13, ఆగస్టు 2023, ఆదివారం

మా ఓట్లు మాకే, మా వాటా మాకే.

మా ఓట్లు మాకే,  మా వాటా మాకే.

సిరా చుక్క మౌనం వహిస్తే . మందు చుక్క రాజ్యం ఏలుతుంది అన్నట్లుగా. బీసీ కులాలు మౌనం పాటించడం వల్లే అగ్రకులాల వారు రాజ్యం ఏలుతున్నారన్న విషయం జగమెరిగిన సత్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75  సంవత్సరాలు దాటినా ఇప్పటికి బి సి కుల గణన కలగానే మిగిలిపోయింది. స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపునిచ్చిన బీసీ కులాలకు రాజ్యాధికారం కలగానే మిగిలిపోయింది. దేశ జనాభాలో 75 శాతం బి సి వారు ఉండగా వారికి సరైన రాజ్యాధికారం లేకపోవడం శోచనీయం.

మన దేశంలో 1931లో తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది, సమయంలో మన దేశానికి అన్ని అధికారాలు లేవు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రతి పదేళ్లకోసారి జనాభా గణన చేపట్టాలని అంగీకరించారు. జనాభా లెక్కల ప్రక్రియ కొనసాగుతుండగా కుల గణన అంశం చర్చకు రాకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. షేడ్యూల్డ్ కులాలు, షేడ్యూల్డ్ తెగల జనగణన సేకరణ చేపడుతున్నారు తప్ప 70 యేండ్లు గడిచిన నేటికీ బి సి కుల గణన చేపట్టడం లేదు. బీసీ కులాల గణన వివరాలు చేపట్టాలని సుప్రీం కోర్టు, బీసీ కమిషన్ ఎన్నోసార్లు చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు జాప్యం చేస్తున్నాయన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బి సి కుల గణన వివరాలు చేపట్టక పోవడానికి బలమైన కారణమేంటో ప్రతి బీసీ ఓటరు తెలుసుకోవాలి.  మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాధికార వ్యవస్థలు, పార్లమెంట్ వ్యవస్థలు మరియు అసెంబ్లీ, కమిషన్ అనేక రాజకీయ పార్టీల కార్యవిర్వాహక శాఖలలో పనిచేస్తున్న వారు ఎంత శాతం? అందులో బి సి శాతం ఎంత? రాజకీయ నాయకులలో అత్యధిక శాతం పదవులు అనుభవించే వారి శాతం ఎంత? అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ జనాభాలో 75 శాతం మంది బీసీ కులాలకు చెందిన వారు. కానీ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న వారిలో 75 శాతం మంది అగ్రవర్ణాలకు చెందినవారే కావడం మరింత బాధాకరం. అగ్రవర్ణాలు శాశ్వతంగా పాలించేలా బీసీ కులాలను అణిచివేతకు గురిచేస్తున్నారనడంలో సందేహం లేదు.

జనాభా లెక్కలలో ఎస్సీ ఎస్టీ కులాల వారీగా లెక్కలు తీయడం వల్ల వారికీ సరైన రిజర్వేషన్లు దక్కుతున్నాయి. బి సి కులాలవారీగా ఎలాంటి లెక్కలు లేకపోవడం వల్ల రిజర్వేషన్ల వాటా శాతం కోల్పోవాల్సి వస్తుందనేది ముమ్మాటికీ నిజం. అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. ఎన్నికల సమయంలో మాత్రమే సరి మేము గెలిస్తే బిసి లకు రాజ్యాధికారం ఇస్తామని మురిపించి ఓట్లు దండుకుంటున్నారు తప్ప బిసి లకు ఎలాంటి అధికారాలు ఇవ్వడం లేదు.

తెలంగాణలో బి సి లకు ప్రాధాన్యత కరువు:

 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేకమంది బి సి లు. తెలంగాణ వస్తే తమ ఆకాంక్షలు నెరవేరి, విద్య, వైద్య, ఉద్యోగం ఉపాధి, ఆర్థిక స్వావలంబన లభిస్తుందని, తమ హక్కులకు రక్షణ కలుగుతుందని భావించి ఉద్యమాన్ని ఉధృతం చేయడమే కాకుండా పోలీస్ లాఠీ దెబ్బలకు వెనుతిరగకుండా, ఆత్మబలిదానాలకు కూడా లెక్కచేయకుండా అమరులైనారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ రాష్ట్రం  సాధించుకున్నారు. అమరులంతా బీసీలే కావడం గమనార్హం. మృతుల కుటుంబాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం శోచనీయం. స్వరాష్ట్రం వస్తే తమకు సరైన న్యాయం జరుగుతుందని భావించిన బి సి లకు 2014 ఎలక్షన్ లో నాయకులు ఈసారి గెలిస్తే బి సి కుల గణన చేపడతామని హమిచ్చారు. కానీ నేటికీ హామీ నెరవేరలేదు. ఉద్యమానికి ఊపిరి గా నిలిచిన బి సి లకు ఎన్నికల్లో సరైన సీట్లు కేటాయించకుండా వివక్ష చూపింది. తొమ్మిదేండ్ల పాలనలో విసుగు చెందిన బి సి కుల సంఘాలు స్వాతంత్య్రం వచ్చి 75 యేండ్లు దాటిన ఇంకెన్నాళ్లు అర్ధ బానిసలుగా బ్రతకాలి అనే ప్రశ్నలు మేధావుల్లో, యువతలో తలెత్తుతున్నాయి. అంతర్గత వివక్షను వ్యతిరేకిస్తూ రాజ్యాంగం సూచించిన తమ హక్కుల పరిరక్షణ కోసం, పాలనలో సరైన వాటా కోసం,  సమిష్టి ఉద్యమాలు ఎంతైనా అవసరమని భావిస్తూ బి సి కుల సంఘాలన్నీ ఐక్యంగా, ఇక లక్ష్యంగా రాజకీయ ఉద్యమ వేదికలను ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.

పద్మశాలీయులకు రాజ్యాధికారంలో మొండిచేయి:

భారతదేశంలో ఎంతో గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న పద్మశాలీయులు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో సుమారు 2 కోట్ల 20 లక్షల మంది ఉన్నారు. పద్మశాలి సంఘం గణాంకాల ప్రకారం ఒక్క తెలంగాణలోనే 22 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇది అనధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. అధికారిక లెక్కల ప్రకారం 23 లక్షల మంది ఓటర్లు ఉంటారు. నేటికీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న పద్మశాలి రాజకీయంగా ఎదగలేక పోవడం బాధాకరం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సత్తా ఒక్క పద్మశాలికే ఉందంటే అతిశయోక్తి కాదు. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి నేతలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా అగ్రకుల నాయకుల ఎత్తుగడలకు   ముఖ్యమంత్రి కాలేకపోయారు. తర్వాత అగ్రవర్ణాల ఆధిపత్యం కోసం పద్మశాలీల కుల సంఘాలను విచ్చిన్నం చేసి వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప రాజకీయంగా ఎదగకుండా అణచివేశారు. ప్రత్యేక తెలంగాణ సాదించుకుంటే రాజకీయంగా ఎదుగుతామని భావించిన పద్మశాలీయులకు 9 ఏళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. పద్మశాలి వర్గంలో ఉన్న మేధావులు, విద్యావంతులు, యువకులు బానిస బ్రతుకు బ్రతికే కన్నా పోరాడితే పోయేది ఏమి లేదని రాజ్యాధికార సాధన కొరకు మరియు 2023 ఎలక్షన్ లో పద్మశాలీయుల సత్తా చాటడం కోసం కుల సంఘాల్లాంటిని ఒకే వేదిక గా నిలిచేందుకు   ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం ఈసారి అయినా అగ్రవర్ణాల నాయకులు పద్మశాలీయులను రాజకీయంగా ఎదగనిస్తారా లేదా అనేది ఎదురుచూడాల్సిన అవసరం ఉంది.

రజకులకు రాజ్యాధికారంలో మొండిచేయి:

తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమంలో ఇతర కుల వృత్తుల వారితో పాటు రజకులు కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రదర్శించి రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించారు. సభ్య సమాజానికి రజకులు చేసిన సేవలు మరువలేనివి. దేశ సేవకులైన రజకులను బానిసలుగా మార్చిన పాపం అగ్రకుల నాయకులదే. ఆటు రాజ్యాధికారంలోను, మిగతా అన్నింటిలో సరైన గుర్తింపు ఇవ్వకుండా వారిని కేవలం ఓటు బ్యాంకు గానే వినియోగించుకున్నారు తప్ప వారికి ఎలాంటి ప్రయోజనాత్మకమైన పథకాలు గానీ ప్రాధాన్యత గానీ ఇవ్వడంలేదు. ప్రతి రజకుడి ఇంటికి ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి యేండ్లు గడిచిన ఇప్పటికి పూర్తి స్థాయిలో అమలుకాలేదని రజక సంఘాలు వాపోతున్నాయి. ఎంతో కస్టపడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదని తమ హక్కుల పరిరక్షణ కొరకు రజక సంఘాలు కూడా రాజ్యాధికారం కోసం రాజకీయ యుద్ధ భేరీ సమావేశాలు నిర్వహించాలని కోరుకుంటున్నాయి. 2023 ఎలక్షన్ లో రాజ్యాధికార దిశ గా ముందుకు అడుగులువేయాలని భావిస్తున్నారు..

రాజ్యాధికారమే లక్ష్యంగా కుమ్మరివృతి సంఘాలు:

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్టాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులోనుండి తామేస్వయంగా మట్టితెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈరోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినాసరే వృత్తిపై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండడం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది. ఎంతో కళానైపుణ్యంతో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్సిల్వర్వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపులతో వెలవెల బోతోంది. కాలచక్రంతో పోటీపడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది ప్రభుత్వాల చేయూత లేక చేతి వృత్తులు కనుమరుగవుతుంటే కనీసం వారికి సరైన ఉపాధి హామీ కల్పించలేని పరిస్థితి. కుమ్మరి వృత్తికి ఎలాంటి పథకాలు లేకపోవడం శోచనీయం. కుమ్మరి వృత్తిదారులు మాకు అన్నిటిలోను అన్యాయమే జరిగిదంటూ మా హక్కులు మాకు కావాలంటూ రాజ్యాధికార దిశగా అడుగులువేస్తున్నారు. కుమ్మరి సంఘాలు ఏక తాటిపై నడవాలని భావిస్తున్నాయి.

రాజ్యాధికారమే లక్ష్యంగా గౌడ సంఘాలు:

నేడు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో లిక్కర్‌,బీర్‌, బ్రాంది, విస్కీ, రమ్ము, శీతల పానియాలు (థమ్స్ అప్, కోకోకొలా, స్పైట్‌, మాజా) అనేకం రావటం వలన కల్లు తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అందు ఫలితంగా దీనిపై ఆధారపడ్డ లక్షలాదిమంది గీతకార్మికుల బ్రతుకులు ప్రశ్నార్థకంగామారుతున్నాయి. అందుకు కారణం ప్రభుత్వమే. ఎందుకంటే ప్రైవేటు సంస్థలు శీతల పానీయాలమీద పత్రికలు,టీవీ లలో గుప్పించి ఆకట్టుకుంటుంటే ప్రభుత్వం మాత్రం కల్లు ఆరోగ్యానికి విధమైన మేలుచేస్తుందో ప్రజలకు అడ్వర్టైజ్మెంటుల  రూపంలో చెప్పకపోవడం ఇందుకు ముఖ్యకారణం అనే చెప్పాలి. నేటియువత మద్యానికిఇచ్చిన ప్రాధాన్యత కల్లుకు ఇవ్వక పోగా దానిని చులకన చేసి చూడటం అత్యంత బాధాకరమైన విషయం. అంతేగాక వ్యవసాయం వంటి ఇతర రంగాల్లో అభివృద్ధి సాదించినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా కల్లుగీత వృత్తిలో ఎలాంటి ఆధునిక పద్ధతులను, విధానాలను తీసుకురాకపోవడంతో వృత్తి దెబ్బతింటోంది.  ప్రభుత్వం పట్టించుకోనప్పటికీ గౌడన్న తన సంప్రదాయ వృత్తిని బ్రతికించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. కల్లుగీత కార్మికుల పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గౌడాన్న చెట్టుపైనుండి పడి చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల నష్ట పరిహారం అందచేయటం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ మేము బ్రతుకున్నపుడే  మంచి మార్గాన్ని చూపే పథకాలుంటే బాగుంటుంది అనే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 2023 ఎలక్షన్ లో రాజ్యాధికార దిశ గా ముందుకు అడుగులువేయాలని భావిస్తున్నారు..

తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న బీసీ కులాలు తమ అస్తిత్వాన్ని పక్కనపెట్టి ఎలాంటి స్వార్థం లేకుండా చిత్తశుద్ధితో ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను పట్టించుకోకుండా బీసీ వ్యతిరేక ధోరణి అవలంబిస్తూ వచ్చింది. బి సి లకు టిక్కెట్ల పంపకం లో కూడా పూర్తి వ్యతిరేకత చూపింది.

గుర్తింపు నోచుకోని నాయి బ్రాహ్మణుల వృత్తి:

2019 లో కరోనా మహమ్మారి ప్రభావంతో వృత్తినే నమ్ముకున్న నాయిల నాయీ బ్రాహ్మణుల జీవితం ఒక్కసారిగా దారితప్పినట్లైంది. హెయిర్ కటింగ్ సెలూన్ లకు గిరాకీ లు లేక తీవ్రమైన ఆర్ధిక సంక్షోభానికి గురై షాపులకు కిరాయిలు అద్దె మరియు కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా కార్పొరేట్, ఆన్ లైన్ లో సేవలపేరుతో "అర్బన్ క్లాప్" లాంటి పలు సంస్థలు ఉనికి లోకి రావడంతో వృత్తే జీవనం సాగించే సాధారణ నాయీ బ్రాహ్మణులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కులవృత్తులు కనుమరుగైపోయినా.. వీరు మాత్రం అచంచలమైన ధైర్యంతో వృత్తిని కాపాడుకుంటూనే ఉన్నారు. ఏదేమైనా కులవృత్తులనే నమ్ముకుని అరకొర సంపాదనతో సాధారణ జీవితాలను నెట్టుకొచ్చే బడుగు జీవులతోబడా కార్పోరేట్ సంస్థలు పోటీ పడి వారి నోటి ముందు కూడును లాక్కోవడం అత్యంత శోచనీయం. ఇతర వృత్తి రాక, వంశపారంపర్య వృత్తిపై మమకారం చంపుకోలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర మనోవేదనకు గురవుతుండగా కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర కుల వృత్తుల వారితో పాటు నాయీ బ్రాహ్మణులు కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపి రాష్ట్రాన్నిబంగారు తెలంగాణగా మారుస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానం ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సభ్య సమాజానికి నాయీ బ్రాహ్మణులు చేస్తున్న సేవలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి ఇక్కట్లను రూపుమాపేందుకు పటిష్టమైన ప్రణాలికను రూపొందించి ఆదుకోవాలని నాయీ బ్రాహ్మణులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.

మా ఓట్లు మా వాళ్ళకే, మా వాటా మాకే:

మా ఓట్లు మాకే, మా సీట్లు మాకే అనే నినాదంతో బీసీ సంఘాలన్నీ ఏకం కావడానికి సిద్ధపడుతున్నాయి.

అగ్రవర్ణాల ఆధిపత్యంతో అణచివేతకు గురవుతున్న బీసీలంతా ఒకే గొంతుకతో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పలు బీసీ సంఘాలు సంకేతాలిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో బీసీల సత్తా చాటేందుకు కులాల వారీగా రాజకీయ పోరుబాట పట్టే సంఘాలు ఇప్పటి నుంచే సమావేశమవుతున్నాయి. ఏదిఏమైనా బీసీ ప్రజలంతా ఒక్కటిగా ఉండి హక్కుల పరిరక్షణ కోసం పోరాడితేనే రాజ్యాధికారం దక్కుతుందనేది జగమెరిగిన సత్యం.

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే బీసీలకు రాజ్యాధికారం అంశం మరియు బీసీ కుల గణన విషయం తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారు. మళ్ళీ ఐదేండ్ల తర్వాత ఎదో ఒక ఆశ చూపి ఓట్లు దండుకుంటున్నారు.

ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కుల గణన ప్రక్రియను ప్రారంభించి బీసీలకు రాజ్యాధికారం అందించేలా కృషి చేయాలనీ ముక్తకంఠంతో దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలన్నీ కోరుకుంటున్నాయి.

 

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్
: 9391480475

5, ఆగస్టు 2023, శనివారం

స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా.

 స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా.


స్నేహం విలువ గురించి ఎంత చెప్పిన తక్కువే అనడంలో సందేహం లేదు. ఎందరో కవులు, వాగ్గేయకారులు అనేక భాషల్లో స్నేహం గురించి వందలాది పాటలు రాసిన కొన్ని మాత్రమే బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రజాదరణ పొందిన పాటల్లో తెలుగు పాటలు కూడా ఉండడం తెలుగు వారందరికీ గర్వకారణం. స్నేహం విలువను పాటల రూపంలో అద్భుతంగా చిత్రించిన గేయ రచయితలను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో మన తెలుగు తేజం బహు భాష కోవిదుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నా రే గారు రచించిన నిప్పులాంటిమనిషి చిత్రంలో స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..స్నేహమేరా నాకున్నది.. స్నేహమేరా పెన్నిధి అనే పాట అనే పాట పలు భాషల్లో సంచలనం సృష్టించింది. అంతేకాకుండా 1988 లో దర్శకుడు వి. మధుసూదనరావు గారి సమర్పణలో "ప్రాణ స్నేహితులు' సినిమాలోని గేయ రచయిత భువనచంద్ర గారు రాసిన "స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా" అనే పాట ప్రతి తెలుగువాడి హృదయాన్ని దోచుకుంది మరియు స్నేహితుల హృదయాలను దోచుకుంది. ఆ పాటలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోగలిగితే, ఎవరూ స్నేహాన్ని విడిచిపెట్టరు మరియు ప్రాణ స్నేహితులను మరచిపోరు.


అంతర్జాతీయ స్నేహ దినోత్సవం అనేది శాంతి సంస్కృతి విలువలు, వైఖరులు మరియు ప్రవర్తన సమితిగా నిర్వచిస్తూ, హింసను తిరస్కరించడం మరియు సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంతో వాటి మూల కారణాలను పరిష్కరించడం ద్వారా సంఘర్షణలను నిరోధించడానికి ప్రయత్నించే ప్రతిపాదనను అనుసరించే ఒక చొరవ. దీనిని 1997లో UN జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.


ప్రజలు, దేశాలు, సంస్కృతులు మరియు వ్యక్తుల మధ్య స్నేహం శాంతి ప్రయత్నాలను ప్రేరేపించ గలదని మరియు సమాజాల మధ్య వంతెనలను నిర్మించగలదనే ఆలోచనతో UN జనరల్ అసెంబ్లీ 2011లో అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ప్రకటించింది.


"స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల'


ప్రతి విద్యార్థి భవిష్యత్తు తాను చదివిన చదువుపై కంటే విద్యార్థి స్నేహం పైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. 100 పుస్తకాల కన్నా ఒక మంచి స్నేహితుడు మిన్న అనే నానుడి ఎప్పటికీ నిజమే. ఒక మంచి స్నేహితుడితో స్నేహం చేస్తే మంచి ఆలోచనలు మరియు మంచి నడవడిక, మంచి ప్రవర్తన యొక్క మార్గాన్ని అనుసరిస్తారు ఇది ముమ్మాటికీ నిజం. ప్రపంచంలో కులం, మతం, వయోపరిమితి, ప్రాంతీయ భేదం లేనిది ఏదైనా ఉందంటే అది స్నేహం మాత్రమే అని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో ధనిక మరియు పేదలను కలిపేది స్నేహం మాత్రమే. కులాలు, మతాలను కలిపేది స్నేహం ఒక్కటే.    


బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. స్నేహితులతో కలిసి ఉన్న ఆనందం వర్ణనాతీతం. అందుకే మంచి స్నేహాన్ని మించిన ఆస్తి లేదంటారు. మనిషికి ఎంత డబ్బున్న బాధలో ఉన్నప్పుడు సంతృప్తిని ఇవ్వలేవు, అదే ఒక మంచి స్నేహితుడు ఉంటే నీ బాధలన్నీ మరిపించి బాల్యాన్ని గుర్తు చేస్తూ బాధను మరిపించే ప్రయత్నం చేస్తాడు (స్నేహితుడు). 


మన జీవితంలో లక్షల, కోట్ల కన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహాన్ని జీవితాంతం కొనసాగించటం ఎంతో అవసరం.  స్నేహానికి ఎల్లలు, కులం, మతలుండవు. ఎటువంటి సమస్యనైనా స్నేహితుడితో పొరపొచ్చాలు లేకుండా చర్చించుకునే అవకాశం ఒక స్నేహితుడి దగ్గర  ఉంటుంది. అహానికి స్నేహం దగ్గర  చోటే ఉండదనడంలో అతిశయోక్తి లేదు. స్నేహంలో ఎక్కువ తక్కువ లుండవు. పేదవాడు గొప్ప ధనవంతునితో స్నేహంతో కలుపవచ్చు. మనం బాల్యంలో చేసిన అల్లరి అప్పుడప్పుడు గుర్తుచేసే మంచి హాస్యనటుడు కూడా స్నేహితుడే.


అప్పుడప్పుడు నేను స్కూల్లో స్నేహితులతో గడిపిన సంఘటనలన్నీ గుర్తుచేసుకొని నాకు నేను ఆనందిస్తాను అది తీపి జ్ఞాపకం. ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత స్నేహితుడు కనిపించిన క్షణం అపురూపంగా, ఆప్యాయతంగా పలకరిస్తే గతంలో మన బాల్యాన్ని గుర్తు చేస్తుంది

తెలిసీ తెలియక క్లాసురూం లో చేసిన అల్లరి గుర్తుచేసుకుంటూ నవ్వుకునే సందర్భం ఎంత హాయినిస్తుందో.


ఆ రోజుల్లో స్నేహితులతో ఆడుకున్న ఆటలు నేటికీ మదిలో పదిలం.


ఆ రోజుల్లో ఆదివారం అంటే మాకు ఆటల పండుగ. నేను ఆదివారం కోసం ఆతృతగా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి.


* ఖాళీ అగ్గిపెట్టెలను చించి స్నేహితులతో కలిసి పత్తాలాట ఆడిన సందర్భాలు ఓ మధుర జ్ఞాపకం.


* ఖాళీ సారా ప్యాకెట్లను బంతిలాగా  తయారుచేసి పుచ్చి బంతి ఆట ఆడిన క్షణం ఎంత సంతోషాన్నిచ్చేదో మాటల్లో చెప్పలేనిది, ఆ సంతోషం వెల కట్టలేనిది. 


*వడ్ల శేషయ్య ఇంటిదగ్గర సందులో స్నేహితులతో కలిసి ఆడిన గోళీలాట ఎంతో సంతోషాన్నిచ్చేది.


* జిల్లగోన ఆట, చింతగింజలతో దాడి ఆట, కోకో , కబడ్డీ , తొక్కుడుబిళ్ల , పిక్కలాట , వొంగుడు దూకుడు, ముక్కు గీసుడు, దాగుడు మూతలు, దొంగ పోలీస్, దూకుడు పుల్ల, ఉప్పు బేర, తాడట, తుడువు, పైసల్ కమ్ముడు, పైసలట, నీడలు తొక్కుడు, కూరంట బువ్వంట,

ఇలా ఎన్నో ఆటలు స్నేహితులతో కలిసి ఆడుకున్న సందర్భాలు అతి మధుర జ్ఞాపకాలు.


ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో వారు టీవీలు, మొబైల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు తప్ప స్నేహితులతో గడిపే వారు లేరు.


*  వేసవి కాలం వచ్చిందంటే స్నేహితులంతా కలిసి బావుల్లో ఈతకు వెళ్ళేవాళ్ళం

ఆ రోజుల్లో ఊరిలో బంధం బావి, చింతల బావి, మంగలి నారాయణ బావి, నర్సింహారెడ్డి బావి ఉండేవి. ఈ బావిలాల్లో ఈత కొట్టి ఎండాకాలం మొత్తం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన అంత ఆనందం రాదు. నాకు మా అన్నయ్యలకు ఈత నేర్పిన గురువులు ఆకారపు వీరయ్య, చాకలి సొక్కయ్య చాలా మంచి వ్యక్తులు మరియు మా నాన్నకు మంచి స్నేహితులు - సన్నిహితులు కూడా.


* కొన్ని సందర్భాలలో రేగుపళ్ళ కోసం , మామిడి పళ్ళ కోసం బావిలకడ తిరిగిన రోజులెన్నో . ఇంకా కొన్ని సందర్భాలలో దోస్తులతో కలిసి తుమ్మ చెట్లల్లో బంక తీసుకొచ్చి షాపులో ఇస్తే బెల్లం ఇచ్చేది అది తినుకుంటూ ఎంత సంతోషపడేదో మాటలతో చెప్పలేము అని అనుభవిస్తేగానీ స్నేహం తెలియదు.


* ఈత పండ్ల కోసం , సీతాఫలకాయలకోసం స్నేహితులతో కంచెలేమ్మటి చేన్ల ల తిరిగేది అప్పటి అనుభూతి ఓ ప్రపంచాన్నే తిరిగొచ్చాము అనేలా ఉండేది.


* శెనగకాయలు కాల్చుకొని తినేవాళ్ళము సీతాఫలాలు కూడా, ముంజ్జలకోసం గౌడల్లన్న తాళ్ల కాడికి పోయి తినేవాళ్ళం తాటి పళ్ళు వాటిలో ఉండే గేగులు తినేవాళ్ళం.


* రూపాయి ఇస్తే గంట సేపు సైకిల్ అద్దెకిచ్చేది బొలిశెట్టి భాస్కర్ క్రమేపి ఆకారపు ఎల్లయ్య (డబ్బా కొట్టు ఎల్లయ్య ) కూడా ఇచ్చేది. అల సైకిల్ అద్దెకి తీసుకొని సైకిల్ నేర్చుకున్న రోజులు అవి అప్పట్లో సైకిల్ తొక్కి ఊళ్ళో తిరిగితే బుల్లెట్ బండి మీద తిరిగినంత ఆనందం ఉండే.

  

కోట్లు పెట్టిన కొనలేని ఆనందాన్ని ఉచితంగా పొందే అవకాశం ఒక స్నేహానికి ఉంది.

దొరకని చోట స్నేహాన్ని వెతికే కన్నా దొరికిన చోట స్నేహాన్ని వదలకు మిత్రమా..


ప్రాణం ఉన్నంతవరకు మంచి స్నేహాన్ని మరువకు నేస్తమా!!  


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475 











22, జులై 2023, శనివారం

మట్టి మనిషి "భాను చందర్ చెలిమిళ్ళ"

మట్టి మనిషి "భాను చందర్ చెలిమిళ్ళ"

పూర్వం ప్రజలు వ్యవసాయం మరియు చేతి వృత్తుల పైనే ఆధారపడి జీవించేవారని మనందరికీ తెలుసు. మానవ నాగరికత పరిణామంలో విప్లవాత్మక మార్పుల ప్రక్రియలో, కొన్ని వృత్తులు కనుమరుగవుతున్నాయి మరియు వాటి స్థానంలో కొత్త పద్ధతులు కనుగొనబడుతున్నాయి. కనుమరుగవుతున్న చేతివృత్తులలో కుమ్మరి వృత్తి ఒకటి.
కుమ్మరి మట్టితో ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం పోసి మానవ జాతికి తొలి సాధనాన్ని అందించడమే కాక దానిని నిత్యావసర వస్తువుగా మార్చిన ఘనత కుమ్మరి కే దక్కుతుంది. గతంలో ఈ వృత్తి కి ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ నేడు ప్రాధాన్యత తగ్గిపోవడంతో కుమ్మరి వృత్తి ని వదిలి అనేక కుటుంబాలు ఇతర పనులు చేసుకుంటుండగా మరికొందరు కుమ్మరి వృత్తి నే నమ్ముకుని దిన దిన గండంగా బతుకీడుస్తున్నారు.

"మన్నును నమ్ముకున్నోడు ఏనాటికి చెడిపోడు" అనే నానుడి నిజం చేయాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ తన తాత, తండ్రి చేసే కుమ్మరి వృత్తినే వారసత్వ సంపదగా పుణికిపుచ్చుకుని నేర్చుకున్నాడు. కుమ్మరి వృత్తి అంతరించిపోతున్నప్పటికీ మన్ను నే నమ్ముకుని  వృత్తి ని బతికించడం కోసం బతుకీడుస్తున్న "భాను చందర్ ప్రజాపతి చెలిమిళ్ళ" నిజ జీవిత గాథ ఎందరికో ఆదర్శం.

జననం, విద్యాభ్యాసం:

హైదరాబాద్‌లోని చార్మినార్‌, రెయిన్‌ బజార్‌ కుమార్‌వాడి కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన చెలిమిళ్ళ యాదయ్య మరియు నర్సమ్మ దంపతులకు 23.05.1991 న జన్మించారు. తన చిన్ననాటి నుండి తండ్రి పడుతున్న కష్టాలు చూసి తండ్రికి సాయం చేస్తూ వృత్తిని నేర్చుకోగలిగాడు. భాను చందర్ పదేళ్ల వయసులో తండ్రి అనారోగ్య కారణాలతో ఏ పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కుటుంబ పోషణ కోసం ఆరో తరగతి మధ్యలోనే చదువు మానుకొని భాను చందర్ తన తండ్రి వృత్తిని అనుసరించడం ప్రారంభించాడు.

మానవజాతి మనుగడకు మట్టి కుండ మరువలేని సేవలందించింది.

మానవజాతి మనుగడకు మట్టి కుండ ఎంతో మేలు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. మనిషి పుట్టుక, చావు, దైవ కార్యాలకు కుండ ఎంత ఉపయోగమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మానవ జాతికి తొలి పనిముట్టును అందించడమే కాక జీవనానికి అత్యవసర నిత్యావసర వస్తువుగా సేవలందించిన మట్టి కుండ మాయమవుతుండటం బాధాకరమైన విషయం. ఎప్పుడైతే మార్కెట్లోకి ఫ్రిజ్ లు వచ్చాయో ఈ కుమ్మరి కుండలకు ఆదరణ గణనీయంగా తగ్గింది. ఫ్రిజ్‌లో నీటి కంటే మట్టి కుండల్లోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధకుల అభిప్రాయం. కానీ ఉరుకులు పరుగుల జీవితాలకు అలవాటు పడిన కొందరు కుండ వాడటానికి విముఖత చూపుతున్నారు. అంతేగాక ఇంటి పైకప్పు కోసం కూడా మట్టితో తయారు చేసిన పెంకులనే వాడేవారు. పెంకుటిళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండడం ఆ ఇళ్లలో నివసించే వారికి మాత్రమే తెలుస్తుంది. కాలక్రమేణా సిమెంట్ వాడకం పెరగడంతో గ్రామాల్లో సైతం పెంకుటిళ్ళు అంతరించిపోతున్నాయి.

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్లాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులో నుంచి తామే స్వయంగా మట్టి తెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈ రోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినా సరే వృత్తి పై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండటం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల పై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది.

ఎంతో కళానైపుణ్యం తో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్‌ సిల్వర్‌ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపుతో వెలవెల బోతోంది. కాలచక్రం తో పోటీ పడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది.

మట్టి కోసం ఎన్నో ప్రయత్నాలు:  

గతంలో ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు తప్పనిసరిగా ఉండేవి. ఆ రోజుల్లో కుమ్మరికి కుండ తయారీకి ఎలాంటి ఖర్చు లేకుండా గ్రామ సమీపంలోని చెరువుల్లో ఒండ్రుమట్టి దొరికేది. ఎండా కాలంలో చెరువుల నుంచి ఒండ్రుమట్టిని సేకరించి కుండను తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి, ఆ మట్టిని నీటితో తడిపి కాళ్లతో మట్టిని మెల్లగా తొక్కి ముద్దలుగా చేసి ఎంతో ఓపికతో కుండను తయారు చేస్తారు. ఆ తర్వాత కుండను కాల్చడానికి కూడా అనేక పద్ధతులు ఉపయోగిస్తారు. ఎంతో ఓర్పు మరియు నైపుణ్యం లేనిదే కుండ తయారు చేయడం అసాధ్యం. ఎంతో శ్రమకోర్చి తయారు చేసిన మట్టి కుండ మానవాళికి తొలి వస్తువుగా ఉపయోగపడడం గొప్ప విషయం.

కానీ నేడు ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురై మట్టి కోసం కుమ్మరి అల్లాడుతుండటం బాధాకరమైన విషయం. ఒకప్పుడు ఉచితంగా లభించే మట్టి నేడు అందుబాటులో లేదు. మరికొందరు సుదూర ప్రాంతాల నుంచి మట్టిని కొనుగోలు చేసి కుండలు తయారు చేసిన గిట్టుబాటు ధర లేక కుటుంబాన్ని పోషించుకోలేక కుమ్మరి వృత్తికి దూరమవుతున్నారు.

హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న భాను చందర్ ప్రజాపతి చెలిమిళ్ళ మాత్రం మట్టిని నమ్ముకుని, మట్టితోనే మమేకమై జీవిస్తున్న అరుదైన కళాకారుడు. జీవనోపాధికి మరెన్నో మార్గాలు కనిపించినా, తరతరాలుగా సంక్రమించిన కుమ్మరి వృత్తిని విడిచిపెట్టకుండా అదే తన జీవిత ధ్యేయంగా ఎంచుకున్నాడు. ఈ రోజున కూడా కుమ్మరి చక్రం తిరుగుతోందంటే, మట్టి కళ ఇంకా ఊపిరి పీలుస్తోందంటే, భాను చందర్ వంటి కళాభిమానుల అంకితభావమే అందుకు ప్రధాన కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

కుటుంబ పోషణ కోసం ఎన్నో కష్టాలు ఎదురైనా, ఆదాయం తక్కువైనా, మార్కెట్ అనుకూలించకపోయినా, ఆధునిక యంత్రాల పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఆయన అడుగు వెనక్కి వేయలేదు. "మట్టి బతికితేనే మనిషి ఆరోగ్యం బతుకుతుంది... కుమ్మరి బతికితేనే సంస్కృతి బతుకుతుంది" అనే విశ్వాసంతో నగరంలోని పాఠశాలలు, కళాశాలలు, సాంస్కృతిక వేదికలు, ప్రదర్శనల్లో ప్రత్యక్షంగా కుండల తయారీని ప్రదర్శిస్తూ మట్టి కుండ విశిష్టతను ప్రజలకు వివరిస్తున్నారు.

మట్టి కుండలో నిల్వ చేసిన నీరు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, మట్టి పాత్రల వినియోగం పర్యావరణానికి ఎంత మిత్రమో, ప్లాస్టిక్‌పై ఆధారపడటం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏమిటో ప్రతి ప్రదర్శనలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయన చేతులు కుండను మాత్రమే మలచడం లేదు; సమాజంలో పర్యావరణ స్పృహను, ఆరోగ్య చైతన్యాన్ని, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని కూడా మలుస్తున్నాయి.

ప్లాస్టిక్ వాడకం వద్దు. మట్టి కుండలు ముద్దు.

ప్రకృతిని ప్రేమించిన మనిషి నేడు ప్లాస్టిక్‌ను ప్రేమిస్తూ తన భవిష్యత్తును తానే ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. క్షణిక సౌకర్యం కోసం, చౌక ధర కోసం, ఆకర్షణీయమైన ఆకృతులు, కళ్లు చెదిరే రంగుల మోజులో పడి ప్రపంచమంతా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని విపరీతంగా పెంచుకుంది. కానీ ఆ సౌకర్యం వెనుక దాగి ఉన్న ప్రమాదం మాత్రం నిశ్శబ్దంగా మానవజాతిని వెంటాడుతోంది. ప్లాస్టిక్ కుళ్లదు... కానీ ప్రకృతిని కుళ్లిస్తుంది. అది కరగదు... కానీ మనిషి ఆరోగ్యాన్ని కరిగిస్తుంది. అది మట్టిలో కలవదు... కానీ మట్టినే కలుషితం చేస్తుంది.

నేడు విచక్షణారహితంగా పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం, రసాయనాల విచ్చలవిడి వాడకం భూమి, నీరు, గాలి అనే ప్రకృతి పంచభూతాలనే కలుషితం చేస్తున్నాయి. పశుపక్ష్యాదులు ప్రాణాలు కోల్పోతున్నాయి. నదులు, సముద్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. చివరికి ఈ కాలుష్యమే తిరిగి మన ఆహారంలోకి, మన తాగునీటిలోకి, మన శరీరంలోకి చేరి అనారోగ్యానికి కారణమవుతోంది. ఇలాగే కొనసాగితే భావితరాలకు పచ్చని ప్రకృతి కాదు... ప్లాస్టిక్ చెత్తతో నిండిన భూమే వారసత్వంగా మిగిలిపోతుంది.

ఒకప్పుడు మన పూర్వీకుల జీవితం ప్రకృతితో మమేకమై ఉండేది. మట్టి కుండల్లో వండిన ఆహారం, మట్టి పాత్రల్లో నిల్వ చేసిన ధాన్యం, మట్టి కుండలో చల్లబడిన నీరు వారి ఆరోగ్యానికి, ఆయుష్షుకు, ఆనందానికి మూలాధారం. మట్టి కుండలో నిల్వ చేసిన నీరు సహజసిద్ధంగా చల్లబడటమే కాదు, దాని సహజ గుణాలను కాపాడుతూ శరీరానికి మేలు చేస్తుంది. విద్యుత్ అవసరం లేదు... రసాయనాల అవసరం లేదు... ప్రకృతే శీతలీకరణ చేస్తుంది. ఇదే భారతీయ జీవన తత్వం. ఇదే ప్రకృతి ప్రసాదించిన వరం.

నేడు చల్లని నీటి కోసం ఫ్రిజ్‌లు, శుద్ధి కోసం యంత్రాలు, నిల్వ కోసం ప్లాస్టిక్ పాత్రలపై ఆధారపడుతున్న మనిషి, తన ఇంటి ముంగిట నిలిచిన మట్టి కుండ గొప్పతనాన్ని మరచిపోయాడు. ఒక మట్టి కుండ కొనడం అంటే ఒక కుమ్మరి కుటుంబానికి ఆశను కొనడం. ఒక సంప్రదాయానికి ఊపిరి పోయడం. ఒక చేతివృత్తిని కాపాడడం. ఒక పర్యావరణ ఉద్యమానికి చేయూత ఇవ్వడం.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం నేడు ఒక అలవాటు మాత్రమే కాదు. ఒక సామాజిక బాధ్యత. మట్టి పాత్రలను ప్రోత్సహించడం ఒక అభిరుచి మాత్రమే కాదు—భావితరాల భవిష్యత్తుకు మనం ఇచ్చే భరోసా. ప్రతి ఇంట్లో ఒక మట్టి కుండ ఉంటే విద్యుత్ ఆదా అవుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, పర్యావరణం పరిరక్షించబడుతుంది, కుమ్మరి కుటుంబం బతుకుతుంది.

ప్రకృతిని కాపాడాలంటే ప్లాస్టిక్‌కు దూరం కావాలి.
ఆరోగ్యాన్ని కాపాడాలంటే మట్టికి చేరువ కావాలి.
కుమ్మరి కళను కాపాడాలంటే మట్టి కుండను ఆదరించాలి.


కుమ్మరి వృత్తికి ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం అందించాలి.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ''స్వదేశీ ఉత్పత్తుల'' అభివృద్ధికి, గ్రామీణ వృత్తుల ఆధునికీకరణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో విఫలమైంది అనడంలో సందేహం లేదు. కుమ్మరి వృత్తి డిమాండ్ తగ్గడంతో గ్రామీణ వృత్తులపై ఆధారపడిన కార్మికులు ఈ వృత్తిని వదులుకుని పట్టణాలకు వలస వెళ్లి లేబర్ మార్కెట్‌లో రోజువారీ కూలీలుగా ఎక్కువ గంటలు పని చేస్తూ తక్కువ వేతనాలు పొందుతూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు.

భాను చందర్ ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అంతరించిపోతున్న జానపద కళలను, సంప్రదాయ చేతివృత్తులను సంరక్షించడం ప్రభుత్వాలు, సమాజం ఉమ్మడి బాధ్యత. తెలంగాణకు చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య తన జీవితాన్నంతా కిన్నెర కళ పరిరక్షణకు అంకితం చేసినందుకు భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం అభినందనీయం. అది ఒక వ్యక్తికి లభించిన గౌరవం మాత్రమే కాదు; అంతరించిపోతున్న ఓ జానపద కళకు దక్కిన జాతీయ గుర్తింపు.

అదే విధంగా శతాబ్దాల చరిత్రను, భారతీయ సంస్కృతి పరిమళాన్ని తన చేతి చక్రంపై సజీవంగా నిలబెడుతున్న కుమ్మరి కళాకారుల పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. కాలంతో పోరాడుతూ, మార్కెట్ సవాళ్లను ఎదుర్కొంటూ, మట్టినే నమ్ముకుని సంప్రదాయ వృత్తిని కొనసాగిస్తున్న వారి కృషి కూడా సముచిత గుర్తింపుకు అర్హమైనదే. ముఖ్యంగా భాను చందర్ ప్రజాపతి చెలిమిళ్ళ వంటి కళాకారులు మట్టి కుండల విశిష్టతను ప్రజలకు తెలియజేస్తూనే, అంతరించిపోతున్న కుమ్మరి కళకు ఊపిరి పోసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. వారి సేవలు కేవలం ఒక కుటుంబ జీవనోపాధికి పరిమితం కావు; మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే మహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి.

ఇలాంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పురస్కారాలతో సత్కరించడం, ఆర్థిక ప్రోత్సాహం అందించడం, వారి కళకు మార్కెట్ అవకాశాలు కల్పించడం, యువతకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం వంటి చర్యలు తీసుకుంటే అంతరించిపోతున్న కుమ్మరి వృత్తికి కొత్త ఊపిరి లభిస్తుంది. కళాకారుడిని గౌరవించడం అంటే ఒక వ్యక్తిని మాత్రమే కాదు—ఒక సంప్రదాయాన్ని, ఒక సంస్కృతిని, ఒక నాగరికతను గౌరవించినట్లే.

మట్టిని మూర్తిగా మలిచే చేతులు గౌరవింపబడితేనే మట్టి సంస్కృతి నిలుస్తుంది. కుమ్మరి చక్రం తిరిగితేనే సంప్రదాయం సజీవంగా ఉంటుంది. భాను చందర్ వంటి కళాకారులకు తగిన గుర్తింపు లభించడం వారి వ్యక్తిగత విజయమే కాదు—భారతీయ చేతివృత్తుల పునర్వైభవానికి నాంది అవుతుంది.

భాను చందర్ కళను వీక్షించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఆయన ప్రతిభను అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రశంసలు మాత్రమే కాదు, అలాంటి కళాకారులకు ఆచరణాత్మక ప్రోత్సాహం, ప్రభుత్వ గుర్తింపు, సమాజం నుంచి ఆదరణ కూడా లభించినప్పుడే ఈ అపురూపమైన కళకు శాశ్వత జీవం లభిస్తుంది.



వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

12, జులై 2023, బుధవారం

దైర్యసాహస వీరుడి కథ.

భగవంతుడు ఎలా ఉంటారో మనం చూడలేము, ఆపదలో మనకు సహాయం చేస్తారో లేదో తెలియదు కానీ, ఆపదలో మనకు సహాయం చేసే వారు భగవంతుని తో సమానం అనేది నిజం.

ప్రజలకు సహాయం చేయాలనుకునే వారికి డబ్బు అవసరం లేదు. మనసుంటే చాలు.

మనసుంటే మార్గాలెన్నో అన్నట్లుగా సాటి మనిషికి సాయం చేయాలనే మానవత్వం, తపన ఉంటే ఎలాగైనా చేయగలడు. సాటి మనిషికి సహాయం చేయలేని మనిషి జీవితం వ్యర్థం అనే విషయం అందరికి తెలిసిందే. అయినా సాటిమనిషికి సహాయం చేయలేని స్వార్ధపరులెందరో.

సాటి మనిషి చనిపోయే స్థితిలో ఉన్నా సహాయం చేయాలనే చలనం లేని వారెందరో. 

అత్యవసర పరిస్థితుల్లో, సాధారణంగా నగరాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో అంబులెన్స్‌లకు దారి ఇవ్వడం ద్వారా రోగి ప్రాణాలను రక్షించడం మనందరి కర్తవ్యం. కొన్ని సందర్భాల్లో అంబులెన్సుకు దారి ఇవ్వాలనే అవగాహన లేని వారి కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అంబులెన్స్ వాహనాలకు దారి ఇవ్వడం చాలా కష్టమైన పని. అలాంటి సందర్భాలలో ట్రాఫిక్ పోలీసులు మరియు మానవత్వం ఉన్నవారు ధైర్యసాహసాలతో  తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మార్గనిర్దేశం చేసే స్పూర్తిదాయకమైన ప్రాణదాతలు ఎందరో ఉన్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన 12 ఏళ్ల బాలుడు వెంకటేష్ అనే ధైర్య సాహస వీరుడి కథ.

వెంకటేష్ కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా హిరేరాయనకుంపి గ్రామానికి చెందినవాడు. హిరేరాయనకుంపేలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. వెంకటేష్‌కి స్నేహితులతో సరదాగా గడపడం అంటే చాలా ఇష్టం. వెంకటేష్ తన స్నేహితులతో కలిసి తరచూ హిరేరాయనకుంపి లోని వాగు పరిసర ప్రాంతాల్లో ఆదుకునేవాడు. అలా స్నేహితులతో కాలక్షేపం చేస్తూనే తల్లిదండ్రులకు సహాయపడుతుండేవాడు. ఆగస్టు 2019లో, వరదల కారణంగా వాగు పరిసర ప్రాంతాలు నీట మునిగి, నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న వంతెన నీట మునిగింది. యాద్గిర్ జిల్లా వడగెర తాలూకాలోని మాచనూర్ గ్రామానికి అంబులెన్స్ డ్రైవర్ ఆరుగురు పిల్లలతో పాటు మహిళ మృతదేహాన్ని తీసుకెళ్తున్నాడు. బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తున్న నీరు కారణంగా అంబులెన్స్ మునిగిపోయిన వంతెన వద్ద ఆగిపోయింది.డ్రైవర్ సహాయం కోసం సమీపంలో ఆడుకుంటున్న పిల్లల గుంపు ను పిలిపించి, వంతెనపై మార్గం సరైనదని తెలుసుకొని  అంబులెన్స్‌కు మార్గం చూపించమని అడిగాడు. అప్పుడు అక్కడున్న పిల్లలు ఎవరు ఆ సాహసం చేయమని చెప్పారు. వెంటనే వెంకటేష్ నేను దారి చూపిస్తాను అంటూ ధైర్యంగా ముందుకు వచ్చాడు. వెంకటేష్‌ స్నేహితులు అతడ్ని హెచ్చరించినా వినకుండా, డ్రైవర్‌ని అనుసరించమని కోరాడు. అంతటా పారుతున్న నీరు కారణంగా దారి కనిపించని పరిస్థితి, వెంకటేష్ బ్రిడ్జి పై తరుచుగా ఆడుకునే వాడు కావడం వల్ల బ్రిడ్జిపై దారి సులభంగా కనిపెట్టగలను అనే నమ్మకంతో ఆ డ్రైవర్ కి సూచనలిస్తూ మెడ లోతు ప్రవహిస్తున్న నీటిలో ముందుకు అడుగులేస్తూ సాహసోపేతమైన ధైర్యంతో అంబులెన్స్ కి మార్గనిర్దేశం చేయగలిగాడు. దారి చూపిన సాహస  వీరుడికి డ్రైవర్ కృతజ్ఞతాభావం తెలిపారు. 

అంతేకాకుండా వెంకటేష్ 10 ఏళ్ల వయసులో నది ప్రవాహం లో పడిపోయిన మహిళను రక్షించి ప్రాణాలు కాపాడాడు. అతి చిన్న వయసులోనే సాహసోపేతమైన విన్యాసాలు చేసినవారిని చూస్తుంటాము కానీ ప్రాణాలకు తెగించి ప్రాణాలను రక్షించే వారిని చూడటం అరుదు.   

ధైర్య సాహసాలకు "జాతీయ శౌర్య పురస్కారం":

వరదలున్న ప్రాంతంలో అంబులెన్స్‌కి మార్గనిర్దేశం చేయడం అంటే మామూలు విషయం కాదు అనే విషయం మనందరికీ తెలిసిందే. అంబులెన్స్ సజావుగా వెళ్లేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అంబులెన్స్ కి దారి ఇవ్వడం నిజంగా వెంకటేష్ ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అంబులెన్స్‌కు మార్గనిర్దేశం చేస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో పాటు బాలుడి ధైర్యసాహసాలు జాతీయ వార్తగా మారడమే కాకుండా, ప్రశంసలు వెల్లువెత్తాయి. 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా పిల్లలకు కేంద్ర ప్రభుత్వం సాహస పురస్కారాలను అందజేస్తోంది.

సహాయం, సాహసం చేయడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించిన వెంకటేష్ ని గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అతని ధైర్య సాహసాలకు గుర్తింపుగా 26 జనవరి 2020 , న్యూ ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ (ICCW) ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారి చేతులమీదుగా జాతీయ శౌర్య పురస్కారాన్ని అందజేశారు. 

బాలలకు ప్రదానం చేసిన సాహస పురస్కారాల అవార్డులు వారికి ప్రత్యేక గుర్తింపును తేవడమే కాకుండా వారి నైపుణ్యాన్ని వెలికితీస్తుంది. వారు సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు.  

విద్యార్థుల్లో మానవీయ విలువలు పెరిగేలా ప్రోత్సహించాలి.

పిల్లలలో ప్రతి ఒక్కరికి సృజనాత్మకత ఉంటుంది. వారికి సరైన ప్రోత్సాహం లభిస్తే సృజనాత్మకత మరింత పెరిగి అవధులు లేని ఆవిష్కరణలు చేస్తారు. పిల్లల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల శిక్షణ అవసరం. ప్రస్తుతం విద్యార్థి తన పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు పాఠ్యపుస్తకంలోని పాఠాలకే పరిమితమై, సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై అవగాహన ఉండటం లేదు. పాఠశాల స్థాయిలో, ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజంలో మానవతా విలువలపై సరైన అవగాహన కల్పించి, ఇతరులకు సహాయపడే కార్యక్రమాలను నిర్వహించాలి. అప్పుడే విద్యార్థుల్లో మానవీయ విలువలు పెరిగి నవ సమాజ నిర్మాణానికి పునాదులు పడతాయి. పిల్లలు వారికి తెలియకుండానే కొన్ని చెడు అలవాట్లకు గురవుతుంటారు అలా జరగకుండా వారిపై తల్లిదండ్రులు, గురువుల పర్యవేక్షణ తప్పనిసరి. తల్లిదండ్రులు పిల్లలలో ధైర్యాన్నిచ్చే సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కుటుంబ సమస్యలపై కాకుండా సమాజంలోని సమస్యలపై అవగాహన కల్పిస్తే పిల్లలలో సృజనాత్మకత పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలకు వెంకటేష్ లాంటి ధైర్య సాహస వీరుడి వంటి స్టోరీస్ తెలియజేయడం ద్వారా వారిలో కొంతైనా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విద్యార్థి ధైర్యసాహసాలు చేయడానికి వెనకడుగు వేయకుండా ముందుకు సాగేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలి.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475  

 





  

8, జులై 2023, శనివారం

పథకాలు పబ్లిసిటీ కోసమా ప్రజల కోసమా?

పథకాలు పబ్లిసిటీ కోసమా ప్రజల కోసమా?

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం, చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని పత్రికల్లో ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. కానీ వాస్తవంలోకి వస్తే చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు తప్ప మరో పథకం అందడం లేదన్నది ముమ్మాటికీ నిజం.

అత్యధిక ఓటర్లున్న పద్మశాలీలకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సరైన పథకాలు అందించి చేనేత కార్మికులను ఆదుకున్న పాపాన పోలేదు. "చెప్పుకొని మురువు చూసుకొని ఏడువు" నానుడి నేటికీ నిజం. మేధావులు మౌనం పాటిస్తే మూర్ఖులు రాజ్యమేలుతారు అన్నట్లుగా ప్రతిభావంతులు, తెలివైన పద్మశాలీల మౌనం వల్ల మానవతావాదం లేని వారు రాజ్యమేలుతున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాటు పడని నాయకుల వల్ల నేడు నేతన్నలు అత్యంత దయనీయ పరిస్థితి ని ఎదుర్కొంటున్నారన్నారు.

పద్మశాలి నుంచి ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ వారి ఎదుగుదల కోసమే తప్ప చేనేత కార్మికుల చేయూత కోసం కాదన్నది ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి తెలిసిన విషయం. నాయకులు ఎన్నికల సమయానికి ఓటు బ్యాంకు గా పద్మశాలీలను ఉపయోగించుకుంటున్నారు తప్ప వారికి  ఎలాంటి ఉపయోగకరమైన పథకాలు అందించకపోవడం శోచనీయం. పద్మశాలీల మౌనమే నేడు చేనేత కార్మికుల శాపంగా మారింది. ఇకనైనా చేనేత కార్మికుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది.

ఫలితాలు ఇవ్వని పథకాలు:

1 . చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం నూలు రాయితీ,  నేతన్నకు చేయూత తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గత కొన్ని నెలల క్రితం పేపర్లో వచ్చిన విషయం అందరికి తెలిసిందే. పేపర్ లో వచ్చే ప్రతి పథకం చేనేత కార్మికులకు అందుతుందని అనుకోవడం అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు. నేతన్న బీమా పథకం ప్రస్తుతం అమలులో ఉందో లేదో కూడా చేనేత కార్మికులకు తెలియదంటే దీనిబట్టి అర్థం చేసుకోవాలి పథకాలు పబ్లిసిటీ కోసమే తప్ప పబ్లిక్ కోసం కాదు అనేది.

2 . ముద్ర పథకం:

 పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికుల అభ్యున్నతికి ముద్ర రుణాలు  అందజేస్తున్నారు అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముద్ర లోన్ల ఊసే లేదు. ముద్ర లోన్లు ఉన్నాయన్న విషయం ప్రచారానికే పరిమితం అంతే తప్ప ఏ ఒక్కరు తీసుకున్నట్లు, ముద్ర లోన్స్ అమలులో ఉన్నట్లు కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అసలు ముద్రా రుణాలు ఉన్నాయా అనే సందేహం నెలకొంది.

3 . నేతన్న బీమా పథకం:

మరణించిన చేనేత కార్మికుల కుటుంబం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం "నేతన్న బీమా పథకం". ఏ కారణం చేతనైనా 18-59 సంవత్సరాల వయస్సు గల నేత కార్మికులు మరణిస్తే 10 రోజుల్లోగా నామినీకి ఎల్‌ఐసి నుండి 5 లక్షల బీమా పరిహారం అందించేలా పథకం రూపొందించబడింది. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 2022 ఆగస్టు 8 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి చేనేత కార్మికులు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ పథకాన్ని ప్రెవేశపెట్టినందుకు ఎంతో సంతోషించిన చేనేత కార్మికులకు ఈ పథకం అందని ద్రాక్షలాగే మిగిలింది. అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచి అనేక మంది చేనేత కార్మికులు మరణించగా, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు అందజేసినట్లు ఎక్కడ  సమాచారం లేదు. బ్రతికుండగా సరైన పథకాలు లేవు మరణించిన తర్వాత కూడా నేతన్న బీమా పథకం లేదు. ఈ పథకాన్ని ప్రారంభించి చేనేత కార్మికులకు నగదు అందజేయడంలో విఫలం కావడంతో చేనేత కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర కులాలకు ఇస్తున్నారు తప్ప చేనేత కార్మికులకు నేతన్న బీమా పథకం అందకపోవడం శోచనీయం.

4 . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఉచితంగా మగ్గాలు అందించిన మాట వాస్తవం. మరి మన రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఉచిత మగ్గాలు ఏవి? వాటి స్థానంలో ఇంకేమైనా ఇచ్చారా  అది లేదు.  అది చేస్తాం ఇది చేస్తాం అనడమే తప్ప ఏమి ప్రయోజనం లేదు.

5 . బీసీ కులాలందరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ఆశ చూపి చివరి దశలో 15 కులాలకు మాత్రమే వర్తిస్తుంది అని పేపర్ ప్రకటన చేయడం తీవ్ర బాధను కలిగించింది. ఈ పథకం కోసం ప్రతి చేనేత కార్మికుడు 4 రోజులు పని చెడగొట్టుకొని మండలం ఎం ఆర్ ఓ ఆఫీస్, మీ సేవల చుట్టూ తిరిగి అలసిపోయిన చేనేత కార్మికులు ప్రకటన చేయడం వరకే పరిమితమైన పథకాలు మాకొద్దు అంటూ చేతి వృత్తుల అభివృద్ధికి పాటు పడే ప్రభుత్వాన్ని ఈసారి ఎన్నుకుంటామని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు.. 

నేతన్నకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ముడిసరుకు కొనుగోలు చేసేందుకు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తోందని, దీంతో రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోందని గ్రామాల్లోని నేత కార్మికులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం. ప్రభుత్వాస్పత్రులు, పాఠశాలలో యూనిఫాం దుస్తుల కోసం చేనేత కార్మికులు నేసిన గుడ్డను ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.

50 సంవత్సరాలు పైబడిన ప్రతి చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్ 2000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం అతి కొద్దిమందికి ఇస్తూ మిగతా వారికి ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలో జి ఐ టాగ్ నమోదు కానీ చేనేత కార్మికులు ఎంతో మంది ఉన్నారు. వారికి జి ఐ టాగ్ లేనందున పెన్షన్ పొందలేకపోతున్నారు వారు జి ఐ టాగ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరం. 

అత్యధిక ఓటర్లు పద్మశాలీలకు నాయకులు ఎలక్షన్ సమయంలో ఎదో ఒక ఆశ చూపి ఓట్లు వేయించుకునుడు ప్రతి ఎలక్షన్స్ సమయంలో జరిగేదే. నాయకులు ప్రతిసారి పద్మశాలీలను మోసం చేయడం వారి ఓట్ల ద్వారా గెలుపొందడం ఆ తరువాత వారికి ఎలాంటి ప్రయోజనకరమైన పథకాలు ఇవ్వకపోవడం సిగ్గు చేటు. అంతేకాదు పద్మశాలీలు రాజకీయంగా ఎదగకుండా ఎలాంటి పదవి అవకాశాలు కల్పించకుండా అణిచివేతకు గురిచేస్తున్నారు. 

చేనేత కార్మికులందరూ ఐక్యతగా పోరాడి తమ హక్కులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి చేనేత కార్మికుడికి ఉంది.

ఇకనైనా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకొని అండగా నిలవాలి.


వ్యాసకర్త. 

జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం

ప్రధాన కార్యదర్శి 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475


   

5, జులై 2023, బుధవారం

డ్రైవర్ వృత్తి



సమాజంలో నేటికీ డ్రైవర్ల వృత్తి కూలీలగానే పరిగణించబడుతుంది. వారు చేసే పని ఎంతో విలువైనది అయినా వారికీ సరైన జీతం, సరైన వసతి, గౌరవం, గుర్తింపు లభించకపోవడం బాధాకరమైన విషయం. డ్రైవర్ వృత్తి ప్రపంచంలో చాలా ప్రధానమైనవి. వీరు రాత్రి, పగలనక అహర్నిశలు శ్రమించిన కష్టానికి ఫలితం అంతంత మాత్రమే. ఈ వృత్తుల వారు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతాయని అతి కొద్దిమందికి తెలుసు. సమాజంలో చాలా కొద్ది మంది మాత్రమే తమ శ్రమను గుర్తించి శ్రమకు తక్కువ గౌరవం ఇస్తున్నారు.


డ్రైవర్ వృత్తి గురుంచి తెలుసుకుందాం:


విలాసవంతమైన భవనాలు, కోట్ల ఖరీదైన కార్లు ఉన్నపటికీ గౌరవం కోసం కొందరైతే, కొందరు నడపగలిగే సామర్థ్యం ఓపిక లేక, నిత్యం బిజీ గా ఉండే రాజకీయ ప్రముఖులు, ఉన్నత అధికారులు ఎంతోమంది నెలవారీ జీతంతో డ్రైవర్లుగా నియమించుకుంటారు. డ్రైవర్ అంటే ఒక కూలివాడుగా పరిగణిస్తారు తప్ప వారి శ్రమను గుర్తించారు. డ్రైవర్ అంటే ఒక కూలివాడు అనుకునే వారికీ డ్రైవర్ అనే పదానికి అసలు నిర్వచనం తెలియదని కూడా గమనించాలి. సమయానికి మనందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే దేవుడే నిజమైన డ్రైవర్. డ్రైవర్ కంటి మీద కునుకు లేకుండా ఎంతో నిబద్ధతతో మనల్ని గమ్యస్థానానికి తీసుకెళతాడు. అనివార్యమైన సంఘటన ఏదైనా జరిగిన మన ప్రాణాలకంటే ముందు తన ప్రాణాలను వదలడానికైనా సిద్దపడి ముందుండి నడుపుతాడు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే మా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న వాస్తవాన్ని మరిచిపోయి వారిని ఒక కూలీగానే చూడటం శోచనీయం. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు వంటి అనేక డ్రైవర్ సంబంధిత ప్రమాదాలు కనురెప్పపాటులో జరిగే ఘోర ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాము. మన కుటుంబ క్షేమం కోసం డ్రైవర్ తన కుటుంబానికి దూరమై అవసరమైతే మనతోపాటే ప్రాణాలర్పించడానికి వెనుకాడని డ్రైవర్ వృత్తి ఎంత ప్రధానమైనదో ఒకేసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు వారికి సరైన ఆహారం, నిద్ర, సరైన జీతం, అన్ని వసతులు కల్పించే ప్రయత్నం చేయాలి. డ్రైవర్ అంటే మన కుటుంబ సభ్యుడిగా చూడాలి. మనం తినే ఆహారమే తనకు పెట్టాలి. అంతే తప్ప కూలివాడుగా చూడరాదు. మనం నిత్యం వార్తలలో చూస్తూనేవుంటాం బస్సు డ్రైవర్ గుండెపోటుతో మరణం అయినా ప్రయాణికులు సురక్షితమని లేదా ప్రమాదం నుండి రక్షించిన డ్రైవర్ అని ఇలా ఎన్నో వార్తలు వస్తుంటాయి. బస్సు, రైలు, విమాన ప్రయాణాల్లో మనం నిద్రపోయినా ప్రశాంతంగా ఉంటూ తమ కర్తవ్యాన్ని నిర్వహించడం వల్ల మనమంతా క్షేమంగా ప్రయాణించడం గొప్ప విషయం. వారికి తగిన గౌరవం ఇవ్వాలి. అంతేకాకుండా అంబులెన్స్ వాహన డ్రైవర్లు కూడా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంటారు. కానీ చివరకు కూలి డ్రైవర్ గానే చూస్తాం. అంబులెన్స్ డ్రైవర్ అతివేగంతో నడపడంతో తన ప్రాణాలకు కూడా ప్రమాదమని తెలిసినప్పటికీ మన ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా బ్రతికిస్తాడన్న కృతజ్ఞత భావం కలిగినవారు అతితక్కువ మంది ఉంటారు.


డ్రైవర్ మృతి పట్ల కృతజ్ఞత భావం తెలిపిన "జవేరి పూనావాలా":


కరోనా వాక్సిన్లలో ఒకటైన కోవిషిల్డ్ కంపెనీ అధినేత ఆధార్ పూనావాలా సోదరుడు జవేరి పూనావాలా దగ్గర కారు డ్రైవర్ గా 30 సంవత్సరాలుగా పనిచేసిన గంగాదత్త అంటే జవేరి పూనావాలాకు అమితమైన ప్రేమ అయన అతన్ని డ్రైవర్ కాకుండా సొంత తమ్ముడిగా చూసుకునేవారు. ఒకరోజు జవేరి పూనావాలా ముంబై పర్యటనలో ఉండగా పూణే లో గంగాదత్త అకాలమరణం పొందారన్న విషయం తెలిసింది. వెంటనే అన్ని పనులు రద్దుచేసుకొని హుటాహుటిన పూణెకి చేరుకొని అంతిమ యాత్ర జరిగే సమయంలో గంగాదత్త నడిపిన కారు ను పూలతో అలంకరించి దానిలో పార్థివ దేహాన్నుంచి గంగాదత్త అంతిమ యాత్రను అయన నివాసం నుండి శ్మశానవాటిక వరకు స్వయంగా తాను కారు నడుపుకుంటూ తీసుకెళ్లారు.

ఇదే విషయాన్నీ ఆయనతో ప్రస్తావించగా అయన విషణ్ణ వదనంతో " గంగాదత్త నాకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందించారు. అందుకు ప్రతిగా నా కృతజ్ఞతను ఈ విధంగా వ్యక్తపరుచుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్న" అని అన్నారు.


డ్రైవర్ల సమస్యలెన్నో:


డ్రైవర్లకు సరైన జీతం లేదు, వారానికోసారి సెలవు లేదు, వైద్య బీమా లేదు, ఇఎస్‌ఐ లేదు, పిఎఫ్ లేదు. డ్రైవర్ అకాల మరణం పొందితే ఆ కుటుంబానికి బీమా లేదు.

చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న డ్రైవర్ల శ్రమను గుర్తించి న్యాయమైన వేతనం ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. ఓలా, ఉబర్, ఇతర క్యాబ్‌లను అనుమతించడం వల్ల చిన్న వాహనాల డ్రైవర్లకు సరైన గిరాకీ లేక ఫైనాన్షియర్ల వేధింపులు, రవాణా, పోలీసు శాఖల్లో అవినీతి, వేధింపులు ఇలా అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించకపోవడం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం డ్రైవర్ల అభ్యున్నతికి తగిన చట్టాలు రూపొందించి డ్రైవర్లకు ఈఎస్ ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.




















 

2, జులై 2023, ఆదివారం

అంతరించి పోతున్న కుమ్మరివృతి 2

 అంతరించి పోతున్న కుమ్మరివృతి

మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన వృత్తి 'కుమ్మరి వృత్తి'.

మట్టితో మహత్తర ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం పోసింది కుమ్మరి.

మనిషి పుట్టుక, చావు, దైవ కార్యాలకు కుండ ఎంత ఉపయోగమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

మానవ జాతికి తొలి పనిముట్టును అందించడమే గాక జీవనానికి అత్యవసర నిత్యావసర వస్తువుగా తీర్చిదిద్దిన ఘనత కుమ్మరిది. పూర్వం మానవుడు మట్టిపాత్రలు మాత్రమే వాడి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాడు. మనిషి పుట్టుక మరియు చావు కుండలేనిదే పూర్తికాదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. పుట్టిన పురిటి బిడ్డకు పురుడు పోసేందుకు మరియు చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు సైతం కుండను వినియోగిస్తారు. ఇలా మనిషి మనుగడకు మట్టి పాత్రలు ప్రధాన పాత్ర పోషించాయని అనడంలో ఎలాంటి సందేహములేదు. మట్టిని కుండగా మలచడంలో నేర్పరితనం ఉంటుంది. సాధారణంగా అది అందరికి సాధ్యం కాదు.

కుండ చెప్పిన నీతి:

ఒకసారి కుండను ఎవరో అడిగారట...

నువ్వు పరిస్థితులతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితిలో అయినా చల్లగా (ప్రశాంతంగా) ఉంటావు కదా ! ఇది ఎలా సాధ్యం ! అని...

దానికి కుండ చెప్పిన సమాధానం మనను ఆలోచించేలా చేస్తుంది. తాను వచ్చింది మట్టిలో నుండి అని, మళ్ళీ తిరిగి వెళ్లి కలిసేది కూడా మట్టిలోనే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానని అంటూ మధ్యలో వచ్చే ఆవేశం, గర్వం, పొగరులాంటివి అవసరమా...! అని జవాబు ఇచ్చిందంట..

కుండ చెప్పిన నీతి ఎంత మధురం! అలా కుండ మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది.  

నాడు పెళ్లిళ్లు, దశ దిన కర్మలు, గ్రామాలలో జరుపుకునే బోనాలు, ఉగాది, జాతరలకు కుమ్మరులు తయారు చేసిన కుండలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, అన్నం వండుకోవటానికి (బువ్వ గిన్నె), నీళ్లు నిల్వచేయటానికి (గోలెం), నీళ్లు మరగపెట్టడానికి (కుండ), వస్తువులను భద్రపరచటానికి (గాదెలు), కూరాడు, ముంత, దీపపు ప్రమిదలు, కల్లు కుండలు, పెళ్ళిలో అయిరేని కుండలు,  గరిగ ముంత, రంజన్లు, మట్టి బొమ్మలు, పూల కుండీలు, నీళ్ళ బుంగలు, ఇంటి నిర్మాణం కోసం పెంకులు, డబ్బులను దాచుకునేందుకు గళ్ల గురిగిలను, వేసవి కాలంలో చల్లని నీటిని అందించే కూజాలను తయారు చేసేవారు. శుభ కార్యాలకు సైతం కుమ్మరి కుండలనే వాడుతుంటారు. కొంత మంది అనారోగ్యానికి గురైనప్పుడు సైతం కుమ్మరి కుండలనే వినియోగించేవారు. ఎందుకంటే అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో ఇవి ఎంతో దోహదపడుతుంటాయి. ఇలా మట్టి పాత్రలను అనేక విధాలుగా ఉపయోగించుకునేవారు. అతి సాధారణంగా కనిపించే ఒక కుండ తయారీ వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. ముందుగా చెరువుల్లో రేగడిమట్టిని తీసుకొచ్చి అందులో రాళ్లు లేకుండా జల్లెడ పట్టి ఇసుక మాదిరిగా తయారుచేస్తారు. ఎన్ని కుండలు చేయాలనుకున్నారో దానికి ఎంత మట్టి కావాలో అంత మట్టి ఒకదగ్గర పోసి అందులోకొన్ని నీళ్ళుకలిపి కాళ్లతో బాగా తొక్కి ముద్దలు ముద్దలుగా తయారుచేసుకుంటారు.  తరువాత ఆ మట్టి ముద్దలను కుమ్మరి చక్రంపై (సారె) పై చేర్చి పొడుగాటి కర్రతో గిరగిరా రెండు చేతులతో తిప్పుతూ మట్టిని చేతివేళ్ల తో నేర్పరితనం రంగరించి కావాల్సిన అకృతి వచ్చే వరకు మలిచి దానిని కొలిమిలో ఉంచి కాల్చుతారు.

ఎండాకాలంలో వేడి తీవ్రత నుండి ఉపశమనం పొందడానికి కుండలను ఎక్కువ వాడేవారు.

మట్టి కుండల్లోని నీరు త్రాగడంవలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

ఎప్పుడైతే మార్కెట్లోకి ప్రిజ్ లు వచ్చాయో ఈ కుమ్మరి కుండలకు ఆదరణ గణనీయంగా తగ్గింది. ఫ్రిజ్‌లో నీటి కంటే మట్టి కుండల్లోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధకుల అభిప్రాయం. కానీ ఉరుకులు పరుగుల జీవితాలకు అలవాటుపడిన కొందరు కుండ వాడటానికి విముఖత చూపుతున్నారు.

అంతేగాక ఇంటి పైకప్పు కోసం కూడా మట్టితో తయారుచేసిన పెంకులనే వాడేవారు. పెంకుటిళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండడం ఆ ఇళ్ళలో నివసించినవారికి మాత్రమే తెలుస్తుంది. కాలక్రమేణా సిమెంట్ వాడకం పెరగడంతో గ్రామాలలో సైతం పెంకుటిళ్ళుఅంతరించిపోతున్నాయి.

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్టాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులోనుండి తామేస్వయంగా మట్టితెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈరోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినాసరే వృత్తిపై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండడం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది.

కుండల ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం 'సిరామిక్ సిటీ' :

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఖుర్జా ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణీయమైన ప్రాంతం. అక్కడ తయారయే రంగు రంగుల కుండలు పర్యాటకులను ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఖుర్జా కుండలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని 'సిరామిక్ సిటీ' అని కూడా పిలుస్తారు, 

ఆధునిక సాంకేతిక అవసరం:

ప్రభుత్వం కుమ్మరి వృత్తిదారులకు నూతన ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చాల్సిన అవసరం ఎంతైనావుంది. లక్షలాది కుటుంబాలు ఈ వృతిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎప్పుడైతే మార్కెట్లోకి స్టీల్ వంటి పాత్రలు వచ్చాయో అప్పటినుండి వీరి జీవితాలు అగమ్యగోచరంగా తయారైంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వీరిపై ప్రత్యేక శ్రద్ధ చూపి, కుమ్మరి వృత్తికి కావాల్సిన బడ్జెట్ ని పెట్టాలి. అంతేకాకుండా కుండలు అమ్ముకోవడానికి సరైన మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించాలి. కుమ్మరి వృత్తి ని బలోపేతం చేయడానికి వారికీ ప్రత్యేకమైన వడ్డీలేని రుణాలను అందజేయాలి.  అంతరించిపోతున్న కుమ్మరి వృత్తిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

ఎంతో కళానైపుణ్యంతో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్‌ సిల్వర్‌ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపులతో వెలవెల బోతోంది. కాలచక్రంతో పోటీపడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది.


వ్యాసకర్త 

కోట దామోదర్

మొబైల్ : 9391480475

30, జూన్ 2023, శుక్రవారం

ambulance

కోట్ల రూపాయల ఆస్తులున్న ఆయుష్షును పెంచుకోలేమనేది జగమెరిగిన సత్యం. అందుకే మన పూర్వికులు ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యంలేదనడంలో అతిశయోక్తిలేదు.

"వైద్యో నారాయణో హరి" వైద్యుడు దేవుడితో సమానమని మనందరికీ తెలుసు. ప్రాణాపాయంలో ఉన్న వారిని రక్షించే వారు కూడా దేవుడితో సమానం అనడంలో సందేహం లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వెంటనే సరైన వైద్యం అందిస్తే బతికే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు మన దేశంలో తొలిసారిగా 1984లో అత్యవసర వైద్య సేవలు (అంబులెన్స్ సేవలు) ప్రారంభించారు.



25, జూన్ 2023, ఆదివారం

రాజారామ్ శాస్త్రి:

వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు

వృద్ధాప్యం మానవ జీవితంలోని దశలలో ఒకటి. ఈ వృద్ధాప్య దశలో మానవ శరీరం అనేక శారీరక మరియు మానసిక మార్పులకు లోనవుతుంది మరియు గత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. వృద్ధాప్యం అనేది అపారమైన అనుభవాలతో నిండిన జీవితం. వారు చెప్పే ప్రతి మాట నిజమని పెద్దలు అనుభవపూర్వకంగా చెబుతారు. అందుకే "పెద్దల మాట చద్దన్నం మూట" అనే నానుడి పుట్టింది.

మన దైనందిన జీవితంలో చాలామంది 60 యేండ్లు నిండకముందే అనేక వ్యాధులతో పోరాడుతూ వారి శరీరం ఏ పని చేయడానికి కూడా సహకరించలేనటువంటి పరిస్థితులను చూస్తూనే ఉంటాము. మానసిక స్థైర్యం మానసిక సమతుల్యత ను దెబ్బతీసి శారీరక, మానసిక సమస్యల తీవ్రతను పెంచడమే దీనికి కారణం. అంతేకాకుండా మానసిక స్థైర్యం ఉన్నవారు వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పని చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నవారు తారసపడుతుంటారు. బహుశా అలాంటి వారిని చూసే " వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు" అనే నానుడి పుట్టుకొచ్చిందనిపిస్తుంది. అలాంటి స్ఫూర్తిదాయకమైన 91 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు, వేద పండితులు రాజారామ్ శాస్త్రి యదార్ధ జీవిత కథ. 

జననం, విద్యాభ్యాసం:

సూర్యాపేట జిల్లాలోని మిర్యాల అనే మారుమూల గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో సుబ్బయ్య శాస్త్రి, లక్ష్మి భాగ్యమ్మ దంపతులకు 06-10-1932  న జన్మించారు.. అయన తండ్రి సుబ్బయ్య గారు ప్రముఖ వేదపండితులు. చుట్టుపక్కల గ్రామాలలో జరిగే శుభ కార్యాలన్నీ ఆయనే జరిపేవారు. రాజారామ్ శాస్త్రి గారు చదువుకునే రోజుల్లో పదవయేట అయన తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి తాను కూడా పురోహితం నేర్చుకొని తండ్రికి సహాయం అందించాలనే ఆలోచన కలిగింది. మొదటగా తన తండ్రి దగ్గర గాయత్రి మంత్ర శ్లోకాలతో ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే అన్ని కార్యాలను నిర్వహించే విధంగా వేద మంత్రాలు నేర్చుకోగలిగారు. గ్రామంలోని చిన్న చిన్న కార్యాలను నిర్వహిస్తూనే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. తీవ్రమైన ఏకాగ్రత, అంకితభావంతో చదువు ప్రారంభించి మంచి విద్యా ప్రతిభ ఉన్న విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు.

ఉద్యోగ ప్రస్థానం:

చదువుతోపాటు, పురోహితం లో మంచి నైపుణ్యం సంపాదించడమే గాక అయన 27 .04 .1954 న ప్రభుత్వ టీచర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొంతకాలం సూర్యాపేట మారుమూల గ్రామాలలో ఉద్యోగం చేసి బదిలీ అయిన తర్వాత గుమ్మడవెల్లి గ్రామానికి ప్రైమరీ స్కూల్ టీచర్ గా నియమితులైనారు. అప్పుడే గుమ్మడవెల్లి లో పాఠశాల ప్రారంభమైంది. అతి తక్కువ విద్యార్థులతో సాగుతున్న పాఠశాలకు రాజారాం సార్ రాకతో విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉపాధ్యాయులుగా విద్యార్థులకు పాఠాలే కాకుండా క్లాసురూం లో నవ్వులు పువ్వులు పూయించేవారు. ఆయన నోట పాఠాలే కాకుండా అప్పుడప్పుడు పాటలందుకునే  పాటల పూదోట రాజారామ్ శాస్త్రి. కచ్చితమైన సమయాన్ని పాటిస్తూ, మంత్రముగ్ధులను చేసే ఆయన బోధనకు ఆకర్షితులైన విద్యార్థులు ఆయన చెప్పే పాఠాలకు గైర్హాజర్ కారంటే అతిశయోక్తి కాదు. ఆయన బోధన తీరు ఓ అద్భుతం పాఠానికి తగ్గట్టుగా ఉదాహారణలతో బోధించేవారు. తన సబ్జెక్ట్ తెలుగు అయినప్పటికీ ఉపాధ్యాయుల కొరత కారణంగా ఇతర సబ్జెక్టులను కూడా బోధించేవారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజారామ్ శాస్త్రి గారు అందించిన శ్లాఘనీయమైన సేవలు గుమ్మడవెల్లి విద్యార్థులు ఎప్పటికి మరిచిపోలేనివి, మరుపురానివి. ఆయన వద్ద శిష్యరికం చేసిన విద్యార్థులంతా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. రాజారామ్ శాస్త్రి గారు 1990 సంవత్సరంలో గుమ్మడవెల్లి లో పదవి విరమణ పొందారు.

పురోహితం లో 80 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం: 

పదేళ్ల వయసులో తండ్రి వద్ద నేర్చుకున్న పురోహితం ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత కూడా జీవన ఉపాధి కోసం కొనసాగుతుండటం గొప్ప విషయం. అంతేకాదు 91 ఏళ్ల వయసులో 80 ఏళ్ల అర్చక అనుభవం కలిగి ఉండటం మరో గొప్ప విషయం. చుట్టుపక్కల గ్రామాల్లో పూజారులు లేకపోవడంతో ఆ గ్రామాల్లో జరిగే కార్యములన్నిటిని కూడా శాస్త్రి గారు నిర్వహిస్తారు. ఆయన చేతుల మీదుగా ఇప్పటి వరకు కొన్ని లక్షలకు పైగా వివాహాలు జరిగిపోయాయంటే అతిశయోక్తి కాదు.  గుమ్మడవెల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి పెళ్లి ఆయన చేతుల మీదుగా జరిగినవే. అంతేకాకుండా గుమ్మడవెల్లి లో ఉన్న ప్రతి కుటుంబంలో 1960 నాటి నుంచి ఇప్పటివరకు అన్ని కార్యాలు రాజారామ్ శాస్త్రి గారు నిర్వహిస్తుండటం ఒక సరికొత్త రికార్డు సృష్టించాడు. 91 ఏళ్ల వయసులో ఉన్న శాస్త్రి గారు ఇప్పటికీ స్వయంగా వంట, ఇంటి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు అన్నట్లుగా ఆయన ఇప్పటికి పూజలు నిర్వహించే కార్యక్రమాలలో వేద మంత్రాలు 2 గంటలకు పైగా ఆపకుండా చదివే శక్తి ఆయనకు ఉంది. జన్మనామం ప్రకారం భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయడంలో రాజారామ్ శాస్త్రి గారి తరువాతే ఎవరైనా కాబట్టి వాస్తు శాస్త్రం,జ్యోతిష్యం, ఆలస్య  వివాహాలు మరియు అనేక ఇతర సమస్యల పరిష్కారం కోసం పలు జిల్లాల నుంచి ప్రజలు అతనిని సంప్రదిస్తారు, ఇది అతని పనికి నిదర్శనం. ఆయన నిరుపేదల పట్ల దయ, కరుణ, ప్రేమ చూపే వ్యక్తి. అందుకే శాస్త్రి గారు పేదల కార్యక్రమాలకు వారి స్థాయికి తగ్గట్టుగా డబ్బులు తీసుకొని, కట్టలేని వారి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. పేదల పట్ల మానవత్వం చూపే గొప్ప మనసున్న వ్యక్తి. గుమ్మడవెల్లి గ్రామంలో జరిగే ప్రతి పండుగలో ప్రజలను మంత్రముగ్ధులను చేసే వేద మంత్రాలను పఠిస్తూ భక్తులకు వేద మంత్రాల అర్థాన్ని విపులంగా వివరిస్తారు. 

వయసు శరీరానికి కానీ, మనసుకు కాదు:

వయసు శరీరానికే కానీ మనసుకు కాదు అని చెప్పే వాళ్ళని మనం చూశాం కానీ, వయసు శరీరానికి దూరం అన్నట్లుగా రాజారాం శాస్త్రి దినచర్య అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వృద్ధాప్యాన్ని జీవితంలో అత్యంత నీచమైన దశగా భావించి అసలు వాస్తవాన్ని గుర్తించలేని వారికి శాస్త్రి జీవితం ఆదర్శప్రాయం. ప్రతి మనిషికి సమస్యలు రావడం సహజమే అనడంలో సందేహం లేదు. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ఆలోచనే ఉత్తమమైన మార్గమని కొద్ది మందికి తెలుసు. మనం నిత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలపై అనవసర ఆలోచనల వల్ల అనారోగ్యానికి గురి కావడం చూస్తూనే ఉన్నాం. ఒక సందర్భంలో శాస్త్రి గారిని తన ఆరోగ్య రహస్యం గురించి అడిగినప్పుడు, అతను ఇలా సమాధానమిచ్చాడు. ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొనే దైర్యం మనలో ఉంటె ఏ శక్తి ఆపలేదు. ధైర్యంతో ముందడుగు వేసినపుడే నువ్వు ప్రపంచాన్ని జయించి గలుగుతావు అని అన్నారు ఆయన. ఉద్యోగం రాక ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఆయన మనోధైర్యాన్ని అందిస్తారు. 91 సంవత్సరాల శాస్త్రి గారు ఇప్పటికి పాఠ్య పుస్తకం లోని అంశాల గురించి చాలా చక్కగా వివరించడం గొప్ప విషయం. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఆయన అందించిన శ్లాఘనీయమైన వైద్యసేవలు మరువలేనివి. జీవితంలో ఏదైనా సాధించాలంటే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన మార్గంలో ముందుకు సాగాలని, లక్ష్య సాధనకు ఎలాంటి అడ్డంకులు ఉండవనేది ముమ్మాటికీ నిజం. రాజారామ్ శాస్త్రి గారి నిజ జీవితం ఎందరికో ఆదర్శం.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475



      

11, జూన్ 2023, ఆదివారం

అవరోధాలే అవకాశాలు

 అవరోధాలే అవకాశాలు


"అవరోధాలను అవకాశాలుగా మార్చుకుంటే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు" స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఎప్పటికీ నిజమే.

మనిషికి వైకల్యం వున్నా మనసుకు మాత్రం వైకల్యం ఉండకూడదు అంటారు. మానసిక దృఢత్వం ఉన్నవారు శారీరక వైకల్యాలను అధిగమించడమే గాక ఉన్నత ఉద్యోగాలు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన అంధురాలు పూర్ణ సుందరి ఐ ఏ ఎస్ యదార్థ జీవిత కథ తెలుసుకుందాం.


తమిళనాడు రాష్ట్రం, మదురై జిల్లా, మణినగరం ప్రాంతానికి చెందిన పూర్ణ సుందరి. ఆమె తండ్రి ఓ సాధారణ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగి, తల్లి హోమ్ మేకర్, పూర్ణ సుందరి పుట్టుకతోనే అంధురాలిగా జన్మించలేదు. ఆమె 5 సంవత్సరాల వరకు సాధారణ పిల్లల్లాగే చదువుకుంది, కానీ ఆ తర్వాత అనూహ్య కారణాల వల్ల ఆమె కంటి చూపు క్షీణించడం ప్రారంభించింది. పూర్ణ సుందరి  తల్లిదండ్రులు ఆమె చూపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేక ఆమె 5 సంవత్సరాల వయసులోనే చూపును కోల్పోయింది . కూతురు చూపు కోల్పోవడం పట్ల ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

అంధకారం అలుముకున్న తమ కూతురి జీవితాన్ని చూసి తల్లిదండ్రులు రోదించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయినా తల్లిదండ్రులు మనోస్థైర్యం తో బిడ్డను ధైర్యంగా ప్రోత్సహించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. అంధత్వం తన కూతురి చదువుకు ఆటంకం కలగకూడదని కన్నతల్లే స్వయంగా పుస్తకాలు చదివి వినిపిస్తుండగా విషయాలను ఆకళింపు చేసుకునేది. ఆమె తల్లి ఆలోచనకు అభినందనీయం. పూర్ణ సుందరి స్కూల్ నుండి కాలేజీ వరకు ఎన్నో అవరోధాలను ఎదుర్కొంది. అవరోధాలే అవకాశాలుగా మార్చుకొని చదువులో ఫస్ట్ ర్యాంకులు సాదించింది. సగాయం IAS అధికారి మరియు మాజీ ఐ ఏ ఎస్ ఉదయ చంద్రన్ ప్రేరణ పొందిన ఆమె ఇంటర్మీడియట్ లో ఉండగానే ఐ ఏ ఎస్ కావాలనే ఆలోచనకు బీజం పడింది. తమ కూతురు సామర్థ్యాన్ని నమ్మి తల్లిదండ్రులు ఆమెను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించారు. అంతేకాకుండా తోటి స్నేహితులు కూడా చదువుల్లో ఆమెకు అర్థం కాని పాఠాలను ఆడియో ద్వారా అందజేసేవారు. తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయుల సహకారంతో డిగ్రీ పూర్తి చేయగలిగింది. అయినప్పటికీ ఆమెకు ఐ ఏ ఎస్ కావాలనే కోరిక ప్రబలంగా ఉండేది. తన కలలను సహకారం చేసుకునేందుకు ఆమె మొదటి ప్రయత్నం చేసి UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయినా కూడా కలత చెందకుండా పూర్ణ సుందరి కఠినమైన ప్రయత్నంతో రెండోసారి కూడా విజయం సాధించలేకపోయింది. అయినా ఆమె పట్టుదలతో తన ఆకాంక్షను నెరవేర్చేందుకు మూడోసారి కూడా ప్రయత్నించి ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అంతటితో తన ప్రయత్నం ఆపకుండా తాను ప్రిపేర్ అయ్యే విధానంలో లోపాలు గమనించి లోతుపాతులు తెలుసుకొని తనకు తెలియని అంశాలను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటూ,అంతేకాక కంప్యూటర్ నుండి చదవడానికి ఆమె అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ (JAWS) సాఫ్ట్ వెర్ ఉపయోగించేది. కూతురిపై ఉన్న నమ్మకంతో ఎన్ని ప్రయాసలనైనా ఎదుర్కొని ఆమె కోరుకున్న పుస్తకాలను తండ్రి అందజేసేవారు. బ్రెయిలీ లిపి లో లేని పుస్తకాలను ఆమె తల్లి మరియు స్నేహితులు గంటల తరబడి వివిధ పుస్తకాలు చదివి వినిపించేవారు. యూట్యూబ్ లో లభించే ఆడియో పాఠాల సహాయంతో కఠోర దీక్షతో, నిరంతర కృషితో నాలుగోసారి ఉత్తీర్ణత సాధించగలిగింది. ఈ మహోత్కృష్ట యజ్ఞంలో ఆమెకు వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రుల కృషి అత్యంత శ్లాఘనీయం.  
   
అంధత్వంతో బాధపడుతున్నా చదువుకునేందుకు ఆటంకం కాదని అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుంటున్నారు. నేటి యువతకు సౌకర్యాలు ఉన్నా అందుబాటులో లేని వనరుల గురించి ఆలోచిస్తూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దైనందిన జీవితంలో సమస్యలు అందరికీ సాధారణమే అయినా వాటిని ఎదుర్కొనే శక్తి ఉన్నవారికే విజయం వరిస్తుందనడంలో అతిశయోక్తిలేదు.

అంధత్వం కారణంగా చాలా మంది ప్రతిభావంతులైన ఔత్సాహికులకు సివిల్ సర్వీసెస్‌లో చేరే అవకాశం లేకపోవడంతో గతంలో వారి కలలు సాకారం చేసుకునేందుకు అవకాశం లేదు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక చొరవ చూపి వంద శాతం అంధత్వం గలవారికి సివిల్ సర్వీసులో చేరే అవకాశాన్ని కల్పించడం కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో అంధుల కలలు సాకారమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

ఎన్నో అవరోధాలను అధిగమించి అంకుఠిత దీక్షతో విజయాన్ని సాధించిన పూర్ణ సుందరి ఐ ఏ ఎస్ నేటి అంగవికలురు యువతకు అద్భుత సందేశాన్ని అందించారు. అసాధ్యాలను సుసాధ్యం చేయాలంటే అంగవికలురు స్వీయం సానుభూతిని పక్కన పెట్టి అడ్డంకులను  అధిగమించాలి తప్ప అడ్డంకులు వచ్చాయని ఆగిపోయే ప్రయత్నం చేయకూడని, అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆశయ సాధనకు ప్రణాళిక రూపొందించుకోవాలి.

సామాన్య విద్యార్థులతో సమానంగా అంధులకు మెరుగైన విద్యనందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. అంతేకాకుండా, వారి విద్యకు తగిన బ్రెయిలీ పుస్తకాలు మరియు ఆడియో పాఠాలు అందుబాటులో ఉంచాలి. అంధుల విద్య బలోపేతానికి ప్రత్యేక బడ్జెట్ ని ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంధుల విద్య కోసం ప్రతి రాష్ట్రంలోనూ, జిల్లాలో ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి.

జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అవరోధాలుగా భావిస్తూ...

కొందరు ఉన్న చోటే ఉంటారు, అంటే ముందుకు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకుంటారు.

మరియు కొందరు వాటిని నివారించడానికి ప్రయత్నిస్తున్నారు.

కొంతమంది ఆ అడ్డంకిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు.

అధిగమించేవారు అవకాశాలను ఎదుర్కొంటారు, వారు అనుభవ సామర్థ్యాలతో నిండి ఉంటారు, ఈ ప్రక్రియలో వారు అనేక విలువలను అలవరచుకుంటారు, నైపుణ్యాలను నేర్చుకుంటారు, జీవిత విలువను తెలుసుకుంటారు మరియు ఇతరులకు మార్గనిర్దేశం చేసే దాతృత్వాన్ని పొందుతారు.


వ్యాసకర్త / జె సి ఐ వి సంఘం ప్రధాన కార్యదర్శి
కోట దామోదర్
మొబైల్ : 9391480475


7, జూన్ 2023, బుధవారం

గౌరవనీయులైన జౌళి శాఖ మంత్రి కే టి ఆర్ గారికి,

జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం - తెలంగాణ 


గౌరవనీయులైన జౌళి శాఖ మంత్రి కే టి ఆర్ గారికి, 

జౌళి శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా.


విషయం: ఇతర వృత్తి పని వారితో పాటు చేనేత పని వారికి కూడా లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయగలరని విజ్ఞప్తి.

తెలంగాణలో వివిధ కుల వృత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న వృత్తి పనివారి జీవన ప్రమాణాల పెంపు కోసం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రేవు గారి ఆలోచన మేరకు అల్పాదాయ వర్గాలకు చెందిన వృత్తి పని వారికి పూర్తి సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం అభినందనీయం. 

మన దేశంలో వ్యవసాయరంగం తరువాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగం. ఎన్నో  వ్యయప్రయాసలకోర్చి లాభసాటి కాకపోయినప్పటికీ, తరతరాలుగా మగ్గాలనే నమ్ముకుని తమ కుల వృత్తిని ఎంతో  నిబద్ధతతో నిర్వహిస్తున్న చేనేత కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రాకపోవడం శోచనీయం. చేనేత కళాకారులు అత్యధికంగా ఉండే సిరిసిల్ల నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మీకు వారి వెతల గురించి వివరించడమంటే “మేనమామ కు అమ్మమ్మ గురించి చెప్పడం” లాంటిదే. 

మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని అందించిన నేతన్నల పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ ప్రముఖ సినీ గేయ రచయిత “జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా - చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు” అని వాపోయారు. దురదృష్టవశాత్తూ నేతన్నల పరిస్థితి నేటికీ ఏమాత్రం భిన్నంగా లేదన్న విషయం మీకు తెలియంది కాదు.    మానవాళికి వస్త్రాన్ని అందించిన రెక్కాడితే కానీ డొక్కాడని నేతన్నల బతుకు కరోనా మహమ్మారి కారణంగా పూర్తిగా ఛిద్రమైంది. మువ్వన్నెల జెండా నేసిన చేనేత జీవితం, అగ్గిపెట్టెలో ఇమిడే ఆరడుగుల చీరను ఎంతో నైపుణ్యంతో నేసిన చేనేత కళాకారుల జీవితాలు కన్నీళ్ల కలబోత అయ్యింది. ఈ రంగంలో కాలానుగుణంగా యాంత్రీకరణతో పాటు పెను  మార్పులు వస్తున్నా చేనేత కార్మికుల ఆకలి తీరడం లేదు. భారత దేశంలోనే అత్యధిక ఓటర్లుగా ఉన్న పద్మశాలీలకు  ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం అందని ద్రాక్షగా మిగలడం బాధాకరమైన విషయం. 

సహృదయులు మరియు మానవతకు మారు పేరైన మీరు ఆకలితో అలమటిస్తున్న చేనేతల కుటుంబాలకు సానుభూతితో ఇతర కుల వృత్తి పని వారితో సమానంగా గుర్తించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల ఆర్ధిక సహాయం వర్తింపచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రతి చేనేత కుటుంబాన్ని ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి అండగా ఉండి వారికి చేతినిండా పని, కడుపు నిండా తిండి, వంటి నిండా బట్ట కల్పించాలని యావత్ తెలంగాణ చేనేత కళాకారుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తున్నాము. 

భవదీయ, 

ప్రధాన కార్యదర్శి 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475




జీవితం ఆశ-నిరాశల సంగమం:

  జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...