*చదువు భుక్తి కోసం మాత్రమే కాదు*
చదువు కేవలం మార్కుల, ర్యాంకుల కోసమే కాకుండా సమాజంలో మార్పు కోసం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి విద్యార్థులు జ్ఞానసముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విషయ పరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుంది. కష్టపడి చదవడం కన్నా ఇష్టపడి చదివితేనే విషయం ఎక్కువ కాలం గుర్తుండిపోతుందన్న వాస్తవాన్ని నేటి విద్యార్థులు గమనించలేక పోతున్నారు. మన దేశంలోని విద్యార్థులకు సరైన విజ్ఞానం అందించలేకపోవడంతో, వారు ఇతర దేశాల్లో ఉత్పత్తి అయ్యే పరిజ్ఞానంపై ఆధారపడవలసి వస్తుంది. దీని వల్ల మన డిజిటల్ రంగం పెను సవాళ్లు ఎదుర్కొంటుంది. మౌలిక సదుపాయాల కొరత, బోధనలో నాణ్యత లోపించడం లాంటి అనేక ఇతర సమస్యలు నూతన ఆవిష్కరణలకు అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. మన దేశంలో ఎంతమంది విద్యావేత్తలు ఉన్నా.. కొందరి చదువు దేశానికి, ఇరుగుపొరుగు వారికి ఉపయోగపడడం లేదనడంలో సందేహం లేదు. అయితే తాము నేర్చుకున్నది సమాజానికి, పదిమందికి ఉపయోగపడేలా చదువుకునే వారు కొందరైతే, నేర్చుకున్న ప్రతి అక్షరం కొత్త ఆవిష్కరణల కోసమే అన్నట్లుగా సంకల్ప బలం ఉన్నవారు మరికొందరు. అలాంటి వారిలో ముంబై ఐఐటీకి చెందిన సుశీల్ రెడ్డి ఒకరు.
సుశీల్ IIT బాంబే పూర్వ విద్యార్థి 2008 - 2013 బ్యాచ్ – డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. సోలార్ ఎనర్జీ గురించి అధ్యాపకులు చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అవగతం చేసుకుని సూర్యుని శక్తి యొక్క అద్భుతాల గురించి చాలా మందికి తెలియని విషయాలు తెలియజేయాలనే సంకల్పంతో సౌరశక్తి పై తనకున్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు బొంబాయిలోని సోలార్ స్టార్టప్లో రెండేళ్లపాటు పనిచేశాడు. అతను అక్కడ ఉన్న సమయంలో భారతదేశంలో సౌరశక్తి యొక్క అవగాహన పై అనేక అంతర్దృష్టులను పొందారు. పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు పర్యావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలుసు మరియు ఎలక్ట్రిక్ వాహనాలలో సాధారణంగా ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీ లు కూడా విషపూరితమైనవని కొద్ది మందికి తెలుసు. ఈ రెండు మానవాళికి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తున్నాయని గ్రహించి సుశీల్, భవిష్యత్తును పర్యావరణ అనుకూలమైనది మరియు కాలుష్య రహితంగా మార్చాలనే విప్లవాత్మక ఆలోచనలో భాగంగా 2016లో "ది సన్పెడల్ రైడ్" అనే ప్రాజెక్ట్ను ప్రారంభించాడు. ఈ ప్రాజెక్ట్ పెట్రోల్, డీజిల్ లేదా బ్యాటరీ ని ఉపయోగించకుండా సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్. ప్రారంభ దశలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ప్రయత్నం చేసి విజయం సాధించాడు. ప్రాజెక్ట్ యొక్క మొదటి ప్రయాణం పాక్షికంగా సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్పై భారతదేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ స్థానికులతో సంభాషిస్తూ పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో సౌరశక్తి యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ 79 రోజులలో 7000 కిలోమీటర్లు ప్రయాణించారు. భారతదేశంలోనే కాకుండా 2017లో ఫ్రాన్స్లో 30 రోజుల్లో 2000 కి.మీ ప్రయాణం, అదే సంవత్సరంలో USA లోని కాలిఫోర్నియాలో 15 రోజుల్లో 1500 కి.మీ, 2021-2022 లో USA లో 150 రోజులలో 11,800 కిమీ ప్రయాణించి ప్రపంచ స్థాయిలో అనేకమందికి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్ పై పూర్తి అవగాహన కల్పించారు. అతనికి అంతర్జాతీయ గుర్తింపు రావడమే కాకుండా సౌరశక్తితో నడిచే సైకిల్పై సుదీర్ఘ ప్రయాణం చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ను సంపాదించాడు, ఆ తర్వాత సోలార్ సైకిల్పై సుదీర్ఘ ప్రయాణం చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాడు.
పెట్రోల్, డీజిల్ వాడకం వల్ల పర్యావరణానికి హాని:
పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వాడకం వల్ల కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మరియు పర్టిక్యులేట్ పదార్థం వంటి వాయువులు విడుదలై పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా మానవులలో ఊపిరితిత్తులు మరియు ఇతర శ్వాసకోశ వ్యాధుల వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవడం గాక హానికరమైన UV-కిరణాలు వాతావరణంలోకి ప్రవేశించకుండా నిరోధించే ఓజోన్ పొరను కూడా దెబ్బతీస్తుంది. అధిక పెట్రోల్, డీజిల్ వాడకం వల్ల విపరీతమైన ఖర్చు పెరుగుతుంటుంది దాంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పర్యావరణానికి హానికరం.
ఎలక్ట్రిక్ వాహనాలు శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణంగా బ్యాటరీ సౌకర్యంతో పనిచేస్తాయి. ఈ బ్యాటరీ లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీ లు కూడా విషపూరితమైనవని కొంత మందికి తెలుసు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ మరియు డీజిల్ ధర కంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ, బ్యాటరీ ల నుండి లిథియం, కోబాల్ట్, నికెల్ మరియు మాంగనీస్ వంటి పదార్థాలు విడుదల చేయడం వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది, వాటిని సరిగ్గా పార వేయకపోతే మానవ ఆరోగ్యం, వన్యప్రాణులు మరియు పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నప్పటికీ ఫలితం అంతంత మాత్రమే. ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు అంటుకున్న సందర్భాలు భద్రతా సమస్యలను ఏర్పడుతునే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు, ప్రభుత్వం ఈవీ లలో ఉపయోగించే బ్యాటరీల కోసం కొత్త నాణ్యత నియంత్రణ చర్యలు చేపట్టింది. అయినా సరే కొన్నిచోట్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పర్యావరణం తో పాటు, ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలిగిస్తుంది.
సుశీల్ రెడ్డి సోలార్ సైకిల్ ప్రదర్శన:
ఈ సైకిల్ ని తొక్క వలసిన అవసరం లేదు. సౌర ఫలకాల ద్వారా సూర్యుని నుండి గ్రహించబడిన సౌర శక్తి ని విద్యుత్ శక్తి గా మార్చి మోటార్ సహాయంతో పనిచేస్తుంది. దీనివల్ల ఎలాంటి పర్యావరణ కాలుష్యం, శబ్దం ఉండదు. ఈ విద్యుత్ ను సెల్ఫోన్లు, బల్బులు లకూ కూడా ఉపయోగించుకోవచ్చు. సైకిల్ కు అమర్చే సోలార్ పీవీ ప్యానెళ్ల సహాయంతో డీసీ బ్యాటరీ సూర్యరశ్మి ద్వారా విద్యుత్ను గ్రహిస్తుంది. దానితో సైకిల్ వెనుక చక్రానికి అమర్చిన డీసీ మోటార్ పనిచేస్తుంది. ఒకసారి బ్యాటరీ చార్జ్ అయితే 50-60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఎండ బాగా ఉన్న చోట ఒకేసారి 60 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. సోలార్ ఎనర్జీ వాడటం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా విద్యుత్తును పొందే అవకాశం ఉంటుంది.
సౌరశక్తి ఉపయోగాలు:
సోలార్ ఉత్పత్తుల ధర ఎక్కువగా ఉండటం మరియు సౌర విద్యుత్ గురించి తెలియకపోవడంతో చాలా మంది ఈ ఉత్పత్తులను వినియోగించడం లేదు. ఈ ఉత్పత్తుల గురించి ప్రజలలో ప్రత్యేక అవగాహన కల్పించినట్లయితే ప్రతి ఒక్కరు సౌర విద్యుత్ ను వినియోగించడానికి ఇష్టపడుతారు. ఇప్పకే వివిధ రకాల సౌర ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయన్న విషయం అతికొద్ది మందికి తెలుసు. వీధిలైట్లు, ఇంటి లైటింగ్ సిస్టమ్స్, వాటర్ హీటర్లు, ఇన్వర్టర్లు, ల్యాంప్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అపార్ట్మెంట్లలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇందుకోసం న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీలు మీ అపార్ట్ మెంట్ ను పరిశీలించి ఎన్ని వాట్ల విద్యుత్ అవసరమో అంచనా వేసి అందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలియజేస్తారు తర్వాత ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. ఒక కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది. సోలార్ ఎమర్జెన్సీ లైట్ను 6 గంటల పాటు ఎండలో ఉంచితే మూడు గంటల పాటు బల్బు నిరంతరం వెలుగుతుంది. రాత్రిపూట అకస్మాత్తుగా విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు వాటిని దీపాలుగా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా సోలార్ హీటర్, ఇన్వర్టర్లు కూడా ఎంతో ఉపయోగపడతాయి.
పర్యావరణ కాలుష్యం నివారించాలంటే ప్రభుత్వం సౌర విద్యుత్ వాహనాలకు ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిన అవసరముంది. అందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలి.
ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎందరో భారతీయులు విదేశాల్లో సెటిలవుతున్నారు. కానీ ముంబై ఐఐటీకి చెందిన సుశీల్ రెడ్డి మాత్రం మాతృదేశం లోనే ఉంటూ మన దేశ గొప్పతనాన్ని విదేశాలలో ప్రచారం చేయడం గర్వించదగిన విషయం.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
25, జూన్ 2024, మంగళవారం
చదువు భుక్తి కోసం మాత్రమే కాదు
21, మే 2024, మంగళవారం
మాతృభాషలోనే ఎందుకు బోధించాలి:
వన్నె తగ్గుతున్న తెలుగు:
విద్యావంతులు మాతృభాష సమస్యను ఎదుర్కొంటే మనం కలలు కంటున్న స్వేచ్ఛా భారతాన్ని సాధించలేమని, అన్ని స్థాయిలలో మాతృభాషను ప్రభుత్వ భాషగా, బోధనా భాషగా కొనసాగించాలని మహాత్ముడు ఆనాడే కోరారు. నేటికీ మహాత్ముడి మనోవ్యధను చిత్రించే పరిస్థితులు ఎందుకున్నాయో అందరూ ఆలోచించాల్సిన విషయమే.
భారత రాజ్యాంగం (ఆర్టికల్ 350A) మరియు కొఠారి కమిషన్ ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమం అనివార్యమైన అవసరం అని సూచించారు. యునెస్కో తో పాటు అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా పిల్లలకు మాతృభాషలోనే చదువు చెప్పాలని చెబుతున్నాయి. ఉత్పత్తిలో అత్యున్నత స్థాయి అభివృద్ధి సాధించిన జపాన్ దేశీయ మాధ్యమాన్ని అత్యున్నత స్థాయిలో అమలు చేస్తోంది. భారత ప్రభుత్వం 2010 లో ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని నిర్ధేశించిన ప్పటికీ ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. చాలా దేశాలు మాతృభాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుండగా, మన దేశం మాత్రం ఆంగ్ల భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విచారకరం. యువత ఇంగ్లీషు భాషపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో అన్ని రాష్ట్రాల్లో మాతృభాషా మాధ్యమాన్ని బోధించే ప్రభుత్వ పాఠశాలలు మూత పడే పరిస్థితి ఏర్పడింది. తెలుగు వద్దు ఆంగ్లం ముద్దు అంటూ ప్రైవేట్ పాఠశాలలు యువతను, తల్లిదండ్రులను విశేషంగా ఆకర్షిస్తున్నా, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.
మాతృభాషలోనే ఎందుకు బోధించాలి:
భాష ఒక దేశం యొక్క నాగరికత, సంస్కృతి మరియు ప్రజా జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. భాష అనేది భావాన్ని వ్యక్తీకరించడానికి మాత్రమే కాకుండా, భావాలు ఏకీకృతం చేయడానికి మరియు భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి సహాయపడుతుంది. మనం తల్లి నుండి మొట్టమొదటగా నేర్చుకునేది , ఎక్కువగా మాట్లాడేదీ, భావోద్వేగ లేదా హృదయాను గత సంబంధం కలిగినదీ, ప్రతిచర్యలో ఉపయోగించేది మాతృభాష. చదువు సమయంలో పిల్లలకు ఆసక్తి, అవగాహన పెంపొందించేందుకు మాతృభాషలో బోధన తప్పనిసరి. విద్యార్థులకు కొత్త విషయాలపై అవగాహన కల్పించడంలో మాతృభాష ముఖ్య పాత్ర పోషిస్తుంది. మాతృభాషలో బోధించడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, దేశభక్తి పెంపొందుతాయి. మాతృభాషలో వ్యక్తీకరించడం, బోధించడం మరియు నేర్చుకోవడం వంటి ప్రక్రియలు సులభతరం అవుతాయి. వ్యక్తిత్వ వికాసం, కళాపోషణ, సాహిత్య అభినయం, సృజనాత్మకత, తీర్పు మొదలైన వాటిలో మాతృభాష ప్రధాన పాత్ర పోషిస్తుంది. మాతృభాషలో చదువుకోవడం వల్ల ప్రతి పాఠాన్ని కంఠస్థం చేయకుండా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకున్న పాఠం మరచిపోలేము. అంతేకాదు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అవగాహన భావాలు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వీలు కల్పిస్తుంది. విద్యార్థి మాతృభాషలో జ్ఞానాన్ని పెంపొందించుకుని స్వీయ రచనకు సిద్ధమవుతాడు. మాతృభాషలో విద్యాబోధన చేస్తే విషయం బాగా అర్థమవుతుంది. ఇంగ్లీషు మీడియంలో అదే చదివే పిల్లలు పాఠం పై పట్టు సాధించ లేరు. ఇంగ్లీషు మీడియంలో చదివిన వారిని, మాతృభాషా మాధ్యమం లో చదివిన వారిని పరిశీలించినప్పుడు మాతృభాషా మాధ్యమంలో చదివే వారికి పాఠ్యాంశాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది.
తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యత కొరత:
ఇప్పటివరకు ఏ పార్టీ అయినా ప్రాథమిక విద్యను ఇంగ్లీష్ మీడియానికి మార్చుతామని, తెలుగు ని ఒక సబ్జెక్ట్ గా మాత్రమే ఉంచుతామని హామీలు ఇవ్వడం జరిగింది అంతే తప్ప ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమం లో ఉంచి ఇంగ్లీష్ ని ఒక సబ్జెక్టుగా ఉంచుతామని ఏ ఒక్క పార్టీ కూడా ఇంతవరకు హామీ ఇవ్వలేదు. తెలుగు మాధ్యమం లో చదువుకు, ఉపాధికి ఏ పార్టీ కూడా హామీలు ఇవ్వకపోవడమే కాదు గత మూడేళ్ల నుంచి అనేక ప్రాథమిక పాఠశాలలను ఆంగ్ల మాధ్యమం గా మార్చారు. దీంతో పాటు మిగిలిన పాఠశాలలను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నుంచి అన్ని పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం అవుతుందనడంలో సందేహం లేదు. ఇందుకు కారణం విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్లమాధ్యమంపై మక్కువ చూపుతున్నారనే ఒక్క కారణం చూపుతూ తెలుగు మాధ్యమాన్ని లేకుండా తీసిపారేస్తున్నారు. అందువల్ల విద్యార్థులకు మాతృభాష పై పట్టు కోల్పోవడమే కాక గురువులు చెప్పే పాఠం లోని సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒకానొక సందర్భంలో మహాత్మాగాంధీ మాతృభాషలో విద్య ఉంటె స్వరాజ్యం ఎప్పుడో వచ్చేది అన్నారట. ఇది మాత్రం అక్షర సత్యమే, భాషా చాతుర్యం ఉంటే ఏదైనా సంక్లిష్టమైన విషయాన్ని సులభంగా పరిష్కరించగలము మరియు మనం చెప్పదలుచుకున్న ప్రతిదాన్ని క్షణాల్లో వివరించగలము. ఊహాత్మక ఆలోచనకు, ఊహాత్మక శక్తికి, సృజనాత్మకతకు మూలం మాతృభాష.
మాతృభాషను విస్మరిస్తున్నారు:
మాతృభాషను విస్మరించి పర భాషకు పట్టం ఎందుకు కడుతున్నారంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పర భాషలోనే దొరుకుతున్నాయి కాబట్టి అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివించడానికి ఆసక్తి చూపుతున్నారు. మాతృభాషలో ప్రాథమిక విద్య లేనందున విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యం కోల్పోతున్నారు. ఆంగ్ల మాధ్యమం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా ఆంగ్లమాధ్యమంలో చదివిన విద్యార్థులు తెలుగు మాట్లాడితే అందులో చాలావరకు తప్పులు ఉంటున్నాయి. అంటే వారు కనీసం మాట్లాడటానికి కూడా విముఖత చూపుతున్నారు. రాబోవు రోజుల్లో తెలుగు మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముంది. ఆంగ్ల మాధ్యమానికి ఉన్నంతగా ప్రోత్సాహకాలు తెలుగు మాధ్యమానికి లేకపోవడంతో ప్రజలు కూడా తమ పిల్లలు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడాలని మార్పు కోరుకుంటున్నారు.
ఇతర దేశాల్లో విద్యా విధానం ఎలా ఉందో చూద్దాం:
అభివృద్ధి చెందిన దేశాలన్నీ మాతృభాషకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడి విద్యా విధానం విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది కాబట్టి వారు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేస్తున్నారు.
జపాన్:
జపాన్లో విద్యార్థులకు పాఠాలే కాకుండా ఇతరులతో ఎలా ప్రవర్తించాలి? కొన్ని విషయాల్లో కఠినంగా ఉండటం ఎలా? స్వీయ నియంత్రణ ఎలా ఉండాలి? ఈ సబ్జెక్టులను ప్రాథమిక మాధ్యమంలోనే విద్యార్థులకు బోధిస్తారు. పది సంవత్సరాల వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా చిన్న చిన్న పరీక్షలతోనే విద్యార్థులకు బోధిస్తున్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత గా భావించి ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే కాకుండా వారితో పాటు పాఠశాల పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో వారికి ఉపయోగపడే జపనీస్ కాలిగ్రఫీ మరియు సాహిత్యం కూడా నేర్పిస్తారు.
ఫ్రాన్స్:
ఆరేళ్లలోపు పిల్లలందరిని తప్పనిసరిగా పాఠశాలకు పంపాలి. ఇక్కడ పాఠశాలలు వారానికి నాలుగున్నర రోజులు మాత్రమే పనిచేస్తాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాకుండా ప్రతిభ తక్కువగా ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి వారిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మన దేశంలో 10వ తరగతి పరీక్ష లాగా ఇక్కడ కూడా బ్యాకలారియాట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతేనే సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తయినట్లు. బ్యాకలారియాట్ అనేది US హైస్కూల్ డిప్లొమా కి సమానం.
సింగపూర్:
ఇక్కడ పాఠశాల విద్య మూడు భాగాలు. తొలి ఆరేళ్లు ప్రైమరీ, నాలుగేళ్లు సెకండరీ, ఆ తర్వాత మూడేళ్లు పోస్ట్-సెకండరీ విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. ప్రైమరీ విద్య నాలుగేళ్లు పూర్తికాగానే పాఠశాలలే సొంతంగా పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో విద్యార్థులు ఏ సబ్జెక్ట్ లో రాణించగలుతున్నారో గుర్తించి, ఆ తర్వాత రెండేళ్ల చదువును కొనసాగిస్తారు.
ప్రభుత్వ పాఠశాలలు మూత బడటానికి కారణం:
తెలంగాణలో ప్రభుత్వ బడులు మూసివేయడం బాధాకరమైన విషయం. అందుకు కారణం బడుల్లో పిల్లలు లేకపోవడం వల్లే మూసివేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాఠశాలలో టీచర్స్ కొరత వల్లే పిల్లలను పంపలేక పోతున్నామని చెబుతున్నారు. కానీ ఆయా ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేరకపోవడానికి, తల్లిదండ్రులు చేర్పించక పోవడానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి అధికారికంగా, శాస్త్రీయంగా ఒక్క ప్రయత్నం కూడా జరగలేదు. కేవలం ఉపాధ్యాయులనే నిందిస్తున్నారనే విష ప్రచారం జోరుగా సాగుతోంది. పిల్లలను తెలుగు మీడియం చదివిస్తే రాబోవు రోజుల్లో సరైన ఉద్యోగ అవకాశాలు ఉండవేమో అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం చదువు కొరకు ఊరి బడిని వదిలి, కిక్కిరిసిన బస్సుల్లో తమ పిల్లలను పేరెంట్స్ దూర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు బడులకు పంపడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమ బోధన అందులో మొదటిది. కాగా సర్కారు బడుల్లో ముఖ్యంగా ప్రైమరీ స్థాయిలో ఒకటి లేదా రెండు గదుల్లో అన్ని తరగతులు ఒకరు లేదా ఇద్దరు టీచర్లు నిర్వహించాల్సి రావడం మరొక ప్రధాన కారణం. ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా, ఉపాధ్యాయుల కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు భాషను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475
11, మే 2024, శనివారం
చేతులతో కాక చేష్టలతో పద్మశ్రీ అందుకున్నారు ":KS రాజన్న".
చేతులతో కాక చేష్టలతో పద్మశ్రీ అందుకున్న ":KS రాజన్న".
“సేవే మార్గం” అనే సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణా ఆచరించి చరిత్రలో తన నమూనా సుస్థిరం చేసుకున్న అతికొద్ది మంది మహనీయుల్లో మదర్ థెరిసా ఒకరు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమంటే దేవుడిని సాక్షాత్తు పూజించడమేనని ప్రగాఢంగా విశ్వసించిన మదర్ థెరిసా లక్షలాది మందికి ప్రేమను పంచి, “ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులే విలువైనవి”అని ప్రపంచానికి తెలియజేసింది. సాటి మానవుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండటం మరియు సేవా తత్పరత జీవిత పరమార్థమని ఆమె తన జీవితం ద్వారా చాటిచెప్పింది. ఆమె తన జీవిత కాలంలోనే కాకుండా మరణానంతరం కూడా కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. “మానవుడే మహనీయుడు” అనే నానుడి నిజమని నిరూపించిన మహిళా మూర్తి ఆమె. మదర్ థెరిసా స్ఫూర్తితోనేటికీ ఎంతోమంది సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుండటం ఆమె ఆదర్శమయ జీవితానికి ప్రతీక.
మనిషికి వైకల్యం ఉన్నా మనసుకు మాత్రం వైకల్యం ఉండకూడదు అంటారు. మానసిక దృఢత్వం ఉన్నవారు శారీరక వైకల్యాలను అధిగమించడమే గాక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన వికలాంగుడు, సామాజిక సేవాతత్పరుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కె ఎస్ రాజన్న జీవిత కథ గురించి కొంత తెలుసుకుందాం.
పోలియో బారిన పడి కాళ్లు, చేతులు కోల్పోయిన ఆయన స్వీయ ప్రేరణ, దీక్షతో మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. సమాజంలో తాను ఎవరికీ తక్కువ కాదని భావించిన రాజన్న 2002లో వివిధ వైకల్యాలున్న క్రీడాకారుల కోసం నిర్వహించిన పారాలింపిక్స్లో డిస్కస్ త్రో క్రీడలో స్వర్ణం సాధించాడు. అంతేకాదు స్విమ్మింగ్లో రజతం సాధించి ఆశయసిద్ధికి అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించాడు. అతను వికలాంగుల రాష్ట్ర కమిషనర్గా కూడా పనిచేశాడు.
కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాకు చెందిన కేఎస్ రాజన్న 11 ఏళ్ల వయసులో పోలియో బారిన పడి చేతులు, కాళ్లు చచ్చుబడి వికలాంగుడైన రాజన్న ధైర్యం కోల్పోకుండా మోకాళ్లపై నడవడం నేర్చుకున్నాడు. అందరితో సమానంగా విద్యనభ్యసించాలనే దృఢ సంకల్పంతో పట్టుదలతో చదివి 1975లో రాష్ట్రస్థాయి సివిల్ పరీక్షల్లో విజయం సాధించారు. 1980లో మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా పొందారు. ఆ తర్వాత వికలాంగులు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మరియు వికలాంగుల హక్కులను పరిరక్షించడానికి, తను వికలాంగుల ప్రయోజనాల కోసం, వికలాంగుల సమాన అవకాశాల కోసం పనిచేయాలని నిర్ణయించుకొని సామాజిక కార్యకర్తగా శ్లాఘనీయమైన సేవలందించారు. వికలాంగుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసి వివిధ రంగాల్లో అఖండ విజయాలు సాధించారు. వందలాది మందికి ఉపాధి కల్పించి వేలాది మంది వికలాంగులకు స్వావలంబన కల్పించారు. అక్కడితో ఆగకుండా, రాజకీయాల్లో చేరి లింగరాజ పురం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన ఎస్ ఎంకృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి బెళూరు సిటీ కార్పొరేషన్లో కౌన్సిలర్గా నామినేషన్కు చేర్చారు. వికలాంగులకు ఉపాధి హామీ కల్పించడం కోసం రాజన్న వ్యాపార సంస్థను ఏర్పాటు చేశారు.తన సంస్థ ద్వారా ప్రత్యేకంగా 500 మందికి పైగా వికలాంగులకు ఉపాధి కల్పించడం అభినందనీయం. రాజన్న చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం 2013లో రాజన్నకు 'కమిషనర్ డిసేబుల్' పదవి ఇచ్చింది. రాజన్న 54 ఏళ్ల వయసులో రాష్ట్ర తొలి వికలాంగ కమిషనర్గా సభ్యులవ్వడం గర్వకారణమని.. ఆయన హయాంలో వికలాంగుల జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు వికలాంగుల చట్టం సక్రమంగా అమలు కావాలంటే వికలాంగుల గణన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్ద ఎత్తున పోరాటం సాగింది. ఈ నేపథ్యంలోనే వికలాంగుల సంఖ్య మాత్రమే కాకుండా వైకల్యంతో బాధపడుతున్న జనాభా ఎంత, విద్యార్హత, ఉపాధి, ఆదాయం వంటి వివరాలను కూడా నమోదు చేయడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అనేక సమస్యలపై అధ్యయనం చేసి వికలాంగులకు ప్రశంసనీయమైన సేవలందించారు. కమిషనర్ పదవిలో రాజన్న 2016 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం 2015 ప్రారంభంలో ఆయనను పదవి నుంచి తొలగించింది. రాజన్నను తొలగించడంపై రాష్ట్ర వికలాంగుల సంఘాలు విమర్శించాయి. కాగా ఆ తర్వాత ఏర్పాటైన సిద్ధరామయ్య ప్రభుత్వం పునః సంస్కరణల్లో భాగంగా రాజన్నను తిరిగి నియమించింది. పునర్నియామకం తర్వాత ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.
KS రాజన్న సమాజ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం “అంకితభావంతో కూడిన సామాజిక కార్యకర్త” విభాగంలో ఆయనకు 2024 మే 9న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఆయనను ‘పద్మశ్రీ’తో సత్కరించింది.
"ఆత్మే పరమాత్మ" అని ఆధ్యాత్మికత మనకు బోధిస్తుంది. భక్తితో కొలవడం ద్వారానే స్వామిని దర్శించగలగాలి. ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని చూడాలి. పేదలకు సేవ చేయడమే మాధవ సేవ. ఇతరులకు సహాయం చేసి తమను తాము మానవత్వంతో నిరూపించుకున్న వారే గొప్పవారు. సమాజ శ్రేయస్సు కోరని ఆధ్యాత్మిక సాధన ఫలించదు. ఆహ్లాదకరమైన సత్కార్యాలు చేసే వారిని ఇష్టపడతారు. అందుకే 'దయగల హృదయమే భగవంతుని నిలయం' అన్నారు పెద్దలు.
సేవ అనేది సహజ లక్షణంగా ఉండాలి. భగవంతుని అనుగ్రహం కోసం పుణ్యక్షేత్రాలు, గోపురాలను దర్శించుకోవడం మంచిది. కానీ, నిరుపేదల పట్ల కరుణ చూపకపోతే దేవుడు కూడా సంతోషించడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నలుగురితో కలిసి చేసే మంచి పనిలో జీవించడం గొప్ప లక్షణం. అంతేకాని ప్రచారం, ప్రశంసల కోసం చేసే కార్యక్రమాలను పుణ్యకార్యాలుగా చూడరు. ఏ చిన్న పనినైనా నిస్వార్థంగా చేయడం చాలా ముఖ్యం. సమాజంలో సేవ చేసే వారిని ప్రోత్సహించడం అంటే మనం కూడా పరోక్షంగా సేవ చేస్తున్నట్టే. రాజన్న సేవలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కేఎస్ రాజన్న తన సామాజిక సేవలో వైకల్యాన్ని ఎప్పుడూ అడ్డంకిగా భావించలేదు. అది ఆశయ సాధనకు ఏమాత్రం అవరోధం కాబోదని ఆయన సాధించిన ఈ విజయం నేటి యువతకు ముఖ్యంగా వికలాంగులకు ఎంతో స్ఫూర్తిదాయకం.
సంకల్పం, నిర్విరామ కృషితో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని మరోసారి నిరూపించిన "కె.ఎస్.రాజన్న" జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని చెప్పడంలో అతిశయోక్తి లేదు..
అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప అది మనిషిలో ఉన్న ప్రతిభకు కాదు అన్న నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం "KS రాజన్న". ఆయన సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
3, మే 2024, శుక్రవారం
చదువు స్వల్పం, ప్రతిభ అమోఘం "చింతకింది మల్లేశం"
చదువు స్వల్పం, ప్రతిభ అమోఘం "చింతకింది మల్లేశం":
మానవుడు దైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఆటంకాలు, అవహేళనలు, భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. విమర్శలు వింటూ కూర్చుంటే లక్ష్యం సాధించడం అసాధ్యం. విమర్శలను వినకుండా ముందుకు సాగినప్పుడే విజయం తథ్యం.
మారుతున్న కాలానికి అనుగుణంగా, శ్రమను తగ్గించడానికి మరియు పనిని సులభతరం చేయడానికి అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త ఆవిష్కరణలు సృష్టించడం అవసరం. మునుపు చేతితో ఉత్పత్తి చేయడం ద్వారా తక్కువగా ఉండే ఉత్పాదకతను యంత్రీకరణ ద్వారా పెంచేందుకు అవిశ్రాంత కృషి చేసిన ఆవిష్కర్తలకు అభినందనలు. తయారు చేయడానికి విద్య మాత్రమే కాదు, యంత్రం యొక్క పనిలో నైపుణ్యం కూడా అవసరం. అయితే ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ఆవిష్కర్తలలో ఉన్నత విద్యావంతుల కంటే సామాన్యులే ఎక్కువగా ఉండటం వారి కళాత్మక ప్రతిభకు నిదర్శనం.
మనిషి ఏదైనా సాధించాలంటే కావాల్సింది పట్టుసడలని ప్రయత్నం, సాధించాలంటే తపన ఉంటే ఏదైనా సాధ్యమే. మనం ఏదైనా పనిని మొదట ప్రారంభించినప్పుడు ఎదుటివారి నుంచి సహాయ సహకారాలు పొందడం కంటే అవహేళనలు, అవరోధాలు ఎక్కువగా ఎదుర్కొంటాము. అవరోధాలకు భయపడి వెనుతిరిగితే లక్ష్యం చేరడం అసాధ్యం. అవరోధానికి అవకాశాలుగా మలచుకొని లక్ష్య సాధన కోసం ముందుకు సాగిన వారు మాత్రమే విజయం సాధిస్తారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చేనేత కార్మికులకు అవసరమైన మాన్యువల్ ప్రయత్నాన్ని 7 సంవత్సరాల పాటు కష్టపడి "లక్ష్మీ ఆసు" యంత్రాన్ని కనిపెట్టిన గొప్ప స్ఫూర్తిదాయక వ్యక్తి "చింతకింది మల్లేశం".
అతను కనిపెట్టిన "లక్ష్మీ ఆసు" యంత్రం అతనికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చి పెట్టింది అదనంగా ఫోర్బ్స్ జాబితాలో మల్లెశంకు చోటు దక్కింది. లక్ష్మి ఆసు యంత్రం ఆసియాలోనే అత్యుత్తమమైనది అని అమెరికాకు చెందిన పాట్ లాబ్స్ కొనియాడడం గర్వించదగ్గ విషయం. అద్వితీయమైన ఆవిష్కరణ అతని గుర్తింపుగా భారతదేశం ఆయనను నాలుగో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మశ్రీ' తో సత్కరించింది.
రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన చింతకింది మల్లెశం స్వగ్రామం యాదాద్రి జిల్లా, ఆలేరు మారుమూల పల్లె షారాజీపేట. తండ్రి లక్ష్మి నారాయణ, తల్లి లక్ష్మి ఇద్దరు చేనేత కార్మికులు, రోజు అంత కష్టపడితే గాని కడుపునిండని పరిస్థితి వారిది. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేక మల్లేశం ఆర్థిక ఇబ్బందుల కారణంగా 6వ తరగతి లోనే చదువు ఆపేశాడు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకవైపు మగ్గం పని చేస్తూనే చదువుపై ఆసక్తితో ప్రైవేటుగా 7వ చదివి పాసైనారు, తోటి స్నేహితులందరూ చదువుతున్నారు తాను మగ్గం పని చేస్తున్నాను రాబోవు కాలంలో కనీసం 10వ తరగతి చదివే వారికి సరైన ఉపాధి అవకాశాలు ఉండవు అనే ఉద్దేశ్యంతో 10వ తరగతి కూడా ప్రైవేటుగా చదివి పాసయ్యాడు. తండ్రి చీరలు నేస్తూ కొడుకును కూడా చీరలు నేయడంలో నిపుణుడిని చేశారు. తల్లి చీర నేయడానికి సరిపడా దారాన్ని ఆసు పోసి వారికి అందించింది. ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టూ 9 వేల సార్లు కండెల చుట్టూ తిప్పాలి. ఇలా రోజుకు 18 వేల సార్లు అంటే సుమారు 25 కి.మీ దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని రెండు చీరలు తయారుకావు. ఎంతో శ్రమ తో కూడుకున్నది చేనేత పని. రోజు కండెల చుట్టూ దారాన్ని తిప్పడం వలన చేతులు లాగుతూ భుజం నొప్పితో బాధపడుతుండేది. అమ్మ పడుతున్న కష్టాన్ని చూడలేక అమ్మ శ్రమను తగ్గించడానికి ఏదైనా యంత్రాన్ని కనిపెట్టాలనే ఆలోచన వచ్చింది. తన ఆలోచన ఆచరణలో పెట్టేందుకు తల్లితో కలిసి ఆమె చేస్తున్న పనిని గమనించి ఆ పనిని ఐదు భాగాలుగా విభజించి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.తన ఆలోచన ఇరుగుపొరుగు వారితో పంచుకున్నాడు. అందరూ మల్లేశం ను నిరుత్సాహపరిచారు కానీ ఎవరూ ప్రోత్సహించలేదు కానీ అతను తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు మరియు విఫలమయ్యాడు మరియు కొంత డబ్బు కోల్పోయాడు. అయితే, ప్రతి రోజూ అదే పని గురించి ఆలోచన. ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. వారి నుంచి విమర్శలు రావడం వంటి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా సరే ఆ పనిని వదలక పోవడం వల్ల మల్లేశం కి పెళ్లి చేస్తే నైనా ఆ పనిని మరచి వేరే పని చేసి బతుకుతాడు అని భావించి అతనికి పెళ్లి చేశారు. పెళ్ళైన కొంత కాలం వరకు ఆ పని జోలికి వెళ్లకుండా మగ్గం పని చేశారు. తర్వాత మధ్యలో ఆగిపోయిన పనిపై మళ్లీ ఆలోచన వచ్చింది. తన ఆలోచన భార్యకు చెప్పి, తన వద్ద ఉన్న కొంత డబ్బుతో మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అతను విజయం సాధించలేకపోయాడు మరియు అతను తన భార్య నుండి తీసుకున్న డబ్బు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారు తీవ్రంగా విమర్శిస్తుండగా.. ఇక్కడ అప్పులు తీర్చడం కష్టమని భావించి హైదరాబాద్ వచ్చి ఎలక్ట్రీషియన్ దగ్గర ఉద్యోగంలో చేరాడు. అతను ఎలక్ట్రికల్ మోటార్స్ గురించి కొంత పరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు. తాను తయారు చేయాలనుకున్న యంత్రానికి కావాల్సిన టెక్నాలజీని వెతుకుతుండగా బాలానగర్ లోని ఓ ఎలక్ట్రికల్ కంపెనీలో తనకు కావాల్సిన టెక్నాలజీ దొరికింది. తాను తయారు చేసిన యంత్రానికి సాంకేతికతను అమర్చేందుకు ప్రయత్నించి, అనుకున్నట్లుగానే విజయం సాధించాడు. అనంతరం తాను తయారు చేసిన యంత్రాన్ని పరీక్షించమని కొందరిని అడగగా, పరీక్షిస్తే ముడిసరుకు వృధా అవుతుందని చెప్పారు. అయితే తాము విజయం సాధిస్తామని పట్టుబట్టి.. ముడిసరుకు వృధా అయితే చెల్లిస్తామని చెప్పి యంత్రాన్ని పరీక్షించారు. అద్భుతంగా పనిచేస్తుంది అని వారు చెప్పడంతో తన 7 ఏళ్ల శ్రమ ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు.చాలా ఏళ్ల తర్వాత చేనేత శ్రామికకుల శ్రమను తగ్గించేందుకు సరైన యంత్రాన్ని కనుగొన్న మల్లేశం ను చేనేత కార్మికులు, జిల్లా నాయకులు అభినందించారు. అతని యంత్రాన్ని పరీక్షించిన కొందరు ఇలాంటి యంత్రాన్ని కూడా తయారు చేయమని అడిగారు మరియు చాలా కొనుగోలు చేశారు. అయితే మొదట్లో ఆసు యంత్రాన్ని పూర్తిగా స్టీల్ తో తయారు చేయబడినందున యంత్రం ధర 13000 మాత్రమే అవుతుంది. అనూహ్యంగా 2005లో స్టీలు రేటు పెరగడంతో యంత్రం ఖరీదు 26000 కు చేరుకోగా అంత డబ్బుతో ఎవరికైనా యంత్రం కొనడం కష్టమని తెలిసి మల్లేశం ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు అనుకోకుండా ఒక స్నేహితుడు అతనికి మంచి సలహా ఇచ్చారు. స్టీల్ తో తయారు చేస్తే ఎక్కువ ఖర్చవుతుందని, అదే యంత్రాన్ని విద్యుత్ సహాయంతో తయారు చేస్తే ఖర్చు తగ్గుతుందని సూచిస్తున్నారు. తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ లో ప్రావీణ్యం సంపాదించేందుకు ఎలక్ట్రికల్ సంబంధిత పుస్తకాలతో పాటు ఇంగ్లీష్ డిక్షనరీ కూడా కొన్నాడు. ప్రతి రోజు ఒక్కో పాఠాన్ని డిక్షనరీ సహాయంతో అర్థం చేసుకుని కష్టపడి తనకు కావాల్సిన యంత్రాన్ని తయారు చేసి రెండేళ్ల తర్వాత స్టీల్ మెషీన్ ధర రూ.13000 కి తయారు చేసి ఎలక్ట్రికల్ ఆసు యంత్రాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేశాడు. అతి తక్కువ సమయంలోనే 750 మిషన్లు అమ్మి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2009లో మనిషి కంటే ఎక్కువ పని చేసే విధంగా మరియు కొత్త డిజైన్లు నేయడానికి ఇంకా ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. తన మదిలో వచ్చిన ఆలోచన మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్ సిస్టమ్ అంటే ఏమిటో కూడా తెలియదు కానీ నేర్చుకోవాలనే పట్టుదలతో మళ్లీ పుస్తకాలు కొనుక్కుని అన్నీ అర్థం చేసుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అసాధ్యమైన దాన్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి, సాధ్యమని నిరూపించాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితోనే చదువు మానేసిన మల్లేశం. తీవ్ర ఏకాగ్రతతో మైక్రో కంట్రోలర్ సిస్టమ్ కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నాడు. ఇది ప్రపంచం గర్వించదగ్గ విషయం. తల్లి కష్టం మల్లేశం ను కుదిపేసింది. ఆ ఆవేదనే ఆసు యంత్రం ఆవిష్కరణకు ఆయనలో ప్రేరణ కలిగించింది. అందుకే ఆ యంత్రానికి తన అమ్మ పేరు పెట్టారు.ఆ తర్వాత 2009 లో మనిషి కంటే ఎక్కువ పని చేసే విధంగా మరియు కొత్త డిజైన్ లు తీయడానికి ఇంకా ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. తన మదిలో వచ్చిన ఆలోచన మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్ సిస్టమ్ అంటే ఏమిటో కూడా తెలియదు కానీ నేర్చుకోవాలనే పట్టుదలతో మళ్లీ పుస్తకాలు కొనుక్కుని అన్నీ అర్థం చేసుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అసాధ్యమైన దాన్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి, సాధ్యమని నిరూపించాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితోనే చదువు మానేసిన మల్లేశం. తీవ్ర ఏకాగ్రతతో మైక్రో కంట్రోలర్ సిస్టమ్ కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నాడు. ఇది ప్రపంచం గర్వించదగ్గ విషయం. తల్లి కష్టం మల్లేశం ను కుదిపేసింది. ఆ ఆవేదనే ఆసు యంత్రం ఆవిష్కరణకు ఆయనలో ప్రేరణ కలిగించింది. అందుకే ఆ యంత్రానికి తన అమ్మ పేరు పెట్టారు.ఆ తర్వాత 2009 లో మనిషి కంటే ఎక్కువ పని చేసే విధంగా మరియు కొత్త డిజైన్ లు తీయడానికి ఇంకా ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. తన మదిలో వచ్చిన ఆలోచన మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్ సిస్టమ్ అంటే ఏమిటో కూడా తెలియదు కానీ నేర్చుకోవాలనే పట్టుదలతో మళ్లీ పుస్తకాలు కొనుక్కుని అన్నీ అర్థం చేసుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అసాధ్యమైన దాన్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి, సాధ్యమని నిరూపించాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితోనే చదువు మానేసిన మల్లేశం. తీవ్ర ఏకాగ్రతతో మైక్రో కంట్రోలర్ సిస్టమ్ కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నాడు. ఇది ప్రపంచం గర్వించదగ్గ విషయం. తల్లి కష్టం మల్లేశం ను కుదిపేసింది. ఆ ఆవేదనే ఆసు యంత్రం ఆవిష్కరణకు ఆయనలో ప్రేరణ కలిగించింది. అందుకే ఆ యంత్రానికి తన అమ్మ పేరు పెట్టారు.
మొదట్లో విమర్శలు చేసిన తల్లిదండ్రులు సైతం గర్వించదగ్గ ఆవిష్కరణ చేశారు.
చేనేత కార్మికులకు సాంకేతిక సహకారం అందించిన చింతకింది మల్లెశం కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
అవార్డులు:
2009లో భారత రాష్ట్రపతి చే
2011లో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు లభించాయి.
2011లో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు చేరింది.
2017లో దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డు లభించింది.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమేజింగ్ ఇండియన్స్ అవార్డులు మరియు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు కూడా అందుకున్నారు.
ఈ యంత్రాన్ని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (NIF) భారతదేశం ద్వారా అత్యుత్తమ గ్రాస్రూట్ ఇన్నోవేషన్గా గుర్తించింది మరియు మల్లేశం ను 2009లో భారత రాష్ట్రపతి సత్కరించారు.
ప్రేరణ పొందారు:
2019లో రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా "మల్లేశం" చింతకింది మల్లెశం జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది.
పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475
21, ఏప్రిల్ 2024, ఆదివారం
అలుపెరగని ఆటగాడు "ప్రవీణ్ తాంబే".
అలుపెరగని ఆటగాడు "ప్రవీణ్ తాంబే".
విజయం సాధించాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ వారిలో కొందరు మాత్రమే అనుకున్న లక్ష్యం వైపు వెళ్లి అనుకున్న విజయాన్ని సాధిస్తారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోలేక కొందరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. లక్ష్యం సాధించాలంటే లక్ష సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొనే శక్తి మీలో ఉన్నప్పుడు విజయం మీ సొంతమవుతుంది. అనుకూల వాతావరణం లేకపోవడం మరియు ప్రతికూల పరిస్థితులు లక్ష్యాల సాధనకు ప్రాథమిక అవరోధాలు. ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించగలిగితే విజయం తథ్యం.
అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించిన విజయవంతమైన వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. ప్రవీణ్ తాంబే ఆ కోవకు చెందిన వారే.
41 ఏళ్ల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అరంగేట్రం చేసి, అసాధ్యాలను సుసాధ్యం చేసి లేటు వయసులో అరుదైన ఘనతను సాధించి సంచలనం సృష్టించాడు. సాధారణంగా క్రికెటర్లు 40 ఏళ్లు నిండకుండానే రిటైర్ అవుతారు. కానీ ప్రవీణ్ తాంబే రిటైర్మెంట్ వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించి తన ప్రతిభతో క్రికెట్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
41 ఏళ్ల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీల్) లోకి ఎలా రాగలిగారనేది ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం కలగక మానదు.
ప్రవీణ్ తాంబే ఓ మధ్యతరగతి కుటుంబంలో విజయ్ తాంబే, జ్యోతి తాంబే దంపతులకు 8 అక్టోబర్ 1971 న ముంబైలో జన్మించారు. తండ్రి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించే వారు. ప్రవీణ్ తాంబే చిన్నప్పటినుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో స్నేహితులందరూ చదువుపై శ్రద్ధ చూపేవారు, కానీ తను మాత్రం క్రికెట్ పైనే ఆసక్తి చూపేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే అతనికి క్రికెట్ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి క్రికెట్పై మక్కువ పెంచుకుని ఫాస్ట్ బౌలర్గా ఎదగాలనుకున్నాడు. కానీ అతని ఓరియంట్ షిప్పింగ్ కెప్టెన్ అజయ్ కదమ్ అతన్ని లెగ్ స్పిన్ ప్రయత్నించమని ప్రోత్సహించాడు. అతడికి క్రికెట్పై ఉన్న ఆసక్తిని గమనించిన తండ్రి తగు ప్రోత్సాహాన్ని అందించారు తప్ప ఏ ఒక్క రోజు క్రికెట్ మానేయమని చెప్పలేదు. ఎందుకంటే తండ్రికి క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి. కానీ ప్రవీణ్ తాంబే తల్లికి క్రికెట్ ఆడటం ఇష్టం ఉండదు. క్రికెట్ ఆడటం మానేసి చదువుపై దృష్టి పెట్టాలని తల్లి ఎన్నోసార్లు హెచ్చరించినా ప్రవీణ్ తాంబేలో మార్పు రాలేదు. అన్నదమ్ములిద్దరూ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ప్రవీణ్ అన్నయ్య ప్రశాంత్ చదువుపై శ్రద్ధ పెట్టి మంచి మార్కులు సాధిస్తుండగా, క్రికెట్ అంటే ప్రాణం అన్నట్లుగా ప్రవీణ్ తాంబే చదువుపై ఆసక్తి చూపేవాడు కాదు . ప్రవీణ్ తాంబే ఎప్పుడు తనతో కలిసి క్రికెట్ ఆడేవాడు. 10వ తరగతి తర్వాత అన్నదమ్ములిద్దరూ ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో చదివారు. ఆ తర్వాత అన్నయ్య ప్రశాంత్ మంచి ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి సాయపడేవాడు, అయితే ప్రవీణ్ తాంబే క్రికెట్లో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాడు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతనికి సరైన కోచింగ్ లభించలేదు. ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని జాబ్ చేయడం ప్రారంభించాడు. అయినా క్రికెట్ ఆటపై అతని ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. అనుకున్న ఆశయాన్ని అధిగమించాలంటే తపన పెరిగింది. ఉద్యోగం చేస్తూనే రాత్రిపూట ప్రాక్టీస్ చేసేవాడు. కొడుకు క్రికెట్ పిచ్చిని అరికట్టేందుకు తల్లి జ్యోతి తాంబే ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు పెళ్లి చేసుకుంటే ఎప్పటికైనా మారతారు అనే ఉద్దేశంతో పెళ్లి చేశారు. అయినప్పటికీ, ఏమీ మారలేదు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆడలేదు. ఆటే ప్రాణంగా, క్రికెట్ తన జీవితంలో భావించి తన 41 సంవత్సరాల వయస్సులో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అరంగేట్రం చేసి అత్యంత వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. వయస్సును లెక్కచేయని మేరునగధీరుడు. ప్రపంచం మెచ్చిన ఆటగాడు ప్రవీణ్ తాంబే.
ప్రారంభ వృత్తి:
జీవితంలో అనుకున్నది సాధించాలంటే ఎన్ని అడ్డంకులనైనా అధిగమించి తీరాల్సిందే అప్పుడే విజయం సాధించడానికి అవకాశం ఉందనడానికి ఉదాహరణే ప్రవీణ్ తాంబే జీవితం. అతను 1995-96లో ముంబై దేశీయ లీగ్లోని డి పార్సీ సైక్లిస్ట్ల జట్టుతో క్లబ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 2000 మరియు 2002 సంవత్సరాల మధ్య ముంబై రంజీ ప్రాబబుల్స్ జట్టులో మంచి పేరు సంపాదించారు. కానీ దురదృష్టవశాత్తు తుది జట్టులో డ్రాఫ్ట్ చేయలేకపోయింది. అయినా ఎప్పుడు కుంగిపోలేదు. లక్ష్యం ముందు ఎన్ని అవరోధాలు కనపడదు అన్నట్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్రం లక్ష్యంగా ముందుకు సాగారు. పగలు ఉద్యోగం రాత్రి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు అహర్నిశలు శ్రమించారు. ఆతర్వాత IPL ప్రారంభ సమయంలో నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో మ్యాచ్లు జరిగినప్పుడల్లా ప్రవీణ్ తాంబే లైజన్ ఆఫీసర్గా పనిచేశాడు. జనవరి 2013లో జరిగిన ఆహ్వానం T20లో DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ యొక్క B జట్టుకు తాంబే కోచ్గా ఉందని తెలుసుకుని ప్రవీణ్ తాంబే ను బౌలర్గా అవకాశం పొందారు. టోర్నమెంట్లో గాయపడిన రాహుల్ శర్మ మరియు తాంబే 12 వికెట్లు పడగొట్టి అతని జట్టు ఆహ్వానం టోర్నమెంట్లో విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారు. తన ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షించింది మరియు రాజస్థాన్ రాయల్స్తో IPL ఆడటానికి దోహదపడింది. ఐపీఎల్లో ఎంపికయ్యే ముందు, తాంబే ఫస్ట్-క్లాస్ జట్టు కోసం ఉన్నత స్థాయి ఆట కూడా ఆడకపోవడం గమనార్షం. అతను 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్పై రాజస్థాన్ రాయల్స్ తరపున తన ప్రొఫెషనల్ క్రికెట్ అరంగేట్రంతో పాటు 41 సంవత్సరాల వయస్సులో తన T20 అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తర్వాత జరిగిన ఛాంపియన్స్ లీగ్ T20లో లెగ్ స్పిన్నర్ గా స్పాట్లైట్ని పొందాడు, అతను ఐదు గేమ్లలో 6.50 సగటుతో 12 వికెట్లతో పోటీలో ప్రముఖ వికెట్-టేకర్గా ఉన్నాడు, నరైన్ మరియు ఆర్ అశ్విన్. ఆ సంవత్సరం అతని ప్రదర్శనలు అతనికి 2013-14 రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు తన తొలి పిలుపునిచ్చాయి. ఇంకా 2014 IPL లో తాంబేక్తా నైట్ రైడర్స్పై 5 మే 2014న అహ్మదాబాద్లో మనీష్ పాండే , యూసుఫ్ పఠాన్ మరియు ర్యాన్ టెన్ డోస్చాట్లను అవుట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాధించాడు. 2018 T10 లీగ్లో కేరళ నైట్స్తో జరిగిన నాల్గవ గ్రూప్ మ్యాచ్లో అతను క్రిస్ గేల్ , ఇయాన్ మోర్గాన్ , కీరన్ పొలార్డ్ , ఫాబియన్లను అవుట్ చేయడం ద్వారా T10 చరిత్రలో 5 వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలెన్ మరియు ఉపుల్ తరంగ, మోర్గాన్, పొలార్డ్ మరియు అలెన్లను వరుస బంతుల్లో అవుట్ చేయడం ద్వారా T10 లీగ్లో షాహిద్ ఆఫ్రిది తర్వాత హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రవీణ్ తాంబే తన IPL కెరీర్లో ఇప్పటి వరకు 33 మ్యాచ్లు ఆడాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో తొలి భారత క్రికెటర్గా నిలిచాడు. 2013 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20లో తాంబే గోల్డెన్ వికెట్ అవార్డు అందుకున్నాడు. అనుకున్న ఆశయం కోసం ఎన్నో అవరోధాల అవకాశాలుగా మలుచుకుని ప్రపంచంలోనే అత్యంత వయస్కుడిగా చరిత్ర సృష్టించి 2020లో, 48 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయ్యాడు.
"కౌన్ ప్రవీణ్ తాంబే చిత్రం" స్ఫూర్తితో:
"మీ కలలు సాకారం కావాలంటే ముందుగా కలలు కనాలి" అబ్దుల్ కలాం మాటలను ప్రవీణ్ తాంబే ప్రపంచానికి పోరాట స్ఫూర్తితో తెలియజేశారు. ప్రవీణ్ తాంబే జీవితం ఆధారంగా 2022లో జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం "కౌన్ ప్రవీణ్ తాంబే". ఉత్తమ క్రీడా చిత్రాల్లో ఒకటి. వయస్సు అనేది ఒక అంకె అని లక్ష్యం చేరుకోవాలంటే వయసుతో పనిలేదని, ప్రవీణ్ తాంబే నిజ జీవితంలో అవరోధాలు, అవమానాలను ఎదుర్కొని లక్ష్యం సాధించిన తీరును ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
9, ఏప్రిల్ 2024, మంగళవారం
చరిత్ర సృష్టించిన మలయాళ చిత్రం “ ఎన్ను నింటే మొయిదీన్ ”.
చరిత్ర సృష్టించిన మలయాళ చిత్రం “ ఎన్ను నింటే మొయిదీన్ ”.
ప్రేమించే హృదయానికి ధనిక , పేద అనే తేడా ఉండవు .. నిజమైన ప్రేమికులకు కుల , మత బేధాలు ఉండవు .. ప్రపంచంలో డబ్బు మించిన శక్తివంతమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే . కుల మత బేధాలను ఎదురించే శక్తి ప్రేమకు మాత్రమే ఉందనడంలో అతిశయోక్తి లేదు . అంతేకాదు తల్లిదండ్రులను సైతం మరిపించగల శక్తి ప్రేమకు కలదు . ప్రాణ స్నేహితుల మధ్య కూడా చిచ్చురగగలిగే శక్తి . ప్రాణాలు తీసే శక్తి కలదు ప్రేమకు . ప్రేమ ఒక మధురమైన అనుభూతి , అనిర్వచనీయమైన భావన .
ఎన్నో ఏళ్లుగా తమ ప్రియురాలు కోసం ఎదురు చూసి చివరికి ప్రేమ విఫలమైన ప్రేమికులను మన నిజ జీవితంలో చూస్తుంటాం . కానీ బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తే గర్ల్ ఫ్రెండ్ లను చాలా తక్కువ మందిని చూస్తుంటాం . ప్రేమిస్తానంటూ నమ్మించి మోసం చేసి చాటేసిన బాయ్ ఫ్రెండ్స్ మరియు ఎంతోకాలంగా ప్రేమించినట్లు నటిస్తూ చివరకు వేరే వారిని పెళ్లి చేసుకున్న గర్ల్ ఫ్రెండ్స్ మన దైనందిన జీవితంలో తారసపడటం సహజమే కానీ కొందరు యువతీ యువకులు మాత్రం ప్రేమ కోసం పెద్దలను ఎదిరించడానికి కుల , మత కట్టుబాట్లను అధిగమించడానికి కూడా వెనుదిరగని విశ్వాసంతో పెళ్లితో ఒక్కటవుతుండటం విశేషం . ఇలాంటి సంఘటనలు మనం నిత్య జీవితంలో కంటే సినిమాల్లోనే ఎక్కువగా చూస్తున్నాను . అంతేకాదు నిత్య జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను చిత్రీకరించడంలో మన దేశ సినీ పరిశ్రమలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు .
తెలుగు , తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో ప్రేమ సినిమాలు వచ్చినా . వాటిలో కొన్ని మాత్రమే ప్రేమికుల హృదయాలను కదిలించాయి . ఎస్ శంకర్ నిర్మించిన తమిళ చిత్రం " కాదల్ " అటువంటి చిత్రమే . ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది . ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకున్నారని ప్రియుడిని చిత్రహింసలు పెట్టి అమ్మాయికి తల్లిదండ్రులు వేరే పెళ్లి చేయడం వల్ల ప్రియుడు పిచ్చివాడు కావడం , కొన్ని సంవత్సరాల తరువాత తన ప్రియుడిని పిచ్చివాడు గా గుర్తించి ప్రియురాలు అతని దయనీయ పరిస్థితి కి తానే కారణమని బాధపడిన ప్రేమికుల హృదయాన్ని ద్రవింపజేస్తుంది . అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది .
ప్రియురాలి కోసం ప్రియుడు ప్రాణత్యాగం చేయడం ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూశాం . అయితే ప్రియుడిని పెళ్లి చేసుకున్న 22 ఏళ్లుగా ఎదురుచూస్తే ప్రేయసి బహుశా ఏ సినిమాలో చూసుండకపోవచ్చు . 1960 మరియు 70 వ దశకంలో కేరళలోని ముక్కమ్లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా RS విమల్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం " ఎన్ను నింటె మొయిదీన్ "
.
కేరళలోని ముస్లిం కుటుంబానికి చెందిన మొయిదీన్ మరియు హిందూ కుటుంబానికి చెందిన కాంచనమాల మధ్య వాస్తవంగా సంభవించిన విషాదకరమైన ప్రేమకథ ఇది . ఈ చిత్రం 1960 లో ఇరువంజిప్పుజ నది మరియు ముక్కం గ్రామం నిర్మాణం జరిగిన మొయిదీన్ మరియు కాంచనమాల నిజ జీవిత ప్రేమ కథ ఆధారంగా రూపొందించబడింది . ఈ సినిమాలో సన్నివేశాలన్నీ ప్రేమికులకు ఉత్కంఠభరితంగా ఉండి వారిని భావోద్వేగాలకు గురిచేస్తాయి . ముస్లిం కుటుంబానికి చెందిన మొయిదీన్ , హిందూ కుటుంబానికి చెందిన భూస్వామి కుమార్తె అయిన కాంచనమాల ఇరువురు ప్రేమలో పడిన సమయంలో మతాంతర వివాహాలు నిషిద్ధంగా పరిగణించబడుతున్నందున , వారి ప్రేమ వివాహానికి ఇద్దరి కుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో విడిపోవాల్సి వచ్చింది . మరో పెళ్లి కావాలని కాంచనమాల తండ్రి కట్టుదిట్టమైన ఆంక్షలతో చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు . పెళ్లి చేసుకుంటే మొయిదీన్ ను పెళ్లి చేసుకుంటానని , లేదంటే అవివాహితగా ఉండిపోతానని కాంచనమాల తన తండ్రికి చెప్పిన సంఘటన అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు . వీరిద్దరూ తమ ప్రేమ గురించిన లేఖల ద్వారా వ్యక్తం చేసుకునే క్రమం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది . ఓ రోజు ఆమెను సంప్రదాయవాద బంధువులు పట్టుకుని నిర్దాక్షిణ్యంగా కొట్టిన సందర్భం ద్వారా ప్రేక్షకుల గుండెలు బరువెక్కేలా సన్నివేశాన్ని చిత్రీకరించడం అభినందనీయం . కాంచనమాలతో విడిపోవడానికి మొయిదీన్ అంగీకరించారు ,
మొయిదీన్ తండ్రి బాల్యంబ్ర పొట్టాట్టు ఉన్న మొయిదీన్ సాహిబ్ కొడుకుని ఇంట్లోనుండి వెళ్ళగొట్టాడు . ఆ తర్వాత మొయిదీన్ సామాజిక - రాజకీయ కార్యకర్తగా మారారు . ఓ రోజు మొయిదీన్ తండ్రి దగ్గరి సంబంధీకుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మొయిదీన్ ని అడగగా అందుకు మొయిదీన్ నిరాకరించడంతో , అతని తండ్రి ఓరోజు మొయిదీన్ ని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు . అదృష్టవశాత్తు మొయిదీన్ బతికి బయటపడ్డారు . కన్న కొడుకుని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నం చేశాడని తెలిసి భర్తకు దూరంగా ఉంటూ కొడుకు బాగోగులు చూస్తుంది అతని తల్లి . అనంతరం మొయిదీన్ తండ్రి పై బహిరంగంగా హత్యాప్రయత్నం చేసినందుకు కేసు నమోదు చేశారు . అనంతరం కోర్టులో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు మొయిదీన్ చెప్పిన సమాధానం అందరినీ ఆలోచింపజేసింది . అంతేకాదు ఈ కేసుతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని , అనుకోని కారణాల వల్లే ఇలా జరిగిందని చెప్పారు . తండ్రి కేసు నుంచి విముక్తి పొందేందుకు కొడుకు గొప్ప మనసున్న వ్యక్తిత్వాన్ని కనబరిచాడు . కొడుకు సమాధానంతో మొయిదీన్ సాహెబ్ తన కుమారుడి పట్ల తన వైఖరిని మార్చుకున్నాడు . ఒక రోజు మొయిదీన్ సాహెబ్ తన భార్య మరియు కొడుకు వద్దకు స్వయంగా వెళ్లి ఇంటికి వెళ్లి ఉండమని చెప్పాడు మరియు ఆ రాత్రి మొయిదీన్ సాహిబ్ గుండెపోటుతో వెంటనే మరణించాడు . కాంచనమాల ఇంట్లో ఒప్పుకో ప్రత్యక్ష మొయిదీన్ మరియు కాంచన పారిపోవాలని నిర్ణయించుకున్నారు , అయితే మొయిదీన్ వారి పాస్ పోర్ట్ లను సేకరించి తిరిగి వస్తున్నప్పుడు , తను ప్రయాణిస్తున్న పడవ సుడిగుండంలో చిక్కుకుంది . అతను తనతో పడవలో ఉన్న సహచరులను రక్షించగలిగాడు , అతను సుడిగుండంలో చిక్కుకుని మరణిస్తాడు . అతని మరణం గురించి విన్న కాంచన ఆత్మహత్య చేసుకునే సమయంలో మొయిదీన్ తల్లి ఆమెను వారిస్తుంది . చివరికి , కాంచన మొయిదీన్ అవివాహితులుగా మొయిదీన్ ఇంట్లో నివసించడానికి ఇంటిని విడిచిపెట్టింది . ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసే సినిమా . అటువంటి స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత సంఘటనను చిత్రీకరించినందుకు మలయాళ చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు . ఇలాంటి చిత్రాలు చరిత్ర సృష్టిస్తాయి . 19 సెప్టెంబర్ 2015 న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹50 కోట్లు వసూలు చేసింది , ఇది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది . “ కత్తిరున్ను ” పాటకు సంగీత దర్శకుడు ఎం . జయచంద్రన్ జాతీయ అవార్డును గెలుచుకోవడం గర్వించదగ్గ విషయం . ఇంకా , ఇది ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ , 5 వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ , ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ , కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ నుండి అనేక అగ్ర అవార్డులను అందుకుంది .
కులమతాల బండిఖానాలో బలైపోతున్న ప్రేమికులు ఎందరో .
ప్రేమ అనేది కులం , మతం రంగుల కే పరిమితం కాదని , దేశాలు , ఖండాల వారీగా కూడా ప్రేమగలదని నిరూపించే యదార్థ సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం . పెద్దలను ఒప్పించి కుటుంబ సభ్యులందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న వారు కొందరైతే . కులం , మతం , పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే వారు మరికొందరు . కొంతమంది ప్రేమికులకు కులం , మతం , ధనిక , పేద తేడాలు సృష్టించి చివరకు ప్రేమికులు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి . ప్రేమకు కులం మతం పేద ధనిక అనే అంతరాలు సృష్టించడం అత్యంత బాధాకరం , అత్యంత ప్రమాదకరం కూడా . రెండు హృదయాలను కలిపేదే ప్రేమ . రెండు హృదయాలు కలిసి జీవించడానికి కులం మతం ఏమి అడ్డు కాదనేది అక్షర సత్యం . నేటి యువత ప్రేమకు ఇంచినంత ప్రాధాన్యత చదువుకు ఇవ్వడంలేదనేది జగమెరిగిన సత్యం . అందుకు కారణం ప్రేమకు యువతను ఆకర్షించే శక్తి ఎక్కువ , అత్యంత ప్రభావం వీరిపైనే ఉంటుందనడంలో సందేహమే లేదు . నిజమైన ప్రేమ లక్ష్యాలను సాధించడానికి నిస్వార్థంగా ముందుకు సాగుతుంది మరియు ఆత్మహత్యకు దారితీయదు . అవగాహన లేమితో ప్రేమికులు ఆవేశానికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడం విచారకరం .
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
జీవితం ఆశ-నిరాశల సంగమం:
జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...
-
మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన వృత్తి 'కుమ్మరి వృత్తి'. మట్టితో మహత్తర ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం ప...
-
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ పండుగను క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో చాలా పవిత్రంగా భావిస్తారు. ఏసుక్రీస్తు జ...
-
మా ఊరి జ్ఞాపకాలు: మా ఊరు గుమ్మడవెల్లి. ఊరు చుట్టూ చూడచక్కని పచ్చని పంటపొలాలు. ఊరినడుమ ఊట బావులు, ఊరి చివరన చెలిమ భావి. ఊరి నట్టనడుమ రాములవార...


