15, ఫిబ్రవరి 2026, ఆదివారం

నాన్న ఎప్పుడు హీరో నే

 హాస్టల్ దాటిన అడుగుల నుంచి

యూనివర్సిటీ దారి వరకు ఒక దృశ్యం

నా మనసును ఆపేసింది…


భుజం మీద లగేజీ,

ముందు నడిచే కూతురు, 

వెనుక నడుస్తూ జీవితమంతా మోస్తున్న నాన్న.


మాటలేమీ లేవు,

అయినా అర్థమయ్యే ప్రేమ,

చూపులేమీ లేవు,

అయినా కనిపించే త్యాగం.


ఆమె భవిష్యత్తు తేలికగా ఉండాలని

తన బరువంతా భుజాలపై వేసుకున్నాడు.


ఆ క్షణంలో

కళ్లలోకి నీళ్లు వచ్చాయి…

అర్థమైంది —

నాన్నలు ఎప్పుడూ

నిజమైన హీరోలేనని.

*అలల్ని చీల్చిన ధైర్యం*

 *అలల్ని చీల్చిన ధైర్యం*

మనసును కదిలించే జీవన గాథలు "అవరోధాలే అవకాశాలు"

మనసును కదిలించే జీవన గాథలు "అవరోధాలే అవకాశాలు"


అవరోధాలను దాటుకుంటూ,
అవమానాలను ఓర్పుగా మోస్తూ,
కన్నీళ్లను ధైర్యంగా తుడుచుకుంటూ
నిలబడ్డ కొంతమంది అసాధారణ వ్యక్తుల జీవిత ప్రయాణాలే
“ఈ అవరోధాలే అవకాశాలు”.

ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసం
ఒక వ్యక్తి గెలుపు కథ మాత్రమే కాదు
ఓడిపోకుండా నిలబడిన మనిషి ఆత్మవిశ్వాసానికి సాక్ష్యం.
వెనుకడుగులు వేయాలని పరిస్థితులు బలవంతం చేసినా,
ముందడుగు వేయాలని మనసు చెప్పినప్పుడు
జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఈ రచనలు తెలియజేస్తాయి.

కోట దామోదర్ గారి కలం తన అనుభవాలను, ఆవేదనలను, ఆశలను ఎంతో సూటిగా పాఠకుల హృదయాల్లో నాటుతుంది. ప్రతి వ్యాసాన్ని చదువుతుంటే, అది కేవలం ఒక కథగా కాకుండా మన జీవితానికే అద్దం పట్టినట్టుగా అనిపిస్తుంది. ఆయన రచనల్లోని నిజాయితీ, జీవన స్పర్శ పాఠకుడిలో మెల్లగా “నేనూ చేయగలను” అనే ఆత్మవిశ్వాసాన్ని మొలకెత్తిస్తుంది. ఇదే ఆయన రచనల గొప్పతనం, పాఠకులను ముందుకు నడిపించే అసలైన శక్తి.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి మెకానిక్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసిన వ్యాసకర్త కోట దామోదర్ రచించిన "అవరోధాలే అవకాశాలు" వ్యాస సంపుటి పాఠకులకు జీవితం పైన పాజిటివ్ దృక్పథాన్ని కలగజేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఊరటనిస్తుంది. ఎంతోమంది సామాన్యులు..తమ నిరంతర సాధన,పట్టుదలతో  అసాధారణ వ్యక్తులుగా ఎదగడంలోని కృషిని, జీవన విలువలను తెలియజేస్తుంది. ఈ పుస్తకం లోని 27 వ్యాసాలు ఏదో విధంగా పాఠకుల మనసులకు సాంత్వన చేకూర్చేవే. స్ఫూర్తిని అందించేవే..!. సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉండే దానికన్నా, ధైర్యం మరియు దృడ సంకల్పంతో ముందుకు సాగడానికి ప్రయత్నించు అంటారు రచయిత.

అవరోధాలనే అవకాశాలుగా మార్చుకుంటే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని చెప్పిన స్వామి వివేకానంద స్ఫూర్తితో... మనిషికి వైకల్యం ఉన్నా, పూర్ణ సుందరి ఐఏఎస్ గా ఎదిగిన యథార్థ జీవిత కథను తనదైన శైలితో వివరించారు. అవరోధాలు మనల్ని ఆపేందుకు కాదు, మనలోని శక్తిని వెలికి తీయడానికి వచ్చిన అవకాశాలు. శారీరక పరిమితులు విజయానికి అడ్డంకులు కావు; ఆత్మ విశ్వాసం, పట్టుదల, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఏ వైకల్యాన్నైనా జయించవచ్చు. జీవితంలో ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్ధారించుకొని, ఎన్ని కష్టాలు ఎదురైనా నిరంతర కృషితో ముందుకు సాగితే విజయం తప్పక అతనిదే. జీవిత పాఠాలతో మనల్ని మనమే మలుచుకుంటూ, ఇతరులకు మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదగడమే నిజమైన విజయం అంటారు రచయిత కోట దామోదర్.

ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మహా అథ్లెట్ "ఉసేన్ బోల్ట్" జీవితాన్ని రచయిత  అత్యంత స్ఫూర్తివంతంగా ఆవిష్కరించారు. అలుపెరుగని కృషి, అచంచలమైన పట్టుదలతో తొమ్మిదేళ్ల పాటు ప్రపంచ అథ్లెటిక్స్ రంగాన్ని ఏలిన మకుటం లేని రాజుగా బోల్ట్ నిలిచాడని వివరించారు. ఎన్నో ప్రపంచ రికార్డులు, ఒలింపిక్ విజయాలు సాధించినప్పటికీ, “నేను మీలాంటి సామాన్యుడినే” అని గర్వం లేకుండా చెప్పుకోవడం అతని మానవత్వానికి అద్దం పడుతుంది. బోల్ట్‌కు చిన్ననాటి నుంచి ఎక్కువగా నచ్చిన ఆట క్రికెట్ అయినప్పటికీ, తన కోచ్ ఇచ్చిన సలహాలు గౌరవించి రన్నింగ్ వైపు అడుగులు వేయడం అతని జీవితానికి మలుపుగా మారింది. అదే నిర్ణయం అతన్ని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మనిషిగా, విశ్వవిజేతగా నిలిపింది. ఈ వ్యాసం ద్వారా రచయిత తెలియజేసిన ముఖ్య సందేశం ఏమిటంటే సరైన మార్గనిర్దేశం, కష్టం, వినయం కలిసినప్పుడు అసాధ్యమనే మాట ఉండదు. ఉసేన్ బోల్ట్ జీవితం ప్రతి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించిన విజయవంతమైన వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. ప్రవీణ్ తాంబే ఆ కోవకు  చెందిన వారంటూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతని జీవన ప్రస్థానం ఎలా కొనసాగిందో ఆసక్తికరంగా వివరించారు. సాటి మానవుల పట్ల ప్రేమ దయ కలిగి ఉండటం మరియు సేవా తత్పరత జీవిత పరమార్థమని మదర్ థెరిసా జీవిత సందేశాన్ని ఓ వ్యాసంలో వివరించారు. పద్మశ్రీ కె. ఎస్. రాజన్న తన సామాజిక సేవలో ముందుకెళ్లినా వైనాన్ని దివ్యాంగుల తో పాటు.. నేటి యువతకు కూడా ఆదర్శమన్నారు. నేటి విద్యా వ్యవస్థలో జ్ఞాన సముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఉందనీ... విషయ పరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుందని ఆందోళన చెందారు.

ఈ వ్యాసాలలో రచయిత సమాజంలో మార్పు తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తుల జీవితాలను అద్భుతంగా వివరించారు. ఎన్నో సామాజిక అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా, ఏడు సంవత్సరాల కఠినమైన శ్రమ తో చేనేత కార్మికుల కష్టాలు తగ్గించేందుకు “లక్ష్మీ ఆసు” యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితం ద్వారా ఆవిష్కరణకు పట్టుదల ఎంత ముఖ్యమో తెలియజేశారు.

ఇంకొక వ్యాసంలో, ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే ప్రతి మనిషి భగవంతుడితో సమానమని, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారికి డబ్బు కంటే మంచి మనసే అసలైన సంపద అనే సందేశాన్ని ఒక నిజ జీవిత సంఘటన ద్వారా హృద్యంగా అందించారు.

మరొక వ్యాసంలో, “ఈ దేశ పౌరుడిగా నాకు విద్యనభ్యసించే హక్కు ఉంది” అంటూ సమానత్వం కోసం న్యాయస్థానంలో పోరాడిన ఉద్యమ వీరుడి కథను వివరించి, హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్యంలో ఎంత అవసరమో బలంగా చాటారు.

ఇవి కేవలం వ్యాసాలు కావు…
జీవితానికి దారి చూపే దీపాలు.
నిరాశలో ఉన్నవారికి ఆశ్వాసం,
అలసిపోయిన వారికి ఉత్తేజం,
సంకల్పం కోల్పోయిన వారికి స్ఫూర్తి.

అవరోధాలే అవకాశాలవుతాయని
నమ్మించే శక్తి ఈ పుస్తకానికి ఉంది.
జీవితం ఎదురయ్యే ప్రతి కష్టాన్ని
ఒక పాఠంగా, ఒక మెట్టుగా మార్చుకోవచ్చని
ఈ పుస్తకం మౌనంగా చెబుతుంది.

ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసం ఒక నిజ జీవిత కథ ఆధారంగా చేసుకుని, జీవితం పట్ల ఆశావాదాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పాఠకులలో నింపుతుంది. పేదరికం, ఆకలి, పరిమితులు, ఓటమి విజయానికి అడ్డంకులు కావని—సంకల్పబలం, నిరంతర కృషి ఉంటే పల్లె నుంచి ప్రపంచ స్థాయి విజయాల దాకా ఎదగవచ్చని స్పష్టంగా తెలియజేస్తుంది. గెలుపు–ఓటములు జీవితంలో సహజమని, వాటికి అతిగా పొంగిపోకుండా లేదా కుంగిపోకుండా సమతా భావంతో ముందుకు సాగితేనే నిజమైన విజయం సాధ్యమని ఈ వ్యాసాలు బోధిస్తాయి. మొత్తం మీద, ఈ రచనలు ప్రతి పాఠకుడిలో ధైర్యం, ఆశ, లక్ష్యసాధన పట్ల విశ్వాసం పెంపొందించడమే ప్రధాన సందేశం గా నిలుస్తాయి. వారు భవిష్యత్తులో ఇలాంటి మంచి రచనలతో... పాఠకులకు స్ఫూర్తిని పంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.



వ్యాసకర్త
Prof Ravinder Rena
డర్బన్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ
సౌత్  ఆఫ్రికా,
Mobile: +27 847828059

అమరత్వం రాతికి… అనంత వేదన తల్లికి:

 అమరత్వం రాతికి… అనంత వేదన తల్లికి:


యుద్ధం దేశానికి గెలుపుని ఇస్తుంది; కానీ ఎన్నో తల్లుల గుండెల్లో మాత్రం శాశ్వత ఓటమిని మిగుల్చుతుంది. అలాంటి ఓ విషాద క్షణమే—యుద్ధ స్మారక స్థలంలో తన కొడుకు పేరు చెక్కబడి ఉండటం చూసిన ఒక తల్లి కన్నీళ్లతో కూలిపోవడం. ఆ క్షణం వ్యక్తిగత దుఃఖం మాత్రమే కాదు; అది దేశ చరిత్రలో మౌనంగా దాగిన త్యాగాల ప్రతిధ్వని.

ఆమె అడుగులు స్మారక ప్రాంగణంలో నెమ్మదిగా పడుతున్నాయి. గోడలపై చెక్కబడిన వేల పేర్ల మధ్య, తన కొడుకు పేరు కనిపించిన క్షణంలో కాలం ఒక్కసారిగా ఆగినట్టైంది. ఆ పేరు—ఒక అక్షరాల సమూహం కాదు; ఆ పేరు ఒక బాల్యపు నవ్వు, ఒక యువకుడి కల, ఒక సైనికుడి ప్రమాణం. తల్లి చేతులు ఆ పేరును తాకినప్పుడు, ఆ రాతిలో కాదు—తన గుండెల్లోనే స్పర్శ పడినట్టు అనిపించింది.

“దేశం కోసం ప్రాణం ఇస్తున్నాడు” అన్న గర్వం ఆమె కళ్లలో ఒకప్పుడు వెలిగింది. కానీ ఆ గర్వానికి వెనుక దాగి ఉన్న శూన్యత, ఆ రోజు స్పష్టంగా బయటపడింది. ఇంటి ముంగిట వినిపించని అడుగుల శబ్దం, తలుపు తట్టని చేతులు, తల్లి పిలుపుకు స్పందించని గొంతు—అన్నీ ఒక్కసారిగా ఆమె కన్నీళ్లుగా జారాయి.

యుద్ధ స్మారకాలు రాళ్లతో నిర్మించబడ్డవి కావు; అవి తల్లుల కన్నీళ్లతో, భార్యల నిరీక్షణతో, పిల్లల నిశ్శబ్దంతో నిర్మించబడ్డాయి. అక్కడ ప్రతి పేరు ఒక కథ. ప్రతి కథ వెనుక ఒక కుటుంబం. ఆ తల్లి కన్నీళ్లు మనకు ఒక ప్రశ్న వేస్తాయి—గెలుపు విలువ ఎంత? ఆ విలువను మోసిన హృదయాల ధర ఎంత?

ఆమె చివరికి కన్నీళ్లను తుడుచుకొని, ఆ పేరుకు నమస్కరించింది. ఆ నమస్కారం ఓడిపోయినదానికి కాదు—త్యాగానికి. దేశం నిలబడ్డ పునాది మీద నిలబడి ఉన్న ఒక తల్లి మౌన నమస్కారం అది. మనం ఆ మౌనాన్ని వినాలి; ఆ త్యాగాన్ని మరవకూడదు. ఎందుకంటే ప్రతి స్వేచ్ఛాయుత శ్వాస వెనుక, ఒక తల్లి అశ్రువు ఉంది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

మనిషి మరణం:

 మనిషి మరణం:


పల్లకి ఎక్కని మనిషి ఉంటాడో లేదో తెలియదుగానీ…
పాడె ఎక్కని మనిషి మాత్రం ఉండడు.

జననం నుంచే జీవితం
మరణం వైపు నడిచే యాత్ర—
వీధులంతా ఆశలతో నిండినా
చివరికి చేరేది
మౌనపు మృత్యువు ఒడిలోనే.

రాజ్యాలేలిన రాజైనా,
కష్టాల మట్టిలో పుట్టిన పేదైనా
శ్వాస విడిచే వేళ
అందరికీ ఒకటే దారి, ఒకటే పాడె.

పల్లకీల గర్వం క్షణికం,
పాడే నిజం శాశ్వతం
ప్రతి జీవికి మరణం సహజం,
అది తప్పించుకోలేని
జీవితానికి చివరి చరణం మనిషి మరణం.

✍️ కవి, రచయిత
కోట దామోదర్
మొబైల్ 9391480475

విజయ శిఖరాలను అధిరోహించినా, మనసు వెతుక్కునేది చివరికి తల్లి ప్రేమనే.

 విజయ శిఖరాలను అధిరోహించినా, మనసు వెతుక్కునేది చివరికి తల్లి ప్రేమనే.


భారతదేశంలో జన్మించి, చిన్నప్పుడే నెదర్లాండ్స్‌కు దత్తతగా వెళ్లిన ఒక బాలుడు… కాలక్రమేణా విదేశీ నేలపై పెరిగి, చదువుకుని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని ఒక నగరానికి మేయర్‌గా ఎదిగాడు. కానీ ఈ విజయగాథ వెనుక ఒక భావోద్వేగ కథ దాగి ఉంది. అధికారం, గౌరవం, ప్రజల ప్రశంసలు, సమాజంలో ఉన్నత స్థానం ఇవన్నీ ఉన్నా అతని మనసులో మాత్రం ఒక చిన్న లోటు ఎప్పటికీ మిగిలిపోయింది. అది “అమ్మ” అనే మధురమైన బంధం.

ఆ బాలుడే నేడు నెదర్లాండ్స్‌లోని Heemstede నగర మేయర్ ఫాల్గుణ్ బినెన్‌డిజ్క్. మహారాష్ట్రలోని నాగపూర్ మెడికల్ కాలేజీలో 1985 ఫిబ్రవరి 10 న జన్మించిన ఆయనను, జన్మించిన మూడు రోజులకే నాగ్ పూర్ కు చెందిన సంస్థ 'మాతృ సేవా సంఘ్' (ఎం ఎస్ ఎస్) కు అప్పగించింది అతని కన్న తల్లి. తరువాత, ఒక డచ్ జంట ఆ నవజాత శిశువును దత్తత తీసుకుని నెదర్లాండ్స్ కు వెళ్లారు. ఆ బాలుడు వారి సంరక్షణలో అక్కడ పెరిగి, ఉన్నత విద్యను అభ్యసించి, సమాజ సేవలో అడుగుపెట్టి చివరకు మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

కొన్నాళ్లకు తాను దత్తతకు వచ్చానని తెలుసుకున్నప్పుడు, ఆయన మనసులో ఎన్నో ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. “నా తల్లి ఎవరు? ఎందుకు నన్ను దత్తతకు ఇచ్చింది? ఇప్పుడు ఎక్కడ ఉంది?” అనే ఆలోచనలు ఆయనను వెంటాడాయి. కాలం గడిచింది, బాధ్యతలు పెరిగాయి, కానీ ఆ ప్రశ్నలకు సమాధానం వెతకాలనే తపన మాత్రం తగ్గలేదు.

చివరకు నలభై ఏళ్ల అనంతరం ఆయన తన జన్మస్థలం Nagpur కు చేరుకున్నారు. బాల్యంలో దత్తతకు సంబంధించిన పాత రికార్డులు, అనాథాశ్రమం దస్తావేజులు ఆధారంగా తన కన్నతల్లిని వెతకడం ప్రారంభించారు. ఒకసారి కాదు… రెండు సార్లు కాదు… ఇప్పటివరకు నాలుగు సార్లు భారత్‌కు వచ్చి ప్రయత్నించారు.

ఈ అన్వేషణలో భాగంగా ఆయన Matruseva Sangh మాజీ సూపరింటెండెంట్ Mangala Bhusari ను కలిశారు. నలభై ఏళ్ల క్రితం ఆ అనాథ శిశువు కు “ఫాల్గున్” అని పేరు పెట్టింది ఆమెనే. పాత రికార్డులన్నీ వెతికినా, ఆ తల్లి ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకకపోవడం హృదయ విదారకమైన విషయం.

ఇది కేవలం ఒక వ్యక్తిగత అన్వేషణ కాదు. జన్మనిచ్చిన తల్లి హృదయంలో ఎప్పుడో మిగిలిపోయి ఉండే అపరాధ భావాన్ని తొలగించాలనే ఒక మౌన తపన. ఒక బిడ్డగా తన మూలాలను తెలుసుకోవాలనే ఆకాంక్ష మాత్రమే కాదు, “అమ్మ” అనే బంధాన్ని గౌరవంగా ఆలింగనం చేసుకోవాలనే ఆత్మీయ ప్రయత్నం.

ఇంతకీ తల్లి అతన్ని ఎందుకు దత్తతకు ఇచ్చిందనుకుంటున్నారా? అదొక హృదయవిదారక ఘటన. అతను జన్మించిన సమయంలో ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు. అవివాహితురాలిగా ఒక పసికందుకు జన్మనిచ్చిన ఆమెకు అప్పటి సామాజిక పరిస్థితులు తీవ్రమైన ఒత్తిడిని సృష్టించాయి. పరువు నష్టం, అవమానం, కుటుంబ భయం, ఇవన్నీ కలిసి మూడు రోజుల పసికందును Matru Seva Sangh కు అప్పగించేలా చేశాయి.

అయితే ఈ కథలో తప్పు ఎవరిదన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వెతకడం కష్టం. వ్యక్తుల కంటే అప్పటి సామాజిక పరిస్థితులే దీనికి ప్రధాన కారణమని చెప్పాలి. అవివాహిత తల్లులపై ఉన్న ముద్రలు, పరువు అనే పేరుతో నిర్మితమైన భయాలు, కుటుంబాల ఒత్తిళ్లు, ఇవన్నీ కలిసి ఒక తల్లిని తన హృదయానికి భారమైన నిర్ణయం తీసుకునేలా చేశాయి.

అందుకే ఈ కథను వ్యక్తిగత తప్పిదంగా కాక, సమాజం ఆలోచనా విధానం పై నిలిచే ప్రశ్నగా చూడాలి. ప్రేమతో చేసిన త్యాగం కాలగర్భంలో మౌన వేదనగా మిగిలిపోకూడదంటే, మారాల్సింది మన దృక్పథమే.

ఫాల్గుణ్ బినెన్‌డిజ్క్ మాటలు ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తాయి. “నన్ను పెంచలేకపోయిందని నా తల్లి బాధపడొద్దు. నేను బాగానే పెరిగాను. మంచి జీవితం గడుపుతున్నాను” అని ఆమెకు చెప్పడానికే ఈ ప్రయాణమంతా. నా మాటల్లో కోపం లేదు… బాధ లేదు… కేవలం కృతజ్ఞత మాత్రమే ఉంది అంటారు.

పదవి, గౌరవం, సంపద, ఇవన్నీ జీవితంలో ఉన్నత స్థాయికి చేర్చవచ్చు. కానీ “అమ్మ” అనే బంధం ముందు అవన్నీ చిన్నవే. చాలామంది దత్తతకు వెళ్లిన వారు కాలగమనంలో తమ గతాన్ని మరిచి కొత్త జీవితంలోనే మమేకమై పోవచ్చు. కన్నతల్లిని కలవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండకపోవచ్చు. కానీ ఫాల్గుణ్ కథ మాత్రం భిన్నం. అది దత్తత పిల్లల హృదయాల్లో నిశ్శబ్దంగా దాగి ఉండే “నేను ఎక్కడి వాడిని?” అనే ప్రశ్న ప్రపంచానికి గుర్తు చేసింది.

తన మూలాలను తెలుసుకోవాలనే ఆత్మీయ కోరిక, తనకు జన్మనిచ్చిన తల్లిని కేవలం తెలుసుకోవడమే కాదు, ఆమె హృదయంలో అచిరకాలంగా మిగిలిపోయిన బాధ నుండి సాంత్వన పరచాలనే ప్రయత్నాన్ని ఈ కథ మనకు చెబుతుంది. విజయ శిఖరాలను అధిరోహించినా, మనసు వెతుక్కునేది చివరికి ప్రేమనే, ప్రత్యేకించి కన్నతల్లి ప్రేమని ...

వ్యాసకర్త 
కోట దామోదర్ 
మొబైల్: 9391480475







నాన్న ఎప్పుడు హీరో నే

  హాస్టల్ దాటిన అడుగుల నుంచి యూనివర్సిటీ దారి వరకు  ఒక దృశ్యం నా మనసును ఆపేసింది… భుజం మీద లగేజీ, ముందు నడిచే కూతురు,  వెనుక నడుస్తూ  జీవితమ...