చదువులతల్లి ఒడి "మాదోపట్టి".
మన దేశంలో కఠినమైన పరీక్షా ఏదైనా ఉందంటే అది సివిల్స్ సర్వీసెస్ తర్వాతే. ఏటా సివిల్స్ సర్వీసెస్ రాసే వారి సంఖ్య దాదాపు 13 లక్షల మంది ఉండగా అందులో ఉత్తీర్ణత సాధించేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. దీనిని బట్టి ఈ పరీక్ష ఎంత కఠినతరమైనదో మనకు అర్థమవుతుంది. యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించి ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఐఎఫ్ఎస్ కావాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ అత్యంత కఠినమైన యూపీఎస్సీ ప్రిలిమినరీ మరియు ఫైనల్ పరీక్షలో విజయం సాధించడం కంటే ఇంటర్వ్యూలో విజయం సాధించడం మరింత కష్టం. ఈ పరీక్షలో నెగ్గాలంటే రోజుకు ఒక గంట రెండు గంటలు చదివితే సరిపోదు రోజుకు 8 గంటలకు పైగా చదివితే తప్ప ఈ పరీక్షలో విజయాన్ని సాధించలేరు. మన రాష్ట్రంలో సివిల్స్ రాసే వారి సంఖ్య ఎక్కువే అయినప్పటికీ అందులో విజయం సాధించే వారి సంఖ్య చాలా తక్కువే. రాష్ట్రంలో అతి కొద్ది మంది విజయం సాధించినా పెద్ద ఘన విజయం సాధించినట్లుగా మనం భావిస్తాం. అలాంటి ఒక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం ఊరిలో ఒక్కరికి వస్తేనే మహా గొప్ప అనుకుంటే ఓ ఊరిలో మాత్రం దాదాపు ఇంటికో ఐఏఎస్, ఐపీఎస్ అధికారి ఉండడం విశేషం. కేవలం 75 ఇళ్లు మాత్రమే ఉండే ఓ చిన్న గ్రామం నుంచి 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ గ్రామం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వ్యాసం పూర్తిగా చదవాల్సిందే.
'ఐఏఎస్ ఫ్యాక్టరీ' గా పేరు తెచ్చుకున్న ఈ గ్రామం ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలోని మాధోపట్టి అనే గ్రామం. ఒకే ఊరిలో ఇంతమంది ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఉన్నత అధికారులు ఉద్భవించారని మనకు అనుమానం రావొచ్చు. అంతేకాకుండా ఈ గ్రామంలో సివిల్ సర్వీస్ కి సంబంధించిన కోచింగ్ సెంటర్లు ఏమైనా ఉన్నాయేమో అనే సందేహం కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఆ గ్రామంలో ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేవు. అయితే కొందరు ఏళ్లకేళ్లు కోచింగ్లు తీసుకున్నా, రూంలో కూర్చొని పుస్తకాలను ఔపోసన పట్టినా, ఎక్కడో ఏదో చిన్న తప్పిదంతో విజయం సాధించలేకపోతారు. అలాంటిది ఓ చిన్న గ్రామం నుండి ఇప్పటివరకు 51 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక అవ్వడం గర్వించదగిన విషయం. దేశానికి అత్యధిక మంది ఐఏఎస్, ఐపీఎస్లను అందించడంతో మాధోపట్టి గ్రామాన్ని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ గ్రామంలోని అభ్యర్థులు వారి అంకితభావం, కృషి వల్లే యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధిస్తున్నారన్న విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఒకరికంటే ఒకరు పోటీపడి సంకల్పంతో చదువుతూ ఆ గ్రామానికే కాదు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ గ్రామానికి చెందిన పురుషులే కాదు మహిళలు కూడా ఎలాంటి శిక్షణ లేకుండానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగారు.
ఇంకో విషయం ఏమిటంటే ఈ గ్రామంనుండి కేవలం ఐఏఎస్, ఐపీఎస్ లే కాకుండా ఇతర రంగాల్లో కూడా విశేషంగా రాణిస్తున్నారు. ఈ గ్రామం నుంచి ఇప్పటివరకు స్పేస్, అణు పరిశోధన, న్యాయ సేవలు, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నత స్థాయిల్లో స్థిరపడటం గమనార్హం. ఒకే కుటుంబం నుంచి నలుగురు అన్నదమ్ములు ఐఏఎస్ అధికారులు ఉండటంతో భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో సివిల్ సర్వీసెస్ లో పనిచేస్తున్న అభ్యర్థులున్న గ్రామంగా మాధోపట్టి గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్, ఘాజీపూర్లోని, గహ్మర్ అనే గ్రామానికి సైన్యంలో ఒక స్పెషల్ గుర్తింపు ఉన్నట్లు మాధోపట్టి గ్రామానికి కూడా సైన్యంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ గ్రామం నుంచి చాలామంది సైన్యంలో సేవలందిస్తున్నారు. అందుకే ఉత్తరప్రదేశ్ అంటేనే వీర జవాన్లకు పుట్టినిల్లుగా పేరుగాంచింది.
దేశం కోసం సేవలందించిన గ్రామం:
దేశానికి సేవ చేయడానికి అనేక మంది ప్రభుత్వ అధికారులను అందించిన ఈ గ్రామం దేశంలో ట్రేడ్మార్క్గా మారింది. మాధోపట్టికి చెందిన మొట్టమొదటి ప్రభుత్వోద్యోగి ఖాన్ బహదూర్ సయ్యద్ మహ్మద్ ముస్తఫా (కవి వామిక్ జౌన్పురి తండ్రి). అతను 1914 లో సివిల్ సర్వీసెస్ (అప్పటి ఇండియన్ సివిల్ సర్వీసెస్, బ్రిటిష్ ఇండియా) లో చేరాడు. ఆయన తరువాత 1952 లో ఇందు ప్రకాష్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రామంలో రెండో వ్యక్తిగా పేరొందారు. గ్రామం యొక్క అతిపెద్ద విజయం 1955 లో వినయ్ కుమార్ సింగ్ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం.
ఒకప్పుడు కనీస సదుపాయాలు లేని గ్రామానికి ఇంతటి పేరు ఎలా సాధ్యమైందనే సందేహం ప్రతిఒక్కరికి కలగొచ్చు! ఒకప్పుడు విద్య ఎరుగని గ్రామానికి విద్య నేర్పిన గురువులు ఎవరో కాదు స్వాతంత్ర సమరయోధుడు ఠాకూర్ భగవతి దిన్ సింగ్ మరియు అతని భార్య శ్యామ్రతి సింగ్. 1917 అంతకంటే ముందు గ్రామంలో స్కూల్ గాని చదువుకోవడానికి ఎలాంటి వసతులు లేని సమయంలో వీరు అందించిన కృషి వల్లే ఈ రోజు గ్రామంలో ఎంతోమంది ప్రభుత్వ అధికారులు దేశానికి సేవ చేస్తున్నారు. శ్యామ్రతి సింగ్ అమ్మాయిలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఊరిలో ప్రతి ఒక్కరు చదువుకోవడానికి ముందుకు వచ్చారు. అలా ఆ గ్రామంలో చదువుపై ఆసక్తి కలిగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎంతమంది అంకితభావంతో, దృఢ సంకల్పంతో లక్ష్యం పెట్టుకొని లక్ష్య సాధన కొరకు అహర్నిశలు శ్రమించి ఎలాంటి కోచింగ్ లేకుండానే విజయం సాధిస్తున్నారు.
గతంలో ఈ ఊరు నుంచి ఒక వ్యక్తి ఐఏఎస్ అధికారిగా ఎంపికవ్వడం అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొంతమంది ఐఏఎస్ లు అవ్వడం ఇలా ఊరు ఊరంతా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండటం వల్లే ఈ ఊరు సర్వత్రా చర్చనీయాంశంగా నిలుస్తోంది.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి