసాహసాలు లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడటమే కాకుండా, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు అమూల్యమైన విజయాన్ని సాధించాడు. ఆయన అసమాన ధైర్యసాహసాలు దేశం కోసం త్యాగానికి ప్రతీకగా నిలిచాయి. పోలీసు శాఖలో చేరడానికి ముందు, ఓంబ్లే 16 సంవత్సరాలకు పైగా భారత సైన్యంలో పనిచేశారు. ఇది తన కర్తవ్య భావాన్ని మరియు దేశం పట్ల ప్రేమను పెంచింది. ఆర్మీ నుంచి రిటైరైన తర్వాత ఆయన అలుపెరగని సేవాభావంతో ముంబై పోలీస్ శాఖలో చేరారు. ముంబై దాడుల తర్వాత స్కోడా కారును హైజాక్ చేసి సీఎస్టీ వద్ద విధ్వంసం సృష్టించి పారిపోతున్న ఇద్దరు ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తుకారాం ఓంబ్లే అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరుపుతున్నప్పటికీ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ఓంబ్లే లాఠీ (లాఠీ) తప్ప మరేమీ లేకుండా కసబ్ వద్ద ఉన్న ఏకే-47 బారెల్ ను పట్టుకుని మరింత కాల్పులు జరపకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇంతటి దైర్యవంతుడిని కూడా మనం మరిచిపోవడం ఇంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఉండదేమో!

"పోరాడితే పోయేదేమి లేదు. బానిస సంకెళ్ళు తప్ప..." అని శ్రీశ్రీ అన్నట్లు కళ్ళఎదుట జరిగిన సంఘటనకు మనం సాక్ష్యం చెప్పలేకపోతున్నామంటే నిజానికి మనం బానిస సంకెళ్ళు వేసుకున్నట్లే.. మన దేశంలో ఎంతోమంది దేశం కోసం పోరాడుతున్న యోధులు ఉన్నారు కానీ వారిని గుర్తించుకోకపోవడమే మనం చేసే పెద్ద తప్పు.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ :9391480475

రేవంత్ రెడ్డి మానవీయ కోణం

రేవంత్ రెడ్డి మానవీయ కోణం:

తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేస్తున్న వారి జీతాల్లో పది శాతం తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించిన విషయం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. దేశంలో వృద్ధుల సంరక్షణ, సంక్షేమ పరిస్థితుల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మనాన్నలు పిల్లలతో పేగు బంధాన్ని పెనవేసుకుంటుంటే వారు పెద్దయ్యాక కని పెంచిన వారిని కాదు పొమ్మంటున్నారు. మరికొందరైతే ఆస్తుల కోసం అమ్మానాన్నలను క్రూరంగా కడతేర్చిన కసాయి కొడుకులు ఉన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ వారిని రోడ్డున పడేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఒకరు ఖర్చులు భరించలేక ఒకరు సేవ చేయలేక దూరం పెడితే, మరొకరు పొట్టకోసం ఊరు దాటుతూ వదిలేస్తున్నారు, కొందరు కోడలు అత్తమామల్ని చూడకపోవడం కారణాలవల్ల కొడుకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది సంపన్న కుటుంబానికి చెందిన వృద్ధులు తమ ఆస్తినంతా పిల్లలకు ఇచ్చేశామని కానీ తమను వారు చూసుకోవడం లేదని వృద్ధాశ్రమాలకు  కాసులు విదిల్చి చేతులు కడిగేసుకుంటున్నారని బాధపడుతూ ఫిర్యాదులు చేయడం లేదా, రోడ్డున పడి తమ గోడు వెళ్లబోసుకోవడం లాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై సీఎం రేవంత్ ఓ ప్రత్యేకమైన ఆలోచన చేసి తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేసే ఉద్యోగుల జీతాల్లో పది శాతం వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే ఆలోచన అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు

పట్టణీకరణ ఆధునీకరణ ల సౌక్యాలతో తగ్గుతున్న మానవత్వం విలువల ఫలితమే ఇది.

ఒక తల్లికి అయిదుగురు కొడుకులు ఉంటే అందరిని ఒకే విధంగా పెంచుతుంది. కానీ ఆ అయిదుగురు కొడుకులు ఒక్క తల్లిని పెంచాలంటే ఎంత ఈసడించుకుంటారో ప్రపంచానికి అర్ధం కానీ వింత. కోట్ల రూపాయల ఆస్తులున్న కన్న కొడుకు కడుపునిండా అన్నం పెడతారన్న నమ్మకం లేదు. పెళ్ళైన కొన్నాళ్లకే ఆస్తులు తమ పేరున రాసుకొని తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేస్తున్నారు. అంతేకాదు వారు అసువులుబాస్తే కడ చూపు చూడని కఠినాత్ములు ఎందరో. అనాధల ఖాతాలో అంత్యక్రియలు జరుగుతున్న దౌర్భాగ్యం ఎందరిదో. ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ చాలా మంది తల్లిదండ్రులను పోషించడం భారంగా చూస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉండాలని చాలా కాలంగా అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇటీవల తల్లిదండ్రులను కుమారుడు వృద్ధాశ్రమంలో చేర్పించడంతో వారు ఆవేదనకు గురై వృద్ధాశ్రమంలో  భార్య, భర్త ఆత్మహత్య చేసుకున్న ఈ సంఘటన అధికారుల సామాజిక స్పృహను తట్టి లేపింది. తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేసే ఉద్యోగుల జీతాల్లో పది శాతం వారి ఖాతాల్లో జమ చేసేలా చూస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని అంచనా వేస్తున్నారు. ముమ్మాటికీ రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిందే. మంచి ఆలోచనకు మనమందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.

జీతంలో పది శాతం తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే అంశంపై పలు సందేహాలు:

ఉద్యోగికి ఎక్కువ జీతం ఉంటే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు గాని, తక్కువ జీతం ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వారు కుటుంబ పోషణ, పిల్లల చదువుల కొరకు చాలా ఇబ్బందులు పడుతుంటారు మరి వారికి ఇది ఒక పెద్ద సమస్య అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతటివారైనా తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ఆర్ధికంగా లేనప్పుడు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపలేకపోవచ్చు. మరి తక్కువ జీతం ఉన్నవారు ఈ అంశాన్ని సమర్థిస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే. అంతేకాదు అస్సలు కొడుకులు లేని వారి పరిస్థితి ఏంటి? వారి బాగోగులు ఎవరు చూడాలి? వారికి ప్రభుత్వం ఏదైనా పథకాలు అమలు చేస్తుందా? ఇదే కాకుండా కూతురు మాత్రమే ఉంటే వారి తల్లిదండ్రులను ఎవరు చూడాలి? అల్లుడు చూడకపోతే అల్లుడు జీతం నుండి పది శాతం కట్ చేస్తారా? ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొడుకులు ఉన్న తల్లిదండ్రులకు ఈ వార్త కొంత ఊరట కలిగిస్తుందేమో కానీ మిగిలిన వారి పరిస్థితి కూడా ఆలోచన చేయాల్సి ఉంది. కొడుకులు బిడ్డలు లేనివారికి ఇంట్లో ఇద్దరికీ పింఛన్ ఇస్తే వారికి కొంత ఊరట కలుగుతుందని కొంతమంది భావిస్తున్నారు. తల్లిదండ్రులను చూసుకోవాలనే  నైతిక భాద్యత ఉండాలి అంతేతప్ప ఈ చట్టాలవల్ల సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ముమ్మాటికీ  ఉండదు. ఈ అంశం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమేనా అందరికి వర్తిస్తుందా అనేది చాలామందికి సందేహం ఎందుకంటే అస్సాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అస్సాం ఎంప్లాయీస్ ప్రాణ్ యాక్ట్, చట్టం 43 ప్రవేశపెట్టింది.

అస్సాం ఎంప్లాయీస్ ప్రాణ్ యాక్ట్:

ప్రభుత్వం కన్నవారిని నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో కోత విధించడానికి , తగ్గించిన సొమ్మును తల్లిదండ్రుల ఖాతాలో వేయడానికి అనుమతి ఇస్తూ 2017 లో ప్రత్యేక బిల్లును తీసుకు వచ్చింది. ఈ బిల్లు ఆమోదించడం పై పలు విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తుందనడంలో చాలామంది అభ్యంతరం తెలియజేశారు. తల్లిదండ్రులను పట్టించుకోని మిగిలిన వారిని ఎలా కట్టడి చేస్తారని ప్రశ్నించారు. అయినా సరే అస్సాం ప్రభుత్వం బిల్లు కొనసాగిస్తుంది. అంతేకాదు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తరహా చర్యలను 2021లోనే చేపట్టింది.

ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు వర్తించకపోవడం, వృద్ధులకు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛన్ కూడా రాని ఈ పరిస్థితులలో తగిన చట్టం దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సముచితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు కొడుకులు ఉండి  అనాధలుగా మిగులుతున్న వారికి కూడా ఈ చట్టం వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనచేయాల్సిన అవసరం ఉంది.


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్ 9391480475

హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్ "వరుణవి"

  హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్  "వరుణవి" ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేరు అనే మాట నిజమని చక్కగా సాక్ష్య...