2, జనవరి 2023, సోమవారం

అంతరించిపోతున్న రజక వృత్తి



అంతరించిపోతున్న రజక వృత్తి
మనం చరిత్రను ఒక సారి అవలోకిస్తే నేడు చలామణి లో ఉన్న కరెన్సీ కు బదులుగా గతంలోవస్తు మార్పిడిమరియుసేవా మార్పిడివిధానం అమలులో ఉండేదని తెలుస్తుంది. సమాజంలోని వ్యక్తుల మధ్య లావాదేవీలు సులువుగా సాగేందుకు మన పూర్వీకులు విభిన్న వృత్తుల ఆధారంగా కుల వ్యవస్థను ఏర్పాటు చేసారన్న విషయం మనందరికీ తెలిసు. వ్యవస్థ ఏర్పాటు కారణంగా పురాతన కాలం నుంచి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో అనేకమంది వారి వారి కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగించేవారు. కానీ కాలంతో పాటు మారుతున్న పరిస్థితులు మరియు జీవనశైలి కి అనుగుణంగా నేడు ప్రాంతాలకు అతీతంగా అనేక కుల వృత్తులు కనుమరుగవుతున్నాయి.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న కుల వృత్తులలో రజక వృత్తి ఒకటి. కుల,మత.జాతి,లింగ,వయో బేధాలు లేకుండా అందరికి సమానంగా సేవలందించిన మరియు అందిస్తున్నవృత్తి "రజక వృత్తి". శ్రమైకజీవన సౌందర్యాన్ని చాటిచెప్పిన వృత్తి "రజక వృత్తి". గ్రామాల్లో రజకుల వృత్తి అత్యంత ప్రధానమని, ఇతిహాసాల్లో వారి వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉందని పాల్కూరికి సోమనాథ రచించిన బసవపురాణంలో "మడివాలు మాచయ్య కథ (మడేలు కథ)"లో ప్రస్తావన ఉంది.

మడివెలయ్య, మాసయ్య కథ:

భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైనవి. పురాణాలంటే మన భారతీయ సంస్కృతికి దర్పణాలు, జ్ఞాన విజ్ఞానాల భాండాగారాలు. పురాణాలు అనంత విశ్వం గురుంచి వివరిస్తాయి. ఇతిహాస పురాణాలంటే పూర్వకాలంలో జరిగిన సంఘటనను ఉన్నది ఉన్నట్లుగా తెలుపబడేది.

బసవ పురాణం ఆధారంగా మడేలు పురాణం సృష్టి ఆవిర్భావం నుండే ప్రారంభమైందని తెలుస్తుంది. పార్వతీ కల్యాణం సమయంలో, పురాణంలో భాగంగా దక్షుడు తాను నిర్వహించిన యజ్ఞానికి పార్వతికి ఆహ్వానం పంపలేదని ఉటంకించబడింది. ఆహ్వానం లేకుండానే యజ్ఞానికివెళ్లిన పార్వతి, దక్షుడు చేసిన అవమానాన్నిభరించ లేక యజ్ఞకుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. సంఘటనతో కోపోద్రిక్తుడైన శివుడు తన జటాజూటం నుండి వీరభద్రుడిని సృష్టించి దక్షుని యజ్ఞాన్ని భంగపరిచి వధిస్తాడు. పరిణామానికి ఆగ్రహించిన త్రిమూర్తులు, వీరభద్రుడిని సృష్టించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మడివేలయ్య అవతారం ఎత్తమంటారు. వారి ఆదేశాల ప్రకారం వీరభద్రుడు పాలకొలనులోకి దూకగా మడివెలయ్య, మాసయ్యలు జన్మిస్తారు. వీరభద్రుని అంశ నుండి జన్మించిన మడేలయ్య లింగాన్ని పూజించి, మెడలో 32 లింగాలు, చేతిలో నల్లని వీర గంటతో మైల ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మాసయ్య శివుని పూజిస్తూ నిత్యం శివ ధ్యానంలో ఉండేవాడు. ఒకరోజు ఆకలితో ఉన్నమాసయ్య,మడేలయ్యకు చెప్పకుండా అతను భిక్షాటన ద్వారా తెచ్చినదంతా భుజిస్తాడు. విషయాన్ని త్రిమూర్తులకు తెలియచేయడానికి మడేలయ్య కోపంగా వెళ్తారు. “త్రిమూర్తులు 33 కోట్ల దేవతల ముందర మడేలుతో నీ అన్నం తిన్న వాడు కాబట్టి నీకు అర్థివాడై ఏడాదికి ఒకసారి మీ ఇంటికి వస్తే, మీ మీ ఇంట్లో పురుడు చేస్తే రజకుని కష్టానికి పురుడు కట్నం, ఇంట్లో ఎవరైనా చనిపోతే చావు కట్నం, పిల్లలకు పెళ్లి చేస్తే పెళ్లి కట్నం ఇవ్వాలని నీ తమ్ముడు అయినందుకు కంచం పొత్తు ఉంటుందని, అందుకు ప్రతిఫలంగా నీ వంశాన్ని కీర్తిస్తాడనిఒప్పందం చేస్తాడు.


తర్వాత మడేలయ్య తన యొక్క పాపపరిహారం తీర్చుకోవటానికి సుర ముప్పది మూడు కోట్ల దేవతలు మునులు విడిచిన వస్త్రాలను 12 సంవత్సరాలు శుద్ధి చేస్తాడు. ఒక రోజున శివుడు మడేలయ్య వృత్తిని పరీక్షించేందుకు తన పులి చర్మంతోపాటు తాను కప్పుకునే బొంతను పిండ మని కోరుతాడు. బొంత 33 గజాల పొడవుతో అందులో చీర పేన్లు, నల్లులు 101 జంతువులు ఉన్నాయని వాటిని చావకుండా పిండటం నీ తరం కాదని చెప్తాడు. అయినప్పటికీ మడేలయ్య పిండు తానని బయలుదేరుతాడు. అప్పుడు మడేలయ్య ఏనుగు మీద బొంతను వేసుకొని నీటి కోసం లోకాలన్నీ తిరిగినా కనిపించవు. ఎందుకంటే అప్పటికే పరమ శివుడు నీటిని మాయం చేస్తాడు. అప్పుడు శీతలాదేవి పరమశివుడు పెట్టిన పరీక్షను ఎలాగైనా నెగ్గాలని మన వృత్తి ధర్మాన్ని పాటించాలని మడేలయ్యతో నన్ను సంహరించి నా అవయవాలతో బొంతను పిండి పరమశివుని కోరిక తీర్చాలని కోరుతుంది. అప్పుడు మడేలయ్య శీతలా దేవి కన్నీరు పోకుండా కట్టకట్టి నీరుగాను, కనుగుడ్లు తీసి ఉడకబెట్టే కడువలుగాను, చనుబాలను పొయ్యి రాళ్ల గాను, ఆమె ఇరవై వేళ్లు కొట్టి వంటచెరకు గాను, నరములు తీసి గాలి తాళ్లుగాను,చర్మాన్ని వడ కోక గాను, రక్తం తీసి చౌడు గాను, శీతలాదేవి డొక్కను బానగాను, కడుపుల అన్నం సున్నంగాను చేసి శివుని బొంత పిండుతాడు. అలాగే అప్పుడే ఆమె పేగులను తీసి చెరువు మీద వేయగా తూటికూరగా మొలుస్తాయి. రజకులు ఇప్పటికీ తూటికూర తినకపోవడాని కి కారణంగా ఇదే చెబుతారు. మడేలయ్య శివుని బొంత పిండిన తర్వాత శివుని కొరకు వెతుకుతుండగా ఎక్కడ శివుడు కనిపించడు. దారిలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు మడేలయ్యనుఎవరి కోసం వెతుకుతున్నావనిఅడుగుతాడు. అతను శివుని గురించి అని చెప్పగా అయితేనన్ను నీ భుజాలమీద ఎక్కించుకొని తీసుకుపోతే, నేను శివున్ని చూపిస్తాఅంటాడు. ఆలా అతన్ని భుజాలమీద ఎక్కించుకొని వెళ్తుండగా ఉన్నట్టుండి అతను బరువు పెరిగి పోతాడు. అప్పుడు మడేలయ్య అతని బరువు మోయలేక కిందకు దించుతాడు వెంటనే అతను మాయమైపోతాడు అంతలో ఎదురుగా వస్తున్నా వ్యక్తి మడేలయ్య తో నువ్వు నీ భార్య వెళ్లారు వచ్చేటప్పుడు ఒక్కడివే వస్తున్నవేంటని అడుగుతాడు అప్పుడు మడేలయ్య జరిగిన విషయమొత్తం చెప్తుండగా అతను ఒకసారి వెనక్కి తిరిగి చూడమన్నాడు. అతను వెనక్కి తిరిగి చూడగానే శీతలా దేవి కనిపిస్తుంది. ఆవ్యక్తియే శివుని రూపంలో ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు మడేలయ్యనాకు చాకలి వృత్తి కావాలని, వండని కూడు, వడ కని బట్ట, పిండని పాడి, ఇంటిముందు తడి వస్త్రాలు పొడి వస్త్రాలు తరగకుండా ఉండాలని, ఎవరి కోకలు అయినా కట్టుకున్నా నన్ను ఏమీ అనకూడదనికోరుకుంటాడు. అందుకు శివుడు దీవించి నీకు అన్నం పెట్టని వారు నరకం పోతారని అభయమిస్తాడు. ప్రత్యక్షంగా శివుని పులి చర్మం, బొంత ఉతికిన వీరి వృత్తి ప్రధామైనదే అని చెప్పొచ్చు.

సబ్బును కనుగొన్న మొదటి శాస్త్రవేత్త "రజకుడు":
రసాయనిక డిటర్జెంట్లు వాడుకలోకి రాకముందు ప్రకృతి సిద్ధంగా లభించే చౌడు మట్టితో బట్టలు ఉతుకేవారు. చౌడు మట్టి ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసింది రజకులే. చౌడు అనగా భూముల్లో పైకి తేలిన ఉప్పటి నున్నటి మట్టి. కాల క్రమేపి మట్టిని సున్నపుగడ్డతో కలిపిన గమ్మును సబ్బుగా తయారుచేసి వాటితో బట్టలు ఉతకడం ప్రారంభించారు. సబ్బుతో ఉతికితే మరింత శుభ్రత వస్తుందని భావించి బట్టలు శుభ్రం చేయడానికి కెమిస్ట్రీ ఆవశ్యకతను కనిపెట్టిన తొలి శాస్త్రవేత్త "రాజకుడు".
ఉబ్బకేయడం:
ఒకప్పుడు గ్రామాల్లో అంటు వ్యాధులు ఎక్కువగా వ్యాపించేవి. మనిషి కి రోగాలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు స్నానం చేయడం మరియు ప్రతిరోజూ ఉతికిన బట్టలు తొడగటం అనేది మనిషి ఆరోగ్యానికి ఎంతో అవసరం. మానవు డు విసర్జించే పన్నెండు రకాల మాలినాలను చాకలి స్వయంగా తన చేతులతో శుభ్రం చేసి అంటువ్యాధుల నుండి సమాజాన్ని రక్షించిన రజకులు దేశానికి గర్వకారణం అనడంలో సందేహమే లేదు.
చౌడు మట్టితో ఉతికితే బట్టలు తెల్లబడవచ్చు కానీ బట్టల్లోని క్రిములను చంపలేమని రజకులు మొదటగా గ్రహించారు.. వ్యాధికారక క్రిములను నాశనం చేసే సరైన ప్రక్రియను కూడా రజకులే కనుగొన్నారు. బట్టల నుండి సూక్ష్మక్రిములను చంపడానికి శుభ్రపరిచే ప్రక్రియను ఉబ్బకేయడం అంటారు. త్రికోణాకారంలో ఉండే మూడు పెద్ద మట్టికుండలను పొయ్యి మీద పెట్టి వాటి చుట్టూ మట్టితో దిమ్మె కడుతారు. వాటిలో సగం వరకు నీళ్లు పోసి, మూడు కుండల మీద ఉబ్బకు వేయాల్సిన బట్టలను సౌడు నీళ్లతో తడిపి కుప్పలుగా పేరుస్తారు. తర్వాత బట్టల కుప్పకు ఒక పెద్ద బుట్టను కప్పుతారు. తరువాత కుండ కింద మంట పెడ్తారు. కుండలలోని నీరు ఆవిరై అది పైనున్న బట్టన్నింటికీ వ్యాపిస్తుంది. అలా గంట ఆవిరి పట్టాక వాటిని తీసి నీళ్లలో ఉతుకుతారు. ఇలా చేయడం వల్ల బట్టలు పరిశుభ్రంగా ఉంటాయి.

శుభ కార్యాలలో రజకుల పాత్ర:

బట్టలు ఉతకడంలోనే కాకుండా అన్ని శుభకార్యాల్లోనూ రజకుడంటే అత్యంత ప్రాధాన్యత ఉంటుందనడంలో అతిశయోక్తిలేదు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళికి ముందు రజకులు జరిపే "లగ్గం పోలురాయటం" అనే వేడుక ఎంతో ప్రత్యేకమైనది. వీరు పోలు రాసినతరువాతే వేదమంత్రాలతో తాళికట్టే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే శుభలేఖలు పంచిన క్షణం నుండి కార్యానికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. మన హైందవ సంప్రదాయాలలో ముందుగా రజకుల ద్వారా శుభలేఖలు పంచితేనే శుభం జరుగుతుందని ప్రజలకు గట్టి నమ్మకం ఉండేది. శుభకార్యాలకు మరియు ముఖ్యమైన పనులకు బయలుదేరేముందు రజకులు ఎదురైతే మంచి జరుగుతుంది అనే నమ్మకం గ్రామమలలో ఇప్పటికి ఉంది. పెళ్లి తరువాత పెళ్ళికొడుకు పెళ్లికూతురిని ఉరేగించడంలో పల్లకిమోసె కార్యక్రమం కూడా రజకులదే కావడం ఎంతో గొప్ప విషయం. పల్లకి రజకులు మోస్తేనే వివాహిత దంపతులకు శుభం జరుగుతుందని ప్రజల విశ్వాసం. వివాహ వేడుక ప్రారంభం నుంచి ముగిసే వరకు రజకుల పాత్ర వర్ణనాతీతం. వీరు లేనిదే గ్రామాల్లో ఎలాంటి సంప్రదాయ కార్యక్రమాలు జరిగేవి కావు. కానీ కాలక్రమేణా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేడు పట్టణాల్లో, కల్యాణ మండపాల్లో జరిగే కార్యక్రమాలు వారి అవసరాలు లేకుండానే జరిగిపోతున్నాయి. అప్పట్లో ఎడ్లబండి ఉన్నాసరే పల్లకీలోనే ఊరేగేవారు. ఆ ఆనందం చెప్పరానిది. కానీ ఇప్పుడు రజకుల అవసరాలు లేకుండా వాహనాలను ఎంతో అందంగా తీర్చిదిద్ది ఊరేగుతున్నారు. నేటి తరానికి పల్లకి ఎలా ఉంటుందో చూడటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పల్లకీలో ఊరేగించే సంప్రదాయం అంతరించడం చాలా బాధాకరం.

గ్రామాల్లో రజకుల సేవలు వెలకట్టలేనివి:

రాజుల కాలంలో రజకులు అణిచివేతకు గురైనారు. కష్టానికితగ్గ కూలి ఇవ్వకుండా వారితో వెట్టిచాకిరి చేయించుకున్నారు. రాజులు ఏ ప్రాంతానికి వెళ్లాలన్నాగుర్రపు బండ్లు, ఎడ్ల బండ్లు ఉపయోగించేవారు. రాజు ఎంతదూరం వెళ్తే అంతదూరం రజకుడు కండువా నడుంకి చుట్టుకొని ఆ బండిముందే నడవాలని రాజు ఆజ్ఞాపించేవారు. రజకుడు ఆ బండి ముందు నడిస్తేనే మంచి జరుగుతుందని రాజు నమ్మకం. గ్రామంలోని దేవుళ్ల ఊరేగింపులలో రజకులు కాగడాలను మోసుకెళ్లడం ఆనవాయితీ. ఇందుకు అంగీకరించని వారిపై పెత్తందార్లు నిర్ధాక్షిణ్యంగా దాడులు చేసేవారు. అంతేగాక గ్రామంలోని గుడి, గడి, కచ్చిరు శుభ్రం చేయవలిసిన భాద్యత కూడా రజకులపై ఉండేది. రజకులకు వారసత్వ హక్కు కూడా ఉండేది. అప్పట్లో రజక కుటుంబాలు రెండు మూడు గ్రామాల్లో ఒకే కుటుంబం ఉండేవి. ఆ ఊరి బట్టలు ఉతకాలంటే ఆ కుటుంబంలోని రజకులు తప్ప మరెవరూ ఉతకకూడదు అనే నియమాలు ఉండేవి. వారి కుటుంబంలోని పిల్లలు విడిపోయినప్పుడు, వారు తల్లిదండ్రులకు చెందిన గ్రామాలను పంచుకునేవారు.

అంతరించిపోతున్న రజక వృత్తి :

ఒకప్పుడు పండుగలప్పుడు ఇంటింటికీ తిరిగి బట్టలు సేకరించి చాకిరేవులో ఉతికి సాయంకాల సమయంలో ఎవరిబట్టలు వారికీ ఇచ్చేవారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే. అందరి బట్టలు ఒకేదగ్గర చౌడుమట్టి కలిపినా నీళ్లలో నానబెట్టి ఉతికినతరువాత ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తారు. బట్టలు ఎవరెవరివి అనేది గుర్తుపెట్టుకోవడం చాల గొప్ప విషయం. అందుకే తెలంగాణాలో ఒక నానుడి పుట్టింది "చదువుకున్నోడికన్నా రజకుడు మేలని". కానీ ఇప్పుడు బట్టలుతికే వాషింగ్ మెషిన్ రావడంవల్ల ధనిక, బీద కుటుంబాల సైతం వారి బట్టలను వారే ఉతుకోవడం మొదలుపెట్టారు. వాషింగ్ మెషీన్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి వీరి వృత్తి అంతరించడం ప్రారంభం అయింది. నేడు పూర్తిగా కనుమరుగైందని చెప్పవచ్చు. దీంతో పలు రజక బతుకులు అగమ్యగోచరంగా మారాయి. అంతేగాక గ్రామాలలో బ్రాహ్మణుల , దొరల ఇళ్లలో రజక మహిళలే ఇంటి పని చేసేవారు. కానీ కాల క్రమేణా ఇతర కులాల వారు కూడా చేయటం వలన వీరి ప్రాధాన్యత తగ్గింది. . ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు రజక కుటుంబాలను ఆదుకుంటామని చెప్పటమే తప్ప ఎవరు ఏమి చేయరని వారు వాపోతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర కుల వృత్తుల వారితో పాటు రజకులు కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపి రాష్ట్రాన్ని “బంగారు తెలంగాణ” గా మారుస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానం ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సభ్య సమాజానికి రజకులు చేసిన సేవలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి ఇక్కట్లను రూపుమాపేందుకు పటిష్టమైన ప్రణాలికను రూపొందించి ఆదుకోవాలని రజకులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.


రచయిత
కోట దామోదర్
మొబైల్: +91 93914 80475




30, డిసెంబర్ 2022, శుక్రవారం

శాంతమ్మ ఇంజమూరి

చేయాలనే తపన ఉంటె వయస్సుతో సంబంధంలేదనడానికి ఉదాహరణ   "ఇంజమూరి శాంతమ్మ" . 90  ఏళ్ళ వయసులోనూ ఎవరిపైనా ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అంతేగాక ఆమె ఇంకా ఆరోగ్యాంగా ఉండటం చాల గొప్ప విషయం. ఇప్పటికీ శాంతమ్మ కంటిచూపు మందగించలేదు. బీపీ, షుగర్‌ వ్యాధులు ఆమెకి  దరికి చేరలేదు. ప్రస్తుత కాలంలో 60  ఏళ్ళు పైబడితేనే ఏ పనిచేయలేని పరిస్థితి మరి 90  ఏళ్ళ శాంతమ్మ పని ఎలా చేస్తుందనే సందేహం అందరికి కలగక మానదు. ఆమె ఆత్మస్థైర్యమే ముందుకు నడిపిస్తుంది . ఆమెలోని తపనే పనిచేసుకునేందుకు సహకరిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. 

స్ఫూర్తివంతమైన శాంతమ్మ జీవితంగురుంచి మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.


మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పెద్దముప్పారం గ్రామం పద్మశాలికి చెందిన ఇంజమూరి శాంతమ్మ. ఆమె వయస్సు దాదాపు 90 సంవత్సరాలు. శాంతమ్మకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సహా 7 మంది సంతానం. మనువళ్లు, మనువరాళ్లు మునిమనువళ్లు కూడా.  కొడుకులు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మనువళ్లు, మనువరాళ్లు సహా అందరూ ఆమెను నవ్వులు పువ్వులు పూయించివారే. ఆమెను చూసుకోవడానికి ఎలాంటి పొరపొచ్చాలు లేని కొడుకులు.  అమ్మంటే అమితమైన ప్రేమ వారికీ. అయినా సరే శాంతమ్మకు కొడుకుల దగ్గర ఉండటంకన్నా తన సొంతూరైన పెద్దముప్పారంలోనే ఉన్నాడటానికి ఆసక్తి చూపుతుంది. పల్లె ప్రాంత పలకరింత, పల్లెప్రజల పులకరింత అన్నట్లుగా. ఎందుకో శాంతమ్మ కు ఊరంటే అంత ప్రేమ.  ఆమెకు 90 ఏళ్ళు నిండిన కర్ర సహాయంతో తడబడని అడుగులు, ఆమెవి అద్దాలు లేకుండా టీవీ చూడగలిగే నేత్రాలు, ఎంతదూరమున్నవారినైనా గుర్తుపట్టే కంటిచూపు, స్వతహగా వంట వండుకొని తినే శక్తి సామర్థ్యం. అంతేగాక మూడుపూటలు తిని అరిగించుకొనే చక్కని ఆరోగ్యం ఆమెది.  ఆమెకు ఎలాంటి కాళ్ళ నొప్పులు లేవు. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఆమె ఇంజక్షన్ వేసుకోక ఎన్నో ఏళ్ళు గడిచాయి. నిజాం మరియు రజాకార్లు ఆకృత్యాలకు, హింసకు ఎదురొడ్డి నిలిచిన సంఘటనల గురుంచి సవివరంగా ఆమె ఇప్పటికి చెప్పడం గొప్ప విషయం అంతేగాక ఆమెయొక్క అద్భుతమైన జ్ఞాపక శక్తిని మనమందరం అబినందించాలిసిన అవసరం ఉంది. బస్సు, ఆటోల సౌకర్యం లేని ఆ రోజుల్లో ఏ ప్రాంతానికైనా వెళ్లాలంటే కాలినడకే మార్గం అలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు శాంతమ్మ ఇప్పటికి వివరించడం చాల గొప్ప విషయం.   

శాంతమ్మ ఇంత ఆరోగ్యాంగా ఉండటానికి కారణం రహస్యమే అనుకుంటే మాత్రం పొరపాటే. ఆరోగ్యాంగా ఉండటానికి ముఖ్య కారణం ఆమె పాటించే ఆహార నియమ నిబంధనలు. అంతకంటే ముఖ్యకారణం ప్రశాంతత వాతావరణంలో ఉండటానికి ఇష్టపడటం మరియు అప్పట్లో రసాయనాలు వాడకంలేని ఆహారం అందింది. కానీ ఈరోజుల్లో అసాధ్యం అనిచెప్పాలి. కోట్లరూపాలున్న ఆరోగ్యాంగా ఉంటామనే గ్యారంటీలేని జీవితాలు ఈ రెండింటి వల్ల అనారోగ్యంపాలవుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాము అంతేతప్ప ఆహార నియమాలు పాటించడానికి విముఖుత చూపుతాం అందుకే ఆరోగ్యాంగా ఉండాలనే తపన ఉండాలి, ఆరోగ్య నియమాలు పాటిస్తుండాలి. అప్పుడే చక్కని ఆరోగ్యం మన సొంతం.


గత రెండురోజులక్రితం పెద్దముప్పారంలో తన ఇంట్లో ఎలాంటి కర్ర సహాయం లేకుండా  ఇల్లు ఊడుస్తూ కనిపించిన వీడియో నాకెందుకో ఆశ్చర్యమనిపించింది, ఆనందమనిపించింది.   


మీ 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475      



24, డిసెంబర్ 2022, శనివారం

క్రిస్మస్



ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ పండుగను క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో చాలా పవిత్రంగా భావిస్తారు. ఏసుక్రీస్తు జన్మించి నేటికీ రెండు వేల సంవత్సరాలు గడిచినా భక్తుల మనుసులో ఇంకా  ఆయన అనంత కరుణామయుడిగా, అపార కృపాశీలుడు, లోక రక్షకుడిగా, ప్రపంచ శాంతి దూతగా క్రైస్తవుల ఆరాధనను అందుకుంటున్నాడు.

క్రిస్మస్ డిసెంబర్ 25 న ఎందుకు జరుపుకుంటారు? 

రోమన్ సామ్రాజ్యంలోని నజరేత్ నగరంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. ఒకరోజు మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనిపించి 'ఓ మేరీ! మీరు దేవునిచే ఆశీర్వదించబడ్డారు. నువ్వు కన్యగా గర్భం దాల్చి కొడుకును కంటావు. మీ బిడ్డకు ఏసు అని పేరు పెట్టండి. తాను దేవుని కుమారుడనని చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పినట్లే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక రాత్రి అతనికి కలలో దేవదూత కనిపించి, 'మేరీని పెళ్లిచేసుకోవాలి అని చెపుతారు. దేవుడి దీవెనతో ఆమె గర్భవతి అయింది. కనుక ఆమెకు పుట్టిన కొడుకు భగవంతుడు. తనను నమ్ముకున్న ప్రజలందరినీ పాపాల నుంచి రక్షిస్తాడని చెప్పారు. జోసెఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని రోజులకు రోమన్ సామ్రాజ్యం యొక్క పాలకుడు అగస్టస్ సీజర్ తన రాజ్య జనాభాను లెక్కించడానికి  మరియు గణాంకాలను సులభంగా సేకరించేందుకు వీలుగా ప్రజలందరూ డిసెంబర్ 25లోగా స్వగ్రామాలకు చేరుకోవాలని ఆయన ఆదేశించారు. రాజు ఆజ్ఞను అనుసరించి, జోసెఫ్ మరియు మేరీ వారి స్వస్థలమైన బెత్లెహేముకు బయలుదేరారు. తీరా అక్కడికి చేరుకునే సరికి ఆమెకు వసతి దొరకలేదు. చివరకు ఒక సత్ర యజమాని తన గోశాలలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే మేరీ యేసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఊరి పక్కనే ఉన్న పొలాల్లో గొర్రెల మందకు కాపలా కాస్తున్నారు కొందరు. ఆ సమయంలో, ఒక దేవదూత వారి ఎదురుగా ఆకాశం నుండి దిగివచ్చింది. దూత చుట్టూ కాంతి వ్యాపించడంతో గొర్రెల కాపరులు భయపడ్డారు. దేవదూత వారితో, 'భయపడకండి, మీకు శుభవార్త తీసుకురావడానికి నేను ఇక్కడకు వచ్చాను' అని చెప్పాడు. ఈరోజు బేత్లెహేములోని ఒక తొట్టిలో మీ అందరికీ ప్రభువు అయిన లోక రక్షకుడు జన్మించాడు. ఒక పసికందును బట్టలతో చుట్టి, తల్లి కడుపులో తొట్టిలో పడుకోబెట్టారు. ఇవే మీకు సంకేతాలు. లోక రక్షకుడని చెప్పాడు. అతను ఈ విషయం గొర్రెల కాపరులకు చెబుతుండగా, ఆ ప్రాంతమంతా పరలోకం నుండి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వచ్చిన దేవదూతలు భగవంతుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ అదృశ్యమయ్యారు. కాపరులు దేవదూత చెప్పిన గొర్రెల దొడ్డి వద్దకు పరుగెత్తారు. అక్కడ మేరీ, జోసెఫ్‌లు తొట్టిలో పడి ఉన్న శిశువును చూశారు. దేవదూత తమకు చెప్పినట్లు వారు అందరికీ చెప్పారు. రెండు వేల సంవత్సరాల క్రితం యేసు డిసెంబర్ 24 అర్ధరాత్రి 12 గంటల తర్వాత జన్మించాడు. అంటే డిసెంబర్ 25న పుట్టిన రోజును క్రిస్మస్ గా జరుపుకుంటారు.

క్రిస్మస్ చెట్టు కథ ఏంటి?..

చాలా సంవత్సరాల క్రితం, క్రీస్తు పుట్టిన రోజున, ప్రజలు చర్చికి వెళ్లి ఏదో ఒక రకమైన బహుమతి ఇచ్చేవారు. ఒకరోజు ప్లాబో అనే బాలుడికి పేదరికం కారణంగా ఏమి ఇవ్వాలో తోచక తనకు కనిపించిన ఒక అందమైన మొక్కను తీసుకొని చర్చిలో క్రీస్తు ముందు ఉంచాడు. కొద్దిసేపటికే ఆ చిన్న మొక్క ఏపుగా పెరిగి అందరి కళ్ల ముందు బంగారు రంగును సంతరించుకుంది. ఇది క్రీస్తు ద్వారా లభించిందని నమ్మిన ప్రజలు క్రిస్మస్ చెట్టును పెట్టడం ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిస్మస్ చెట్టు అబుదాబిలోని ఓ హోటల్‌లో ఉంది. 40 అడుగుల ఎత్తులో నిర్మించిన దీని విలువ ఒక మిలియన్ పది మిలియన్ డాలర్లు. ఇది 181 వజ్రాలు, ముత్యాలు మరియు విలువైన రాళ్లతో అలంకరించబడింది.


మీ 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475


19, డిసెంబర్ 2022, సోమవారం

చూలాల: వెలకట్టలేని చీపురుకట్ట

చూలాల: వెలకట్టలేని చీపురుకట్ట 
 
మనిషికి అవయవ లోపం ఉన్నా ఆ లోపాన్ని అధిగమించి అద్భుతమైన విజయాలను సాధిస్తున్న వారు ఎంతోమంది మన సమాజంలో ఉన్నారు. అలాంటి స్ఫూర్తివంతమైన అంధ మహిళల సంకల్ప బలం ముందు అంధత్వం ఓడిపోయింది.  "లక్ష్మీ మీనన్" లోని అచంచలమైన ఆత్మవిశ్వాసమే ఆమెను కొందరు అంధ మహిళల జీవితాలలో వెలుగులు నింపేందుకు ముందుకు నడిచేలా చేసింది. అంతేగాక కళ్లులేవనే ఆత్మన్యూనతా భావంతో వారు చింతించకుండా వారికి నైపుణ్యమైన శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధి కల్పించేలా చేశారు. ఆమె అందించిన ప్రోత్సాహంతో వారు అంధత్వాన్ని లెక్కచేయకుండా ఆత్మవిశ్వాసంతో జీవనం కొనసాగిస్తున్నారు.   

కేరళలోని కొచ్చిన్ కి చెందిన లక్షి మీనన్ వృత్తిరీత్యా డిజైనర్ మరియు వ్యాపారవేత్త. ఆమె కొచ్చిన్‌లో 'ప్యూర్ లివింగ్' అనే సంస్థను నడుపుతుంది. హరిత జీవన ప్రాముఖ్యత గురించి సమాజంలో అవగాహనను ప్రచారం చేయడం మరియు నిరుపేదలకు జీవనోపాధి కల్పించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. లక్షి మీనన్ రూపొందించిన అమ్మూమ్మతిరి / విక్స్‌డమ్‌ ప్రాజెక్ట్ క్రౌడ్‌సోర్సింగ్ ద్వారా కేరళ రాష్ట్రంలోని వృద్ధాశ్రమాలు మరియు అనాథ శరణాలయాల్లో నివసిస్తున్న ఎంతోమంది మహిళలకు జీవనోపాధిని కల్పిస్తున్నారు. 
లక్షి మీనన్ కళాత్మక ఆలోచనతో "పెన్ విత్ లవ్" అనే ప్రాజెక్ట్ ని రూపొందించారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే ఏకైక ఉద్దేశ్యంతో కాగితంతో పెన్నుల తయారీకి శ్రీకారం చుట్టారామె. ఈ ప్రాజెక్ట్ ద్వారా 30 మంది మహిళలకు జీవనోపాధిని కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కొరకు చేపట్టిన ఈ కార్యక్రమం కేరళ రాష్ట్రమంతటా విజయవంతమైంది. 
రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ఉండటం కోసం  "ఆరెంజ్ అలర్ట్" హెచ్చరిక వ్యవస్థను రూపొందించారు.
ఇవే కాకుండా మరెన్నో కార్యక్రమాలు చేపట్టి తనకంటూ ఒక గుర్తింపు పొందారు.   
లక్షి మీనన్ చేపట్టిన ప్రతి కార్యక్రమం నిరుపేదల జీవనోపాధికి వెన్నుదన్నుగా నిలిచాయని చెప్పడంలో అతిశయోక్తిలేదు. 

అవార్డులు మరియు విజయాలు:

• 'ఆజ్ కీ రాత్ హే జిందగీ' షోలో BBC వరల్డ్ నిర్మించిన స్టార్ ప్లస్‌లో అమితాబ్ బచ్చన్ ద్వారా సత్కారం పొందారు.
• అపెక్స్ సంస్థ అయిన “ఎర్త్ డే నెట్‌వర్క్ గ్లోబల్” ద్వారా అక్టోబర్ 2018లో “ఎర్త్ డే నెట్‌వర్క్ స్టార్‌”గా గౌరవింపబడ్డారు . సీడ్ పెన్‌కు ప్రత్యేక ప్రస్తావనతో పర్యావరణం & జీవావరణ శాస్త్రంలో చేసిన సహకారాల కోసం 195 దేశాలలో 50,000 అనుబంధ సమూహాలు.
• 2018లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గా ఎంపికయ్యారు.
• ఆమె ప్రతిష్టాత్మక వనిత ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సహా లెక్కలేనన్ని అవార్డులు  గెలుచుకున్నారు. 
• ప్రఖ్యాత మేరీ క్లైర్ మ్యాగజైన్ యొక్క 'జీనియస్' జాబితాలో చేర్చబడ్డారు
• 2017లో, ఒక ఆన్‌లైన్ మీడియా సంస్థ ఆమెను వారి '10 మోస్ట్ ఇన్‌స్పైరింగ్ ఇండియన్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్' జాబితాలో చేర్చింది.

చూలాల: వెలకట్టలేని చీపురుకట్ట:

ఒకరోజు లక్షి మీనన్ సెలవుదినంలో త్రిస్సూర్‌లోని ఆయుర్వేద బీచ్ రిసార్ట్‌ సందర్శన సందర్భంగా  అక్కడి అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు కొబ్బరిచెట్లు ఆమెని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె అక్కడి ప్రకృతి అందాలను తిలకిస్తుండగా తోటమాలి ఎండిపోయిన కొబ్బరి ఆకులను తొలిగించడం ఆమె మదిలో ఒక ఆసక్తికరమైన ఆలోచన వచ్చింది.  పల్లెటూళ్ళలో ఎండు కొబ్బరి ఆకులతో చీపురు తయారుచేయడం సాధారణ విషయం. ఆమె తన చిన్నతనంలో తన తల్లి మరియు అమ్మమ్మతో చీపుర్లు తయారు చేసిన సంఘటనలను గుర్తుచేసుకొని అక్కడున్న కొబ్బరి ఆకు పుల్లలతో చీపురు తయారుచేసే ప్రక్రియను ప్రారంభించారు. అలా ఆమె రోజుకు ఐదు చీపుర్లను సులభంగా తయారు చేయగలమన్న విషయాన్ని గ్రహించింది. అయితే చీపురు కట్ట మొదళ్ళను దగ్గరగా అదిమిపెట్టి ఉంచడానికి సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్‌కు బదులుగా టైలర్ షాపులోని తుక్కు గుడ్డ ముక్కలను ఉపయోగిస్తే బాగుంటుందని నిర్ణయించుకుంది. దీని వెనుక ప్రధాన కారణం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతో పాటు ధర కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చూడడం. ఇలా తయారైన ఒక్కో చీపురు 250 రూపాయలకు అమ్మగలమనిపించింది ఆమెకు.  
ఆమె తయారుచేసిన మొదటి రెండు చీపురుర్లనూ ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్ది వాటిని తన ఇంటి ఆవరణంలోని గోడకు అమర్చి ఆ చీపురు కట్టల చిత్రాలను సోషల్ మీడియా ద్వారా తన మిత్రులకు, బంధువులతో పంచుకున్నారు. అవి చూసిన ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు అనుచరులు వెంటనే వాటికోసం ఆర్డర్లు పెట్టారు. ఆ తర్వాత కేరళ అంధుల ఫెడరేషన్ గురించి తెలుసుకున్న ఆమె అంధ మహిళలకు సహాయపడే కార్యాచరణ గురించి ఆలోచన చేయమని తన స్నేహితురాలు చేసిన సూచనపై దృష్టి సారించింది. ఆ మరుసటి రోజే ఫెడరేషన్ ను  సందర్శించి చీపురు కట్టలను తయారు చేసే విధానం గురించి తన ప్రతిపాదనను వారికి సవివరంగా వివరించగా చూపులేకపోయినప్పటికీ వారు దృఢసంకల్పంతో సానుకూలంగా స్పందించడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. "చూల్" అంటే మలయాళం భాషలో చీపురు అని అర్థం. అలా సంగీతపరంగా సరికొత్త అక్షరాన్ని జోడించి "చూలాల" అని పేరు పెట్టారు.  దంలోని ప్రతి వ్యక్తి సగటున ర్లను తయారుధీమా ఏర్పడ్డాక అందుకుకల్పించడం ముమ్మరంగా ప్రయత్నించి ఈ చీపురు కట్టలను ఆర్టిసానల్ చీపురు విభాగంలో భాగంగా ఉంచాలని నిర్ణయించుకుంది. 
చీపురు కట్టలను తయారు చేసే విధానం గురించి ఆమె చొరవ తీసుకుని కేరళలోని విమానాశ్రయ అధికారులతో పాటు ఇతరులతో చర్చలు జరిపి అన్ని షాపుల్లో ఈ చీపుర్లు అందుబాటులో ఉండేలా చూసి "ఇది మన రాష్త్రం నుండి మీకు ఇవ్వబడుతున్న ఉత్తమ జ్ఞాపకం" అని గొప్ప సందేశాన్ని ఇచ్చారు. నిజానికి ఇవి దృష్టి లోపం ఉన్న మహిళలచే ఎంతో కళాత్మకంగా తయారుచేయబడిన వెలకట్టలేని చీపురుకట్టలు. వైకల్యం మనిషికి తప్ప మనుసుకు కాదని నిరూపించిన ఈ మహిళా బృందానికి మరియు ప్రాజెక్ట్ రూపకల్పన చేసిన లక్ష్మి మీనన్ కృషి బహుదా ప్రశంసనీయం.     

పెన్ విత్ లవ్:

 పర్యావరణానికి పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించి చెట్లను పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో “పెన్ విత్ లవ్” అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ఆమె పెన్ తయారీకి ప్లాస్టిక్ బదులుగా కాగితాన్ని ఉపయోగించి పెన్ చివరభాగాన అగస్త్య చెట్ల విత్తనాలను అమర్చేలా డిజైన్ చేశారు. ఈ తరం వాళ్ళకి అగస్త్య వృక్షం గురుంచి అంతగా తెలియదనే చెప్పొచ్చు. ఆమె సుదీర్ఘ అన్వేషణ మరియు కృషి తర్వాత ఈ విత్తనాలను సేకరించారు.
అగస్త్య వృక్షాలలో ఔషధ గుణాలు అధికంగా ఉండటమే గాక ఆ చెట్టు ఆకులు మరియు పువ్వులు థైరాయిడ్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఎంతో ప్రత్యేకతలున్న ఈ పెన్ ఒకసారి వాడి పడేస్తే పెన్ చివరి భాగంలో ఉండే విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయనే ఉద్దేశంతో రూపొందించారు. ఎదిగిన చెట్టు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలుచేస్తుందని,  పర్యావరణాన్ని కాపాడడంకోసం మీరు ఒక పెన్ కొంటే సరిపోతుందని ఆమె నినాదం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతో మంది దృష్టి వైకల్యమున్న మహిళలు జీవనోపాధి పొందుతున్నారు.
2016 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మెగాస్టార్ మమ్ముట్టి చేత ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. తొలి ఏడాది లక్ష పెన్నులు విక్రయించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ, కేవలం నాలుగు నెలల్లోనే ఆ లక్ష్యాన్ని సాధించడం కొస మెరుపు.
ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మంది మహిళలలో ఒకరిగా ఎంపిక చేయబడటం గొప్ప విషయం. 

వరద బాధితులకు అండగా:

2018 వరదల కారణంగా అతలాకుతలమైన చేనేత కార్మికుల గ్రామమైన చేందమంగళంలో పుట్టిన 'చెక్కుట్టి' బొమ్మలు ఐక్యరాజ్యసమితి వరకు ప్రయాణించి ప్రేమ, కరుణ సందేశాన్ని ప్రపంచం నలుమూలల తెలిసేలా చేశాయి. చెందమంగళంలో వరదల కారణంగా చెడిపోయిన చేనేత వస్త్రాలతో తయారైన 'చెక్కుట్టి' బొమ్మలు భారత్‌లో రూ.25కు అమ్ముడుపోగా, విదేశాల్లో ఎక్కువ ధరకు అమ్ముడుపోయాయి. ఇలా వసూలైన మొత్తాన్ని వరదలలో సర్వస్వం కోల్పోయిన నేత కార్మికులకు పంచారు. లక్షి మీనన్ వరద బాధితులకు అండగా నిలిచింది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే గాక వారికి ఆర్ధిక   సహాయం అందించడం గొప్ప విషయం. 

మత్స్యకారులకు అభినందనల వెల్లువ:

వరదల సమయంలో రక్షకులుగా మారిన మత్స్యకారుల కోసం ఆమె ప్రవేశపెట్టిన బీమా పథకం విజయవంతమైంది. కేవలం రూ. 24 వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా ఎవరైనా మత్స్యకారులను స్పాన్సర్ చేయవచ్చు. దీనిని ప్రోత్సహించడానికి, కేరళలోని వివిధ క్యాంపస్‌ల విద్యార్థులు మత్స్యకారులపై ప్రేమ అనురాగాలతో కూడిన సందేశాలను తెలియజేయడానికి పేపర్ బోట్‌లను తయారు చేశారు. ఆ పేపర్ బోట్‌లను ఇప్పుడు కొచ్చిలోని నిఫ్ట్ క్యాంపస్‌లో ప్రదర్శించడం గమనార్హం. 

లక్షి మీనన్ ప్రారంభించిన ప్రాజెక్ట్స్ ద్వారా ఎందరో దృష్టి లోపం గల మహిళలు జీవనోపాధిని పొందుతున్నారంటే అందుకు కేరళ రాష్ట్రమే గాక భారతదేశం గర్వించదగ్గ విషయం.
 
రచన:
కోట దామోదర్ 
మొబైల్: ⁨+91 93914 80475⁩







13, డిసెంబర్ 2022, మంగళవారం

రైతుని రాజుల చూడాలి




దేశ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేవాడు జవాన్.. (సైనికుడు),

మనిషి ఆకలిని తీర్చడానికి అవిశ్రాంతంగా శ్రమించేవాడు కిసాన్ (రైతు)..

దేశాన్ని కంటికి రెప్పలా రక్షించే జవాన్ ఎంత ముఖ్యమో, దేశ ప్రజల క్షుద్బాధ (ఆకలి) నుండి మనల్ని రక్షించే అన్నదాతకూడా అంతే ముఖ్యం.

ఈ ఇద్దరి శ్లాఘనీయ సేవలకు గుర్తింపుగా“జై జవాన్”, “జై కిసాన్”నినాదాలతో మన దేశం వారిని కీర్తిస్తుంది. ఆహారం లేకుండా మనిషి జీవించలేడు. మనిషి జీవనానికి ఆహారం అత్యవసరం, ఆహారాన్ని సృష్టించే రైతన్నే లేకుంటే మనిషి జీవించడం అసాధ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే రైతు లేనిదే మ‌నిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక అని రైతుల‌ను అభివ‌ర్ణిస్తారు. అందుకే  'రైతే రాజు' అన్నారు.

రైతు నాయకుడు (రైతు బంధు):  

భారత మాజీ ప్రధాని, ప్రఖ్యాత కర్షక నాయకుడు చౌదరి చరణ్ సింగ్ డిసెంబర్ 23, 1902న ఉత్తరప్రదేశ్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్య్రం కోసం జరిపిన అహింసా పోరాటంలో చరణ్ సింగ్ మహాత్మా గాంధీని అనుసరించడమే కాక అనేక సార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. 1930లో, ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు బ్రిటీష్ వారు అతన్ని 12 సంవత్సరాలు జైలుకు పంపారు. స్వాతంత్య్రానంతరం అయన రైతు ప్రయోజనాలకోసం, రైతు చట్టాలకోసం ఎనలేని కృషిచేశారు. అతని రాజకీయాలు ప్రధానంగా గ్రామీణ భారతదేశం, రైతు, సామ్యవాద సూత్రాలపై పరిభ్రమించేవి. ఆయన ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే భూసంస్కరణల అమలులో కీలకపాత్ర పోషించి రైతులకు మేలు చేసే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూసంస్కరణ చట్టాలలో మార్పుల కొరకు జమీందారీ వ్యవస్థ రద్దు చేయాలనీ అనేక ఉద్యమాలు చేపట్టి జమీందారీ వ్యవస్థను అంతమొందించేందుకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. అంతేకాదు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి ప్రధాని చౌదరి చరణ్ సింగ్.  రైతు చట్టాల మార్పు కోసం కృషి చేసిన చరణ్ సింగ్ “రైతు బంధు” గా పేరుగాంచిరైతుల మనస్సులలో ప్రత్యేక ముద్ర వేశారు.  రైతుల కోసం చరణ్‌సింగ్ చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జయంతిని ప్రభుత్వం “జాతీయ రైతు దినోత్సవం" గా ప్రకటించింది. కర్షక లోకానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయనసమాధికి“కిసాన్ ఘాట్”గా నామకరణం చేసారు.

హరిత విప్లవం:

హరిత విప్లవం 1961లో ప్రారంభమైంది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్న సమయంలో ఈ విప్లవం ప్రారంభమైంది. హరిత విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని "రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్" ఈ విప్లవాన్ని ఇతర దేశాలకు విస్తరించేందుకు కృషి చేసింది. అప్పటి భారత వ్యవసాయ మంత్రి MS స్వామినాథన్ నార్మన్ బోర్లాగ్‌ను భారతదేశానికి ఆహ్వానించారు. భారత ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఉన్నప్పటికీ, గోధుమలను మెక్సికో ప్రయోగశాల నుండి దిగుమతి చేసుకున్నారు మరియు పంజాబ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. అది భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికింది.

హరిత విప్లవంలోని ప్రధానాంశాలు:

1 . అధిక దిగుబడి వంగడాల వినియోగం.

2 . రసాయన ఎరువుల క్రిమిసంహారక మందుల వినియోగాన్ని పెంచడం.

3 . నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి.

4 . వ్యవసాయ యాంత్రికీకరణ, వ్యవసాయ ఆధునిక శాస్త్రీయ పద్దతులను అమలు చేయడం.

ఇవే కాకుండా భూసంస్కరణల అమలు, గ్రామీణ విద్యుతికరణ, మార్కెటింగ్ సదుపాయాల ఏర్పాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థాపనలాంటివి కూడా హరిత విప్లవంలో భాగమే..  
హరిత విప్లవం కారణంగా భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులతోపాటు పంటల దిగుబడి పెరిగింది. ఆహారధాన్యాలల్లో దేశం స్వయం సమృద్ధిని సాధించింది.

బ్రహ్మ కంటే గొప్ప:

రైతుని చిన్నచూపు చూస్తున్న ప్రతిఒక్కరు అన్నంలేనిదే మనం బ్రతకలేమన్న విషయాన్నీ గమనించాలి. రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు. మనిషికి ఎన్ని కోట్లరూపాయలున్నాఅన్నంతినే బ్రతకాలి తప్ప అన్నంలేనిది బ్రతకలేడు. మనిషి బ్రతికున్నంతవరకు అన్నం తప్పనిసరి. అందుకే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు. అన్నం పండించే రైతులు బ్రహ్మ కంటే గొప్పవారు. ప్రపంచానికి అన్నం పంచే రైతును "అన్నదాత" గా అభివర్ణించారు మన పూర్వీకులు.

రైతు చట్టాలు మారినా, రైతు కష్టాలు మారలే..

మన దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి సాధిస్తున్నాయి కానీ ఒక వ్యవసాయరంగం మాత్రమే అభివృద్ధికి ఆమడదూరంలో ఉండడం శోచనీయం. సారవంతమైన భూములు, తగినంత నీరు, సకల సౌకర్యాలన్నీ ఉన్నా గిట్టుబాటు ధరలేక రైతు మనుగడ సామర్థ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని ప్రభుత్వాలు చెబుతున్నా వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడంలో మాత్రం క్రియాశూన్యంగా ఉంటున్నాయి.  ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, రుణమాఫీలు కేవలం వ్యవసాయం చేయని భూస్వాములకుఅందుతున్నాయి తప్ప భూమిలేక ప్రత్యక్షంగా దుక్కి, దున్ని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతుకు మాత్రం అందడంలేదు. 10 ఎకరాలకంటే ఎక్కువఉన్న రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే రుణాలు అందుతున్నాయి కానీ గుంట భూమిలేని కౌలురైతుకి రుణాలందకపోవడం శోచనీయం. ఒక వైపు గిట్టుబాటు ధరలేక రైతు నష్టపోతుంటే మరోవైపు ప్రభుత్వంనుండి వచ్చే రుణాలందక కౌలురైతు వ్యవసాయంపట్ల విముఖత చూపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాణ్యమైన విత్తనాల కొరత వల్ల పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు పెట్టుబడి పెరిగిపోతోంది. రైతు పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించే మద్దతుధర గిట్టుబాటుధరలేక, సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేక రైతు నష్టపోతున్నాడు. చేసిన అప్పులు తీర్చడంకొరకు రైతులు  కూలీలుగా మారుతున్నారు.  కొందరు ఇతర పనులమీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మరికొందరు రైతులు భూములను కౌలుకిచ్చి పట్టణప్రాంతాలకు వలసపోతున్నారు. కొంతమంది రైతులు ప్రభుత్వ రుణాలందక పంట పండించడానికి  అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. 

 

కోట దామోదర్

మొబైల్ : 9391480475


5, డిసెంబర్ 2022, సోమవారం

చెదిరిన "క్షౌరవృత్తి"




చెదిరిన "క్షౌరవృత్తి":

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కేశాలంకరణకు (క్షౌరవృత్తి) కి ప్రాచీన చరిత్ర ఉంది.

మనుషులను జంతువులనుండి వేరుచేసిన గొప్ప చరిత్ర ఈ క్షౌరవృత్తి కి ఉందనడంలో అతిశయోక్తిలేదు. కేశాలంకరణ (క్షౌరవృత్తి) మానవుని నాగరికతకు తొలి మెట్టు.
భారతదేశంలో కులాలు మరియు మతాలు ఏర్పడిననాటికంటే ముందునుండే ఈ వృత్తి ఉందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

క్షురకర్మ అంటే క్షవరము చేయుట అని అర్ధం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వీరిని “నాయీ బ్రాహ్మణులు” (మంగలి) అని పిలుస్తుంటారు. భారతదేశంలో క్షౌరవృత్తి చేసే వారిని ఒక్కొక్క ప్రాంతంలోఒక్కో పేరుతో ప్రత్యేకంగా పిలుస్తారు. హిందూ, సిక్కు మతాలలో వంశపారంపరంగా ఈ వృత్తిని నిర్వహించేవారిని "నాయీ" లుగా పిలుస్తుంటారు. మనిషి పుట్టుక, చావు, దైవ కార్యములకు నాయీ బ్రాహ్మణుల సేవలు ప్రధాన పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు.

తొలివైద్యుడు:

చారిత్రక ఆధారాల ప్రకారం క్షురకులే తొలి వైద్యులని, క్షౌరవృత్తి లో భాగంగానే వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిందని, అంతేగాక వైద్యులు శస్త్రచికిత్సప్రారంభించడానికి వైద్యుడి ముందు వెంట్రుకలు కత్తిరించడానికి మరియు పుండ్లు, గడ్డలు కోయడానికి కూడా క్షురకర్మ కు వినియోగించే కత్తులు, బ్లేడ్లు ఉపయోగించినట్లు ఆధారాలు రుజువుచేస్తున్నాయి.

మొదటి వైద్యురాలు (మంత్రసాని):

గతంలో ప్రసూతి వైద్యులకు (గైనకాలజిస్టు) బదులుగా ఈ వృత్తి మహిళలే స్త్రీలు గర్భం ధరించినప్పటి నుంచి శిశువు జననం వరకు ‘మంత్రసాని’గా సేవలందించేవారు. మంత్రసానిగా సూలగిత్తి నరసమ్మ ఎన్నో వేల మందికి ప్రసవాలు చేసి తల్లీబిడ్డలకు ప్రాణాలు నిలిపేలా సేవలందించారు. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలకు పురుడు పోయడం గమనార్హం. మహామాత నరసమ్మ చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఒక మంత్రసానికి అరుదైన గౌరవం దక్కడం గొప్ప విషయం.
అక్షరం రాని మంత్రసానులు ఎలాంటి ఆపరేషన్ లేకుండా సులభంగా కాన్పులు చేసేవారు.
కానీ ఇప్పుడు డాక్టర్స్ మాత్రం కత్తెరలేనిదే కాన్పులు చేయటంలేదు. వైద్యరంగం అభివృద్ధి చెందింది కానీ మంత్రసానిలా చేయటంలేదు. ఇప్పుడున్న వైద్యుల కన్నా మంత్రసాని ప్రతిభ గొప్పది.
వైద్య, విద్య రంగం అభివృద్ధి చెందిన తరువాత చాలామంది వైద్యవృత్తిని వదిలి క్షుర వృత్తిమీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.
 
మంగళ వాయిద్యాల ప్రత్యేకత:

ప్రాచీన కాలం నుండి నాయీ బ్రాహ్మణులు(మంగళి) క్షౌరవృత్తి తో పాటు సంగీతం (మంగళ వాయిద్యాలు వాయించడం), వైద్యం కూడా వృత్తిగా నిర్వహించేవారు.
మంగళ వాయిద్యాలువాయించడంలో వీరు నిష్ణాతులు. మంగళ వాయిద్య సంగీతంలో భాగంగా వీరు సన్నాయి (నాదస్వరం),డోలు(శృంగభేరి) వాయించడం ఆనవాయితీగా వస్తోంది.
నాదోపాసన అనేది ప్రాచీన కాలం నుండి మన సనాతన ధర్మంలో అంతర్భాగంగా కొనసాగుతోంది. హిందూ దేవాలయాలలో దైవారాధనకువేదాలలోఎంత ప్రాధాన్యత వుందో. నాదోపాసనకుకూడా అంతే ప్రాధాన్యత ఉంది.నాదోపాసన చేయడం సాక్షాత్తూఆ పరబ్రహ్మను పూజించడమేనని భగవద్గీత పదవ అధ్యాయం 22వ శ్లోకంలో ప్రస్తావించబడింది.

హిందూ దేవాలయాలలో, నాదస్వరం వినిపించడం సర్వసాధారణ విషయం. గర్భాలయంలో ప్రతిష్టమైన దేవుడిని మేల్కొలపడానికి మరియు దైవ ప్రార్థనకు ముందు మంగళ వాయిద్యాలను వాయించడం మనందరికీ తెలిసిన విషయం. భారతదేశంలో మంగళ వాయిద్యాలు లేకుండా ఏ శుభ కార్యమూ జరగదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వివాహం, నూతనగృహ ప్రవేశం వంటి శుభకార్యాలకు బ్రాహ్మణుడివేద మంత్రాలకుఎంత ప్రాముఖ్యత ఉందో మంగళ వాయిద్యాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.

పుణ్యక్షేత్రాలలో నాయీ బ్రాహ్మణుల పాత్ర:

హైందవ సాంప్రదాయంలో పుట్టు వెంట్రుకల తొలగింపుకు చాలా ప్రాధాన్యముంది. ఈ ప్రక్రియను ఒక వేడుకగా నిర్వహించడం మనందరికీ తలుసు. అసలు పుట్టువెంట్రుకలు ఎందుకు సమర్పించాలి అనే సందేహం కలగడం సహజమే. శిరోజాలు పాపాలకు నిలయాలని, వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలిగించుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దైవ సన్నిధిలో కోరిన కోర్కెలు తీర్చే దేవుడికి భక్తులు తలనీలాలు సమర్పించుకోవడం ఒక ఆచారంగా మారింది. దైవ క్షేత్రాలలో “కళ్యాణ కట్ట” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశంలో భక్తుల తలనీలాలను దేవునికి సమర్పించేందుకు తమ సేవలందిస్తారు కేశఖండనకారులు.
మన సనాతన భారతీయ సంప్రదాయాల్లో అంతర్లీనంగా ఎన్నో శాస్త్రీయ అంశాలు దాగి ఉంటాయనేది నిర్వివాదాంశం. ఈ ఆచారవ్యవహారాలలో భాగమే "పుట్టువెంట్రకుల" వేడుక ఒకటి.

వివాహంలో నాయీ బ్రాహ్మణులపాత్ర:

సంప్రదాయబద్ధమైన రీతిలో పెళ్లి మంటపం అలంకరించిన తరువాత పందిట్లో వడ్లుపోసి వాటిపైన పీటను వేసి పెండ్లి కుమారుడిని దానిపై కూర్చోబెట్టి నాయీ బ్రాహ్మణుడు(మంగలి) మైలపోలు తీస్తాడు. మైలపోలు అంటే పెళ్లి కుమారుడి కాలి, చేతి గోర్లు తొలగించి శుభ్రం చేస్తారు.

కేశాలంకరణ(క్షౌరవృత్తి):

మనిషి పుట్టుక నుండి మరణం వరకు నాయీ బ్రాహ్మణుడు (మంగలి) లేనిదే జీవనం ముందుకు సాగదు. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా, ఉంచడానికి శుభ్రపరచడంశుభ్రంగా మరియుమరియు అందంగా మార్చడం "నాయీ బ్రాహ్మణుల (మంగలి) వృత్తి". పుట్టు వెంట్రుకల నుండి మొదలుకొని మనిషి మరణాంతరం చేసే క్షుర కర్మలను నిర్వహించేది కూడా నాయీ బ్రాహ్మణులే. ఈ సమాజంలో కులమతాలకు అతీతంగా అందరికీ సమానంగా సేవలందించే వృత్తి "కేశఖండనకేశఖండనం". మానసిక వత్తిడి, సౌందర్య పోషణ, మానసిక అశాంతి వంటివి తగ్గించడం, తల నొప్పి నుండి ఉపశమనం పొందడం కొరకు తైలాల మర్ధన ఎంతగా ఉపయొగపడుతాయో ప్రత్యకంగా చెప్పనవసరంలేదు. "ఎంతటివారైనా నాయీ బ్రాహ్మణుడికి తలవంచక తప్పదుాలి" అనేది జగమెరిగిన నానుడి. క్షవరం చేసే సమయంలో వీరివద్ద తలవంచనిదే క్షౌర పని పూర్తిచేయటం అసాధ్యం . ప్రతి మనిషికి తలవెంట్రుకలు శిరస్సును అందంగా అలంకరించటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనిషిని అందంగా తీర్చిదిద్దడంలో నాయీ బ్రాహ్మణుల కళానైపుణ్యం అనివార్యంఎంతో ప్రత్యేకం.

తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నాయీ బ్రాహ్మణుల కుటుంబాలు ఎక్కువగా ఈ వృతిపైనే ఆధాపడి జీవిస్తున్నాయి. అయితే 2019 లో కరోనా మహమ్మారి ప్రభావంతో వృత్తినే నమ్ముకున్న నాయిల నాయీ బ్రాహ్మణుల జీవితం ఒక్కసారిగా దారితప్పినట్లైంది. హెయిర్ కటింగ్ సెలూన్ లకు గిరాకీ లు లేక తీవ్రమైన ఆర్ధిక సంక్షోభానికి గురై షాపులకు కిరాయిలు అద్దె మరియు కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉండగా కార్పొరేట్, ఆన్ లైన్ లో సేవలపేరుతో "అర్బన్ క్లాప్" లాంటి పలు సంస్థలు ఉనికి లోకి రావడంతో ఈ వృత్తే జీవనం సాగించే సాధారణ నాయీ బ్రాహ్మణులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కులవృత్తులు కనుమరుగైపోయినా.. వీరు మాత్రం అచంచలమైన ధైర్యంతో వృత్తిని కాపాడుకుంటూనే ఉన్నారు. ఏదేమైనా కులవృత్తులనే నమ్ముకుని అరకొర సంపాదనతో సాధారణ జీవితాలను నెట్టుకొచ్చే బడుగు జీవులతోబడా కార్పోరేట్ సంస్థలు పోటీ పడి వారి నోటి ముందు కూడును లాక్కోవడం అత్యంత శోచనీయం. ఇతర వృత్తి రాక, వంశపారంపర్య వృత్తిపై మమకారం చంపుకోలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర మనోవేదనకు గురవుతుండగా కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర కుల వృత్తుల వారితో పాటు నాయీ బ్రాహ్మణులు కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపి రాష్ట్రాన్ని “బంగారు తెలంగాణ” గా మారుస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానం ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సభ్య సమాజానికి నాయీ బ్రాహ్మణులు చేస్తున్న సేవలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి ఇక్కట్లను రూపుమాపేందుకు పటిష్టమైన ప్రణాలికను రూపొందించి ఆదుకోవాలని నాయీ బ్రాహ్మణులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
 
రచయిత:

కోట దామోదర్
మొబైల్: 9391480475

14, నవంబర్ 2022, సోమవారం

వింతలెన్నో చూడ రండి




ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, అంతుపట్టలేని వింతలు, విశేషాలు ఉన్నాయి. మానవుడికి ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి అబ్బుర పరిచే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా చూస్తేగానీ నమ్మలేని అద్భుతాలెన్నింటినో పరిశోధనలు చేసినప్పటికీ కూడా శాస్త్రజ్ఞులు సరైన ఆధారాలు కనిపెట్టలేకపోతున్నారు . 

విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఒకరోజు చెట్టు నుంచి రాలిన ఆపిల్ ను గమనించి, ఆపిల్ క్రింద పడటానికి గల కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా పనిచేస్తుందో వివరిస్తూ  విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదిస్తూ, గమన సూత్రాలను నిర్వచించాడు. 

ఒక వస్తువును పైకివిసిరినపుడు తిరిగి ఆ వస్తువు కిందకు పడటానికి కారణం భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండటంవల్లనే అని మనం చిన్నపుడు పాఠ్యపుస్తకాలల్లో చదువుకున్నాం.

కానీ పైకి విసిరిన వస్తువు కిందపడకుండా ఉండటం సాధ్యమేనా? అనే సందేహం చాలా మందికి కలగడం సహజమే ..

గురుత్వాకర్షణ శక్తి ధిక్కరించిన చోట పైకి విసిరిన వస్తువు కిందపడకుండా ఉండటం సాధ్యమే అని చెప్పొచ్చు. ఈ భూగోళం అంతా  గురుత్వాకర్షణ శక్తి కలిగివుందని మనకు తెలుసు. కానీ  ప్రపంచంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయని ప్రదేశాల గురుంచి మాత్రం చాలా మందికి తెలియదు


ప్రపంచంలో కేవలం ప్రదేశాలలోమాత్రమే గురుత్వాకర్షణ శక్తి  పనిచేయదని తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగక మానదు.


 1 . మాగ్నెటిక్ హిల్, లేహ్, లడక్, ఇండియా (Magnetic Hill, Leh Ladakh, India)

భారత దేశంలోని, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం, లేహ్ జిల్లాకి 30 కిలోమీటర్ల దూరంలో గల ప్రదేశాలు సుందర మనోహరమైన దృశ్యాలతో పర్యాటకులనుఆకర్షిస్తాయి. అటువంటి అద్భుతమైనఆకర్షణలలో “మాగ్నెటిక్ హిల్” (అయస్కాంత కొండ)ఒకటి. ఇది సముద్రమట్టం కంటే 14,000 అడుగుల ఎత్తులో ట్రాన్స్-హిమాలయన్ ప్రాంతంలో లేహ్-కార్గిల్-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉంది. మాగ్నెటిక్ హిల్ తూర్పున సింధు నది ప్రవహిస్తుంది. మాగ్నెటిక్ హిల్ ప్రాంతం చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసిన ఒక పసుపు రంగు సైన్ బోర్డు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది.  "అయస్కాంత కొండ, గురుత్వాకర్షణను ధిక్కరించే దృగ్విషయం. మీ వాహనాన్ని రోడ్డుపై తెల్లటి పెయింట్‌తో గుర్తు పెట్టబడిన పెట్టెలో పార్క్ చేయండి" అని రాయబడి ఉంటుంది. ఈ ప్రాంతంలో మోటారు వాహనాల ఇంజన్లు ఆపేసినా సరే అవి కొండ వైపు గంటకి ఇరవై కిలోమీటర్ల వేగంతో సాగిపోతుంటాయి.. ఈ ప్రాంతం యొక్క లేఅవుట్ మరియు చుట్టుపక్కల వాలులు కొండ యొక్క ఆప్టికల్ భ్రమను సృష్టిస్తాయి. కొండ రహదారి నిజానికి లోతువైపు ఉన్న రహదారి. కొండ రహదారిపై ఉన్న వస్తువులు మరియు కార్లు నిజానికి లోతువైపుకు దొర్లుతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తికి ధిక్కరించి ఎత్తుపైకి దొర్లినట్లు కనిపిస్తాయి. అలా వెనక్కి ఎందుకు వెళ్తున్నాయో ఎవ్వరికి అర్ధంకాని వింత. ఇటుగా వచ్చే టూరిస్టులు మాత్రం విచిత్రమైన ఈ అయస్కాంత కొండని చూసి అబ్బురపడుతుంటారు.ఈ కొండ సమీపంలోకి రాగానే హెలికాప్టర్ల వేగంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయని అంటారు. జూలై మరియు అక్టోబర్నెలలు ఈ మాగ్నెటిక్ హిల్ సందర్శించడానికి అనువైన సమయం.

సిద్ధాంతాల ప్రకారం:

ఈ కొండకి అయస్కాంత శక్తి  ఉండటంవల్ల ఇలా జరుగుతుందని కొందరి నమ్మకం, మరి కొందరు మాత్రం ఈ కొండ ప్రాంతంలో కంటికి కనిపించని అదృశ్యశక్తులు ఉన్నాయని, మరికొందరు మాత్రం ఆప్టికల్ ఇల్యూషన్ ( దృశ్య భ్రమ) అని . ఇది చుట్టుపక్కల భూమి యొక్క లేఅవుట్ ఆప్టికల్ భ్రమను ఉత్పత్తి చేసే ప్రదేశం , ఇది కొంచెం లోతువైపు వాలుగా కనిపిస్తుంది. ఎత్తుపైకి వాలు. అందువల్ల, గేర్‌ వదిలివేయబడిన కారు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి దొర్లుతున్నట్లు కనిపిస్తుందని అంటుంటారు.

2 . సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ (Saint Ignace Mystery Spot, Michigan, USA).

 అమెరికా, మిచిగాన్ లోని సెయింట్ ఇగ్నాస్ ప్రాంతంలో మిస్టరీ స్పాట్‌ గొప్ప టూరిస్టు కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. మొదటగా ఈ ప్రాంతంయొక్క ప్రత్యకతలను ఎవరు గుర్తించలేకపోయారు.
1939 లో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా కొందరు సర్వేయర్లు మిస్టరీ స్పాట్‌ ప్రత్యేకతలని గుర్తించారు. సర్వేయర్లు మొట్టమొదటి సారిగా సెయింట్ ఇగ్నాస్ వచ్చినప్పుడు వారిదగ్గరున్న పరికరాలన్నీ పనిచేయకుండా స్తంభించి పోయాయి.  సర్వేయర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు పరికరాలన్నీ ఒకేసారి నిలిచిపోవడానికి గల కారణాలేంటి అని తెలుసుకోవడానికి పరిశోధనలు చేయగా  ఆ ప్రాంతంలోని కేవలం300 అడుగుల డయామీటర్ సర్కిల్ లో మాత్రమే ఇలా జరుగుతుందని తేలింది. . ఈ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల ఎత్తులు ఒకే విధంగా ఉంటారని. ఆ ఇద్దరూ వేర్వేరు సైజులో ఉన్నా... అక్కడి ఓ రాయి ఎక్కి... అటూ ఇటూ మారగానే ఇద్దరి సైజూ ఒకేలా ఉంటారని. అంతేకాదు... మనిషి గోడపై వాలుగా నిలబడటం అసాధ్యం కానీ అక్కడి గోడలపై వాలుగా నిల్చోవచ్చు. అయినా కింద పడరు. మిస్టరీ స్పాట్ ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వందల వేల మంది సందర్శకులను ఆశ్చర్యపరుస్తూ మరియు కలవరపరుస్తోంది. శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాలు చేసిన తరువాత ఆప్టికల్ ఇల్యూషన్ (దృశ్య భ్రమ) తప్ప మరొకటి లేదని చెప్పడమే గానీ కచ్చితమైన కారణాలు చెప్పలేకపోడవం మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

3 . మిస్టరీ స్పాట్, శాంతాక్రజ్, కాలిఫోర్నియా (Mystery Spot, Santa Cruz, California)

 ఇది సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ లాంటిదే. అమెరికా, కాలిఫోర్నియా రాష్ట్రంలోని. శాంతాక్రజ్ సమీపంలో ఉన్న ఓ అడవి ప్రాంతంలో ఎన్నో వింతలు, విశేషాలు కలిగిన అద్భుతమైన చిన్న ప్రాంతం అది కేవలం 150 అడుగుల వ్యాసార్థం కలిగిన ప్రదేశం. ఆ ప్రాంతంలో ఉన్నవారు పక్కకు వంగగలరు. వంకరగా నడవగలరు. వాళ్లు ఓ కొండను వాలుగా ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది. చాలా మంది టూరిస్టులు ఆ ప్రదేశానికి తరచూ వెళ్తుంటారు. ఎందుకంటే. ఎన్నిసార్లు చూసినా గానీ ఆ మిస్టరీ ఏంటో అర్థం కాదు. శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఇలా జరగడానికి ముఖ్య కారణం ఆప్టికల్ ఇల్యూషన్ వలనే అనిచెపుతున్నారు కానీ  కచ్చితమైన కారణం ఏంటన్నది తెలియట్లేదు.. ఈ అరుదైన ప్రాంతానికి పర్యాటకుల సందడి ఎక్కువ.   

 4  . జలపాతం, ఫారో ఐలాండ్స్ (Waterfall, Faroe Islands)

స్కాట్లాండ్, ఐలాండ్ మధ్యన అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవుల్లో ఉన్న జలపాతం ఇది.
సాధారణంగా జలపాతంలోని నీరు పైభాగం నుండి కిందకు పడటం సహజం. ఇక్కడమాత్రం  నీరు కిందకు కాకుండా పైకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ గాలి కింద నుంచి పైకి ఎక్కువ వీస్తుండటం వల్లే ఇలా జరుగుతుందని కొందరంటుంటే  మరి కొందరు మాత్రం  జలపాతం నుంచి వచ్చే నీటిని గాలి పైకి పంపేస్తోంది గంటకు 75 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బలమైన గాలి వీయడం అటువంటి దృగ్విషయాలకు కారణమవుతుంది అని నిపుణులు చెప్తున్నారు.

5  . హూవర్ డ్యామ్, నెవాడా, అమెరికా (Hoover Dam, Nevada, USA)

ఈ డామ్ అమెరికా లోని అరిజోనా, నెవాడా రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. హూవర్ డామ్ ఒకానొకప్పుడు బౌల్డర్ డామ్ గా పిలిచేవారు. ఇది కొలరాడోనది యొక్క బ్లాక్ కేనియాన్‌‌లో నిర్మించబడిన ఆర్చ్-గ్రావిటీ డామ్. లాస్ వేగాస్ నుండి హూవర్ డ్యామ్ వరకు సుమారు 37 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హూవర్ డ్యామ్ కి వెళ్లిన వారికి అక్కడున్న అద్భుతాలనుచూస్తే  ఆశ్చర్యంకలిగిస్తుంది. హూవర్ డ్యామ్ పై నుంచి ఓ బాటిల్ తో నీటిని కిందకు జార విడిస్తే, ఆ నీరు కిందకు పడకుండా. పైకి ఆకాశంవైపు వెళ్తుంది. ఎన్నిసార్లు నీరు జార విడిసినా. నీరు పైకే వెళ్తుంది. నమ్మశక్యం కానీ ఈ అద్భుతాన్ని చూసి పర్యాటకులు ఆశ్చర్య పోకుండా ఉండలేరు.  శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు చేసిన తరువాత వారు చెప్పిన సమాచార ప్రకారం  ఆ డ్యామ్ దగ్గర గాలి కింద నుంచి పైకి బాగా ఎక్కువగా వీస్తోందని. ఆ గాలి నీటిని పైకి తోసేస్తుందని. అందుకే ఇలా జరుగుతోందని వెల్లడించారు. అయినా పర్యాటకులకు ఇదొక వింత లాగే అనిపిస్తుంది.


మీ 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475

kotadamodar.blogspot.com

8, నవంబర్ 2022, మంగళవారం

అంతరించిపోతున్న కుమ్మరి వృత్తి

మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన వృత్తి 'కుమ్మరి వృత్తి'.

మట్టితో మహత్తర ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం పోసింది కుమ్మరి.

మనిషి పుట్టుక, చావు, దైవ కార్యాలకు కుండ ఎంత ఉపయోగమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

మానవ జాతికి తొలి పనిముట్టును అందించడమే గాక జీవనానికి అత్యవసర నిత్యావసర వస్తువుగా తీర్చిదిద్దిన ఘనత కుమ్మరిది. పూర్వం మానవుడు మట్టిపాత్రలు మాత్రమే వాడి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాడు. మనిషి పుట్టుక మరియు చావు కుండలేనిదే పూర్తికాదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. పుట్టిన పురిటి బిడ్డకు పురుడు పోసేందుకు మరియు చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు సైతం కుండను వినియోగిస్తారు. ఇలా మనిషి మనుగడకు మట్టి పాత్రలు ప్రధాన పాత్ర పోషించాయని అనడంలో ఎలాంటి సందేహములేదు. మట్టిని కుండగా మలచడంలో నేర్పరితనం ఉంటుంది. సాధారణంగా అది అందరికి సాధ్యం కాదు.

కుండ చెప్పిన నీతి:

ఒకసారి కుండను ఎవరో అడిగారట...

నువ్వు పరిస్థితులతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితిలో అయినా చల్లగా (ప్రశాంతంగా) ఉంటావు కదా ! ఇది ఎలా సాధ్యం ! అని...

దానికి కుండ చెప్పిన సమాధానం మనను ఆలోచించేలా చేస్తుంది. తాను వచ్చింది మట్టిలో నుండి అని, మళ్ళీ తిరిగి వెళ్లి కలిసేది కూడా మట్టిలోనే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానని అంటూ మధ్యలో వచ్చే ఆవేశం, గర్వం, పొగరులాంటివి అవసరమా...! అని జవాబు ఇచ్చిందంట..

కుండ చెప్పిన నీతి ఎంత మధురం! అలా కుండ మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది.  

నాడు పెళ్లిళ్లు, దశ దిన కర్మలు, గ్రామాలలో జరుపుకునే బోనాలు, ఉగాది, జాతరలకు కుమ్మరులు తయారు చేసిన కుండలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, అన్నం వండుకోవటానికి (బువ్వ గిన్నె), నీళ్లు నిల్వచేయటానికి (గోలెం), నీళ్లు మరగపెట్టడానికి (కుండ), వస్తువులను భద్రపరచటానికి (గాదెలు), కూరాడు, ముంత, దీపపు ప్రమిదలు, కల్లు కుండలు, పెళ్ళిలో అయిరేని కుండలు,  గరిగ ముంత, రంజన్లు, మట్టి బొమ్మలు, పూల కుండీలు, నీళ్ళ బుంగలు, ఇంటి నిర్మాణం కోసం పెంకులు, డబ్బులను దాచుకునేందుకు గళ్ల గురిగిలను, వేసవి కాలంలో చల్లని నీటిని అందించే కూజాలను తయారు చేసేవారు. శుభ కార్యాలకు సైతం కుమ్మరి కుండలనే వాడుతుంటారు. కొంత మంది అనారోగ్యానికి గురైనప్పుడు సైతం కుమ్మరి కుండలనే వినియోగించేవారు. ఎందుకంటే అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో ఇవి ఎంతో దోహదపడుతుంటాయి. ఇలా మట్టి పాత్రలను అనేక విధాలుగా ఉపయోగించుకునేవారు. అతి సాధారణంగా కనిపించే ఒక కుండ తయారీ వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. ముందుగా చెరువుల్లో రేగడిమట్టిని తీసుకొచ్చి అందులో రాళ్లు లేకుండా జల్లెడ పట్టి ఇసుక మాదిరిగా తయారుచేస్తారు. ఎన్ని కుండలు చేయాలనుకున్నారో దానికి ఎంత మట్టి కావాలో అంత మట్టి ఒకదగ్గర పోసి అందులోకొన్ని నీళ్ళుకలిపి కాళ్లతో బాగా తొక్కి ముద్దలు ముద్దలుగా తయారుచేసుకుంటారు.  తరువాత ఆ మట్టి ముద్దలను కుమ్మరి చక్రంపై (సారె) పై చేర్చి పొడుగాటి కర్రతో గిరగిరా రెండు చేతులతో తిప్పుతూ మట్టిని చేతివేళ్ల తో నేర్పరితనం రంగరించి కావాల్సిన అకృతి వచ్చే వరకు మలిచి దానిని కొలిమిలో ఉంచి కాల్చుతారు.

ఎండాకాలంలో వేడి తీవ్రత నుండి ఉపశమనం పొందడానికి కుండలను ఎక్కువ వాడేవారు.

మట్టి కుండల్లోని నీరు త్రాగడంవలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

ఎప్పుడైతే మార్కెట్లోకి ప్రిజ్ లు వచ్చాయో ఈ కుమ్మరి కుండలకు ఆదరణ గణనీయంగా తగ్గింది. ఫ్రిజ్‌లో నీటి కంటే మట్టి కుండల్లోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధకుల అభిప్రాయం. కానీ ఉరుకులు పరుగుల జీవితాలకు అలవాటుపడిన కొందరు కుండ వాడటానికి విముఖత చూపుతున్నారు.

అంతేగాక ఇంటి పైకప్పు కోసం కూడా మట్టితో తయారుచేసిన పెంకులనే వాడేవారు. పెంకుటిళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండడం ఆ ఇళ్ళలో నివసించినవారికి మాత్రమే తెలుస్తుంది. కాలక్రమేణా సిమెంట్ వాడకం పెరగడంతో గ్రామాలలో సైతం పెంకుటిళ్ళుఅంతరించిపోతున్నాయి.

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్టాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులోనుండి తామేస్వయంగా మట్టితెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈరోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినాసరే వృత్తిపై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండడం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది.

ఎంతో కళానైపుణ్యంతో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్‌ సిల్వర్‌ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపులతో వెలవెల బోతోంది. కాలచక్రంతో పోటీపడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది.

 

 మీ

కోట దామోదర్

మొబైల్ : 9391480475

2, నవంబర్ 2022, బుధవారం

అందరికి ఆదర్శం అంధురాలు "పయ్యావుల కొమురమ్మ"




సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు.
మనిషి పుట్టుకతో ఏదైనా అవయవలోపం ఏర్పడినా బ్రతకడానికి ఎన్నో మార్గాలుంటాయి. కానీ ఇంద్రియాలలో ప్రధానమైన నయనాలు (కళ్ళు) లేకుంటే మాత్రం ఆ జీవితం అంధకారమే.
మానవ శరీరంలో అత్యంత విలువైన, సున్నితమైన అవయవం కన్ను. మానవుడు ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూడగల్గుతున్నాడంటే దానికి కారణం కళ్ళు. అది మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. కళ్ళు లేనివారు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.
మనిషికి వైకల్యం వున్నా మనసుకు మాత్రం వైకల్యం వుండకూడదు అంటారు. మనోస్థైర్యం ఉన్నవారు శరీర వైకల్యాన్ని అధిగమించడమేగాక ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. ఇది అక్షరాలా నిజం. అలాంటి స్ఫూర్తివంతమైన అంధురాలి యదార్థ జీవిత గాధ ఇది. ఆమె పేరు "పయ్యావుల కొమురమ్మ". ఆమె పుట్టుకతోనే అంధురాలు. అయితేనేం తన పనులు తానే చేసుకుంటూ ఎంతోమంది దివ్యాంగులకు, యువతీయువకులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

కొమురమ్మది సూర్యాపేట జిల్లా మారుమూల గ్రామమైన గుమ్మడవెల్లి. ఆమె నిరుపేద యాదవ కుటుంబంలోబొర్రయ్య, ముత్తమ్మలకు జన్మించింది . ఆమె జన్మతః అంధురాలు అవటంవల్ల సవాలక్ష సవాళ్ళు ఎదుర్కొంది. జీవితంలో ఏ పనిచేయలేని కొమురమ్మకు తల్లి ముత్తమ్మ తొలి గురువు. ప్రపంచంలోని అమ్మలందరికీ పిల్లలపై ఆకాశమంత ప్రేమ ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ముత్తమ్మ కు బిడ్డ మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ. అంధకారం అలుముకున్న తన బిడ్డ జీవితాన్ని చూసి ఆ తల్లి రోదించిన సందర్భాలెన్నో. కొమురమ్మను అదే గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. కానీ అది అంధుల పాఠశాల కాకపోవడంతో ఆమె గురువులు చెప్పేపాఠాలు సరిగా అర్ధం చేసుకోలేకపోయేది. చుట్టుప్రక్కల ఎక్కడ కూడా అంధుల పాఠశాలలు లేనందున ఆమె ఇంటికే పరిమితమయింది.
కొమురమ్మను తల్లి కూలిపనులకు, పొలం పనులకు ఎక్కడికి వెళ్లిన తన వెంటే తీసుకుకెల్లేది, అంతేగాక తన తల్లి మాట్లాడే బంధుత్వ వరుసలను , మాట్లాడే విధానాన్ని పరిశీలించి కొద్దికొద్దిగా నేర్చుకోవడం ప్రయత్నించింది.ప్రతిఒక్కరి గొంతును గుర్తుంచుకునేది. ఎవరైనా ఇంటికి వస్తే వారి గొంతువిని వారి పేరు వెంటనే చెప్పేది అంత జ్ఞాపకశక్తి కొమురమ్మది. మానవత్వానికి మరో పేరు "పయ్యావుల ముత్తమ్మ". ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించే మంచి మనసు ఆమెది. బిడ్డ ఎదిగేకొద్దీ తల్లికి అనుకోని బాధ వెంటాడేది.తానుఆరోగ్యంగా ఉన్నంతవరకు బిడ్డను చూసుకుంటాను కానీ తన తరువాత తన బిడ్డ ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా పనులు ఎలా చేసుకుంటుంది అనే ఆలోచనే బాధించేది ఆ తల్లికి. లచ్చమ్మకు అక్షరజ్ఞానం లేకపోయినా ముందుఆలోచనతో తన బిడ్డకు అందరిలాగే వంట, ఇంటి పనులు చేసుకోవడానికి మంచి శిక్షణ ఇచ్చింది. కొమురమ్మ శ్రద్దగా వింటూ ఓపికగా నేర్చుకోసాగింది. ఆలా కొమురమ్మ జీవితాన్ని ఆమె చీకటి నుండి వెలుగులోకి తీసుకురాగలిగింది. మొదట బిడ్డ జీవితంచూసి చలించిపోయేది. ఆమె మంచి భవిష్యత్తు కోసం తపించేది. తల్లీ నీకు పాదాభివందనం.
బిడ్డపట్ల తల్లి ప్రేమ వర్ణించలేనిది, వెలకట్టలేనిది. పనులు నేర్పించడమేగాక ఊరిలో ఎవరింటికి ఎలా వెళ్లాలో తీసుకొనివెళ్ళి చూపించేది చాలా సార్లు. తల్లి చూపించిన ఇంటి దూరాన్ని అడుగుల లెక్కతో మరియు సమయాన్ని బట్టి ప్రతిఒక్కరి ఇంటికి వెళ్లగలదు. అది చూసేవారికి ఆశ్చర్యం, అనుమానం కూడా కళ్ళు కనిపిస్తాయేమోఅని. కానీఆమె నిరంతర సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది.
కళ్ళు లేవని కలత చెందలేదు. నాకు భవిష్యత్తు లేదని ఆగిపోలేదు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా ముందుకుసాగింది. ఆమె విజయం వెనుక తల్లి ఉంది.
అలా తల్లి ముత్తమ్మ కొమురమ్మను 43 ఏళ్ళు వరకు అన్నీతానే దగ్గరుండి చూసుకుంది. ఒడిదొడుకులతో సాగుతున్న కొమురమ్మ జీవితం లో అనుకోకుండా తీవ్ర అనారోగ్యం కారణంగా తల్లి మరణించింది. తల్లి మరణవార్తవిన్న కొమురమ్మ కన్నీరుమున్నీరైంది. ఆ సంఘటన చూసిన ఊరి జనానికి ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించిన సందర్భం.. తల్లి మరణాంతరం తండ్రి (బొర్రయ్య) కూడా అనారోగ్యానికి గురైనారు. ముత్తమ్మ ముందుఆలోచనతో కొమురమ్మ తన పనులు తానే చేసుకునేలా తర్ఫీడునిచ్చింది.
నిరుపేదరాలైన కొమురమ్మకు ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. పాత మట్టిగోడలమద్యే ఆమె నివాసం. ఎన్ని ప్రభుత్వాలు మారిన కొమురమ్మ గోడు పట్టించుకునే నాధుడే లేడు. ఇప్పటికైనా ప్రభుత్వం కొమురమ్మపట్ల ప్రత్యేక చొరవ చూపాలని కోరుకుంటున్నాం.
ఈరోజుల్లో అన్నిఅవయవాలుండి పనిచేయటానికి బద్ధకం ఉన్నవాళ్ళకి కొమురమ్మ ఒక ఆదర్శం కావాలని కోరుకుంటూ..
కొమురమ్మ నిండునూరేళ్ళు ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని మనందరం ఆ భగవంతుణ్ణి కోరుకుందాం.


✍

కోట దామోదర్
మొబైల్ : 9391480475

జీవితం ఆశ-నిరాశల సంగమం:

  జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...