14, నవంబర్ 2022, సోమవారం

వింతలెన్నో చూడ రండి




ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, అంతుపట్టలేని వింతలు, విశేషాలు ఉన్నాయి. మానవుడికి ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి అబ్బుర పరిచే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా చూస్తేగానీ నమ్మలేని అద్భుతాలెన్నింటినో పరిశోధనలు చేసినప్పటికీ కూడా శాస్త్రజ్ఞులు సరైన ఆధారాలు కనిపెట్టలేకపోతున్నారు . 

విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఒకరోజు చెట్టు నుంచి రాలిన ఆపిల్ ను గమనించి, ఆపిల్ క్రింద పడటానికి గల కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా పనిచేస్తుందో వివరిస్తూ  విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదిస్తూ, గమన సూత్రాలను నిర్వచించాడు. 

ఒక వస్తువును పైకివిసిరినపుడు తిరిగి ఆ వస్తువు కిందకు పడటానికి కారణం భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండటంవల్లనే అని మనం చిన్నపుడు పాఠ్యపుస్తకాలల్లో చదువుకున్నాం.

కానీ పైకి విసిరిన వస్తువు కిందపడకుండా ఉండటం సాధ్యమేనా? అనే సందేహం చాలా మందికి కలగడం సహజమే ..

గురుత్వాకర్షణ శక్తి ధిక్కరించిన చోట పైకి విసిరిన వస్తువు కిందపడకుండా ఉండటం సాధ్యమే అని చెప్పొచ్చు. ఈ భూగోళం అంతా  గురుత్వాకర్షణ శక్తి కలిగివుందని మనకు తెలుసు. కానీ  ప్రపంచంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయని ప్రదేశాల గురుంచి మాత్రం చాలా మందికి తెలియదు


ప్రపంచంలో కేవలం ప్రదేశాలలోమాత్రమే గురుత్వాకర్షణ శక్తి  పనిచేయదని తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగక మానదు.


 1 . మాగ్నెటిక్ హిల్, లేహ్, లడక్, ఇండియా (Magnetic Hill, Leh Ladakh, India)

భారత దేశంలోని, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం, లేహ్ జిల్లాకి 30 కిలోమీటర్ల దూరంలో గల ప్రదేశాలు సుందర మనోహరమైన దృశ్యాలతో పర్యాటకులనుఆకర్షిస్తాయి. అటువంటి అద్భుతమైనఆకర్షణలలో “మాగ్నెటిక్ హిల్” (అయస్కాంత కొండ)ఒకటి. ఇది సముద్రమట్టం కంటే 14,000 అడుగుల ఎత్తులో ట్రాన్స్-హిమాలయన్ ప్రాంతంలో లేహ్-కార్గిల్-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉంది. మాగ్నెటిక్ హిల్ తూర్పున సింధు నది ప్రవహిస్తుంది. మాగ్నెటిక్ హిల్ ప్రాంతం చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసిన ఒక పసుపు రంగు సైన్ బోర్డు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది.  "అయస్కాంత కొండ, గురుత్వాకర్షణను ధిక్కరించే దృగ్విషయం. మీ వాహనాన్ని రోడ్డుపై తెల్లటి పెయింట్‌తో గుర్తు పెట్టబడిన పెట్టెలో పార్క్ చేయండి" అని రాయబడి ఉంటుంది. ఈ ప్రాంతంలో మోటారు వాహనాల ఇంజన్లు ఆపేసినా సరే అవి కొండ వైపు గంటకి ఇరవై కిలోమీటర్ల వేగంతో సాగిపోతుంటాయి.. ఈ ప్రాంతం యొక్క లేఅవుట్ మరియు చుట్టుపక్కల వాలులు కొండ యొక్క ఆప్టికల్ భ్రమను సృష్టిస్తాయి. కొండ రహదారి నిజానికి లోతువైపు ఉన్న రహదారి. కొండ రహదారిపై ఉన్న వస్తువులు మరియు కార్లు నిజానికి లోతువైపుకు దొర్లుతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తికి ధిక్కరించి ఎత్తుపైకి దొర్లినట్లు కనిపిస్తాయి. అలా వెనక్కి ఎందుకు వెళ్తున్నాయో ఎవ్వరికి అర్ధంకాని వింత. ఇటుగా వచ్చే టూరిస్టులు మాత్రం విచిత్రమైన ఈ అయస్కాంత కొండని చూసి అబ్బురపడుతుంటారు.ఈ కొండ సమీపంలోకి రాగానే హెలికాప్టర్ల వేగంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయని అంటారు. జూలై మరియు అక్టోబర్నెలలు ఈ మాగ్నెటిక్ హిల్ సందర్శించడానికి అనువైన సమయం.

సిద్ధాంతాల ప్రకారం:

ఈ కొండకి అయస్కాంత శక్తి  ఉండటంవల్ల ఇలా జరుగుతుందని కొందరి నమ్మకం, మరి కొందరు మాత్రం ఈ కొండ ప్రాంతంలో కంటికి కనిపించని అదృశ్యశక్తులు ఉన్నాయని, మరికొందరు మాత్రం ఆప్టికల్ ఇల్యూషన్ ( దృశ్య భ్రమ) అని . ఇది చుట్టుపక్కల భూమి యొక్క లేఅవుట్ ఆప్టికల్ భ్రమను ఉత్పత్తి చేసే ప్రదేశం , ఇది కొంచెం లోతువైపు వాలుగా కనిపిస్తుంది. ఎత్తుపైకి వాలు. అందువల్ల, గేర్‌ వదిలివేయబడిన కారు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి దొర్లుతున్నట్లు కనిపిస్తుందని అంటుంటారు.

2 . సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ (Saint Ignace Mystery Spot, Michigan, USA).

 అమెరికా, మిచిగాన్ లోని సెయింట్ ఇగ్నాస్ ప్రాంతంలో మిస్టరీ స్పాట్‌ గొప్ప టూరిస్టు కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. మొదటగా ఈ ప్రాంతంయొక్క ప్రత్యకతలను ఎవరు గుర్తించలేకపోయారు.
1939 లో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా కొందరు సర్వేయర్లు మిస్టరీ స్పాట్‌ ప్రత్యేకతలని గుర్తించారు. సర్వేయర్లు మొట్టమొదటి సారిగా సెయింట్ ఇగ్నాస్ వచ్చినప్పుడు వారిదగ్గరున్న పరికరాలన్నీ పనిచేయకుండా స్తంభించి పోయాయి.  సర్వేయర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు పరికరాలన్నీ ఒకేసారి నిలిచిపోవడానికి గల కారణాలేంటి అని తెలుసుకోవడానికి పరిశోధనలు చేయగా  ఆ ప్రాంతంలోని కేవలం300 అడుగుల డయామీటర్ సర్కిల్ లో మాత్రమే ఇలా జరుగుతుందని తేలింది. . ఈ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల ఎత్తులు ఒకే విధంగా ఉంటారని. ఆ ఇద్దరూ వేర్వేరు సైజులో ఉన్నా... అక్కడి ఓ రాయి ఎక్కి... అటూ ఇటూ మారగానే ఇద్దరి సైజూ ఒకేలా ఉంటారని. అంతేకాదు... మనిషి గోడపై వాలుగా నిలబడటం అసాధ్యం కానీ అక్కడి గోడలపై వాలుగా నిల్చోవచ్చు. అయినా కింద పడరు. మిస్టరీ స్పాట్ ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వందల వేల మంది సందర్శకులను ఆశ్చర్యపరుస్తూ మరియు కలవరపరుస్తోంది. శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాలు చేసిన తరువాత ఆప్టికల్ ఇల్యూషన్ (దృశ్య భ్రమ) తప్ప మరొకటి లేదని చెప్పడమే గానీ కచ్చితమైన కారణాలు చెప్పలేకపోడవం మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

3 . మిస్టరీ స్పాట్, శాంతాక్రజ్, కాలిఫోర్నియా (Mystery Spot, Santa Cruz, California)

 ఇది సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ లాంటిదే. అమెరికా, కాలిఫోర్నియా రాష్ట్రంలోని. శాంతాక్రజ్ సమీపంలో ఉన్న ఓ అడవి ప్రాంతంలో ఎన్నో వింతలు, విశేషాలు కలిగిన అద్భుతమైన చిన్న ప్రాంతం అది కేవలం 150 అడుగుల వ్యాసార్థం కలిగిన ప్రదేశం. ఆ ప్రాంతంలో ఉన్నవారు పక్కకు వంగగలరు. వంకరగా నడవగలరు. వాళ్లు ఓ కొండను వాలుగా ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది. చాలా మంది టూరిస్టులు ఆ ప్రదేశానికి తరచూ వెళ్తుంటారు. ఎందుకంటే. ఎన్నిసార్లు చూసినా గానీ ఆ మిస్టరీ ఏంటో అర్థం కాదు. శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఇలా జరగడానికి ముఖ్య కారణం ఆప్టికల్ ఇల్యూషన్ వలనే అనిచెపుతున్నారు కానీ  కచ్చితమైన కారణం ఏంటన్నది తెలియట్లేదు.. ఈ అరుదైన ప్రాంతానికి పర్యాటకుల సందడి ఎక్కువ.   

 4  . జలపాతం, ఫారో ఐలాండ్స్ (Waterfall, Faroe Islands)

స్కాట్లాండ్, ఐలాండ్ మధ్యన అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవుల్లో ఉన్న జలపాతం ఇది.
సాధారణంగా జలపాతంలోని నీరు పైభాగం నుండి కిందకు పడటం సహజం. ఇక్కడమాత్రం  నీరు కిందకు కాకుండా పైకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ గాలి కింద నుంచి పైకి ఎక్కువ వీస్తుండటం వల్లే ఇలా జరుగుతుందని కొందరంటుంటే  మరి కొందరు మాత్రం  జలపాతం నుంచి వచ్చే నీటిని గాలి పైకి పంపేస్తోంది గంటకు 75 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బలమైన గాలి వీయడం అటువంటి దృగ్విషయాలకు కారణమవుతుంది అని నిపుణులు చెప్తున్నారు.

5  . హూవర్ డ్యామ్, నెవాడా, అమెరికా (Hoover Dam, Nevada, USA)

ఈ డామ్ అమెరికా లోని అరిజోనా, నెవాడా రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. హూవర్ డామ్ ఒకానొకప్పుడు బౌల్డర్ డామ్ గా పిలిచేవారు. ఇది కొలరాడోనది యొక్క బ్లాక్ కేనియాన్‌‌లో నిర్మించబడిన ఆర్చ్-గ్రావిటీ డామ్. లాస్ వేగాస్ నుండి హూవర్ డ్యామ్ వరకు సుమారు 37 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హూవర్ డ్యామ్ కి వెళ్లిన వారికి అక్కడున్న అద్భుతాలనుచూస్తే  ఆశ్చర్యంకలిగిస్తుంది. హూవర్ డ్యామ్ పై నుంచి ఓ బాటిల్ తో నీటిని కిందకు జార విడిస్తే, ఆ నీరు కిందకు పడకుండా. పైకి ఆకాశంవైపు వెళ్తుంది. ఎన్నిసార్లు నీరు జార విడిసినా. నీరు పైకే వెళ్తుంది. నమ్మశక్యం కానీ ఈ అద్భుతాన్ని చూసి పర్యాటకులు ఆశ్చర్య పోకుండా ఉండలేరు.  శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు చేసిన తరువాత వారు చెప్పిన సమాచార ప్రకారం  ఆ డ్యామ్ దగ్గర గాలి కింద నుంచి పైకి బాగా ఎక్కువగా వీస్తోందని. ఆ గాలి నీటిని పైకి తోసేస్తుందని. అందుకే ఇలా జరుగుతోందని వెల్లడించారు. అయినా పర్యాటకులకు ఇదొక వింత లాగే అనిపిస్తుంది.


మీ 

కోట దామోదర్ 

మొబైల్ : 9391480475

kotadamodar.blogspot.com

8, నవంబర్ 2022, మంగళవారం

అంతరించిపోతున్న కుమ్మరి వృత్తి

మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన వృత్తి 'కుమ్మరి వృత్తి'.

మట్టితో మహత్తర ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం పోసింది కుమ్మరి.

మనిషి పుట్టుక, చావు, దైవ కార్యాలకు కుండ ఎంత ఉపయోగమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

మానవ జాతికి తొలి పనిముట్టును అందించడమే గాక జీవనానికి అత్యవసర నిత్యావసర వస్తువుగా తీర్చిదిద్దిన ఘనత కుమ్మరిది. పూర్వం మానవుడు మట్టిపాత్రలు మాత్రమే వాడి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాడు. మనిషి పుట్టుక మరియు చావు కుండలేనిదే పూర్తికాదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. పుట్టిన పురిటి బిడ్డకు పురుడు పోసేందుకు మరియు చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు సైతం కుండను వినియోగిస్తారు. ఇలా మనిషి మనుగడకు మట్టి పాత్రలు ప్రధాన పాత్ర పోషించాయని అనడంలో ఎలాంటి సందేహములేదు. మట్టిని కుండగా మలచడంలో నేర్పరితనం ఉంటుంది. సాధారణంగా అది అందరికి సాధ్యం కాదు.

కుండ చెప్పిన నీతి:

ఒకసారి కుండను ఎవరో అడిగారట...

నువ్వు పరిస్థితులతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితిలో అయినా చల్లగా (ప్రశాంతంగా) ఉంటావు కదా ! ఇది ఎలా సాధ్యం ! అని...

దానికి కుండ చెప్పిన సమాధానం మనను ఆలోచించేలా చేస్తుంది. తాను వచ్చింది మట్టిలో నుండి అని, మళ్ళీ తిరిగి వెళ్లి కలిసేది కూడా మట్టిలోనే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానని అంటూ మధ్యలో వచ్చే ఆవేశం, గర్వం, పొగరులాంటివి అవసరమా...! అని జవాబు ఇచ్చిందంట..

కుండ చెప్పిన నీతి ఎంత మధురం! అలా కుండ మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది.  

నాడు పెళ్లిళ్లు, దశ దిన కర్మలు, గ్రామాలలో జరుపుకునే బోనాలు, ఉగాది, జాతరలకు కుమ్మరులు తయారు చేసిన కుండలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, అన్నం వండుకోవటానికి (బువ్వ గిన్నె), నీళ్లు నిల్వచేయటానికి (గోలెం), నీళ్లు మరగపెట్టడానికి (కుండ), వస్తువులను భద్రపరచటానికి (గాదెలు), కూరాడు, ముంత, దీపపు ప్రమిదలు, కల్లు కుండలు, పెళ్ళిలో అయిరేని కుండలు,  గరిగ ముంత, రంజన్లు, మట్టి బొమ్మలు, పూల కుండీలు, నీళ్ళ బుంగలు, ఇంటి నిర్మాణం కోసం పెంకులు, డబ్బులను దాచుకునేందుకు గళ్ల గురిగిలను, వేసవి కాలంలో చల్లని నీటిని అందించే కూజాలను తయారు చేసేవారు. శుభ కార్యాలకు సైతం కుమ్మరి కుండలనే వాడుతుంటారు. కొంత మంది అనారోగ్యానికి గురైనప్పుడు సైతం కుమ్మరి కుండలనే వినియోగించేవారు. ఎందుకంటే అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో ఇవి ఎంతో దోహదపడుతుంటాయి. ఇలా మట్టి పాత్రలను అనేక విధాలుగా ఉపయోగించుకునేవారు. అతి సాధారణంగా కనిపించే ఒక కుండ తయారీ వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. ముందుగా చెరువుల్లో రేగడిమట్టిని తీసుకొచ్చి అందులో రాళ్లు లేకుండా జల్లెడ పట్టి ఇసుక మాదిరిగా తయారుచేస్తారు. ఎన్ని కుండలు చేయాలనుకున్నారో దానికి ఎంత మట్టి కావాలో అంత మట్టి ఒకదగ్గర పోసి అందులోకొన్ని నీళ్ళుకలిపి కాళ్లతో బాగా తొక్కి ముద్దలు ముద్దలుగా తయారుచేసుకుంటారు.  తరువాత ఆ మట్టి ముద్దలను కుమ్మరి చక్రంపై (సారె) పై చేర్చి పొడుగాటి కర్రతో గిరగిరా రెండు చేతులతో తిప్పుతూ మట్టిని చేతివేళ్ల తో నేర్పరితనం రంగరించి కావాల్సిన అకృతి వచ్చే వరకు మలిచి దానిని కొలిమిలో ఉంచి కాల్చుతారు.

ఎండాకాలంలో వేడి తీవ్రత నుండి ఉపశమనం పొందడానికి కుండలను ఎక్కువ వాడేవారు.

మట్టి కుండల్లోని నీరు త్రాగడంవలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

ఎప్పుడైతే మార్కెట్లోకి ప్రిజ్ లు వచ్చాయో ఈ కుమ్మరి కుండలకు ఆదరణ గణనీయంగా తగ్గింది. ఫ్రిజ్‌లో నీటి కంటే మట్టి కుండల్లోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా మంచి ఫలితాలు ఉంటాయని పలు పరిశోధకుల అభిప్రాయం. కానీ ఉరుకులు పరుగుల జీవితాలకు అలవాటుపడిన కొందరు కుండ వాడటానికి విముఖత చూపుతున్నారు.

అంతేగాక ఇంటి పైకప్పు కోసం కూడా మట్టితో తయారుచేసిన పెంకులనే వాడేవారు. పెంకుటిళ్లలో ఎండాకాలంలో చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉండడం ఆ ఇళ్ళలో నివసించినవారికి మాత్రమే తెలుస్తుంది. కాలక్రమేణా సిమెంట్ వాడకం పెరగడంతో గ్రామాలలో సైతం పెంకుటిళ్ళుఅంతరించిపోతున్నాయి.

పర్యావరణానికి ముప్పు కలిగించడంతో పాటు సమస్త జీవరాసులపై దుష్ప్రభావం చూపే ప్టాస్టిక్ వస్తువులు విరివిగా మార్కెట్లను ముంచెత్తుతుండడంతో కుమ్మరులు తయారు చేసే మట్టి పాత్రలకు ఆదరణ కరువైంది. కుమ్మరులు ఒకప్పుడు ఊరి చెరువులోనుండి తామేస్వయంగా మట్టితెచ్చుకుని తక్కువ ఖర్చుతో కుండను తయారు చేసినప్పటికీ అప్పట్లో బాగా గిరాకీ  ఉండడంతో లాభసాటిగా ఉండేది. కానీ ఈరోజుల్లో రోజంతా కష్టపడి కుండలు చేస్తే కనీసం రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. అయినాసరే వృత్తిపై మమకారంతో అమ్ముకుందామంటే గిరాకీ ఉండడం లేదు. బతుకుదెరువు కోసం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో వృత్తినే నమ్ముకున్న కుమ్మరి జీవితం నేడు అగమ్యగోచరంగా తయారైంది.

ఎంతో కళానైపుణ్యంతో కూడుకున్న కుమ్మరి వృత్తి ఆదరణ కరువై ఇలా అంతరించిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇవ్వాళ కుమ్మరి వృత్తి జీవితం కుదేలయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌, జర్మన్‌ సిల్వర్‌ వినియోగం విపరీతం గా పెరిగిపోవడంతో ఖాళీ కడుపులతో వెలవెల బోతోంది. కాలచక్రంతో పోటీపడలేక మట్టి కుండ కనుమరుగైపోతోంది.

 

 మీ

కోట దామోదర్

మొబైల్ : 9391480475

2, నవంబర్ 2022, బుధవారం

అందరికి ఆదర్శం అంధురాలు "పయ్యావుల కొమురమ్మ"




సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు.
మనిషి పుట్టుకతో ఏదైనా అవయవలోపం ఏర్పడినా బ్రతకడానికి ఎన్నో మార్గాలుంటాయి. కానీ ఇంద్రియాలలో ప్రధానమైన నయనాలు (కళ్ళు) లేకుంటే మాత్రం ఆ జీవితం అంధకారమే.
మానవ శరీరంలో అత్యంత విలువైన, సున్నితమైన అవయవం కన్ను. మానవుడు ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూడగల్గుతున్నాడంటే దానికి కారణం కళ్ళు. అది మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. కళ్ళు లేనివారు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.
మనిషికి వైకల్యం వున్నా మనసుకు మాత్రం వైకల్యం వుండకూడదు అంటారు. మనోస్థైర్యం ఉన్నవారు శరీర వైకల్యాన్ని అధిగమించడమేగాక ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. ఇది అక్షరాలా నిజం. అలాంటి స్ఫూర్తివంతమైన అంధురాలి యదార్థ జీవిత గాధ ఇది. ఆమె పేరు "పయ్యావుల కొమురమ్మ". ఆమె పుట్టుకతోనే అంధురాలు. అయితేనేం తన పనులు తానే చేసుకుంటూ ఎంతోమంది దివ్యాంగులకు, యువతీయువకులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

కొమురమ్మది సూర్యాపేట జిల్లా మారుమూల గ్రామమైన గుమ్మడవెల్లి. ఆమె నిరుపేద యాదవ కుటుంబంలోబొర్రయ్య, ముత్తమ్మలకు జన్మించింది . ఆమె జన్మతః అంధురాలు అవటంవల్ల సవాలక్ష సవాళ్ళు ఎదుర్కొంది. జీవితంలో ఏ పనిచేయలేని కొమురమ్మకు తల్లి ముత్తమ్మ తొలి గురువు. ప్రపంచంలోని అమ్మలందరికీ పిల్లలపై ఆకాశమంత ప్రేమ ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ముత్తమ్మ కు బిడ్డ మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ. అంధకారం అలుముకున్న తన బిడ్డ జీవితాన్ని చూసి ఆ తల్లి రోదించిన సందర్భాలెన్నో. కొమురమ్మను అదే గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. కానీ అది అంధుల పాఠశాల కాకపోవడంతో ఆమె గురువులు చెప్పేపాఠాలు సరిగా అర్ధం చేసుకోలేకపోయేది. చుట్టుప్రక్కల ఎక్కడ కూడా అంధుల పాఠశాలలు లేనందున ఆమె ఇంటికే పరిమితమయింది.
కొమురమ్మను తల్లి కూలిపనులకు, పొలం పనులకు ఎక్కడికి వెళ్లిన తన వెంటే తీసుకుకెల్లేది, అంతేగాక తన తల్లి మాట్లాడే బంధుత్వ వరుసలను , మాట్లాడే విధానాన్ని పరిశీలించి కొద్దికొద్దిగా నేర్చుకోవడం ప్రయత్నించింది.ప్రతిఒక్కరి గొంతును గుర్తుంచుకునేది. ఎవరైనా ఇంటికి వస్తే వారి గొంతువిని వారి పేరు వెంటనే చెప్పేది అంత జ్ఞాపకశక్తి కొమురమ్మది. మానవత్వానికి మరో పేరు "పయ్యావుల ముత్తమ్మ". ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించే మంచి మనసు ఆమెది. బిడ్డ ఎదిగేకొద్దీ తల్లికి అనుకోని బాధ వెంటాడేది.తానుఆరోగ్యంగా ఉన్నంతవరకు బిడ్డను చూసుకుంటాను కానీ తన తరువాత తన బిడ్డ ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా పనులు ఎలా చేసుకుంటుంది అనే ఆలోచనే బాధించేది ఆ తల్లికి. లచ్చమ్మకు అక్షరజ్ఞానం లేకపోయినా ముందుఆలోచనతో తన బిడ్డకు అందరిలాగే వంట, ఇంటి పనులు చేసుకోవడానికి మంచి శిక్షణ ఇచ్చింది. కొమురమ్మ శ్రద్దగా వింటూ ఓపికగా నేర్చుకోసాగింది. ఆలా కొమురమ్మ జీవితాన్ని ఆమె చీకటి నుండి వెలుగులోకి తీసుకురాగలిగింది. మొదట బిడ్డ జీవితంచూసి చలించిపోయేది. ఆమె మంచి భవిష్యత్తు కోసం తపించేది. తల్లీ నీకు పాదాభివందనం.
బిడ్డపట్ల తల్లి ప్రేమ వర్ణించలేనిది, వెలకట్టలేనిది. పనులు నేర్పించడమేగాక ఊరిలో ఎవరింటికి ఎలా వెళ్లాలో తీసుకొనివెళ్ళి చూపించేది చాలా సార్లు. తల్లి చూపించిన ఇంటి దూరాన్ని అడుగుల లెక్కతో మరియు సమయాన్ని బట్టి ప్రతిఒక్కరి ఇంటికి వెళ్లగలదు. అది చూసేవారికి ఆశ్చర్యం, అనుమానం కూడా కళ్ళు కనిపిస్తాయేమోఅని. కానీఆమె నిరంతర సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది.
కళ్ళు లేవని కలత చెందలేదు. నాకు భవిష్యత్తు లేదని ఆగిపోలేదు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా ముందుకుసాగింది. ఆమె విజయం వెనుక తల్లి ఉంది.
అలా తల్లి ముత్తమ్మ కొమురమ్మను 43 ఏళ్ళు వరకు అన్నీతానే దగ్గరుండి చూసుకుంది. ఒడిదొడుకులతో సాగుతున్న కొమురమ్మ జీవితం లో అనుకోకుండా తీవ్ర అనారోగ్యం కారణంగా తల్లి మరణించింది. తల్లి మరణవార్తవిన్న కొమురమ్మ కన్నీరుమున్నీరైంది. ఆ సంఘటన చూసిన ఊరి జనానికి ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించిన సందర్భం.. తల్లి మరణాంతరం తండ్రి (బొర్రయ్య) కూడా అనారోగ్యానికి గురైనారు. ముత్తమ్మ ముందుఆలోచనతో కొమురమ్మ తన పనులు తానే చేసుకునేలా తర్ఫీడునిచ్చింది.
నిరుపేదరాలైన కొమురమ్మకు ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. పాత మట్టిగోడలమద్యే ఆమె నివాసం. ఎన్ని ప్రభుత్వాలు మారిన కొమురమ్మ గోడు పట్టించుకునే నాధుడే లేడు. ఇప్పటికైనా ప్రభుత్వం కొమురమ్మపట్ల ప్రత్యేక చొరవ చూపాలని కోరుకుంటున్నాం.
ఈరోజుల్లో అన్నిఅవయవాలుండి పనిచేయటానికి బద్ధకం ఉన్నవాళ్ళకి కొమురమ్మ ఒక ఆదర్శం కావాలని కోరుకుంటూ..
కొమురమ్మ నిండునూరేళ్ళు ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని మనందరం ఆ భగవంతుణ్ణి కోరుకుందాం.


✍

కోట దామోదర్
మొబైల్ : 9391480475

24, అక్టోబర్ 2022, సోమవారం

మల్లు స్వరాజ్యం




పల్లె ప్రాంత పలకరింత. పల్లె ప్రజల పులకరింత.
భూమికోసం.. భుక్తికోసం.. జమీందారుల బానిసత్వం నుంచి విముక్తికోసం పోరాడిన వీర, ధీర వనిత మల్లు స్వరాజ్యం. 
తడి ఆరని మట్టి సుగంధపు పాటల పూదోట, పదునెక్కిన ప్రజా పాట మల్లు స్వరాజ్యం. 
కత్తిమొనకుండే సురుకుదనం.. ఆమె మాటల్లోఉండే గరుకుదనం. గర్జించిన సింహమోలే ఘాటైన మాటల మర ఫిరంగి మల్లు స్వరాజ్యం..  
ఉద్యమ పాటల వాడి.. ఉద్యమ విప్లవ వేడి, ఎలుగెత్తిన ఎర్రని ఎర్రదనం ఎర్రజెండా.
పెత్తందారీ వ్యవస్థమీద ఎక్కుపెట్టిన తూటా.. మల్లు స్వరాజ్యం మాట..
అక్రమ, అన్యాయాలను అణగదొక్కే అగ్నికణాల ఆట.. మల్లు స్వరాజ్యం పాడిన పాట. 
ఆమె పాటలు ప్రజలను ఊగిస్తాయి. ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేస్తాయి..
తాడిత, పీడిత, బీదసాదలకు నిలువెత్తు ఊతం.. మల్లుస్వరాజ్యం గీతం..

మీ 
కోట దామోదర్ 
మొబైల్ 9391480475

అంతరించిపోతున్న కల్లుగీత వృత్తి




కల్లు గీత వృత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి

పురాతన కాలంనాటి గ్రంథాలన్నీ తాళపత్రాలే... అంటే తాటాకులమీద రాసినవే. అవి నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆ ఆకులోని వైశిష్ట్యం ఏమిటో తెలుస్తోంది.
పురాణాలు మరియు ఇతిహాసాలలో తాటిచెట్టు గురుంచి ఎంతో గొప్పగా వివరించబడింది.

అన్నమయ్య కీర్తనలు , పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం లాంటి అమూల్యమైన విషయాలెన్నో తాళపత్ర గ్రంధాల పైనే రాయబడింది. అలాగే తాటిచెట్టు నుండి లభించే కల్లును ప్రకృతి ఔషధంగా పురాణాలలో సురాపానంపేరుతో ప్రస్తావించటం చాల గొప్ప విషయం. స్వర్గలోకంలో అమృతభాండం ఒలికి జారిన అమృతపు చుక్క భూమి మీద పడి తాళ వృక్షమై మొలిచిందట. ఈ మాటలో ఎంత నిజముందో తెలియదు కానీ. మానవ జాతి మనుగడలోను కల్లు పాత్ర కీలకమైనది.

తాటి చెట్లు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది కల్లు. ఆది మానవుని నుంచి ఆధునికమానవుని వరకు కల్లు సేవించటం ఆనవాయితీగా వస్తుంది.  తాటి  కల్లు అత్యంత ఆరోగ్యదాయకమైన ప్రకృతిసిద్ధమైన పానీయం.  ఒకప్పుడు ప్రజలు పొద్దున్న నుండి సాయంకాలం వరకు చేసిన శ్రమ నుండి ఉపశమనం పొందడానికి కల్లు ని సేవించేవారు. ఒకప్పుడు ఇంటికి బంధువులొస్తే కల్లు, గుగ్గిలతో మర్యాద చేసేవారు.  శ్రమ జీవులకు , కల్లుకు విడదీయరాని బంధం ఉండేది.

అలాంటిది కాలక్రమేపి నేడు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో లిక్కర్‌,బీర్‌, బ్రాంది, విస్కీ, రమ్ము, శీతల పానియాలు (థమ్స్ అప్, కోకోకొలా, స్పైట్‌, మాజా) అనేకం రావటం వలన కల్లు తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అందు ఫలితంగా దీనిపై ఆధారపడ్డ లక్షలాదిమంది గీతకార్మికుల బ్రతుకులు ప్రశ్నార్థకంగామారుతున్నాయి. అందుకు కారణం ప్రభుత్వమే. ఎందుకంటే ప్రైవేటు సంస్థలు శీతల పానీయాలమీద పత్రికలు,టీవీ లలో గుప్పించి ఆకట్టుకుంటుంటే ప్రభుత్వం మాత్రం కల్లు ఆరోగ్యానికి ఏ విధమైన మేలుచేస్తుందో ప్రజలకు అడ్వర్‌ టైజ్‌మెంటుల  రూపంలో చెప్పకపోవడం ఇందుకు ముఖ్యకారణం అనే చెప్పాలి. నేటియువత మద్యానికిఇచ్చిన ప్రాధాన్యత కల్లుకు ఇవ్వక పోగా దానిని చులకన చేసి చూడటం అత్యంత బాధాకరమైన విషయం. అంతేగాక వ్యవసాయం వంటి ఇతర రంగాల్లో అభివృద్ధి సాదించినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా కల్లుగీత వృత్తిలో ఎలాంటి ఆధునిక పద్ధతులను, విధానాలను తీసుకురాకపోవడంతో ఆ వృత్తి దెబ్బతింటోంది.  ప్రభుత్వం పట్టించుకోనప్పటికీ గౌడన్న తన సంప్రదాయ వృత్తిని బ్రతికించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు.

పూటగడవటం కోసం గౌడన్న పొద్దుపొద్దుగాల కత్తుల పొదితో, మోకేసుకొని తాళ్లల్ల ప్రత్యేక్షమవుతాడు. సుమారు 10 నుండి 18 మీటర్ల ఎత్తున్న చెట్లని తన ప్రాణాలను సైతంలెక్కచేయకుండా అవలీలగా ఎక్కడంతోపాటు పెద్ద పెద్ద కల్లు కుండలను వెదురుబద్దల సహాయంతో ఎర్రటి ఎండలో ఒంటినిండా చెమటతో వాటిని మోయగలిగే  అసలైన బాహుబలి అంటే గౌడన్నే. వెదురుబద్దతో కుండలను మోయటంకేవలం గౌడన్నకే సాధ్యం. చెట్టెక్కిన  తరువాత ఏదైనా అకస్మాత్తుగా సంభవిస్తే ఇక తన ప్రాణాలు గగనమే. తాటిచెట్టు పైన కొన్ని విషపూరితమైన పాములు, తేలు, ఉడుములు వంటి ప్రమాదకరమైన జీవులతో పోరాడుతాడు. అనుకోకుండా అవి కాటేస్తే  క్రిందకు దిగేవరకు తాను బ్రతికే అవకాశం ఉండదు. అడవిలో అప్పటికప్పుడు చికిత్స అందించేవారు కూడా ఉండరు.  ఇలాంటి వృత్తిని ఎంతో ధైర్యంతో కొనసాగిస్తున్న గౌడన్నని అభినందించాల్సిందే. నిజానికి వీరి వృత్తి చావుతో పోరాటమే అనటంలో అతిశయోక్తిలేదు.

కల్లుగీత కార్మికుల పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గౌడాన్న చెట్టుపైనుండి పడి చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల నష్ట పరిహారం అందచేయటం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ మేము బ్రతుకున్నపుడే  మంచి మార్గాన్ని చూపే పథకాలుంటే బాగుంటుంది అనే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రాబోవురోజుల్లో ప్రభుత్వం వీరిని అన్నివిధాలా ఆదుకోవాలని, వారి వృత్తికి సరిపడా నూతన పరికరాలకోసం అధ్యయనం చేసి వృత్తి కొనసాగించేవిధంగా మరియు నీరా కేంద్రాలను ఏర్పాటుచేయాలని కోరుకుందాం..

ముఖ్యంగా తెలంగాణ లోని గ్రామాలలో శుభకార్యాలకే గాక అన్ని రకాల కార్యాలకు మరియు వేసవి కాలంలో కల్లు సేవించేవారి సంఖ్య ఎక్కువ. విందు, వినోదాలకు స్నేహితులతో కలిసి తాళ్లల్ల ముచ్చటిస్తూ కల్లుతాగే మధురమైన జ్ఞాపకాలు పల్లెవాసులు ఎన్నటికీ మరువలేనివి మరుపురానివి. గ్రామాలలో కల్లు మాత్రమే కాకుండా తాటి ఆకులను వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు.  పేదవాడి గూటికి పైకప్పుగా ఈ తాటికమ్మలు వాడేవారు. వేసవికాలంలో విలాసవంతమైన భవంతులకంటే పూరిగుడిసెల్లో వేడితీవ్రత తక్కువ. పెళ్లిపందిరికి, చాపలు, బుట్టలు, సంచులు, విసనకర్రలు, టోపీలు, గొడుగులు తయారుచేసుకోవడానికి తాటాకులు ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాటి మొద్దులతో ఇళ్ల నిర్మాణంసర్వసాధారణం. అంతేగాక వేసవిలో తాటి ముంజలు అమితమైన చలవనివ్వడంతో పాటు తక్షణ శక్తిని మరియు దాహార్తిని తీర్చటానికి బాగా ఉపయోగ పడతాయి. 

కల్లు గురించి వైద్యుల కితాబు:

ఇది ప్రకృతి సిద్ధమైన సహజ పానీయం. దీనిని ఎవరైనా తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
  • ·         తాటి క‌ల్లు తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది.
  • ·         డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది.
  • ·         అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలనుదూరం చేయటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • ·         కంటిచూపును, జుట్టు మరియు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • ·         నీరాలో ఉండే ప్రో బయాటిక్స్ రోగనిరోధక శక్తి పెరుగడానికి దోహదం చేస్తుంది.
  • ·         లీవర్ లేదా కాలేయసంబంధిత వ్యాధులకు నివారిణిగా పనిచేస్తుంది.
  • ·         కిడ్నీలో రాళ్లను నివారించడంతో పాటు అప్పటికే ఏర్పడిన రాళ్లను కరిగిస్తుంది.
  • ·         తాటిబెల్లం, తాటి పంచదార వల్లకూడా మంచి ప్రయోజనాలున్నాయి.
  • ·         తాటిక‌ల్లుకు క్యాన్సర్కార‌క క‌ణాల‌ను న‌శింప‌జేసే శ‌క్తి కూడా ఉందని వైద్యనిపుణులు తెలియ‌జేస్తున్నారు.
ఇంతటి విశిష్టత కలిగిన తాటిచెట్లు కనుమరుగవుతున్నాయి. కొందరి స్వార్థప్రయోజనాలకోసం చెట్లని నరికేస్తున్నారు. ఇలాంటి కల్పతరువు వంటి తాటిచెట్లు కనుమరుగు అవుతుంటే.. గ్రామీణ ప్రాంతాల ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే ఆవేదన నెలకొంది.

వంద సంవత్సరాలకు పైగా జీవించే తాటిచెట్టు పేదవాడి కల్పతరువు. గౌడన్నల బతుకుదెరువు..

ఈ విషయం ప్రభుత్వం గుర్తిస్తే గౌడన్నలకు ఆదరువు ...



మీ

కోట దామోదర్

మొబైల్ : 9391480475

17, అక్టోబర్ 2022, సోమవారం

సరిలేని చిత్రకారుడు

https://drive.google.com/uc?export=view&id=12y87LzCVKpCTUeivmcWnUnY-71kvLgnh 


దేవుడు మనిషిని సృష్టిస్తే! అసలు దేవుడు ఎలా ఉంటారో తెలియని ప్రపంచానికి ఆ దేవుడి రూపాన్ని సృష్టించిన గొప్ప చిత్రకళాకారుడు "రాజా రవి వర్మ "

తాను చదివిన పురాణేతిహాస గ్రంథాల్లోని దేవతామూర్తులను, వారి ఆకారాలను ఎంతో గొప్పగా ఊహించుకొని అద్భుతమైన ఆలోచనతో తన కుంచె ద్వారా దేవుళ్లు, దేవతల రూపాలకి ప్రాణంపోసిన కళాకారుడు. మనం నిత్యం పూజించే దేవుళ్ళు దేవతల విగ్రహాలన్నీ అయన గీసిన చిత్రాల ఆధారంగానే రూపొందించారంటే చిత్రకళ ఎంత గొప్పదో చెప్పనవసరం లేదు. భారతదేశ చిత్రకళను ప్రపంచవ్యాప్తి చేయటమే కాకుండా ఆ కళకు అరుదైన గౌరవం తీసుకొచ్చారు.

అనబత్తుల కుంచె నుండి జాలువారిన చిత్రాలు ఖండాంతర ఖ్యాతి పొందాయి. ఆయనది వృత్తి బోధన అయినా, చిత్రకళే ప్రవృత్తిగా కళాఖండాలను ఆవిష్కరిస్తున్న "అనబత్తుల వెంకన్న" తన బాల్యమునుండి చిత్రకళపై మక్కువతో అవిశ్రాంత సాధనతో ప్రపంచ స్థాయిలో గొప్ప చిత్రకళాకారుడిగా  గోల్డ్ మెడల్, జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో సాధించిన "అనబత్తుల వెంకన్న" తెలంగాణకు చెందినవారు కావడం గర్వించదగ్గ గొప్ప విషయం. 

  • 2012 లో KVS National Incentive Award”  కేంద్రీయ విద్యాలయ సంగతన్, Ministry of HRD, Govt of India  వారి చేత అత్యున్నతమైన అవార్డు పొందారు.
  • 2021 సంవత్సరం అంతర్జాతీయ ఆర్ట్ సొసైటీ, ఫైన్ ఆర్ట్స్, అస్సాం, వారిచేత గోల్డ్ మెడల్ సాధించారు.
  • 2022 సంవత్సరంలో Magic Book of Records, ఫరీదాబాద్, న్యూ ఢిల్లీ వారిచేత అత్యున్నతమైన Honorary Doctorate Award అవార్డు సాధించారు. 
  • 2022 సంవత్సరంలో లలిత్ కళా కేంద్ర, Guwahati, అస్సాం వారిచే  "Diamond Award" పొందారు.
  • 2021 సంవత్సరంలో "కళ రత్న" అవార్డు సాధించారు. 
  • 2005  లో ఆఫ్రికా దేశం తన ప్రతిభకు ఆ దేశ అత్యున్నతమైన "ఆర్టిస్ట్ ఇన్ బోట్స్వానా " అవార్డు తో సత్కరించింది.

బాల్యం, విద్యాబ్యాసం:

సూర్యాపేట జిల్లా, మారుమూల గ్రామమైన మద్దిరాల మండలం, గుమ్మడవెల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబం చేనేత కార్మికుడైన అనబత్తుల నారాయణ, నాగలక్ష్మి దంపతులకు 08.03.1969 లో జన్మించారు. నారాయణ చేనేత వృత్తినే కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వెంకన్న అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి  7 వ తరగతి వరకు విద్యనభ్యసించారు. ఆయనకి 7 వ తరగతిలోనే చదువుతో పాటు చిత్రకళపై ఆసక్తి కలగటం జరిగింది. వెంకన్న గీసిన చిన్న చిన్న చిత్రాలను చూసి తల్లిదండ్రులు సంతోషించేవారూ మరియు అభినందించేవారు కూడా. తన తల్లిదండ్రుల ప్రోత్సాహముతో మరింత ఉత్సహంతో కళకు పదునుపెట్టగలిగారు. అప్పట్లో గుమ్మడవెల్లి గ్రామంలో 8 వ తరగతి చదివే సదుపాయంలేక వెంకన్న చిన్నమ్మ గారి ఊరు నెల్లికుదురులో స్థిరపడి అక్కడే 8 వ తరగతి నుండి 12 వరకు జూనియర్ కళాశాలలో విద్య పూర్తిచేశారు.  8 వ తరగతి చదివే సమయంలో వారి గురువు చిత్రకళ నైపుణ్యం కలిగిన అక్కెర కరుణ సాగర్ గారి దగ్గర శిక్షణతో పాటు నైపుణ్యం పొందగలిగారు. ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ లో శ్రీ టీ.సుధాకర్ రెడ్డి గారి దగ్గెర గ్రాఫిక్స్ లో శిక్షణ పొందినారు వెంకన్న ఈ స్థాయికి చేరుకున్నారంటే  గురువులే కారణం, గురువులే ఆదర్శం. వెంకన్న చిన్నతనం నుండి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ  తన కళను విడిచిపెట్టకుండా విద్యను మరియు చిత్రకళను రెండింటిని కొనసాగించారు. నెల్లికుదురులో విద్య అనంతరం. అయన విశాఖపట్నం లోని ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచ్లర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ విభాగం లో డిగ్రీతో పాటు  డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ (నటన మరియు దర్శకత్వం) పూర్తిచేశారు. తరువాత ఎం. ఎస్. యూనివర్సిటీ, బరోడాలో ఎం. ఏ. గ్రాఫిక్స్ పూర్తి చేశారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వెంకన్నచదువుతోపాటు గొప్ప చిత్రకళాకారుడిగా పేరుప్రఖ్యాతలు సంపాదించారు. తండ్రి నేత కళాకారుడైతే, తనయుడు మాత్రం గొప్ప చిత్రకళాకారుడిగా అవార్డులు పొందడం గొప్ప విషయం.

ఉద్యోగ ప్రస్థానం :

  • 1995 లో కేంద్రీయ విద్యాలయ సంగతన్ టీ.జి .టీ  ఆర్ట్ టీచర్ గ హైదరాబాద్ లోని కే .వి 2  ఎయిర్  ఫోర్స్ అకాడమీ లో చేరారు. 
  • 2000 - 2004 వరకు కే .వి 1  గోల్కొండ, లంగర్ హౌస్ పనిచేసి 2004 ఫిబ్రవరి లో బోట్స్వానా ( ఆఫ్రికా ) కు భారత ప్రభుత్వం తరుపున డెప్యూటేషన్ పై  వెళ్లి ఐదు సంవత్సరాలు అక్కడి విద్యార్థులకు చిత్ర కళలో మెళకువలు నేర్పిచారు . వెంకన్న చిత్రకళా నైపుణ్యాన్ని చూసి ఆఫ్రికా దేశంలోని అత్యున్నతమైన " ఆర్టిస్ట్ ఇన్ బోట్స్వానా " అవార్డు తో సత్కరించింది.
  • 2009 లో తిరిగి కే .వి,1  ఉప్పల్ హైదరాబాద్ లో చేరారు.
  • 2011 నుండి కే .వి వరంగల్ లో చిత్ర కళ ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నారు.

వెంకన్న సాధించిన అవార్డులు:

  • 1987 లో ఇంటర్  కాలేజ్ యూత్ ఫెస్టివల్ సందర్బంగా మొదటి బహుమతి.
  • 1988 లో భారతిదాసన్ యూనివర్సిటీ, తిరుచిరాపల్లి సౌత్ జోన్  ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ సందర్బంగా రెండవ బహుమతి.,
  • 1989 లో ఆంధ్ర యూనివర్సిటీ పోస్టర్ తయారీ కాంపిటీషన్ లో మొదటి బహుమతి.    
  • 1990 లో కాలికట్ యూనివర్సిటీ - కేరళ, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ సందర్బంగా రెండవ బహుమతి.
  • 1990 లో REC,వరంగల్ అల్ ఇండియా ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ ఫెస్టివల్ సందర్బంగా మొదటి బహుమతి.
  • 1991 లో  మదురై కామరాజ్ యూనివర్సిటీ లో అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్  సందర్బంగా రెండవ బహుమతి.
  • 1992 లో  Highly Commendable certificate అవార్డు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ , వారిచేత పొందారు.
  • 1993 లో డిప్లొమా ఇన్ యాక్టింగ్ విభాగంలో ఆంధ్ర యూనివర్సిటీ నుండి "దాసరి నారాయణరావు - "గోల్డ్ మెడల్" అవార్డు పొందారు. 
  • 1997 లో  Highly Commendable certificate అవార్డు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ , వారిచేత పొందారు.
  • 2011 లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 324C 2 ఆచార్య సేవ పురస్కార్” హైదరాబాద్, వారిచేత పొందారు. 
  • 2011 లో KVS Regional Incentive Award”  కేంద్రీయ విద్యాలయ సంగతన్, Ministry of HRD, Govt of India  వారి చేత అత్యున్నతమైన అవార్డు పొందారు.
  • 2015 లో “Best Teacher award” by రోటరీ  క్లబ్  హన్మకొండ  , వరంగల్  - తెలంగాణ స్టేట్ వారి చేత పొందారు 
  • 2016 లో “Active Teacher award” కళాభారతి చైల్డ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్, ఔరంగాబాద్ వారిచేత పొందారు.
  • 2017 లో “Best Artist” కళ వైభవం ఆర్ట్ ఎక్సిబిషన్ - వరంగల్ వారిచేత పొందారు.
  • 2017 లో తెలంగాణ స్టేట్ Rs. 51,116 నగదు తో పాటు “District Artist Award"  డిప్యూటీ  చీఫ్ మినిస్టర్ శ్రీ  కడియం శ్రీహరి గారిచే పొందారు.
  • 2019 లో యంగ్  ఎంవోయిస్  ఇంటర్నేషనల్ హైదరాబాద్ వారిచే బాపూజీ స్మృతి  పురస్కార్ అవార్డు పొందారు.
  • 2021 లో గ్రాఫిక్ డిజైన్- న్యూ ఢిల్లీ వారి చేత గోల్డెన్  ఫ్రేమ్ అవార్డు పొందారు.  
ఇలా ఎన్నో అవార్డులు గెలుచుకున్న వెంకన్న "తెలంగాణ విముక్తి" చిత్రాన్ని గీసి తెలంగాణ వాదాన్ని చాటుకున్నాడు. అలాగే అనబత్తుల కుంచెనుండి జాలువారిన భద్రాచలంలో పవిత్రస్తానం అనే చిత్రాన్ని గోదావరి పుష్కర సమయంలో తిలకించని వారులేరు. ప్రకృతి పై పర్యావరణ పరిరక్షణపై తను గీసిన చిత్రాలకు ఎందరో ప్రముఖులు ఆకర్షితులైనారు. 
రాబోవు రోజుల్లో అనబత్తుల కుంచెనుండి మరిన్ని చిత్రాలను గీయాలని కోరుకుందాం..

వ్యాసకర్త :

కోట దామోదర్ 
మొబైల్: 9391480475 


                      

19, సెప్టెంబర్ 2022, సోమవారం

సమానత్వం కోసం పోరాటం





ఇది నా దేశం, ఇది నా జన్మభూమి, ఈ దేశం నాది అని గర్వంగా చెప్పుకునే ఈ దేశ పౌరిడిని నేను. ఈ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించటానికి అర్హత కలిగినవాడిని. ఈ దేశ పౌరిడినైనా నాకు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి తిరస్కరిస్తారా ? ఎందుకు ప్రవేశం లేదు? కారణం నా వర్ణమా? అయితే విద్యనభ్యసించటానికి వర్ణం కారణమా? అయితే నేను న్యాయస్థానంలో తేల్చుకుంటా అని శపథం పట్టి వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అలుపెరగని ఉద్యమ వీరుడు. నడవరా ముందుకని నడిపించిన నల్ల వీరుడు. 

ఓక్లహామా యూనివర్సిటీలో నల్లజాతీయులకు సమానత్వ విద్యకోసం తిరగబడ్డ అక్షర యోధుడు  ప్రొఫెసర్ 'జార్జ్ డబ్ల్యూ మెక్‌లౌరిన్ ". 

ఓక్లహామా యూనివర్సిటీలో మొట్ట మొదటి నల్లజాతి విద్యార్థిగా చరిత్రలో నిలిచారు. 

వివక్ష చూపించినా:

కాన్సాస్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పొందిన తరువాత ఆయన లాంగ్‌స్టన్ విశ్వవిద్యాలయం లో అత్యధిక కాలం ప్రొఫెసరుగా పనిచేసి జనవరి 28, 1948న రిటైర్మెంట్ తీసుకున్నారు. మొదటినుండి చదువు పట్ల ఎక్కువ ఆసక్తి ఉండటంవల్ల అయన ఉద్యోగ విరమణ తరువాత 61 సంవత్సరాల వయసులో కూడా మరొక డిగ్రీ కోసం ఓక్లహోమ యూనివర్సిటీ లో ప్రవేశం కొరకు సెప్టెంబర్ లో దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబరు 20, 1948 న ఆయన ధరఖాస్తుని నిరాకరించింది ఓక్లహోమ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. ఈ దేశ పౌరిడినైనా నాకు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి నిరాకరిస్తారా? ఎందుకు ప్రవేశం లేదు? నేను ఈ దేశ పౌరిడిని కాదా? అనేది తెలుసుకునే ప్రయత్నం చేయగా తాను నల్లజాతీయుడనే కారణంతో దరఖాస్తుని నిరాకరించినట్లు యూనివర్సిటీ వారు తెలిపారు. విద్యనభ్యసించటానికి వర్ణం కారణమా? తెల్లజాతీయులే చదవాలి గాని నల్లజాతీయులు చదువకూడదా? అయితే ఈ విషయాన్నీ  నేను న్యాయస్థానంలో తేల్చుకుంటా అని శపథం పట్టి వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి మెక్‌లౌరిన్ ఫెడరల్ కోర్టుకి వెళ్లారు. అక్టోబర్ 14, 1948న తరగతులు ప్రారంభం కానున్నాయి. తక్కువ సమయం ఉండటంవల్ల తన ప్రవేశానికి అనుమతి దొరుకుతుందా అన్న సందేహంతో సతమతపడుతున్న సందర్భంలో ఫెడరల్ కోర్టు వారు సెప్టెంబరు 29, 1948, తీర్పులో అతనికి ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇవ్వడంతో అతను విజయం సాధించాడు. అతనికి కోర్టు తీర్పు అనుకూలంగా ఉండటంతో ఓక్లహోమ స్టేట్ రీజెంట్‌లు అక్టోబరు 11, 1948న అతనిని అడ్మిషన్‌కు ఆదేశించక తప్పలేదుఅక్టోబర్ 14, 1948న మెక్‌లౌరిన్ తరగతులకు హాజరైనారు.

అసమానత విద్యకు గురైనారు:

అడ్మిషన్‌కు ఆదేశించినప్పటికీ జార్జ్ మెక్‌లౌరిన్ తరగతి గదిలో అకృత్య రూపాన్ని చూశారు. అతను చదువుతున్న తరగతి గదిలో తెల్లజాతీయుల విద్యార్థులకు దూరంగా వేరు డెస్క్ మరియు చైర్ తో తరగతి గది వెలుపల తలుపు ప్రక్కన కూర్చొని పాఠాలు వినేలా ఏర్పాటుచేశారు. అలా తరగతులన్నింటికీ హాజరవుతూనే తెల్లజాతి విద్యార్థులకు దూరంగా ఉంటూ తన అసమానమైన విద్యాబ్యాసాన్ని కొనసాగించారు. అంతేకాకుండా విద్యార్థులు తినే సమయంలో కాకుండా వేర్వేరు సమయాల్లో ప్రత్యేక టేబుల్స్ వద్ద భోజనం చేసే విధంగా ఏర్పాటు చేసేవారు; అతను చదువుకోవడానికి కూడ లైబ్రరీలో వేరే టేబుల్‌ని ఉపయోగించాలని మరియు క్రీడా కార్యక్రమాలలో ప్రత్యేక సీటింగ్ ప్రాంతాలు మరియు ప్రత్యేక విశ్రాంతి గది అలా అసమానత విద్యకు గురైనారు. అలా జరిగినప్పటికీ శ్వేతజాతీయులకంటే కూడా చదువులో ముందుడేవాడు. ఆయన ఎన్నో ఇబ్బందులకు గురైనప్పటికి దృఢమైన సంకల్పంతో తన విద్యను కొనసాగించారు. ఒకవైపు విద్యను కొనసాగిస్తూనే వర్ణ వివక్షత పోరాటానికి పదునుపెట్టగలిగారు. ఆయన ఎన్నో నల్లజాతీయుల విద్యార్థుల సంఘలని కూడగట్టి వర్ణ వివక్షత నిర్ములన కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.  

జీవితంలో మరిచిపోలేని రోజు:

అసమానత విద్య షరతులు వల్ల తాను సమానత్వాన్ని కోల్పోయానని పేర్కొంటూ దావా వేశారు. అయితే ఈసారిమాత్రం డిస్ట్రిక్ట్ కోర్ట్ అతని వాదనతో ఏకీభవించలేదు మరియు జాతి విభజన అనేది "ఓక్లహోమ రాష్ట్రం యొక్క సామాజిక విధానం" అనే కారణంతో అతను వేసిన దావాను తిరస్కరించింది. అయినప్పటికీ జార్జ్ మెక్‌లౌరిన్ తన పోరాటాన్ని కొనసాగించటానికి తన కేసును ఏకంగా U.S. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశాడు.సుప్రీం కోర్టు రాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిని అతని జాతి ఆధారంగా ఇతర విద్యార్థుల నుండి భిన్నంగా చూడగలరా అనే ప్రశ్నపై దృష్టి సారించింది.జూన్ 5, 1950 న తన కేసును విచారించి ప్రధాన న్యాయమూర్తి ఫ్రెడ్ విన్సన్, న్యాయస్థానం కోసం వ్రాస్తూ, మెక్‌లౌరిన్‌కు అందించబడిన భేదాత్మకమైన చికిత్స పద్నాల్గవ సవరణ యొక్క సమాన రక్షణ నిబంధన ప్రకారం, రాష్ట్ర అధికారులు ఇతర జాతుల విద్యార్థుల మాదిరిగానే వాదిని పరిగణించాల్సిన చట్టపరమైన బాధ్యతను కలిగి ఉంటారని సుప్రీం కోర్టు వాదించింది.ఇలాంటి పరిమితులు అతని విద్యాబ్యాసం  మరియు చర్చలలో పాల్గొనటం ఇతర అబిప్రాయాలు మార్చుకునే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయని మరియు నిరోధిస్తాయని. విద్యార్థులు, మరియు, సాధారణంగా, తన వృత్తిని నేర్చుకోవడానికి ఇలాంటి పరిమితులు అనుకూలించవని సూచించారు. ఇకపై న్యాయస్థానం ఇలాంటి పరిమితులను సహించదని ఓక్లహోమా స్టేట్ రీజెంట్స్ ని సుప్రీం కోర్టు హెచ్చరించింది. సుప్రీం కోర్టు తీర్పుతో మెక్‌లౌరిన్ ఆశ నెరవేరినట్లైంది. అక్టోబర్ 14 తనకి సంతోషకరమైన రోజు అని ఆయన డైరీ లో రాసుకున్నారు. నిజంగా నల్లజాతియులకు అక్టోబర్ 14 సంతోషకరమైన రోజు అనే చెప్పొచ్చు.  నల్లజాతి విద్యార్థులకు నడవరా ముందుకని దారిచూపిన మార్గదర్శి మెక్‌లౌరిన్. 

నల్లజాతీయుల కోసమే అయన పోరాటం:

దేశంలో మైనారిటీలైన శ్వేతజాతి ప్రభుత్వం నల్లజాతీయుల పట్ల వివక్ష పాటిస్తూ, వారిని సామాజికంగా అన్ని రంగాల్లోనూ వేరు చేస్తూ అధికారికంగా విధానాలను అమలుచేసింది. ఆ వర్ణ వివక్షా విధానాలను, వారి విద్యపట్ల వివక్షతను అంతం చేయటానికి ఎంతగానో పోరాడిన వీరుడు. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి మనుసులో చిరకాల ముద్రవేసుకున్నారు. అమెరికావంటి అగ్రదేశాలల్లో నల్లజాతీయులు స్వేచ్ఛగా విద్యను కొనసాగిస్తున్నారంటే దానికి కారణం జార్జ్ మెక్‌లౌరిన్ చేసిన పోరాటమే.

కుటుంబ నేపథ్యం:

జార్జ్ డబ్ల్యూ మెక్‌లౌరిన్ 16 సెప్టెంబర్ 1894 న మిస్సిస్సిప్పి, USA లో జన్మించాడు. అతని భార్య పెనినా మెక్‌లౌరిన్, వాన్ కెనడా లో జన్మించింది. పెనినా మెక్‌లౌరిన్ ఉపాధ్యాయ వృత్తిలో 33 సం, విద్యనందించింది. ఆమె 1954లో ఓక్లహోమ యూనివర్సిటీలో హోమ్ ఎకనామిక్స్ లో మూడు డిగ్రీలు, లాంగ్ స్టన్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ మరియు బి.ఎస్ పట్ట పొందారు. అతని కుటుంబం 1910లో ఓక్లహోమాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.  మెక్‌లౌరిన్ కి ఇద్దరు కుమారులు, డన్బార్ ఎస్. మెక్ లారిన్, న్యూయార్క్ లో లాయర్, జోఫ్రే సి. మెక్ లారిన్, లాస్ ఏంజిల్స్ టీచర్, ఆయనకు ఒక కుమార్తె కార్డెజా మెక్ లారిన్ లాస్ ఏంజిల్స్ ఉంటుంది. మెక్‌లౌరిన్ అనారోగ్య కారణంగా సెప్టెంబర్ 4, 1968న 74 ఏళ్ళ వయసులో మరణించారు. ఆయన మరణం నల్లజాతీయులు తీరని లోటు.


మీ 

కోట దామోదర్

Mobile: 9391480475


 .         

అంగవైకల్యం ఆశయసాధనకు అవరోధం కాదు


అంగవైకల్యం ఆశయ సాధనకు అవరోధం కాదు:

అవయవాలు అన్నీ సరిగా ఉన్నా చదువుల పట్ల మక్కువ చూపని ఎంతో మంది విద్యార్థులకు ఆయనొక ఆదర్శం. అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప. అది మనిషిలో ఉన్న ప్రతిభకు కాదు అన్న నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం "వరిపెల్లి యాకయ్య సార్". అయన సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది.
 
జననం, విద్యాబ్యాసం:

సూర్యాపేట జిల్లాలోని మారుమూల గ్రామమైన గుమ్మడవెల్లిలో నిరుపేద కుటుంబంలో వీర సోమయ్య, బుచ్చమ్మ దంపతులకు 1-3-1944న జన్మించారు. ఆ దంపతులకు మొదటి సంతానమైన కుమారుడిని చూస్తూ ఎంతో సంతోషించేవారు. ఎంతో అల్లారుముద్దుగ సాగుతున్న వారి జీవితంలో అనుకోకుండా అయన 4 వ ఏటా పోలియో కారణంగా అంగవైకల్యానికి (నడవలేని పరిస్థితి) గురియైనారు. వారి తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ, ప్రాపంచిక జ్ఞానంతో కుమారుడిని (యాకయ్య సార్) చదివించాలన్న తపనతో వారి స్వగ్రామమైన గుమ్మడవెల్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. 
 
1949 కాలంలో (యాకయ్య సార్ చదివే రోజుల్లో) గుమ్మడవెల్లి గ్రామంలో కరెంటు మరియు రవాణా సౌకర్యం  వంటి సదుపాయాలేనప్పటికీ అయన చదువు పట్ల ఉన్న సంకల్పం, కృషి, నిర్దిష్ట ప్రణాళికతో నాల్గొవ తరగతి పూర్తి చేశారు. గుమ్మడవెళ్లిలో నాలుగో తరగతి వరకే  సదుపాయం ఉన్నందున అయన గుమ్మడవెల్లి నుండి 8 కిలోమీటర్ల దూరప్రాంతమైన తుంగతుర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదు, ఆరో తరగతులు పూర్తి చేశారు.    

ఆతరువాత పై చదువులు చదవటానికి సూర్యాపేటలోని మల్టీ పర్పస్ స్కూల్ లో చేరి 7 వ తరగతి నుండి  12 వ తరగతి వరకు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు, ఆ రోజుల్లో 12వ తరగతి చదవడం గొప్ప విషయం. అయితే చదువుకోవాలనే తపన అతనిలో ఇంకా ప్రబలంగా ఉండడంతో పై చదువులకోసం ప్రయత్నిచడం కొనసాగించారు. మనుసుంటే మార్గాలెన్నో అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి యాకయ్య సార్, అనుకున్న ఆశయం కోసం అహర్నిశలు కష్టపడి ఆసాద్యన్ని సుసాధ్యం చేయగలిగే వారు. చదువు పట్ల అతని ఏకాగ్రతను గమనించిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఉద్యోగానికి ఉపాధ్యాయ శిక్షణా కోర్సు చేయాలని సూచించారు. పట్టుదలతో ప్రయత్నిచి ఇల్లందులోని టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసి 10 - ఆగస్టు - 1970లో ప్రభుత్వ టీచర్ గా నియమితులైనారు. అయన జీవితంలో ఆశయం కోసం  ఎన్నో సాధనాలు , శోధనలు , పరిశోధనలు ఎన్నో పట్టుసడలని ప్రయత్నాలు చేసి అనుకున్నది సాధించిన ఘనుడు యాకయ్య సర్. 

క్యాన్సర్ తో పోరాడిన ధైర్యవంతుడు:

అంగవైకల్యాన్ని జయించిన యాకయ్య సార్. టీబీ వ్యాధి ఆయన్ని చాలా కాలం పాటు బాధించింది. అయినా టీబీ వ్యాధి కూడా ఆయన్ని వెంటాడి వెనుతిరిగింది. 
అంతేగాక టీబీ వ్యాధి తర్వాత భయంకరమైన క్యాన్సర్ మహమ్మారి కూడా అతనికి పరీక్ష పెట్టింది. 

దైర్యం క్యాన్సర్ ఉన్నోడినికూడా బతికిస్తుంది..
భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది..  అన్నట్లుగా యాకయ్య సార్ ధైర్యంతో భయంకరమైన క్యాన్సర్ ని కూడా జయించారు. క్యాన్సర్ ని జయించటం అంటే మృత్యువుతో పోరాటమే.. యాకయ్య సార్ అన్నింటిని జయించిన ధైర్యశాలి..    

గురువుగారి జ్ఞాపకాలు :
  
అయన స్వగ్రామమైన గుమ్మడవెళ్లిలోనే ఉపాధ్యాయుడిగా పనిచేయటం మా అందరి అదృష్టంగా భావిస్తు, అయన నా గురువుగా చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను. ఇంకా సంతోషకరమైన విషయమేమిటంటే ఆయన తనయుడు అంజయ్య సార్ కూడా నాకు గురువు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.
యాకయ్య సార్ లో ఉన్న గొప్ప ప్రత్యేకతయేంటంటే అయన చిరునవ్వు. ఆ చిరునవ్వెప్పుడు అయన ముఖారవిందాన్ని అలంకరిస్తూనే ఉంటుంది.  కొన్నిసందర్భాలలో సార్ ఎక్కడైనా బయట కనిపిస్తే "నమస్తే సార్ అంటే " సార్ దానికి బదులుగా గాలం విసిరినట్లు చిరునవ్వు విసురుతారు. చిరునవ్వు సార్ కి గొప్ప ఆస్తి, మరియు ఆయుధం కూడా ఆ ఆయుధానికి అందరం ఆకర్షితులమే..
సార్ పిల్లలందరిని తన కుటుంభ సభ్యులుగా భావించి, వారి భవిష్యత్తుని దృష్టిలోపెట్టుకుని విద్యార్థుల యొక్క విద్యానైపుణ్యాన్ని, వారియొక్క సామర్ధ్యాన్ని, చురుకుదనాన్ని గ్రహించటంలో యాకయ్య సార్ కి వెన్నతోపెట్టిన విద్య. 
ఆయన దగ్గర శిష్యరికం పొందిన వారిలో చాలా మంది విద్యావేత్తలు, ప్రముఖులు, నాయకులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే యాకయ్య సార్ బహుముఖప్రజ్ఞాశాలి. అయన చదువు చెప్పేవిధానంలో ఎంత ప్రత్యేకత ఉందొ, బ్లాక్ బోర్డుమీద చక్కటి బొమ్మలు గీయటంలో కూడా అంత ప్రావీణ్యత ఉంది. అంతేకాకుండా అయన స్వరం, ఆయనకి దేవుడిచ్చిన గొప్ప వరం, మంచి మంచి పాటలు పాడేవారు,  ఒక వృత్తాకారం సర్కిల్ గీస్తే అది ఎంత గుండ్రంగా వస్తుందంటే అది చూస్తే గానీ మాటలతో వర్ణించలేనిది. అంత అందమైన బొమ్మలు గీయటంలో సార్ దిట్ట. 
పాఠంచెప్పిన మరుసటి రోజు ఆ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు, ఎంతవరకు పాఠం అర్ధంచేసుకున్నారు అనే పరీక్షా పర్యవేక్షణ అన్ని మాకు తెలియకుండానే. నొప్పిలేకుండా సూదివేయటం అనే సూత్రం సార్ ది. అది మా భవిష్యత్తుకి పునాది రాయి. 
పాఠం చెప్పేటైంలో పిల్లలతో గరుకుగా ఉండేవారు, పాఠం అయిపోయినాక చురుకుగా, చిలిపిగా నవ్వుతు మాతో గడిపేవారు, చురుకుగా, గరుకుగా కాలానికనుగుణంగా ఒదిగిపోయే వ్యక్తిత్వం యాకయ్య సార్ ది.  అది అందరికి అసాధ్యం అనే చెప్పాలి.
నేను 5 వ తరగతి చదివేటపుడు మాకు సామాన్య శాస్త్రం చెప్పేవారు సార్, అందులో ఒక అబ్యాసం ఆరోగ్యం గురుంచి ఉండేది. ఆ అబ్యాసం యాకయ్య సార్ చెప్పిన విధానం ఒక అద్భుతం అంత బాగా చెప్పినారు. అందులో ఆరోగ్యమే మహా భాగ్యం అనేదాని గురించి ఎంతబాగా వర్ణించారంటే అది వర్ణణనాతీతం. ఆరోగ్యమే మహా భాగ్యం అని చదవటం చాలా సులభమే కానీ దాన్ని ఆచరించటం, దాన్ని ఆచరణలో పెట్టటం మన జీవితకాలం సరిపోదు, అది అర్ధం కాదు మనకి. అది అర్ధం చేసుకునేలోపే ఆకాశంలో మబ్బులు మాయమైపోయినట్లు, భూమిమీద మన ప్రాణం మాయమైపోతుంది అది అంతుచిక్కని రహస్యం. స్కూల్లో టీచర్స్ కొరత ఉన్నపుడు యాకయ్య సార్ దశావతారాలలో ప్రత్యక్షమైయేవారు విద్యార్థులకు వేరే సబ్జక్ట్స్ చెప్పటానికి. ఆయనొక దశావతారమూర్తి. 
ఏందేందు వెతికిన అందందు కలదు, ఇందులేదని అందులేదని సందేహం లేదనే పదానికి నిర్వచనం.  అయన అన్ని సబ్జక్ట్స్ లో ప్రావీణ్యత కలవారే.  పొద్దునే పేపర్ చదివే అలవాటుంది. ఆ అలవాటుని మాకూడా అంటించాలనే ముఖ్యఉద్దేశంతో ప్రేయర్ సమయంలో మాతో పేపర్ చదివించే కార్యక్రమం మొదలెట్టారు. యాకయ్య సార్ దయవల్ల మాకు పేపర్ పరిజ్ఞానం పెరిగింది. జనవరి 26 ,  ఆగస్టు 15 ల కార్యక్రమాలకు విద్యార్థులందరికీ     ఆటలపోటీలు నిర్వహించేవారు. అందులో యాకయ్య సార్ పాత్ర ఎక్కువగా ఉండేది. పిల్లలు ఆటలాడే సమయంలో ఉత్తేజపరిచేందుకు, ఉత్సాహపరిచేందుకు వారి ప్రయత్నం అపురూపమైనది. యాకయ్య సార్ వారి శిష్యుల మనసులో విశిష్ట ముద్రవేసుకున్నారు.

జీవితంలో ప్రతి విద్యార్థి తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి లక్ష అవరోధాలు ఎదురైనా ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి చేయాలి, కానీ విజయం మనదే. అడ్డంకుల వద్ద ఆగిపోవడం లక్ష్యాన్ని చేరుకోలేమనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.


మీ శిష్యుడు 

కోట దామోదర్ 
మొబైల్ : 9391480475

29, ఆగస్టు 2022, సోమవారం

స్నేహానికి సరిరావన్న పలుకాడె బంధువులున్నా.




స్నేహానికి సరిరావన్న పలుకాడె బంధువులున్నా. 

స్నేహం విలువ గురించి ఎంత చెప్పిన తక్కువే అనడంలో సందేహం లేదు. ఎందరో కవులు, వాగ్గేయకారులు అనేక భాషల్లో స్నేహం గురించి వందలాది పాటలు రాసిన కొన్ని మాత్రమే బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రజాదరణ పొందిన పాటల్లో తెలుగు పాటలు కూడా ఉండడం తెలుగు వారందరికీ గర్వకారణం. స్నేహం విలువను పాటల రూపంలో అద్భుతంగా చిత్రించిన గేయ రచయితలను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో మన తెలుగు తేజం బహు భాష కోవిదుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నా రే గారు రచించిన నిప్పులాంటిమనిషి చిత్రంలో స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..స్నేహమేరా నాకున్నది.. స్నేహమేరా పెన్నిధి అనే పాట అనే పాట పలు భాషల్లో సంచలనం సృష్టించింది. అంతేకాకుండా 1988 లో దర్శకుడు వి. మధుసూదనరావు గారి సమర్పణలో "ప్రాణ స్నేహితులు' సినిమాలోని గేయ రచయిత భువనచంద్ర గారు రాసిన "స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా" అనే పాట ప్రతి తెలుగువాడి హృదయాన్ని దోచుకుంది మరియు స్నేహితుల హృదయాలను దోచుకుంది. ఆ పాటలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోగలిగితే, ఎవరూ స్నేహాన్ని విడిచిపెట్టరు మరియు ప్రాణ స్నేహితులను మరచిపోరు.

అంతర్జాతీయ స్నేహ దినోత్సవం అనేది శాంతి సంస్కృతి విలువలు, వైఖరులు మరియు ప్రవర్తన సమితిగా నిర్వచిస్తూ, హింసను తిరస్కరించడం మరియు సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంతో వాటి మూల కారణాలను పరిష్కరించడం ద్వారా సంఘర్షణలను నిరోధించడానికి ప్రయత్నించే ప్రతిపాదనను అనుసరించే ఒక చొరవ. దీనిని 1997లో UN జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.

ప్రజలు, దేశాలు, సంస్కృతులు మరియు వ్యక్తుల మధ్య స్నేహం శాంతి ప్రయత్నాలను ప్రేరేపించ గలదని మరియు సమాజాల మధ్య వంతెనలను నిర్మించగలదనే ఆలోచనతో UN జనరల్ అసెంబ్లీ 2011లో అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ప్రకటించింది.

"స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల'

ప్రతి విద్యార్థి భవిష్యత్తు తాను చదివిన చదువుపై కంటే విద్యార్థి స్నేహం పైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. 100 పుస్తకాల కన్నా ఒక మంచి స్నేహితుడు మిన్న అనే నానుడి ఎప్పటికీ నిజమే. ఒక మంచి స్నేహితుడితో స్నేహం చేస్తే మంచి ఆలోచనలు మరియు మంచి నడవడిక, మంచి ప్రవర్తన యొక్క మార్గాన్ని అనుసరిస్తారు ఇది ముమ్మాటికీ నిజం. ప్రపంచంలో కులం, మతం, వయోపరిమితి, ప్రాంతీయ భేదం లేనిది ఏదైనా ఉందంటే అది స్నేహం మాత్రమే అని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో ధనిక మరియు పేదలను కలిపేది స్నేహం మాత్రమే. కులాలు, మతాలను కలిపేది స్నేహం ఒక్కటే.    

బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. స్నేహితులతో కలిసి ఉన్న ఆనందం వర్ణనాతీతం. అందుకే మంచి స్నేహాన్ని మించిన ఆస్తి లేదంటారు. మనిషికి ఎంత డబ్బున్న బాధలో ఉన్నప్పుడు సంతృప్తిని ఇవ్వలేవు, అదే ఒక మంచి స్నేహితుడు ఉంటే నీ బాధలన్నీ మరిపించి బాల్యాన్ని గుర్తు చేస్తూ బాధను మరిపించే ప్రయత్నం చేస్తాడు (స్నేహితుడు).

మన జీవితంలో లక్షల, కోట్ల కన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహాన్ని జీవితాంతం కొనసాగించటం ఎంతో అవసరం.  స్నేహానికి ఎల్లలు, కులం, మతలుండవు. ఎటువంటి సమస్యనైనా స్నేహితుడితో పొరపొచ్చాలు లేకుండా చర్చించుకునే అవకాశం ఒక స్నేహితుడి దగ్గర  ఉంటుంది. అహానికి స్నేహం దగ్గర  చోటే ఉండదనడంలో అతిశయోక్తి లేదు. స్నేహంలో ఎక్కువ తక్కువ లుండవు. పేదవాడు గొప్ప ధనవంతునితో స్నేహంతో కలుపవచ్చు. మనం బాల్యంలో చేసిన అల్లరి అప్పుడప్పుడు గుర్తుచేసే మంచి హాస్యనటుడు కూడా స్నేహితుడే.

అప్పుడప్పుడు నేను స్కూల్లో స్నేహితులతో గడిపిన సంఘటనలన్నీ గుర్తుచేసుకొని నాకు నేను ఆనందిస్తాను అది తీపి జ్ఞాపకం. ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత స్నేహితుడు కనిపించిన క్షణం అపురూపంగా, ఆప్యాయతంగా పలకరిస్తే గతంలో మన బాల్యాన్ని గుర్తు చేస్తుంది
తెలిసీ తెలియక క్లాసురూం లో చేసిన అల్లరి గుర్తుచేసుకుంటూ నవ్వుకునే సందర్భం ఎంత హాయినిస్తుందో.

ఆ రోజుల్లో స్నేహితులతో ఆడుకున్న ఆటలు నేటికీ మదిలో పదిలం.

ఆ రోజుల్లో ఆదివారం అంటే మాకు ఆటల పండుగ. నేను ఆదివారం కోసం ఆతృతగా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి.

* ఖాళీ అగ్గిపెట్టెలను చించి స్నేహితులతో కలిసి పత్తాలాట ఆడిన సందర్భాలు ఓ మధుర జ్ఞాపకం.

* ఖాళీ సారా ప్యాకెట్లను బంతిలాగా  తయారుచేసి పుచ్చి బంతి ఆట ఆడిన క్షణం ఎంత సంతోషాన్నిచ్చేదో మాటల్లో చెప్పలేనిది, ఆ సంతోషం వెల కట్టలేనిది.

*వడ్ల శేషయ్య ఇంటిదగ్గర సందులో స్నేహితులతో కలిసి ఆడిన గోళీలాట ఎంతో సంతోషాన్నిచ్చేది.

* జిల్లగోన ఆట, చింతగింజలతో దాడి ఆట, కోకో , కబడ్డీ , తొక్కుడుబిళ్ల , పిక్కలాట , వొంగుడు దూకుడు, ముక్కు గీసుడు, దాగుడు మూతలు, దొంగ పోలీస్, దూకుడు పుల్ల, ఉప్పు బేర, తాడట, తుడువు, పైసల్ కమ్ముడు, పైసలట, నీడలు తొక్కుడు, కూరంట బువ్వంట,
ఇలా ఎన్నో ఆటలు స్నేహితులతో కలిసి ఆడుకున్న సందర్భాలు అతి మధుర జ్ఞాపకాలు.

ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో వారు టీవీలు, మొబైల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు తప్ప స్నేహితులతో గడిపే వారు లేరు.

*  వేసవి కాలం వచ్చిందంటే స్నేహితులంతా కలిసి బావుల్లో ఈతకు వెళ్ళేవాళ్ళం
ఆ రోజుల్లో ఊరిలో బంధం బావి, చింతల బావి, మంగలి నారాయణ బావి, నర్సింహారెడ్డి బావి ఉండేవి. ఈ బావిలాల్లో ఈత కొట్టి ఎండాకాలం మొత్తం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన అంత ఆనందం రాదు. నాకు మా అన్నయ్యలకు ఈత నేర్పిన గురువులు ఆకారపు వీరయ్య, చాకలి సొక్కయ్య చాలా మంచి వ్యక్తులు మరియు మా నాన్నకు మంచి స్నేహితులు - సన్నిహితులు కూడా.

* కొన్ని సందర్భాలలో రేగుపళ్ళ కోసం , మామిడి పళ్ళ కోసం బావిలకడ తిరిగిన రోజులెన్నో . ఇంకా కొన్ని సందర్భాలలో దోస్తులతో కలిసి తుమ్మ చెట్లల్లో బంక తీసుకొచ్చి షాపులో ఇస్తే బెల్లం ఇచ్చేది అది తినుకుంటూ ఎంత సంతోషపడేదో మాటలతో చెప్పలేము అని అనుభవిస్తేగానీ స్నేహం తెలియదు.

* ఈత పండ్ల కోసం , సీతాఫలకాయలకోసం స్నేహితులతో కంచెలేమ్మటి చేన్ల ల తిరిగేది అప్పటి అనుభూతి ఓ ప్రపంచాన్నే తిరిగొచ్చాము అనేలా ఉండేది.

* శెనగకాయలు కాల్చుకొని తినేవాళ్ళము సీతాఫలాలు కూడా, ముంజ్జలకోసం గౌడల్లన్న తాళ్ల కాడికి పోయి తినేవాళ్ళం తాటి పళ్ళు వాటిలో ఉండే గేగులు తినేవాళ్ళం.

* రూపాయి ఇస్తే గంట సేపు సైకిల్ అద్దెకిచ్చేది బొలిశెట్టి భాస్కర్ క్రమేపి ఆకారపు ఎల్లయ్య (డబ్బా కొట్టు ఎల్లయ్య ) కూడా ఇచ్చేది. అల సైకిల్ అద్దెకి తీసుకొని సైకిల్ నేర్చుకున్న రోజులు అవి అప్పట్లో సైకిల్ తొక్కి ఊళ్ళో తిరిగితే బుల్లెట్ బండి మీద తిరిగినంత ఆనందం ఉండే.
 
కోట్లు పెట్టిన కొనలేని ఆనందాన్ని ఉచితంగా పొందే అవకాశం ఒక స్నేహానికి ఉంది.
దొరకని చోట స్నేహాన్ని వెతికే కన్నా దొరికిన చోట స్నేహాన్ని వదలకు మిత్రమా..

ప్రాణం ఉన్నంతవరకు మంచి స్నేహాన్ని మరువకు నేస్తమా!!  

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475 






28, ఆగస్టు 2022, ఆదివారం

మన బడి


మన బడి
= = = = =
ఎనకటి నా బడి ఎట్లుండెనో నాకింకా గుర్తున్నది....
ఇప్పుడు నాఒడిలో చదివే పిల్లలేరని బడి దిగులుతో ఉన్నది ..
చాలీ చాలక జాగ లేదని బడిని రెండుగా విడదీసిన రోజులవి..
తెలుగు, ఇంగ్లీష్ మీడియాలంటూ నా బడిని మరిచిన రోజులివి..
ఆనాడు టీచర్ల కొరత, ఈనాడు పిల్లల కొరత, 
ఆనాడు ప్రైవేట్ టీచర్లతో బోధించిన రోజులవి.
ఈనాడు ప్రభుత్వ టీచర్లురాక నా బడి నే మూసిన రోజులివి.
ఆనాడు నా బడికి తుర్పుగూడెం , కుక్కడం , మాణపురం, పప్పులతండాలనుండి వచ్చిన రోజులవి.
ఈనాడు మనమే ఆ ఊర్లల్లకి పోయి చదువుకునే రోజులివి. 
ఆనాడు ఆరోగ్యమే మహాభాగ్యం అని బోధించే ఆనాటి గురువులు.
ఈనాడు  తెలుగు లో చదివే కరువైన  రోజులివి
ఆనాడు భారతదేశము నా మాతృభూమి, అని నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేసిన రోజులవి.
ఈనాడు విద్యకోసం తల్లిని, దేశాన్ని మరిచి విదేశాలకు మొగ్గుచూపే రోజులివి.

1990 సంవత్సరం అంతకుముందు గుమ్మడవెల్లి లో ఒకటే స్కూల్ ఉండేది. అది కూడా ఒకటవ తరగతి నుండి ఆరొవ తరగతి వరకే, పిల్లల సంఖ్య మరియు పైతరగతుల కొరత వలన ఉపాద్యాయుడు మురళీధర్ రెడ్డి సర్ సమక్ష్యంలోవారి కృషివల్ల 1 -  10 వ తరగతి వరకు ఏర్పడింది. రెండు స్కూల్స్ గా విభజించి విద్యార్థుల పట్ల యెనలేని కృషి చేసిన అప్పటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు చెప్పాలిసిందే. అప్పట్లో చుట్టుప్రక్కల గ్రామాల వారు ( కుక్కడం, తుర్పుగూడెం,  హైస్కూల్స్ లేక గుమ్మడవెల్లికి వచ్చి చదువుకునేవారు) అలా చాల సందడిగా ఉన్న స్కూల్ ఇప్పుడు కొన్నికారణాల వాళ్ళ ( పిల్లలు లేరని టీచర్లని నియమించకపోవడం మరియు టీచర్లు లేరని తల్లిదండ్రులు పిల్లలను పంపిచకపోవడం వలన) మూతపడింది. ఇంగ్లీష్ మీడియం మోజులో పడి తెలుగు మీడియంకి ఆదరణ తగ్గింది. ఇంగ్లీష్ చదవటం తప్పులేదు గానీ మాతృభాషా అయినటువంటి తెలుగు ని ఆదరించకపోవటం తప్పు.  
ఈరోజు మనమే పక్కన ఊర్లో చదివే పరిస్థితి ఏర్పడింది. సదుపాయలేక పక్క ఊర్లో చదివితే తప్పులేదు కానీ ఊర్లో ఉండికూడా పక్కన ఊర్లో చదవడమే వింతగా ఉంది - విడ్డురంగా ఉంది. 


మీ 
కోట దామోదర్
మొబైల్ నెంబర్ : 9391480475

24, ఆగస్టు 2022, బుధవారం

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు



ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఆయుధం కన్న అక్షరం గొప్పది. కత్తి కన్న కలం గొప్పది.

అక్షరం, కలం విలువలు  ప్రసాదించే గురువు ఈ రెండింటికన్నా గొప్పవాడు. ఎందుకంటే గురువులేనిది అక్షరం లేదు. అక్షరం లేనిదే కలం లేదు.

గురువు అంటే అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపించేవాడు. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే.  దానికి ఆధారం గురువు.

దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది - కీర్తించదగినది. ఆచార్యదేవోభవ అన్నారు

తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదే . తల్లిదండ్రులు జన్మనిస్తే. గురువులు ఆ జన్మని సార్ధకం చేసుకోవడానికి అవసరమైన దారులు వేస్తారు. అవి మనకు జీవిత పాఠాలు నేర్పుతాయి మరియు ఎదగడానికి సహాయపడతాయి - మనం ఎదగాలని వారు కోరుకుంటారు.

గురువు స్థానం ఎంత గొప్పదంటే ఒక ఇంజనీర్ మరొక ఇంజనీరుని చేస్తాడేమో, ఒక డాక్టర్ ఇంకాకొంతమంది డాక్టర్స్ ని చేస్తాడేమో కానీ ఒక టీచర్ మాత్రమే ఎంతో మంది డాక్టర్లని మరెంతో మంది ఇంజనీర్లని, ఇంక వివిధ రంగాలలో ఉన్నతమైన స్థానానికి చేర్చగలడు, ఉపాధ్యాయుల వల్లే మంచి వ్యక్తులు (ప్రముఖులు) తయారువుతారు. ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందబోదు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం..

గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి యేటా సెప్టెంబర్‌ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది.

 అర్జునుడిని అత్యుత్తమ  మేటి విలుకాడిని చేయ ప్రతినభూని తన ప్రతిజ్ఞ  నెరవేరడానికి  తన ప్రతిమను మాత్రమే పూజించి అపూర్వమైన విలువిద్య పొందిన ఏకలవ్యుడి కుడి బొటన వేలిని గురు దక్షిణగా స్వీకరించి ఏకలవ్యుడి ప్రతిభను అనగదొక్కిన  ద్రోణాచార్యుల సంఘటన  మహాభారతంలో ఎంతవరకు నిజమో కల్పితమో కానీ  ఇప్పటికీ  గురు స్థానం మారలేదు ఎందుకంటే గురు లక్ష్యం మారలేదు గురువుకు పర్యాయపదంగా ద్రోణుడి పేరును ఉటంకిస్తాము  అందుకే   అత్యుత్తమ గురువులను నేడు ద్రోణాచార్య పురస్కారం చేత గౌరవిస్తున్నాము.

నిజమైన గురువు అంటే..

ఈమధ్య కాలంలో జరిగిన యదార్ధ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చందౌలి జిల్లాలో రాయ్‌ఘడ్ గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాలకు శివేంద్ర సింగ్ అనే ఉపాద్యాయుడు నాలుగేళ్ల క్రితం వచ్చారు.అప్పటినుండి విద్యార్థులకు శివేంద్ర సింగ్ చెప్పే పాఠాలు మరియు నైతిక నిలువలు గురుంచి చెప్పేవారు. శివేంద్ర సింగ్ అంటే ఎంతగానో ఇష్టపడేవారు. అందుకు ప్రతి విద్యార్థి తప్పని సరిగా ఆయన క్లాస్‌కు వెళ్లేవారు. శివేంద్ర సింగ్ ప్రభుత్వం వేరే స్కూల్ కి బదిలీ చేసింది. బదిలీపై వెళ్తున్న సమయంలో చాలా మంది విద్యార్థులు అతనిని కౌగిలించుకుని ఏడ్చేశారు. కొంతమంది విద్యార్థులు అతనిని గట్టిగా పట్టుకుని.. ప్లీజ్ సార్ వెళ్లొద్దంటూ బతిమాలుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను, ఫోటోలను చూసిన నెటిజన్లు సైతం ఉద్వేగానికి గురియైనారు. విద్యార్థులపట్ల స్నేహభావంతో ప్రేమానురాగాలను పంచుతు వారికీ విలువైన విద్యనందిచిన గురువు పట్ల విద్యార్థుల భాధ వర్ణణాతీతం.  నిజమైన గురువు అంటే శివేంద్ర సింగ్ లాగా ఉండాలి .

ప్రముఖులు, మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ, ప్రవేట్ వివిధ రంగాలలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తులు, ప్రతిఒక్కరం గురువులకు శిష్యులమే.

అందుకే ఏస్థాయికి ఎదిగిన మనకు విద్యనందిచిన ఉపాధ్యాయులను మరువకూడదు. సంవత్సరానికి ఒకసారైనా మన ఉపాధ్యాయులను గుర్తుచేసుకుంటూ వారికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేద్దాం..
నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా.. రాబోవు తరం
దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ..
గురువులందరికీ వందనం.. అభివందనం.      

మీ
కోట దామోదర్
మొబైల్: 9391480475


23, ఆగస్టు 2022, మంగళవారం

మాతృభాష


మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం.  మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే  గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హింది  కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది.
తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది. అందులో ఎందరో కవులు, రచయితలు  గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు.  పర భాష లను గౌరవించడమే తెలుగు భాష, తెలుగు వారి గొప్పతనం.
భారత దేశం లో  ఎన్నో భాషలు ఉన్నాయి.  ఎవరి భాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపి ని  ఆస్వాదించ గలిగితే,  వారు తప్పకుండ మాతృభాషలకు అభిమానులౌతారు.  ఈ కాలం లో పిల్లలు మాతృ భాషను కించపరచ రాదు.  ఇంగ్లీషు హింది మరి ఇతర భాషలు నేర్చుకోవాలి.  కానీ  తెలుగు భాషని గౌరవించాలి.
“మాతృబాష తల్లి పాల వంటిది. పరబాష పోతపాల వంటిది.” అని కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్న మాట సత్యము.
ఈ రోజుల్లో మాతృభాషకన్నా ఆంగ్లభాషే మిన్న అన్నట్లుగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రలు తెలుగు భాషకి తీరని ద్రోహం చేస్తున్నారు. అందుకే కాళోజి గారు 1942 సంవత్సరంలో నిజం రాష్టంలోని ప్రజలు తెలుగు భాష పట్ల చూపే వివక్షత కు స్పందించి రాసిన కవిత ఇది. 1942 లోనే కాళోజి గారు రాబోయే కాలంలో తెలుగు పూర్తిగా అంతరిస్తుందేమో ఆ ఆలోచనతోనే రాసినట్లు అనిపిస్తుంది. కాళోజి గారు రాసిన ప్రతి అక్షరం అర్ధంతోపాటు తెలుగు భాషపట్ల దేశం పట్ల ధైర్యాన్నిస్తుంది అదే కాళోజి గారి గొప్పతనం.
తెలుగు భాషపట్ల ఏమన్నారంటే.....

ఏ భాషరా నీది ఏమి వేషమురా ?
ఈ భాష ఈవేష మెవరి కోసమురా?
ఆంగ్లమందున మాటలాడ గలుగగానే 
ఇంతగా గుల్కెదవ్ ఎందుకోసమురా?
సూటుబూటు హ్యటు షోకుగా దోడుగ
ఘనతేమీ వచ్చెరా గర్వమేటికిరా?
ఉర్దూ మాటలాడి యుబ్బుబ్బిపడుటకు 
కారణమేమిటో కాస్త చెప్పుమురా?
లాగుషేర్వాణీలు బాగుండుననుచు
మురిసిపోయెదమంత మురిపమేమిటిరా?
నీ వేషభాషలిలా నిగ్గుదేలినవన్న 
విషయంబు నీవేల విశ్వసింపవురా?
నీ భాష దీనతకు నీ వేష దుస్థితికి 
కారకుడవివయని కాంచవెందుకురా?
నీ వేషభాషలను నిర్లక్షంగా జూచు 
భావదాస్యంబెపుడు బాసిపోవునురా?
నీ భాషయందును నీ వేషమందును 
స్వాభిమానముడిగిన చవటవీవెరా?
తెలుగు బిడ్డడవయ్యు తెల్గు రాదంచును 
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా?
దేశ భాషలయందు తెలుగులెస్సయటంచు 
తెలుగు బిడ్డా! యెపుడు తెలుసుకొందువురా?
తెలుగుబిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి అంద్రంబురాదనుచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా?

తెలుగు భాషగురుంచి ఇంత గొప్పగా రాసిన కాళోజి గారి గురుంచి ఎంత చెప్పిన తక్కువే 
మాతృబాషలో విధ్యాబోధన వల్ల విధార్ధులలో సృజనాత్మకత పెరుగుతుంది.
గాంధీజీ 1938 లో తన హరిజన పత్రికలో బాలబాలికలకు ఆంగ్లము ద్వారా విధ్యాబోధన చెయ్యడాన్ని తప్పు పట్టారు. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృబాష వల్లనే వస్తుందని, స్వబాషలో విధ్య ఉంటే, మనకు స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని ‘గాంధీజీ’ వ్రాశారు. మాతృబాషలో విధ్యాబోధన వల్ల మనసులు చురుకుగా పనిచేస్తాయని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు అది అక్షర సత్యమే. 

మీ
కోట దామోదర్

21, ఆగస్టు 2022, ఆదివారం

ఆశ్రమాలలో అమ్మనాన్నలు



 ఆశ్రమాలలో అమ్మనాన్నలు
= = = = = = = = = = = = = = =
పిల్లలు చిన్నపుడు అన్నం తినకుండా ఏడిపిస్తే..
పెద్దయ్యాక అన్నం ముద్ద పెట్టకుండా ఏడిపిస్తారు..
అప్పుడు.. ఎప్పుడు ఏడ్చేది అమ్మానాన్నలే!
ప్రతి తల్లి కడుపులో తన బిడ్డను తొమ్మిది నెలలుమోసి చావు అంచుదాకా చేరుకొని బిడ్డకి జన్మనిస్తుంది.
ప్రతి తండ్రి తన కొడుకు భవిష్యత్హుకోసం కలలు కంటాడు. తన కొడుకు తన కల నెరవేర్చటం కోసం తపిస్తాడు.
తల్లికి సంతానం పదిమందైన తాను పెంపకంలో అందరిని ఒకేలా చూస్తుంది వారిని పెళ్లి అయేంతవరకు కంటికిరెప్పలా కాపాడుకుంటుంది అది తల్లి గొప్పతనం.
అదే పెద్దయ్యాక తన తల్లిని పోషించడంలో నెలలు వారీగా ఆపసోపాలు పడుతూ అయినాసరే   అందరూ ఒకేలా చేసుకోలేరు, కనిపెంచిన వారినే కాదు పొమ్మంటారు..
భార్యలు అత్తకి సేవచేయలేక తల్లితండ్రులను హృద్దాశ్రమంలో చేర్చుతున్న కొడుకులు కొంతమందైతే , కొందరు తల్లి ఖర్చులు భరించలేక .. మరికొందరు పొట్టకోసం ఊరు దాటుతూ వదిలేస్తున్నారు..   
మరికొందరైతే అమ్మనాన్నలు చనిపోయిన కడచూపు చూడని కఠినాత్ములు ఎందరో..
అనాధల ఖాతాలో అంత్యక్రియలు జరుగుతున్న దౌర్భాగ్యం ఎందరిదో.. మానవత్వవిలువల ఫలితం ఇది.
ఏ గ్రామాలకైనా , పట్టణాలకైనా వెళ్లి వృద్ధులను పలకరిస్తే మొదటగా వారి మోహములో చిరునవ్వు కంటే బాధనే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. ప్రపంచంలో 100 కి 80 శాతం ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి..
కోట్ల ఆస్తులు ఇచ్చిన కొడుకులు మంచిగా చూసుకుంటారు అనే నమ్మకం లేదు. కొంతమందైతే ఆస్తులుంటేనే చూసుకునేటోళ్లు కొంతమంది. ఒకప్పుడు తల్లితండ్రులు కొడుకు పెళ్లి చేస్తే ఒక ఇంటివాడు అయితాడు అని అనుకునేవాళ్లు.. కానీ నేటితరం తల్లితండ్రులు ఎప్పుడు పెళ్లి చేస్తే ఒంటరిఅవుతామనే భయంలో ఉన్నారు. అయినా తల్లితండ్రులు కొడుకు కోసం అన్ని త్యాగం చేస్తారు. వాళ్ళ త్యాగానికి పాదాభివందనం..
కొడుకుని ప్రయోజకుడిని చేయాలనే ఆశతో తండ్రి తపిస్తాడు..కానీ కొడుకు పెడతాడు అనే ఆశతో కాదు..
తల్లితండ్రులు ఎప్పుడు ఆశావాధులు కాదు.. ఎప్పుడు నిరాశా వాదులే... నిరాశ చెందిన శపించని దేవుళ్ళే తల్లితండ్రులు..
తల్లితండ్రులకు రూపాయి పెట్టనివాడు! గుడికిపోయి కట్నం కానుకలు దేవుడికి అర్పించే ధర్మాత్ములు ఉన్నంతవరకు ఈ దేశం బాగుపడదు.. జన్మనిచ్చిన వాళ్ళని మరిచి ఎన్ని చేసిన శూన్యం.
ప్రతి కొడుకు గుర్తుచేసుకోవాలిసిన విషయం మనం మన తల్లితండ్రులను ఎలా పోషిస్తున్నామో! రేపు మన పరిస్థితి కూడా ఇంతే అన్న విషయం కూడా మరవొద్దు..
ప్రతి కోడలు గుర్తుచేసుకోవాలిసిన విషయం తన అత్తమామలను ఎలా చూసుకుంటున్నారో రేపు వారి తల్లితండ్రుల పరిస్థితి అంతే అన్న విషయం మరువొద్దు..
గాయమైతేగాని నొప్పివిలువ తెలువదన్నట్లు తనదాకా వస్తేగాని తెలియదు ప్రళయమెంత విలయమో. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులను ఎందుర్కుంటున్న నేటి సమాజం వాట్సాప్ప్ ఫేస్బుక్ ప్రచారానికే తప్ప ఆచరించడానికి ఆమడదూరం. 
ప్రతి ఒక్కరు అందరిలో మార్పు రావాలని కోరుకునేవారు అంతేతప్ప నేను మారితే ప్రపంచం మారుతుందని అలాయితేనే మార్పు సహజమనేది జగమెరిగిన సత్యం. అయినా ఎవరు పాటించారు అనునిత్యం. 

చేతగానితనముంటే జాతకాన్ని నిందించకు...
రాయలేని తనముంటే కాగితాన్ని నిందించకు.
కష్టపడనితనముంటే జీవితాన్ని నిందించకు..
మారలేనితముంటే మందిని నిందించకు..
   

కాలమిస్ట్ 

కోట దామోదర్
మొబైల్ 9391480475  

    
   
     

15, ఆగస్టు 2022, సోమవారం

చిన్ననాటి జ్ఞాపకాలు


 చిన్ననాటి జ్ఞాపకాలు :
= = = = = = = = = = = = = = = = = = = 
అప్పట్లో మా ఊరికి (గుమ్మడవెల్లి) ఒకేఒక బస్సు వస్తుండేది. అది సూర్యాపేట నుండి రాత్రి 10.30 వచ్చి పొద్దున్నే 5.30 కి మళ్ళీ సూర్యాపేట కి వెళ్ళేది.
అప్పట్లో బస్సు లో ప్రయాణం అంటే అంతులేని ఆనందం ఇప్పట్లో విమానంలో ప్రయాణం చేసిన దొరకని ఆనందం అప్పట్లో దొరికేది ఇప్పట్లో అంత ఆనందం అనిపించటంలేదో అంతుచిక్కని రహస్యం..
ఎప్పుడైనా అమ్మనాన్న ఊరెళ్ళి వస్తున్నారంటే రాత్రి ఆ బస్సు ఎప్పుడొస్తుందో అని ఎదురుచూసేవాళ్ళం అమ్మనాన్న తెచ్చే అరటిపళ్లకోసం, అంగుర పళ్లకోసం అవి తిని ఎంతగానో ఆనందపడేవాళ్ళం. 
  • ఆరోజుల్లో వారానికి ఒక సినిమా దూరదర్శన్ లో వచ్చేది. 
ఆ సినిమా చూసి ఇంటికొచ్చాకా 
ఒక గంటవరకూ ఆ సినిమా కబుర్లే.
మర్నాడు స్కూల్ లో కూడా... 
ఆ ఆనందం ఇంకో పది రోజులుండేది..
  • ఆరోజుల్లో కొంతమంది ఇళ్లలోనే రేడియో ఉండేది. 
అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం
ఆదివారం నాడు రేడియో లో వచ్చే పాటల కోసం రేడియో ఉన్నవాళ్ళింట్లో కూర్చొని ఓపికగా వినేవాళ్ళం మనసు ప్రశాంతంగా ఉండేది 
మా ఇంట్లో కూడా రేడియో ఉంటె బాగుండు అనే ఆశ ఉండేది ..
  • ఇంటికి చుట్టాలొచ్చి
వెళ్తో వెళ్తూ.. 
చేతిలో రూపాయో... 
అర్ధరూపాయో పెడితే
ఎంత ఆనందమో...
చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే
దుఃఖం తన్నుకు వచ్చేది...
ఇంకా ఉంటే బాగుండు
అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో.. ఇప్పుడు ఆనందం ఏమో గాని ఎప్పుడు పోతారా అన్నట్లుగా చూస్తున్నారు.
  • ఎగురుతున్న విమానం
కింద నుండి 
కళ్ళకు చెయ్యి అడ్డం
పెట్టి చూస్తే ఆనందం..
  • జాతరలో కొన్న బొమ్మలను చూసుకొని మురిసే ఆనందం 
కోట్లు పెట్టిన కొనలేని ఆనందం.
  • అన్నంలో చింత చిగురు ఒట్టి చాపల కూర 
ఏమి రుచి...
ఏమి ఆనందం కడుపునిండా తిని కంటినిండా నిద్రపోయేవాళ్ళం..  ఈరోజుల్లో ఆ చింతచెట్లు అంతరించాయి.. ఆ కూరని మరిచారు ...
  • కాలక్షేపానికి లోటే లేదు...
స్నేహితులు
కబుర్లు, ఆటలు, ఈతకు పోయేవాళ్ళం ఆ ఆనందం వేరు 
సర్కస్ లు, దాగుడు మూతలు...
చింత పిక్కలు
ముక్కు గిచ్చుడు 
పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు..
ఎన్ని ఆటలో...☺️
  • చిన్నప్పుడు
ఏ పండక్కో..పబ్బానికో
 డ్రెస్ కుట్టిస్తే..
ఎంత ఆనందమో...
మళ్ళీ ఎప్పుడు పండగ
వస్తుందా, ఎప్పుడు
వేసేసుకుందామా
అన్న ఆతృతే...
ఈరోజుల్లో ఎన్నో జతల బట్టలున్న 
మనిషికి సరిపడా డబ్బు ఉన్న ..
పెద్ద పెద్ద విలాసవంతమైన  ఇళ్ళు, కార్లు...
ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...
అరచేతిలో స్వర్గం చూపించే ఫోన్లు ఉన్నపటికీ 
మనిషి కావాలనుకుంటే  క్షణాలలో వచ్చే సౌకర్యం ఉన్నపటికీ 
మనం చిన్నప్పుడు
పొందిన  ఆ ఆనందం
పొందలేకపోతున్నాం
ఎందుకు ...?
మీ 
కోట దామోదర్ 
మొబైల్ : 9391480475

ఆదర్శం కోల్పోయిన కళాశాల

 


ఆదర్శం కోల్పోయిన కళాశాల 

= = = = = = == = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =


నేను పాలిటెక్నిక్ చదివిన కళాశాల పేరు "ప్రభుత్వ ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్" భద్రాచలం (ఎటపాక). ఈ కళాశాలలో చదివిన నాలాంటి పూర్వ విద్యార్థులందరికీ ఒక ఆదర్శనంగా నిలిచింది. ఈ కళాశాల పూర్వ విద్యార్థులు ఎందరో ఉన్నత స్థాయిలలో ఎదిగారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో   అన్నిపాలిటెక్నిక్ కళాశాలల్లోకెల్లా  అత్యధికంగా విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ కళాశాలదే. అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కళాశాల ఇప్పుడు శిథిలావస్థ కి చేరుకుంది. మరో బాధాకరమైన విషయం ఒకప్పుడు తెలంగాణాలో ఉన్న ఈ కళాశాల తెలంగాణ - ఆంధ్ర రాష్ట్రవిభజన సందర్భంలో ఈ కళాశాల ఆంధ్ర రాష్ట్రము వారికీ పరిగణించబడింది. విభజనకు ముందు ఈ కళాశాలలో సీట్ దొరకక చాలామంది నిరుపేద విద్యార్థులు భాధపడేవాళ్లు అలాంటిది రాష్ట్ర విభజన తదనంతరం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల అధ్యాపకుల కొరత  మరియు విద్యార్థుల కొరతవల్ల కళాశాల మూతబడింది.ఈ విషయం తెలియక ఈమధ్య భద్రాచలం వెళ్ళినపుడు కళాశాలని చూడాలనిపించి వెళ్ళాను. అక్కడవున్న పరిస్థితులను చూసి చాల భాధ అనిపించింది. ఎందుకంటే మూడు సంవత్సరాలు హాస్టల్ మరియు తిండి, చదువుతోపాటు అన్నివసతులు కల్పించి నన్ను ఈ స్థాయికి చేర్చిన కళాశాల మూతబడిందన్న విషయం జీర్ణించుకోలేక బాధపడిన సందర్భం అది. నేనున్నాహాస్టల్ గదికి వెళ్లిన అప్పుడు నాకు పాతకాలం జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి నన్నునేనే మరిచిన సందర్భం. అది ఒక తీపి జ్ఞాపకం లాటింది. మరో సంతోషకరమైన విషయం ఏంటంటే నా ప్రాణ స్నేహితుడైన (ప్రభు కుమార్) నేను కలిసివెళ్లడం. నాకు అత్యంత సంతోషకరమైన విషయం. మా స్నేహం అల అల్లుకుంది. మేమిద్దరం కలిసి పాతకాల సంఘటనలన్నీ గుర్తుచేసుకుంటూ సరదాగా గడిపిన సందర్భంలో మా ఫోన్లో ఫొటోస్ తీసుకొని చాలాసేపు అక్కడే గడిపాము. ఆ క్రమంలో మాకొచ్చిన జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి..
* మొదటగా కళాశాల్లో జాయిన్ అవ్వాలంటే ఒకరకమైన ర్యాగింగ్ భయం ఉండేది. అది ఒక మొదటి సంవత్సరం వరకే. అలా ఒకసంవత్సరం గడిచిన తరువాత మేము నేర్చుకున్న పాఠం: సీనియర్స్ ని గౌరవించాలి, కలిసినపుడు నమస్తే పెట్టాలి, సీనియర్స్ ఏదైనా సహాయం కోరితే తప్పకుండ చేయాలి అన్నదే ర్యాగింగ్ అర్ధం అంతే తప్ప అంత్యంగా బాధించే సంఘటనలు ఏమి ఉండేవి కాదు..
* కొంత మంది సీనియర్స్ ర్యాగింగ్ సమయంలో వింత విచిత్రమైన ఆంక్షలు ప్రవేశపెట్టేది. అవేంటంటే "జనగనమన" ఒకరిని పాడమనేది ఇంకొకరిని డాన్స్ చేయమనేది. ఆ సమయంలో నాకు డాన్స్ రాక  సీనియర్ల వితండవాదానికి అప్పుడు ఏడ్చినా సందర్భం అయితే ఇప్పుడు మాత్రం నవ్వుకునే సందర్భం.
* హాస్టల్ డైనింగ్ హాళ్లలో కూరలు రుచిలేక, సాంబారులో పురుగులు పడిన సందర్భంలో విద్యార్థుల ఆవేశం ఓ విలయతాండవం, వితండవాదం.
* హాస్టల్ పైన అందరం ఒకేదగ్గర ముచ్చటిస్తూ స్థానం చేసిన క్షణం అదొక తీపి జ్ఞాపకం..
* సినిమా చూడటానికి దగ్గర్లో థియేటర్స్ లేక ఇబ్బంది ఉన్నపటికీ సీనియర్స్ కొంతమంది అయిదు రూపాయలు తీసుకొని టీవీ హాల్లో సినిమాలు వేసేది. ఆ సినిమాలు చూసి ఎంతగానో ఆనందపడేవాళ్ళము. స్నేహితులమధ్య చూడటం అనేది నిజంగా అదొకరకమైన అనుభూతి.
* పరీక్షల సమయంలో టీ కోసం లైన్లో నిలబడి తాగిన సందర్భం, క్లాస్ ఎగ్గొట్టి పక్కన పరిసరప్రాంతాల (బొజ్జికుప్ప) పర్యవేక్షించిన సందర్భం ఓ మధురజ్ఞాపకాలే.
* హాస్టల్ లో ఉన్న స్నేహితులమంతా ఎంతబాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళమంటే అది మాటల్లో చెప్పలేనంత స్నేహబంధం. ప్రాణానికి ప్రాణం ఇచ్చేంత. ఆప్యాయత అనురాగాలు, ఆపదలో ఆపన్నహస్తాలు. మాకు ఏమైనా అయితే అక్కడ అమ్మానాన్న ఉండరుగాని వారులేని లోటు మా స్నేహితులు తీర్చేవారు అంతమంచి హాస్టల్ స్నేహబంధం నన్ను ఎంతగానో ఆకర్షించింది.
* నాకు కొన్ని సందర్భంలో హాస్టల్ ఫుడ్ పడక తినడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో నా ప్రాణ స్నేహితుడు ప్రభు కుమార్ ఆదుకున్న   క్షణాలు నా జీవితంలో మరిచిపోలేనిది. అమ్మ సమానులైన ప్రభు అమ్మగారు (జాస్లిన్ గారు) నాకోసం సారపాక నుండి వాటర్, మధ్యాహ్నం భోజనం ప్రభుతో పంపించి నా ఆరోగ్యంపట్ల చదువుపట్ల శ్రద్ధ చూపిన  జాస్లిన్ అమ్మగారికి పాదాభివందమ్.
* సాయంకాలం స్నేహితులతో శ్యామలరావు గుడిసెలో టీ తాగిన సందర్భాలు జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకం.
* నా మిత్రుడు హాస్యపండితుడు బోడపాటి ఆనంద్ మా అందరిని ఎంతగానో నవించి నవ్వుతు కాలక్షేపం చేసేవాడు. నిజానికి ఆనంద్ లాంటివాళ్లు కూడా ఉండాలి ప్రతి బ్యాచ్లో.
* కష్టాలలో, సుఖాలలో తోడుగా నీడగా ఉండే స్నేహబంధాన్ని అందించిన ఈ ఆదర్శ కళాశాలని అందరూ ఆదర్శనంగా తీసుకోవాలని కోరుకుంటున్న.
మా కళాశాల అధ్యాపకులు చెప్పే విధానం ఒక అద్భుతం. st మైనార్టీ కళాశాల అయినందున ఎక్కువగా తండాలనుండి, గ్రామాలనుండి వచ్చినవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. పాలిటెక్నిక్ సబ్జక్ట్స్ అన్ని ఇంగ్లీషులోనే ఉండేవి కాబట్టి ప్రతిఒక్కరికి అర్ధమయేరీతిలో బోధించేవారు. నిజానికి వారికీ కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతోమంచి పేరున్న ఈ కళాశాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల మూతపడేస్తాయికి చేరుకుందంటే నిజంగా అత్యంత బాధాకరమైన విషయం.
దయచేసి ఆంధ్ర ప్రభుత్వం ఈ కళాశాల మూతపడకుండా యధావిధంగా కొనసాగించటానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా కోరుకుంటున్న..
✍️
మీ
కోట దామోదర్
మొబైల్: 9391480475

6, ఆగస్టు 2022, శనివారం

అండలేని "చేనేత" జెండా !

 



ప్రాచీన సంప్రదాయాలన్ని అంతరించిపోతున్నప్పటికీ తన సంప్రదాయ వారసత్వ వృత్తిని, కళను   కాపాడుకుంటు వస్తున్న నేతన్న,  కళ  తప్పిపోయిన బతుకీడుస్తున్నాడు. మొదటినుండి ఎందరో నేతలు చేనేత గొప్పదని ఒప్పుకొంటున్నారే గాని నేతన్నజీవితాలు మెరుగు పరిచే బాధ్యత  నుండి తప్పుకుంటున్నారు. మూడు పూటలు కష్టపడే నేతన్న తన బిడ్డలకు ఒక్క పూట కూడా  కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితిలోనే దాదాపు స్వాతంత్ర్య ఆనంతరం కుటుంబాలను వదిలి నేతన్నలు పొట్ట చేత పట్టుకొని పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్రలోని షోలాపూర్, బిమండి, బొంబాయి నగరాలు కూడా దాటి గుజారాత్ రాష్ట్రంలోని సూరత్, అహ్మదాబాద్ పట్టణాలలో బట్టల మిల్లులలో రోజుకు పన్నెండు గంటలకు మించి పనిచేసి ఆరోగ్యాలు చెడగొట్టుకున్నారు. పిల్లలను చదివించడానికి స్తోమత లేక అదే పనిలో కొనసాగిస్తున్న కుటుంబాలెన్నో. ఎప్పటి నుండైతే వీరి వలసలు కొనసాగినాయొ పల్లెటూళ్ళలో మగ్గం శబ్దాలతో లయ బద్దంగా నాట్యమాడిన నేతన్నల వీధులు అప్పటి నుండే నిశ్శబ్ధంగా రోధిస్తున్నాయి. అటు తర్వాత జరిగిన పరిణామమే కొంత మంది నేతన్నలు అప్పులు చేసి మర మగ్గాలను తెప్పించుకున్నారు. కానీ వారికి ముడి సరుకు అందుబాటులో లేదు, వున్నా కొనుగోలు చేయడానికి కావాల్సిన డబ్బు లేదు. ఇలాంటి పరిస్థితులలో చేసిన అప్పులు తీర్చలేక తమ కుటుంబాల ఆకలి బాధ నుండి చూడలేక చాలా మంది నేతన్నలు ఆత్మ హత్యలు చేసుకున్నారు.
ఇంకా మర మగ్గం మీద నేసిన సరుకు సరియైన మార్కెటింగ్ సదుపాయాలు లేక, గిట్టుబాటు ధరలేక తప్పనిసరి పరిస్థితులలో  మధ్య ధలారీల దోపిడికి గురు అయి మర మగ్గానికి కూడా దూరంకావలిసిన దుస్థితి ఏర్పడింది. మన చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉన్నపటికీ మన తెలంగాణ పోచంపల్లి చేనేత వస్త్రాలకు ప్రత్యేక స్తానం ఉండటం ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. మొదటగా ఇక్కత్ వస్త్రాలు నేసిన పోచంపల్లి నేతకార్మికులు వారి కళానైపుణ్యాన్ని తెలంగాణలోని పలు జిల్లాలోని గ్రామాలకు వ్యాపింపజేయటం చేనేతకు కొంత అండగా నిలిచింది. ఇక్కత్ వస్త్రాలు తెలంగాణ నుండి పలు విదేశాలు ఎగుమతి చేస్తున్నారు అంటే మన చేనేత కార్మికుడి కళానైపుణ్యం ఎలాంటిదో నేరుగా చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా నేతన్న కల చెదిరినట్లయింది. అనేక నేత పరిశ్రమలు మూతపడటం వలన వృత్తినే నమ్ముకున్న నేతన్న వేరే పనిచేయలేక సతమతపడుతున్నాడు, చావుకైనా సిద్ధపడుతున్నాడు.
 అయినా తన వృత్తిని కాపాడటంకోసం నేతన్న అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి కనుక కొనసాగితే భారత దేశానికి గర్వకారణమైన చేనేత కళాసంపద శాశ్వతంగా కోల్పోయే ప్రమాదమున్నది. ప్రస్తుతం పెరు గుతున్న పెట్టుబడి వ్యయం, తగిపోతున్న అమ్మకాలు ఇలా ఎన్నో కారణాలచేత చేనేత రంగం ఇబ్బందులు పడుతున్నాయి మన చేనేత కుటుంబాలు. రోజురోజుకి నేతన్నల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండటం నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
అగ్గిపెట్టలో పటేంత చీర నేసిన అద్భుత కళానైపుణ్యం ఉన్న చేనేత కళాకారుడి జీవితం దుర్భరంగా మారకుండా   ఇకనైనా ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పరిస్కారం చేయాలని  కోరుకుంటున్న.
✍️
కోట దామోదర్
మొబైల్: 9391480475

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది మనిషి కలలు అలల్లా ఎగసిపడతుంటాయి… ఆశల ఆకాశాన్ని తాకాలని ఆరాటపడతుంటాయి… కానీ… అల ఎంత ఉప్పొంగినా...